March 28, 2024

శ్రమజీవన సౌందర్యం

రచన: మణికుమారి గోవిందరాజుల

“ప్రతి ఒక్కళ్ళూ కూడా తమ స్వార్ధం తాము చూసుకోకుండా కాస్త అందరికీ సహాయపడటం అలవాటు చేసుకోవాలి. ఒక వెయ్యి సంపాయించామంటే కనీసం ఒక్క రూపాయన్న యెవరి సహాయనికైనా ఇవ్వగలగాలి. యెన్నాళ్ళుంటామో తెలియని ఈ జీవితంలో మనం పోయాక కూడా మనల్ని జీవింపచేసేది అలా చేసిన సాయమే. సహాయం పొందిన వాళ్ళు మనని తల్చుకుంటే వాళ్ళ మనసుల్లో మనం జీవించి వున్నట్లే కదా?అదన్నమాట. నా వరకు నేనైతే యెవరికే సహాయం కావాలన్నా ముందుంటాను. అలా అని డప్పు కొట్టుకుంటున్నా అనుకునేరు. నాకు అస్సలు ప్రచారం ఇష్టం వుండదు. నేను నా ప్రతి పుట్టిన రోజుకు తప్పని సరిగా అన్నదానం చేస్తాను. యెప్పుడన్నా చెప్పానూ నీకు?అంతెందుకు?మొన్నటికి మొన్న పక్కవూరి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు వర్షాకాలం వస్తున్నదని గొడుగులు రెయిన్ కోట్లు పంచి వచ్చాను. నీతో చెప్పానూ నేను. ?చెప్పా కదా నా కసలు ప్రచారం ఇష్టం వుండదని?” శాంతకుమార్ వాక్ప్రవాహం అలా సాగిపోతూనే వుంది.
వింటున్న కృష్ణమోహన్ ప్రణతిలకు చాలా బోరింగ్ గా వుంది. కాని ఇంటికొచ్చిన వాడిని నొప్పించడం ఇష్టం లేక మొహం మీద నవ్వు పులుముకుని వింటున్నారు. వీళ్ళు వింటున్నారు కదా అని శాంతకుమార్ విజృంభిస్తున్నాడు. అదే సమయంలో దేవుడిలా వచ్చాడు పాలవాడు బిల్లుకోసం.”హమ్మయ్య”అనుకుని లేచి వెళ్ళిపోయింది ప్రణతి
“ఇప్పుడే వస్తాను” తను కూడా యేదో పనున్నట్లుగా వెళ్ళాడు వెనకే వెళ్ళాడు కృష్ణమోహన్.
శాంతకుమార్ మనిషి మంచివాడే కాని ఒకటి చేస్తే పది చెప్పుకునే రకం. వీళ్ళ ఫ్లాట్స్ లోకి కొత్తగా వచ్చి వీళ్ళకు తగులుకున్నాడు. యెవరినీ నొప్పించలేని ఆ దంపతులు అతన్ని యెవాయిడ్ చేయలేకపోతున్నారు.
“మీతో ఒక విషయం చెప్పడానికే వచ్చాను. తొందరేమీ లేదు.”టీ పాయ్ మీద వున్న పేపర్ అందుకుంటూ చెప్పాడు శాంతకుమార్.
“హతోస్మి అనుకుని పాలవాణ్ణి పంపించి శాంతకుమార్ కి మళ్ళీ కాఫీ కలుపుకుని వచ్చింది ప్రణతి.
“యెంతైనా నీ కాఫీ తర్వాతే యెవరి కాఫీ అయినా . అధ్భుతహః” కాఫీని యెంజాయ్ చేస్తూ చెప్పసాగాడు.
“సంగతేంటంటే మొన్నటి వర్షాలకు వరంగల్ జిల్లాలోని ఒక కుగ్రామంలో రైతులకు తీవ్ర పంట నష్టం జరిగింది. చాలామంది రోజూ ఆహారం కోసం కూడా కష్ట పడుతున్నారు. పూరిళ్ళు కూడా చాలా వరకు కూలిపోయాయట. మీకు తెలుసు కదా యెవరికైన యేదైనా అవసరం అంటే నేను ముందుంటానని?(బాబోయ్! మళ్ళీ మొదలు పెట్టాడు”మనసులో భయపడ్డారు ఇద్దరూ)అయితే ఇది ఒక్కరి వల్ల అయ్యేది కాదు. అందుకని నేను కూడా ఒక ఆర్గనైజేషన్ తరపున వర్క్ చేస్తున్నాను. అందులో భాగంగా నా వంతుగా కొంత సొమ్ము కలెక్ట్ చేసి పంపాలి అని నిర్ణయించారు. మీరు కూడా మీ కంట్రిబ్యూషన్ ఇస్తే చాలా సంతోషిస్తాను. బహు సంతాన కుటుంబీకులు మీరు. మిమ్మల్ని అడగటం భావ్యం కాదని తెలిసినా మళ్ళీ చెప్పలేదంటారేమోనని చెప్తున్నాను. మీరు యెక్కువగా యేమీ ఇవ్వల్సిన పని లేదు. యెంత ఇచ్చినా పర్లేదు.”వుదారత చూపాడు
“యే వూరు?” అడిగాడు కృష్ణమోహన్.
చెప్పాడు శాంతకుమార్.
ఆశ్చర్యపోయాడు కృష్ణమోహన్ ఆ వూరి పేరు వినగానే.
“ఆ వూరా?అక్కడ అంత ఇబ్బందులేమీ వున్నట్లు లేవే?”
“మీకు ఇల్లు ఆఫీస్ తప్ప యేమీ పట్టదాయే. మీకెలా తెలుస్తుంది?”
“మీరెళ్ళి చూసారా?”
“నేనూ వెళ్ళలేదు. కాని నాకు అన్ని వేపులనుండి సమాచారం అందుతుంది. ఒక్కసారే వాళ్ళకు సహాయం చేయగలిగినప్పుడే వెళ్తే బాగుంటుంది కదా అని ముందు కలెక్షన్స్ మొదలుపెట్టాను. యేదైనా చెప్పడం కంటే చేయడం మంచిది కదా?నేనసలే చేతల మనిషిని.”అతిశయంగా అన్నాడు శాంతకుమార్.
మౌనంగా లోపలకు వెళ్ళి వెయ్యి రూపాయలు తెచ్చిచ్చాడు మోహన్.
“మోహన్ వెయ్యి అవసరం లేదు. మళ్ళీ ఇబ్బంది పడతావు. అయిదువందలు చాలు.”
“ పర్లేదులే. వుండనివ్వు.”అన్యమనస్కంగా చెప్పాడు మోహన్.
“సరే మరి వస్తాను. ఒకటి రెండు రోజుల్లో ఇది ముగించుకుని వీలైనంత తొందరలో అక్కడికి వెళ్తాను. వస్తానంటే నిన్ను కూడా తీసుకెళ్తాను.”
“సరే!” తల వూపాడు మోహన్.
*****************************
కృష్ణమోహన్ ప్రణతిలది అన్యోన్య దాంపత్యం. ఆ ఫ్లాట్స్ లో గత రెండు సంవత్సరాలుగా వుంటున్నారు. ఘట్కేసర్ దగ్గరలో ఇండిపెండెంట్ ఇల్లు తయారవుతున్నది. ఇప్పుడున్న వాళ్ళ ఇల్లు మధ్య తరగతి ఇల్లులా వుంటుంది. కానీ ఇంట్లోకి ప్రవేశిస్తూనే ఒక రకమైన ప్రశాంతత ఆవరించి దేవాలయంలోకి వచ్చామా అన్న భావన కలుగుతుంది ప్రతి ఒక్కరికి. పిల్లలు కూడా అందరూ బుద్దిమంతులు. ఈ రోజుల్లో వుండే వెర్రి వేషాలు యెవరిలోనూ కనపడవు. కానీ చదువులో మటుకు ముందుంటారు. వాళ్ళ ఇంట్లో యెప్పుడూ కూడా తలి దండ్రులకు పిల్లలకు మధ్య ఒక ఆహ్లాదకర వాతావరణం నెలకొని వుంటుంది. ఇద్దరు కలిసి ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ రన్ చేస్తున్నారు. ఇద్దరూ యెంత బిజీగా వున్నా పిల్లలతో గడపటానికి యే బిజీ అడ్డు రాదు. చక్కటి క్వాలిటీ టైం గడుపుతారు పిల్లలతో. అంత కంపెనీ వున్నా పిల్లలు యెక్కువ కాబట్టి సాధారణ జీవితం గడుపుతున్నాడని అందరూ అనుకుంటారు. అందుకే అతనికి ఇంకో పేరుంది కుటుంబరావు అని. ఈ రోజుల్లో కూడా అయిదుగురు పిల్లల్ని అదీ ఆడపిల్లల్ని కంటారా యెవరన్నా అని అందరూ ఆశ్చర్యపోతుంటారు వాళ్ళను చూసి. యెవరేమన్నా ఆ దంపతులు పట్టించుకోరు మా పిల్లలే మా సౌభాగ్యం అనుకుంటారు.
**************************
శాంతకుమార్ వెళ్ళిపోయాక కొంతతడవు ఆలోచిస్తూ వుండిపోయాడు కృష్ణమోహన్. తరువాత యేదో నిశ్చయానికి వచ్చినట్లుగా”ప్రణతీ ! వూరెళ్దాం వస్తావా?”అడిగాడు వంటింటి దగ్గరగా వెళ్ళి.
“అర్జెంటుగా ఇప్పుడేమిటి?”ఆశ్చర్యపోయింది ప్రణతి.
“ఒకసారి వెళ్ళి చూడాలనిపిస్తున్నది . యేమంటావ్?”
“ఒక్క అరగంట టైం ఇవ్వు మోహన్ . వంట చెసిపెట్టేసి వస్తాను. పిల్లలు ఆకలికి ఆగలేరు.”
“సరే” అని చెప్పి హాల్లోకి వెళ్ళిపోయాడు మోహన్
అన్నట్లుగానే అరగంటలో టేబుల్ మీద అన్నీ సర్దేసి డ్రెస్ మార్చుకుని వచ్చింది ప్రణతి.
“మనీషా! మేము రాత్రికల్లా వచ్చేస్తాము. జాగ్రత్త. తలుపులేసుకుని ఇంట్లోనే వుండండి.”చెప్పి బయలుదేరారు ఇద్దరూ.
***********************
కారు వూళ్ళో ప్రవేశించగానే దిగి ఆ మట్టిని తాకి పరవశించిపోయాడు.
వుద్యోగరీత్యా హైదరాబాదులో వున్నా అతని మసెప్పుడూ ఆ వూరి చుట్టూతానే తిరుగుతూ వుంటుంది. జననీ జన్మభూమి కదా. .
వస్తూనే మొదలు ఆ వూరికి పెద్దదిక్కుగ వున్న కృష్ణమోహన్ బాబాయి శంకరయ్య దగ్గరికి వెళ్ళారు ఇద్దరూ. దారిపొడుగూతా వీళ్ళ కారును చూసి గుర్తుపట్టి అందరూ నమస్కారాలు చేసి పలకరిస్తూనే వున్నారు.
“అయ్యో! నాకు కబురన్నా చేయలేదేమిటి?”వీళ్లను చూస్తూనే యెదురొస్తూ అడిగాడు శంకరయ్య.
“ అందరినీ ఒకసారి చూడాలనిపించింది. అప్పటికప్పుడు అనుకుని వచ్చేసాం బాబాయ్! ముందు చెప్తే ఇంకేమన్నా వుందా?”నవ్వుతూ కుర్చీలో కూర్చుంటూ అన్నాడు.
