ఈయన జనన సంబంధిత విషయాలు శ్రీ శివ పురాణంలో సూత మహర్షి శౌనకాది మునులకి చెప్తున్నట్టు వస్తుంది. ఆ ప్రకారంగా, పూర్వము కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు – సోమిదమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వేద, వేదాంగాలు, శాస్త్ర, పురాణాలు అన్నిటిలో ప్రావీణ్యత ఉన్న యజ్ఞదత్తుడు రాజాదరణ పొంది రాజగురువుగా నియమింపబడ్డాడు. వీరి ఏకైక సంతానం గుణనిధి. అతను చెడు సావాసాల వలన జూదమునకు బానిసయ్యి, ఆ జూద క్రీడ కోసం దొంగతనాలు కూడా మొదలుపెట్టాడు. తల్లయిన సోమిదమ్మకి ఇవన్నీ తెలిసినా గారాబంతో మందలించకపోగా, భర్తకు ఈ విషయాలు తెలిస్తే ఎక్కడ కోప్పడతాడో అన్న భయంతో మౌనం వహించేది. యజ్ఞదత్తుడు రాజమందిరంలో కార్య కలాపాలలో నిమగ్నమై కొడుకుని పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడయినా కొడుకు గురించి భార్యను వాకబు చేస్తే, ఆవిడ పుత్ర ప్రేమతో చదువుకోడానికి గురువు గారి వద్దకు వెళ్ళాడనో, గుడికి వెళ్ళాడనో అబద్ధం చెప్పి భర్తను మభ్య పెట్టేది. దానితో గుణనిధికి అడ్డు, అదుపు లేక ఇంటిలో నగలన్నీ దొంగిలించి మరీ జూదమాడి ఓడిపోతూ ఉండేవాడు. అలా తన తండ్రికి రాజుగారిచ్చిన వజ్రపు ఉంగరం కూడా జూదంలో పెట్టి ఓడిపోయాడు. ఆ ఉంగరం గెలుచుకున్న వ్యక్తి అనుకోకుండా యజ్ఞదత్తుని కంట పడటం, యజ్ఞదత్తుడు ఆ ఉంగరం తనదని గుర్తించి అతనిని నిలదీయటం, అతను జూదంలో గుణనిధి వద్ద గెలుచుకున్నానని చెప్పటంతో యజ్ఞదత్తుని నోట మాట రాలేదు. ఆ రోజు దాకా కొడుకు ఏమి చేస్తున్నదీ తనకు తెలియని పరిస్థితిలో ఉన్నందుకు సిగ్గుపడుతూ, భార్యా బిడ్డల మీద కోపంతో ఇంటికి వెళ్లి, కొడుకు చెడు సావాసాలకు లోనయిన విషయం తన వద్ద దాచినందుకు భార్యను మందలించాడు. ఇంతలో జరిగిన విషయం తెలుసుకున్న గుణనిధి ఇంటికి వచ్చే సాహసం చేయలేకపోయాడు. తన మిత్రులెవరూ కూడా తనకి తల దాచుకోవటానికి సహకరించలేదు. చెంతనే ఉన్న గౌతమీ నది దాటి ప్రక్క ఊరు చేరుకున్నాడు. ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఊరి చివరన ఉన్న శివాలయంలో భక్తులు నైవేద్యాలు సమర్పించి, తమ శక్తి కొలదీ జాగారాలు చేసి, మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు. జనాలంతా పడుకున్నారని నిర్ధారించుకున్నాక, ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్పించిన ప్రసాదాలను తీసుకుని తిందామని గర్భ గుడిలోనికి వెళ్ళాడు. చీకటిలో ఏమీ కనిపించక, తన పైవస్త్రాన్ని చించి వత్తిగా చేసి అక్కడ ఉన్న నూనెతో దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకుని బయటకి నడుస్తుండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి, నందీశ్వరుని మీద పడి, తల పగిలి చనిపోతాడు. ఊరి నుండీ పారిపోతూ పవిత్రమయిన గౌతమీ స్నానం, తిండి దొరకనందున ఉపవాసం, వెలుతురు కోసం శివాలయంలో వెలిగించిన దీపం, ప్రసాదాల కోసం చేసిన సగం జాగారం, ఇవన్నీ అనుకోకుండా చేసినా శివరాత్రి పర్వదినం నాడు చేసి మరణించటం వలన గుణనిధికి కైలాస ప్రాప్తి లభించింది. అందుకనే “జన్మానికో శివరాత్రి” అంటారు.
ఇదిలా ఉండగా, పులస్త్యుడు అనే బ్రహ్మర్షి ధర్మాన్ని గ్రహించాలన్న ఆసక్తితో, మేరు పర్వతానికి అతి చేరువలో ఉండే తృణబిందుని ఆశ్రమానికి వెళ్ళి, అక్కడ తనకనువయిన ఒక చోటు చూసుకుని తపస్సు ప్రారంభించాడు. ఆ ఆశ్రమ పరిసరాలు ఎంతో రమణీయమయిన ప్రకృతి శోభతో విలసిల్లుతూ ఉండేవి. అందుకే దేవతాంగనలు, అప్సరసలు, నాగకన్యలు అక్కడకి వెళ్ళి తమ ఆటపాటలతో కాలం గడిపి వెళ్ళిపోయేవారు. వీటి వలన పులస్త్యునికి తపోభంగం కలిగేది. దానితో ఆగ్రహించిన ఆయన, తన కంట పడిన కన్య గర్భవతి అవుతుందని శపించి తపస్సులో మునిగిపోతాడు. ఈ శాపం గురించి తెలిసినవారెవరూ అక్కడికి వెళ్ళేవారు కాదు. ఒకనాడు ఈ శాపం గురించి తెలియని తృణబిందుని కుమార్తె అయినటువంటి మానిని అక్కడికి వెళ్ళటం, గర్భం దాల్చటం జరగటంతో తన కుమార్తెను స్వీకరించమని తృణబిందుడు పులస్త్యుని అడుగగా దయతో ఆమెను స్వీకరించి, ఆమె సేవలకి మెచ్చి, తనతో సమానమయిన జ్ఞానం, శక్తి ఉన్న పుత్రుడు పుడతాడని ఆశీర్వదిస్తాడు. అలా పుట్టినవాడే విశ్రవుడు (వేదాధ్యాయమును విన్నవాడు అని అర్థం). విశ్రవుడు (ఇతనిని విశ్రవ బ్రహ్మ అని కూడా పిలుస్తారు) తన తండ్రితో అన్ని విషయాల్లోనూ సమానుడై, నిత్యం తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. యుక్త వయస్కుడైన విశ్రవునికి, భరద్వాజ మహర్షి తన కుమార్తె అయిన దేవవర్ణినిచ్చి వివాహం జరిపించారు. వీరిరువురికీ పుట్టినవాడు వైశ్రవణుడు. ఈ వైశ్రవణుడే (విశ్రవుని కుమారుడు) కుబేరుడు.
కుబేరుడు చిన్నతనం నుండీ శివ భక్తి తత్పరుడు. కైలాస ప్రాప్తి పొందిన గుణనిధే ఈ జన్మలో వైశ్రవణుడిగా (కుబేరునిగా) పుట్టాడని తన తపోశక్తి ద్వారా తెలుసుకున్న విశ్రవుడు, తన కుమారుడు చిన్నతనంలోనే తపస్సు చేసుకోవడానికి అంగీకరించాడు. దానితో కుబేరుడు కఠోరమైన తపస్సు చేయటం మొదలు పెట్టాడు. కొన్ని సంవత్సరాలు కేవలం ద్రవ పదార్ధాలను సేవించి, తరువాత కొన్ని సంవత్సరాలు కేవలం గాలి మాత్రమే భుజించి, అటు పిమ్మట గాలిని కూడా పీల్చకుండా వెయ్యి సంవత్సరాల పాటు చేసిన తపస్సుకు మెచ్చిన పరమ శివుడు ప్రత్యక్షమయ్యి, తనని లోకపాలకునిగా, ధనాధ్యక్షునిగా ఉండే వరమిచ్చి అంతర్ధామనవుతాడు. ఎక్కడ ఉండాలో తెలియని కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చేయగా, ఆయన ప్రత్యక్షమయ్యి శంఖనిధి, పద్మనిధి మరియు పుష్పక విమానం ప్రసాదించి, త్రికూట పర్వతం మీద, సముద్ర మధ్యభాగంలో ఉన్న లంకా పట్టణంలో పూర్వం రాక్షసులు ఉండేవారనీ, శ్రీహరి వలన భయంతో వారంతా పాతాళానికి పారిపోయారు కనుక అక్కడకి వెళ్ళి ఉండమనీ చెప్పి మాయమవుతాడు.
రావణాసురుడు రాక్షసుడు కావడంతో తన తాతగారయిన సుమాలి వద్ద పాతాళంలో ఉండేవాడు. కుబేరుడు మాత్రం భోగ భాగ్యాలతో లంకలో రాజ్యపాలన చేయటం చూసి తట్టుకోలేక, లంక మీదకి దండెత్తాడు రావణాసురుడు. కుబేరునికి శారీరక బలం తక్కువ, యుద్ధం చేసి జనాలను చంపే క్రూరత్వం లేదు, పైగా రావణాసురుడు హఠాత్తుగా రావటంతో రావణాసురుడు లంకను పుష్పక విమానంతో సహా స్వాధీనం చేసుకుని కుబేరుని తరిమేశాడు. దానితో భయపడిపోయిన కుబేరుడు కాశీ చేరుకుని పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు మొదలుపెట్టాడు. గాలిని సైతం బంధించి, ఒంటి కాలి మీద నిలిచి, శివుని మనసులో నిలుపుకుని తపస్సు చేయసాగాడు. తన శరీరం నుండి వచ్చిన తపోగ్ని జ్వాలలు ముల్లోకాలూ వ్యాపించాయి. ఈయనకి తపోభంగం కలిగించటానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. కాలం గడిచిన కొద్దీ కుబేరుని శరీరం ఎముకల గూడులా మారిపోయింది. అయినా తపస్సు చేస్తూనే ఉన్న కుబేరుని మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యి, “లంకా నగరాన్ని మించిన దివ్యభవనాలతో, అపురూపమయిన చైత్ర రథం అనే ఉద్యానవనముతో, నవ నిధులతో, మణి మాణిక్యాలతో, సర్వ సంపదలతో అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి నీకు ఇస్తున్నాను. ఇక నుండీ నీవు అక్కడే ఉంటూ, యక్షులకి, గంధర్వులకి, మయులకి, గుహ్యకులకి రాజువై ఉండమని అనుగ్రహిస్తాడు. ధనదుడవు, ధన దాతవు అయిన నిన్ను మించినవాడు ఈ సృష్టిలోనే ఉండరు. ఉత్తర దిక్కును పరిపాలిస్తూ, నా ప్రియ మిత్రుడవై, నాకు ఆప్తుడవై సంచరిస్తూ ఉండు” అని ఎన్నో వరాలిచ్చి కుబేరునికి మంచి రూపం ప్రసాదించి అదృశ్యమవుతాడు. అందుకనే అధిక ధనము కల వారిని “అపర కుబేరులు” అంటారు.
ఎంతోమంది అదృష్ట చిహ్నంగా, సిరిసంపదలనొసగుతూ ఆనందాన్ని పెంపొందించే దైవంగా భావించే “లాఫింగ్ బుద్ధ” మన కుబేరుడే అని చాలా మంది నమ్మకం. కుబేరుని పూజించిన వారికి ఆర్ధిక ఇబ్బందులు తొలగి, వ్యాపార వృద్ధి, సామాజిక గుర్తింపు లభిస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి. అయితే, కుబేరుని ప్రతిమ కానీ, కుబేర దీపాలు కానీ ఎవరికి వారు కొనుక్కోవటం కన్నా కూడా ఎవరయినా కానుకగా ఇచ్చినది మనం తీసుకుని పూజిస్తే విశేషమయిన ఫలితం ఉంటుందని నమ్మిక. ధన త్రయోదశి నాడు కుబేర పూజలు, కుబేర వ్రతాలు, మొ., ఈ మధ్యన మనం ఎక్కువగా చూస్తున్నా, నిత్యం మనకి తెలిసో, తెలియకుండానో కుబేరుడిని మంత్రపుష్పం చదివేటప్పుడు స్మరిస్తూనే ఉంటాం.
నమోవయంవై శ్రవణాయ కుర్మహే
సమే కామాన్ కామ కామాయ మహ్యం
కామేశ్వరోవై శ్రవణో దదాతు
కుబేరాయ వైశ్రవణాయ మహా రాజాయ నమః “
హిందువులే కాక, బౌద్ధ, జైన మతాల వారు కూడా అధికంగా పూజించే, నమ్మే దైవం కుబేరుడు. బౌద్ధులు ఈయనని వైశ్రవణుడు లేదా జంభాలుడు అని పిలుస్తారు. శ్రీ శివ పురాణం ప్రకారం, కుబేరుడి అసలు పేరు వైశ్రవణుడే! జైనులు ఈయనని సర్వానుభూతి అంటారు. టిబెటియన్లు మరియు జపనీయుల ప్రకారం ప్రపంచాన్ని నలుదిక్కులా పాలించే రాజులలో కుబేరుడు ఒకడు. బౌద్ధుల ప్రకారం ఈయన చేతిలో ఎల్లప్పుడూ బంగారు నాణెములు కల ఒక సంచీ కానీ వజ్రములను, మణులను వెదజల్లు ముంగీస కానీ ఉంటాయి. అదే విధంగా, మరొక చేతిలో ఎల్లప్పుడూ నిమ్మకాయ (జంబీరము) ఉండటం వలననే ఈయనకి జంభాలుడు అనే పేరు వచ్చిందని చెప్తారు. అగ్ని పురాణం ప్రకారం, ఈయన ఆయుధం గద, వాహనం నరుడు (మనిషి). దీని ద్వారా మనిషి డబ్బుకి, ఐశ్వర్యానికి బానిసగా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. కనుక మనిషి మనీ కి బానిస కాకుండా స్వీయ నియంత్రణతో బంధువుగా వుంటూ, ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో జీవించాలని ఆశిద్దాం.
“ఓం యక్షరాజాయ విద్మహే అలకాధీశాయ ధీమహి తన్నో కుబేరః ప్రచోదయాత్”
ప్రచురణకు ముందు ఈ వ్యాసాన్ని ఎవరైనా చదివారా? ఎన్నెన్ని తప్పులు ఉన్నాయో!
thanks
కుబేరుడి అనుగ్రహం పొందడానికి ఏం చెయ్యాలో?
చాలా మంచి విషయాలు చెప్పారు కుబేరుని గురించి..ధన్యవాదములు
Nice article
Well Said
chala manchi vishayalu kluptanga cheppau, dhanyavadalu
Very good,Thanks.
very interesting…thanks for sharing..
శ్రీ రసజ్నగారికి, నమస్కారములు.
చక్కటి కథను వినిపించారు. చెప్పుకోదగ్గ విషయేమిటంటే, మన భారత పురాణ కథలలో అడుగడుగునా ధర్మం, నీతి గురించి చెప్పబడుతూ, సామాన్యులకైనా, దేవతలకైనా ధర్మం, నీతి ఒకేరకంగా వర్తిస్తుంది అని చెబుతూ, జన సామాన్యానికి ఈ కథలని మనస్సుకు హత్తుకొనేటట్లుగా చెప్పటం.
మీ స్నేహశీలి,
మాధవరావు.
Very interesting and informative. Thanks for the write up
’జన్మకో శివరాత్రి’ ,’కళ్ళు పోతాయ్’ అనేవాటికి ఇంత కథుందా !
పోస్ట్ గురించి కొత్తగా చెప్పేదేంలేదు, ఎప్పటిలాగే బాగుంది 🙂
ఒక విషయం ప్రజెంట్ చేయడానికి మీరు చెప్పే add-ons, తీసుకునే శ్రమ (notes etc ) అద్భుతం అండీ.
కుబేరుడి గురుంచి సమగ్రంగా తెలియజేశారు.గుణనిధే కుబేరుడిగా జన్మించాడని తెలిసి ఆశ్చర్యపోయాను.పాంచాలకుడి వృత్తాంతం ఎప్పుడూ వినలేదు.అలాగే కళ్ళుపోతాయనే నానుడి ఎందుకొచ్చిందో కుబేరుడు రావణునికి పంపిన సందేశం ద్వారా తెలియజేశారు.ధన్యవాదాలు.