March 28, 2024

ఆదర్శసతి సీత

రచన : డా. వి.వి.రాఘవమ్మ

భారతీయ సాహిత్యమునందేగాక విశ్వసాహిత్య వీధులలో కూడా  రామాయణం మహేతిహాసంగా నిస్తుల ప్రాశస్త్యాన్ని సంతరించుకున్నది.  వాల్మీకి మహర్షి ఉత్తమ ఆదర్శానికి ఉదాత్త దర్శనానికి ఇది ప్రతిరూపం.  అవతారపురుషులలో ఉత్తముడు, ఉదాత్తుడు అయిన శ్రీరామచంద్రుని అపురూపమైన చరితం.  రామాయణం ప్రపంచితమైనది.  “సీతాయాశ్చరితం మహత్”అని వాల్మీకియే ప్రవచించాడు. సీతారాములిద్దరు ధర్మకర్మల్ని ఆచరించి చూపారు.  నాటి నుంచి నేటివరకు అగ్రతాంబూలం అందుకుంటున్నారు. రాముడు ఆచరించినట్లు,శ్రీకృష్ణుడు ప్రభోధించినట్లు చేయండని విజ్ఞుల విజ్ఞాపన. గీర్వాణ భాషలో మధురాక్షర సమన్వితమై కావ్యంగా ప్రాశస్త్యాన్ని గడించినదీ ‘రామ’ఆయానం.

 

“కూజంతం రామరామేతి మధురం మధురాక్షరమ్

ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలమ్”

 

అంటూ ఆదికవికి అభివందన చేయడమేగాదు ఎందరో శ్రీరామ కథామృతాన్ని ఆస్వాదించి రచనలు చేశారు. చేస్తూనే వున్నారు. ఇక జానపదుల రచనలవి లెక్కకు మిక్కిలి. సీతారాములను తల్లిదండ్రులుగా భావించి కీర్తించారు. “పాఠ్యేగేయేచ మధురమ్మని”తంత్రీలయ సమన్వితమని పేరుగాంచిన ఈ కావ్యం ప్రాక్పశ్చిమాల్లో కూడా  ఇంతే వైవిధ్యాన్ని,వైశిష్ట్యాన్ని కలిగి వున్నదని ఎందరో భావించారు. కారణం ఇది భారతీయులకు జీవనాడి వంటిది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు,నైతికవిలువలకు కాణాచి.

 

రామకథా రచయితలెందరో అయినా రచయిత్రులు కొందరే. అందరిలో “మొల్లమ్మ”రచన అగ్రగణ్యం. తెలుగు సాహిత్యాన్ని తేనెలూరు తీయనిమాటలతో ముద్దులొలుకు గద్యపద్యాలతో ‘చంపూ’కావ్యంగా మలచినది. తాను పలికిన పలుకులు తెలుగుమాటల మాధుర్యానికి ఎంత సన్నిహితమో చూడండి.

 

“కందువ మాటలు సామెత

లందముగా గూర్చి చెప్పనది తెలుగునకుం

బొందై ఎఉచియై వీనుల

విందై మరి కానిపించు విభుదుల మదికిన్”(పీఠిక18)

 

అంటుంది మొల్ల.  . సాలంకారంగా పాండితీస్ఫోరకంగా, పాత్రౌచిత్యంగా అలతిపదాల్లో అనల్పార్థ రచనావిభవంతో వ్రాసి ప్రౌఢ కవుల సరసన నిలచిన ఏకైక రచయిత్రి గడుసుదనంతో పాఠకులను ప్రశ్నిస్తుంది.  రామకథనే ఎందుకు చెప్పాలి అంటారేమోనని ఇలా అంటుంది.

 

“ఆదరమున విన్నగ్రొత్తయై లక్షణ సం   — విన్న గ్రొత్తయై మధ్య అరసున్నా ఉండాలి

పాదమ్మై పుణ్యస్థితి వేదమై తోచకున్న వెర్రినె చెప్పన్”–వెర్రినై అన్నపుడు బండిరా ఉండాలి

 

అంటూ వితర్కించినది. 24వేల శ్లోక పరిమితమైన రామకథను కేవలం వేయిపద్యాలు కూడాలేని సంక్షిప్త రచనలో కుదించినది. కథనెక్కడా కుంటుపడనీయలేదు. అగస్త్యుడు సముద్రజలాలను పుడిసిలించినంత గొప్పపని యిది. పైపెచ్చు మార్పులు చేర్పులు కూడా . వాల్మీకేతరాలు,సమకాలీన కావ్యమర్యాదలు ఉన్నాయి. ఇవి ఆమె చాతుర్యానికి స్వతంత్రభావస్ఫోరకానికి నిదర్శనం. వాల్మీకంతో మొల్ల  కవితను అనుసంధించి సీతమ్మ చరిత్రను పరిశీలించుట ఆ వ్యాస ముఖ్యోద్దేశం.

 

సాహిత్య చరిత్రలో స్థూలంగ స్త్రీపాత్రలు,పురుషపాత్రలని విభజన వుంటుంది. వీటిలో మరల ప్రధాన,అప్రధానాలుగా  విభజన కథానాయిక సీతపాత్ర ప్రధాన పాత్ర. ఆమె స్వరూప స్వభావ వర్ణనలతో చర్చించుకుందాం. ముఖ్యంగా వాల్మీకి (ఇక్కడ బు ఈ రుషి ఉండాలి)రుషి తనకావ్యపాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేశాడు. అందుకే నేటికీ ఆదర్శమైన ప్రతిబింబాలుగా నిలిచివున్నాయి. బహుపాత్ర సమన్వితమైన రామకథలో  పాత్రల మనస్తత్వాలను వివిధదశలలో సునిశితంగా తెలిసికోవాలంటే వాళ్లకు రామాయణ కావ్యమే పెన్నిధి. శ్రీరాముడి విజయానికి కారకులైన స్త్రీలెందరో వున్నారు. వారందరిలో సీత ప్రథమురాలు. ఆమె లేనినాడు రామాయణమే లేదు. “ధర్మాదర్థశ్చకామశ్చ నాతిచరామి”అనే ధర్మ సూత్రాలను దృఢంగా బిగించినపుడు నడుమచిక్కి నలిగిపోయే కోటానుకోటి వ్యక్తులలో సీతమ్మ కూడా  ఒక్కతే”అంటారు రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు. చాలమంది ‘సీత’అనేపేరు తమపిల్లలకు పెట్టుకోవడానికి భయపడతారు. ఆలోచిస్తారు. ఆమె పేరులో వున్న పరమార్థాన్ని గాని ఆమె గుణశీలాలను గాని తెలియని అర్భకులే అట్టివాళ్ళు అనడం తప్పుకాదేమో!మానవజీవనవిధానంలో అనుకోని అవాంతరాలు,అందునా కుటుంబంలోని,పరిసరాలలోని వ్యక్తులవల్ల ఎదురయ్యే భయానకమైన సన్నివేశాలు నిరంతరం వుంటూనే వుంటాయి. వాటిని ఎలా అధిగమించాలో,ఆచరించాలో అనుభవించాలో స్వానుభవంతో లోకాలకు సాటిచెప్పి కీర్తికిరీటాన్ని ధరించిన దంపతులు సీతారాములు. పుటపాక బంగారాలు,పరస్పర భావసంఘర్షణలతో దివ్యసందేశాత్మకమై వెలిగినది. నిత్యస్మరణీయమైనది సీతచరిత.

నిత్యనవీనం,అనంతం అయిన కాలవాహినిలో యుగాలు గడచినా మానవసమాజంలో ఆదర్శవంతంగా నిలచిన పాత్రలు కేవలం కావ్యనాయికానాయకులే గాదు శ్రీరాముడిని కర్తవ్యోన్ముఖుణ్ణి చేసిన ఖ్యాతి స్త్రీపాత్రలెన్నింటికో దక్కినది.  ధరమేవ జయతే అని ధర్మానికి జయం అధర్మానికి నాశనం తప్పదని నిరూపించిన పాత్రచిత్రణలు. నిరపరాధులెలా నిందల పాలౌతారో,భోగశీలురు త్యాగశీలులు కావలసివస్తుందో నిరూపించినది. ముఖ్యంగా సీత తన ప్రాతివత్య ధర్మం చేత అధర్మానెదిరించడానికి ఎలా కడగండ్ల పాలయినదో చక్కగా నిరూపించినదీ కావ్యం. శ్రీరామ చరితలో నాయికయే గాని,ఒక మహేతిహాసాన్ని సృష్టించిన దివ్యపాత్ర ఆమెది. ధర్మాచరణ వైశిష్ట్యమే ఆమెను అంతటి ఉన్నతపథానికి చేర్చినది. ఇది లోకవిదితం. ఆమె నిర్వహించిన భూమిక అంతటి దివ్యమైనది.

ఆమె భారతీయ సతీత్వానికి మాతృత్వానికి ప్రతీక. గృహయజమానికి సర్వశుభాలు అందించిన గృహిణి. అనుకూలవతి ఆదర్శమూర్తి. పుణ్యభారతంలో పూత చరితలలో మేటి. ఇది వాల్మీకి,మొల్ల రామాయణాల తులనాత్మక పరిశీలన. ఐతిహాసిక,కావ్యనాయిక గానే గాదు సమకాలీనమైన ప్రబంధ కావ్యనాయికా లక్షణాలను గూడ జోడించి రచన చేసినది. వర్ణనామిళితమైన హరివిల్లు జీవన ఔన్నత్యంతో కూడిన సంస్కృతీ సంప్రదాయబద్దమైనది. సాంఘిక మర్యాదలకు, సమిష్టి కుటుంబపు తీరుతెన్నుల కపురూప కల్పన కావ్యత్వాన్ని సంతరించుకున్నది,రసానంద జనకమైనది.

శాస్త్రకావ్యార్ధ ప్రతిబింబితమై ఒప్పుచు ఆమె జీవితవృత్తమే ఒక ఇతిహాసమైనది. చరిత్రపుటల్లో చెరగని శిలాక్షరమైనది. అట్టి సర్వలక్షణ సంపన్న ఇతిహాసిక నాయిక జనకజ. లాక్షణికులు చెప్పిన స్వీయాది నాయికా భేదాలను పరిశీలిస్తే సీత స్వీయనాయికా లక్షణోపేత.

“సంపత్కాలే విపత్కాలే యానముంచతి వల్లభం

శీలార్ణవ గుణోపేత సా స్వీయా పరికీర్తితా”

అంటూ భరతుడు స్వీయనాయికను పరిచయం చేశాడు. కష్టసుఖాది ద్వందాల్లో రుజువర్తనం (ఇక్కడ బు ఈ రు ఉండాలి)కలిగి సఛ్ఛీల సద్గుణాలతో నాథుని అనుసరించి నడుచుకునే స్త్రీమూర్తి

సీత స్వీయనాయిక. వలదని వారించినా రాముని మునివేషధారణ తానుకూడా  స్వీకరించి వనగమనం చేసినది. పురుష చిత్తమెరిగిన గుణశీల. ఉత్తమ స్త్రీ ప్రవృత్తికిది తార్కాణం.  సాధారణంగా కావ్యనాయిక శృంగార రసతపస్విని. అట్టి రసానందంతో మునిగిలేదు.  పతిఅనురాగాది జీవితానుభవాలతో సీత ముగ్ధ,మధ్య,ప్రౌఢాది నాయికా భేదాలెన్నిటినో పొందుపరచుకున్న సంపూర్ణ వ్యక్తిత్వం గల స్త్రీ. శక్తివంతం,స్వయంప్రకాశం కలది. శక్తిసామర్థ్యాలతో శాస్త్రజ్ఞాన సంపదలతో కావ్యలక్షణాలన్నింటిని పుణికిపుచ్చుకున్నట్టిది. జనకరాజపుత్రిగ,దశరథమహారాజు కోడలిగా రామభధ్రుని యిల్లాలుగా తన స్థితిని భద్రపరచుకున్న వనిత,రావణ మారణ సంగ్రామానికి నాంది అయినది.

 

ప్రతినాయకునిచే అపహృతయై సంఘర్షణ సమావేశాలకు మూలమైనది. స్వధర్మపాలనలో బద్ధకంకణ,లోకోత్తర సౌందర్యమే గాదు,లోకధర్మాలను ప్రతిష్ఠించినది. స్వాధీనపతికయై,ధీరాధీరయై తరతరాలలో కీర్తింపడుబచున్నది. అనుపమాన గుణాలంకారశోభిత,అసమాన శక్తిస్వరూపిణి,లోకపూజ్య అయోనిజ పవిత్రతకు పరాకాష్ఠ దివ్యాంశతో కూడిన క్షత్రియకాంత.

 

త్రిలోక సుందరి.  వీర్యశుల్క.  ఏకపత్నీవ్రతుడైన రాముడిచే ఆరాధింపబడినది. పతిపరాయణ,నిత్యానపాయిని. తాను తరించి అతడిని తరింపచేసినది.  స్త్రీలు అబలలని శారీరకశక్తిని బట్టి అంటారు. అవసరమైన వేళలో నైతిక,మానసిక బలప్రదర్శనలు చేయగల సబలలని ఎందరో నిరూపించుకున్నారు. మన సీతమ్మ కూడా  అలాంటి ధీరవనితయేనని నిరూపించుకున్నది. ఈ సతి వ్యక్తిత్వాన్ని మొల్ల రామాయణంలో సంపూర్ణంగా తెలియడానికి అవకాసం తక్కువ. సంక్షిప్త రచనగదా!వాల్మీకి ఋషిమాత్రం సంపూర్ణంగా కావ్య్నాయికా గుణశీలవర్ణన చేసి చూపాడు. వాల్మీకి రచనయే ఆధారమైనది. అయోధ్య సుందర,యుద్ధ యిత్యాదులలో ఆమె మానసిక రూపాన్ని చక్కగా తెలిసికోవచ్చును.

 

ఆమె లౌకిక జ్ఞానసంపదకు విచక్షణతో కూడిన మర్యాదలకు,ఆలోచనలకు ధర్మాధర్మా ప్రసంగాలకు నెలవు. వ్యక్తిత్వానికి నికషోపలం ఈ కావ్యం. అరణ్యంలో,అశోకవనిలో రావణునితో భాషించిన తీరు ధీరత్వానికి,ధృఢసంకల్పానికి,పవిత్రభావాలకు ఆలవాలం. హనుమంతునితో మాట్లాడిన విధం పశ్చాత్తాపానికి పరాకాష్ఠ. పూత చరితకు నిదర్శనం. పతిని అనుసరించి అడవులకేగినది గాక బంగారులేడిని కోరి మరికొన్ని కష్టాలు తెచ్చుకున్నది. మానవజీవన వాహినిలో ఎదురయ్యే ఒడిదుడుకులను అనుభవించి జీవితమంటే ఏమిటో వివరించినదనవచ్చు. ఉచితానుచిత సంభాషణ చేయగల జ్ఞాని. సమయస్ఫూర్తితో ప్రవర్తించగల నేర్పు,ఆత్మ ఔన్నత్యం, కర్తవ్య ప్రబోధం చోట కఠినంగా మాటాడి ధర్మపరిరక్షణ చేయగల కౌశలం. ఎన్ని తెలిసినా “బుద్ధిఃకర్మానుసారిణీ” అన్నట్లు మాయలవాడి మాటలు నమ్మి భిక్షపెట్టి మోసపోయినది. స్త్రీ సహజ చిత్తవృత్తిని పలుతావుల వాల్మీకి చక్కగా నిరూపించాడు. 

 

ఆమె పతిపరాయణ. భర్తతో కలసి జీవించడమే సతీధర్మమని చాటిన యిల్లాలు. “అనన్యారాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథా’సూర్యుని చుట్తి వుండే కాంతిపుంజం వలె తాను తన రాముడిని ఏ స్థితిలోనూ విడిచి ఉండలేనిది. జీవితంలో భార్యకు గల భాగస్వామ్యాన్ని నిర్దేశిస్తూ అడవికి రావలదనిన రాముడికి హితోపదేశం చేసినది. నొప్పించి అయినా చివరకు ఒప్పించే చతురుపాయశాలిని. హితైషిణి. బానిసను గాదు భాగస్వామిని అని నిర్దేశించిన దేశిక. రాజస ప్రవృత్తి కంటె కర్తవ్యపాలన,ధర్మదీక్షా,వాక్పటుత్వం ఆమె లక్షణాలుగ నిరూపించుకున్నది. రాజసతామసాహంకారాలు మృగ్యం. 

 

“నేదానీం త్వదృతే సీతే స్వర్గోపి మమరోచతే”అంటూ ఆమె అనురాగాన్ని అభినుతించాడు రాముడు.

సాత్వక గుణసంపన్న గదా!అత్త కౌసల్య తనకొడుకును అరణ్యవాసంలో జాగ్రత్తగ చూచుకొమ్మని స్తీజనోచితబుద్ధిని  వివరిస్తుంది. నెమ్మదిగా కౌసల్యను అనునయించి ఆమె ఆంతర్యాన్ని అవగాహన చేసుకుని ప్రశాంతంగా సంభాషిస్తుంది. అనార్య అయిన స్త్రీని కానని వివరించినది. భర్తకు దూరమైన భార్యజీవితం శోభాయమానం కాదని  అనార్య్లులైన స్త్రీలు మాత్రమే భర్తను కష్టాల్లో వదిలి వుంటారని కులస్త్రీలు అలా చేయరని అనార్యలతో తనను పోల్చవలదని హెచ్చరిస్తుంది. ఇక్కడ వినయం గోచరించినా అత్తగారిమాటలకు తనమనసు నొచ్చుకున్న తీరును మెత్తగా వివరించినది జానకి. సీతాదేవి హృదయ ఔన్నత్యం ఎలాంటిదో అర్థం అవుతుంది. ఏ కావ్యనాయికలో కనిపించని రమణీయ సంభాషణ యిది. పరిణిత మానసిక ప్రవృత్తి అదే ఆమె హృదయ సౌందర్యం.

 

మొల్ల తనరామాయణంలో స్వీయనాయికా లక్షణాలతో ప్రకాశించే సీత ప్రవర్తనలకు అవకాశమే కల్పించలేదు. సీత హృద్గ్తత భావాలకు వాల్మీకి రామాయణం నీరాజనం పట్టినది. స్త్రీజనుల పట్ల వాల్మీకికి గల ఆదరణ అంత గొప్పది. మొల్ల కాలం నాటికి సామాజికమార్పులు కలిగి వుండవచ్చునేమో!తాను రచయిత్రి అయికూడా  సామాజిక వ్యవస్థను ధిక్కరించు ధైర్యం లేనిదై వుండాలి. స్త్రీకిసమానత్వాన్ని కల్పించి ఆ వ్యక్తిత్వ నిరూపణ చేయలేకపోయినది. సీత రాముడితో కౌసల్యతో  సంభాషించిన విధం ఆమె హృదయౌన్నత్యానికి నిదర్శనం. ఇలాంటి తావుల్లో సంభాషణల్లో తావు కల్పించకపోయినా శ్రీరాముని ఆంతర్యమెరిగి ప్రవర్తించిన స్థ్తితి ఆమెది. ఇంగితజ్ఞానసంపన్న అని తెలియును. “శ్రీరాముడు రాజచిహ్నంబు త్యజించి”అనే మాటలలోనే గ్రహించగలిగినదై  “తోడం జనుదేర”(మొ. రా అ30ప)ఇలాంటి పట్టున సంక్షిప్త సీత పాత్రచిత్రణకు కొంతలోటు తెచ్చినది. ఆత్మజ్ఞాన వికాసం ఆత్మీయతానుబంధం పరిచయమవుతున్నాయి.

 

వశిష్ఠాది ఆర్యజనుల,భరధ్వాజ,అత్రి వంటి మహర్షుల,అనసూయాది పతివ్రతల మన్ననలు అందినది సీత. ప్రశంసాపాత్ర క్లుప్తంగా చెప్పినా ఆమె ప్రవృత్తిని సూచించడం గమనార్హం.

 

పతిని గౌరవించి గౌరవించబడినది. భర్తను కార్యసాధనకు పురమాయించి కర్తవ్యపరాయణ అయినది. పతి ఆంతర్యం తెలిసి అడవికి బయలుదేరినదేగాని అయోధ్యలో ఆమెనెవ్వరు వెళ్లమని చెప్పినట్లు తెలియరాదు. అది ఆమె త్యాగశీలానికి ఋజువు. “సదాశాంత సదాశుద్ధా గృహఛ్ఛిద్ర నివారిణీ”అయిన సీత గృహఛ్ఛిద్ర నివారణకై భర్తను అనుసరించినది.

 

“సీతా సత్యాచరుక్మిణీ”అని లక్ష్మీ సహస్రనామస్తోత్ర కదంబంలో మహాదేవిగా ప్రస్తుతించబడుతుంది. ఒక దివ్య

శక్తి స్వరూపిణి. ఆధ్యాత్మరామాయణంలో కూడా “ప్రణవ ప్రకృతి రూపత్వాత్సాసీతా ప్రకృతిరుచ్యతే”(ఆ. రా. పు,48,49)

 

సీతయనగ ప్రకృతి. అంటే శక్తి. శ్రీరాముడు పురుషుడు. చిత్తు ఈ చిచ్చక్తుల సమైక్యరూపమే రామ లేక రామాచరితం అని నిరూపించబడినది.

 

“ప్రణిపాత ప్రసన్నాహిమైథిలీ జనకాత్మజా”(వా. రా. సుం. కాం. 46,47)అన్న వాల్మీకి వాక్కులు కూడా  దేవీత్వ ప్రతిపాదనమే. దయాదాక్షిణ్యాల నిలయమాతృ వాత్సల్యానికి మాతృక. చెరబట్టిన రావణుని కూడా  రక్షింపదలచి రాముణ్ణి శరణు కోరమని హితవుపదేశించిన క్షమాగుణసంపన్న. ఈ విషయంలో మొల్ల ఆమె దాక్షిణ్యాన్ని నిరూపించక రావణుని ఉపేక్షించిన తీరు వర్ణించినది. ఉపేక్షించినా లోక కంటకమని ఆమె నిర్దాక్షిణ్య హృదయంలోని నిష్ఠూరాలకు తావిచ్చినది.

 

“ఆరూఢ ప్రతిమాన విక్రమ కళాహంకారతేజోనిథిన్”(మొ. రా. సుం67ప)అంటూ రాముణ్ణి కీర్తిస్తూ ధీరాతిధీరగ పలికినది సీత,ప్రౌఢవచోప్రగల్బ్యయై నిర్జన వనంలో రావణుని తిరస్కరించినది. స్త్రీ హృదయానికి మొల్ల దర్పణం పట్టినది. చిఛ్చక్తుల అవినాభావ సంబంధమైన సత్యదర్శన నిరూపణమే రామాయణంలోని సీతాదేవి పాత్రచిత్రణం. రావణుడు చిత్తును వదలి శక్తిని చెరపట్టాడు. అతడి చెల్లెలు శూర్పనఖ శక్తిని వదిలి చిత్తును చేపట్టినది. ఇద్దరికి భంగపాటు తప్పలేదు.

 

“ప్రణిపాత ప్రసన్నాహిమైథిలీ జనకాత్మజా”అని వాల్మీకి నిరూపణ ఆదికావ్యంలో గదా!ఆమె కేవలం మానవమాత్రురాలు గాదు. దివ్యశక్తి అని విశ్వనాథ వారి వాణి కూడా  వినిపించినది. ఉపనిషత్తులు కూడా  సీతారాములను పరతత్వ రూపాలుగా శక్తివంతులుగా వర్ణించాయి. దైవాంశాలను అంతర్నిబిడంగా పోషించారు కావ్యకర్తలు.

 

దేవీభాగవతం కూడా  సీతమ్మను శక్తిస్వరూపిణిగానె నిర్ణయించినది. గాయత్రీరూపమే సీతగా మూర్తీభవించినదట. “మందా హిమవతఃసృష్ఠేగోకర్ణే భద్రకళా. చిత్రకూటే తథాసీతా వింధ్యే వింధ్యాధికారిణీ”(దేవీ భాగవతం). గాయత్రీపటలమందలి అష్టోత్తర శతనామాలలో సీతనుద్దేశించి

 

“శుభ్రాంశవాసా సుశ్రోణీ సంసార్ణవతారిణీ సీతా(160)”సర్వాశ్రయా సంధ్యాసఫలా

సుఖదాయినీ వైష్ణవీ విమలాకాలా మహేంద్రా మాతృరూపిణీ”

 

అని దేవీ భాగవతకర్త గాయత్రీ నామావళిని ిర్దేశిస్తూ(12సం 6వ ఆధ్యా)”జాతరూపయయీ జిహ్వ జానకీ జగతీజరా”(57శ్లో)దండకారణ్యా నిలయాదండినీ దేవ పూజితా మానవీ మధు సంభూతా మిథిలాపురవాసినీ”(124శ్లో),రామచంద్ర పదాక్రాంతా రావణఛ్చేదకారిణీ(137శ్లో)వ్యాసప్రియా వర్మధర్మావాల్మీకి వరసేవితా(144శ్లో)అని షోడశి18వ పుటలో సీత పరాశక్తి రూపాన్ని స్పష్టపరచినది. అశోకవనిలో ధ్యానసంలగ్నమానసయైన సీతను గూర్చి వాల్మీకి సుందరకాండలో ‘కృశాంమలిన దిగ్దాంగీం విద్యాంప్రతిపదీమివ(సుం. కాం. 15-35)ఇందులో “విద్యా”అనే శబ్దం పరాశక్తి అనే అర్థాన్ని తెలియజేస్తున్నది. విజ్ఞులకు విదితమే ’విద్యాయైనమః అని లలితాసహస్రం. ప్రతిపత్తునాటి విద్యయంటే పరాశక్తి అని సౌందర్యలహరిలో కూడా  ఉపమించడం చాల తావుల్లో పరిచయమవుతున్నది. “అవ్యక్తరేఖామివ చంద్రరేఖ” అని(వా. సు. కాండ 5స 26శ్లో)వాల్మీకులు. అవ్యక్తాయైనమఃఅంటూ లలితసహస్రనామావళి ప్రసన్న తారాధిపతుల్యదర్శన అని కూడా  వాల్మీకియే నిర్ణయించాడు. రావణుడు మనసుపడ్ద సీతావర్ణనలివి (సు. కాం. 13,68)స ీతాదేవిని అగ్ని రాముడికి అప్పగిస్తూ “రక్తాంబరధారిణీం”అని పలికి ఆమె దేవీత్వాన్ని ప్రకటిస్తాడు. కుండలినీ యోగశక్తియే సీతగా వివరించారు శేషేంద్రశర్మ. 

 

“తరుణాదిత్యసంకాశః తప్తకాంచనభూషణామ్

రక్తాంబరధరాంబాలం నీలకుంచిత మూర్ధదామ్’

(వా. రా. యు. కాం. 121-3)

 

అనిన మాటలలో లోకకళ్యాణార్థమై జన్మించిన  ఆదిపరాశక్తి అపరాంశమే సీత అని ఆదికవియే నిర్ణయించాడు. పరమప్రమాణ వాక్యాలు ఇతరం ఇంకేల?ఇలా తాత్వికదృష్టితో పరతత్వగా నిరూపించినా సామాన్యజనానీకం భారతభారతేతరాల్లో కూడా  ఆమెనొక ఆదర్శస్త్రీమూర్తిగానే ఆరాధిస్తున్నది. ఆమె నడవడిక స్త్రీ జనానికి ఉజ్జ్వలమణిదీపంగా భాసించినది. దయాసత్యాలు,నియమనిష్ఠాపాలనలు,శౌర్యధైర్యాలు,సాహసౌదార్యాలు మానవాళికి మార్గనిర్ధేశకమైనాయి. జీవితనాటక రంగంలో మనిషిగా పుట్టినవాడి పాత్రధారణలో ఎన్ని విధాలైన

దశలుంటాయో వాటి పరిమాణామాలెలా ఉంటాయో ఈ కావ్యపాత్రలలో చక్కగా ఎఱుకపరచాయి.

 

జనకరాజ పుత్రి పతిసేవా పరాయణత్వం,ధర్మైక దీక్ష నాన్యతోదర్శనీయం. ఆ నిరుపమాన శీల విభవం భరతభూమిని భాగ్యవంతం చేసినది. ఉత్తమ మహిళ,అనుకూలవతి అయిన అర్థాంగిగా,షట్కర్మయుక్తగా, కార్యాచరణల్లో ఆదర్శంగా జీవించి సమాజానికి తనప్రవృత్తిని ప్రభోదం చేసి,నెనరు పూవుల నివాళుకందుకుంది.

 

“సీతా అహల్యా ద్రౌపతీతారామండోదరీ తథా

పంచకన్యాఃస్మరేత్ నిత్యం సర్వపాప ప్రణాశనీః”అంటున్నారు పెద్దలు. ఈశ్లోకంలో కూడా  అగ్రస్థానం ఆమెదే. “ఇఛ్ఛా జ్ఞానక్రియశక్తి రూపాత్రిగుణాత్మికైవ”అని రామాయణ సారోధ్దారం. సకార,ఈకార,తకారాల కలయిక సీతాపదం.

 

ఇందులో సత్యం అనే వాచకం ఉన్నదని వాలకొలను సుబ్బారావు గారు పేర్కొన్నారు. ’సేతు’వనగా అడ్దగించునది అనిగాక సముద్రజలాన్నో,నదీజలాన్నో ఆధారంగా ఆ దరి నుంచి ఈ దరికి చేర్చునది అనే అర్థం ప్రధానమైన సాధనం అని చెప్పారిట. దేని సహకారంతోటి మర్త్యులమర్త్య్లలౌతారో అది సతియం. ’సీతేయం’లోని సకారం మీది ఈ కారం తకారం మీది ఏకారం తొలగించిన మిగిలేది సతియం అట. ’సేతువు చేసే కార్యమే గదా పురుషకారమైన లక్ష్మి సీత చేయునది ’శ్రీమదాదంధ్రవాల్మీకి రామాయణం (బా. కాం. 637,38పుటలు). సీత అనగా సంసారార్ణవం నుంచి యజమానిని తరింపచేసేదని భావం. శక్తి యుతమే గాదు పరమపవిత్రం ఈ పదం. ఈమె అన్వర్థ నామధేయ.  ‘సీత’అనగ నాగేటి చాలు. యజ్ఞవాటిలో నాగేటిచాలు నుండి లభించినదని ఎల్లరకు విదితమే. అందుకే జనకర్షి ఆమెకా పేరు స్థిరపరచాడు. తనబిడ్ద నాగేటి చాలువంటి సక్రమమైన నడవడిక గలది కావాలని ఆ పేరు నిర్ణయించినట్లు విదితం అవుతున్నది. జనకరాజ వంశీయులు సీరధ్వజులు. ధ్వజం నందలి గుర్తు యజ్ఞార్థమై భూమిని దున్నునపుడు సీరాగ్రం తగిలి చేతికి అందిన బిడ్డ. అందుకే ఆమెకా పేరు పెట్టినట్లు విశ్వామిత్రునితో జనకుడు స్వయంగా చెప్పాడు. ఆమె ఉనికిని బట్టి ఇతర నామధేయాలెన్ని ఉన్నా మిథ్లేశ్వరునకు మిక్కిలి ప్రీతి అయినదీనామమే అని వాల్మీకి ఉద్దేశం. మిల్ల తన కావ్యంలో సీతా అనేపదాన్ని కొన్ని పదులసార్లు ప్రయోగించడం గమనార్హం.

 

“పుష్పములెన్ని యున్నా మల్లెకు గల మధుర పరిమళము మల్లెదే. సంపెంగకు గల సౌరభం సంపెంగదే. . . . . ’

 

అంటూ పేరులో వున్న గొప్పదనాన్ని ఆచరణలో నిరూపించుకున్నది జానకి అంటారు కల్లూరి చంద్రమౌళి గారు. ఇక సీతాదేవి జన్మసంబంధిత విషయాలను మొల్ల చాలా సంక్షిప్తంగా చెప్పినది. తనకాలానికే బహుళప్రచారంలో వున్నరామాయణాన్ని తనకుదింపు రచనకు వీలుగ చెప్పడం సహజమేననవచ్చు. ఆమెను సీరోధ్బవగానే పరిచయంచేయడం జరిగినది.

 

“ధరణీసుత యగు సీతకు పరిణయమొనరింప జనక పార్థివుడిల. . . “(మొ. రా. భా. కాం. 55)

 

ఆమె అయోనిజయని నాగేటిచాలు జన్మస్థానమని సూచించినది. సీతను లక్ష్మీఅంశ సంభూతగ గూడ పేర్కొన్నది. “శ్రీరామచంద్రు డాదినారాయణుడు సీత ఆదిలక్ష్మీ”(మొ. రా. యు. కాం. 1-24)సీతాదేవి అగ్నిప్రవేశ వేళ బ్ర్హహ్మ స్వయంగా సీతారాముల అవతారతత్వాన్ని నిరూపించాడు.

 

“సీతాలక్ష్మీర్భవాన్ విష్ణుర్దేవః కృపః ప్రజాపతిః

వదార్థం రావణస్సేహ ప్రవిష్ణో మానుషీంతను”(వా. రా. యు. కాం. 121-28)

 

అంతదాక సీతారాములను మానవమాత్రులుగానే వ్యవహరించారు. ఈదివ్యాంశ నిరూపణ ప్రయత్నం కంటె ఆదర్శ మానవులగానే చిత్రించడం వాల్మీకి అభిమతం. జనకుడు చంద్రవంశజుడు. జనకుని యింట పెరిగినందున జానకీ అయినది. ఔరస పుత్రికగానే పెంచి పెద్దచేసాడు. సీతను పెంచిన తర్వాత జనకుని భార్య సుమేధకు లక్ష్మీనిధియనే కుమారుడు కలిగినట్లు రామాయణసారోద్దారములో విదితం. మొల్లసీతమ్మ బాల్యక్రీడలను కూడా వర్ణించలేదు. ఆనంద అద్భుత జానపద రామాయణాలలో ఈ క్రీడలు వర్ణితం.

తనకు కావలివున్న రాక్షస కాంతలవలన విని హనుమంతుని తోకకు అంటించిన నిప్పుని చల్లబరచేందుకు అగ్నిదేవుణ్ణి వేడుకుంటుంది. ఆమెసమయస్ఫూర్తికి ప్రత్యుపకార బుధ్ధికి ఉచితానుచితజ్ఞతలకు నిదర్సనం. పాత్రమెరిగి దానిమిచ్చుట అమెలోని నేర్పు(మొ. రా. సుం. కాం. 220).

 

రాక్షసుల మధ్య అవస్థలు పడుతున్న సీతతో హనుమ ఆమెను తనవీపున ఎక్కించుకుని లంక నుంచి తీసుకుపోయి క్షణంలో రాముని దగ్గరకు చేర్చగలనని పలికాడు. ఆమె ఎంత సున్నితమైన సమాధానం ఇచ్చినదో చూడండి

.

“నీవంతవాడవగుదువు. దొంగిలికొని పోవదగునే దొరలకు నెందున్. . . “(మొ. రా. సుఃకాం121,129)

 

అనిపలికి రావణుడి దొంగతనాన్ని రాముడి దొరతనాన్ని ఏకరువు పెడ్తుంది. లౌకికజ్ఞానం ధర్మనిరతి హితోపదేశం,విచక్షణ వెల్లడియగుచున్నది.

 

ఆనాటి స్త్రీల వలె సీతకు కూడా  సంధ్యావందనాలు,గాయత్రీమంత్రజపాదులు నేర్చిన వర్ణనలు కూడా  రామకథ తెలియజెప్తున్నది. సీతను అన్వేషించడానికి వెళ్ళిన హనుమ ఆమెను కనుగొన్నాక తానామెతో ఏభాషలో మాట్లాడితే బావుంటుందని వితర్కించినందువల్ల చాల భాషలు తెలిసిన దానిగ చెప్పవచ్చు. ఆమెను బాధిస్తున్న రాక్షసస్త్రీఅలను శిక్షిస్తానని పలికిన హనుమ ప్రయత్నాన్ని వారిస్తుంది. పురాణాలలోని ఉపాఖ్యానాలు వినిపిస్తుంది. అపకారం చేసినవాళ్ళకైనా తిరిగి ఉపకారమే చెయ్యాలంటుంది. (వా. రా. అరణ్యకాం. 8-18,19)

 

ఉదా. రామాదులు శరభంగాది ఋషుల ఆశ్రమంలో వున్న సమయాల్లో రాక్షస సంహారానికి పూనుకున్నాడు రాముడు. క్రూరులైనా మనజోలికి రానంతవరకు వాళ్ళను దండించే హక్కు ధర్మవరులకు లేదని హెచ్చరిస్తుంది.

 

ఈమాటలు కుశాగ్రబుధ్ధికి విద్యావినయశీలానికి ప్రతీక పెరిగిన వాతావరణం,తల్లిదండ్రులిచ్చిన సుశిక్షణ గాక వ్యక్తిగత హృదయ సంస్కారం మాత్రమే లౌకిక జ్ఞానసంపదకు కారణం. ఊర్మిళ,మాండవీ శ్రుతకీర్తులే గాక లక్ష్మీనిధియనే సోదరుడు గూడా ఉన్నాడు. పూర్వం స్త్రీలకు గాయత్రీమంతజపమేగాక,మౌంజీబంధనాలు ధరింపచేసి వేదాధ్యయనాలు నేర్పించారు. జపతపాలకు అర్హత కలిగినవాళ్ళని కూడా  తెలుసుకున్నాం. ప్రార్థనలు,యజ్ఞయాగాది కర్మలన్నింటినీ చిన్ననాటనే (విద్యలు)నేర్చినవాళ్ళను “సద్యోవధువు”లంటారు. క్రతువు నిర్వహణకు అవసరమైన వేదమంత్రాలు నేర్పుతారు. కౌసల్య, తారా, సీతా యిట్టివాళ్ళేనట.

 

బ్రహ్మజ్ఞానవిలసితుడైన జనకుని ఆత్మ్జజగ జానకి ప్రశంసనీయ వైష్ణవీయశక్తియే సీత. మనువు స్త్రీల బుధ్ధివికాసానికి వివాహమే ప్రధానకారణమంటాడు. స్త్రీలకు యజ్ఞయాగాది క్రతువులతోగాని ఉపవాసాది దీక్షలతోగాని పనిలేదన్నాడు. పరి శుశ్రూషలతో కూడిన వివాహవిధియే వైదిక సంస్కారమని గురుకుల విద్యాభ్యాసమని తీర్మానించాడు. గృహకృత్యాత్ అగ్నికార్యాలని చెప్పినతీరులు కూడా  సీతనడవడిలో గమనార్హం. రానురాను స్త్రీలకు ఈ విషయాల్లో సడలింపు. అందుకే ఇప్పుడివి లేవు.  సీతారాములు దానశీలం కలవారు. అడవికి బయలుదేరే ముందు బ్రాహ్మణులను సత్కరించి సుయజ(ఇక్కడ సరిచెయ్యాలి) పూజించారు. పిమ్మట భర్త అనుమతితో సీత తారహారాదులు కొన్ని అతనిభార్యకు యిచ్చినది. బ్రాహ్మణాశీర్వాదాలు అత్తమామల ఆశీర్వాదాలు తీసుకుని బయలుదేరినది. పెద్దల యెడల గురువుయెడ గల భక్తి నిరూపణ. సత్యంవద ధర్మంచర అనే శ్రుతి ప్రమాణబధ్ధయైన విశుధ్ధచారిత్రం గలది.

 

“ప్రియవాదీచ భూతానాం సత్యవాదీచ రాఘవః అయిన శ్రీరాముని యిల్లాలు తండ్రికంటె తల్లికి కరుణ,జాలి

యెక్కువ అనేమాట సంకీర్తనాచార్యుల మాటలలో చక్కగా తెల్లమవుతుంది. “నను బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి. . . ”

 

అని ఆర్తితో అమ్మకు విన్నవించుకోలేదు గోపన్న.  దైవభక్తికూడా  మానవుడికి ఎంతావసరమో చాటి చెప్పిన కథ యిది. మానవబలానికి దైవబలం తోడైననాడే సమర్థవంతంగా పనులు చేయగలుగుతారు. ఆచరించి చూపారీ దంపతులు. నిత్యదేవతారాధన పనులు,దైవభక్తి,పాపభీతి అవసరమని నిరూపించారు. అష్టదిక్పాకులను,నదీనదాలను,వృక్షాలను గుట్టలను పుట్టలను ప్రార్థించినపుడు భారతీయ సంస్కృతీ,ఆచారాలు గోచరిస్తాయి. సీతమ్మ జనకజ. చంద్రవంశజ. గౌతమ గోత్రజ. 

 

శ్రీరాముడు సూర్యవంశజుడు. వశిష్ఠ గోత్రజుడు. శ్రీరాముడితో పరిణయం లోకారాధ్యమైనది.  ఆమె చేతలలో బాహ్యరూపంలో వున్నట్టి అందానికి ఎన్నోరెట్లు గొప్పదైన సౌందర్యం మరొక్కటున్నది. అది లోకోత్తర చరితను సృష్టించిన అమె మానసిక సౌందర్యం. (Women in Valmiki page 128)లో సీతారామమూర్తి గారు ఆ సౌందర్యాన్ని వర్ణించిన తీరు చూద్దాం. “Sita is not of this world at all. She is denizen of the heavenly abode. Nay the divine mother herself. She has chosen to come into this world,if only to set an example to women kind in simple living,high thinking and noble going. she is the crown gem of unexcelled brilliance,among women of all clines and of all times”ఎంత చక్కటి తీర్మానమో!ఇది చాలు. అమె ఎవరో తెలియని వాళ్లకు.

 

ఇక వాల్మీకి ఋషిపలుకులలో ఆ సౌందర్యం అత్యున్నతం. బాహ్యంగా ఆమె రాముడితో సమానమైన అందగత్తె అని  వాల్మీకి పదేపదే పలికినా నిసర్గసుందరమైన ఆమె స్వభావం ఎన్నోరెట్లు గొప్పది. అంతగా ‘రామ’చరితాన్ని సృష్టించాడు ఆ మహాకవి. స్త్రీ పాత్రలకే అధికప్రాధాన్యం అందించిన గొప్పఋషి.  “సుతారాం ఉదన్తిసుందరః” అని సౌందర్యానికి అర్థమని గదా. హృదయాహ్లాదకారం నయనానంద జనకం అయిన ప్రతివస్తువు సుందరమైనదే. “విశ్వాతిసాయి సుభగత్వాతో”అని శంకరులన్నట్లు చరాచర ప్రకృతిలో అణువణువు అందమైనదే. చూచి ఆనందించె హృదయం ఉంటే చాలు. అయితే ప్రకృతి అందాలెలా వున్నా ఆహ్లాదకరమై సౌందర్యాతిశయమైనది స్త్రీమూర్తి మానసిక సౌందర్యం ఒక్కటే. స్త్రీలందరికీ ఇది వర్తించకపోవచ్చు. సీతమ్మ గుణగణాలేవేరు. స్వభావానికి తోడుగ రూపం ఆమెకు వన్నెకూర్చినదనడం సువిదితం. ఆ ఆభిజాత్యం అలాంటిది.

 

“ఆత్మసౌందర్యమన పాత్రివ్రత్యం,భగద్భక్తి,పాపభీతి,పెద్దల గురువుల యెడ పూజ్యభావము,మిడిసిపాటుతనము లేకుండుట,నమ్రత,అణకువ,భయభక్తులు కలిగియుండుట,స్వధర్మ నిర్వాహణ,త్రికరణ పారిశుధ్ధత,ఆత్మనిగ్రహము, క్షమ,ప్రసన్నహృదయము,ప్రశాంతచిత్తము,పవిత్ర పరోపకార శీలము”మొదలగునవి కలిగి ఉండడం ప్రాపంచిక కలిమిలేమి,కష్టసుఖాది ద్వందాలలో సహనం,ప్రేమ,కనికరం,దయగలిగిన సమ్మిశ్రితమైన దైవిక లక్షణాల యొక్క అతిశయించిన సొబగే అంటారు. (స్త్రీలకు సౌభాగ్యసందేశము,శామ్తి 1961పు746)

నశించేది బాహ్యం తరాలకు మిగిలివుండేది ఆంతర్యం. అలాంటి సుందరమూర్తి జానకి. ఆమె సౌశీల్య,సౌందర్య,సౌభాగ్య,సౌమనస్య సహృదయాలే ఆమెను ఒక విలక్షణ పాత్రగ తీర్చిదిద్దాయి. భూజాత అయిన  ఈ బంగారు శలాక సధ్ధర్మపరుడైన జనకచక్రవర్తి అనే స్వర్ణకారుని చేతికి చిక్కి చిత్రం అనుపమానం అయిన అమూల్య ఆభరణమై నగిషీలు పొదిగిన స్వర్ణసీత అయినది. కావ్యనాయికా వర్ణనలో రెండుపధ్ధతులు. భౌతిక సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు మానవకాంతను వర్ణిస్తే కేశపాశాది పర్యంతంగా,దేవతా

స్త్రీ వర్ణన అయితే నఖశిఖ పర్యంతం వర్ణనచేస్తారు కవులు. మొల్ల కూడా  వాల్మీకి వలె సీతను ఈ రెండు పధ్ధతుల్లో వర్ణించి చూపినది. బాల,అయోధ్య,అరణ్య,కిషింధకాండలలో సూచనాప్రాయంగా ఇతరపాత్రలచే చెప్పించినది.  భౌతికవర్ణన. ఆమె ఆంతరంగిక సౌందర్యాన్ని మాత్ర సుందర యుధ్ధకాండలలో రచన చేసినది సీతారావణ,హనుమత్సీతా సంభాషణలలో మరియు త్రిజటాది రాక్షసాంగనలతో సాగిన సంభాషణతీరులో చిత్తవృత్తిని అద్భుతంగా రూపుకట్టించినది.  ఒక చక్కటి వర్ణమిళిత చిత్రంలా భాసింపచేసినది.

 

జానకీ లోకోత్తర సౌందర్యాన్ని అతిగడుసుదనంతో,వ్యంగార్ధ భాషణలతో,చమత్కారంగా వర్ణించినది. సీత శిరీషకుసుమపేశలగాత్రి,అసూర్యంపశ్య రాజకాంత. అరణ్యవాసంలో అలాంటి సుకుమారి భౌతికంగా పొందిన అవస్థలను కన్నులకు రూపుకట్టించినది. నఖశిఖ వర్ణనలతో దివ్యస్త్రీగ నిరూపించినది. అరణ్యకాండలో శూర్ఫనఖ సీతమ్మ సౌందర్యవర్ణన చేసిన విధం ఆశ్చర్యం.  శత్రుభావన,ద్వేషపూరిత అయిన రక్కసి కూడా  ఆమె సౌందర్యానికి నీరాజనీయడం గీటురాయి. “ఆరాముభార్య విభ్రమమేరాజతనూజలందు నెరగము విని మున్”(అరణ్య మొల్ల 21-25)అంతటితో తనివారని మొల్ల “బంగరు నీరు నిలువున. . .: అంటూ పలికితేగాని శూర్పనఖ వదలని సౌందర్యమది. వాల్మీకి కూడా  త్రిలోకాలలో కానరాని ఆ సౌందర్యాన్ని గురించి:

 

“శుభాం రుచిరదంతోష్టీం పూర్ణచంద్రనిభాననా

అసీనాం పర్ణశాలాయాం బాష్పశోకాధిపీడితా”(వా. రా. అరణ్య 46-11-22) అన్నాడు.

 

అరణ్యవాసంలోనే అంత అందంగా ఉన్న ఆమె రాణివాసంలో ఆ సౌందర్యం ఎంతమనోహరమో గదా! ఆయా సందర్భాలలో స్త్రీసహజమైన సామాన్యజీవన విధానం ఎలాంటిదో పరిశీలించుదాం. ముఖ్యంగా పతిబాసిన వేళ కులస్త్రీ ధర్మాలెలా వుంటాయో లంకలో వున్న సీతను చూచిన హనుమకు అర్థమవుతుంది. “కట్టిన వస్త్రంబు కట్టుకొంగె తప్ప జీర్ణించిపోయిన చీరతోడ. . . “(మొ. రా. సుం. కాం246) పతివియోగం చేత కుందుచున్న సీతాసతి హృదయంలోని పవిత్రభావాలకు దర్పణం. రావణునితో చేసిన సంభాషణ ఆమె శీలవిభవానికి రుజువు. వరిష్ఠాసర్వనారీణామ్ అన్నాడు కదా వాల్మీకి కూడా .

 

ఇక సీతమ్మ వివాహ సందర్భంగా కొన్ని సన్నివేశాలు. “శంకరు చాపమెక్కిడిన సత్వఘనుండగు వానికిత్తు నీ పంకజనేత్ర సీత. . . “(బా. కాం. 70మొల్ల)స్వయంవరం చాటినందున ఉత్తమ క్షత్రియకాంతగ తెలియవస్తున్నది. అయోనిజ సీత భూపుత్రిక. ఈవివాహం లోకకళ్యాణమే గదా!భారతీయుల వివాహవ్యవస్థను వాల్మీకి ఈ సందర్భంలో చక్కగా క్రోడీకరించాడు. శ్రుతిప్రమాణమైనది. గృహస్థాశ్రమ ధర్మ సంస్థాపనకే వాల్మీకి ఆనాడు రామకథను సృష్టించాడనడం తప్పు కాదేమో!ఇది వ్యక్తిగత సంస్క్రారాలలో ఒకటి. సామాజిక బంధం. వ్యాసవాల్మీకులు గార్హస్థ్య ధర్మజీవనం ఆలుమగల ఔన్నత్యం ఎలా వుండాలో ఆయా సందర్భాలలో చక్కగా పేర్కొన్నారు. పౌరలౌకిక,వంశోధ్ధరణ ఇత్యాది విధులకు వివాహమే మూలమని మనువుకూడా  ఉట్టంకించడం విజ్ఞులకు విదితం. జీవితం ఒక పూర్ణభావం. ఆపూర్ణభావం యొక్క తత్వమే దంపతులు. ధర్మబధ్ధ జీవనం గడిపిననాడు పూర్ణత్వం అందుకుంటారు. తారతమ్యాలు త్యజిస్తారు. గృహ్యసూత్రాలలో అష్టవిధ వివాహ పధ్ధతులున్నాయి. పెద్దల ప్రేరణతో జరిగినది సీతారాముల వివాహం. స్వయంవరానంతరం ఆర్షబధ్ధంగా ప్రాజపత్యమనే వివాహభేదంతో జరిపించబడిన వైవాహిక క్రియ వీళ్ళది. వాల్మీకి విపులంగా చెప్పిన ఈ సన్నివేశం మొల్ల క్లుప్తపరచినది. “సహధర్మం చరత ఇతిప్రాజాపత్యః”అని అశ్వలాయనుడు “సంయోగ మంత్రః ప్రాజాపత్యే సహధర్మచర్యతామ్”అని గౌతముడు “ఆచ్చాద్యాలంకృతైషా సహధర్మం చర్యతామితి ప్రాజపత్యః అని బోధాయనుడు ఈ ప్రాజాపత్య వివాహలక్షణాలను వివరించారు. వివాహవేళ సీతను రాముడికి అప్పగిస్తూ జనకుడు పలికిన పలుకులు కూడా  ప్రాజాపత్యమే.

 

“ఇయం సీతా మమసుతాసహధర్మచరీతవ

ప్రతీఛ్ఛచైనాం భద్రంతేపాణిం గృహ్ణీష్వపాణినా’(వా. రా. అయోధ్య్య70-26,27)

 

ఈసీత నాకూతురు. నేటినుంచి నీ సహధర్మచారిణి పాణిని గ్రహించి భద్రంగా ఏలుకో. ఈమెపతివ్రత,మహాభాగ్యశాలినీ నీడవలె నిన్ను అనుసరించి నడవగలదు. అన్నప్పుడే ఎలా మసలుకోవాలో వివరించాడు. తనవలె రాముడికి కూడా  ఆమెను చేపట్టినందున సర్వశ్రేయాలు కలుగుతాయంటాడు.

 

’పుత్రాఛ్ఛ్గత గుణం పుత్రీం’అన్నట్లు

 

కొడుకువలన కలిగేకీర్తికంటే కూతురివలన నూరింతలు అధికంగా తండ్రికి కీర్తి లభిస్తుందట. స్త్రీలకు పుట్టినింటి చరిత్ర కంటె అత్త యింటి చరిత్ర ద్వారానే కీర్తి ఇనుమడిస్తుందట. అందుకేనేమో ప్రతిపెళ్ళిపత్రికలోసీత గూర్చి ప్రింటర్స్ వ్రాస్తుంటారు. భావం తెలిసోతెలియకో గాని చాలమంచి ఆలోచన అది.

 

శ్రీరామపత్నీ జనకస్యపుత్రీ సీతాంగనా సుందరకోమలాంగీ

భూగర్భ్జజాతా భువనైకమాతా వధూవరాభ్యాం వరదాభవన్తు”.

 

ఆమె ఆభిజాత్యం అంతా ఒక్కశ్లోకమే పట్టి యిస్తుంది. అలాంటి ఆదర్శజీవనం గడపాలనే ఉద్దేశం వధూవరులు గ్రహించాలి. ఎంతఖరీదైన పత్రిక అచ్చువేసుకున్నా ఈ పై శ్లోకమే ఆ జంటకు పరమావధిగా చూడాలి.

 

సీతామహాసాధ్వి వైవాహిక,సాంసారిక జీవనవిధానం ఎలాంటిదో చూద్దాం. మొల్లమ్మ అన్నింటిని కుదించిన కథాంశమే గాబట్టి వాల్మీకం ప్రధానంగానే చర్చించుకుందాం. మొల్లరామాయణంలో శ్రీరామచంద్రుడు రాజచిహ్నంబులు త్యజించి జటావిభూతి,వల్కలంబులు దాల్చి ధనుర్ధరుండై యున్నంత లక్ష్మణుండును భూపుత్రియును అని పలికినందున విపులంగా విషయం అందదు. తర్వాత కొన్ని కాండలలో వివరాలు కొన్ని తెలుసుకొనగలం. అరణ్యంలో “హా లక్ష్మణా!” అనే మాటలు విని సీత ఆందోళనలు,ఆవేశాలతో కూడిన చిత్తవృత్తి పరిచయం అవుతుంది. రాజసంతో రాముడి రక్షణకై లక్ష్మణుడిని పర్ణశాల విడిచివెళ్లమని ఆజ్ఞాపించినది. అన్నగారిమాటలు దాటరానివై ఇరుకునపడిన లక్ష్మణుడు తన మాటలు పాటించనందున కోపోద్రిక్తయైనది. కర్ణశూలాలైన మాటలతో బాధించినది. వాల్మీకంలో కూడా  “సౌమిత్రే మిత్రరూపేణ భ్రాతుస్త్వమపివత్. . . . . ” అంటూ దూషించినది సంశయించినది. ఒకసామాన్య మానవకాంత మాట్లాడినట్లు

ఎంతో నిష్ఠూరమైన పలుకులు వినిపించిన స్త్రీ మనోగతం అది.

 

అంతటితో ఆగక “రామంవినాక్షణమపినహి జీవమిభూతలే”అంటూ నువ్వువెళ్ళనిచో ఈ క్షణమే యిప్పుడే నాప్రాణాలు తీసుకుంటానని బెదిరించినది. లక్ష్మణుని పని అడకత్తెరలోని పోకచెక్క చందం అయినది. సీతను కాపాడమంటే వదలివచ్చాడని రాముడు కూడా  చివాట్లుపెట్టాడు.

 

“పొడగని గుండె ఝల్లుమన. . . . నొంటియై బడతుక డించి రాదగునె వన్యమృగోత్కర మధ్యసీమకున్. . .

“అంటూ మొల్ల కూడా  ఈ సన్నివేశాన్ని చిత్రీలరించినది(మొ. రా. అరణ్య 48ప). సామాన్య మానవజీవన వృత్తాంతం ఎలాంటిదో ఇక్కడ స్పష్టంగా ఉన్నది. “పితృకృతాఃబ్రాహ్మ వివాహ సదృశవివాహేన పితృదత్తాఃసఏవ వివాహస్సర్వదాశ్లాఘ ఇతిభావః”అని మహేశ్వరులన్నట్లు పెండ్లి అయిన తర్వాత వధూవరులు అన్యోన్య ప్రేమానురాగాలతో జీవించడం భారతీయ సనాతన పధ్ధతి. అలా ఉన్నది వీరిఅనురాగం.

 

సీత అవసరవేళలో నిష్ఠురోక్తులతో రాముడిని హెచ్చరించినది. ధర్మోక్తులు పలికినది. రావణుడు తనను ప్రలోభపెట్టినప్పుడు ఆమె హృదయం సమ్మెటపోటులు తిన్న బంగారు శలాకయే నిష్కపట ప్రేమమూర్తి.

 

“శక్యాలోభయితుం నాహమైశ్వరేణ్యధనేనావా అనన్యా రాఘవేణాహం భాస్కరేణ యధాప్రభా”(వా. రా. సుం. 21-15)

 

తాను భాస్కరుణ్ణి చుట్టివుండే కాంతివంటి దాననని రామునికే దక్క ఇతరులకు దక్కనిదానినని ఏ ఐశ్వర్యాదులుతనని ప్రలోభపెట్టలేవని రావణుడిని తిరస్క్రరించింది. రాక్షసస్త్రీలు అందగాడు ఐశ్వర్యవంతుడు అయిన రావణుడిని వరించి సుఖించమని రామునిపై ఆశలు వదకుకోమని పలికిన సందర్భంలో సీత హృదయంలో ఉన్నత భావాలెంత ఆదర్శనీయమో చూడండి.

 

“దీనోవారాజ్యహీనువా యోమే భర్తా సమే గురుః

తం నిత్యమనురక్తాస్మియథా సూర్యం సువర్చలా”(వా. రా. సుం. 24-9)

 

దీనుడైనా,రాజ్యహీనుడైనా తనభర్త తనకు చాలా గొప్పవాడని ఈ దేహాన్ని ఖండించినా నాకిష్టమేగాని రాక్షసేంద్రుడిని వరించుదానను కాదని నిక్కచ్చిగా పలికిన మేలిమిబంగరు తల్లి. అయోధ్యలో ఎంత సుఖంగా వున్నదో అరణ్యవాసంలో కూడా  అంతే ఆనందంగా సుఖంగా ఉన్నది అంటాడు సుమంతుడు కౌసల్యతోభర్త సన్నిధికి మించిన భోగాలు ఇతరాలెవీ లేవంటుంది సీతమ్మ అంటాడు.

 

“విజనేపివనం సీతావాసం ప్రాప్యగృహ్యేష్వివ. . . . తధైవరమతేసీతా నిర్జనేషువనేష్వతి

బాలేన రమతే సీతాబాలచంద్ర నిభాననా. . . “(వా. రా. అయోధ్య60-7-10)భర్తహీనస్థితిలో

 

ఉన్నప్పటికీ ఎప్పటివలె ఆదరించి ప్రేమించి గౌరవించే గుణం గల స్త్రీ ఒక్క సీతమాత్రమేనేమో. ఆమె అరణ్యంలో కష్టాలుపడడం రాముడు సహించలేకపోయాడు. ఆసమయంలో సీతపలికిన అనునయ వాక్యాలు రమణీయం. శీతల వాయుగంధాలను ఆఘ్రాణిస్తూ,పక్షుల కూజితాలను వింటూ మందాకిని జలాలశంలో స్నానమాడుతూ వినోదించే అవకాశం తనకు కల్పించినందుకు ఆనందించానని,భర్తృసాన్నిధ్యమే కొండంత వెలుగు తనజీవితానికి అని పలుకుటలో ఆ హృదయమార్దవం వెల్లడి అవుతుంది. మారుమాట లేక తనను తాను దిద్దుకుంటూ,‘నేదానీం త్వదృతేసీతే స్వర్గోపిమమరోచతే. . . ’అంటూ సీత రాముడు పలకడంలో సీత ఆంతర్యం తెలియదలచిన రాముడి మనస్తత్వం బయటపడుతుంది. రామాయణకర్త దంపతుకిద్దరకు సమాన ప్రతిపత్తినే కల్పించి రచనచేసాడు. కాని ఒకరికి మరొకరు బానిసగా బ్రతకాలని చెప్పదలుచుకోలేదు. బాహ్యాంతర రూపలావణ్యాలు,ఆలాపనలు అన్నీ సమంగా మలచుకుని జీవించాలన్నదే ఈ కావ్యరహస్యం. ప్రణయం,అన్యోన్యత,స్వాధీనపతిక అయిన భార్యగలవాడికి  బ్రతుకు సుఖమయం,గౌరవప్రదం అవుతుందని చాటిచెప్పిన కావ్యం. ఒకరిపై ఒకరికిఆధిక్యత గాదు అన్యోన్యం అవసరం అని తెలియచెప్పినది రామాయణం.

మొల్లమ్మ సీతమ్మ చిత్తవృత్తాన్నిసంపూర్ణంగా ఆవిష్కరించలేకపోయినా ప్రధానాంశాలన్నింట వాల్మీకులనే ఆదర్శంగా తీసుకు చెప్పినమాటలు వాస్తవం. అరణ్యవాసంలో భరధ్వాజ మనకు దర్శనమపుడు,అత్రిఆశ్రమంలో అనసూయతో ఎన్నో అంశాలు ముచ్చటిస్తుంది. తనతండ్రి తనకు సకాలంలో పెండ్లిచేయలేనేమోనని విత్తనాశం చెందినవాడివలె మిక్కిలి చిత్తక్లేశాన్ని పొందాడట. దేవేంద్రసముడైనా కుమార్తెకు సకాలంలో వివాహం చేయలేకపోతే నిందలపాలగుతాడనుట. మనువు మాటను సీతనోట వాల్మీకి పలికించాడు. చిత్రకూటంలో సీతారాములున్నారని తెలిసి జనకుడు చూచిరావడానికి వెళ్ళాడు. అరణ్యవాసం పూర్తిచేసుకుని రాముడు తిరిగివచ్చునంతదాక మిథిలకు వచ్చి తనదగ్గర ఉండమని కోరుకుంటాడు. అప్పుడు పెళ్ళినాటిప్రమాణాలను, రాముడికి తనను అప్పగించిన పలుకులు గుర్తుచేసి రాముణ్ణివదలి రాజ్యసంపదలు అనుభవించలేనని రానని తండ్రితో పలికినది. ఆమాటలు విన్న జనకుడు కూతురి సత్ప్రవర్తన వలన తనవంశం ఉధ్ధరింపబడినదని,కీర్తి వియన్నదియై ప్రవహించగలదని పలికాడు. రాముడి వంటి పురుషుడు సీతవంటి స్త్రీమాత్రమే దేశానికి అవసరం. ఆదర్శం అని పలికి వెళ్ళిపోయాడు. సామాన్యస్త్రీ అయితే తండ్రిని చూడగానే బోరునవిలపించి రాజభోగాలకై అర్రులుచాచి ఉండేది.

 

శ్రీరాముడు యుధ్ధభూమిలో నాగపాశబధ్ధుడైయున్న విషయం తెలిసి తనబాధనటుంచి తన అత్తగారైన కౌసల్య ఈ విషాదాన్ని ఎలా భరించగలదోనని వాపోవడం. ఆమెకు అత్తయింటిలోని పెద్ద్లలపై గల గౌరవాదరాలు తెలియవచ్చు. దయాదాక్షిణ్యాలు,సద్గుణాలు,సహకారసేవాబుధ్ధులు ఉన్నట్టి త్యాగమూర్తి లక్ష్మణుడిని కన్న సుమిత్రను ధన్యచరితగ కీర్తించినది. పూర్వం తాను మరిదిని తూలనాడినందుకు పశ్చాత్తాపంతో కూడినపలుకులు. ఆమె కైకమ్మ విషయంలో కొంచెం నిష్ఠూరాలు వినిపించడం మానవ సహజచిత్తానికి ప్రతీక. 

 

అత్త యింటిలో సేవక జనాన్ని కూడా  ఆదరించి మన్నించినది. మైథిలి నిగర్వి. తనవలె తన అత్తలందరు తనను ప్రేమించినవారే. ఆదరించినవారే. ఆపదలలో భర్తను అనుగమించి సేవిస్తున్న కోడలి పట్ల అపారమైన అభిమానం కౌసల్యాది అత్తలకు. అడవికి బయలుదేరే సీతను వారించమని రాముడిని ఆమెలో చూచుకుని బ్రతుకుతానని దశరథుణ్ణికోరిన కౌసల్య ప్రేమాభిమానాలు చూరగొన్నది సీత. ఈ ఆవ్యాజానురాగానికి వాల్మీకిపలికించిన పలుకులు చూడండి. “లావణ్యవతి. శీతోష్ణాలనెట్లు సహించగలదు మృష్టాన్నాలు ఆరగించినది కందమూలాలు ఎలా తినగలదు. రాజాంతఃపురవాసిని అరణ్యంలో క్రూరమృగాల మధ్య బాధలు ఎలా పడగలదని అరణ్యవాసాన్ని నివారించమని వేడుకుంటుంది కౌసల్య. వనవాసానంతరం కూడా  వనవాసక్లేశంతో కృశించిన శరీరంగల కోడలిని చూచి కౌగలించి దుఃఖించినది. ఇది అపురూపం అపూర్వం అయిన అనుబంధం. దశరథుడు కూడా  ఆమెను పుత్రికా వాత్శల్యంతోనే అభిమానించాడు. సీతను అడవులకు వెళ్లమని తాను చెప్పలేదని రాముణ్ణి అడవికి పంపుచున్న పాపం మూట కట్టుకున్నది చాలక సీతను కూడా  అడవికెందుకు పంపుచున్నావని కైకను నిందిస్తాడు. నారచీరలు వద్దని విలువైన వస్త్రాభరణాదులు యిచ్చిపంపించమన్నాడు. భర్తకు ఏది నిర్ణయమో దానినే ఆమె స్వీకరిస్తానని పలుకుట ఆ నిత్యానపాయినికే తగియున్నది.

 

ఈ సందర్భంలో కులగురువు వశిష్టుడు ఒక చక్కటి తీర్మానం చేసి వినిపించాడు. అడవులకు వెళ్ళక రాముడికి బదులుగా అయోధ్యారాజ్యంలో ఉండి ఏలుకోగలదని పలికాడు. ఒకవేళ ఆమె అంగీకరించని యెడల అయోధ్యానగరమే ఆమె వెంట వెళ్లగలదని చెప్పిన పలుకులు అయోధ్యా నగరంలో ఆమెకు గల గౌరవాదరాలు విదితమవుతున్నవి. అరణ్యానికి బయలుదేరి వెళ్తున్న సీతారాములను చూచి అయోధ్యానగరమే దుఃఖిస్తుంది. కన్నీళ్ళుమున్నీళ్ళుగ శోకిస్తున్న పురజనులు సీతను గూర్చి

 

 

“కృతకృత్యాహి వైదేహీ ఛాయేవనుగతాఫలమ్

నజహాతిరతాధర్మీ మేరుమర్కప్రభాయథా”  అంటారు.

 

ధర్మచారిణి సీత అదృష్టవంతురాలు. మేరువును  విడిచి సూర్యకాంతి ఉండనట్లు శ్రీరాముడి ఎడబాయని జానకి ధన్యచరిత అంటూ ప్రశంసించారు. ఇలాంటి కూతురు మరి కులముధ్ధరించదా?పశ్చాతప్త అయి బాధపడిన తీరు  పరికిస్తే మానవ నైజానికి జానకి అతిసన్నిహితంగానే ప్రవర్తించినది.  హనుమంతుడితో లంక నుంచి “జనకుని వర్తమానాలు పంపుతో బంగరులేడి విషయంలో మరదిని నిందించినందుకు ఏఫలితం అందుకుందో వివరించినది.

 

“జనకుని భంగి రామనృపచంద్రుని నన్నును తల్లిమారు మదినెంచిన. . . .

నామాటలు మదినుంచక నామానము గావుమనుచు నయవినయ గుణోద్దామ. . . ”

 

అంటూ ఖేదపడినది. పుణ్యశీలుడైన మరదిని నిందించిన ఫలితం అనుభవిస్తున్నానని చెప్పమంటుంది. ఆవినుత మహాఫలము తాను అనుభవించితినని వర్తమానము పంపుతుంది. మానవ మనస్తత్వాన్ని చక్కగ నిరూపించాడు. ఆవేశం తగ్గిన తర్వాత తన తప్పు తాను తెలుసుకుని వేదనపడతాడు జీవుడు.

 

“కులం తారయతే తాతసప్త సప్తచ సప్తచ”అనే స్మృతివాక్యాన్ని జానకీ జీవితంలో ఋజువుచేసుకున్నది. “పతిభక్తి పరాసాధ్వీ శాంతా సా సత్యభాషిణి”

అనేమాటలు కూడా  మైథిలికి నూరుశాతం వర్తిస్తాయి. శీలవతియగు పుత్రిక వల్ల కులం ఇరువది ఒక్క తరాలవరకు ఉధ్ధరింపబడుతుందట. ధర్మగ్లాని కలుగకుండ ఆమె చరిత్రను నడిపించాడు వాల్మీకి. మొల్ల సూచన చేసినది. ఆయా సందర్భాలలో పతినెదిరించినది. కరణేషు మంత్రి అనే భావాలను ఋజువు చేసుకున్నది.

 

“రామస్యదయితా భార్యా నిత్యం ప్రాణసమాహితా

సీతాప్యనుగతా రామ శశినం రోహిణీ యథా”(వా. రా. బా. 1-26-27)

చీకటి వెలుగులరేడు చంద్రుడు అలాంటిదే మానవజీవనం. కష్టసుఖాల్లో ఎవరువిడిచిపెట్టినా భార్యాభర్తలు ఒకరినిఒకరు విడిచి ఒకరుండకూడదనే భావం.

 

అడవికి బయలుదేరేముందు రాముడు,తనదీక్ష పూర్తిచేసుకుని తిరిగి అయోథ్యకు రాగలనని సీతతో పలికాడు. అంతదాక అత్తమామలను సేవించుకోమంటాడు. ఆమాటలకు జానకి మనస్సున ఏదో పెద్దబాధ. వెంటనే “కిమిదం భాషసే రామవాక్యలఘుతయాధ్రువమ్’(వా. రా. అ. 27-2)రామా!ఏంమాట్లాడుతున్నావు నాకు నవ్వు పుట్టిస్తున్నాయి. సహధరమచరీతవ అనిన నాతండ్రి మాటలు మరచావా?నీతోకలసి అడవులలో చరించడం నా ధర్మం. కొనిపోవుట నీధర్మం. దాంపత్యబంధాన్ని మరచి మాట్లాడకు. ఇరువంశాలకు కీర్తిదాయకం అవుతుంది. భర్తకు దూరమైన భార్యను లోకం నిందిస్తుంది. నీకొకధర్మం నాకొక ధర్మమా?నిన్ను అడవికి వెళ్లమంటే నన్నుకూడా అనే గదా అర్థం. శుభాశుభాలన్నింట సగభాగం భార్యదే గదా!అదే అర్థనారీశ్వరత్వం. “నస్త్రీకో ధర్మమాచరేత్”అనిగదా సూక్తి. ఉత్తమ స్త్రీకి పతియే సర్వస్వం. అతడి యోగక్షేమాల తర్వాతనే ఇతరులు. భర్తతోసమానమైన వాళ్ళు స్త్రీకి ఇతరులెవరూ లేరు. ’ఇహప్రేత్యచనారీణాం పతిరేకోగతిస్సదా”(వా. రా. అయోధ్య. 27) 5)సాధువర్తనం,స్వతంత్ర భావనాబలం,ధర్మైక నిష్ఠ,శాస్త్రార్ధప్రకటన చేసి వలదన్న రాముణ్ణి ఒప్పించినది. పాఠకలోకం నొచ్చుకునేటట్టు మాట్లాడినది అనుకోవచ్చు. మాట్లాడించినవాడు వాల్మీకి. అవసరవేళలో ధీరయై బ్రతకాలి గదా స్త్రీ అనేగదా, శ్రీకట్టమంచి రామలింగారెడ్డిగారన్నట్లు చురుకుతనం లేనిది ఉత్తపేలపిండి వంటిది గాదు. అవసరమున్న చోట గట్టిగా చురకలు అంటించగల నేర్పరి అని రామకథ వెల్లడి చేస్తూనే వున్నది. “అర్థోవాయేష ఆత్మనోయత్పతీ”అనే శ్రుతివాక్యం తెలిసినది. “భద్రంతేపాణిమ్ గృహ్ణీష్వపాణినా . . . “అనే తనతండ్రిమాటలనెప్పుడు మరవనిది. “భోగభాగ్యాలను వదలి కంటకశిలలను ఏ స్త్రీ ప్రేమిస్తుంది?

 

ఈ త్యాగశీలం ఇక్ష్వాకులలో అనువంశికంగా ఉన్నదేనేమో!అని అనుకోవలిసినదే. “ప్రజాయై గృహ మేథులు,త్యాగాయ సంభృతార్దులునైన రఘువంశం లొని మహా పురుషులను,మహిళలను తలపించే ఈమెప్రవర్తన మిక్కిలి ప్రశంసాపాత్రం”అంటారు శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతంమ్మ. ఆమెరచన ఆదర్శ రామరాజ్యంలో (శాంతి పుట 715)కథానాయికా నాయకుల్నే గాదు ఇతరపాత్రలలో కూడా  చాలవరకు ఎదుటివాళ్ళ సుఖాలకే జీవితాన్ని పణంగా పెట్టారనవచ్చు. సహాయసహకారాలు చేయగలిగారు. ’ప్రజానాంహితేరతులే’అందరు. కష్టసుఖాదిద్వందాల్లో సహకారం,పవిత్రప్రణయభావాలు ప్రతి భారతీయుడు అంతేనా,భారతేతరులు కూడా  మరువరానివి.

 

ముల్లోకాలలోని భాగ్యాలిచ్చినా వద్దు నీతోనే కలసి అరణ్యంలో వుంటానని ఎంత చెప్పినా పలుకు ఉలుకు లేని రాముది చిత్తవృత్తిని బాగా ఆకళింపు చేసుకుని మిక్కిలి గడుసుతనంతో పలుకుతుంది.

 

“సుఖంవనేని వత్స్యామి యథైవా భవనే పితుః

అచింతయంతేత్రీన్ లోకాన్ చింతమంతీ పతివ్రతమ్’(వా. రా. అయోధ్య 27-11)

 

స్త్రీలకు తల్లిదండ్రులు గాని,పుత్రులుగాని,సోదరులుగాని,కోడలుగాని భర్తతో సమానమైన

ఆనందాన్నీయలేరు. కొందరికీమాతలు సీతనొక బానిసగ రాముడికి అందించాడా ఏమి వాల్మీకి అనే దుర్భావన కలుగకమానదు. వాల్మీకి ముందే చెప్పాడు. ఒకరింకొకరికి బానిసలు గారు. సమానత్వమే  ఇక్కడ అని నిరూపించాడు.

 

రామాయణకాలం నాటికి ఏడుగడయైనవాడు భర్త అని కావ్యాలు నినదించాయి. మరి నేడు ఎవరివలన కూడా స్త్రీకి రక్షణ, గౌరవం, సుఖం, శాంతులు లేవని ప్రస్తుత యుగధర్మాలు చాటుకుంటున్నాయి. అధర్మశీలవృత్తం ప్రబలినకాలం గదా!మరి తీగ తెగిన వీణవలె,చక్రంలేని రథం వలె భర్తకు దూరమైన భార్య జీవితం రాణించదు. నూర్గురు పుత్రులున్నా భర్తవలన భార్యకు లభించే ఆనందం సుఖం దొరకదని కౌసల్యతో సీత పలికి అయోధ్య వదలి అడవికి బయలుదేరిన వీరధీతవనితగ చతురపాయ శాలినిగ విదితమవుతుంది.

 

“క్రియాణాం ఖలు ధర్మాణాం సపత్నోమూలకారణమ్మని” కాళిదాసు మహాకవి అన్నట్లు సహధర్మ చర్వీతమే సౌభాగ్యహేతువు. అగస్త్యాశ్రమానికి సీతారామాదులు వెళ్ళినప్పుడు కష్టాల్లో విడువక భర్తను అనుగమించిన సీతను చూచి నీ భార్య నిన్నిట్లు అనుసరించి రావడం నీ అదృష్టానికి పరాకాష్ఠ అంటూ ప్రశంసించాడు (వా. రా. అరణ్య 13-5,6). అంతేకాదు గరుడవాయు వేగాలను మించిన చంచలచిత్త్తం గలవాళ్ళు స్త్రీలు.  కాని ఈ జానకిలో అలాంటి దోషం లేదు. అసాధారణస్త్రీమూర్తియైన జానకిని నీవు భద్రంగా,ఆదరంగా చూచుకొమ్మని హెచ్చరించాడు. అసాధారణపదం వల్ల ఆమె మానవమాత్రురాలు గాదని రాబోయే కాలంలో ఎదురయ్యే ఉపద్రవాన్ని మహర్షి సూచనగా చెప్పినట్లున్నాయి ఈ మాటలు ’అనుకూలాం,విమలాం,కులజాం,కుశలాం,సుశీల సంపన్నాం, పంచలకారాం భార్యాం పురుష పుణ్యోదయాల్లభతే”అనే ఆర్యజనుల సూక్తికి పుంసాం మోహనరూపుడైన రాముడి జీవితం ఆలంబనం అయినదట. 

