సంపాదకీయం: భరద్వాజ్ వెలమకన్ని
ఈసారి సంపాదకీయం మేము పాఠకుల వద్దనుండి ఆశిస్తున్నాం. విషయం: రాబోయే 2014 ఎన్నికల గురించి. ఈ విషయం పై మీ అభిప్రాయాలను వ్యాఖ్యల ద్వారా పంచుకోవచ్చు. ఆ వ్యాఖ్యల సారాంశాన్ని సంపాదకీయంలో కొన్ని రోజుల తఱువాత పొందుపరుస్తాం.
ముందుగా మా అభిప్రాయం:
మళ్ళీ ఎన్నికల సమయం వస్తోంది. పార్టీల హడావిడి మొదలయ్యింది. ఈసారి భీకర పోరు తప్పదంటున్నారు విశ్లేషకులు. సంపాదించుకున్న పరువంతా పోగొట్టుకున్న మన్మోహనుడొకవైపు, ప్రధానికాగల లక్షణాలున్నాయో లేవో తెలియని రాహుల్ ఇంకోవైపు, తన గొప్పలన్నీ నిజాలో, అబద్ధాలో జనాలకి తెలియకుండా నెట్టుకొస్తున్న మోడి మరోవైపు బరిలో ఉన్నారు. వీరు గాక ములాయం, నితీష్ లాంటివారు కూడా సై అంటున్నారు.
అయితే ఇక్కడి విషయం సగటు భారతీయ వోటరు ఆలోచన గురించి. అయిదేళ్లకొకసారి పడేసే ముష్టికి ఆశపడి ఎక్కువ డబ్బులిచ్చిన పార్టీలకి వెయ్యాలా? తన అత్మప్రభోధాన్ని బట్టి వెయ్యాలా లేక “None of the above” నొక్కాలా అన్నది చిక్కు ప్రశ్నే. ఎవరి ఉద్దేశ్యాలు వాళ్లవి.
ప్రజాస్వామ్యంలో ప్రజలనుబట్టే పాలకులుంటారు. ఇలాంటి నాయకులు దొరకటం మా ఖర్మ అని తలబాదుకుని ఏడ్చే బదులు ఎన్నికల సమయంలో సరయిన వారిని ఎన్నుకుంటే ఆ బాధలుండవు కదా. అదీగాక ఎన్నికలలో జయాపజయాలు ముఖ్యంగా చదువుకున్నవాళ్లలో ఓటువెయ్యని వారి వల్ల నిర్ణయించబడుతున్నాయి. చదువుకున్నవారందరూ ఒక్క పూట టీవీ సీరియళ్ళు మానేసి ఓటు వేస్తే వచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయనటంలో సందేహం లేదు. ఓటు వేయడం మానేస్తే మనకేం నష్టం లేదనుకుంటాం కాని ఫలితాల మీద ప్రభావం చూపిస్తుంది. తద్వారా ఏవరో ఒక నాయకుడు ఎన్నికై మనను ఐదేళ్లు పాలిస్తాడు.. కనీసం వచ్చే ఎన్నికలలోనైనా ముందుగా రిజిస్టర్ చేసుకుని, అర్హత కలిగినవారందరూ వోట్లు వేస్తే అది భారత ప్రజాస్వామ్యానికో సుదినం కాగలదు…
మరి మీరేమంటారు?