April 20, 2024

బ్రతుకు జీవుడా

రచన : శర్మ జీ. ఎస్.

నరలోకానికి, నరకలోకానికి, తేడా పైకి కనిపించే ” క ” అక్షరం మాత్రమే కాదు ,ఎంతో తేడా ఉన్నది. ఆ నరకలోకం మన కళ్ళకు కనపడనంతదూరంలో , ఊహకి కూడా అందనంత దూరంలో ఉన్నదని ధృఢంగా  చెప్పవచ్చు.ఈ రెంటికీ చాలా  చాలా దగ్గర సంబంధమున్నది. ఆ నరకలోకం యమధర్మరాజు ఆధీనంలో, ఆతని ఏకైక హోల్ & సోల్ అకౌంటెంట్ చిత్రగుప్తుని పర్యవేక్షణలో అచటి దైనందిన కార్యక్రమాలు నడుస్తుంటాయ

సర్వలోకాల సృష్టికర్త బ్రహ్మదేవుల వారు , ఈనరలోక కాలాన్ని నాలుగు యుగాలుగా విభజించారిలా   .

1 ) కృతయుగం 2 ) త్రేతాయుగం 3 ) ద్వాపరయుగం 4 ) కలియుగం.

మొదటిదైన కృతయుగం 25 శాతంగా నిర్ణయించారు. ఈ కృతయుగానికే మరో పేరే సత్యయుగం. ఈ యుగంలో అందరూ పుణ్యకర్మలు చేయటం వలన నరకలోకంలో ఒక్క కేసు కూడా నమోదు చేసుకోలేక పొయింది , అందరినీ స్వర్గ సీమకే పంపించారు.

రెండవదైన త్రేతాయుగం 50 శాతంగా నిర్ణయించబడింది. అదే నిష్పత్తిలో పాపుల కర్మలు అధికమై , పుణ్య కర్మలు అల్పమైనాయి. ఆ కారణంగా నరకలోకంలో మొట్ట మొదటిసారిగా పాపుల కేసులు నమోదు చేయబడ్డాయి.

మూడవదైన ద్వాపరయుగం 75 శాతంగా నిర్నయించబడింది.అదే నిష్పత్తిలో పాపుల కర్మలు అధికమై , పుణ్యకర్మలు అల్పమైనాయి.

ఇంక నాలుగవదైన కలియుగం నూరు శాతంగా నిర్ణయించబడ్డది.అదే నిష్పత్తిలో పాపుల కర్మలు అధికమై , పుణ్య కర్మలు అల్పమైనాయి.

ఈ యుగాలన్నిలా విభజించటంలో ఎంతో అంతరార్ధం ఇమిడివుంది.

మొదటిది 15 శాతం తన సృష్టి , మిగిలిన 10 శాతం నరుల ప్రతి సృష్టి. నాటి నుంచి యుగయుగానికీ నరులు ప్రతిసృష్టి చేసుకొంటూ జీవితాలు సాగిస్తున్నారు.

ఆ నిష్పత్తిలోనే ఈ కలియుగం నాటికి నరులలో ప్రతిసృష్టి కాంక్ష అధికమై యుగశాసనాన్ని దాటి వెళ్తుంటే గడ్డు సమస్య అయింది  సృష్టికర్త అయిన బ్రహ్మదేవులవారికి. అందువలననే , రకరకాల మారణాయుధాలని ఆ నరుల చేతనే  సృష్టించి కలియుగాన్ని  కల్తీయుగంగా మార్చి నూరు శాతంగానే ఉంచటానికి ఎప్పటికప్పుడు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నరలోకం / భూలోకం / ప్రపంచం అని పిలవబడ్తుంటుంది. ఈ ప్రపంచంలో అన్ని దేశాలకు, ఈ నరకలోకం ఒక్కటే ఏకైక కార్యాలయం.. జీవము కోల్పోయిన  తరువాత ఆందరూ ఇచటకు వచ్చి వెళ్ళవలసిన వాళ్ళే. పాపజీవులను , పుణ్యజీవులను ఇచ్చట తపాలా కార్యాలయంలో వచ్చిన అన్ని ( ప్రదేశాలనుంచి )టిని వేటికి వాటికి విడీ విడిగా పేర్చినట్లు చేసి , పాపులను యమసీమ లోనే ఉంచేసి , పుణ్యాత్ములను దివిసీమకి తరలించేస్తారు వారి కర్మల ఫలాలను అనుభవించటానికి.

 

****                                                                                             ****

 

యమసీమలో ఎటు చూసినా నూనె గానుగలంతా పేద్ద పేద్ద బాండీలు , పేద్ద పేద్ద గాడి పొయ్యిల మీద దర్శనమిస్తున్నాయి. కొంతమంది యమభటులు మంటలను ఎగద్రోస్తున్నారు. ఇంకొంతమంది ఖాళీ అయిన నూనె డ్రమ్ములను  , దొర్లించుకుంటూ వెళ్లి  నూనె గోడౌన్ల వద్ద పేరుస్తున్నారు . మరల నిండు డ్రమ్ములను  తీసుకుని ఆ నూనె బాండీల ప్రక్కనే ఉంచుతున్నారు. ఆ బాండీల ముందర ఈ డ్రమ్ములు చిన్న చిన్న కొబ్బరినూనె బాటిల్స్ లా కనపడుతున్నాయి .ఇప్పటికే చాలా డ్రమ్ములు పోశాం , ఇంకా ఎన్ని పోయాలిరా బాబో అన్నాడో యమభటుడు

అక్కడున్న తోటి  యమభటుడితో.

ఇవి చాలవుట , ఇంకా కనీసం ఇరవై అయినా పొయ్యాలిట అని జవాబు ఇచ్చాడు.

ఎన్ని శవజీవాలు  వస్తున్నాయేమిటి ఈ దినం?

ఇన్ని అని ఖచ్చితంగా చెప్పలేదుగాని , లక్షలలోనే అనీ , అదీ అన్నికంట్రీస్ నుంచి వస్తున్నాయిట అనీ గుప్తా సారు సెలవిచ్చారు.

అలాగయితే మనకున్న పరివారం సరిపోదుగదా , మరి పెంచమంటే పోలా .

చెప్పి చూశాను , కాని ప్రయోజనము లేదురా . ఆ మాత్రం మాకూ తెలుసులేవోయ్ అన్నారు  ఆ  సారు.

నేనూ ఓ మారు చెప్పి చూడనా ?

నీ ఇష్టం నేను కాదంటానా , కాకుంటే ఆయన వేసే శిక్షకు సిద్ధంగా వుండాలి సుమా.

ముందే చెప్పి మంచిపని చేశావు, లేకుంటే ఆ శిక్షలకి డూటీ ఎగగొట్టి మందేసుకొని పడుకోవలసి  వచ్చేది.

అంత అవకాశం మనకు లేదులేరా . మొత్తం మందు నరలోకానికి తరలించేశారుగా.

ఎందుకట ?

ఈ మధ్య ఎన్నికలు పదే పదే వచ్చేస్తున్నాయట  , వాటికే మధ్యంతర ఎన్నికలంటూ నామకరణం చేసి ఆనందిస్తుంటారు. .

ఎన్నికలకి , మందుకి సంబంధమేమిటో నాకర్ధం కావటం లేదురా

నరలోకంలో ఒక్క ఎన్నికలకే కాదురా, అన్నింటితో సంబంధముంటుంది  ఆ మందుకి .

అన్నింటితోనా ! ఇన్నాళ్ళు మనకే అనుకొన్నా, ఈ నరులకు గూడా బాగా అలవాటై   పోయిందన్నమాట.

అలవాటేమిటిరా బాబూ , అందులోనే మునిగి తేలుతున్నారురా .

ఎన్నికలలో గెలవాలనుకున్న వారు , ఓటర్లని , కార్యకర్తలను మందులో ముంచుతారు .గెలిచిన తరువాత కూడా అందరు కలసి మళ్లీ ఆనందానికి చిహ్నంగా మందులో మునిగి తేలతారు. ఓడిన వాళ్ళు కూడా మందులో మునుగుతారు, ఆ బాధను మరచిపోయేటందుకు .ఉద్యోగం రావాలంటే , ప్యూను దగ్గర నుంచి , పై అధికార్ల వరకు అందర్నీ మందులో ముంచాల్సిందే . ఒక్క ఉద్యోగం రావటానికే అనుకొంటే ,పొరపడినట్లే . ప్రమోషన్లు రావాలన్నా , బదిలీలు కావాలన్నా మందే  ముందుంటుంది .

ఒక్క చోటేమిటిరా బాబూ , పని అయినా మందె , కాకున్నా మందె, పుట్టినరోజుకి మందే  ,గిట్టినరోజుకి మందే .

ఇందుగలదందు లేదను

సందేహమ్ము వలదు

సందు గొందులందు

ఎందెందు వెతికినా

అందందే కానవచ్చు ఈ మందు

అని తనకు తెలిసిన విషయాన్ని వివరంగా వివరించాడు.

“మందు తరలిపోయిందని బాధపడుతున్నారంటారా ? కంగారు చెందకండి. మనలోకంలోని ఆ మందు పంపలేదు ఆ నరలోకానికి. అది మన హద్దులు దాటి పోరాదట , ఎక్సైజు , కష్టమ్స్  శాఖలు బల్లగుద్ది మరీ మరీ నుడివాయట. అందుకని వారికి విశ్వామిత్రుల వారు సృష్టించిన నకలు  మందుని పంపించాను.ఆ మందు మోతాదు మించితే మనిషిని చంపేస్తుంది,

త్వరగా కానీయండిరా … అపుడే ప్రవేశించిన చిత్రగుప్తులవారు సెలవిచ్చారిలా .

సారూ ఆ శవజీవాలు ఎపుడొస్తున్నాయి ?

మూకుమ్మడిగా వచ్చిపడతాయి.

అలాగయితే  మన పరివారాన్ని మరికొంతమందిని పెంచితే బాగుంటుంది సారూ .

న్యూ ఢిల్లీ నుంచి తమిళ్ నాడు ఎక్స్ ప్రెస్ బయలుదేరింది. అసలు గమ్యస్థానం చెన్నై ,  కాని మన గమ్యస్థానం

మాత్రం నెల్లూరు .అందరూ గాఢ నిద్రలో ఉండగా అగ్నికి ఆహుతి కాబోతున్నారు.

అందుకే గదరా అందరిని ఒక్కసారే ఇచ్చటకు తీసుకు రాకుండా, కొంతమందిని కొన ఊపిరితో కొట్టుకునేటట్లుగా చేయటం ఇంకొంతమందిని వరదనీటిలో కొట్టుకుపోయేలా చేసి , ఏ చెట్ల కొమ్మలలో ఇరుక్కునేటట్లు చేయటం, మరికొంతమందిని ఇసుకదిబ్బలలోకి నేట్టేయటం ,ఎడారులలో,ఆసుపత్రులలో ట్రీట్మెంట్ తీసుకుంటూ కోలుకుంటున్నట్లు  భ్రమింపచేయటం లాంటి వెన్నో అమలుజరుపుతుంటాం . ఇలా చేయటం వలన  మీ పరివారాన్ని పెంచవలసిన అవసరం రాదు.

ఇన్ని అవస్థలు పడే బదులు పరివారాన్ని పెంచుకుంటే సరిపోతుంది గదా సారూ, ఒక్కమారు పని అయిపోతుంది గదా సారూ.

నేనూ అదే ఆలోచించి పెదసారుకి వివరించా. ఆయన బ్రహ్మదేవుని అనుమతి తీసుకోవాలిట.

ఇంకేం త్వరగా తీసుకుంటే పోతుందిగా సారూ .

అసలు సమస్య ఇక్కడే మొదలయ్యింది. ఆ బ్రహ్మదేవుడు గారుండేది స్వర్గసీమ ,  మనముండేదేమో యమసీమ . ఈ రెండు దగ్గరా, దాపు కాదాయె. అక్కడికి  పెదసారు  వాహనం మీదనే వెళ్లాలాయే . తన వాహనమైన  మహిషమేమో ఘెరావ్  చేస్తున్నదట.

దేనికి సారూ ?

మన మహిషానికి బియ్యం , బార్లీ వంటి వాటితో తయారు చేయబడిన పోషక పదార్ధాలున్న ఆహారమే కావాలిట,అంతే గాదు.. అచ్చమైన బీరు కావాలిట.

నిన్న మొన్నటిదాకా ఉలవలు,కొబ్బరిచెక్క,తవుడు,బెల్లం,కాగితాలు లాంటివి తినేది కదా, ఉన్నట్లుండి ఇలా ఎందుకు మార్పు కోరుతుంది సారూ ?

సృష్టి ప్రారంభం నుంచి తను అవే తింటూ ( బోర్ కొడుతున్నా) అలానే సర్దుకుపోతూ వస్తున్నదట. తనను ఓ వైపు మా జాతికంతటికి మూలవిరాట్టంటుంటే , తనను చాలా బాగా గౌరవిస్తున్నారని ఎంతగానో మురిసిపోయేదట. ఆ మధ్య అంటే మే నెలలో బ్రహ్మదేవులవారు  పక్షపు సభ జరుపుతున్నపుడు ,తను వాకిట్లో అటూ ఇటూ పచార్లు చేస్తుంటే, బల్లపైన ఈనాడు దినపత్రిక కనపడి , తిందామని తలవంచితే , తమ జాతి వాటికి బియ్యం,బార్లీ వంటి పోషక పదార్ధాలు పెడ్తున్నారట నరులు . అంతే  కాదు బీరు కూడా  పడ్తున్నారుట ,ఫోటోతో సహా చూసిందిట. అంతే ఆలోచనలో పడిందిట.పట్టుమని పాతికేళ్ళు జీవించే తన జాతివాటిని , నిండా నూరేళ్ళు ఆయుష్షు కూడా లేని మానవులు యింత శ్రద్ధగా చూసుకొంటున్నారంటే,మరి మరణమే లేని తనను మరి ఎంత బాగా  చూసుకోవాలి మన పెదసారు అని అనుకొని, పెదసారు వెలుపలికి రాగానే ,మాట్లాడకుండా పెదసారుని ,ఆయన భవంతి వద్ద దించి వెళ్ళిపోయిందట.మరల పెదసారు సభకు వెళ్ళాల్సి , మహిషం  మొబైల్ కు కాల్ చేస్తే రింగ్ అవుతుంది, బదులుగా   సబ్స్క్రైబెర్ ఈజ్ నాట్  రెస్పొండింగ్ ఆర్ నాట్ ఇన్ కవరేజ్ ఏరియా , ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సం టైం అని వస్తున్నదట ఎన్నిమారులు ట్రై చేసినా అలాగే వస్తున్నదట. పెదసారు ఏమి చేయలేక తుదకు సభకు ఎగనామం పెట్టారట.పెదసారు ఆర్డర్ మేరకు నే  వెళ్లి చూస్తినిగదా ! మహిషం ఎచ్చటికీ వెళ్ళలేదు, తన బంగళాలోనే ఉన్నది. ఓ  ప్రక్కన  మొబైల్ , ఇంకో ప్రక్కన ఈనాడు తెలుగు దినపత్రికని చూస్తూ కన్నీరు కారుస్తున్నది. నేనెంతగానో బామాలి,  బ్రతిమలాడిన మీదట , ఇదంతా వివరించింది.

పెదసారుకి అంతా వివరించగా ఏమి చేయాలో తోచక, కాలుగాలిన పిల్లిలా అటు, ఇటు అచ్చటనే తిరుగుతున్నారు మరొక మార్గంలేక. ఎచ్చటకు వెళ్ళాలన్నా వాహనం చాలా చాలా ముఖ్యం

తెలియకడుగుతున్నా చిన్నసారూ , వేరే ఇంకేవరిదైనా వాహనం వాడవచ్చుగా తాత్కాలికంగా.

ఎవరి వాహనాన్ని వారే వాడాలి, మరొకరి వాహనాన్ని వాడకూడదు. అందుకే ఈ లోకాలలో ,ఒకరికి నిర్ణయించబడ్డ వాహనాన్ని మరొకరికి నిర్ణయించబడదు నరలోకంలో లాగా . ఇవన్నీ నమూనాలు మాత్రమే. మిగిలినవన్నీ నరలోకంలోనే వుంటాయి. నరుల వాహనాలు అడపా తడపా ఇబ్బందులు పెట్టి ఆగిపోతుంటాయి.  అందుకని వాళ్ళు  మాత్రం ఏ వాహనాన్నైనా, ఎపుడైనా, ఎచ్చటికైనా వాడవచ్చు. వాళ్ళ  జీవిత కాల పరిమితి బహు స్వల్పం..  ఆ లోపల వాళ్ళు  చేయవలసిన కర్మలు ( పనులు ) పూర్తిచేయవలసిన బాధ్యతా వాళ్ళ  పైనే ఉంటుంది. వాళ్ళకి   పని అవటమే ప్రధానం, మనకు అలా కాదు, మన వాహనాలు ఆగిపోవటమంటూ జరుగదు. మనకు  పద్ధతే ప్రధానం సుమా. అందుకే బ్రహ్మదేవుల వారు ఇలా నిర్ణయం చేశారు. కనుక మీరే అదనపు డ్యూటీ ఛెయ్యండి,  మీకే మరో  వేతనం ఇప్పిస్తాను అని నెమ్మదిగా సెలవిచ్చారు చిత్రగుప్తుల వారు.

మరో వేతనం కాదు సారూ,  డబుల్  వేతనమిప్పించండి. లేకుంటే సమ్మె చేస్తాం .

ఇలా అడగటం కొంచెం కొత్తగా, ఇంకొంచెం చెత్తగా ఉంది.అసలేమయ్యింది మీకు ?

అదనపు డ్యూటి మామూలు  వేతనానికి చేయటం తప్పని ఆ మధ్యనే తెలిసినా, ఇంతదాకా అడగలేకపోయాము .

ఎలా తెలిసింది ? ఆ నారదులవారేమైనా అంటించారా  అన్న తన సందేహాన్ని వెలిబుచ్చారు చిత్రగుప్తులవారు.

పాపం ఆ సారునేమనకండి హరినామస్మరణ తప్ప అన్యమెరుగని మా మంచి మారాజు .

ఇలా మీరు వెనకేసుకుని రావటం చూస్తుంటే ,  ఇంకా  నా సందేహం స్ట్రాంగుగా బలపడుతుంది.

ఆ సారుని అనుమానించకండి , నిజం చెప్పేస్తాం. ఆ మధ్య నరలోకం నుంచి వచ్చిన  శవజీవాలలో ఎన్.టి.రామారావు అనే ఒక అన్న కూడా ఉన్నారు.ఆ సమయంలో మేము అదనపు డ్యూటీ చేస్తున్నాము, మమ్మల్ని చూసి , పరామర్శించి , ఇలా మామూలు  వేతనానికే అదనపు డ్యూటి చెయటం తప్పని , డబుల్  వేతనం డిమాండ్ చేయమని సలహా ఇచ్చారు. అది ఎలా సాధించాలో నా “యమగోల” సినిమా చూస్తే తెలిసి పోతుందని వివరంగా చెప్పారు .

అదా సంగతి ! ఇదంతా ఆ మహానుభావుని నిర్వాకమా ! అసలు సినిమా అంటేనే వినోదం. ఆ వినోదం కొరకు, వారు ( నరులు ) ఎవరిమీదనైనా జోకులు వేస్తుంటారు. వెనుకా , ముందర చూడరు , తమను స్రుష్తించిన బ్రహ్మదేవుల వారి మీద గూడా జోకులు  వేసుకొని  ఆనందిస్తుంటారు. అది  వారి గొప్పతనంగా భావిస్తుంటారు. మీరు మాత్రం  అదనపు డ్యూటి  మామూలు వేతనానికే చెయ్యక తప్పదు.

ఆ సినిమాలోలా మమ్మల్నందరిని ఒక సంఘంగా ఏర్పాటు చేసుకొమ్మన్నారు. కలసికట్టుగా శ్రమించమన్నారు అపుడే విజయం మీ వెంటే  అన్నారు.  ఆయన ఏ లోకంలో వున్నా , అలా అనటం ఆయన హీరోయిజం. అంతమాత్రాన మీరు ఆ  డైలాగులకు పడిపొకూడదు. అలా కొత్త వారెవరైన పడిపోతారని పెదసారు నిర్ధారించుకొని ,ఆయనను జూనియర్ ఎన్.టి.ఆర్  లో ఆవహించమని  ,ఆ హీరోయిజమేదో అచ్చటే ప్రదర్శించమని మరల నరలోకానికే పంపించేశారు. నరుల మాటలు నమ్మి మోసపొకండి , లేనిపోని కొత్త  సమస్యలలో కూరుకుపోకండి . హాయిగా మీ డ్యూటీలు మీరు చేసుకోండి. బ్రహ్మదేవుల వారికివేమీ తెలియవనుకోకండి.రెప్పపాటు వ్యవధిలో అవసరమైనంత మందిని సృష్టించి ,తక్షణమే ఇచటకు పంపిస్తారు. ఆ మరుక్షణమే ఈ  నరకలోకం నుంచి నరలోకానికి తొసేస్తారు మిమ్ములను మళ్ళీ మళ్ళీ జన్మల మీద జన్మలెత్తాలి, ఆ  తరువాత , నరులకెంతటి శిక్షల్ని అమలుజరుపుతామో అవన్నీ మీకు అమలు జరుపాల్సి వస్తుంది. మరోమారు ఆలోచించుకోండి. ఈ విషయాన్ని పెదసారుకి గాని, బ్రహ్మదెవుల వారికి గాని తెలియ నీయకండి.

ఆయన అంత ఎమొషనల్ గా చెప్తుంటే , నిజమే కాబోలు, మనమూ ఓ రాయి వేసి చూద్దాం, తగలకపోతుందా అనుకున్నామే గాని, తిరిగి ఆ రాయి మాకే తగులుతుందని ఊహించలేక పోయాం. పొరపాటు అయిపోనాది. తమరు చెప్పినట్టుగానే ఇకముందు నడచుకొంటాం అన్నారా  యమభటులు.

సరే త్వరగా ఆ శవజీవాల్ని తీసుకురండి అని తొందర చేశారు చిత్రగుప్తుల వారు.

 

***          ***                  ***

 

యమధర్మరాజు  గత సభకు గైర్హాజరు కావటమే కాకుందా , రెస్పాన్స్ సరిగా లేకపోవటంతో , బ్రహ్మదేవుల వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లైనుకి  కన్నెక్ట్ అవగా ,గత్యంతరం లేక యమధర్మరాజు  లైనులొకి రాక తప్పింది కాదు.

డోంట్ వర్రీ యమధర్మరాజా , ఈ జరిగినది నాకు తెలియదనుకోకండి. ఇందులో నీవు ఫీల్ అవవలసినది ఏమీ లేదు. మహిషం అలా కోరటంలో దాని తప్పూ ఏమీ లేదు. ఇదంతా నా సృష్టి లీల. సృష్టి రహస్యం  ఇంతవరకు ఎవరికీ  తెలియదు. ఇప్పుడు చెప్పక తప్పదు. నరుల జీవితాలు నీతి బుడగలు , వారి ఆయుః పరిమాణం బహు స్వల్పం. ఆ లోతు పూడ్చటం కొరకు నేనెప్పటికప్పుడు ఏదో కొత్తదనాన్ని స్రుష్టించి అందించి వాళ్ళను ఆనందింపచేస్తుంటాను. వాళ్ళు ఆనందిస్తుంటారు. వాళ్ళకు తెలుసు, ఈ జీవితం క్షణభంగురమని, అందుకే వాళ్ళూ ఎదురుచెప్ప ( లే ) క చక్కగా రిసీవ్ చేసుకొంటుంటారు . ఆ ఆనందంలో  తేలియాడుతుంటారు, ఆ సమయంలో మన పని మనం  చేసుకొంటుంటాం. మనలోకంలో సృష్టించబడ్డ వాటికి నాశనమంటూ లేదు.శాశ్వతంగా ఉండిపోతాయి. అశాశ్వతమైన   వాటికే ఎప్పటికప్పుడు , ఎన్నో వింతలు,విడ్డూరాలు ఎరగా చూపాల్సివస్తుంది. ఇదే  కాదు , నరలోకంలో ఇంకా చాలా చాలా వింతలు జరుగుతాయి. అర్ధం చేసుకొని , అలక మాని తక్షణమే ఎవరి హోదాలను వారు నిలబెట్టుకోండి అంటూ వీడియో కాన్ఫరెన్స్ ఆనాటికి ముగించేసారు బ్రహ్మదేవుల వారు.

యమధర్మరాజు స్విచ్ ఆఫ్ చేసి టర్న్ అవుతుండగా మొబైల్  ఎస్ ఎం ఎస్ అలర్ట్ ఇచ్చింది . మహిషం తను తక్షణమే బయలుదేరుతున్నట్లు  తెలియచేసింది. హమ్మయ్య అనుకొన్నారు యమధర్మరాజు ” బ్రతుకు జీవుడా ” అనుకుంటూ ఎంతో నూతన జీవం పొందినంతగా  ఆనందించారు.

*****           ****        సమాప్తం        ****           ****

2 thoughts on “బ్రతుకు జీవుడా

Leave a Reply to Vidya Cancel reply

Your email address will not be published. Required fields are marked *