 

రామాయణ కావ్యానికే హృదయం సుందరకాండ. మొల్ల కూడా  అంత ప్రాధాన్యమినిచ్చి వ్రాసినది. వైదేహి హృదయ సౌమనస్యానికి జానకి కుశాగ్రబుద్ధికి నిశిత పరిశీలనా వైదగ్ధ్యానికి,సంభాషణా చాతుర్యానికి, ధీరత్వానికి,పాతివ్రత్యానికి పరాకాష్ఠ. సీతాదేవి చరితకు మణిదీపాలవంటి పద్యాలు కూర్చినది మొల్ల. ఆమె చసిత్రను సజీవ శిల్పసౌందర్యంగా మలచినది. లంకాధిపతి మాటలలోని నీచత్వాన్ని ఖండించే పట్టుల మైథిలీ మానసం స్ఫటికం కంటె తెల్లన. మొల్ల కవితాశక్తి కూడా  ద్యోతకం అవుతుంది.

 

స్త్రీసహజచిత్త వృత్తుల్ని “దీవించుడు మునియేయని భావింపుచు జేరవచ్చు భామినినపుడా. . . ” ఇత్యాదివర్ణనలో చూపినది. సమయస్ఫూర్తితో ఋష్యమూకంపై నగలు జారవిడిచినది. రాముడికి తనజాడ ఎవరిద్వారానైగా తెలిస్తే రక్షించగలడనే భావన. నియతకులోచితమైన సత్స్వభావమే శీలం “శీలం స్వభావే సద్వృత్తే” ఆత్మజ్ఞాన తేజోవిలసిత మూర్తి సీత. కామాంధకార ఉన్మత్తుడు రావణుడు. తేజం వున్నచోట చీకటి వుండదుగదా!

 

ఈజ్ఞాన దీపానికి ఆ కామాంధుడు దరికి కూడా  రాలేకపోయాడు. వేలమంది వెంటబడి వరించారు. వేలమందిని తాను చెరబట్టాడు. ఈ సీత ఒక లెక్కలోనిదా అనుకుంటాడు. అందం,ఐశ్వర్యం అనే మదంతో కూడిన అహంకారి. చివరకు భంగపాటే మిగిలినది. అతడి ప్రలోభాలన్ని అగ్నిలోపడిన మిడుత దండుగా చెప్పాలి. మొల్ల స్త్రీ హృదయం ఈ సందర్భంలో అపురూపంగా భాసించినది. ఆచంద్రార్కకీర్తిని ఆర్జించుకున్నది. విచక్షణాశీలంతో నయవినయ వాక్కులకు లొంగనినాడు ప్రతీకార బుధ్ధితో ప్రవర్తిస్తుంది సీత. వాల్మీకి కూడా  సీతమ్మనే ముద్దుగ తీర్చిదిద్దాడు. జనకుడు మిథిలాయాం

ప్రదగ్ధాయాం సమీకించిత్ ప్రదహ్యతే . . . “అని పలికినా,తన కూతురి వలన యశోధనమే చాల గొప్పదిగ భావించాడు. ఆ ధర్మ సతీధర్మాలు స్థాపించి ఆ చంద్రార్క కీర్తికాంత అయినది తన కూతురు.

 

సీతమ్మను గూర్చి “పూర్వాపర సాహిత్యాలను పరిశీలించినప్పుడు మరియొక సీత సాక్షాత్కరించదని అట్టి దివ్యసాధ్వి మహాకవి లేఖిని నుండి ఒక్కమారే ఉదయించినదని స్వామి వివేకానందుడు గొప్పగా ప్రశంచించాడు. సర్వకాలాలకు సీత మాత్రం ఒక్కతే. తనను ప్రలోభపెట్టిన రావణుడితో మాట్లాడటమే పాపంగా యెంచి ఒక గడ్డిపరకను అడ్డుగా పెట్టి సంభాషించినట్లు మొల్ల చెప్పిన తీరు అపూర్వం. ఎంతటి సంపన్నుడివైనా నా రాముడితో పోల్చిన నీవు గడ్దిపరక వంటివాడవని చేతలతోనే నిరూపించిన ప్రజ్ఞాధురీణ సీత. శౌర్యవంతుడు తనను తాను పొగడుకోదని పరస్త్రీని దొంగలించడని అతడిని తృణప్రాయంగా తూలనాడుతుంది.

 

ఆంజనేయుడు సీతను చూచి లంకలో తనను రాముడి బంటుగా పరిచయం చేసుకుంటాడు. రాక్షసమాయలచే వేగిపొయి వున్నందున విశ్వసించదు. శ్రీరాముడి గుణగానం చేయమంటుంది. అతడి నిజస్వరూపం చూచిన తర్వాతనే శిరోరత్నాన్నిచ్చి అంగుళీయకాన్ని గ్రహించినది. ప్రత్యుపకారబుధ్ధితో హనుమను రక్షించాలని అగ్నిని వేడుకుంటుంది. ప్రాణాన్ని లెక్కచేయక శీలసంరక్షణ చేసుకుంటూ ప్రతీకార దీక్షతో కుండలినీయోగంలో అశోకవనిలో గడిపినది. హనుమతో తాను లంకను వీడివెళ్లడం లోకం మెచ్చదని దెలిపి శ్రీరాముడు రావణసంహారంతో చెరవిడిపించడమే తగిన విధం అంటూ పలికిన సీత లౌకికజ్ఞాని. సాధారణంగా లోకంలో ఆత్మస్తుతి,పరనింద చేస్తుంటారు. కాని ఈమె ఆత్మనింద పరస్తుతి చేయగలిగినది. క్షమాగుణంలో అపకారాలు చేసిన వాళ్లను మన్నించినది. ఏజన్మలోనో చేసిన పాపాలకు ఫలితం అనుభవిస్తున్నానని భావిస్తుందేగాని ఎవరిని తూలనాడలేదు. పెల్లుబికిన బాధలో కైకమ్మనేమైనా అనినా అది మానవమానసిక బలహీనతకు ఉదాహరణగా చెప్పవచ్చు.

 

ఎవరెలా అనుకున్నా వసుంధరపై కేవలం అయిదుగురు భారతీయులే మిగిలినా,వాళ్లుపామరులైనా పండితులైనా అ కంఠాలలో సీతాదేవి చరిత్రమాత్రమే నినదిస్తుంటుంది అనిన వివేకానంద స్వామీజీ ఎంత గొప్పగా ఆమెను కొనియాడాడో చూడండి. ఈ జాతిమీద ఆ మహాసాధ్వి చరిత్రకు గల ప్రభావం అలాంటిది. జానకితో పోల్చదగిన స్త్రీలు గాని,రాముడి వంటి పురుషుడుగాని లేరు. క్షమయే సీత సీతయే క్షమ,మైథిలీ అన్వర్థ నామధేయ. పుడమిపుత్రిగా  మిథిలవాసిగా కూడా  ఆమె సార్థకత సంపాదించినది. ఈపావని జగదారాధ్య “త్వంమాతా సర్వభూతానామ్” అని పరాశరుడన్నట్లు జగదేకమాత. పవిత్రమూర్తియైన స్త్రీ అగ్నితుల్యయని ఆమెను సమీపించినవాడు మిడతవలె బూడిద కాగలడని పౌరాణికస్త్రీమూర్తులెందరో నిరూపించుకున్నారు. కలకంఠి కంటకన్నీరొలికితే ఏమౌతుందో చరిత్రలు నిరూపించాయి. ఎందుకాంతలవమానింపబడుదురో వారి కార్యాలన్ని ఫలశూన్యాలు.  స్త్రీలు ఎవ్వరియెడ దుఃఖిస్తారో వారికి వంశం ఉండదట. కాంతా శప్తాలైన గేహాలు శక్తిచే నశింపబడి లక్ష్మీశూన్యాలై వృధ్ధిపొందలేవని భారత గ్రంథకర్త చెప్పినట్లు,ఈ అయోధ్యాపురంధ్రి,మహాసాధ్వి,ఆదర్సమహిళా,సతీమతల్లి జీవితచరిత్ర చక్కగా నిరూపించినది. (లంకారాజ్యమే దీనికి తార్కాణం). 

 

“యావత్ స్థాస్యంతిగిరయస్సరితశ్చమహీతలే

తావత్ సీతా చరితమ్ వైలోకేషు ప్రచరిష్యతి”

 

ప్రకృతి నిలిచివున్నంతకాలం “రామా’చరిత్ర మార్ర్మోగుతుంటుంది. పుణ్యభూమి భరతఖండం యొక్క ఔన్నత్యాన్ని దశదిశల వెదజల్లుతూనే వుంటుంది. ఇన్నిమాటలెందుకు ఆదర్శసతి సీతా జీవితచరిత్రయే స్త్రీలకు గీతామృతసారం.

3 thoughts on “ఆదర్శసతి సీత

  1. వాల్మీకి రామాయణం రచిస్తూ “సీతాయాః చరితం మహత్” అని చెప్పినట్లుగా విన్నాను. రామాయణం ను “రామస్య అయనం” గానూ, “రామాయాః అయనం” గానూ కూడా చెప్పవచ్చు. ఆ విధంగా చూస్తే, రామాయణమంతా “సీతాయాః చరితం మహత్” అనటమే ఉచితమేమో.

    ఇక మరొకటి, ఆంజనేయునితో మాట్లాడటం అంటే సామాన్యం కాదు. రాముడే స్వయంగా లక్ష్మణుని సావధానపరచినట్లుగా ఉంటుంది – “నా ఋగ్వేద వినీతస్య…” శ్లోకం. అంతటి హనుమతో సమానంగా మాట్లాడింది సుందరకాండలో. హనుమ నొచ్చుకునే సందర్భాన్ని గమనించి, అతన్ని చక్కటి మాటలతో సమాధానపరచింది కూడా – అదీ ఆవిడ దాదాపుగా ఒక సంవత్సర కాలంగా బందీగా ఉండి, దుఃఖంలో మునిగి ఉండి. గొప్ప మానసిక శాస్త్రవేత్త.

    ఇక ధైర్యం – రావణునిచే అపహరింపబడి, వాడి రాజ్యంలో, వాడి వారి ముందు, వాడిని మొహం మీద “శునక సమాన ప్రవర్తన” కలవాడని గుర్తు చేస్తుంది. ఆ రావణ సంవాదమే అమ్మ గొప్పదనానికి పరాకాష్ఠ. “Kidnap” కి గురైన వాళ్ళు మగవాళ్ళైనా – ఎంతమంది అలా మాట్లాడగలరు?

    మీ వ్యాసం చాలా బాగుంది. కానీ, కొద్దిగా నిర్మాణక్రమం ని సవరించవచ్చేమో. సద్విమర్శగా స్వీకరింప ప్రార్ధన.

  2. “మధ్య అరసున్నా ఉండాలి”
    “వెర్రినై అన్నపుడు బండిరా ఉండాలి”
    “(ఇక్కడ బు ఈ రుషి ఉండాలి)”

    ఇటువంటివి వ్యాసంలో చాలా ఉన్నాయి. రచయిత్రిగారు సంపాదకులకు సూచనగా వ్రాసినట్లునారు. వాటిని సరిచేయండి!

    –శాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *