సమీక్ష: నండూరి సుందరీ నాగమణి
‘అంతర్వాణి’ – శ్రీ కొసరాజు కృష్ణప్రసాద్ గారి కవితాసంపుటి పేరుకు తగినట్టే స్వగతంగా వ్రాసుకున్న కవితలతో కొనసాగుతుంది. చక్కని పద ప్రవాహంతో, లయతో సాగిన ఈ కవితలు అన్నీ విభిన్న కవితావస్తువులతో అలరించాయి.
‘మాతా పిత: నమామి’ అంటూ అమ్మానాన్నల తలచుకొంటూ, వారికి ప్రణామములు అర్పిస్తూ మొదలైన కవితా వాహిని, ఆద్యంతమూ చదువరుల మనసును ఆకట్టుకునే విధంగా కొనసాగింది. ‘వ్రాసితిని వ్రాసితిని’ అనే కవితలో తన కవితకు స్ఫూర్తి దాయకులైన కవులను – అలనాటి రాయల నుంచి, ఇటీవలి మహాకవి శ్రీశ్రీ వరకూ అందరినీ స్మరించారు. రైతు గొప్పదనాన్ని ‘కృషీవలుడు’ అనే కవితలోనూ, తెలుగు నేల ఘనతను ‘తెలుగుతల్లి’ కవితలోనూ, శిల్పి చేతిలో శిల్పంగాను, పెద్ద పెద్ద భవంతులకు పునాది గానూ నిలిచే ‘రాయి’ని ‘రాయి’ అనే కవితలోనూ చక్కగా వర్ణించారు. ‘భడవ’, ‘చిట్టితల్లి’ అనే కవితలలో తమ సంతానం గురించి పితృ వాత్సల్యంతో వారిద్దరినీ వర్ణించారు.
వచనకవితలు వ్రాసే కవులందరికీ అజ్ఞాత గురువు శ్రీశ్రీ గారే… ‘శ్రీశ్రీ’ అనే కవితలో వారిని స్మరించుకున్న తీరు, ‘అమ్మ’ కవితలో అమ్మ గురించి వ్రాసుకున్న రీతి అమోఘంగా ఉన్నాయి. ‘మంచోళ్ళవండే’ కవిత నేటి రాజకీయ నాయకులపై, రాజకీయ పరిస్థితులపై ఒక చక్కని వ్యంగ్యాస్త్రం.
ఇంత మంచి కవితాసంపుటిని రచించిన శ్రీ ‘కొసరాజు కృష్ణప్రసాద్’ గారిని, అందంగా అచ్చువేసిన మన జేవీ పబ్లికేషన్స్ అధినేత శ్రీమతి జ్యోతి వలబోజు గారిని అభినందిస్తూ, పుస్తకం అందుకొని చదివేద్దామా మరి!
***
నండూరి సుందరీ నాగమణి