March 28, 2024

జైన మతము

రచన: శారదా ప్రసాద్

క్రీ. పూ. 6వ శతాబ్దంలో భారతదేశంలో అనేక మతాలు ఆవిర్భవించాయి. వీటిలో ముఖ్యమైనవి జైనమతం, బౌద్ధమతం. ఈ రెండు మతాలు భారతదేశ సంస్కృతిని గణనీయంగా ప్రభావితం చేశాయి. ముఖ్యంగా బౌద్ధం చైనా, జపాన్ లాంటి దేశాల్లో ఇప్పటికీ గొప్ప ఆదరణ పొందుతోంది. జైనమతం చాలా పురాతన కాలం నుంచి ఉందని తెలుస్తోంది. ఋగ్వేద మంత్రాల్లో జైన మత స్థాపకులైన మొదటి తీర్థంకరుడైన వృషభనాథుని గురించి స్పష్టమైన ప్రస్తావన ఉంది. జైన మతంలో 24 మంది తీర్థంకరులు ఉన్నారని, అందరూ క్షత్రియులేనని తెలుస్తోంది. వీరిలో మొదటి ఇరవై రెండు మంది పౌరాణిక వ్యక్తులు. కానీ 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు, 24వ తీర్థంకరుడైన మహావీరుడు చారిత్రక పురుషులు. చారిత్రకంగా మాత్రం జైనమత స్థాపకుడు 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు. ‘తీర్థంకరులంటే జీవ ప్రవాహాన్ని దాటడానికి వారధి నిర్మించినవారు’ అని అర్థం. ప్రాచీన మతాలలోని కర్మకాండల భారంతో జనం విసిగిపోయి ఉన్నారు. పూజారి వర్గం, అసమానతలు, సామాజిక స్తబ్దత, అధర్మం, బలులు, కులవ్యవస్థలతో సమాజం కుళ్ళిపోయింది. విప్లవం తప్పనిసరి అయింది. “వ్యక్తి ఆడగాని, మగగాని మానవ మాతృడుగా తన ముక్తిని తానే సాధించుకోవాలి. జీవితం లక్ష్యం కాదు.
ఆధ్యాత్మీకరణ మార్గంలో అది ఒక పరికరం మాత్రమే. అంతిమ లక్ష్యం”ఆధ్యాత్మీకరణం”. ఆధ్యాత్మీకరణం అన్నది నూతన విప్లవం. ఈ నేపథ్యంలో భారత దేశంలో రెండు మతాలు వెలిశాయి. అవి జైన, బౌద్ధ మతాలు. హిందూ మతానికి అవి వ్యతిరేకమే అయినా, మొత్తం మతాలు భారతదేశంలో ప్రక్క ప్రక్కనే నివాసం చేశాయి. జైన మతాన్ని జైన వృషభనాథుడు స్థాపించాడు. “జిన”(విజేత) అనే పదం నుంచి జైనం వచ్చింది. జైన మతము సాంప్రదాయికంగా
జైన ధర్మఅని పిలువబడుతుంది. ఈ మతము క్రీ. పూ. 9వ శతాబ్దంలో పుట్టింది. ఈ మత స్థాపకుడు మొదటి తీర్థంకరుడు అయిన వృషభనాథుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. 24వ తీర్థంకరుడు వర్థమాన మహావీరుడు.
భారతదేశంలో జైనులు ఒక చిన్న సమూహము. వీరి జనాభా దాదాపు 42 లక్షలు ఉంటుంది. జైన మతమును శ్రమణ మతమని కూడ అంటారు. వీరు దేవతలు లేరన లేదు. కాకపోతే వారికి దివ్యత్వం లేదన్నారు . అందువల్ల మహావీరుడి మతం నాస్తికం. అతడి తత్వం ద్వైతం. అతడి ప్రకారం రెండు రకాల పదార్థాలున్నాయి. ఒకటి జీవులు, రెండు అజీవులు. అజీవులు పదార్థం. అజీవులు అణు నిర్మితాలు. జీవులు అమర్త్యాలు. అజీవులు మర్త్యాలు. మనిషి మూర్తిత్వం ఈ రెండింటితోనూ నిర్మితమవుతుంది. కర్మ కారణంగా ఆత్మ బంధిత స్థితిలో ఉంటుంది. పునర్జన్మ కర్మ మీద అధారపడి ఉంటుంది. పరివ్రాజకుడు, గృహస్తు – ఎలా నడుచుకోవాలో జైనం వివరించింది. నిర్వాణం లక్ష్యం కనుక, మనిషి దుష్కర్మలను పరిహరించాలి. అంతే కాక, క్రమంగా నూతన కర్మలు చేయకుండా ఉన్న కర్మలను వినాశం చేసుకోవాలి.
ఇలాంటి ప్రవర్తన త్రిరత్నాల ఆధారంగా జరగాలి. అవి సమ్యగ్విశ్వాసం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ప్రవర్తనలు, మంచి నడతకు ఐదు ప్రమాణాలున్నాయి. అవి-అహింస, సత్యం(అబద్దమాడకుండుట), అస్తేయం(దొంగతనం చేయకుండుట), బ్రహ్మచర్యం, అపరిగ్రహం (ఇతరుల ఆస్తిని కబళించకుండుట). సమ్యగ్విశ్వాసం అంటే జినుల మీద విశ్వాసం. సమ్యక్ జ్ఞానం అంటే అంతిమ ముక్తికి అన్ని వస్తువులలో ఉన్న జీవానికి సంబంధించిన జ్ఞానం. ఇదంతా, మామూలు గృహస్తు నిర్వాణం పొందాలంటే ఆచరింపవలసిన విధానం.
సన్యాసి అంతకంటే తీవ్రమైన క్రమశిక్షణతో మెలగాలి. సన్యాసి అయినవాడు అహింసను తప్పనిసరిగా పాటించాలి. శాకాహారాన్ని భుజించాలి. అహింసా విధానం ఎంతవరకు వెళ్ళిందంటే, భూమిలో ఉండే వానపాములు చనిపోతాయని, అసలు భూమినే దున్నవద్దన్నారు. ఆ కారణంగా జైనులు ఎక్కువ మంది నగరాలకు వలసపోయి, వ్యాపారాలలో స్థిరపడ్డారంటారు. ఆచరణసాధ్యం కానంత తీవ్ర స్థాయిలో అహింస ఉంటుంది. జైనమతం ప్రజాదరణ పొందలేకపోవడానికి ఇది ఒక కారణం.
గాలి పీలిస్తే గాల్లోని సూక్ష్మజీవులు చచ్చిపోతాయని మూతికి గుడ్డ కట్టుకుంటారు. నీళ్ళు వడగట్టుకుని తాగుతారు. అడుగు తీసి అడుగువేసేటప్పుడు కాలికింద పడి సూక్ష్మజీవులు చచ్చిపోతాయని నెమలీకలతో చేసిన పొరకతో నడిచినంతమేరా అడుగేసేముందు నేలను ఊడ్చుకుంటూ పోతారు. నేలను చీల్చి దున్నే వ్యవసాయం చేయరు. నేలకింద పండే దుంపకూరలు, ఉల్లి, వెల్లుల్లి, మసూర్ గింజల్లాంటివి కూడా తినరు. వడ్డీ వ్యాపారం చేస్తారు.
23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు–ఇతను కాశీ రాజైన అశ్వసేనుడు, రాణి వామలకు జన్మించాడు. 30 ఏళ్ల వయస్సు వరకు గృహస్థ జీవితాన్ని గడిపాడు. తర్వాత ఇహలోక సుఖాలను త్యజించి, 84 రోజులు తపస్సు చేసి జ్ఞానిగా మారాడు. అహింస, సత్యం, అస్తేయం (దొంగతనం చేయకూడదు), అపరిగ్రహం (ఆస్తి ఉండకూడదు) అనే నాలుగు సూత్రాలను బోధించాడు. అదనంగా ఐదో సూత్రమైన బ్రహ్మచర్యాన్ని మహావీరుడు జోడించాడు. పార్శ్వనాథుడు తన వందో ఏట బెంగాల్‌లో నిర్యాణం చెందాడు.
వర్థమాన మహావీరుడు (క్రీ. పూ. 540- 468) — మహావీరుని అసలుపేరు వర్ధమానుడు. జ్ఞానోదయమైన తరువాత ‘ మహావీరుడు ‘ అని పేరు పొందాడు. ఈయన భార్య పేరు యశోద. వీరికి ప్రియదర్శి అను పుత్రిక కలదు. ఈమె వర్థమానుని మేనల్లుడు జామాలిని వివాహమాడింది. వర్థమానుడు తన 30వ ఏట గృహస్థ్యాన్ని త్యజించి, కఠినమైన తపస్సు చేశాడు. ఆరు సంవత్సరాలు మక్కలిగోశాలుని శిష్యునిగా ఉన్నాడు. ఆ తరువాత రిజుపాలిక నదీ తీరంలోని జృంబిక గ్రామం దగ్గర కఠోర తపస్సు చేశాడు. తన 43వ ఏట సాలవృక్షం కింద తపోసిద్దిని పొందాడు.
తదనంతరం, వర్ధమానుడు అంగ, మిథిల, కోసల, మగధదేశాలలో తన తత్వాన్ని ప్రచారం చేశాడు. ఇతడిని చివరివాడని జైనులు నమ్మారు. వర్థమానుడు, సిద్ధార్థ, త్రిశాల దంపతులకు క్రీ. పూ. 540లో వైశాలి సమీపాన కుంద గ్రామంలో జ్ఞాత్రిక క్షత్రియ వంశంలో జన్మించాడు. వర్థమానుని తండ్రి జ్ఞాత్రిక తెగకు అధిపతి కాగా, తల్లి వైశాలిని పరిపాలించిన చేతకుడి సోదరి, లిచ్ఛవీ రాజకుమార్తె. మగధ రాజు బింబిసారుడు చేతకుడి కుమార్తె అయిన చెల్లనను పెళ్లి చేసుకున్నాడు. అందువల్ల మగధను పరిపాలించిన హర్యాంక రాజ వంశీకులకు మహావీరుడు బంధువు అవుతాడు. అతడి కూతురు భర్త, జామాలి అతడి మొదటి శిష్యుడయ్యాడు.
వర్థమాన మహావీరుడు ఒకసారి నలందను దర్శించినప్పుడు అతనికి గోశాల ముస్కరీ పుత్రుడనే ఒక సన్యాసితో పరిచయం అయింది. వర్థమానునితో ప్రభావితుడైన ఆ సన్యాసి ఆరేళ్ళు వర్థమానుని తత్వాన్ని ప్రభోధించాడు. ఆ తరువాత అతడు చీలిపోయి “ఆజీవక మతము” ను స్థాపించాడు. ఆరేళ్లు దిగంబర యోగిగా తపస్సు చేసి విఫలుడై మక్కలి గోసాలుని (అజీవక మతశాఖ స్థాపకుడు) వద్ద శిష్యత్వం స్వీకరించాడు. వర్థమానుడు పదమూడు సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు. శరీరం శుష్కించి పోయింది. ఆ తరువాత వైశాఖ మాసం పదమూడవ రోజున జృంభిక గ్రామం (పార్శ్వ నాధ పర్వతాల దగ్గర) లో అతనికి “అంతర్భుద్ధి” కలిగింది. తరువాత అతడు 42 వ యేట మహావీరుడు లేదా జినుడు అయ్యాడు. అతని అనుచరులను నిర్గ్రంధులు అన్నారు. నిర్గ్రంధులు అంటే బంధాలు లేనివారు. తరువాత ముప్పై సంవత్సరాలు అతడు కోసల, మగధలలోనే కాక ఇంకా తూర్పు వైపుకు వెళ్లి తన సిద్ధాంతాలను బోధించాడు.
బింబిసారుడు, అజాత శత్రువు మొదలైన రాజులను తరచు కలిసేవాడు. అతడు తన డెబ్బై రెండవ యేట పావా (పాట్నా) జిల్లాలో బి. సి. 527 లో మరణించాడు. కాని కొంతమంది పండితులు అతడిని బుద్ధుని కంటే చిన్నవానిగా భావించి బి. సి. 458 లో మరణించాడన్నారు. తన 42వ ఏట జ్ఞానోదయం (కైవల్య) పొంది జినుడయ్యాడు. ‘జినుడు అంటే పంచేంద్రియాలను జయించినవాడు’ అని అర్థం. ధైర్యసాహసాలతో తపస్సు సాగించినందున మహావీరుడు అని, మహాజ్ఞాని కావడం వల్ల కేవలి అని, సకల బంధాలు తెంచుకొన్నందున నిర్గ్రంధుడని వర్థమానుడు గుర్తింపు పొందాడు జ్ఞానోదయం పొందిన తర్వాత వర్థమాన మహావీరుడు ఏడాదిలో ఎనిమిది నెలలు దేశాటన చేస్తూ ప్రజలకు తన సిద్ధాంతాలను బోధించాడు. మిగిలిన నాలుగు నెలలు చంప, వైశాలి, రాజగృహ, మిథిల, శ్రావస్తి మొదలైన పట్టణాల్లో కాలం గడిపేవాడు. ఈ నగరాలు జైనమత వ్యాప్తినిసూచిస్తాయి.
మహావీరుడు 72వ ఏట క్రీ. పూ. 468లో పాటలీపుత్రం సమీపంలోని పావపురిలో హస్తిపాలుడనే రాజు గృహంలో దీపావళి రోజున నిర్యాణం చెందాడు. మహావీరుడు వేదాలు ప్రామాణిక గ్రంథాలు, యజ్ఞాలు మోక్ష సాధనాలు కాదని చెప్పాడు. జంతు బలులను, వర్ణ భేదాలను ఖండించాడు. బ్రాహ్మణుల ఆధిక్యతను ఖండించి, అన్ని వర్ణాలవారు మోక్షానికి అర్హులే అనే సమత్వ సూత్రాన్ని ఉద్భోదించాడు.
పవిత్ర జీవితం గడుపుతూ సన్యాసిగా తపస్సు చేసి నిర్యాణం పొందొచ్చని మహావీరుడు బోధించాడు. భగవంతుడే ఈ ప్రపంచాన్ని సృష్టించాడని విశ్వసించ లేదు. మానవుడు ముక్తి కోసం భగవంతుడి అనుగ్రహం పొందిన లేదా మరే ఇతర వ్యక్తిపైనా ఆధారపడకూడదని, తన భవిష్యత్తుకు తానే కర్తని బోధించాడు. వర్ణ వ్యవస్థలో ఒక వ్యక్తి స్థానాన్ని అతని పూర్వ జన్మలోని పాపపుణ్యాలు నిర్ణయిస్తాయని మహావీరుడు పేర్కొన్నాడు. మహావీరుడికి భగవంతుడిపై నమ్మకం లేకపోయినప్పటికీ కర్మ సిద్ధాంతాన్ని నమ్మాడు. ఆత్మ ఉందని, ఆత్మకు పునర్జన్మ ఉందని కూడా అంగీకరించాడు. మానవుల కర్మలే వారి భవిష్యత్తుని నిర్ణయిస్తాయని కర్మ సిద్ధాంతాన్ని చాటి చెప్పాడు. కామ, క్రోధ, లోభ, మోహం, అజ్ఞానం కర్మకు కారణమని, కర్మ ఫలితాలను అనుభవించడానికి మళ్లీ జన్మించాల్సి వస్తుందని అన్నాడు.
కర్మను అంతం చేసి మోక్షం పొందాలంటే ప్రతి ఒక్కరూ మూడు సూత్రాలను పాటించాలని బోధించాడు. వీటిని త్రిరత్నాలు అంటారు. అవి—సరైన విశ్వాసం అంటే మహావీరుడి భావనల్లో శ్రద్ధ, విశ్వాసం కలిగి ఉండటం. సరైన జ్ఞానం అంటే మహావీరుడి బోధనల్లోని సత్యాన్ని గ్రహించడం. సరైన నడవడి అంటే జైన పంచ వ్రతాలను ఆచరించడం. జైనుల మొదటి సమావేశం పాటలీపుత్రంలోక్రీ. పూ. 300లో జరిగింది. ఈ సమావేశ ఫలితంగా జైన తీర్థంకరులు బోధించిన సిద్ధాంతాలను 12 అంగాలుగా క్రోడీకరించారు. వీటిపై వ్యాఖ్యానాలు కూడా రాశారు. వాటిని నిర్యుక్తులు అని అంటారు.
క్రీ. పూ. 4వ శతాబ్ది చివరి కాలంలో బీహార్‌లో భయంకరమైన కరువు ఏర్పడింది. ఇది 12 ఏళ్లపాటు ఉంది. ఈ సమయంలో భద్రబాహు నాయకత్వంలో కొందరు జైనులు దక్షిణాదిలోని మైసూరు ప్రాంతానికి వెళ్లారు. వీరు దక్షిణాదిలో జైనమతం వ్యాపింప చేశారు. స్థూలభద్రుడి అనుచరులను శ్వేతాంబరులని, భద్రబాహు అనుచరులను దిగంబరులని అంటారు. ముందుగా చెప్పినట్లుగా ఆచరణకు సాధ్యం కాని అహింసా సిద్ధాంతం వల్ల ఈ మతం క్రమేణా క్షీణదశకు చేరింది.
మహావీరుడు మోక్షాన్ని పొందిన చోట నేడు జలమందిరం పేరుతో జైన మందిరం ఉంది. ఆయన నిజంగానే వీరుడు. అరిషడ్వర్గాలనీ జయించిన వీరుడు. ప్రపంచ చరిత్రలోనే అంతకుమునుపు కనీవినీ ఎరుగని రీతిలో అహింసాయుత పద్ధతిలో స్వేచ్ఛను పొందిన భారతదేశస్వాతంత్రోద్యమాన్ని నడిపించిన మహాత్మాగాంధీ గారి అహింస, శాంతి మార్గాలకు స్ఫూర్తి వర్ధమాన మహావీరుడు.

13 thoughts on “జైన మతము

  1. జైన మతం గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్
    ఈ జైన మతానికి సంబంధించిన గ్రంథాలు ఏవి అవి ఎక్కడ దొరుకుతాయో తెలుపగలరు .ధన్యవాదాలు .9676338238
    9494194988

  2. Good Description on Lord Mahaveera!!

    According to my knowledge one Jain historian [or writer] wrote a book on “comparison between Lord Vardhaman mahaaveer and Lord Gouthama Buddha”…..

  3. జైన మాతం.. గురించి చాలా వివరంగా రాశారు.అతి తీవ్రస్థాయి అహింసా ధర్మం అయినప్పటికీ..మహాత్ముని మనకి అందించిన అహింసా పథం.. జైనం..అని ఆ మతం వైశిష్ట్యాన్ని తెలియచేసిన…మీకు అభివాదములు…sir

  4. జైనమతం గురించి వ్రాసిన మీ వివరణాత్మకమైన వ్యాసం బాగుంది. నాకు జైనమతంతో పరిచయం ఎక్కువే. ఎందుకంటే మావూళ్లో (నర్సాపురం) నా ఇంటి చుట్టూ జైనులే. అంతేకాదు. నాకు చాలామందితో స్నేహం కూడా ఎక్కువే.

    1. అసలు జైన మత స్థాపకులు వృషభ నాథుడా, లేక పార్శ్వ నాథుడా? కొంచెం ఖచ్చితంగా చెప్పండి. ఇద్దరూ మత స్థాపకులే అన్నట్టు చెప్పారు మీ రచన లో.

  5. జైన మతాన్ని గురించి చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు!

  6. ప్రధానమైన మతాల విషయాలను గురించి కూడా తెలియచేయండి!

Leave a Reply to వ్యాసమూర్తి Cancel reply

Your email address will not be published. Required fields are marked *