రచన: పొత్తూరి విజయలక్ష్మి
నవల పేరు గమ్మత్తు గా వుందికదా . పేరుకి తగినట్లే ఉంటుంది నవల కూడా
వుండదా మరి ! రాసింది ఎవరూ?
కాయితం మీద కలంతో లయవిన్యాసం చేయించగల రచయిత్రి మన్నెం శారదగారు
నవల రాసినా, కథ రాసినా, టి.వీ సీరియల్ రాసినా ఒక స్థాయిలో రాస్తారు .
ఎన్నో బహుమతులు గెల్చుకున్నారు . తన సీరియల్స్ ద్వారా పత్రికల సర్క్యూలేషన్ పెంచిన ఘనత ఆమెది .
ఈ నవల కాస్త విలక్షణంగా సలక్షణం గా రాశారు .
మొదలు పెడితే ఆపకుండా చదివించే నవల రాయటం అంత తేలిక కాదు. హాస్యం, సస్పెన్సు కలబోసి ఆద్యంతం కమనీయంగా కధ నడిపించటానికి మంచి నేర్పు వుండాలి.
అనుభవం వుండాలి. రచనా వ్యాసంగంలో అపారమైన అనుభవం కలిగిన రచయిత్రి మన్నెం శారదగారు అంత కష్టమైన పనిని అలవోకగా చేస్తూఈ నవల రాసేసారు.
మోసపోయి దివాణాన్ని పోగొట్టుకున్న ఒక వృద్దురాలు ఏంచేసింది అనేది నవలలోని కథాంశం .
బలమైన కధ, సస్పెన్స్, గిలిగింతలు పెట్టే హాస్యం పాఠకులను ముగ్ధులను చేస్తాయి.
అన్నీ సజీవమయిన పాత్రలు. దుర్గమ్మ సరే హీరోయిన్ . ఇంకా హరిణి . నాగరత్నం . మేరీ, ఏలేరు జమీందారు గారి కుటుంబం యావత్తూ ఏ పాత్ర అందం ఆ పాత్రదే . ఇకపోతే విప్లవం పాత్ర అమోఘం చదవాల్సిందేగానీ , వర్ణించటం కష్టం విప్లవం గురించి .
తప్పతాగి ద్వారాలు లేకుండా అన్నీ కిటీకీలు పెట్టి పేదలకు ఇల్లు కట్టి వుద్యోగం పోగొట్టుకున్న ప్రభుత్వ ఉద్యోగి అవతారం పాత్ర కూడావుంది .
పీలేరు రాణీ గారున్నారు , అమ్మాయిలుం గారు ,వున్నారు .
హీరోలున్నారు . విలన్లున్నారు . కమేడియన్లు వున్నారు .
“అలాచీటికీ మాటికీ పోవడానికి ఇదేమైనా మీ ఉద్యోగమా ?
జుట్టు చూడు. పాత బ్రిడ్జి కింద కూచునే సన్యాసుల జుట్టులా ఉండలు కట్టేసింది .
మీతోనా కాంట్రాక్టులు? వద్దులెండి . ఆ అనార్కలి సమాధులు మా అన్నయ్య చేత కూడా కట్టించాలనా ?
వంటి చమక్కుమనే సంభాషణలు పుష్కలం గా వున్నాయి
నవల పూర్తయ్యేసరికి విజయావారి మిస్సమ్మ , అప్పుచేసి పప్పుకూడు , సినిమాలు చూసిన అనుభూతి కలుగుతుంది .
అప్పుడెప్పుడో వాకాటివారు సంపాదకులుగా వున్న సమయంలో ఆంధ్ర ప్రభ దినపత్రికలో ధారావాహికగా వచ్చిన ఈ నవలను ఇప్పుడు పుస్తక రూపంలోకి తెచ్చి పాఠకులకు మేలుచేశారు రచయిత్రి .
మహారాజశ్రీ మన్నెం శారద గారూ మీకు వందనం