April 19, 2024

సంపాదకీయం: బంధాలు అనుబంధాలు

(ఈసారి సంపాదకీయాన్ని మనకందిస్తున్నది జ్యోతి వలబోజు) 
భార్య.. భర్త
తల్లితండ్రులు.. పిల్లలు
కొడుకులు.. కోడళ్లు
కూతుళ్లు… అల్లుళ్లూ
అత్తలు.. మామలు
పిన్ని.. బాబాయ్

ఇలా ఎన్నో బంధాలు అనుబంధాలు… అందరి మధ్య రక్తసంబంధంతో కూడిన ప్రేమ, అనురాగం, గౌరవం, మమకారం కనిపిస్తుంది. నీది నాది అని కాకుండా మనది అనే అందమైన ఆప్యాయతతో కూడిన భావన అందరికీ ఉంది. కాని ఇది ఒకప్పటి మాట అని అందరూ ఒప్పుకునే చేదు నిజం. ఈ రోజు ఈ అనుబంధాలన్నింటిలో ఎన్నో పరిమితులు, వలయాలు, పొరలు, ఆత్మవంచనలు, స్వార్ధాలు, మోసాలు చోటు చేసుకున్నాయి.

ఒకప్పుడు భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఒకరికోసం ఒకరు అన్నట్టుగా  కుటుంబ శ్రేయస్సు కోసమే కలిసి కష్టపడేవారు. ఎంత పెద్ద ఉమ్మడి కుటుంబమైనా అందరినీ ప్రేమగా చూసుకుంటూ బాధ్యతలను సమంగా పంచుకుని  అందరినీ ఒక్క త్రాటిపై నడిపించేవారు. కాని నేటి ఆధునిక యుగంలో ఈ బంధాలు అనుబంధాలకు గల అర్ధాలు మారిపోతున్నాయి.  బిజీ లైఫ్ మనిషి జీవితంలో అనూహ్యమైన మార్పులను తెస్తుంది. భార్యాభర్తలు, అన్నదమ్ములు, పిల్లలు అందరూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా జీవిస్తున్నారు. దబ్బు సంపాదనపైనే అందరి దృష్టి. మానవ సంబంధాలను అంతగా పట్టించుకోవడం లేదు. ఎవరికి వారు తమకంటూ విడిగా బ్యాంక్ అకౌంట్లు, ఇళ్లు, వాహనాలు, వస్తువులు కొనుక్కుంటున్నారు. ఒక్క ఇంట్లో నీది నాది అని మాట్లాడుకుంటున్నారు ..ఇలాటి బిజీ లైఫ్‌లో పూర్తిగా మునిగిపోయిన తల్లితండ్రులు తమ పిల్లలను తల్లితండ్రులకో, అత్తామామలకో, పనిమనుషులు, క్రెష్‌కో అప్పగిస్తున్నారు. పెద్దవాళ్లైన తల్లితండ్రులను వృద్ధాశ్రామాలకు పంపేస్తున్నారు.  దీంతో తల్లితండ్రులకు పిల్లలకు మధ్య సహజంగా ఉండాల్సిన అనుబంధం, ఆప్యాయతలు కొరవడుతున్నాయి.

 

మనం చెప్పుకోవలసిన మరో ముఖ్యమైన విషయం ఉంది. సమాచార, సాంకేతిక విప్లవం ఈ విశాల ప్రపంచాన్ని చిన్న గ్రామంలా మార్చేసింది. దేశవిదేశాల మధ్య సరిహద్దులను చెరిపేసి వేల మైళ్ల దూరాన ఉన్నవారిని కూడా నిమిషాల్లో కలుపేస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం వల్ల మానవ సంబంధాలు మెరుగైనట్లు కనిపించినా కుటుంబ సంబంధాలు మాత్రం దెబ్బ తింటున్నాయి అని కొందరంటున్నారు. కాని నిజజీవితంలో మనుష్యుల మధ్య దూరం పెరిగిపోతున్నది అన్న మాట మాత్రం వాస్తవమే. ఒకరి మాట ఒకరికి నచ్చదు. వారి ఉనికిని కూడా సహించరు. ఇంట్లో ఉన్న అత్తగారిని లెక్కచేయని కోడలు అమెరికా ఫ్రెండుతో రోజూ గంటల తరబడి ముచ్చట్లేస్తుంది. సమాజసేవలో ఎంతోమందిని చేరదీసి సేవా కార్యక్రమాలు చేసే అత్తగారికి కోడలంటే చిన్నచూపు. చాలామంది కొత్తవారితో స్నేహం పెంచుకోవడానికి చూపే ఆసక్తి, ఉత్సాహం , ఉన్న సంబంధ బాంధవ్యాలు మెరుగు పరుచుకోవడానికి ప్రయత్నించడం లేదు. నిత్యం కలుసుకునే వ్యక్తులు, స్నేహితులు, రక్తసంబంధీకుల మధ్య ఉండే కమ్యూనికేషన్ గ్యాప్ ఇంటర్‌నెట్‌లో కలిసిన వ్యక్తుల మధ్య ఉండడం లేదు. ఆ వ్యక్తులు కేవలం మాటలు, రాతల ద్వారానే పరిచయం. వాళ్లు  ప్రత్యక్షంగా కూడా కలిసింది ఉండదు. అయినా వారి మధ్య ఎంతో నమ్మకం, ఆత్మీయత. ప్రతీ బంధం ఇలాగే ఉండాలని లేదు. ప్రేమ నమ్మకం, ద్వేషం, మోసం అనేవి వాస్తవ ప్రపంచం, మిధ్యా ప్రపంచం రెండింటిలో సమానంగా ఉన్నాయి.

 

అందరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒకేలా ఉండవు. నిజజీవితంలో ఈ పరస్పర విభేదంతో కలతలు, కలహాలు మొదలవుతాయి. కాని నెట్ ద్వారా పరిచయమైన వ్యక్తులలో ఒకే విధమైన అభిప్రాయాలు , ఆలోచనలు ఉన్నవారు దగ్గరవుతారు. అందుకే వారి మధ్య ఎటువంటి భేదాభిప్రాయం, గొడవలు ఉండవేమో. మానవ జీవితాలు ఆనందంగా సుఖమయంగా ఉండడానికే ఎన్నో అనుబంధాలు ఏర్పడతాయి. ఈ సమాజంలో మన చుట్టూ ఉన్న ప్రతీ ఒక్కరి అవసరం ఎప్పుడో ఒకప్పుడు మనకు కలుగుతుంది. అందుకే సమాజంలో అందరినీ కలుపుకుని ఎటువంటి భేషజాలు, మోసలు, ద్వేషాలు లేకుండా ఉండాలి.  భిన్నమైన వైరుధ్యాలు, దృక్పధాలు గల మనుష్యుల మధ్య కలిసి బ్రతకడానికి స్నేహంగా ఉంటూ అందరినీ గౌరవించడం అలవర్చుకోవాలి. ఈ మానవ సంబంధాలు మెరుగు పరుచుకోవడానికి ముందు కుటుంబం నుండే ప్రయత్నాలు మొదలు పెట్టాలి. అత్తలో తల్లిని, కోడలిలో కూతురును, ఆడపడుచు, తోటికోడలిలో సోదరిని చూసుకోగలగాలి. తాత్కాలిక భోగాలైన ఆధిపత్యం, అధికారం, డబ్బు, హోదా, పలుకుబడి మొదలైనవాటిని గుర్తించి వాటిని పక్కనపెట్టి బందుత్వాలు, బాంధవ్యాలు గుర్తించాలి.  అప్పుడే అందరూ సంతోషంగా ఉండగలుగుతారు.

4 thoughts on “సంపాదకీయం: బంధాలు అనుబంధాలు

  1. నిజమే. అందరిదీ ఇదే అభిప్రాయం.. “మన” పోయి “నా”, “మా” అనుకునే రోజులు ఇవి. ఇదివరలో డిటాచ్డ్ బాత్ రూమ్స్, అటాచ్డ్ ఫామిలీస్. ఇప్పుడు అటాచ్డ్ బాత్ రూమ్స్..డిటాచ్డ్ ఫామిలీస్… కాదంటారా ? సృష్టిలో మార్పు అన్నది సహజం.. మనం తెలిసో తెలియకో కోరుకున్నదే ఈ మార్పు.. అపార్ట్ మెంట్ కల్చర్ పేరుచెప్పి సెపరేట్ మెంట్ పెరిగిపోతోంది… అవసరాలు పెరిగాయి. స్వార్థం పెరిగింది. నా చిన్ని బొజ్జకు శ్రీరామ రక్ష అనే తత్త్వం చిన్ని బుడతడుకూడా డెవలప్ చేసుకుంటున్నాడు… ఇప్పుడు పాత రోజులు తీసుకురాలేము.. తెచ్చినా మన ప్రస్తుత యాంత్రిక జీవనంలో అది డైజెస్ట్ కాదు..
    అందుకని వారానికొకసారైనా..పెద్దనగరాలలో వారైతే దూరంగా ఉన్న తనవాళ్ళని కలిసి గడపడానికి ప్రయత్నించాలి.. దూరంగా ఉన్న బంధుమిత్రులను ఉత్తరాల ద్వారా… టెలిపోనులు, మెయిల్స్ కాదండోయ్.. ఉత్తరాలద్వారా పలకరించుకోవాలి. సంవత్సరంలో ఒకసారైనా మనపిల్లలతో తాతగారిదగ్గరకో ,, మామయ్యలదగ్గరకో… బాబాయిలదగ్గరకో వెళ్ళాలి.. వారితో ఒకవారమైనా వారికి భారం కాని పద్ధతిలో గడపాలి.. ఓ సారి మనం ఓ సారి వాళ్ళూ అన్నరీతిలో కార్యక్రమం పెట్టుకోవాలి..మన గవర్నర్ నరసింహన్ గారంటారు.. రోజూ ఒకసారి భార్యాభర్తలు ఇద్దరూ కనీసం వీధి చివరికైనా వెళ్ళాలని.. అది చక్కటి ప్రయత్నం..
    ఇప్పుడు డబ్బు ఇబ్బందులు చాలామందికి ఇదివరకటంతగాలేవు.. దానివలన సుఖపడుతున్నామనుకుంటున్నాము. సుఖపడుతున్నామా? కాని పిల్లలకు డబ్బు విలువ తెలుస్తున్నదా.. ఎంతసేపూ ఏ రెస్టారెంట్ కు వెళ్దాం, ఏ సినీమా చూద్దాం ? ఇదేకదా? అన్నీ కాస్ట్లీగా ఉండాలి.. బట్టలదగ్గరనుంచి వారిదే సెలక్షన్…తండ్రి మారుతీ 800 డొక్కు మాడల్. అందుకని ఇంటర్నెట్ లో చూసి చెప్తాడు.. ఆ కారు కనీసం పది పదిహేను లక్షలు ఉండాలి.. అవసరమా…? పిల్లలకు పొదుపు నేర్పండి.. వారి భవిష్యత్ లో ఏ ఒడుదుడుకులైనా ఎదుర్కోగలుగుతారు…
    ఏమైనా సంపాదకీయం ఆలోచనాత్మకంగా ఉంది… అందుకే ఈ ఆలోచనలు మీతో పంచుకోవాలనిపించింది.. చక్కగా వ్రాసిన జ్యోతిగార్కి శుభాబినందనలు.

    +1

  2. నిజమే. అందరిదీ ఇదే అభిప్రాయం.. “మన” పోయి “నా”, “మా” అనుకునే రోజులు ఇవి. ఇదివరలో డిటాచ్డ్ బాత్ రూమ్స్, అటాచ్డ్ ఫామిలీస్. ఇప్పుడు అటాచ్డ్ బాత్ రూమ్స్..డిటాచ్డ్ ఫామిలీస్… కాదంటారా ? సృష్టిలో మార్పు అన్నది సహజం.. మనం తెలిసో తెలియకో కోరుకున్నదే ఈ మార్పు.. అపార్ట్ మెంట్ కల్చర్ పేరుచెప్పి సెపరేట్ మెంట్ పెరిగిపోతోంది… అవసరాలు పెరిగాయి. స్వార్థం పెరిగింది. నా చిన్ని బొజ్జకు శ్రీరామ రక్ష అనే తత్త్వం చిన్ని బుడతడుకూడా డెవలప్ చేసుకుంటున్నాడు… ఇప్పుడు పాత రోజులు తీసుకురాలేము.. తెచ్చినా మన ప్రస్తుత యాంత్రిక జీవనంలో అది డైజెస్ట్ కాదు..
    అందుకని వారానికొకసారైనా..పెద్దనగరాలలో వారైతే దూరంగా ఉన్న తనవాళ్ళని కలిసి గడపడానికి ప్రయత్నించాలి.. దూరంగా ఉన్న బంధుమిత్రులను ఉత్తరాల ద్వారా… టెలిపోనులు, మెయిల్స్ కాదండోయ్.. ఉత్తరాలద్వారా పలకరించుకోవాలి. సంవత్సరంలో ఒకసారైనా మనపిల్లలతో తాతగారిదగ్గరకో ,, మామయ్యలదగ్గరకో… బాబాయిలదగ్గరకో వెళ్ళాలి.. వారితో ఒకవారమైనా వారికి భారం కాని పద్ధతిలో గడపాలి.. ఓ సారి మనం ఓ సారి వాళ్ళూ అన్నరీతిలో కార్యక్రమం పెట్టుకోవాలి..మన గవర్నర్ నరసింహన్ గారంటారు.. రోజూ ఒకసారి భార్యాభర్తలు ఇద్దరూ కనీసం వీధి చివరికైనా వెళ్ళాలని.. అది చక్కటి ప్రయత్నం..
    ఇప్పుడు డబ్బు ఇబ్బందులు చాలామందికి ఇదివరకటంతగాలేవు.. దానివలన సుఖపడుతున్నామనుకుంటున్నాము. సుఖపడుతున్నామా? కాని పిల్లలకు డబ్బు విలువ తెలుస్తున్నదా.. ఎంతసేపూ ఏ రెస్టారెంట్ కు వెళ్దాం, ఏ సినీమా చూద్దాం ? ఇదేకదా? అన్నీ కాస్ట్లీగా ఉండాలి.. బట్టలదగ్గరనుంచి వారిదే సెలక్షన్…తండ్రి మారుతీ 800 డొక్కు మాడల్. అందుకని ఇంటర్నెట్ లో చూసి చెప్తాడు.. ఆ కారు కనీసం పది పదిహేను లక్షలు ఉండాలి.. అవసరమా…? పిల్లలకు పొదుపు నేర్పండి.. వారి భవిష్యత్ లో ఏ ఒడుదుడుకులైనా ఎదుర్కోగలుగుతారు…
    ఏమైనా సంపాదకీయం ఆలోచనాత్మకంగా ఉంది… అందుకే ఈ ఆలోచనలు మీతో పంచుకోవాలనిపించింది.. చక్కగా వ్రాసిన జ్యోతిగార్కి శుభాబినందనలు.

  3. అవును జ్యొతి గారు…బందాలు మెరుగు పరుచుకొటానికి ప్రతి ఒక్కరు
    క్రుషి చెయాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *