March 29, 2024

మఱికొన్ని జ్ఞాపకాలు

రచన : డా. ఏల్చూరి మురళీధరరావు,న్యూఢిల్లి

గురుం ప్రకాశయేత్ – అని పెద్దలన్నారు. మన గురువులు చెప్పిన పాఠాలను మనసుకు తెచ్చుకొన్నట్లే, వారి పేరును నోరారా పేర్కొనటంలో ఒక ఆనందం ఉన్నది. సమర్థులైన గురువులు విద్యాబోధ కావిస్తున్నప్పుడు ఒక్కొక్కప్పుడు వారి వచోగరిమ వల్ల ఆధికారికేతివృత్తాని కంటె ప్రాసంగికంలోనే మెఱుములు మెఱుస్తాయి. ఆ మాటలు ముత్యాల మూటలు. జీవితకాలం తమతమ రంగాలలో విశేషమైన కృషిచేసిన విద్వాంసులు, విజ్ఞానవేత్తలు, కవులు, రచయితలు అయితే మఱీనూ. వారితో ప్రసంగావకాశమే ఒక విద్యాసముపార్జనం. సమర్థులు మఱీ సమర్థులైతే అది శోకమైనా, శ్లోకమైనా, సుశీలమైనా, అశ్లీలమైనా అందంగానే ఉంటుంది. మాననీయులైన ఆ మహనీయుల నామస్మరణం, వారి వాక్యస్మరణం ఋషిఋణాపనోదనంతో సమానం.

మాలిక పత్త్రిక సంపాదక మండలి, పాఠకమిత్రులు నా పైని చూపిన అనూహ్యమైన ఆదరం ఋణాన్ని తీర్చుకోవటానికి నా చిన్ననాడు విన్నవీ, కన్నవీ అతీతకాలపు స్మృతియవనిక వెనుక దాగిన మఱికొన్ని జ్ఞాపకాలను అక్షరాలకు అంకితం చేయటం కంటె వేఱే మార్గం గోచరింపలేదు నాకు.

 

పుట్టగానే పరిమళించిన పువ్వు

      అద్వైతశాస్త్రానికి ఆచార్యపీఠం శృంగేరి. శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య పదవాక్యప్రమాణపారావారపారీణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగయోగనిష్ఠాగరిష్ఠ తపశ్చక్రవర్త్యనాద్యవిచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురుపరంపరాప్రాప్త షడ్దర్శనస్థాపనాచార్య వ్యాఖ్యానసింహాసనాధీశ్వర సకలనిగమాగమసారహృదయ సాంఖ్యత్రయప్రతిపాదక వైదికమార్గప్రవర్తక సర్వతంత్రస్వతంత్రాది రాజధానీ విద్యానగరమహారాజధానీ కర్ణాటకసింహాసనప్రతిష్ఠాపనాచార్య శ్రీమద్రాజాధిరాజగురుభూమండలాచార్య ఋష్యశృంగపురవరాధీశ్వర తుంగభద్రాతీరవాసి శ్రీమద్విద్యాశంకరపాదపద్మారాధక శ్రీ మహాగురుస్వాములు అధివసించిన పుణ్యనివాసం. ఆస్తికు లందఱికీ ఆశ్రయమైన తీర్థయాత్రాస్థలం.   

1966 నాటి మాట. పరాభవ నామ సంవత్సరంలో జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర భారతీస్వామివారి శిష్యవర్యులు శ్రీమదభినవ విద్యాతీర్థస్వామివరేణ్యులు చాతుర్మాస్యదీక్షావ్రతులై  ఉజ్జయినిలో ఉన్నప్పుడు ఉత్తరాదిలోని పద-వాక్య-ప్రమాణ పారావార పారంగతులందఱూ వారి సన్నిధిసేవకై ఏతెంచిన తరుణం. సంస్కృతంలో ‘పదము’ అంటే వ్యాకరణమని సంకేతం. ‘వాక్య’మంటే పూర్వోత్తరమీమాంసలని అర్థం. ‘ప్రమాణం’ అంటే తర్కశాస్త్రం అన్నమాట. ఆ పదవాక్యప్రమాణములే గాక సర్వశాస్త్రాలలోనూ, కావ్యనాటకసాహిత్యంలోనూ కోవిదులైన అగ్రగణ్యుల సమావేశం అది. ఆ సమావేశాలకు వెళ్ళి ఆ వాక్యార్థాలూ, వాకోవాక్యాలను తిలకించినవారి భాగ్యమే భాగ్యం.

ఒకప్పుడు శ్రీ శృంగేరిలోని వాక్యార్థసభలో “విశ్వామిత్ర” శబ్దాన్ని గుఱించిన చర్చ వచ్చిందట. ఎవరో ‘విశ్వానికి అమిత్రుడు’ అని హాసపూర్వకంగా అన్నారట. వైయాకరణసార్వభౌములు భట్నవిల్లి అప్పన్నశాస్త్రి గారు విశ్వ శబ్దానికి విశ్వానికి మిత్రుడన్న అర్థంలో సమాసవిధి వల్ల దీర్ఘం వచ్చి ‘విశ్వామిత్ర’ అవుతుందని సవిస్తరంగా ప్రసంగించారట. అప్పుడు ప్రౌఢవయఃపరిపాకంలో ఉన్న విద్వత్కవి శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు లేచి, చంద్రునికి పదహారు కళలు ఉన్నట్లే, ప్రమితిస్వరూపుడైన సూర్యునికీ పదహారు కళలు ఉన్నాయని; వాటిలో “విశ్వా” అనే కళ నుంచి జన్మించిన “మిత్రుడు” (సూర్యుడు) కనుక విశ్వామిత్రుడయ్యాడనీ వేదప్రామాణ్యంతో నిరూపించి మెప్పులందుకొన్నారట.

వాక్యార్థసభలలో పూర్వపక్ష సిద్ధాంతాల నీడల జాడలలో  ఇటువంటి ఉల్లాసదోహద చమత్కారాలూ జరుగుతుంటాయి.

శ్రీ అభినవ విద్యాతీర్థ జగద్గురువుల వారు షడ్దర్శనీపారంగతులైన మహావిద్వాంసులు. ఎంతటి మహావిద్వాంసులో అంతటి దయామయులు. లోకానుగ్రహం కోసం అవతరించిన మహాపురుషులు వారు. వారి భక్తరక్షణలీలలను స్మరిస్తుంటే యుగాలు క్షణాలుగా ఇట్టే గడిచిపోతాయి.

ఆ రోజు ఉజ్జయినిలో విద్యార్థుల సంస్కృతభాషా వక్తృత్వప్రదర్శనం జరిగింది. ఆంధ్రదేశం నుంచి వచ్చిన ఒక పధ్నాలుగు – పదిహేనేళ్ళ పిల్లవాడు తనవంతు రాగానే సంస్కృతంలో నిరర్గళమైన ధారాశుద్ధితో, ఉజ్జ్వలమైన తేజస్సుతో, మేఘగంభీరమైన కంఠస్వరంతో ఉద్దండపాండితీమండితంగా, మధ్య మధ్య ఛందోమయవాణీభణితిపూర్వకంగా సర్వజనాహ్లాదకరంగా వక్తవ్యాంశాన్ని పురస్కరించుకొని ప్రసంగించాడు. విద్వత్పరిషత్తు విభ్రాంతి చెంది, పెద్దలందఱూ నిండైన మనస్సుతో మెండైన ప్రశంసలు ఉట్టిపడే కన్నుల కాంతి వెల్లువను ఆ పిల్లవాడిపై వెల్లివిరియింపజేస్తున్నారు.

రాంకవ పుస్తకాది ప్రోత్సాహక పురస్కారాలు పూర్తయిన తర్వాత, శ్రీమదభినవ విద్యాతీర్థస్వాముల వారు ఆ పిల్లవాడికేసి చూస్తూ, “కా పూర్వః?” అని ప్రశ్నించారు.

ఏది పూర్వం? సృష్టికంటె, సృష్ట్యాదికంటె, అన్నింటికంటె మునుపటిది ఏమిటి? అని కాబోలు ఆ ప్రశ్నార్థం. పిల్లవాడిని అడిగే ప్రశ్నేనా అది? అని పెద్దలు, పండితులందఱూ తెల్లపోయారు.

వేదలతాంతాలైన ఉపనిషత్తుల కుదుళ్ళ నుంచి పుట్టిన అపురూపమైన ప్రశ్నమని అందఱూ అనుకొన్నారు. సృష్టిలో పూర్వం జలము లుండేవట. “యా సృస్టిః స్రష్టు రాద్యా” అన్నాడు కాళిదాసు శాకుంతలాదిని. అంతకు మునుపో? మైత్రాయణీ ఉపనిషత్తులోని కథ: బృహద్రథు డడిగిన ప్రశ్నకు వేదవేత్త, శాస్త్రవేత్త, ఆత్మవేత్త శాకాయనుడు, “దుశ్శక్య మేతత్ప్రశ్నమ్” అంటాడు. “అమ్మో, నీ ప్రశ్నకు సమాధానం చెప్పటమే!” అని. ఇదీ అటువంటిదే. అంతేకాదు. పండితపరిషత్తులో పెద్దల ముందు ఎన్ని ఉదాహరణలతో ఏమని చెప్పినా శాస్త్రవాదం “అథాతో బ్రహ్మజిజ్ఞాసా” అంటూ మళ్ళీ మొదటికే వస్తుంది.  ఏమని బదులిచ్చినా అంతకు ముందు మఱేదో ఉండేదని ఏ శాస్త్రమో, పురాణమో చర్చకు రాకుండా ఉంటుందా? ఏదో వక్తృత్వాన్ని ప్రదర్శించినంత మాత్రాన అడిగిన ప్రశ్నకల్లా ఆ చిన్న పిల్లవాడు సమాధానాలు చెప్పాలని లేదు కదా!

అదీగాక, జగద్గురువుల వారు “కః పూర్వః” అని అడగకుండా లింగవ్యత్యయం చేసి, పుంలింగమైన పూర్వ శబ్దానికి మునుపు “కా” అని స్త్రీలింగాన్ని ప్రశ్నార్థకంగా జోడించారు.  అన్నింటికంటె పూర్వం ఉండినది పరాశక్తి అన్న స్త్రీత్వభావంతో అడిగితే మాత్రం, ఆ అవతారపురుషుని నోట లింగవ్యత్యయపూర్వకమైన అపశబ్దం దొర్లుతుందా? లేక, విద్యార్థి తెలివితేటలను ఆ విధంగా పరీక్షించాలనుకొన్నారా?

ముసిముసి నవ్వులతో తండ్రిగారికేసి చూస్తున్న ఆ పిల్లవాడికేసి చూస్తున్నారు అందఱున్నూ. ఏమంటాడోనని ఆసక్తిగానూ, జగద్గురువులవారి దృష్టిని అంతగా ఆకర్షించినందుకు అమితాశ్చర్యంగానూ. అదే ప్రశ్న నన్నడిగితే ఏమి చెప్పాలని కొంద ఱాలోచిస్తున్నారు.

ఆ పిల్లవాడి ఆత్మవిశ్వాసం చూడండి: “మాది నరసరావుపేట” అన్నాడు.

సభ సభంతా విస్తుపోయింది. మహాపండితుల కరతాళధ్వనులు మిన్నుముట్టకుండా ఉంటాయా?

“పూః పురీ” అని అమరకోశం. జనములచే పూరింపబడేది కాబట్టి పురమునకు “పూః” అని పేరు. “పూః” శబ్దం స్త్రీలింగం. “కా పూః వః” అని ఆ పిల్లవాడి విఱుపు. వః = మీ యొక్క; పూః = పురము; కా = ఏమిటి అని. మీ ఊరేమిటి? అన్నమాట. “నరసరాట్ పూర్ నః” అన్నాడు. మా ఊరు నరసరావుపేట అన్నాడు.

మాతృశ్రీ అనంతలక్ష్మమ్మ గారు, తండ్రి వేంకటేశ్వర అవధాని గారు ఇంటికి వెళ్ళి దిష్టి తీశారో లేదో. ఎన్ని జన్మల పుణ్యఫలం కాకపోతే అటువంటి కొడుకును కనటం సంభవిస్తుంది కనుక!

ఆ పిల్లవాడి పేరు తంగిరాల సీతారామాంజనేయులు. పల్నాటి సీమలో అలుగుమల్లెపాడు నుంచి నరసరావుపేటకు వచ్చి స్థిరపడిన కుటుంబం వారిది. పసిపిల్లవాడుగా ఉండగానే కావ్యశాస్త్రాలలో, వేదవిద్యలలో, సంస్కృతాంధ్రాలలో ఆ బాలసరస్వతి అనుభవాన్ని చూసి బెజవాడలో విశ్వనాథ సత్యనారాయణ గారంతటివారు ముచ్చటపడి మెచ్చుకొని మరీ దీవెనలు కురిపించారు.

ఆ బాలుడే, ఇప్పుడు యుగయుగాంతరానుగత కర్కశ సమస్యల సంక్షోభంలో అల్లకల్లోలమై ఉన్న జగత్తుకు కర్తవ్యాన్ని తెలియజెప్పి సన్మార్గోపదేశం చేస్తూ శ్రీ శృంగేరీ జగద్గురు మహాపీఠాన్ని అధిష్ఠించిన అపర శంకరాచార్యులు, యతిసార్వభౌములు, ధర్మప్రచార దృఢదీక్షావ్రతులు, జగదేకవిద్వాంసులు, శ్రీమదభినవ విద్యాతీర్థస్వామి కరకమలసంజాతులు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివరేణ్యులు. 

శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాసన్నిధానమువారు శిష్యస్వాములుగా ఉన్నప్పుడు వారికి ఆంధ్రవిద్యాగురువులై, ఆ తర్వాత శ్రీ అద్వయానంద భారతీస్వామిగా తురీయాశ్రమస్వీకారం చేసిన మహాకవి శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారి ముఖతః నా చిన్నప్పుడు 1972లో విన్న ఉదంతాన్ని మీకిప్పుడు విన్నవించాను.

స్వతఃప్రామాణ్యం

      “పితృయజ్ఞము” వంటి వేదాంత గంభీర కావ్యకర్త, “ధర్మనిర్ణయము”, “తిక్కన సోమయాజి” నవలాకారులు, “పోతనగారి సహజపాండిత్యము” ద్వారా అభినవ మల్లినాథు లనిపించుకొన్న మహావ్యాఖ్యాత, “హాస్యగాథాద్విశతి” కావ్యాన్ని రచించిన హాస్యబ్రహ్మ, సంస్కృతాంధ్ర మహాకవి, “శ్రీచక్ర పూజావిధానము”ను రచించిన శ్రీవిద్యాలాక్షణికులు, విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యమండలిలో అగ్రగణ్యులై, వారిచే “శశ్వదుదారభావపరిషన్మతి” అని మెప్పువడసిన ధన్యులు, సన్న్యాసాశ్రమాన్ని స్వీకరించి శ్రీశ్రీశ్రీ అద్వయానంద భారతీ స్వామిగా బ్రహ్మభూయాన్ని చెందిన అస్మద్గురుదేవులు శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరావు గారిని అధికరించి వేఱే విశేషవ్యాసం వ్రాయదలిచి ఇక్కడొక్క సంఘటితాన్ని మాత్రం ముక్తాముక్తంగా పేర్కొంటాను.

1977లో నేను మద్రాసు విశ్వవిద్యాలయంలో ఆచార్య గంధం అప్పారావు గారి వద్ద ఎం.ఫిల్. చేస్తున్న రోజుల్లో నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ప్రసిద్ధులైన ఆచార్యు లొకరు ఒక పరిశోధక విద్యార్థిని వెంటబెట్టుకొని మద్రాసుకు వచ్చారు. విశ్వనాథ శిష్యవర్గంలో అగ్రేసరులై, “పోతనగారి సహజపాండిత్యము”, “నన్నెచోడుని వస్తుకవిత” గ్రంథాలను వ్రాసిన మహామతి శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారిని చూడాలని ఉన్నదని నాతో అన్నారు. నేనొక ఉదయం వారిద్దరినీ శ్రీ తుమ్మలపల్లి వారింటికి తీసుకొని వెళ్ళాను.

వెళ్ళేముందు చెప్పలేదు. ఆప్యాయిత లున్నచోట అపాయింటుమెంటు లక్కర్లేదు కదా.

గురుశిష్యు లిద్దఱూ తెలుగు పరిశోధన తీరుతెన్నులను గుఱించి మాట్లాడారు. ఆ విద్యార్థి తనకు అముద్రిత కావ్యాల పైని పరిశోధన అంటే ఇష్టమని చెబుతూ, తానొక అముద్రిత గ్రంథాన్ని గుఱించి పరిశోధన చేస్తున్నానని చెప్పాడు.

శ్రీ తుమ్మలపల్లి వారు సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ, “ఆముద్రితకావ్యమా? ఎక్కడా అచ్చుకాలేదని మీకు తెలుసా? వావిళ్ళ వాళ్ళు వేశారేమో చూశారా?” అని ప్రశ్నించారు.

ఇద్దఱూ కావ్యం అచ్చుకాలేదని చెప్పారు. “వావిళ్ళ వాళ్ళే కాదు, ఎవళ్ళూ వెయ్యలేదు. ఆ సంగతి తేల్చుకొన్నాకే పిహెచ్.డి.కి రిజిస్టరు చేశాను” అన్నాడా విద్యార్థి.

“వ్రాతప్రతు లున్నాయా?”

“లేకేం, మద్రాసు ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలో అయిదు తాళపత్ర ప్రతులు, బ్రౌను వ్రాయించిన కాగితం ప్రతి ఒకటి ఉన్నాయి. ఇక్కడ తప్ప మఱెక్కడా ప్రతులు లేవు.”

“ప్రతులు బాగున్నాయా? కావ్యం పూర్తిగా ఉందా?”

“అన్నీ మంచి స్థితిలోనే ఉన్నాయి. పుస్తకం పూర్తిగా ఉంది. అందుకే నేను పరిష్కరించి, పరిశోధిస్తున్నాను.”

తుమ్మలపల్లి వారు వారిద్దరికేసి చూశారు. చిఱునవ్వు నవ్వారు.

“ఏమండీ, వ్రాతప్రతులు మద్రాసులోనే ఉన్నాయంటున్నారు. అవీ మంచి స్థితిలో ఉన్నాయంటున్నారు. అచ్చు కానేలేదంటున్నారు.  వావిళ్ళ వాళ్ళు వెయ్యలేదంటున్నారు. ఇన్నాళ్ళుగా వావిళ్ళ వాళ్ళు మద్రాసులో వెయ్యనిది ఇంకేం, చెత్త పుస్తకం అన్నమాట. దాన్ని గుఱించి ఇంకా పరిశోధనేమిటీ? ఆ పుస్తకమేదో మానేసి, రీసెర్చికి మఱేదైనా మంచి విషయం వెతుక్కోండి!

పాపం, ఆ విద్యార్థి ఆలోచనలో పడ్డాడు. ఆచార్యులవారు తెల్లపోయారు.

పండితలోకంలో “వావిళ్ళ రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్” అంటే ఎంతటి ప్రామాణ్యభావమో ఆ రోజు అర్థమయింది నాకు.

తాళపత్రాలలో మూలుగుతున్న సంస్కృతాంధ్రపురాణేతిహాస సకలశాస్త్ర సమస్తకావ్యాలకు ప్రాణంపోసి  తెలుగుదేశానికి అక్షరభిక్ష పెట్టిన మహానుభావులు కదా!

శా.   శ్రీమద్వాఙ్మయజాలమన్ శ్రుతితతుల్ శ్రీతాళపత్రా బ్ధ్యధో

       భూమిన్మున్గుటఁ  గాంచి జ్ఞానయుతమౌ భూరిప్రమోద మ్మ దె

       ట్లౌ? మర్త్యాళి  కటంచు శ్రీవిభుఁడు నీ యౌన్నత్యముం గూర్చె స

       ద్రామస్వామ్యవతార మూని విలసద్వావిళ్ళముద్రాలయా!

అన్నారు 1941లో విజయనగరం మహారాజా సంస్కృత కళాశాలా మహోపన్యాసకులు, మహాకవి శ్రీ ఆకుండి వేంకటశాస్త్రి గారు!

కర్మధారయం – షష్ఠీ తత్పురుషం

      గుడివాడలో డాక్టరు అడుసుమిల్లి నారాయణరావు గారు ఇంగ్లీషు వైద్యంలో పేరుమోసిన వైద్యులు. ఆయనను అపర ధన్వంతరి అనేవారు. ఆ హస్తవాసి అటువంటిది మఱి. ఆయనది నాలుగంచుల పాండిత్యం. సంప్రదాయకవిత్వంలో నిష్ణాత. “నారాయణీయము” అనే లక్షణగ్రంథాన్ని వ్రాసి, అందులో జగన్నాథ పండితరాయలు లాగా తమ లక్షణాలకు లక్ష్యాలను కూడా తామే వ్రాశారు. నిరంతర రచనా వ్యాసంగశీలి.

“కవితాభ్యాసమునన్ పదొండు గడియల్; గాటంపు స్వప్నస్థితిన్

       పవలున్ రేలుఁ బదాఱు ఘంటికలు

అని చెప్పుకొన్నారు.

ఒకరోజు హైదరాబాదు నుంచి ప్రసిద్ధ వక్త ఒకఱు కవిత్వోపన్యాసానికై స్థానిక సంస్థ పిలుపు నందుకొని వచ్చారు. రావుగారు, ఆయన తెల్లవాఱు ఝామున రోడ్డుమీద నడకకు బయలుదేరారు. మార్గమధ్యంలో ఆ వచ్చినాయన చెప్పు తెగింది.  ఆయన చీదరించుకొని, “ఛీ, వెధవచెప్పు” అన్నాడు.

వెంటనే నారాయణరావుగారు, “కవిగారూ! అది కర్మధారయమా? షష్ఠీ తత్పురుషమా?” అని అడిగారట.

కర్మధారయం అయితే వెధవధైన చెప్పు. విశేషణ పూర్వపద కర్మధారయం. తత్పురుష సమాసం అయితే వెధవ యొక్క చెప్పు అన్నమాట. షష్ఠీతత్పురుషం.

 

వర్ణాదేశం

      “చందమామ రావె, జాబిల్లి రావె” అన్న అన్నమయ్య పాట వింటూ తల్లి చేతి గోరుముద్దలు తింటూ కాలాన్ని మఱచిపోయే బాలల కోసం చక్రపాణి గారికి “చందమామ” అన్న సుందరమైన పేరును సూచించి, “చందమామ” పత్రికకు పర్యాయపదమైన శ్రీ బలుసుపాలెం సుందర రామారావు గారిని అందఱూ చందమామ రామారావు గారనే అనేవారు. చందమామ పత్రిక యాజమాన్యం, బి.యన్. రెడ్డిగారు, వేణుగోపాలరెడ్డి గారు, చక్రపాణి గారు, సంపాదకులు కొడవటిగంటి కుటుంబరావు గారు, దాసరి సుబ్రహ్మణ్యం గారు, అక్కడి ఉద్యోగిబృందం ఆయనను ఎంతగానో గౌరవించేవారు. ఆయన మాటకు ఎంతో విలువిచ్చేవారు. ఆయన వ్యక్తిత్వపరిధిలోకి ప్రవేశించినవారందరికీ ఆయన గురుతుల్యులు.

శ్రీ బలుసుపాలెం సుందర రామారావు గారు 1912 జనవరి 8-వ తేదీనాడు జన్మించారు. ఇది వారి శతజయంతి సంవత్సర మన్నమాట. బి.యన్. రెడ్డి గారు వీరికంటె రెండు వారాలు చిన్న. 25-వ తేదీన ఉదయించారు. చక్రపాణి గారు 1908 ఆగస్టు 5-న పుట్టారు. రామారావు గారు పూర్ణపురుషాయుష జీవితాన్ని అనుభవించి, కర్తవ్యకర్మలన్నీ నెఱవేరాక భుక్తశేషం తీఱి తమ తొంభైయవ ఏట 1992 జనవరి 9-న పరమపదించారు. ధర్మపత్ని లలితాంబ గారు 2005లో వారిని చేరుకొన్నారు.

చందమామ’ నామవిధాతగా ఆ చల్లని అనుబంధం కొద్దీ రామారావు గారు తమ యింటికి ‘వెన్నెల’ అని పేరు పెట్టుకొన్నారు.

వారు బహువిషయకోవిదులు. రమణ మహర్షి నుంచి కళ్యాణానంద భారతీ మాంతాచార్యుల వఱకు; ఎం.జి. రామచంద్రన్ మొదలుకొని ఎన్.టి. రామారావు దాకా; కొడవటిగంటి నుంచి కొసరాజు దాకా; సర్వేపల్లి నుంచి సత్యజిత్ రాయ్ దాకా; కవులు – కళాకారులు – చిత్రకారులు – శిల్పులు – సంగీతజ్ఞులు – స్వాతంత్ర్య సమరయోధులు – విద్యావేత్తలు – పారిశ్రామికవేత్తలు – రాజకీయనాయకులు – మంచివాళ్ళు – చెడ్డవాళ్ళు ఆయనకు తెలియనివారు లేరు. జీవితంలో ఒడిదుడుకులన్నీ చవిచూసిన విరాగి. ఎంత సహృదయులో అంత గొప్ప చమత్కారి.

      రామారావు గారికి ఆంధ్రదేశం అంటే ప్రాణం. ఆ ఆంధ్రత్వాభిమానంఒక్కొక్కప్పుడు మితిమీఱి శ్రుతిమించినంతగా ఉండేది. ఆంధ్రులు, ఆంధ్రదేశం, ఆంధ్రజాతి, ఆంధ్రభాష అంటే పులకించిపోయేవారు. ఆంధ్రులు – తెలుగువారు ఒకరేనా? తెలుగు భాష ఏ ప్రాంతంలో ఎప్పుడు ఏ రూపంలో మొదలయింది? జాతీయభాషగా తెలుగుకు గల అర్హతలేమిటి? బోధనా సంస్థలు, స్వచ్ఛందసేవాసంస్థలు తెలుగు భాష పునరుజ్జీవానికి ఏమి చేయాలి? అన్న అంశాలపై ఆయన ప్రతిపాదించినన్ని మౌలికమైన ఆంధ్రత్వ సిద్ధాంతాలపై ఏ పరిశోధకుడు గాని, తెలుగు సంస్థ గాని, విశ్వవిద్యాలయం గాని, అధికార భాషా సంఘం వారు గాని కృషి చెయ్యలేదంటే అతిశయోక్తి కాదు.

రామారావు గారు పాత్రికేయభీష్ములు. కలకత్తాలో ఉన్నప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కోరికపై “మోడరన్ రెవ్యూ” పత్రికలో; ఆపై “అమృతబజార్” లోనూ పనిచేశారు.  అక్కడే ఉంటూనూ; ఆ తర్వాతనూ అనేక తెలుగు, తమిళ కన్నడ, మరాఠీ చలనచిత్రాల నిర్మాణంలో సహాయపడ్డారు. చక్రపాణి గారిని మాటల రచయితగా, అక్కినేని నాగేశ్వరరావు గారిని నాయకునిగా పరిచయం చేసిన “ధర్మపత్ని” చిత్రానికి వీరే నిర్వాహకులు.

జీవితంలో మంచీ చెడూ అన్నీ అనుభవించి, నిండైన మెండైన జ్ఞాపకాలుండటం ఒక అపురూపమైన అదృష్టమని రామారావు గారిని కలుసుకొన్న వారెవరైనా వెంటనే అంగీకరిస్తారు.

యాభైయేళ్ళుగా మద్రాసులో ఉన్నప్పటికీ, “మా ఆంధ్ర; మీ మద్రాసు” అనేవారు ఆయన.

ఒకసారి వారింట్లో దొంగలు పడ్డారు. “డన్ వంది వీట్టిల్ డిట్టి పోయిటాన్” అని చెప్పారు మిత్రులతో!

తమిళంలో “తిరుడన్” అంటే “దొంగ” అని అర్థం. “తిరు” అంటే “శ్రీ”కి పర్యాయపదమైన గౌరవార్థకం కదా. దొంగకు శ్రీ ఎందుకని ఆయన తర్కం. “తిరుడన్” (దొంగ), “తిరుడిట్టి (దొంగిలించి)” శబ్దాలలో నుంచి శ్రీకారాన్ని తొలగించివేశారు!

ఉత్తరాలలో భాష ఎంత అందంగా వ్రాయాలో ఆయనను చూసి నేర్చుకోవాలి. అక్షరాలు మాత్రం కుదురుగా అర్థమయేవి కావు.

నేను విష్ణుపురాణం అనువదిస్తున్నానని తెలిసి – నాకొక గొప్ప సూచన చేశారు. సంస్కృతం లాగానే తెలుగు అనువాదం కూడా ద్వైతులకీ అద్వైతులకీ విశిష్టాద్వైతులకీ అందఱికీ సమానంగా అనువర్తించాలి. అనువాదకుడి పక్షపాతం అందులో ఉండకూడదు. నువ్వలా చెయ్యి, అని వ్రాశారు.

ఎంత అనుభవం ఉన్నవారికి స్ఫురించే అపురూపమైన ప్రమాణం అది!

ఒకసారి ఏదో సన్మాన సంచికలో ఆయన ఫోటో అందంగా పడిందని నేనన్నానని మిత్రులెవరో ఆయనకు చెప్పారట. వెంటనే,

“అచ్చొత్తువాఁడు నేర్పరి”

అని నాకు కార్డు వ్రాశారు.

ఆ “అచ్చొత్తువాఁడు” ఆయన ప్రాణమిత్రులు, మద్రాసులో క్రాంతి ప్రెస్ అధిపతి, ప్రఖ్యాత నవలా రచయిత, కథకులు, పత్రికా సంపాదకులు శ్రీ ధనికొండ హనుమంతరావు గారు.

ఒకరోజు రామారావు గారు ధనికొండ హనుమంతరావు గారింటికి వచ్చి, మాట్లాడటం పూర్తయాక – బయలుదేరబోతుండగా, గుమ్మం దగ్గఱ చెప్పు ఉంగరం తెగింది.

“ఎప్పుడూ పాతవే తొడుక్కోకపోతే, అప్పుడప్పుడు చెప్పులు కొనుక్కోరాదుటయ్యా!” అన్నారు ధనికొండ, మిత్రునితో సరదాగా.

ఇవి కొత్తవేనోయి. మీ మద్రాసులో పాదరక్షలు పాత రక్షలు అవుతాయిగా!”

అన్నారు రామారావు గారు తడుముకోకుండా.

తమిళంలో “త” – “ద” ల లేఖనసంకేతం ఒకటే కనుక – ఆ ఉచ్చారణ తడబాటు పైని చమత్కారం.

ఆసుపత్రి టీ

      తెలుగుదేశంలోని ఆరాధ్య బ్రాహ్మణ కుటుంబాలలో పండితారాధ్యులవారు తాలోత్తాలమూర్తులు. సనాతన ధర్మావలంబనకు, శైవాగమదీక్షా సంప్రదాయానికీ పేరెన్నిక గన్నవారు. ఆ పండితారాధ్యుల కులాన్వయరత్నదీపం చిన వీరేశలింగం గారు.

పండితారాధ్యుల వంశంలో భక్తులూ, మహనీయకవులూ చాలామంది ఉదయించారు. వారిలో వీరేశలింగం గారు గొప్ప భక్తకవి. భక్తకోటికి ప్రత్యక్షదైవం శ్రీ సూర్యనారాయణస్వామికి సమర్పణగా సూరేశ్వర శతకమును రచించిన ధన్యాత్ములు. ఆయన పూజాఫలంగా జన్మించిన సూర్యనారాయణమూర్తి గారు కూడా మంచి పండితులు, అష్టావధాని. ప్రసన్నగంభీరంగా విరాజిల్లే ఎన్నో కావ్యాలు చెప్పారు. ఆయన ఆహుక చరిత్రము పంచకావ్యాలనూ పిండిపెట్టిన పంచామృతమంటే సరిపోతుంది. అల్లసాని పెద్దన్నగారి మనుచరిత్రకు సాటినిలిచే రసోదంచితకావ్యమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాస్థానకవి, కవిసార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి గారంతటివారు ప్రశంసించారు. ఆ మహనీయుని సంతానం శ్రీ చిన వీరేశలింగం గారు.

కోనసీమలోని క్రాపచింతలపూడి వారి జన్మస్థలం. 1922 జులై 2 జననదినం. బాల్యం నుంచి విద్యాభ్యాసం తప్ప మఱొక ధ్యాస లేదు. గురువుగారు చెప్పింది ఒకసారి వినడమే గాని మళ్ళీ పుస్తకం పట్టి చదవాల్సిన అవసరం రాలేదు. ముమ్మిడివరం, అమలాపురం, కాకినాడల్లో ఇంటర్ దాకా చదివి 1940లో ఆంధ్రా యూనివర్సిటీకి బి.ఎ. తెలుగు (ఆనర్స్) అధ్యయనకు వచ్చి చేరారు. బంగారుకు తావి అబ్బినట్లు అక్కడ వారికి పింగళి లక్ష్మీకాంతం, గంటిజోగి సోమయాజులు, మల్లాది సూర్యనారాయణశాస్త్రి, వజ్ఝల చినసీతారామస్వామిశాస్త్రి, అబ్బూరి రామకృష్ణారావు గారి వంటి గురుదేవుల సన్నిధిసేవ లభించింది. ఆ దర్శనాంత స్వాధ్యాయసంపన్నుల శిక్షణలో చిన వీరేశలింగం గారు ప్రతిభావ్యుత్పత్తులకు మెఱుగులు దిద్దుకొన్నారు. తెలుగువారు గర్వింపదగిన ఉత్తమభావుకుల్లో ఒకరుగా రూపొందారు.

కవిత్వం వారికి ఏడేడు తరాల నాటి సొమ్ము. బాల్యంనుంచి అన్నగారు పెదవీరేశలింగం గారు అన్నిటా మార్గదర్శకులు. ఆ రోజుల్లో వారు ధారావాహికంగా చెబుతుండిన పద్యాలను చూసి వీరూ లక్షణశాస్త్రం చదవటం మొదలుపెట్టారు. చిదిమితే పాలుకారే చెక్కుటద్దాల లేతవయస్సులో, ఎనిమిదో ఏట వారికి ఛందోమయవాణి దర్శనభాగ్యాన్ని ప్రసాదించింది.

      ఆ.వె.      దుష్టు లధికమైరి, దుష్టుల కాలంబె

                     యిది; దురితగుణంబు లెక్కువాయె!

                     మతము లంతరించె, మతమందు నభిమాన     

                     వంతులును మడిసిరి వసుధ నిపుడు.

అని చెప్పారు, 1931లో తన మొట్టమొదటి పద్యాన్ని.

చాలా చిన్న వయస్సులోనే, 1944లో వారు బందరు హిందూ కాలేజీలో ఉపన్యాసకులుగా ఉద్యోగంలో ప్రవేశించారు. అక్కడ ఉండగానే వారి స్వకపోలకల్పిత కావ్యం “స్వప్నవాల్మీకము” వెలువడింది. ఆ మఱుసటి సంవత్సరం ఆయన ఏలూరుకు బదిలీ అయ్యారు. 1962లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో లెక్చెరరుగా చేరారు.

నాకు తెలిసి తెలుగుదేశంలో వారివలె గిరిశిఖరపతన్నిరర్గళస్రవంతీప్రవాహవేగంతో సంస్కృతం మాట్లాడగల వక్తలు అరుదు. మహాపండితులు; మహావక్త. కాళిదాస మయూరులూ, పెద్దన పోతనలూ, మిల్టన్ మహాకవీ ఆయన మనసు చూరగొన్నవారు. వసుచరిత్ర శైలి అన్నా అభిమానమే కాని, శ్రీనాథుని పేరు వచ్చేసరికి ఆయన తన్మయులైపోయేవారు. ఒక అలౌకికానంద పారవశ్యంతో శ్రీనాథుని పద్యాలను పాతకాలపు రాగధోరణిలో పాడుతూ పాడుతూ మైమఱచిపోయేవారు.

హరవిలాసానికి వ్యాఖ్యానం ఆయన చెబుతుంటే నేను వ్రాసిపెట్టే ఒప్పందం కుదుర్చుకొన్నాము. అలా ఊరించారే గాని చివఱికి ఆయన జీవితపరిస్థితులు అనుకూలించలేదు.

ఆ రోజుల్లో తెలుగు పండితు లందఱిలాగే మేష్టారికీ చిన్నప్పుడే ముక్కుపొడుం అలవాటయింది. పల్చటి రేకు డబ్బీలో తూర్పు గోదావరి నుంచి తెప్పించిన మంచి పొడుం అట్టిపెట్టుకొనేవారు. తలనొప్పి వచ్చినప్పుడు అదే వారికి సంజీవనీ మంత్రం. అందువల్ల దానికి “శిరస్త్రాణం” అని ముద్దుపేరు.

బందరు కాలేజిలో చేరిన కొత్తల్లో మేష్టారికి ఒకరోజు తలత్రిప్పు మొదలయింది. ఇంట్లో నస్యం పట్టు లేదు. సూర్యుడు ఇనపచేటలతో నిప్పులు చెఱుగుతున్న మధ్యాహ్నవేళ. కొట్లల్లో ఎక్కడ వెతికినా దొరకలేదు. ఆగ్రహం పట్టలేక ఆశువు పైకుబికి వచ్చింది:

     చ.    ఇవమునఁ గొంకువోయినదొ! యెండకుఁ జేడ్పడెనో! యధోనభః

              పవనముచేత మూర్ఛిలెనొ! పావకజిహ్వల లీఢమయ్యెనో!

              వివర మెఱుంగరాదు; సుకవిత్వ విలాస విహారహేతు వై

              భవ మగు నస్యమే కఱవుపట్టెను – బంద రిదేమి యూరొకో!

అని. కాకినాడ ఆంధ్ర సారస్వత పరిషత్పత్త్రికలో కొన్ని కొన్ని పద్యరచనలను, వ్యాసాలను ప్రకటించారు.

వారు స్థితప్రజ్ఞులు. భగవంతునిపై అచంచలమైన విశ్వాసం. ప్రతినిత్యం శివపూజ చేసుకొనేవారు. తండ్రిగారే దీక్షాగురువు. పంచ పంచ ఉషఃకాలంలో స్తోత్ర నివేదనం, భస్మస్నానం, భస్మధారణం, రుద్రాక్షధారణం, సంధ్యావందనం, లింగార్చనం, ఇష్టదేవతారాధనం, నైవేద్యం – ఇదీ వారి పూజాక్రమం. మెడలో శివలింగానికి నివేదింపనిదే పచ్చి మంచినీళ్ళయినా ముట్టుకోరు. 1987లో వారు ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పదవీ విరమణ చేసే దాకానూ శ్రీ వేంకటేశ్వర కళాశాలలో అధ్యాపకునిగా, సహవ్రతునిగా నాకు  వారి సన్నిధిరూపమైన పెన్నిధి, శిష్యత్వం సమకూడాయి.

మేష్టారు గొప్ప సరస సల్లాపకోవిదులు. అవి చెబుతూ పోతే ఒక పుస్తకం అవుతుంది.

మేష్టారికి టీ అంటే ప్రాణం. దానికోసం ఎంత దూరమైనా “టీ”ర్థయాత్రలకు వెళ్ళాలనేవారు. మంచి టీ త్రాగేవారి జాతకచక్రాలు సేకరించి ఆ గ్రహయోగాన్ని పరిశోధించాలనేవారు. దేశవిదేశాల తేయాకుపై ఒక వస్తుగుణదీపికను తయారుచేశారు. ఆ నానావిధాల తేనీటిని వైవిధ్యాలను ఇంటికి వెళ్ళినపుడు రుచిచూపించేవారు.

ఒకరోజు నేను, “గూడూరులో మంచి టీ దొరికేదేమో. ప్రబంధ పరమేశ్వరుడు ఎఱ్ఱాప్రగడ –

      మ.  నిను సేవించినఁ గల్గు మానవులకున్ వీటీవధూటీఘటీ

              ఘనకోటీశకటీకటీతటిపటీగంధేభవాటీపటీ

              రనటీహారిపటీసువర్ణమకుటీప్రచ్ఛోటికాపేటికల్

              కరుణామ్నాయమహాతురంగ! శివలింగా! నీలకంఠేశ్వరా!

అన్నాడు” అని అంటే, కళ్ళ నిండుగా కలకల నవ్వారు.

పదవీ విరమణ చేసిన వారానికే మేష్టారికి ఇంటిముందే ఘోరప్రమాదం జరిగింది. కారువాడొకడు ఢీకొట్టి పాఱిపోయాడు. జి.టి.బి. హాస్పిటల్లో చేర్చారు. శస్త్రచికిత్సలు జరిగాయి.

ఆ వార్త నాకు తెలిశాక మేష్టారిని చూడటానికి వెళ్ళాను. హాస్పిటలు ముందొక టీ దుకాణంలో ముందు నీళ్ళలో పెద్ద కాబూలీ ఏలకులు వేసి మఱిగించి, ఆ తర్వాత టీ కాచి – ఫ్లాస్కు నిండుగా పోసి ఇచ్చాడు. దానితో లోపలికి వెళ్ళాను.

గురుపత్ని నన్ను చూసి, “అయ్యో, ఎంత ఇబ్బందయిందో! మేష్టారికోసం టీ తెచ్చారా?” అని నొచ్చుకొన్నారు.

మేష్టారు భరింపలేని బాధతో మూలుగుతున్నారు. నన్ను చూసి నవ్వుతూ, ఆమెతో అన్నారు:

“హాస్పిటల్లో టీ ఇస్తేనే హాస్పిటాలిటీ అంటారే!”

ఇబ్బంది

      “ఇబ్బంది” అంటే జ్ఞాపకం వచ్చింది: ఆత్మాన మాత్మ న్యవలోకయామి.

ఒకరోజు రాత్రి పదకొండు గంటలకు వీథి చివఱి సన్నిహిత మిత్రుడొకడు ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. టెలిఫోన్ల రోజులు కావవి. గురువుగారే తలుపు తీశారు.

“ఏదో పద్యంలో సందేహం … రాత్రిపూట ఇబ్బంది పెట్టినందుకు … క్షమించాలి.”

గురువు గారన్నారు:  “వేటగాడొకడు అడవికి వెళ్ళాట్ట. ఎదురుగా ముళ్ళపందొకటి కనుపించింది. అతనికేసి చూస్తూ, ఒళ్ళు ముడుచుకొని, ఉండ చుట్టుకొని – ముళ్ళు విప్పార్చి, కుప్పించి అతని మీదికి దూకబోతోంది. అతను ఎడమచేత్తో వింటిని ముందుకు తీసి, బద్ద నిలువు చూసి, కుడిచేత్తో తాడు పోసి, నడుము పొదిలోంచి బాణం బయటికి లాగి, అల్లెతాటికి తొడిగి, చుట్టుతిప్పి కంచెముడి వేసి, గుఱి చూసి, ఎక్కుపెట్టి, చెవిదాకా నారి సారించాడో లేదో – అంతలో అటునుంచి మఱో ముళ్ళపంది మీదికి దూకబోతూ కనిపించింది. ఎటూ తేల్చుకోలేని సందిగ్ధావస్థలో పడ్డాడు: బాణం దీని మీదికి వదిలేదా? ముందు దాని మీదికా? అని. మొత్తాని కెలాగైతేనేం, ముందు చూసినదాన్ని ముందు పడగొట్టి, ఆ తర్వాత త్రుటిలో రెండవదాన్ని తప్పించుకొని, దీన్నీ చంపి, దాన్నీ చంపి, రెండింటినీ బుజాన వేసుకొని ఇల్లు చేరే సరికి తల ప్రాణం తోకకు వచ్చినట్లయిందట.

మఱుసటి రోజతను పిల్లల్ని చుట్టూ కూచోబెట్టుకొని వాళ్ళ ఒళ్ళు గగుర్పొడిచేట్టు కథంతా పూసగుచ్చి వినిపించాడు. “ముందు ఇటొక పంది; ఆ తర్వాత అటొక పంది” అంటూ.

ఆ విధంగా “ఇరు + పంది” అన్నదే “ఇర్పంది” అయి, “ఇర్బంది” అయి, చివఱికి “ఇబ్బంది” అయింది.

ఇప్పుడంత ప్రాణాంతకం ఏమీ కాలేదు కాబట్టి ఇబ్బందేమీ లేదులే. నువ్వు “ఇబ్బంది” అనాల్సిన పనిలేదు. పైగా ఇద్దఱు కూడా కాదు; ఒక్కడివే వచ్చావు. ఇబ్బందెలా అవుతుంది?

లోపలికి రా. వచ్చి కూచో. పద్యమేమిటో చెప్పు.”

తిరోగమనం – తిర్యగ్గమనం

 

      బూదరాజు రాధాకృష్ణ గారు, రాంభట్ల కృష్ణమూర్తి గారు ఇద్దఱూ సంభాషణాచతురులే. ఒకరిని మించిన వారొకరు.

ఒకరోజు ఆస్పత్రిలో ఇద్దఱూ ఎదురుపడ్డారు.

రాంభట్ల కృష్ణమూర్తి గారు పలకరింపుగా, “ఆరోగ్యమా? హెల్తా?” అని అడిగారు.

ఆరోగ్యమంటే “అరోగస్య భావః” అని కదా. “నాకేమీ లేదు” అనే అరోగభావనే “ఆరోగ్యం” అన్నమాట. Heal అయినప్పటి భావమే health. రోగం వచ్చి, ఆపై నయమైనప్పటి స్థితి హెల్త్ అవుతుంది.

రోగమేదో వచ్చి నయమయిందా? రోగం లేదనుకుంటూనే వచ్చావా? అని అడిగారన్నమాట.

బూదరాజు వారేం తక్కువా?

        “ఏదో ఒకటి నా బొంద. Vertical గా లోపలికి వచ్చి, horizontal గా బయటికి వెళ్ళకుండా ఉంటే చాలు.”

అంకె ప్రాస

      కవుల చిత్రోక్తులెప్పుడూ చిత్తవిస్తారరూపంగా ఉంటాయి. సహృదయ హృదయాహ్లాదకరంగానూ, సస్మయవిస్మయాపరంగానూ ఉంటాయి. అందులోనూ విశేషధీమంతుల విశిష్టవైయక్తికోక్తులలో చిత్రోక్తులు, ఛలోక్తులు, ప్రగల్భోక్తులు, ప్రత్యుక్తులు, వ్యంగ్యోక్తులు, వ్యాజోక్తుల హాస్యోక్తిచమత్కారచంద్రహాసాలు కన్నులకు మిఱుమిట్లుగొలుపుతాయి.

పరిహాసం ఒక్కొక్కప్పుడు పవిత్రమైన వస్తువును కూడా గమనించదని మహనీయులు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారన్నారు. ఆ మాట నిజం. వక్తృ-శ్రోతల అధికారాన్ని బట్టి, సందర్భించిన సంగతిని పురస్కరించుకొని – హాస్యానికి విషయం కానిదంటూ ఏమీ ఉండదు.

మా చిన్నప్పుడొకసారి మా నాన్నగారు ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారికి బాల్యమిత్రులు, అభ్యుదయ కవి, ‘చక్రఘోష’ కావ్యకర్త, ప్రఖ్యాత చిత్రకారులు, మనదేశంలో దూరదర్శన్ ప్రసారాలు ప్రారంభం కానున్న తొలిరోజులలో టి.వి. కోసం భారతీయనటులతో, రష్యన్ సాంకేతిక నిపుణులతో నలుపు తెలుపుల్లో మొట్టమొదటిసారిగా ‘రామాయణం’ లఘుచిత్రాన్ని నిర్మించి ఆంధ్రులకు గర్వకారణమైన చిత్రదర్శకులు శ్రీ గిడుతూరి సూర్యం గారు 1969 ప్ర్రాంతాల పంచకళ్యాణి దొంగలరాణి అని ఒక చలనచిత్రాన్ని నిర్మిస్తూ,  అందులో  ఒక   ముఖ్యమైన   పాట  వ్రాయాలని  చెప్పి  టి.నగర్లో  ఉన్న సినిమా ఆఫీసుకు తీసుకొనివెళ్ళారు.

 

 

 

 

 

 

 

ఆకుల అప్పల్రాజు గారని సంగీత దర్శకులు ఎ.ఎ. రాజు అనే పేరుతో దానికి సంగీతం సమకూర్చారు. ఆయన సాలూరు రాజేశ్వరరావు గారికి శిష్యులు కావడం వల్ల గురువు గారిని కూడా మొదటి సమావేశానికి రమ్మని పిలిచి, స్వయంగా తామే అక్కడికి తీసుకొనివచ్చారు. సూర్యం గారికి అభ్యుదయ సాహిత్యోద్యమం తొలిరోజుల నుంచి ఆప్తమిత్రులైన శ్రీశ్రీ గారు కూడా వచ్చారు.

 

నాన్నగారు హార్మోనియంపైని సంగీత వరసను వింటూ

 

“ఉదయించిన సూర్యునిలా

                ప్రతిమనిషీ కదలాలి,

                నినదించిన దుందుభిలా

                ప్రతిహృదయం పలకాలి,

                పదవే పదవే

                పదపదపదవే కళ్యాణి!,

                పదవే పంచకళ్యాణి!”       

అంటూ పాట చెప్పటం మొదలుపెట్టారు. రాజేశ్వరరావు గారు ఆ రాగం పోకడను, అందమైన రవళిని, గుఱ్ఱపు కాలిగిట్టల సవ్వడిని, నాన్నగారి పాటను చాలా మెచ్చుకొన్నారు. శ్రీశ్రీ గారు “సిగరెట్ పొగరీకృతు”లై మందహాసం చేశారు.

 

ఒకమూల చాపమీద నేను శ్రీశ్రీ గారి ప్రక్కనే కూర్చున్నాను. మాతో ఆ సినిమాలో నటిస్తున్న ఏడిద గోపాలరావు గారు, డా. రంగారావు గారని హోమియో వైద్యులు, మంచి వాచికం కలిగిన నటులొకాయన ఉన్నారు.

మా నాన్నగారికి శ్రీశ్రీ గారంటే దేవుడే. శ్రీశ్రీ గారికి నాన్నగారంటే అభిమానం. శ్రీశ్రీ గారి ‘మహాప్రస్థానం’ గేయంలోని “శివసముద్రమూ, నయాగరా వలె ఉరకండి” అన్న దళాన్ని చిన్నప్పుడు వ్రాతప్రతిగా ఉన్న రోజుల్లోనే చదువుకొన్నందువల్ల ప్రభావితులై మా నాన్నగారు నరసరావుపేటలో తాము స్థాపించిన నవ్య కళా పరిషత్తు పక్షాన కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాసు గార్లతో కలిసి 1944 ఆగస్టులో అనిసెట్టి సుబ్బారావు – లక్ష్మీదేవి దంపతులకు పెళ్ళికానుకగా అభ్యుదయ కవితా యుగంలో అచ్చయిన తొలి వచనగేయకావ్యం ‘నయాగరా’ను వెలువరించారు.

సరిగా నేను పుట్టిన యేడాదే శ్రీశ్రీ, ఆరుద్ర, అబ్బూరి వరదరాజేశ్వరావు గారలు మా నాన్నగారికి “మేమే” అని ఒక అరాచక శబ్దచిత్ర కావ్యాన్ని అంకితం ఇచ్చారు. నేను ఆ సంగతిని చెబుతూ, మాటల మధ్య శ్రీశ్రీ గారిని ఆయన టెలిఫోను నెంబరు అడిగాను.

శ్రీశ్రీ గారు నవ్వుతూ అన్నారు:

“రాసుకో. 4314 అని ముందు గుర్తుపెట్టుకో, ఎందుకో చెబుతాను.

1.           నా పేరు “శ్రీ-శ్రీ” కనుక – చివర “శ్రీ” అంటే “త్రీ”. నా టెలిఫోను నెంబరు: 4314-3.

2.         ఆరుద్ర అనగానే ఆరు కనుక చివర ఆరు. ఆరుద్ర నెంబరు 4314-6.

3.         దాశరథి కవిత్వం సంగతి టెలిఫోనువాళ్ళే నిర్ణయించారు. కాబట్టి దాశరథి ఫోను నెంబరు 4314-0.”

 అధివాస్తవికత

      శ్రీశ్రీ చనిపోయాక నరకానికి వెళ్ళారు. శిక్షలను అమలుచేయటానికి యమభటులు వచ్చారు.

“నేనేం తప్పుచేశాను?” అని శ్రీశ్రీ అడిగారు. “అన్నీ తప్పులే చేశావు. సంప్రదాయాన్ని కాలరాచావు. భావకవులకు మంగళం పాడావు. వచనకవిత్వం రాశావు. ఛందోబందోబస్తులన్నీ ఛట్ ఫట్ మని తెంచిపారేశావు. ధ్వంసనచణ హింసరచన చేశావు. నీకందుకే శిక్ష.”

చేసేది లేక, “ఇప్పుడేం చెయ్యబోతున్నారు?” అని శ్రీశ్రీ అడిగారు. “నరకంలో రకరకాల శిక్షలున్నాయి. ఎంతైనా, కవిత్వం రాశావు కదా, నీకు ఏ గది కావాలో చెప్పు” అన్నారు వాళ్ళు.

“ఏదీ, ఆ గదుల్ని చూసుకోనివ్వండి” అన్నారు శ్రీశ్రీ.

అందఱూ శిక్షాస్థలికి వెళ్ళారు. రౌరవాది నరకాలను చూస్తూ నడుస్తున్నారు. ఒక గదిలో మనుషుల్ని ఘోరంగా నఱికి పోగులుపెడుతున్నారు.

మఱో గదిలో అంతకన్నా దారుణం. చాలామంది తెలుగు కవులున్నారు. బాధలు సహించలేక గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళని ఒక్కొక్కరినిగా మండే నూనెలో వేయిస్తున్నారు. వేయించి, ఉప్పూకారం అద్దుతున్నారు.

శ్రీశ్రీకి కడుపులో దేవినట్లయింది. “ఛీ ఛీ, ఎమర్జెన్సీలో కూడా మా దేశంలో ఇట్లా హింసలు పెట్టలేదు. ఇదేం దారుణం?” అన్నారు. అలా ఒక్కొక్క కక్ష్యనూ చూసుకొంటూ ఇంకా ముందుకెళ్ళారు.

ఒక గదిలో విశ్వనాథ సత్యనారాయణగారు హాయిగా రంభతో ఇంద్రభోగాలను అనుభవిస్తూ ‘శృంగారవీథి’లో పద్యాలను పాడుతున్నారు.

శ్రీశ్రీ ఉద్రేకం పట్టలేక, “నాకీ గది కావాలి” అని అరిచారు.

యమభటులు మొహామొహాలు చూసుకొన్నారు. వాళ్ళలో శిక్షాధికారి అన్నాడు:

“క్షమించాలి. నిన్న దేవేంద్రులవారికి ఎందుకో రంభమీద కోపం వచ్చింది. దాన్ని హింసించమని ఇక్కడికి పంపించారు.”

     ఎవరు చెబితే గుర్తుండిపోయిందో.

 

ఆత్మజ్ఞానం

 

      1978 ప్రాంతాల బెంగళూరులో హ్యూమర్ క్లబ్ ఆఫ్ ఇండియా అని ఒక స్వచ్ఛందసంస్థ ఏర్పడి సదస్యులలో సంస్కారవంతమైన హాస్యదృష్టి ఏర్పడటానికి ఎంతో కృషి చేసింది. అందరూ ప్రతి ఆదివారం ఉదయం 10:30 కి సమావేశమై ఒక్కొక్కరూ కనీసం ఒకటైనా హాస్యోక్తిని వినిపించి హాయిగా నవ్వుకొనేవారు.

సభ్యులు కానివారు పాల్గొనాలంటే గుర్తింపు పొందినవారితో మాత్రమే రావలసి ఉండేది. సభ్యులు కానివారు సమావేశానంతరం భోజనాదులకు గాను కొంత ఎక్కువ మొత్తాన్ని చెల్లించాలి. సభ్యులు నిర్ణీతమైన వార్షిక సభ్యత్వ నియమావళి ప్రకారం నడుచుకోవాలి.

ఆ సంస్థలో సభ్యత్వానికి కొన్ని నియమాలుండేవి. ఆసక్తి గలవారు తమ పూర్తి వివరాల అభ్యర్థన పత్రంతో సభ్యత్వ రుసుముగా ఒక మౌలికమైన హాస్యోక్తి (జోక్) ని వ్రాసి, అది దేనికీ అనుసరణ కాదని హామీపత్రాన్ని జోడించి పంపాలి. అశ్లీలమైనవి, కుల మత వర్గ విద్వేషాలను రెచ్చగొట్టేవి అయినవాటిని అంగీకరించరు.

సంస్థ పాలక వర్గం సమావేశమై అభ్యర్థన పత్రాన్ని పరిశీలిస్తుంది. అది వారికి నచ్చకపోతే – నచ్చలేదన్న వ్యాఖ్యతోపాటు దానిని పంపివేస్తారు. నచ్చితే ఆమోదపత్రాన్ని పోస్టుద్వారా అందజేస్తారు.

ప్రఖ్యాత హిందీ చలనచిత్ర నటుడు ఫిరోజ్ ఖాన్ బొంబాయి నుంచి బెంగళూరుకు మాఱిన కొత్తలో అందులో సభ్యత్వాన్ని కోరుతూ అభ్యర్థన పత్రాన్ని పంపారు. ఆ ఊరు ఆయన జన్మస్థలమే కదా. తన పత్రంతో జోడించి ఒక హాస్యోక్తిని కూడా పంపారు.

పాలక వర్గానికి ఆ హాస్యోక్తి నచ్చలేదు. అది మౌలికం కాకపోవటానికి కారణం నటీనటులు ఎవరో రచయితలు వ్రాసిన సంభాషణలు ముక్కున బట్టి వల్లించడమే గాని స్వయానా వారిలో హాస్యదృష్టి అంతగా ఉండదని అర్థం వచ్చేట్లు – We regret our film actors do not have any sense of humour – అని సమాధానం వ్రాశారట.

ఆ విమర్శలోని ఎత్తిపొడుపు హాస్యార్థమేనో, అందుకు ప్రతిచమత్కారాన్ని ఆశిస్తూనో, లేక అదే వారి ముక్కుసూటి ధోరణి అనుకోవాలో!

ఫిరోజ్ ఖాన్ గారు ఆ మాటకు నవ్వుకొన్నారు. ఎంతైనా చలనచిత్రాల తిరుగులేని నాయకుడు. పైగా పఠాన్ రక్తం. ఓటమిని అంగీకరిస్తారా! ఆయన “మైఁ షాదీ కర్నే చలే” నాటి నుంచి అప్పటికి తను నటించిన ముప్ఫై అయిదు – నలభై చలనచిత్రాల పట్టికను వ్రాసి, “నేను నటుణ్ణి కానని నిరూపించటానికి సాక్ష్యం నా దగ్గర నలభై చిత్రాలున్నాయి” – I have forty films to prove that I am not an actor – అని మళ్ళీ సమాధానం వ్రాశారట.

వట్టి సభ్యత్వమే కాదు, ఆయనకు హ్యూమర్ క్లబ్ ఆఫ్ ఇండియా సంస్థ కార్యవర్గంలో ప్రవేశం కూడా లభించింది!

 

 

రోమింగు పైని సీలింగు

      ఇన్నీ అయ్యాక గృహస్థాశ్రమ విషయాన్నీ చెప్పవద్దూ?

ఒకరోజు నూజివీడు నుంచి డా. సూరి సీతారామయ్య గారు నా మొబైలు నెంబరుకు ఫోనుచేశారు.

      ఆయన విజయనగరం మహారాజా కళాశాలలో ఆంధ్ర శాఖాధ్యక్షునిగా పనిచేసి అసంఖ్యాకవిద్యార్థులను తీర్చిదిద్దిన ఉత్తమ ఉపాధ్యాయులు. మేధావి. వేలాదిమంది ప్రేక్షకులను తన వాక్పటిమతో మంత్రముగ్ధులను చేయగల మహావక్త. ఇటీవలే రిటైరయారు. ‘రామసూరి’ అన్న కలం పేరుతో చక్కటి కవిత్వం చెప్పారు. చిన్నప్పుడు మద్రాసులో మేము దేవులపల్లి కృష్ణశాస్త్రి గారింటికి, ఆరుద్ర గారింటికి, మహీధర రామమోహనరావు గారింటికి, కవితాసభలకు కలిసి వెళుతుండేవాళ్ళం. విద్యార్థిదశలో నాకు ఆదర్శమై, నన్ను చాలా ప్రభావితం చేశారు. చాలా కాలం తర్వాత 1974లో భీమవరం డి.యన్.ఆర్. కళాశాలలో ఎం.ఎ. నిమిత్తం మళ్ళీ కలిశాము. ఆయన నాకక్కడ ఏడాది సీనియరు. ‘ఆంధ్రభూమి’లో ఏదో నా వ్యాసాన్ని చదివి, ఢిల్లీలో ఉన్న నా నెంబరు తెలుసుకొని ఫోనుచేస్తే – ముప్ఫైయెనిమిదేళ్ళ తర్వాత మళ్ళీ మాట్లాడటం సంభవించింది.

ఆయన ఆప్యాయన వాక్యాలను వింటున్నపుడు నాకేదో ఉద్వేగం కలిగింది. కళాశాల రోజులన్నీ గుర్తుకు వచ్చాయి. 1975లో ఆయన మా వార్షికోత్సవ సభలో మైకుముందు సినారె లాగా కంచుకంఠంతో, స్పష్టమైన ఉచ్చారణతో, భావయుక్తంగా

               “పొలాల మీద సీలింగులు,

                ఇళ్ళ స్థలాల మీద సీలింగులు,

                సామాన్యుల అవసరాల మీద సీలింగులు”

అని చదువుతూ, చదవటం ఆపి, ఒక్క క్షణం వేదికమీది అధ్యక్షుల వారికేసి చూసి, ప్రేక్షకులకేసి చూసి, చేతిలోని కాగితం కేసి చూసి, అభిమానులం మాకేసి చూసి, మళ్ళీ అందుకొని, మెఱిసే కళ్ళతో నిర్భరావేశంతో

               “లేదేం మఱి కాస్టు ఫీలింగు,

                మీద రవ్వంత సీలింగు?”

అని నాటకీయంగా చదివిన ఆ అద్భుతమైన కవిత నా చెవుల్లో ఇప్పటికీ రింగుమని మాఱుమ్రోగుతూనే ఉన్నది. అది ఆ తర్వాత అచ్చుకాలేదు. ఆయన ఇటీవల ప్రకటించిన “అట్టహాసం” అన్న కవితా సంపుటంలోనూ ఆ కవిత లేదేమని నేను అడుగుతున్నాను. ఆ కవిత నాకు గుర్తున్నందుకు ఆయన చాలా సంతోషించి, ఈ మాఱు తప్పక అచ్చువేస్తానని మాటయిచ్చారు.

వారితో మాట్లాడుతూ, వారి మాటలను వింటూ, ఆ రోజులను నెమఱు వేసుకొంటూ నేను మాట్లాడుతున్నప్పుడు ఆవేశం కొద్దీ ఈ గదిలోంచి ఆ గదిలోకి, ఆ గదిలోంచి ఇంకో గదిలోకి వేగంగా పచార్లు చేస్తూ, నడుస్తూ మాట్లాడుతున్నాను.

ఆ హడావుడి నడకను చూస్తూ, నా అర్ధాంగలక్ష్మి లక్ష్మి అన్నమాటను మీకు విన్నవిస్తున్నాను:

“మీ ఫ్రెండెవరో ఆంధ్రా నుంచి మీ మొబైలుకు కాల్ చేస్తే, “రోమింగు” మీకు పడుతున్నట్లుందే?”

God గాడు

      నవ్వు నాలుగందాలను తెస్తుంది. ఇంటిల్లిపాదీ కలిసినప్పుడు హాయిగా తవ్వుకోవటానికి నవ్వుల గని కంటె తఱగని గని లేదు. ఎన్ని రత్నాలను వెలికి తీసినా, ఇంకా మిగిలే ఉంటాయి.

మా అమ్మాయి అనన్య చిన్నప్పుడు ఆఱేడేళ్ళుండగా ఒకరోజెందుకో రోచిష్ణు మీద చెయ్యిచేసుకొంది.

నేనన్నాను: “బంగారు తల్లీ! తప్పమ్మా. పిల్లల్లో దేముడుంటాడని అంటారు. తమ్ముడు రోచి నీకన్నా ఏడాది చిన్న కదా, కొట్టకూడదు. వాడు భగవంతుడితో సమానం అమ్మా. అచ్చమూ God అమ్మా!”

అమ్మాయి అన్నది: “అందుకే కదండీ, నేను వాణ్ణి రోచీ-గాడు అంటున్నాను, రోజూ!”

 

69 thoughts on “మఱికొన్ని జ్ఞాపకాలు

  1. mee article chala late ga chadivanu. chala kalam taruvata ramasuri gari gurinchi chadivanu mariyu aayana photo chusanu.nenu 1995 lo vzm nundi vellipoyanu. appatinundi saudi arabia lo vuntunnanu.1995 mundu nenu telugu sahitya sabhalaki mukhyamga vijaya bhavana sabhalaki velle danini. aasabhalaki aayana kuda vastu vundevaru. appudu aayanani chuse danini. aayana gurinchi chala vinedanini. aayana abhimanini. nenu 1998 lo vijaya bhavana ugadi varshikotsavam lo aayanani akharu sariga chusanu. malli intakalam taruvata aayana gurinchi chadavadam chala aanamdanini ichindi. kani aayana vzm vadili nuziveedu vellipoyarani telisindi. aayana leni vzm tala leni mondem vantidi. vuhincha lekunda vunnanu. eppatikaina aayanani okasari chudochu anukunedanini. ippudu aa aasa ledu. mee mulam ga aayanani mariokkasari gurthu chesukunnamu. anduku dhnyavadamulu.

  2. “మాలిక పత్రిక” లోని విషయాలు చూసి నేను చాలా సంతోషించాను. అందులోని చందమామ రామారావు గారి వ్యాసం నాకెంతో నచ్చింది. బహుశా నేను ఆయన మేనల్లుడిని అయినందుకనుకుంటాను. తర్వాత ఆ వ్యాసం నాకొక మంచి మిత్రుడిని కలిపింది. ఆయనే శ్రీ రవీంద్రనాథ్ ముత్తేవి. ఆయన నా హై స్కూల్ క్లాస్ మేట్. 42 సంవత్సరాల తర్వాత ఆయన ఎంతో ప్రయాసకు లోనై నా ఫోన్ నెంబరు, నా మైల్ ఐడి తెలుసుకుని నాకు పంపారు. ఇట్లా కలుసుకోవటం నాకు ఎంతో ఆనందమయింది.

    నమస్కృతులతో,

    ఎం. వి. నర్సు

  3. Ramasuri maastrari vyvidhyamaina drusti konaanni aaviskharimpa

    jeyadame kaakunda “attahaasam” nundi thappinchu kunna intha

    chakkani kavitha ni maa andariki andinchinanduku dhanyavaadaalu.

  4. It is a great pleasure finding Dr. Ramasuri garu on the web page of this magazine.I feel very much honored for being able to win sir’s affection and love as his colleague, in the Department of English.. He certainly deserves the credit that is bestowed on him by Elchuri garu. There was no instance in M.R.College where Dr. Rama Suri garu was not in the fore-front in any event. His words and his poetry have a lilting effect on the soul and they never fail to suffuse themselves with ideals and ideas which have become a part of the sensibility of every human being. I owe my thanks for his efforts to bring me back onto my writing endeavors. The words about Dr. Rama suri garu have pleased my father Sri B.S.N. Murty garu also, who was also his colleague. Every time either we meet him or read him, it is an enriching experience.
    B. Venu gopala rao

  5. sri rama suri garito parichayam o sameeram . rama suri purthi peru suri seetha ramayya garu . veeri mata madhuram .veeri prasangam vintunte M.V.L gurthuku vastharu . ramasuri nuzived ku makaam, maarchadam Vizianagaram lo varini miss ayyam.

    1. శ్రీ ఎన్.కె. బాబు గారికి
      పునరభివందనం!

      శ్రీ ఎమ్వీయల్ గారి లాగుననే శ్రీ రామసూరి గారు కూడా మహావక్త.

      కేవలం సభాప్రసంగాలలోనే కాదు; ఇంటిలోనూ, టెలిఫోనులోనూ వారితో మాట్లాడే అవకాశం కలిగినవారందఱికి స్వానుభవగోచరమైన సత్యం ఇది.

      మీ అభిమానానికి అభివాదాలు!

      విధేయుడు,
      ఏల్చూరి మురళీధరరావు

      1. sri ramasuri gari ni prati roju palukarinche adrustam avakasam naaku labhichadam naku yentho aanandam. eteevala ante 24-6-2012 na vijayanagaram lo vari prasangam vinnanu entho bavundi. ( sahitya academi -vaaru gurajada kanyasulkam py erpatu chesina meeting .)

    1. ప్రియసోదరి శ్రీమతి పద్మజ గారికి
      నమస్కారం!

      ప్రేమాడరాలు ఉట్టిపడుతున్న మీ లేఖకు ధన్యవాదాలు. చిన్నప్పుడు మీ పెద్దక్కయ్య గారు, బావగారల సన్నిధిని మేము గడిపిన అందమైన రోజులన్నీ గుర్తుకు వచ్చాయి. శ్రీ రామసూరి గారు స్వార్థనిర్ముక్తులై బాధ్యతను స్వీకరించి, పెద్దఱికం వహించి అన్నీ తానై సలక్షణంగా అక్కచెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేయటాన్ని స్మరణోత్సవంగా నెమఱువేసుకొన్నాము. వారితోడి పరిచయం మాకు గర్వకారణం.

      మీ అభిమానానికి, సాహిత్యాభిమానానికి కృతజ్ఞుణ్ణి.

      సవినయంగా,
      ఏల్చూరి మురళీధరరావు

    1. శ్రీ బంగారం గారికి నమస్కారం!

      నేను జ్ఞప్తికి తెచ్చిన సంగతెలా ఉన్నా శ్రీ రామసూరి గారిని గుఱించి మీరన్న మాటలు అక్షరసత్యాలు! ! !

      భవదీయుడు,
      ఏల్చూరి మురళీధరరావు

  6. sir, Namaskaraam. Dr. Rama Suri garitho mee gnapakalanu andaritho panchkonnanduku dhanyavaadamulu. vzm lo adugujada gura jada ithe Yuva kavuluku velugu daari rama suri. Vari aasayaala rupamyna Yuvaspandanaku pratispandana nenu. peda vidhyarthinyna nenu government college lo Telugu lecturer ga yadagadaniki karanam vari prothsahame. Vari spurthithone Memu ee madhya Utthraandhra Ugadi Kavithala poti Nirvahincham. niradambaradu, nigarvi, yuvakavula margadarsi Maa mastaaru.
    B.VIJAYAESWARA RAO,
    TELUGU LECTURER,
    8985079163.

    1. శ్రీయుత విజయేశ్వరరావు గారికి
      నమస్కారములతో –

      ఒక అవిశ్రాంత విద్యాదాత దాతృత్వగరిమను, అసంఖ్యాత యువతీయౌవనుల హృదయాలలో ఆయన నింపిన ఉద్యమనిర్మాణస్ఫూర్తిని, తత్కీర్తిని కార్తజ్ఞ్యతతో మూర్తికట్టిన మీకు నా అభినందనలు. మీ స్పందనకు ధన్యవాదాలు.

      భవదీయుడు,
      ఏల్చూరి మురళీధరరావు

  7. Dear Ramasuri garu-

    I have just now gone through the very emotional piece of writing about you.Really it is (your comment about no ceiling on caste feeling) is very good and appropriate.

    In the past I would have been much happier had I gone through this type of writing.But unfortunately my present post of Principal of a College which sits on my head like a Crown of Thorns drove out whatever delicate and tender feelings I have cultivated in the past.Principal post may be best for others but for the incumbent it will be the disgust! Anyway I am happy to meet you like this.With best wishes-Dr.Bh.Subrahmanyam from Vizianagaram on 11th April at 8.37 p.m.

    1. Dear Dr. Bh. Subrahmanyam garu,

      Thank you very much for your kind letter. I shall gladly convey your estimation of the quality and worth of Sri Ramasuri garu’s poetry and personality to him at the earliest.

      With warm regards,

      Sincerely,
      Elchuri Muralidhara Rao

  8. ఈ వ్యాసం నిజంగా అద్భుతం. సమయాభావం కారణంగా మరింత శ్రధ్ధగా చదవలేకపోయాను.
    మళ్ళీ తీరిగ్గా చదివి ఆనందిస్తాను మరింతగా. అప్పుడు మరింత విపుల వ్యాఖ్య పెడతానేమో!

    1. మాన్యులు శ్రీ శ్యామలరావు గారికి
      నమస్సుమాంజలి!

      మీ సహృదయావలోకనకు, సదయ సద్యఃస్పందనకు ధన్యవాదాలు. భగవదనుగ్రహం వల్ల మీకు సమయం లభించి శ్రద్దధానులై పూర్ణంగా చదివి చెప్పగల విపుల వ్యాఖ్యాత్మక సూచనకోసం మఱీ మఱీ ఎదురుచూస్తుంటాను.

      మీ వంటి పెద్దల ఆశీస్సుకు నోచుకోవటం కన్న అభిలషణీయం వేఱేముంటుంది కనుక!

      విధేయుడు,
      ఏల్చూరి మురళీధరరావు

  9. మురళీధరరావుగారికి,
    నమస్కారం.
    నేను ఆయన మిత్రుడినని రామసూరిగారు అంటారుగానీ, ఆయనకి నేనెప్పుడు శిష్యుడినే.
    విజయనగరం కాలేజీలో చదువుకునే రోజుల్లో, యువస్పందన పేరుతో వారింట్లో ఎన్నో సాహిత్య చర్చలు నిరంతరాయంగా జరుగుతూ ఉండేవి – సుమారుగా సాయంత్రాలన్నీ మాస్టారి ఇంట్లోనే!
    “ప్రపంచమంతా అర్థమైపోనక్కరలేదు, అందమంతా అనుభవించనక్కరలేదు – ఇదే కవిత్వాన్ని అస్వాదించటానికి సులభ సూత్రం” అని చెప్తుండేవారు. ఆవిధంగా కవిత్వాన్ని ఆస్వాదించగలగటం ఆయనిచ్చిన కానుకే!
    కృష్ణశాస్త్రిపై మాస్టారి పిహెచ్.డి థీసిస్‌కి బహుశా నేను మొదటి పాఠకుడిని అనుకుంటాను. దాన్ని ప్రచురించటంలో ఆయనకి సాయం చేస్తానని మాటిచ్చాను – థీసిసంతా, టైపుచేయించి, కొంతవరకూ ఏడిటింగు కూడా అయ్యింది. ఈ ఏడాది పూర్తి చేసి ప్రచురించాలి.
    అప్పట్లో, ఆయన విశాఖపట్నం రేడియోలో చదివిన కవిత:
    వికసించటమే నేరమని
    చెట్లని గాలికొరడాలతో శిక్షిస్తే
    రాలిన ఆ పూలన్నీ
    ఏ కొమ్మల కన్నీళ్ళు?
    ఈ కవిత నక్సలైట్లపై జరుగుతున్న ఎన్‌కౌంటర్లపై సంధించిన వ్యంగ్యాస్త్రమనుకుని అటుపైన చాలాకాలం పాటు మాస్టారిని పిలవలేదుట వాళ్ళు!
    ఇవ్వాళ మాస్టారే ఫోను చేసి మాలికలో మీ వ్యాసం గురించీ, మీ గురించీ చెప్పారు. పసందైన వ్యాసం చదువుతూ జ్ఞాపకాలు “రోమాం”చితమైనాయి. “మాటల మౌనవ్రతం, పాటై కాలం పెదాల పలకాలని” అని రామసూరి గారు డైలాన్ థామస్ స్పూర్తితో చెప్పిన కవిత గుర్తుకు వచ్చింది.
    ధన్యవాదాలతో,
    నాగరాజు

    1. మాన్యులు శ్రీ పప్పు నాగరాజు గారికి
      విహిత నమస్కారములతో,

      సువిజ్ఞాత విద్వద్రచయిత అయిన మీ లేఖ మూలాన ఎన్నో అవిజ్ఞాతవిశేషాలు తెలిశాయి. శ్రీ రామసూరి గారిని పూజ్యులు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారింటికి తీసికొనివెళ్ళి పరిచయం చేసినపుడు వారు ఆయన వాగ్ధోరణికి, సౌమ్యతకు, సాహిత్యసౌహిత్యానికి ముగ్ధులై “తఱచు వస్తుండ”మని చెప్పటం నాకింకా గుర్తున్నది. మీరిప్పుడు శ్రీ రామసూరి గారి కవితాత్మక బృహత్పరిశోధనగ్రంథాన్ని ముద్రింపబూనటం మీకు గురుఋణాపనోదకం; ఆ సువార్త నాకెంతో సంతోషకరం.

      ఆకాశవాణిలో పనిచేసిన కొందఱు (అ)వ్యక్తుల అత్యుత్సాహం మూలాన ఆ సంస్థ ఎందఱో మంచివారిని దూరంచేసుకొని నష్టపోవటం అందఱికీ తెలిసిన సంగతే.

      మీ కవితామయ సింహావలోకిత సుముఖ లేఖాముఖ ముఖరితమైన “సూ”ర్యాలోకానికి, స్పందనకు కృతజ్ఞుణ్ణి.

      వందనాలతో,
      ఏల్చూరి మురళీధరరావు

  10. గురువు గారూ, నమస్కారం.
    మీ సాహిత్య జ్ఞాన మాలికలో ఒక పువ్వైన ఈ మాలిక పత్రికను ఈ రోజే చూడడం జరిగింది. చాలా informative గా ఉన్నది. మేము టెక్స్ట్ పుస్తకాలలో అక్కడక్కడా చదువుకున్న కొందరు కవులతో,సాహిత్యవేత్తలతో మీ సాంగత్యం గురించి మీరు వ్రాసినది చదువుతూ ఉంటే , వారిని ఇక్కడ చూసినట్లు, వారితో కలిసినట్లు, మాట్లాడినట్లు భావన కలుగుతున్నది.
    ఇక ముందు కూడా ఈ పత్రికను follow అవుతాను.
    ధన్యవాదములు.

    1. శ్రీ వామన కుమార్ గారికి
      అబివందనం!

      మీ లేఖాముఖాన వర్ధిష్ణుకవ్యభిప్రాయం జ్ఞాతప్రాయమైనందుకు ఎంతో సంతోషంగా ఉన్నది.

      నా సాంగత్యమల్లా “తండ్రి” అనే సముద్రంలో చిన్న కెరటమైనందువల్ల అప్పుడప్పుడు ఒడ్డుకు వచ్చిన మహనీయుల పాదస్పర్శకు నోచుకోవటం మాత్రమే!

      మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞుణ్ణి.

      భవదీయుడు,
      ఏల్చూరి మురళీధరరావు

  11. అని చదువుతూ, చదవటం ఆపి, ఒక్క క్షణం వేదికమీది అధ్యక్షుల వారికేసి చూసి, ప్రేక్షకులకేసి చూసి, చేతిలోని కాగితం కేసి చూసి, అభిమానులం మాకేసి చూసి, మళ్ళీ అందుకొని, మెఱిసే కళ్ళతో నిర్భరావేశంతో…. wowww You are exactly right!!.. Ist Year Degree lo Maa next Class ki Ramasuri gaaru Telugu Lesson cheppe vaaru.. Maa class lo attendance vesukuni next class lo Rama Suri gaari Telugu Lesson vine vallam. Telugu Bhaasha meeda mamakaaram, Telugu Maaatadadam, Saahiti Rangaaniki seva chese adrustham kalagadam Kevalam Rama Suri Maastaari valane. Maha Kavi Gurajaada Saamskritika Samaakya staapanalo vaari krushi ananyam… vaaru appariki, ippatiki, eppatiki… Maaa…Staree.(Maastare)… Prakash, Secretary, Gurajada Samskritika Samaakya, Vizianagaram

    1. మాన్యులు శ్రీ కాపుగంటి ప్రకాశ్ గారికి
      నమస్సులతో,

      (మా స్టార్ అని మీరన్నట్లు) ఆంధ్రసాహితీవిహాయసంలో ధ్రువనక్షత్త్రమై వెలుగొందిన శ్రీ రామసూరి గారి శైష్యోపాధ్యాయికకు నోచుకొని మీరూ ఆ ప్రస్థానంలో కొనసాగటం అభినందనీయమైన విషయం. మీ సమాఖ్య ఉజ్జ్వలమైన సేవాహేవాకాన్ని గుఱించి శ్రీయుత ఉపాధ్యాయుల నరసింహమూర్తి గారితో కలిసి శ్రీ గురజాడ స్వగృహాన్ని సందర్శించినపుడు తెలిసికొన్నాను. మీరు చెప్పిన ఏతత్స్థాపనాదికవిశేషాల వల్ల వ్యాసాంశం ఇతోధికంగా సమగ్రమైనందుకు సంతోషంగా ఉన్నది.

      మీ అభిమానానికి ధన్యవాదాలు.

      భవదీయుడు,
      ఏల్చూరి మురళీధరరావు

  12. శ్రీ మురళీధర రావు గారికి ,
    నమస్కారం.చాల కాలమైంది మిమ్మల్ని కలిసి.నా ‘తెనాలి రామకృష్ణ కవి-శాస్త్రీయ పరిశీలన’ గ్రంథం మనల్ని కలిపింది.మీ వ్యాసాలు ‘సుజనరంజని’లో చూస్తున్నాను.మీరూ నా వ్యాసాలు చూస్తూ ఉండే ఉంటారు.
    మురళీధరుడు జ్ఞాన రుచి ప్రదాత అయిన ‘మిత్రుడు’ మాత్రమే కాదు; కుముద ‘హాసాల’ను పండించే తారాకమనుడు కూడానన్నమాట!!
    సాహితీ మూర్తులైన మీ నాన్నగారి కారణంగా లబ్ధప్రతిష్టులైన కవి పండితులతో బాల్యం నుంచే మీకున్న సాన్నిహిత్యాన్ని పురస్కరించుకుని వారి గురించి అందరికీ తెలియాల్సిన,కొందరికే తెలిసిన పలు విషయాలు ఏడు’రంగుల’లో ఆవిష్కరించి చక్కటి మీ శైలితో అందరినీ ప్రహ్రుష్టాంత’రంగుల’ను గావించారు.ధన్యవాదాలు.
    ‘చందమామ’ రామారావు గారికి, ‘నరుసు'(బి.వి.యల్.నర్సు పూర్తిపేరన్నట్లు గుర్తు.) కీ గల బాంధవ్యమేమిటో మీకు తెలుసా? నా చిన్ననాటి మిత్రుడు ‘నర్సు’, నేనూ తెనాలిలో పదకొండు, పన్నెండు తరగతులు కలిసే చదివాం.
    అతను ఎప్పుడూ మద్రాసులోని తమ ఇల్లు ‘వెన్నెల’ గురించి చెప్పేవాడు.అతడికీ నా వయస్సే- అంటే అరవయ్యేళ్ళు ఉండొచ్చు.మీకు తెలిస్తే ఆయన చిరునామా,ఫోన్ నంబర్ వగైరాలు తెలుపగలరు.
    కలకాలం మీరు ఇలాగే సాహితీ సౌరభాలను దశదిశలా పరివ్యాపనం చేయాలని నా ఆకాంక్ష.
    — ముత్తేవి రవీంద్రనాథ్,తెనాలి.

    1. మాన్యతల్లజులు శ్రీ ముత్తేవి రవీంద్రనాథ్ గారికి
      నమస్కారములు.

      మీ లేఖాముఖముఖరితమైన ఆత్మీయతాపరిమళానికి, సౌజన్యసురభిళతకు ధన్యవాదాలు. వర్తమానాంధ్రసాహిత్యంలో అత్యంత గంభీరమైన, సర్వాంతర్వర్తనీయమైన మహనీయగ్రంథాన్ని విరచించి, శ్రీ తెనాలి రామకృష్ణకవి కీర్తిమూర్తికి మళ్ళీ ప్రాణంపోసిన విమర్శవిధాతగా, మైత్రీకరచాలనకు పాత్రాపాత్రతలను పరిగణింపని అభిరూపమిత్రవర్యులుగా మీరెప్పుడూ నా మనోవిహాయసంలో వెలుగొందుతూనే ఉన్నారు. సుజనరంజనిలో అమోఘమైన మీ తర్కసంగతిని నిరూపిస్తున్న వ్యాసపరంపరను, ఇతరత్ర దృష్టిగోచరమైన మీ రచనాసర్వస్వాన్ని ఎప్పటికప్పుడు నేను అభిమానగౌరవాలతో చదువుకొంటూనే ఉన్నాను. మీ వంటి అసామాన్యవిద్వన్మణి ఒక సామాన్యుని సామాన్యరచనకు స్పందించటం మీ సహృదయతకు జయకేతనం!

      మీరు బి.వి.యల్. నరసు అని స్మరణోత్సవంగా స్మరించిన మీ బాల్యసఖులు నరసు గారు బహుశః శ్రీ చందమామ రామారావు గారి మేనల్లుడు శ్రీ మోదుకూరి వెంకట నరసు గారేమో! వారు తెనాలిలోనే చదివారు. వారి తండ్రిగారు తెనాలి రైల్వే స్టేషను మాస్టరుగా ఉండేవారట. వెంకట నరసు గారు బి.కాం చదివి; భద్రాచలం బోర్డులో ఉద్యోగం చేసి; ఇప్పుడు హైదరాబాదులో ఉంటున్నారు. వారి సెల్ నెంబరు 9502149176. మీరొక పర్యాయం మాట్లాడితే తెలుస్తుందేమో.

      విశాలమైన మీ విజ్ఞానపరిధికి మఱొక్కసారి జోహార్లు. మీ ఆదరానికి ఎల్లవేళల కృతజ్ఞుణ్ణి.

      శుభాకాంక్షలతో,
      ఏల్చూరి మురళీధరరావు

      1. శ్రీ మురళీధర రావుగారికి,
        మీ తక్షణ స్పందనకు ధన్యవాదాలు.నేను ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను.జూన్ పదిహేడున బయల్దేరి ఇండియా వస్తాను.తరువాత నరుసుగారినీ, మిమ్మల్నీ వీలయితే వ్యక్తిగతంగానే కలుస్తాను.ఇండియాలో నా మొబైల్ నంబర్
        98491 31029.విద్యుల్లేఖా సంకేతం: ravindranath52@gmail.com
        నమస్సులతో,
        మీ,
        రవీంద్రనాథ్.

  13. Respected Muralidhar garu,
    my greetings to you. I am one of the luckiest among the people who used to enjoy every word of Dr.Rama Suri.But I must thank you for quoting such a nice kavitha “Roaming pyni ceiling” which I am hearing for the first time.Though I had roaming around him for a long span of 23 years,it is happened through you. So kind of you sir.

    1. Dear Prof. Sri Prasad Rao Patnaik garu,

      I am indeed delighted to see the far and wide inspirational spell Sri Ramasuri garu had cast on a battery of young writers, poets and enthusiasts. The expertise and felicity of your subtle wordplay amply displays the kind of training he had imparted. I now realize that I should have gathered more information on the indelible imprint he had made on so many influential authors before meaning to write this. We all should pool in efforts to bring out his creative writings and a critical book on him to pay at least a part of our debt to him.

      Thank you very much for sharing your experience and, the kind comment, Sir.

      With regards,

      Sincerely,
      Elchuri Muralidhara Rao

  14. మీ జ్ఞాపకాలు చాలా మనోరంజకం గా ఉన్నాయి. సునిశితమైన హాస్యం సాహితీ వేత్తలకే సాధ్యం అనుకుంటాను. వారి హాస్యం పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

    1. మాన్యులు శ్రీ బులుసు సుబ్రహ్మణ్యం గారికి
      నమస్కారాలు.

      మీరన్న మాటలు అక్షరసత్యాలు. బ్రహ్మానందసదృశమూ, విగళితవేద్యాంతరమూ అయిన రసము యొక్క స్థితి శాంత శృంగార కరుణాదులతోపాటు హాస్యానికి కూడా దక్కటానికి కారణం ఆ నైశిత్యమే అనుకుంటాను. హృదయమాలిన్యాన్ని ప్రక్షాళించివేసే హాస్యాన్ని మనము మహావ్యక్తుల జీవితాలలో చూడగలగటానికి కారణం వారి బహురూపసుధీనైశిత్యమే కాబోలు.

      మీ వంటి సరస మధుర హాస్యకోవిదులకు ఈ లఘురచన హాస్యాస్పదం కాకుండా హాసాస్పదం కాగలిగిందని ఆనందం.

      మీ సాదరవాక్యావళికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

      సగౌరవంగా,
      ఏల్చూరి మురళీధరరావు

    1. శ్రీమతి భవానీదేవి గారికి
      నమస్కారములు.

      సువిజ్ఞాతబహుకృతినిర్మాణం చేత లబ్ధప్రతిష్ఠురాలైన మీ వంటి సువ్యక్త రచయిత్రి ఈ స్వల్పరచనకు స్పందించటం నాకెంతో గౌరవాస్పదమని విన్నవించుకొంటున్నాను.

      బహుముఖప్రజ్ఞాధురంధరులైన శ్రీ చందమామ రామారావు గారిని ఎంత చెప్పినా తరగని ఎంతో అమూల్యమైన స్మృతిపరంపరకు ఇది శ్రీకారమై, ఇంకా వారితో సుదీర్ఘపరిచయం ఉన్న విజ్ఞులు మఱింత వ్రాయగలరని నా ఆకాంక్ష. అద్యతనాంధ్ర సాహిత్య సాంఘిక చరిత్రనిర్మాణానికి వారి జీవితచరిత్ర రచన ఎంతో అవసరం.

      మీ దయాపూర్ణసౌజన్యానికి సాధువాదాలు.

      సగౌరవంగా,
      ఏల్చూరి మురళీధరరావు

  15. Sri Murali gariki
    Namasthe. Meetho pratyaksha parichayam ledu kani, Dr PSG, Sri Indraganti, Sri SBSM tadithara mitrula dwaaraa mee paroksha parichayam chaalaane undi. Nenoo AIR varta vibhagamlo dadapu 20 ellu pani chhesi, ippudu chennai PIB lo unnanu.Nenu Andhra Prabha lo Ajantha, Rentala garla vadda edellu pani chesanu.
    Mee gnaapakaalu adbhutham!
    (Emainaa mee N’Peta vaallu saamaanyulu kaadandee baboo!)
    MVS

    1. గౌరవీయ మిత్రతల్లజులు శ్రీ ప్రసాద్ గారికి
      నమస్కారాలు.

      మీ లేఖ నాకెంతో ఆశ్చర్యానందాలను కలుగజేసింది. మీ గుఱించి తొలిసారిగా 1978లో అనుకొంటాను – ఆకాశవాణిలో శ్రీ మెహమూద్ ఖాన్ గారు ఆప్యాయనంగా చెప్పగా విన్నాను. వి.యస్. నారాయణమూర్తి గారు, ఎన్.ఎం.జి. రామకృష్ణ గారు, ప్రయాగ వేదవతి గారు, రామం గారు (ఎస్.బి. శ్రీరామమూర్తి గారు) మిమ్మల్నీ, మీ కార్యక్రమాల్నీ, మైత్రీమధురస్వభావాన్నీ తఱచు తలచుకొనేవారు. డా. పి.యస్. గోపాలకృష్ణ గారు, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు, యువవాణి అధినేత పి.వి. రమణరావు గారు చెబుతుండేవారు. ఒక పర్యాయం మీరు పోర్టుబ్లెయిర్ స్టేషనుకోసం కాబోలు రూపకాలను రామం గారి సాయంతో రికార్డు చేయటం నాకు గుర్తుంది.

      దక్షిణాదిని ఆకాశవాణికి విశిష్టసేవ లందించిన విఖ్యాత ఆంధ్రులలో ఒకరైన మిమ్మల్ని ఈ లఘురచన మూలకంగా కలుసుకోగలగటం నాకొక పురస్కారంగా భావిస్తున్నాను. పిఐబి లోనూ సూరంపూడి సీతారాం గారి తర్వాత అక్కడ పనిచేసి ఎనలేని కీర్తిపొందిన మీకు నా ధన్యవాదాలను విన్నవించుకొంటున్నాను.

      మీ జ్ఞాపకాలకోసం రేడియో అభిమానులందరూ ఆసక్తితో ఎదురుచూస్తుంటారని మనవిచేస్తున్నాను.

      ఇక, నరసరావుపేట అంటారా!

      సర్వ శుభాకాంక్షలతో,
      ఏల్చూరి మురళీధరరావు

      1. శ్రీ అజంతా గారు మా తండ్రిగారి తోడి మైత్రి కారణంగా నాకు విజయవాడలో ఉండిన రోజులలో మార్గదీపకులు. మహారచయిత, మహాకవి శ్రీ రెంటాల గోపాలకృష్ణ గారు నాకు పితృతుల్యులైన గౌరవాస్పదులు. ప్రథమయౌవనదశలో నా సాహిత్యవ్యక్తికి ఆదర్శమైన మహనీయులు. ఆ ఉభయుల శిక్షణలో, సాహచర్యంలో ప్రతివ్హకు మెఱుగులు దిద్దుకొన్న మీతోడి మైత్రికి స్వాగతం!

      2. శ్రీయుత మురళి గారికి
        మీరు ప్రేమతో ఇచ్చిన సమాధానం నన్ను పులకరింపజేసింది.
        మీరు ప్రస్తావించిన పెద్దలంతా నాకు గురుతుల్యులు. ఉషశ్రీ వంటి ఎందఱో పెద్దల ప్రేమను పొందగలగడం నా భాగ్యం.
        మీ తండ్రిగారంటే నాకు ఎనలేని గౌరవం. అజంతా గారు వారి గురించి తరచూ చెప్పేవారు. (నయాగరా కవుల్లో వారిదే అగ్ర పీఠం అని నా అభిప్రాయం).
        రేడియో తెలుగు వార్తల శైలిని, భాషను సరళం చేసేందుకు నేను ఏమైనా చేయగలిగానంటే అందుకు “ప్రభ” లో పొందిన శిక్షణ, పెద్దల వద్ద నేర్చుకున్నవిషయసంపదా కారణాలు అంటాను. (బూదరాజు వారు మా బావగారికి మేనమామ).
        నేను ఎంతగానో అభిమానించిన, ఆరాధించిన సూరంపూడి వారి తర్వాత అదే PIB లో నేను చేరడం యాదృచ్చికమే అయినా నాకు అత్యంత సంతోష దాయకం. ఈ చెన్నపట్టణం లో నా గురుపుత్రుడు రెంటాల జయదేవ సాహచర్యం కూడా నాకు మిక్కిలి ఆనంద ప్రదం.
        మీ మాలిక ద్వారా మీ స్నేహ హస్తం అందుకొన్నందుకు ధన్యుడిని.
        సదా మీ
        ప్రసాద్

  16. శ్రీ మురళీధరరావు గార్కి వరప్రసాదు వినయమండిత నమస్కారములతో
    మీ మాలిక పత్రికను(పుత్రికను)జూచితిని, చదువుటకు రెండు మూడు రోజులు పట్టును.
    ముందుగా మీ అభిరుచికి, కళా సేవకు పాదాభివందనముజేయుచూ, శ్రీశ్రీ గారితో కవిసమ్మేళన విషయము చదివితిని కానీ వారు ఏమి చెప్పినారన్నది కూడా తెలియ పర్చగలరు. పురాణములను పుక్కిటబట్టిన ఉషశ్రీ గారిని జూచితిని, వారి భారత రామాయణ, రేడియో కార్యక్రమములు వింటిని. మరికొన్ని విషయమును విపులముగా తెలుపగలరు.
    మీవంటివారి దీవెనలు మాకు శ్రీరామరక్ష , మీ దీవెనలను సహకారమును కోరుతూ సెలవు.
    తమ భవదీయుడు
    వరప్రసాదు

    1. సత్కవివరేణ్యులైన శ్రీ వరప్రసాద్ గారికి
      నమస్కారములు.

      ఈ లఘురచన నిమిత్తంగా మీతో మైత్రి సంఘటిల్లినందుకు సంతోషంగా ఉన్నది. మీరు ప్రస్తావించిన శ్రీశ్రీ గారిని గుఱించిన జ్ఞాపకం మాలిక పత్రిక గతసంచికలోని “రేడియో చమత్కారాలు” అన్న వ్యాసంలో దయచేసి చూడండి. ఆంధ్రజ్యోతి నవ్య సంచికలో నుంచి మీరు ఉదాహరించిన శ్రీ బల్లెడ నారాయణమూర్తి గారు పేర్కొన్న ఉదంతం వారు కర్ణాకర్ణిగా సేకరించినదై ఉంటుంది. వాఙ్మయంలో ఇటువంటి మౌఖిక రూపాంతరాలు సహజమే కదా!

      మీ అభిమానానికి, ఆదరణకు ధన్యవాదాలు. ఈశ్వరానుగ్రహం మీ సాహిత్యాన్ని సంపన్నీకరించాలి.

      విధేయుడు,
      ఏల్చూరి మురళీధరరావు

  17. పితృతుల్యులైన పూజ్యులు శ్రీ వోలేటి వెంకట సుబ్బారావు గారికి
    విహితానేక ప్రణామములు.

    మహనీయులై మహదాశ్రయానికి నోచి, మహాత్ములెందరినో ఎఱిగిన మాన్య ఋషితుల్యులు మీరు. మూడు మునుపటి తరాల మహాకవులు, సంగీతవేత్తలు, కళాకారులు, గణనీయులలో అతిసన్నిహితంగా మీ ఎఱుకలో లేనివారు లేరు. విదేశవాసంలో ఉన్నా దేశసంస్కృతి సౌగంధ్యాన్ని సువ్యాప్తం చేస్తున్న ధన్యజీవనులు.

    మీ ఆశీర్మయ కవితాత్మక స్పందనకు నోచుకోగలగటం నా జన్మాంతర పుణ్యఫలం.

    1. aaapthulu- putra tulyulu, poojyulu ayina sri muralidhara rao gaariki–vnamra pranaamaalu.mee sandesham lo nannu amithagaa aakarshinchinadi- mee akshraallo- bhaavaalalo podigina aatmeeyathaamakarandam.’Pitrutululayina..” anna mee sambodhana mana hrudayaalanu marintha sannihitham chesindani naa visvaasamu.. naaku okkokka saari anipisthundi–bhagavanthudu hrudayaaalaku mudi vesedi kevalam ‘vivaahaala vishayam lone kaadu’- ‘sneham’ vishayam lo koodaa ‘mudulu’ vesi bandhaalu vesthuntaadani.

  18. aaptha mitrulu sri muralidhara rao gaariki- mee chetha .murali vundadam meu yeriginade!-kaanee,.-mee palukulaloni- chamat’kaaram’- intha ‘tiyyagaa’ vuntundani ippude telisindi.- abhinandana sumahaaram-idugo-andukondi.

  19. Dear Muralidhara Rao garu,
    Your memories are simply superb. I heard Sri Bharathi Teertha Swamy on the T.V. some time back. His oratory skills are really great. The Shringeri Peetham particularly encourages Sanskrit as a language. My appreciation to your wife and daughter for their ready wit. The other Migilina sambhashana merupulu chala ramaneeyamga unnayi.Your memoirs are worth publication.
    P.Santha Devi.

    1. మాన్య బహుపురస్కృత విద్వద్రచయిత్రీవతంస శ్రీమతి శాంతాదేవి గారికి
      నమస్సులు.

      గంభీరమైన మీ స్పందనకు, సౌజన్యానికి ధన్యవాదాలు.

      శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ స్వామివరేణ్యులు ప్రత్యక్షశంకరులు, అవతారమూర్తి. వారి భక్తకోటిలో పరాంకోటిలో ఉన్న మీ అభినందన నాకు ప్రసాదగౌరవమే.

      మీ “రమణీయ” శబ్దప్రయోగం నాకు ఇంకా ఎంత సాధించాలో జ్ఞాపకం చేస్తున్నది. “క్షణే క్షణే య న్నవతా ముపైతి, తదేవ రూపం రమణీయతాయాః” అని మాఘుడన్నాడు గనుక.

      మీ ఆశీస్సులను ఉపర్యుక్త వక్తలిద్దరికీ తెలియజేశాను!

  20. I felt very happy for reading ‘gnapakaalu’ about ramasuri garu. recently i have heard this ceiling poem from ramasuri sir in their house (vzm) and he can say any poem spontaneously in a effecftive and heart touching manner i owe a lot to him for guiding me always and he always suggests me what to read and how to develope my writing ability iam very thankful to him.

    Moida srinivasarao (Nellimarla)

    1. శ్రీ శ్రీనివాసరావు గారికి
      నమస్కారములు.

      శ్రీ రామసూరి గారు ఇంతమంది సుజనులను ప్రభావితం చేశారని తెలిసి నాకెంతో ఆనందంగా ఉన్నది. మీరన్నట్లు ఆయన ఆశుధోరణి, మనసులకు హత్తుకొనిపోయే కవితాసంవిధానం గణనీయాలు.

      ఇక శిష్యత్వమంటారా, మనిద్దరం ఒకగూటి వారమే! ధన్యులమే!

      ధన్యవాదాలు.

  21. Dr. Ramasuri garu is good poet , critic and excellent Orator and He established “yuvaspandana” .First Book reased is GAVIDI SRINIVAS “KANNEELLU SAKSHYAM”.I am So thankful to him he made me a poet.

    -GAVIDI SRINIVAS 8886174458
    9393087430

    1. భవతు.

      “గచ్ఛ! భద్రా స్తే పంథానః”

  22. I read this essay .It it so interesting.poets even they dont forget after many years also about Dr.Ramasuri garu and his poetic scence is excellent and good orator.He trained many young poets like me. I really greatful to him since he showed me a beautiful poetic trac.

    -GAVIDI SRINIVAS POET

    1. సుకవివరేణ్యులు శ్రీ గవిడి శ్రీనివాస్ గారికి
      నమస్కారం!

      “మార్గదర్శీ మహర్షిః” అని అందుకే అన్నారు. మీరు పొందిన ఉత్తేజమే, ఉద్బోధమే ఒకప్పుడు నాకూ కలిగి శ్రీ రామసూరి గారి మార్గదీపితానికి నోచుకొన్నాను. ఆయన వర్ధిష్ణు కవిశిక్షానైపుణిని మీరు ప్రస్తావించి ప్రస్తవించారు.

      మీ స్పందనకు ధన్యవాదాలు.

  23. well remembered.Dr.ramasuri is founder of ”Yuvaspandana” a sahiti venue at vizianagaram. He inspired young poets. after his decamp from vizianagaram, the successful conducting of uttarandhra kavi sammelanam by his young followers on the eve of ugadhi is an example of his impact over future generation.— Ramarao,police Department

    1. శ్రీ రామారావు గారికి
      ప్రణామం!

      అతీతకాలయవనిక వెనుక కొన్ని జ్ఞాపకాలు మాత్రమే నావి. మీరు చెప్పిన చాలా విలువైన విశేషాలను పొందుపఱిచే అవకాశం నాకు లేకపోయింది. మీ లేఖ ఆ వివరాలను పరిపూర్ణించింది.

      శ్రీ రామసూరి గారి ప్రభావపరిధి ఇంతగా విస్తరించినదని తెలిసి నాకెంతో సంతోషంగా ఉన్నది.

      మీకు నా ధన్యవాదాలు.

    1. శ్రీ జల్లిపల్లి కృష్ణారావు గారికి
      నమస్సులు.

      మీ ఆత్మీయ స్పందనకు పౌనఃపున్య ధన్యవాదాలు. విశేషణపౌనరుక్త్యానికి మఱీనూ!

    1. పాత్రికేయ శిఖామణి, సత్కవి శ్రీ కృష్ణారావు గారికి
      అభివందనం.

      కవితాత్మకమైన మీ రమణీయ శ్రవణీయ స్పందనకు ధన్యవాద మాత్ర సంస్పందన ఔపచారికమే!

      థాంక్యూ, సర్!

    1. పూజ్యులు డా. రేవూరు అనంత పద్మనాభరావు గారికి
      నమస్సులు!

      మీ వంటి అసామాన్య మేరుశిఖరం సామాన్య సానుభూమిని సానుభూతితో పలకరించడం ఎంతటి పుణ్యఫలమో!

      ధన్యోఽస్మి.

  24. Chinna Chinna padaalatho sootigaa, suthi metthagaa vraayadam Ramasuri mastaari pratyekatha. Yenno Samvatsaraalugaa yendarino prabhaavitham chesina aayana, prachaara aarbaataalaku doorangaa undatam aayanaloni goppa vyakthithvam. 38 yella gnapakaalani ‘Mee Gnapakaalalo ponduparichinanduku Dhanyavaadaalu.

    Basu Pothana – 9440878247

    1. శ్రీయుత పోతన గారికి
      నమస్కారములు.

      ప్రచార భేరీభాంకారాలకు దూరవర్తిగా మౌనవ్యాసంగం చేసిన మహాకవి సఫలకృషిని గుఱించి ఎంతో వ్రాయవలసి ఉన్నది. ఇదొక సద్యఃస్ఫురిత ఘట్టితఘటనమే కాని విపులవిమర్శ కాలేకపోయిన లోటు ఉండనే ఉన్నది.

      మీ సౌజన్యపూర్ణ వాక్యావళికి కృతజ్ఞుణ్ణి.

  25. Your Gnapakalu is worth recalling.I am very happy to read about Sri Ramasuri garu in your article.He is a source of inspiration to many contemporary young Telugu progressive poets. His poetry laced with satirical humor is an expression against exploitation.

    1. విద్వత్కవి శ్రీ శ్రీనివాస్ గారికి
      నమస్సులు.

      మీరన్నట్లు శ్రీ రామసూరి గారు అధిక్షేప వ్యంగ్యాలను హాస్యాచ్ఛాదితంగా మలిచి దోపిడీకి వ్యతిరేకంగా అభ్యుదయ కవితా ప్రహారఖడ్గాన్ని ఝళిపించారు. మీ వలెనే పెక్కుమందికి ఆదర్శమయ్యారు.

      మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు.

  26. మురళీధరరావుగారికి నమస్సులు!
    చతుర్విధాశ్రమాల్లో చివరినుండి మొదలుపెట్టి, రోమింగు, రోచీ-గాడు లాంటి కొసమెరుపులతో సాగిన మీ చమత్కారాలు ఈ రోజును చిరునవ్వులతో ఉదయింపజేశాయి. ప్రతియొక్కరిలోను హాస్యరసస్ఫూర్తి నిక్షిప్తమై ఉంటుందన్న విషయాన్ని మీవ్యాసం ఎన్నో విలువైన ఆకరాలతో ఉదహరించింది.మరెన్నో చమత్కారాలను గుర్తుచేసుకునే అవకాశాన్ని మీ వ్యాసం కలిగించింది.ధన్యవాదాలతో–
    రాయదుర్గంవిజయలక్ష్మి

    1. డా. విజయలక్ష్మి గారికి
      అభివాదాలతో,

      అల్పీయఃప్రాయమైన రచన మీ వంటి విజ్ఞ విదుషీతల్లజ సదభిప్రాయానికి నోచుకోగలిగినందుకు నాకెంతో సంతోషంగా ఉన్నది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

      సుప్తచేతనలోని స్మృతిసారాన్ని అక్షరాలకు దిద్దించిన ప్రేరయిత్రులు “మాలిక” సంపాదికలు జ్యోతి వలబోజు గారికీ, బెడదకోట సుజాత గారికీ కృతజ్ఞతలు!

    1. శ్రీ ఎన్.కె. బాబు గారికి
      నమస్కారం.

      మీ స్పందనకు ధన్యవాదాలు. “అట్టహాసం” తర్వాత శ్రీ రామసూరి గారి అద్యతన కవితాసంపుటాలను కూడా అచిరకాలంలో వెలువరింపగలరని ఆశిస్తుంటాము.

Leave a Reply to ఏల్చూరి మురళీధరరావు Cancel reply

Your email address will not be published. Required fields are marked *