April 20, 2024

మనం మరచిన మన మహాకవి డాక్టర్‌ ఉమర్‌ అలీ షా

 

 

 రచన : సయ్యద్ నసీర్ అహ్మద్

మౌల్వీ ఉమర్‌ అలీషా మాతృభాష తెలుగు కాదు. తెలుగులో అద్భుత సాహిత్య సంపదలను సృజియించి మహాకవిగా  ఆయన ఖ్యాతిగాంచారు. స్వాతంత్య్ర సమరయోధునిగా జాతీయోద్యమంలో ఆవిశ్రాంతంగా పాల్గొన్నారు. భారత శాసన సభలో ప్రజాప్రతినిధిగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. అభ్యుదయ రచయితగా, ప్రగతి పథ నిర్దేశకునిగా, మంచి వక్తగా, మానవతావాద ప్రవక్తగా ఉమర్‌ అలీషా గణుతికెక్కారు.  అజ్ఞానం, మూఢనమ్మకాలు, పేదరికం, బానిసత్వం, అవిద్య లాంటి  సాంఘిక రుగ్మతలతో కొట్టుమిట్టాడుతున్న సమాజాన్ని సంస్కరించేందుకు అనన్యసామాన్య”మైన కృషి సాగించి ధన్యులైన తెలుగు గడ్డకు చెందిన మొదటి వరుస కవులు, రచయితల వరుసలో ఉమర్‌ అలీషాది విశిష్ట స్థానం.

 

సమాజ గతిని మార్చి మానవుల్లో మానవతా గుణాలను మరింతగా వికసింపచేయాలన్న లక్ష్యంతో అక్షరాన్ని అయుధంగా ఎందచుని శరపరంపరగా సాహిత్య సంపద సృష్టించిన ఈ ముస్లిం కవికి తెలుగు సాహిత్య చరిత్ర పుటలలో తగినంత స్థానం లభించలేదు. తెలుగులో రాసిన కవుల చరిత్రలను గ్రంథంస్తం చేసిన మహా రచయితలు, మహామహా పరిశోధకులు కూడా డాక్టర్‌ ఉమర్‌ అలీషాను మరచిపోవడమో లేకపోతే ఒకటి రెండు వాక్యాతలో ఆయన పరిచయవాక్యాలను సరిపెట్టడమో చేశారు. బహుభాషాకోవిదుడైన ఆయన రాసిన గ్రంథాలలో ఇప్పటికి కూడా ఎన్నో గ్రంథాలు అందుబాటులో ఉన్నా, ఆయన సృజనాత్మకతను  వెల్లడి చేస్తున్న వ్యాసాలు, పరిచయాలు ఆంధ్ర పత్రిక, భారతి లాంటి పత్రికలలో నిక్షిప్తం మైఉన్నా  ఆంధ్ర సాహిత్య చరిత్రను రచించిన మన పరిశోధకులకు డాక్టర్‌ ఉమర్‌ అలీషా కన్పించకపోవడం విచిత్రం. తెలుగు సాహిత్యంలోని ప్రతి ప్రక్రియను ఎంతో గొప్పగా పరామర్శించి ఆయన ప్రక్రియలలో అలవోకగా సామిత్య సృష్టి చేసి సుమారు వందకు పైగా గ్రంథాలను వెలువరించిన కవి-రచయితగా తెలుగు సాహిత్య ప్రపంచంలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న డాక్టర్‌ ఉమర్‌అలీషా సాహిత్య చరిత్రలను సృష్టించిన పరిశోధకులకు ఎలా అందకుండపోయారో అర్థం కాని విషయం.

 

మౌల్వీ ఉమర్‌ అలీషా పూర్వీకులు శతాబ్దాల క్రితం పర్షియా (ఇరాన్‌) నుండి ఢిల్లీ వచ్చి, అటునుండి హైదరాబాద్‌ చేరి, చివరకు పీఠాపురంలో స్థిరపడ్డారు. ఈ విషయాన్ని  ఉమర్‌ అలీషా ఈ విధంగా తన ఒక గ్రంథంలో  ప్రకటించారు.

 

”… … … మహా ప్రభాత

గరిమగాంచిన మా వంశమరయ పార

సీకమును బాసి ఢిల్లీకి చేరి హైద్ర

బాదు నుండి పిఠాపురి వచ్చి నిలచె ”

 

డాక్టర్‌ ఉమర్‌ అలీషా 1885 ఫిబ్రవరి 28న, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించారు. తండ్రి మౌల్వీ మొహిద్దీన్‌ బాద్షా. తల్లి పేరు చాంద్‌బీబి. సాహిత్య, సారస్వత, ధార్మిక సేవా కార్యక్రమాలలో తల్లితండ్రులు నిమగ్నమైయున్న ప్రత్యేక వాతావరణం నడుమ జన్మించిన ఉమర్‌ అలీషా ఎనిమిదవ ఏటనే అశువుగా కవిత్వం చెప్పి పండితులను, గురువులను అక్టుకున్నారు. పిఠాపురంలోని ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన తరువాత ప్రముఖ సంస్కృతాంధ్ర భాషా పండితుల వద్ద ఆయన శిష్యరికం చేశారు. తెలుగు, సంస్కృత భాషలతో మంచి ప్రావీణ్యత సంపాదిచిన ఆయన అరబ్బీ, పర్షియన్‌, ఉర్దూ భాషలను కూడా నేర్చుకున్నారు.

 

ఉమర్‌ అలీషా తన  పద్నాల్గవ ఏట నుండి చంధోబద్ధంగా చక్కని తెలుగులో పద్యాలు రాయటం, ధారాళంగా కవిత్వం చెప్పటం ప్రారంభించి, తమ వంశ గురువైన శ్రీ అఖైలలీషాను స్తుతిస్తూ, ” బ్రహ్మవిద్యా విలాసం ” అను శతకాన్ని రచించారు. ఆతరువాత పద్దెనిమిదవ ఏట నాటకాలు రాయటం ఆరంభించిన ఆయన 1905 ప్రాంతంలో గద్య, పద్యాత్మకమైన ” మణిమాల ” నాటకాన్ని రాసారు. ఆ క్రమంలో  అసమాన ప్రతిభను చూపుతూ  తెలుగు సాహిత్యంలోని అన్ని సాహితీ ప్రక్రియలలో అపూర్వమైన సారస్వత సంపదను సృష్టించారు.  ఈ విషయాలను ఆయన స్వయంగా ఒక పద్యంలో  ఈ విధంగా  సృష్టీకరించారు.

 

” రచియించినాడ విభ్రాజితదివ్య ప్ర

బంధముల్‌ పది కావ్య బంధములుగ

వ్రాసినాడను కల్పనాసక్త మతిపది

నాటకంబులను కర్నాటఫక్కి

కూర్పినాడను కళాకోవిదుల్‌ కొనియాడ

నవలలు పది నవ నవలల లనగ

తెలిగించినాడ సుద్ధీపితాఖండ పా

రసికావ్యములు పది రసికులలర

రసము పెంపార నవధానక్రమములందు

ఆశువులయందు పాటలయందు కవిత

చెప్పినాడ నుపన్యాస సీమలెక్కి

యవని ”ఉమ్రాలిషాకవి” యనగ నేను.”

 

ఈ విధంగా రచనా వ్యాసంగంలో పూర్తిగా నిమగ్నమైన ఉమర్‌ అలీషా మొత్తం విూద 50 పుస్తకాలు రాశారు. 1926-28లలో ఉమర్‌ అలీషా తెలుగులోకి అనువదించిన ప్రముఖ పారశీక కవి ఉమర్‌ ఖయ్యాం రుబాయీల విూద ‘ఉమర్‌ ఖయ్యాం రుబాయీల విూద అనుశీలన’ అను అంశం విూద 1980లో నాగార్జున విశ్వవిద్యాలయంలో సిద్దాంత వ్యాసం సమర్పించిన డాక్టర్‌ షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా (కడప)  ” అరవై ఎళ్ళల్లో దాదాపు 50 కృతులు…రచించార ” ని వెల్లడించారు.

 

ఈ విషయంలో కొంత భిన్నాభిప్రాయం ఉంది. డాక్టర్‌ ఉమర్‌ అలీషా మొత్తం 108 గ్రంథాలు రాశారని ఆయన విూద 1970 లో పరిశోధనా పత్రాన్ని సమర్పించిన  ఆంధ్ర విశ్వవిద్యాయలం హిందీ విభాగం ఆచార్యలు యస్‌.యం ఇక్బాల్‌ ప్రకటించినా ప్రస్తుతానికి ఆయన రాసిన గ్రంథాలలలో 23 గ్రంథాలు మాత్రమే లభ్యమౌతున్నాయి.

 

ఉమర్‌ అలీషా ఏ సాహితీ ప్రక్రియలో ఎటువంటి రచన చేసినా ప్రతి రచన ద్వారా  ఏదోక సామాజిక ప్రయోజనాన్ని ఆశించి, ఆ లక్ష్యసాధనా దృష్టితో ఆయన సాహితీ వ్యవసాయం సాగింది. జాతీయ భావం, సమానత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం, సర్వమత సమభావనలతో పాటుగా అంటరాని తనం, కుల వ్యవస్థ తదితర పలు సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా, మహిళాభ్యుదయాన్ని ప్రగాఢంగా వాంచిస్తూ,  ప్రజలలో ప్రధానంగా మహిళలలో చైతన్యాన్ని కాంక్షిస్తూ  రచనలు చేశారు.  బాల్య వివాహాలు, సతీ సహగమనం, కన్యాశుల్కం, వరకట్నం లాంటి దురాచారాలను తునుమాడాలన్నారు. స్త్రీ విద్యను ప్రోత్సహించారు. స్త్రీ విద్యకోసం, స్త్రీ గౌరవం కోసం స్త్రీలు స్వయంగా పాటుపడాలని తన గ్రంథాలలోని పాత్రల చేత, తన అభిమతాన్ని చాలా బలంగా చెప్పించారు.

 

మౌల్వీ ఉమర్‌ అలీసా  రాసిన ” కళ ” అను నాటకంలో  స్త్రీ స్వాతంత్య్రం గురించి చాలా స్పష్టంగా మాట్లాతూ లింగభేదం లేకుండా  అర్హతలు, యోగ్యతను బట్టి స్థానం కల్పించాలంటారు. ఆనాడు స్త్రీ విద్య మీద విధించబడియన్న ఆంక్షల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ‘ తరుణీ వివేకమన్‌ జదవ ధర్మము జ్ఞానముతత్వ దీక్షలన్‌-గురువుల చెంగటన్‌ బడయ గోరిన వారల మాన్పువారునూ-సూకరులై పుట్టు చుంద్రు..’ అని శపించారు.

 

సంసారిక జీవనంలో పడతులు పడుచున్న బాధల గాథలను గమనించిన ఆయన ”అనసూయ”  నాటకంలో దేవతాలోకం నుండి భూలోకం విచ్చేసిన ‘నర్మద’ పాత్ర చేత భర్తకు సేవలు చేయడం ద్వారా మాత్రమే భార్యకు స్వర్గం ప్రాప్తిస్తుందన్న ప్రచారాన్ని ఖండిస్తాస్తూ, స్త్రీ అబలకాదు సబలని, యాచన ద్వారా లభించే స్వర్గం తనకు అక్కరలేదని ప్రకటింప చేస్తాడు. నర్మద చేత ‘… నేను సర్వతంత్ర స్వతంత్రను గానా, నా యంతరాత్మ మహా తపశ్శక్తిచే మార్తాండ మండలమువల తేజో విరాజితమై ప్రదీపించుట లేదా!  నేను మహా వీరాధివీరులవలె స్వర్గ ద్వారము బ్రద్దలు చేసికొని వెళ్ళలేనా ? సరే! ఇంక నాకు యాచింపగ వచ్చెడు తుచ్చ స్వర్గము నా కాలి గోరునకైనా వలదు..”, అని ప్రకటింప చేస్తారు.

 

డాక్టర్‌ అలీషా  ”విచిత్ర బిల్హణీయం” నాటకంలో బాల్య వివాహాలను, కన్యాశుల్కం లాంటి దురాచారాలను ఖండిస్తూ, ఆనాటి విపత్కర పరిస్థితుల నుండి స్త్రీలే స్వయంగా విముక్తి పొందడానికి తీసుకోవాల్సిన చర్యలకు నాటకంలోని, యామిని పూర్ణ తిలక, బిల్హణీయుడు అను పాత్రల చేత సూచించారు. మహిళల  సమస్యలకు పరిష్కారానికి  స్త్రీలు చైతన్యవంతులు కావటమే మార్గం తప్ప సమాజానికి భయపడి భూమి తల్లి వడిలో చేరటం ఎంత మాత్రం కాదంటుంది. స్త్రీ లోకాన్ని చైతన్య వంతులను చేయాలంటే, స్త్రీలలో అక్షరాస్యత పెంచాలని, ఆ తరువాత లోకజ్ఞానం కోసం గ్రంథాలు, వార్తా పత్రికలు, చదవాలని ప్రకటిస్తుంది.  మహిళల సమస్యలకు ప్రధానంగా విద్యావిహీనత కారణంగా భావించిన యామిని పూర్ణ తిలక . ”.. మననారీ లోకంబున విద్య యొక్కటి కడు కొఱంతగానున్నది. అందేచేతనే యిన్ని దురాగతములు తటస్థించినవి …”  ప్రకటిస్తుంది.

 

ఈ నాటకంలోని మరో పాత్ర బిల్హణుడు పలు స్త్రీ జనసంక్షేమ కార్యక్రమాలను చేపడతాడు. ”… స్త్రీ విద్యలేని దేశమునకు క్షేమము రానేరాడు..” అంటూ  స్త్రీ విద్యకు అతడు అత్యంత ప్రాధాన్యతనిస్తాడు. స్త్రీ విద్యను ఆచరణాత్మకంగా సాధించేందుకు ప్రయత్నాలు ఆరంభిస్తాడు.అతడు యామిని పూర్ణతిలకతో కలసి  స్త్రీ విద్యావ్యాప్తి కోసం మహిళా విద్యాలయాలు, అనాథ శరణాలయాలు ప్రారంభించి మహిళాభ్యుదయానికి కృషి చేస్తాడు. ఈ దిశగా డాక్టర్‌ ఉమర్‌ అలీషా గ్రంథాలలోని  స్త్రీ జన బాంధవులు తమ కాలం కంటే చాలా ముందుగా ఆలోచిస్తూ, అదిశగా నిర్మాణాత్మక ఆలోచనలను సమాజం ఎదుట పెడతారు. ఈ క్రమంలో ఆరాధనాలయాల కంటే బాలికా పాఠశాలలు అత్యవసరం అంటారు. సత్రముల కంటే అనాథ శరణాలయాలు కావాలంటారు. వనాలు తటకాల కంటె మహిళలకు సర్వ విద్యలు గరిపె కళాశాలను స్థాపించాలని ఆ పాత్రల ద్వారా  మహిళల సమస్యలకు, మహిళలో చైతన్యాభివృద్ధికి ఉమర్‌ అలీషా  ఆచరణాత్మక పరిష్కారాన్ని సూచిస్తారు. ఆనాడు బాల్య వివాహాల వలన స్త్రీ జాతికి కలుగుతున్న కడగండ్లను వివరిస్తూ, ”.. కడు దరిద్రతచేత నిడుములు బడయవచ్చు బాలవైధవ్యంబు బడయరాదు – హాలాహలము ద్రావియగ్ని గూలగవచ్చు బాలుధ్యంబు పడయరాదు – దాస్య సజీవనము దగుల మొందగవచ్చు బాల వైధవ్యంబు పడయరాదు…” అని అంటారు.

 

స్త్రీ విద్య, బాల వైధవ్య బాధలు, కుటుంబ సమస్యల వరకు మాత్రమే ఆయన పరిమితం కాకుండా ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం, అగ్రహారాలను నిచ్చేకంటే ఒకవైపున దేశ సంపదను పెంచుతూ, పదిమంది ఆర్థిక ఉపాధిని కలిగించే యంత్ర కర్మాగారాలను స్థాపించాలని డాక్టర్‌ ఉమర్‌ అలీషా అంటారు. ఈ విషయాన్ని ఓ పద్యంలో ఈ విధంగా ప్రస్తావించారు. ”..ప్రథిత సత్రంబుల బదులనాథ శరనాలయంబులు నల్పి జాలికొల్పి, మహిని దేవళముల మాఱుగా బాలికా పాఠశాలలు కట్టి వన్నె బెట్టి, వన తటాకంబుల బదులుగా సర్వ కళాళాలలుంచి లీలల రచించి, బహుళాగ్రహరాళి బదులుగా యంత్ర కర్మాగారములు పెంచి ఖ్యాతి గాంచి, నతపురాణ కధావిధానముల బదులుతొంటి నిర్భంవైధవ్య దు:ఖ జలధి సమయజేయనుపన్యాస సభలు దీర్చి యామిని పూర్ణతిలక బిల్హణునియట్లే…”, యని తన నాటకంలోని పాత్రలు చేసిన కృషి వివరిస్తూ, ఆ ప్రయత్నాలకు బలం చేకూర్చేందుకు నాకటంలోని  మరొక పాత్ర చేత ప్రశంసింప చేస్తారు.

 

మనం నిష్పాక్షికంగా ఆలోచిస్తే, స్త్రీలు పురుషులకంటే యోగ్యులని ఖచ్చితంగా  తీర్మానిస్తూ, తనను స్త్రీజన పక్షపాతిగా ఏమాత్రం సంశయం లేకుండా డాక్టర్‌ ఉమర్‌ అలీసా ప్రకటించుకున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ , ‘నిష్పాక్షిక బుద్ధితో నూహించినచో పురుషుల కన్న స్త్రీలత్యంత యోగ్యులని చెప్పవలెనని’ అపి చాలా స్పష్టంగా ప్రకటించారు. ఈ నాటకంలోని ఒక పాత్ర మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఆ పాత్ర ద్వారా ఆనాడు సమాజంలో మహిళలకు వ్యతిరేకంగా ప్రజలి ఉన్న అహేతుక అభిప్రాయాలను వివరిస్తూ, ఆ వాదనలను ఉమర్‌ అలీషా చాలా బలంగా పూర్వపక్షం చేస్తారు. ఈ నాటకంలో, మహిళలు అవినీతి పరులంటూ, శాస్త్రజ్ఞులు చెప్పారు కదా?.. శాస్త్రజ్ఞులు పొరపడ్డారా? అంటూ ఒక పాత్ర చేత ప్రశ్నింపచేస్తారు. అనంతరం  ఆ ప్రశ్నకు ప్రతిస్పందనగా  ”.. సతుల వినీతలంచు దమశాస్త్రము లందుకు లిఖించవరలా సతులకు బుట్టరోసతుల-సంగతి గూడి సుఖింపరో సమున్నతి! తమ సోదరీసుతలు నారులు గారో! ప్రసన్న బుద్ధిలే కితరుల నింద సేయదమకే యదిలజ్జా యటంచెఱంగరో..” అంటూ  మరొక పాత్ర చేత  అలనాడు సమాజంలోని కొందరిలో ఉన్న అహేతుక  అభిప్రాయాల విూద  డాక్టర్‌ ఉమర్‌ అలీసా స్వయంగా విరుచుకు పడతారు.

 

మహిళా సంక్షేమ-అభివృద్థి కార్యక్రమాలను సదా విమర్శించే ఓ పాత్ర ద్వారా, ”..ఓహో! ఇదియా! భరత ఖండము నుద్దరించుటకు యనగా మావంటి బ్రహ్మణోత్తములకు నన్నదాన భూదాన కన్యాదానములు సమర్పించి ఆగ్రహారములిచ్చి లెస్సగా బిండివంటలతో భోజనము పెట్టించడమను కున్నాము. అట్లు గాదట! స్త్రీ విద్యట! భరత ఖండబునకు కొరతంట!.. తగినట్లు బుద్ధి చెప్పి గోబ్రాహ్మణ సమారాధనము మోక్షదాయకమని యొప్పించవలయును..” అని చెప్పించి, ఆనాటి ప్రతీపశక్తుల కుయుక్తులను, పరాన్నభుక్కుల కుళ్ళు బుద్ధులను ఉమర్‌ అలీషా బట్ట బయలు చేస్తారు. చదువుకున్న స్త్రీ మగని నెత్తికెక్కి పెత్తనం చేస్తుందని వచ్చిన వాదనలను దృష్టిలో వుంచుకుని, ఒక పాత్ర, విద్యా బుద్ధులు నేర్చిన స్త్రీలు అధిపత్యం కోసం పాకులాడుతారని, పెనిమిటిని గౌరవించరని, మాట వినరని ఆరోపించగా ”…విద్యచే వివేకము వచ్చును గావున వివేకవంతు దాధిపత్యమునకు నర్హుడైయ్యే యుండును..” అంటూ ఆ వాదనను ఆయన పూర్వపక్షం చేస్తారు.

 

కులం కాదు ప్రధానం గుణం ప్రధానమంటూ, బ్రహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన ఎవ్వరూ బ్రహ్మగారని, ”.. బ్రహ్మణుండైన గడజాతి – శ్వపచుడైనా విద్యయున్న మహాబ్రహ్మ…” యగునని  సాధికారంగా ప్రకటిస్తారు. ఉమర్‌ అలీషా కాలం నాటి సమాజ స్థితి, అభిప్రాయాలు, అభిమతాలతో బేరీజు వేసుకుని, ఆయన రచనలను పరిశీలిస్తే ఆయన విప్లవాత్మక దృష్టి విదితమౌతుంది.  సమాజంలో నెలకొనియున్న సామాజిక అంతరాల పట్ల ఉమర్‌ అలీషా తన అభ్యంతరాలను చాలా స్పష్టంగా వ్యక్తం చేశారు. అంటరానితనం, అసృశ్యత, సామాజిక వెలివేతల మీద ఆయన అక్షరాయుధంతో దండయాత్ర సాగించారు. మానవులలో జన్మతా : ఉచ్ఛనిచాలను నిర్ణయించడాన్ని విమర్శించారు. 1921 మార్చి మాసం 18వ తేదీన ఏలూరులో ” అదిమాంద్ర అంటుదోష నివారణ సభ ” జరిగింది. ఆ సభలో ఉమర్‌ అలీషా ప్రసంగిస్తూ, అంటరానితనం నిర్మూలనకు తగు సూచనలు చేశారు. కులాధిపత్యాన్ని  విమర్శించారు. ఏకులం వారైనా తమ శక్తి సామర్థ్యాలను పెంచుకోవడం ద్వారా, విద్యా బుద్ధుల ద్వారా అగ్ర స్థానాలను అలంకరించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ ఆ విధంగా మేధా సంపత్తిని సంతరించుకోవాలని సూచించారు. ”..పందిని, కుక్కను, నక్కను, పిల్లిని గూడా ముట్టుకొను వారలకు మనిషిని ముట్టుకొనుట దోషములోనిది కాదు కావున, యీ యీషద్భేదములను సరకుచేయక వెంటనే దానిని (అంటరానితనం) సంస్కరించుటకు అందరు తోడుపడవలెను..”, అని డాక్టర్‌ ఉమర్‌ అలీషా ఉద్బోధించారు.

 

1928వ సంవత్సరంలో ఉమర్‌ అలీషా తండ్రి శ్రీ మొహిద్దీన్‌ బాద్షా కన్నుమూయటంతో కుటుంబంలోని తొలి సంతానంగా ఆయన నిర్వహిస్తున్న అథ్యాత్మిక పీఠం బాధ్యతలను స్వీకరించారు.   శ్రీ విశ్వ విజ్ఞాన విద్యాధాత్మిక పీఠాచార్యునిగా అసంఖ్యాకులైన శిష్యుల మనస్సులను చూరగొన్నారు. ఆయన స్వయంగా బహళ సంస్కృతి-సభ్యతల సమ్ళేళనమయ్యారు.  సర్వమత సమభావనా కేంద్రంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్యాధాత్మిక  పీఠాన్ని తీర్చిదిద్దారు. ఆయన బోధించిన వేదాంత తత్వం ఆయనకు అసంఖ్యాక శిష్యగణాన్ని సమకూర్చి పెట్టింది. ఆయన మతపరంగా ముస్లిం అయినప్పటికి, అయనలో మతాభిమానం ఉన్నా ఎవ్వరీలనూ మత దురహంకారం మాత్రం తగదన్నారు. సర్వ మత సామరస్యం బోధించారు. ”..ఆదర్శ గురువుగా అంతేవాసుల ఆరాధ్యదైవంగా… ఆయన గౌరవ మర్యాదలందుకున్నారు ”. మతాల ప్రసక్తి లేకుండా, మతాచారాలతో సంబంధం లేకుండా ఉమర్‌ అలీషా పీఠాధిపత్యం లోని ‘ జ్ఞానసభ ‘ అందర్ని ఆహ్వానించింది. ఈ జ్ఞాన సభలో కులమత జాతి భేదాలు లేవు. జ్ఞానార్జనే ఇక్కడ ప్రధానం. ఈ విషయాన్ని ” సభామందిర ద్వారమెపుడు తెఱిచి యుండు పూత చరిత్రులై యుండు వారు వచ్చి జ్ఞానంబు నేర్చుకోవచ్చు సతము మంచి నీళ్ళను కలశాల ముంచినట్లు ” అని ఆయన స్వయంగా ప్రకటించారు. ఆ మేరకు ఆచరించిన చూపారు. ఆ కారణంగా అన్ని మతాలకు చెందిన ప్రజలు ఆయనను గురువుగా స్వీకరించారు. డాక్టర్‌ ఉమర్‌ అలీషా  ప్రతీ ఏడాది శిష్యులకు వేదాంత బోధ చేసేందుకు పర్యటనలు చేయటం అనవాయితీ. శిష్యగణమే ఆయన సర్వస్వమని భావించి, ప్రేమించే వేదాంతి మనసులోని తన మాటకు ఆయనలోని కవి ఈ విధంగా అక్షర రూపం కల్పించాడు.

 

” అతి పవిత్రతతో మహాప్రేమ గరిమతో

గ్రాలెడు వీరె చుట్టాలు మాకు

ప్రాణార్థములనైన ప్రాభవంబులనైన

నిచ్చెడు వీరె స్నేహితులు మాకు

జ్ఞాన సాధనచేత ధ్యాన నిష్టలచేత

దనరెడు వీరె సోదరులు మాకు

వీరె చేదోడు వాదోడు వీరె మాకు

వీరె భక్తులు బిడ్డలు వీరె మాకు

మా మహాజ్ఞానసభ జగన్మందిరముగ ”

 

బ్రహ్మరుషి ఉమర్‌ అలీషా  మిధ్యా భావనకు బహుదూరం. ప్రాంపంచిక జీవిత చర్యలు పరలోక జీవితానికి పునాది కాగలుగుతాయని ఆయన ప్రభోధం. ఇహలోక జీవనాన్ని ఏమాత్రం విస్మరించరాదన్నారు. భక్త జనుల ఆరాధనా మార్గాలు వేరైనప్పటికీ, అన్ని మతాలు భగవంతుని సాన్నిధ్యాన్ని చేరుకునేందుకు మార్గం చూపుతాయన్నారు. సర్వజనుల సర్వేశ్వరుడు ఒక్కడేనన్న భావన ద్వారా వసుదైక కుటుంబం ఏర్పడుతుందని ఆయన ప్రవచించారు. ఈ విషయాన్ని ” మానవుని మానవునిగా మార్చుటయే యీ ధర్మము యొక్క లక్ష్యమ ” ని  ఉమర్‌ అలీషా  ప్రకటించారు. ఆయన సర్వమత సమభావన ఆధ్యాత్మి-వేదాంత భావాలు ప్రముఖ పండితుడు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను కూడా ప్రభావితం చేసాయి. ఉమర్‌ అలీషా ధార్మిక చింతనా ధోరణులను శ్రీ రాధాకృష్ణన్‌ బహుదా కొనియాడారు. ఈ రకమైన ధార్మిక తత్వ చింతన కారణంగానే ఈనాటికి పిఠాపురంలోని ” శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠం ” ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతోంది.

 

ఆనాటి సంస్థానాధీశులు, సంపన్న కుటుంబీకులు ఉమర్‌ అలీషాను సత్కరించటమే మహా భాగ్యంగా  భావించారు. విశ్వ విద్యాలయాలు ఆయనకు గౌరవ బిరుదులను ఇవ్వడానికి ఉత్సాహ పడ్డాయి. 1924 లో జుజిజి |దీఖిరిబి ంజీరిలిదీశిబిజి ్పుళిదీతీలిజీలిదీబీలి లో ” పండిట్‌  ” బిరుదుతో ఆయనను సత్కరించింది. ఈ సందర్భంగావ ఓరిజీరీశి ఖతిరీజిరిళీ ఊలిజితివీతి ఆళిలిశి రిదీ జుదీఖినీజీబి ఆజీబిఖిలిరీనీ శిళి నీబిఖీలి జిలిబిజీదీశి ఐబిదీరీదిజీరిశి, ఆలిజీరీరిబిదీ, జుజీబిలీరిబీ బిదీఖి జూదీవీజిరిరీనీవ అని ఆ సంస్థ ప్రకటించింది.(జూదీబీగిబీజిళిచీబిలిఖిరిబి ళితీ  ఖతిరీజిరిళీ ఔరిళివీజీబిచీనీగి జూఖి. ఖజీ. శ్రీబివీలిదీఖిజీబి చజీ. ఐరిదీవీనీ, జు.ఆ. కఆ్పు, 2001) అలీఘర్‌ విశ్వ విద్యాలయం ఆయనకు ” మౌల్వీ ” బిరుదునిచ్చి గౌరవించింది. ఫ్రాన్స్‌ దేశానికి చెందిన ఆర్యన్‌ విశ్వ విద్యాలయం(జుజీగిబిదీ ఏదీరిఖీలిజీరీరిశిగి ళితీ ఓజీబిదీబీలి) అను అవార్డును ప్రసాదించి గౌరవించింది. 1933లో ఖతిరీజిరిళీ ఔళిబిజీఖి ళితీ ఐశితిఖిరిలిరీ తీళిజీ ఊలిజితివీతి లో సభ్యుడిగా కార్యక్రమాలకు మార్గదర్శకత్వం నెరపమని ఆయనను ఆంధ్ర విశ్వ విద్యాలయం ఆహ్వానించింది. కాశీలోని హిందూ విశ్వ విద్యాలయం కూడా ఆయనను విద్యాభివృద్ధి కమిటీలో సభ్యునిగా నియమించుకుంది. ఉమర్‌ అలీషా విద్వత్తును గుర్తించి 1936లో జుబీబిఖిలిళీరిబి |దీశిలిజీదీబిశిరిళిదీబిజి జుళీలిజీరిబీబిదీబి లో ఆయనను ఖిళిబీశిళిజీ జిరిశిరిలిజీబిజీతిళీ (ఖిళిబీశిళిజీ ళితీ జిరిశిలిజీబిశితిజీలి) తో గౌరవించింది. ఏ విశ్వ విద్యాలయం నుండి ఎటువంటి కనీస డిగ్రీ లేని వ్యక్తికి, అంతర్జాతీయ స్థాయి విశ్వ విద్యాలయం డాక్టరేట్‌ను ప్రకటించడం చాలా అరుదైన సంఘటన. ఉమర్‌ అలీషా తన సాహిత్య సంపదతో,  ఆంగ్లేయులకు షేక్‌ స్పియర్‌, ఇటాలియన్‌లకు డాంటే, ఉర్దూ మాట్లాడే ప్రజలకు డాక్టర్‌ ఇక్బాల్‌ ఎలాగో తెలుగు మాట్లాడే ప్రజలకు డాక్టర్‌ ఉమర్‌ అలీషా అటువంటి వారని ప్రముఖ పండితుల చేత బహువిధాల కీర్తించబడ్డారు. ఉమర్‌ అలీషాకు బహు సత్కారాలు, సన్మానాలు జరిగాయి. మౌల్వీ, బ్రహ్మరుషి, అశుకవి, మహాకవి లాంటి పలు బిరుదులే కాకుండా, పూల కిరీటాలు, సింహతలాటాలు, గజారోహణలు, కనకాభిషేకాలు తదితర గౌరవాలతో ఉమర్‌ అలీషా సాహిత్యవేత్తగా జయభేరిని మ్రోగించారు.

 

” మహా కవిగా, విద్యా వేత్తగా, రాజనీతి జ్ఞుడిగా, జాతీయవాదిగా, బహుభాషా విశారదుడుగా, బహుముఖ ప్రజ్ఞాదురీణుడుగా, దయార్ధ్ర హృదయుడుగా, ఆధ్యాత్మక విద్యా పీఠాధిపతిగా సమత-మమత-మానవతలకు ప్రతీక…” గా వెలుగొందిన డాక్టర్‌ ఉమర్‌ అలీషా తన జీవితకాలంలో పలు గ్రంథాలను రాశారు. అందులో 1.అనసూయాదేవి, 2.కళ, 3.చంద్రగుప్త 4.ప్రహ్లాద లేక దానవవధ, 5. మణిమాల, 6,మహాభారత కౌరవరంగము, 7.విచిత్ర బిల్హణీయము, 8.విషాద సౌందర్యము అను నాటకాలున్నాయి.1. నరకుని కాంతాపహరణ, 2. బాగ్దాదు మధువీధి, 3. విశ్వామిత్ర (అసంపూర్ణము) అను ఏకాంకిలు, 1.వరాన్వేషన్‌ అను ప్రహసనం, 1. ఖండకావ్యములు, 2.తత్త్వ సందేశము, 3.బర్హిణి దేవి, 4. బ్రహ్మ విద్యావిలాసము, 5.మహమ్మద్‌ రసూల్‌ వారి చరిత్ర, 6.సూఫీ వేదాంత దర్శనము, 7. స్వర్గమాత, 8.హాలీలాంటి పద్య గ్రంధాలు రచించారు. 1.ఈశ్వరుడు, 2. మహమ్మద్‌ వారి చరిత్ర, 3. సాధన పథము అను గద్యములు, 1.తారామతి, 2. పద్మావతి, 3. శాంత అనునవలలు, 1. ప్రభాత కథావళి అను కథల సంగ్రహము 1. ఉమర్‌ఖయ్యమ్‌, 2.ఖురాన్‌ – ఏ – షరీఫ్‌, 3.గులిస్తా అను అనువాదాలు 1. ఇలాజుల్‌ గుర్‌భా అను వైద్య గ్రంధాలను ఆయన సృజించారు. ఈ గ్రంథాలలో అన్ని ప్రస్తుతం లభ్యం కావటంలేదు.

 

ఈ రచనలే కాకుండా వందకు పైగా వ్యాసాలు గల సంపుటి, హిందీ-ఆంగ్ల ఉపన్యాసాల సంగ్రహం వేర్వేరుగా ఉన్నాయని, ఇవికాక మదాల, మనద్ధాస్‌ అలీ, ఉరుమత్తూరు చక్రవర్తి, శ్రీ మద్వాల్మీకి రామాయణము కూడా ఆయన రచించినట్టు డాక్టర్‌ మహమ్మద్‌ ముస్తఫా, డాక్టర్‌ యస్‌.యం ఇక్బాల్‌ లాంటి పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆయన సృష్టించిన సాహిత్య సంపదలో 34 గ్రంథాలు మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉండగా 23 రచనలు ముద్రితమయ్యాయి. ప్రఖ్యాతి చెందిన ఆయన రచనలు విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థుల పాఠ్య గ్రంథాల స్థానాన్ని పొందాయి. ఆనాడు అలీషా రచనల గురించి చర్చించని సాహితీ సభగానీ, ఆయన రచనలేని గ్రంథాలయం గాని ఉండేది కాదట. మాతృభాష తెలుగు కానప్పటికీ, ” తెలుగులో ఛందోబద్ధమైన సాంప్రదాయ కవిత్వం చెప్పి ఆంధ్ర భారతిని ఆరాధించిన తొలి, తుది కవి ఈయనే కావచ్చు,” నని పండిత ప్రముఖులు ఆయనకు కితాబునిచ్చారు.

ఆయన తెలుగు భాషకు మాత్రమే పరిమితం కాకుండా బహుభాషలలో కవిత్వం రచించగల ప్రతిభావంతుడిగా, తత్త్వవేత్తగా, వేదాంతిగా, విజ్ఞాన గనిగా ప్రజలు-పండితులు గౌరవించారు.  ఆయన సాహిత్యం  పరిశోధనలు జరిపి పలురువు డాక్టరేట్లు తీసుకున్నారు. పలువురు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో  ఉంచుకుని,  డాక్టర్‌ ఉమర్‌ అలీషా ముని మనుమడు, నవమ పిఠాధిపతి డాక్టర్‌ ఉమర్‌ అలీషా, తమ తాతగారి సాహిత్య సంపదను సేకరించి పుస్తకాలను ప్రచురించి ప్రజలకు, పరిశోధకులు, పాఠకులకు అందుబాటులో ఉంచాలని ప్రయత్నిస్తున్నారు. ఉమర్‌ అలీషా సాహిత్య-ఆధ్యాత్మిక సంభాషణలు, రచనలను మాత్రమే కాకుండా, ఆయన రాజకీయ అభిప్రాయాలు, స్వాతంత్య్ర సమరయోధునిగా పలు ప్రాంతాలలో ఆయన చేసిన ప్రసంగాలు, సమాజ సంస్కరణలకు ఆయన అనుసరించి విధానాలు, చేసిన సూచనలు ఆయన అభిప్రాయాలు, భారత శాసనసభలో ప్రజా ప్రతినిధిగా పది సంవత్సరాల పాటు పనిచేసినప్పుడు చర్చకు వచ్చిన వివిధాంశాల మీద ఆయన చేసిన ఉపన్యాసాలను సేకరించి ఉమర్‌ అలీషా వ్యక్తిత్వాన్ని, మేథో సంపత్తిని సమగ్రంగా ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈకృషిని మరింత వేగవంతం చేసేందుకు ఆయన మునిమనుమడు డాక్టర్‌ ఉమర్‌ అలీషా, ఆయన అనుచరులు కలసి  ” శ్రీ ఉమర్‌ అలీషా గ్రంథ మండలి ”  అను సంస్థను ప్రారంభించారు. ఈ  సంస్థ  ద్వారా అందరికి అందుబాటులోకి వచ్చేలాగా ఆయన గ్రంథాలను పునర్ముద్రణ గావిస్తున్నారు. ఆ సంస్థ  కృషి ఫలించి డాక్టర్‌ ఉమర్‌ అలీషా రాసిన రచనలన్నీ ప్రజలకు, సాహిత్యాభిలాషులకు,  పరిశోధకులకు అందుబాటులోకి వచ్చినట్టుయితే, మహాకవి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని దర్శించేందుకు ప్రతి ఒక్కరికి అవకాశం లభిస్తుంది.

 

భారత స్వాతంత్య్ర సగ్రామయోధునిగా, భారత ప్రభుత్వం శాసన సభలో ప్రజా ప్రతినిధిగా  (1935-45)  బాధ్యతలను నిర్వహిస్తూ, సమాజంలో రావాల్సిన మార్పులను ఆకాంక్షిస్తూ ఆదిశగా కృషిచేసిన సంఘసంస్కర్తగానూ,  ఆధ్యాత్మిక రంగాన శిష్యకోటికి ధార్మిక జ్ఞానబోధ చేయు పీఠాధిపతిగాను, బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహితీవేత్తగా, వేదాంతిగా చిరస్మరణీయమైన ఖ్యాతి గడించిన డాక్టర్‌ అలీషా జీవిత పరిసమాప్తి వరకు  పర్యటనలు చేశారు. సమకాలీన సాహిత్య సౌరభాలను అఘ్రాణించుటకు, శిష్యపరంపరకు అధ్యాత్మిక మార్గదర్శకం చేయుటకు ప్రతి క్షణాన్ని వినియోగించిన ఆయన అవిశ్రాంతంగా భారతదేశమంతా పర్యటించినా అలసిపోవడం ఎరుగరు. 1945 జనవరి మాసంలో ఢిల్లీ నుండి స్వస్థలానికి విచ్చేస్తూ, శిష్యుల ఆహ్వానం మేరకు ఆచార్య ఉమర్‌ అలీషా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వెళ్ళారు. శిష్యుల మధ్యన  కొంతకాలం గడిపాక  తిరిగి పిఠాపురం చేరుకో సంకల్పించి, ఆ ప్రయత్నంలో వుండగా జనవరి 23వ తేది సాయం సమయం 5 గంటల ప్రాంతంలో మహాకవి కన్నుమూశారు.

 

రచయిత గురించి :

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌  వృత్తిరీత్యా న్యాయవాది. ప్రవృత్తిరీత్యా పాత్రికేయుడు, పరిశోధకుడు, రచయిత, చరిత్రకారుడు, చిత్రకారుడు.భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింల పాత్రను వివరిస్తూ ఇప్పటి వరకు తొమ్మిది గ్రంథాలను వెలువరించిన ఆయన  ముస్లిం స్వాతంత్య్రసమరయోధుల చరిత్రలను వెలికితీసి తెలుగు పాఠకులకు అందిస్తున్న తొలి చరిత్రకారుడిగా ఖ్యాతి గడించారు. 1999 నుండి చరిత్ర గ్రంథాలను వెలువరించడం ఆరంభించిన సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 1. భారత స్వాతంత్య్రోద్యమం : ముస్లింలు 2 భారత స్వాతంత్య్రోద్యమం : ముస్లిం మహిళలు 3. భారత స్వాతంత్య్రోద్యమం : ముస్లిం ప్రజాపోరాటాలు 4. భారత స్వాతంత్య్రోద్యమం : ఆంధ్ర ప్రదేశ్‌ ముస్లింలు 5. భారత స్వాతంత్య్రసంగ్రామం : ముస్లిం యోధులు (ప్రధమభాగం) 6. షహీద్‌-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్‌ 7. మైసూరు పులి టీపూ సుల్తాన్‌ 8. చిరస్మరణీయులు, 9. 1857:ముస్లింలు, 10. అక్షరశిల్పులు. అను గ్రంథాలు వెలువరించారు. ఈ గ్రంథాలలో ఐదు గ్రంథాలు మూడుసార్లు, నాలుగు   గ్రంథాలు రెండుసార్లు పునర్ముద్రితం అయ్యాయి. ఆయన రాసిన  1. భారత స్వాతంత్య్రోద్యమం : ముస్లింలు     2. షహీద్‌-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్‌ గ్రంథాలు ఉర్దూ భాషలో తర్జుమా చేయబడి ప్రచురితమయ్యాయి.

 

ప్రస్తుతం ఆయన షఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ముస్లిం పోరాట యోధులు అను గ్రంథాన్ని, 1757 నుండి 1947 వరకు బ్రిటీష్‌ వ్యతిరేకపోరాటాల్లో పాల్లొన్న 150 మంది ముస్లిం యోధుల చిత్రాలతో షఆల్బమ్‌ తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ఆల్బమ్‌లో ప్రతి యోధుని గురించి తెలుగు, ఆంగ్ల భాషల్లో సంక్షిప్త సమాచారం ఉంటుంది.

 

భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింల పాత్రను, భారతీయ ముస్లింల స్థితిగతులను వివరిస్తూ  తెలుగు, ఆంగ్ల భాషలలో పలు వ్యాసాలను రాసి ప్రచురించిన ఆయన ఈ అంశం విూద పలు ప్రాంతీయ, జాతీయ స్థాయి వేదికల నుండి, సభలు, సదస్సులలో ప్రసంగాలు చేస్తూ మంచి వక్తగా పేర్గాంచిన  నశీర్‌  భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింల పాత్రను, ముస్లింల స్థితిగతులను సాధికారికంగా  విడమర్చి తెలుపున్నారు. నిత్య అధ్యయనశీలి అయినటుంటి సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ పలు గ్రంథాల ప్రచురణకు ప్రణాళికలు సిద్ధం ఆ కృషిలో దేశమంతటా పర్యటిస్తూ, విషయ సేకరణగావిస్తూ, విశ్లేషిస్తూ పలు గ్రంథాల ప్రచురణకు   కృషిచేస్తున్నారు.

 

 

5 thoughts on “మనం మరచిన మన మహాకవి డాక్టర్‌ ఉమర్‌ అలీ షా

  1. Thank you very much for publishing an impressive article about Dr Umar Alisha Guruji.
    The fragrance of knowledge and progressive views can be seen in his eternal words and his works added glory to Telugu literature.

  2. ఇంత వరకు నాకు తెలియని ఒక మహాకవిని గురించి చదివి ఆశ్చర్యపోయాను ! మీ వ్యక్తిగత పరిచయం కూడా నన్ను చకితుణ్ని చేసింది ! మీ పుస్తకాలు ముఖ్యంగా ‘ముస్లిం స్తీల’ గురించి మీరు వ్రాసినది చదవాలని ఉంది. ఎక్కడ దొరుకుతాయో దయచేసి తెలియజేయండి,
    ఎ.శ్రీధర్. ( క్షీరగంగ బ్లాగరు )

    1. Sodara, Nenu mottam 10 books raasaynu. ee books anni naa vadda dorukuthai. mi churunama naaku mail chesthe ninu miku vivaralu pampagalanu.Naa 10 books lo 9 books http://www.viskasadhatri.org nundi miru freega down load chesuko vachhu. Books kaavalante nenu pamputhanu. Naa cell 9440241727 ku contact cheyandi. mi asakthiki dhanyavadalu.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *