April 24, 2024

జీవితమే ఒక పెద్ద పోరాటం

రచన: నిర్మల సిరివేలు

అమ్మా! అమ్మా! అని పిల్లలు ఏడుస్తూ ఉన్న హృదయ విదారకమైన సంఘటన చూస్తే ఎటువంటి వారికైనా కంతనీరు రాకమానదు.
పాలుతాగే పసిబిడ్డను వదిలి ఆ కన్నతల్లి ఎలా వెళ్లగలిగిందో ఏమో పైలోకాలకి వెళ్లిపోయింది. పెద్దపిల్ల అమ్మా అని ఏడుపు. చిన్నబిడ్డకు ఏమీ తెలియని పసి వయసు. ఆకలితో పాలకోసం తల్లి మీద పడి ఏడుస్తూ ఉంది. చూసినవాళ్లు ఆ బిడ్డను పక్కకు తీసికెళ్ళి ఆ తల్లిని సాగనంపడానికి ఆలోచనలు చేస్తున్నారు. ఆ శవాన్ని మునిసిపల్ వాళ్లకు అప్పచెప్పాలా, లేక మనమే తలా కొంత వేసుకుని అంత్యక్రియలు చేయాలా అని చర్చిస్తున్నారు.
తండ్రి ఏమైనాడో ఎవరికీ తెలీదు. అతను పని చేసే షావుకారు ఎర్రచెందనం చెక్క తేవడానికి పంపించారు. అడవిలో దొంగతనంగా చందనం తేవడానికి ఆ రాత్రి వెళ్లినవారందరూ బాగా తాగి నిద్రపోయారు. అదే సమయంలో ఫారెస్ట్ పోలీసులు వచ్చి పట్టుకెళ్లారు. ఎక్కడున్నాడో తెలీదు. అతనికి తన భార్యా, పిల్లలు గుర్తుండి వుంటే వాళ్ల గురించి పట్టించుకుని ఉంటే ఆ తల్లి ఇలా హీనమైన చావు కొనితెచ్చుకునేది కాదు.
నాలుగిళ్లల్లో పాచిపని చేస్తూ పిల్లలను సాకుతూ ఉండేది. 2,3 సార్లు ఆమె నోట్లోనుంచి రక్తం పడింది. ఆమె వెంటనే తను పని చేసే డాక్టరు దగ్గరకి వెళ్లింది. అన్ని టెస్టులు చేసాక కాన్సర్ అని తెలిసింది. నా దగ్గర ట్రీట్‌మెంట్‌కు అంత డబ్బు ఉందా, మంచి తిండి తినగలనా, ఏమి నా పరిస్థితి , నేను బాగవుతానా, నా పిల్లలతో ఈ జీవితమంతా నడవగలనా, నా బిడ్డలకు దిక్కు ఎవరు …. ఇలాంటి ఆలోచనలతో ఎవ్వరికి చెప్పినా నాకు ప్రయోజనం ఏమీ లేదంటూ కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ కుమిలిపోసాగింది. తన పిల్లలను ఎవరైనా తీసుకుని పెంచుకుంటే బాగుంటుంది అని ఎంతగానో ఆలోచించింది. బ్రతికుండగా తన పిల్లల గురించి ఏమీ చేయలేకపోయినా ఆమె చనిపోయిన తర్వాత ఎవరో పుణ్యాత్ములు ఆ పిల్లల్ని మంచి అనాధశరణాలయంలో చేర్చారు
అక్కా! ఇది ఏం కూర అని చిన్నారి చెల్లెలు అడిగితే , ఎవరు ఏది పెడితే అది తినాలమ్మా, చాలా బావుంది తిను అని చెప్తే అలా అమాయకంగా అంటూ తినేది పాప. ఆ దృశ్యం చూసినావారికి కంట నీరు రాకమానదు. అక్కడున్నవారంతా ఆడపిల్లలే. ఎవరు ఎవరికి ఏమవుతారో తెలీదు కాని ఆత్మీయంగా కలిసి ఉండేవారు. అమ్మాయిలిద్దరూ చాలా బాగా చదువుకునేవారు. టీచర్లు, ఫ్రెండ్స్ అంతా దగ్గరకు తీసేవారు. ఇలాంటి పిల్లలు కష్టపడి చదువుకుంటే మంచి పౌరులుగా తయారవుతారు. కాని అక్కడ కూడా శత్రువులు ఎదురుచూస్తూ, కన్నేసి ఉంటారు. అదను దొరికినంతనే బలి తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ ఎదుర్కుంటూ ఉన్నతస్థాయికి చేరుకోవడానికి ఎంత కాలం పడుతుంది. పాలవాళ్ళు, చెత్తవాళ్లు, వాచ్‌మెన్‌లు, ఇలా ఎందరినో ఎదిరించి అక్కడినుండి తప్పించుకుని బయటపడాలంటే ఎంత కష్టమో.
పిల్లలు బాగా చదువుకుంటూ ఎనిమిది, పదిక్లాసులకు వచ్చారు. శ్రద్ధగా చదువుకుంటూ అందంగా ఎదిగారు. పెద్దమ్మాయి బాగా చదివి, పెద్ద పోలీస్ ఆఫీసర్ కావాలని అనుకుంటూ ఉండేది. 10 క్లాసు కాగానే ఇంటర్లో చేరింది. పదో క్లాసులో మంచి మార్కులు రావడంతో ఇంటర్ కి స్కాలర్షిప్ వచ్చింది. మనం బాగా చదువుకోవాలి. పైకి రావాలి. మనకు ఎవరూ లేరు. మనకు మనమే తోడు. మన జీవితాన్ని మనమే తయారు చేసుకోవాలి అని ఒకరికొకరు చెప్పుకుంటూ ఉండేవారు. పెట్టింది తినడం, ఏ గొడవలైనా, సమస్యలైనా సర్దుకుని పోవడం, చదువు , కాలేజీ.. ఇదే జీవితంలా ఉన్నారిద్దరు పిల్లలు.
పెద్దమ్మాయి జ్యోతికి ఒక ఆలోచన వచ్చింది. నేను బాగా చదువుకుని, పెద్ద ఉద్యోగంలో చేరి ఇక్కడున్న అమ్మాయిలకు సాయం చేయాలి. ఏదో చెప్పలేని ఆలోచన. అలా చేయాలి. ఇలా చేయాలి. ఇందులో నా స్వార్ధం తలెత్తకూడదు అని మనసు నిర్ధారణ చేసుకుంది. తర్వాత డిగ్రీలో చేరింది. కాలేజీ కెళ్లడానికి సరైన బట్టలు లేవు. అప్పుడు , ఇప్పుడు కూడా కాలేజీల్లో డబ్బున్నవాళ్ల నడవడిక, డబ్బుతో వచ్చే అహంకారాలే వేరుగా ఉంటాయి. అవన్నీ తట్టుకున్న పిల్లలు ఎన్నో కష్టాలను, అవమానాలను దిగ్రమ్రింగుకుని చదువు మీదే ధ్యాస పెట్టేవారు. ఒకోసారి తట్టుకోలేక జ్యోతి దేవుని పటం ముందు కూర్చుని ఏడుస్తూ మమ్మల్ని పుట్టినప్పుడే చంపేసినా, మా అమ్మతో పాటు మమ్మల్ని తీసికెళ్లినా ఎంత బాగుండేది. మాకు శక్తినివ్వు తండ్రీ అని ప్రార్ధించేది. వాళ్ల బాధ చెప్పుకోవడానికి ఆ దేవుడు తప్ప ఇంకెవరూ లేరు మరి.
జ్యోతి అష్టకష్టాలు పడి డిగ్రీ చదువు పూర్తి చేసింది. ఇంక పైకి చదవదలచుకోలేదు. తను పెరిగిన అనాధ శరణాలయం కోసమే తన జీవితాన్ని అంకితం చేయాలని అనుకుంది. వార్డెన్ మేడంతో మాట్లాడింది. ఆవిడ కూడా సరే చూస్తూ ఉండు. నాకు కాస్త రెస్ట్ దొరుకుతుంది అని ఒప్పుకుంది. చెల్లెలు స్వాతిని ఇంజనీరింగులో చేర్పించి తను మాత్రం 24 గంటలు అనాధ శరణాలయం గురించే ఆలోచించేది, పని చేసేది.
ఒకరోజు వార్డెన్ మేడం జ్యోతిని పిలిచి చూడమ్మా చదువుకునే సమయంలోనే చదువుకుంటే మంచిది. తర్వాత చదవలేవు. ఏమో అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో. చదువు ఆపకు. ఇంకొంచం కష్టపడి నీ చదువు పూర్తి చేయి తర్వాత నీ ఇష్టం అని చెప్పింది. దాని గురించి ఆలోచించిన జ్యోతి సివిల్స్ కి ప్రిపేర్ అయి ఐ.పి.ఎస్ కి సెలెక్ట్ అయింది. అందరూ చాలా సంతోషపడ్డారు. చిన్నమ్మాయి స్వాతి కూడా అక్కలాగే చాలా కష్టపడుతుంది. అక్కలాగే బాగా చదువుకోసాగింది. ముందులా కాకుండా ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. చదువు మీద ఏకాగ్రత, శ్రద్ధ ఉన్నాయి. ఫ్రెండ్స్ అంటూ సమయం వృధా చేసేది కాదు. మనం ఎలా పెరిగాము, మనకు మన జీవితమే నేర్పిన పెద్ద పాఠం. పైకి రావాలన్న తపన ఉంటే ఎవరూ అడ్డగించలేరు. అది తప్పకుండా విజయాలను అందిస్తుంది అనుకున్నారిద్దరూ.
స్వాతి ఇంజనీరింగు మంచి మార్కులతో పూర్తి చేసింది. అక్కను మించిన చెల్లెలుగా పేరు తెచ్చుకుంది. జ్యోతి మంచి ఉద్యోగంలో చేరిపోయింది. స్వాతికి కూడా క్యాంపస్ సెలెక్షన్లో పెద్ద ఉద్యోగం వచ్చింది. ఎన్ని కష్టాలు పడినా పట్టుదల, కసితో వాళ్లకు వాళ్లే తమ జీవితాన్ని చక్కదిద్దుకున్నారు. ఉన్నత శిఖరాలను చేరుకున్నారు. ఇక మీ ఇద్దరికి పెళ్లి చేయాలి . అబ్బాయిలను చూడనా అంటూ నవ్వుతూ అంది వార్డెన్ మేడం.

1 thought on “జీవితమే ఒక పెద్ద పోరాటం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *