రచన: ములుగు లక్ష్మీ మైథిలి
ప్రత్యూష కాంత నీలి వస్త్రం ధరించి
మేలి పొద్దును స్వాగతిస్తోంది
చైత్ర మాసపు గానరవళులతో
తెలుగుతనపు మధురభావనలతో
తొలిపండగ తెలుగువారి
ముంగిట్లో శ్రీకారం చుట్టింది.
ఏ చిత్రకారునికి అందని మనోహరదృశ్యం ..
పచ్చ పచ్చని లేమావి చివురులు
అరవిచ్చిన మల్లెల గుబాళింపులు
ఆమని రాకతో ప్రకృతిశోభ
ద్విగుణికృతమైంది
మనుగడలో మకరందాన్ని నింపి
షడ్రుచుల పరమార్ధం తెలిసేలా
జీవితంలో వసంతమై రావమ్మా..
తెలుగు తల్లిని వేనోళ్ళ కీర్తిస్తూ
మాతృభాష కు అక్షర హారతులతో
యుగాలకు ఆదివై, నవ్య ఉగాది వై
చేజారుతున్న సంస్కృతి సంప్రదాయాలను..నిలుపరావమ్మా
నీరాక తో ప్రతిఇల్లు మావిళ్ళతోరణాలతో
నవ్యశోభల సంతరించుకుంది
యువత వెన్నుతట్టే చైతన్యమూర్తివై
సజ్జలను సంరక్షించి
దుర్జనులను శిక్షించ ..
రావమ్మా..శ్రీవిళంబినామ వత్సరమా
స్వాగతం..సుస్వాగతం..!
******************
1 thought on “స్వాగతం”