March 28, 2023

మాయానగరం 46

రచన: భువనచంద్ర

రెండు శవాలు. ఒకటి చాకు గుండెల్లో సూటిగా గుచ్చుకుపోగా చచ్చిపోయిన మహాదేవన్‌ది. రెండోది త్రాచుపాము కాటుతో చనిపోయిన పరమశివానిది. చాకుమీద వేలిముద్రలు పరమశివానివని రుజువు కావాలి. త్రాచుపాము కోరల గుర్తులు రుజువయ్యాయి. కోరల గుర్తులే కాదు నల్లగా విషంతో మాడిన శరీరమూ, నోటి నుండి నురగ.
మౌనదేవతలా నిల్చుంది నందిని. ఎంతమంది కూర్చోమన్నా కూర్చోలేదు. తెల్లార్లూ నిలబడే వుంది. నిలబడే ఓపిక లేక కూర్చుండిపోయాడు వెంకటస్వామి. అతని కళ్ళల్లో నీరు ఇంకిపోయింది. పోలీస్ స్టేషన్ పట్టపగల్లా వుంది.
“ముందు శవాల సంగతి చూడండి..” ఇన్‌స్పెక్టర్‌తో రిక్వెస్టింగ్‌గా అన్నాడు సర్వనామం. అతను వచ్చి ఓ అయిదు నిమిషాలయింది.
“మీరెవరూ?” కూల్‌గా అడిగాడు ఇన్‌స్పెక్టర్ సుభానీ. “సర్.. నేను శామ్యూల్‌గారి దగ్గర పని చేస్తూ వుంటాను. చాలాసార్లు మహాదేవన్‌గారి హోటల్లోనే భోంచేశాను. ఆయన చాలా సత్పురుషుడు. పరమశివం మెంటాలిటీ గురించి చెప్పింది కూడా ఆయనే. మరోవారంలో కేరళ వెళ్ళిపోతున్నాననీ, బిడ్డ పెళ్లి చేస్తాననీ కూడా చెప్పారు. పరమశివం గురించి పోలీస్ రిపోర్టు ఇస్తానని నేను చెప్పినా, మహాదేవన్‌గారు వాడి పాపాన వాడ్ని పోనివ్వండి. సొంత చుట్టాన్ని పోలీసులకి వప్పగించే పాపం నేనెందుకు చెయ్యాలి” అన్నారు. సార్ వీడు పరమదుర్మార్గుడు. తండ్రి కళ్లముందు చస్తున్నా గుక్కెడు నీళ్లని పొయ్యకుండా మాటల శూలాలు గుచ్చి ఆనందించిన పరమక్రూరుడు. వీడి చరిత్ర అంతా వాడి పెట్టెలోనే వుందని మహాదేవన్‌గారు చెప్పారు. దేవుడు లేడని అనుమానిస్తాం గానీ, ఖచ్చితంగా వున్నాడు. వీడు పాముకాటుకు గురై చావడమే అందుకు రుజువు. ఆ పుణ్యాత్ముడి శరీరం మాత్రం నిర్లక్ష్యానికి గురికాకూడదు” వినయంగా సుభానీతో అన్నాడు సర్వనామం.
తల పంకించాడు సుభానీ. అతనికొకటి అర్ధమయింది. బయటికి చెప్పినదానికంటే సర్వనామానికి చాలా చాలా తెలుసని. ఇంకోటి కూడా అర్ధమయింది. అతను విప్పదల్చుకుంటే తప్ప అతని నోరు ఎవరూ విప్పించలేరనీ. తండ్రి తలకి తానే ‘కొరివి’ పెడతానని పట్టుబట్టింది నందిని. తనని దూరంగా పంపే ఏర్పాట్లు తండ్రి చేసి వుంటాడని ఆమెకి అర్ధమయింది.
లోకంలో ఓ చిత్రముంది. అన్నెంపున్నెం ఎరుగని అమాయకులు కూడా చిన్న దెబ్బ తగిలితే లోకరీతిని అర్ధం చేసుకోగలిగేంత ఎదుగుతారు క్షణాల్లో. ఒక్కోసారి సర్వం తెలిసినవాళ్లు కూడా ఒక్క దెబ్బకి కుప్పకూలిపోతారు. ఇప్పుడు నందిని కళ్లల్లోనూ, మాటల్లోనూ, చేతల్లోనూ కూడా అమాయకత్వం లేదు.
“నీ ఆలోచన ఏమిటమ్మా” ఒంటరిగా కలిసి అడిగాడు సర్వనామం. అతని వంక ఓ చూపు చూసింది. ఆ చూపులో “నిన్నెలా నమ్మగలనూ? అసలు నువ్వెవరివీ?” అనే ప్రశ్నలు కనబడ్డాయి సర్వనామానికి. చిన్నగా నవ్వాడు.
“నాకు అర్ధమైంది తల్లీ. నేనెవరనేది నీ ప్రశ్న. అసలు ఎందుకు కల్పించుకుంటున్నానానేది మరో ప్రశ్న. సరే . మీ తండ్రిగారు గతించి నేటికి పదోరోజు. నువ్వు అన్నట్టుగా తెలుగువారి సాంప్రదాయం ప్రకారమే కర్మ జరిపిస్తున్నాను. ధర్మోదకాలు అయ్యాయి. మరో రెండు రోజుల్లో 12వరోజు పెద్ద కర్మ కూడా పూర్తవుతుంది. గత తొమ్మిది రోజులనుండి నేను చాలా పనులు చేశాను. అందులో ముఖ్యమైనవి ఏమంటే మీ నాన్నగారి అభిమతం ప్రకారం నిన్ను కేరళకి మీ నాన్నగారి స్నేహితుడి ఇంటికి క్షేమంగా పంపే ఏర్పాట్లు చెయ్యడం. ఆ ఏర్పాట్లు చూసే సందర్భంలో తెలిసింది, మీ నాన్నగారి స్నేహితుడు పరమపదించాడనీ, అతని బంధువులు మంచివారు కారనీ. మీ నాన్నగారికి వెంకటస్వామి కేవలం నీ ఆస్తి కోసమే నిన్ను వలలో వేసుకుంటున్నాడనే నమ్మకం. అది ముమ్మాటికీ నిజమే. అర్జంటుగా రాత్రికి రాత్రి ‘రిచ్’ అయిపోవాలమనే దురాశ, పేరాశ అతనివి. అలా ఆశపడడం తప్పే అయినా, అదేమీ అసాధారణమేమీ కాదు. వెంకటస్వామి దురాశాపరుడేగాక దుర్మార్గుడు కాదు. మొదట్లో అతని మనసులో ఏమున్నా, మీ నాన్న గతించిన క్షణం నించీ అతనిలో చాలా పరివర్తన వచ్చింది. నీకు నిజం చెబుతా విను.

1 thought on “మాయానగరం 46

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

May 2018
M T W T F S S
« Apr   Jul »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031