March 29, 2024

ఎందుకీ మహిళా దినోత్సవాలు??

రచన: శ్రీమతి నిర్మల సిరివేలు

అణకువ కలగిన ఇల్లాలుగా, ప్రేమను పంచే మాతృమూర్తిగా , స్నేహాన్ని పంచే ఆత్మీయ వ్యక్తిగా ఉన్న ఒక మహిళ మహిళా దినోత్సవాల సందర్భంగా మొదటిసారిగా తనలోని ఆలోచనలను, భావాలను ఎంత అందంగా వ్యక్తీకరించారో చూడండి.

పెద్దలకు, ఇంకా పెద్దలకు, ఈ సభకు వచ్చినందుకు మీకందరికి మా ధన్యవాదాలు.
స్త్రీ శక్తి స్వరూపిణి. అన్నింటా తెలివిగలది. చదువులో, వంటలో, తల్లిగా, భార్యగా, చెల్లిగా, ఇల్లాలిగా అందరి మన్ననలు అందుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నది. మగవానికి స్త్రీ అండదండలు లేకుంటే అసలు ఉన్నతస్థితికి రాలేడు. పర్వతారోహణలోగాని, విమాన యానంలోగాని, బ్యాంకింగ్ రంగంలో కాని, ఒక నటనారూపములోగాని, చెప్పలేనన్ని ఉన్నతస్థితిలో గాని, ఒకవైపు ఇల్లాలిగా, ఒకవైపు తల్లిగా, ఒకవైపు వృత్తిరిత్యా ఎన్నో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కుంటూ, పోరాటాలలో నెగ్గుకుంటూ ఉన్నతస్థాయిలో ఉండి సమాజ శ్రేయస్సుకు కూడా సహకరిస్తూ ఉందంటే ఏదో శక్తి ఆమెని ప్రేరేపిస్తూ ఉంది. లక్ష్మీదేవిలో, పార్వతీదేవిలో, సరస్వతీదేవిలో ఆవహించి స్త్రీశక్తిని నడిపిస్తూ ఉంది. రాణీ రుద్రమదేవి, రాణీ ఝాన్సీబాయి వంటి ఎందరో వీరవనితలు ఈనాడు కూడా ఉన్నారు.
ఒక తల్లి తనకు పుట్టిన బిడ్డలలో ఎవరైనా పోలియో వచ్చినా, అందవికారంగా ఉన్నా, మందమతిగా కాని, చూపులేకకాని, మూగ కాని, ఎలా ఉన్నా సరే ఆ తల్లి వారిని మిగతా పిల్లలకన్నా కూడా ఎక్కువ ప్రేమిస్తుంది. 24 గంటలూ ఆ బిడ్డతోనే ఆ తల్లి లోకం.
తాగుబోతు తండ్రి ఇంట్లో ఏమీ ఇవ్వకపోయినా, ఇల్లిల్లు తిరిగి పాచిపని చేసైనా తన బిడ్డలకు తిండి పెట్టాలని తాపత్రయపడుతుంది. కాలక్రమేనా ఆ తల్లి అనారోగ్యం పాలై చనిపోతే ఆ తాగుబోతుల బిడ్డలు అనాధ శరణాలయాలకు చేరుతున్నారు.
ఇలాంటి ఆశ్రమాలు లేకపోతే ఆ బిడ్డల గతి ఏమి కావాలి. అందుకే మనం ప్రతీ శనివారం దేవుడికి కొట్టే కొబ్బరికాయకు పెట్టే 20 రూపాయిలు ఒక అనాధ బిడ్డ కొరకు ఇస్తే అది ఇంత అంతై, అంత ఇంతై, వారికి మనం ఎంతో సాయం చేసినవారం అవుతాం.
దేవకి అష్టమగర్భంలో తనకు నారాయణుడే పుడ్తాడని తెలుసుకొని, ఆ రాక్షసుడు వింటే తన బిడ్డను చంపేస్తాడని ఆ ప్రసవ వేదనని నిశ్శబ్దంగా భరించింది. అంతటి ధీర వనితలు మహిళలు.
నేటికీ ఆడవారు మగాళ్లకు బలిపశువులుగా మారుతున్నారు. కామాందులకు బలి అయిపోతున్నారు. ప్రతీరోజు పేపరులో ఎవరో ఒకరు ఈ అమానుష చర్యలకు బలి అవుతున్నారు. ఈ దాడులను ఎదుర్కునే ధైర్యం ఆడవాళ్లకు ఎలా వస్తుంది. ఎప్పుడు వస్తుంది. తెలియకుండా ఉంది.
ఆడది అర్ధరాత్రి వంటరిగా నడిచే స్వతంత్రం ఎప్పుడు వస్తుంది? ఎన్ని March 8లు వచ్చినా మహిళలకు ప్రతీ చోటా అవమానాలే. ఎన్ని ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నా కూడ స్రీ ఎన్నో విధాలుగా మగవాడి చేతులలో బలి అవుతూనే ఉంది. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుంది. స్త్రీ శక్తి ఎప్పుడు మేల్కుంటుంది. అమ్మ శక్తి స్వరూపిణి. నవరాత్రులలో తొమ్మిది రోజులు ఎన్నో విధాలుగా పూజించి మ్రొక్క్లు మొక్కినా కూడా ఆమెకు ఆడదంటే నిర్లక్ష్యమా . ప్రపంచం ఎంత ఉన్నతి సాధించినా మహిళా నీకు ఇంకా పూర్తి స్వతంత్రం లేదు అంటూ ఉంది.
పూర్వకాలం నుండి మగవాడు వయసులో పెద్దగా ఉండాలి. ఆడది వయసులో చిన్నగా ఉండాలి అని పెట్టారు. ఎందుకంటే మగవాడికి సేవ చేసేది ఎవరు? భర్త మంచివాడు అయితే ఫర్వాలేదు. స్త్రీలోలుడు అయితే వాడి శరీరమంతా పుచ్చిపోయినా వాడికి సేవ చేయడానికే ఆడదాని వయసు తక్కువ పెట్టారు. అక్కడ కూడా వారి స్వార్ధం కోసం ఆడవారికి అన్యాయం చేసారు. సంసారం రచకెక్కకూడదు అని, సర్దుకుపోవాలి అని, ఆడదానికే నీతులు చెప్తారు. ఎంత గొడవ జరిగిన మన తప్పు లేకున్నా కొంచం తలవంచితే ఆ గొడవ సద్దుమణుగుతుంది అని ఆడవారికే చెప్తారు .
కొన్నిసార్లు ఆరోగ్యసమస్యలు వచ్చినప్పుడు కొడుకుకోసమైనా, కూతురు కోసమైనా ఒక్క మూత్రపిండం మార్చవలసి వస్తే ముందుగా తల్లే కడుపుతీపితో తన రక్తం పంచుకున్న బిడ్డకోసం తన కిడ్నీ ఇవ్వడానికి ముందుకొస్తుంది. కాని తండ్రి నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోతాడు. తన జీవితం ఏమైన పర్వాలేదనుకుంటుంది తల్లి. కాని అమ్మో నా జీవితం అని జంకుతాడు మగవాడు అదే తండ్రి.
భార్యకు ఆరోగ్యం బాగా లేక నాకు ఆరోగ్యం బాగాలేదు ఒక వంటవాణ్ణి మాట్లాడండి అని భర్తతో చెప్తే అతను భార్యతో చూడు నా వంక చూడు. రోజూ నీ వంట తినకపోతే ఈ జన్మ వ్యర్ధం. బయట తినలేను. నువ్వే చేసి పెట్టవా అని అడుక్కుంటాడు. ఇప్పుడు కూడా ఇలాంటి మగాళ్లు/ మొగుళ్లు ఉన్నారు.
“ఐస్‌లాండ్” అనే దేశంలో 1975 అక్టోబర్ నెల 24 న దేశంలోని మహిళలందరూ తమ పనులు ఆపేసి సమ్మె చేసారు. ఈంట్లో వంట , ఉతకడం, కడగడమైనా, ఆఫీసుల్లో, దుకాణాలు మొదలైన వ్యాపార సంస్థల్లో కూడా ఆడవాళ్లు అందరూ పని ఆపేసి సమ్మె చేసారు. దుకాణాలు, హోటళ్లు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, స్కూళ్లు, రైల్వే స్టేషన్లు, తెలిఫోన్ ఎక్షేజ్, రేడియో స్టేషన్ మొదలైనవన్నీ మూసేశారు. చాలా తీవ్రంగా జరిగిన ఈ సమ్మె చాలా ప్రభావన్ని చూపింది. వెంటనే ప్రభుత్వం దారికి వచ్చి వారితో చర్చలు జరిపింది. ఆ క్రమంలో తర్వాత ఆ దేశంలోని ఒక మహిళ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైంది.

ఇటువంటి మార్పు మన దేశంలో కూడా రావాలని అందరూ ఆశిద్దాము. ఆడవారికి ఇబ్బందులు కలుగుతున్నాయనే ఉద్ధేశ్యంతోనే (She) షీ పోలీస్ బృందం ఏర్పాటు చేయబడింది. వీరు స్త్రీలకు చాలా సహకరిస్తున్నారు. అయినా కూడా మహిళల మీద జరిగే అత్యాచారాలు, అమానుషాలు జరుగుతూనే ఉన్నాయి.
ఆడదానికి ఆడది శత్రువు కాకూడదు. వారి మధ్య సమన్వయం కావాలి. అత్త అయినా, కోడలు అయినా, కూతురు అయినా , అందరూ కలిసి ఆలోచించి అందరూ నావాళ్ళే అనే భావన మనసునిండా నింపుకుని కలిసి ఉండాలి. అప్పుడే కుటుంబం, దేశం కూడా సంతోషంగా, సుభిక్షంగా ఉంటుంది.

3 thoughts on “ఎందుకీ మహిళా దినోత్సవాలు??

  1. Wow అద్బుతమైన వర్ణన ఈ వర్ణించిన మహిళకు మోదటగా నా నమస్సుమాంజలులు. ఓక మహిళ తోటి మహిళను శిఖరాగ్రాన నిలపాలన్నా,పాతాళానికి దించాలన్నా అది మహళకే సాద్యం అయినప్పటికీ ప్రతీ మహిళ సాటి మహిళను ప్రోత్సహించి తోటి మహిళల అబ్యున్నతికి తోడ్పడాలి.

  2. A very thought provoking writeup…. I personally admire your lifestyle… Be it the way u carry yourself with health hickups,business stress,family pressures…ect and still strive to be You…with a gentle smile

  3. -“ సమన్వయం”-చాల చక్కని’,మహోత్కృష్టమైన పదము.అది లోపించడం మూలానే కదా ఇన్ని అనర్థాలు….ఏమైనా ,నిర్మల గారి భావాలకు అభినందిస్తున్నాను.” ఉందిలే మంచి కాలం ముందు ముందూనా” ఎంతైనా ఆశాజీవులం కదా !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *