రచన: ఝాన్సీరాణి కె.
లక్ష్మిగారు డైనింగ్ టేబల్ దగ్గర కూర్చుని మరుసటి రోజు కూరకి చిక్కుడుకాయలు వలుస్తున్నారు. హాల్లో పిల్లలందరూ కూర్చున్నారు.
మన ఆర్థిక మంత్రి ఎవరు అడుగుతున్నాడు కిరాణ్ ?
“రోశయ్య” అంది లాస్య
“కాదు” అన్నాడు కిరణ్
హోంమంత్రి ఎవరో చెప్పు?
సబితా ఇంద్రారెడ్డి
“చెన్నై గవర్నరెవరు?”అడిగారెవరో
“రోశయ్య” అన్నాడు కిరణ్
“ఆయన మన ఆర్థిక శాఖ మంత్రి” అంది లాస్య.
“కావాలంటే ఈ బుక్ చూడంఢి. మూడేళ్ళ నుంచి ఈ బుక్ చదివిన వాళ్ళకే క్విజ్లో ప్రైజ్ వస్తూంది” అన్నాడు రోహిత్.
“అమ్మా ఇలా రండి” పిలిచారు లక్ష్మిగారు.
అందరూ బిలబిలా ఆవిడ చుట్టూ చేరారు.
“ఎల్లుండి క్విజ్ కాంపిటీషన్ ఉంది అమ్మమ్మా” అన్నాడు జార్జ్.
“కొన్ని ప్రశ్నలకు జవాబులు మాత్రం ఈ పుస్తకంలో ఉన్నవి కావంటున్నాడు కిరణ్” అని ఫిర్యాదు చేసింది లాస్య.
“పుస్తకంలో కూడా తప్పులుంటాయా అమ్మమ్మా?” అన్నాడు సాగర్.
“మీకొక కథ చెప్పనా?” అన్నారు క్ష్మీగారు
“బలే బలే” అంటూ వచ్చాడు రఫీ అందరూ కుర్చీలలో, గోడవార ఉన్న సోఫాలో సర్దుకుని కూర్చున్నారు.
“కనకరాజు” 9 లేక 10 చెట్లు కొట్టేవాడు. అతడితో బాటు రంగడు, గోపి, అహమ్మద్ అని మరో ముగ్గురు పని చేసేవారు. వారు పని మధ్యలో రెండు సార్లు టీ త్రాగటానికి వెళ్లి అరగంట తర్వాత వచ్చేవారు. కొన్ని రోజుల తర్వాత కనకరాజు తన యజమాని జగన్నాధరావుగారితో తన తోటివారు, పని మధ్య లో వదిలేసి వెళ్ళి కబుర్లతో సమయం వృధా చేస్తున్నారని చెప్పాడు. ఒక వారం తర్వాత వాళ్ళను అడుగుతానన్నాడు జగన్నాధరావు. వారం రోజులు గడిచాయి. యజమాని వాళ్ళనెలా కోప్పడతాడో, అప్పుడు వాళ్ళేం చెబుతారో చూడాలని ఆతృతగా ఉన్నాడు. కనకరాజు.
జగన్నాధరావు కనకరాజును పిలిచాడు. మిగిలినవాళ్ళను పిలవకుండా తనను పిలుస్తున్నాడేమిటా అనుకుంటూ వెళ్ళాడు కనక రాజు.
జగన్నాధరావు చేతిలో ఒక కాగితం ఉంది. అందులో పని చేస్తున్న నలుగురి పేర్లు: వారం రోజుల్లో ఒక్కోరోజు పేరు కెదురుగా వారు కొట్టిన చెట్ల సంఖ్య వ్రాసి వుంది. ప్రతిరోజు నలుగురు సమానంగా కాని, లేకుంటే కనకరాజుకంటే ఎక్కువ చెట్లు కొట్టారు. అది చూపించి ఎవరినేమనాలో చెప్పమన్నాడు జగన్నాధరావు.
ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు కనకరాజు కాని అతడికి అర్థం కానిది ఒక్కటే తనకంటే తక్కువ సమయం పనిచేసినా వాళ్ళెలా తనతో సమానంగానో, లేకపోతే ఎక్కువగానో పని చేయగలుగుతున్నారు అని తర్వాత రోజు వాళ్ళతో కలిసి టీ త్రాగటానికి వెళ్ళాడు కనకరాజు.
“ఏమిటి కనకరాజూ గాలిలా మళ్ళింది?” అన్నాడు అహమ్మద్. “సమయం వృధా కాదా?” అన్నాడు రంగడు. ఊరుకోండ్రా అంటూ టీ కప్పు కనకరాజుకిచ్చాడు గోపి.
టీ త్రాగాక వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ గొడ్డలి గొడకేసి సానపెట్టడం ప్రారంభించారు స్నేహితులు. ..
అప్పుడర్థమయింది కనకరాజుకు మిత్రులు కబుర్లు చెబుతూ సమయం వృధా చేయట్లేదని, తమ పనికి కావలసిన విధంగా పని ముట్టును తయారు చేసుకుంటున్నారని. తర్వాత రోజు నుంచి వాళ్ళతో కలిసి తనుకూడా వెళ్ళి గొడ్డలి పదును పెట్టడం ప్రారంభించాడు.
అతనికి ఫలితం పెరిగింది.
కాబట్టి మూడేళ్ల క్రితం పుస్తకం కొని చదవడంకాదు రాహుల్ నాన్నకు చెప్పి కొత్త పుస్తకం తెప్పించుకో. మన రాష్ట్ర మంత్రులు, దేశానికి సంబంధించిన మంత్రుల జాబితా అంతా ఎవరైనా పెద్దవాళ్ళని కాని, లేకుంటే స్కూల్లో మీ టీచర్ని కాని అడిగి వ్రాసుకోండి. మీ నాలెజ్జ్ని అప్టుడేట్ చేసుకోండి అని ముగించారు లక్ష్మీగారు.
పిల్లలు అమ్మమ్మకు ధాంక్స్ చెప్పి ఆవిడ సహా పాటించి క్విజ్ ప్రోగ్రాంలో కప్ గెలిచి సంతోషంగా తెచ్చి ఆవిడ చేతిలో పెట్టారు.
*****