“యేదో వాళ్ళ అభిమానం లేరా? వద్దనకూడదు మరి.”
అప్పటికే శంకరయ్యతో మాట్లాడడానికి వచ్చి అక్కడ కూర్చున్న వారందరూ కూడా వీరిని చూసి వినయంగా లేచి నిలబడ్డారు.
“బాబాయ్! గ్రామంలో పరిస్థితి యెలా వుంది?మొన్నటి వర్షాలకు యెవరన్నా ఇబ్బంది పడ్డారా?ఒక వేళ అలాంటి పరిస్థితే వుంటే నాకెందుకు తెలియ చేయలేదు?మన ట్రస్ట్ లో ఫండ్స్ తక్కువయ్యాయా?”ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించాడు కృష్ణమోహన్.
“అరే ! వుండరా బాబు. ఇప్పుడే వర్షాలు తగ్గాయనుకుంటే నువ్వలా ప్రశ్నల వర్షం కురిపిస్తే యెలా?నువ్వెందుకు అడుగుతున్నావో కాని, ఇక్కడ అందరూ బాగున్నారు. మొన్నటి వర్షాలకు కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే అయినా వీళ్ళు వీళ్ళే సర్దుబాటు చేసుకుని విషయాన్ని నీ దాకా రానివ్వద్దన్నారు. రోడ్లు కొంత పాడైనా యువకులు కొంతమంది స్వచ్ఛందంగా బాగుచేసుకున్నారు. అయినా ప్రతి గ్రామానికి నీలాంటి వాడొక్కడుంటే చాలు రాష్ట్రం అన్నపూర్ణ పేరును సొంతం చేసుకుంటుంది.”
పరిస్తితి తాను విన్నట్లుగా లేనందుకు మనసులోని కలత తీరింది.”ఒక్కసారి అందరినీ కలిసి మేము బయలుదేరుతాము.”
“భోజనాల వేళ. స్వయంగా ఆది దంపతులే మా ఇంటికి వచ్చారు మరి . యెలా వదుల్తాము? యేమోయ్. . వడ్డించు మరి”లోపలికి చూస్తూ కేకేసాడు
***********************************************************************************
వూళ్ళో అందరినీ పలకరించుకుంటూ నెమ్మదిగా వెళ్ళసాగారు ఇద్దరూ. ఆ వూరిని చూస్తున్న కొద్దీ మనసంతా తృప్తితో నిండి పోతున్నది. పరిశుభ్రమైన రోడ్లు. యెక్కడా కూడా మురికి అన్నదే కనపడటం లేదు. ఓపెన్ డ్రైనేజ్ సిస్టం ఐనా చక్కగా పారేలా చేసిన యేర్పాట్లు. పిల్లలు ఆడుకోవడానికి అక్కడక్కడ చిన్న చిన్న పార్కులు. రోడ్డుకు ఇరువైపులా పెద్ద పెద్ద వృక్షాలు చల్లటి నీడనిస్తున్నవి. చిన్నప్పుడు చదివిన చందమామ కథలోని వూరిలా వుంది. అలా నడుస్తూ అందరినీ పలకరించుకుంటూ కాలనీకి చేరారు ఇద్దరూ.
కాలనీ మొదట్లోనె ఆర్చీ మీద రాసిన”శ్రమ జీవన సౌందర్యానికి స్వాగతం” అన్న అక్షరాలు సాదరంగా ఆహ్వానిస్తున్నాయి. వీరిని చూస్తూనే అందరూ తమ తమ పనులను ఆపేసి ఆనందంతో యెదురు వచ్చారు. వాళ్ళ పనులకు ఆటంకం కలిగించకూడదనుకుని అక్కడి నుండి వెంటనే తిరుగు ప్రయాణమయ్యారు. కృష్ణమోహన్ కి ఆ వూరిని చూసిన ప్రతిసారీ తన అన్ని సంవత్సరాల శ్రమఫలితం పుష్పించి విరగబూసి సుగంధాలు వెదజల్లుతున్నట్లుగా వుంటుంది.
నెలరోజులు గడిచిపోయాయి. మధ్య మధ్య వచ్చి వెళుతూనే వున్నాడు శాంతకుమార్. కానీ వూరెళ్ళే విషయం యేమీ యెత్తటం లేదు. అతన్ని టీజ్ చేయటానికి యెప్పుడెళ్దాం అంటున్నాడు కృష్ణమోహన్. యేదో చెప్పి తప్పించుకుంటున్నాడు శాంతకుమార్.
ఆరోజు ఆదివారం . యెప్పటిలాగే వచ్చి కాఫీ తాగుతూ ఛానెల్స్ మారుస్తున్నాడు శాంతకుమార్. సడన్ గా ఒక ఛానెల్లో మోహన్ ఫొటొ ప్రత్యక్షమైంది.”యేయ్! మోహన్! ఇదేంటి నీ ఫొటో టీవీలో వస్తున్నది చూద్దువు గాని రా”అని అప్పుడే లోపలికి వెళ్ళిన మోహన్ని కేకేసాడు. అదివిని పిల్లలు ప్రణతి అందరూ హాల్లోకి వచ్చారు. స్క్రీన్ మీద”శ్రమ జీవన సౌందర్యానికి స్వాగతం” అని రాసి వున్న ఆర్చ్ కనబడుతున్నది. చిన్నగా కాలనీ లోకి వెళుతున్నది కెమేరా.
“మా ఛానెల్ వాళ్ళం ఒక కొత్త వొరవడికి శ్రీకారం చుడుతూ ప్రజలకోసం శ్రమించి ప్రజల హృదయాల్లో నివాసం యేర్పరుచుకున్న వ్యక్తికి అవార్డ్ ఇవ్వదలిచాము. అందులో భాగంగా గత కొంత కాలంగా మా విలేకరి ఈ ప్రాంతాల్లో పర్యటించి తెలుసుకున్న వివరాల ప్రకారం ఇక్కడ అందరూ ముక్తకంఠంతో చెబుతున్న ఒకే ఒక్క పేరు కృష్ణమోహన్. ఈ కాలనీ ఇంత ఆరోగ్యంగా ఆనందంగా కళకళ్ళాడుతూ వుండడానికి, తాము పిల్లా పాపల్తో సుఖంగా వుండడానికి కృష్ణమోహన్ సారే కారణమని వారందరూ చెబుతున్నారు. ఈ కాలనీయే కాదు ఈ వూరి మొత్తాన్ని పరిశీలిస్తే మనం యే విదేశాల్లోనో వున్న అనుభూతి కలుగుతుంది. అంత సిస్టమేటిక్ గా అంత హాయిగా వున్నదీ గ్రామం. ఇంతకీ ఈ కృష్ణమోహన్ అన్న వ్యక్తి యెవరసలు?వివరాల్లోకి వెళితే…”చెప్పుకుంటూ పోతున్నది మైక్ పట్టుకున్న అమ్మాయి. చిన్నగా తల పక్కకి తిప్పి చూసాడు శాంతకుమార్. తలిదండ్రులిద్దర్నీ కావిటేసుకున్నట్లుగా పట్టుకుని వారిని కమ్ముకుని కూర్చున్నారు పిల్లలు. అందరి మొహాలు ప్రశాంతతతో వెలిగిపోతున్నాయి. తమ ఇల్లు గుర్తొచ్చింది. పొద్దున్న లేస్తూనే అరుపులు కేకలతో మొదలవుతుంది.
“ఇది అంతా ఒక్కరోజు కృషి కాదనీ తామందరినీ ఈ విధంగా తీర్చి దిద్దటానికి ఆయన చాలా శ్రమపడ్డారని, మొదట్లో తామసలు ఆయన మాట వినేవారం కాదనీ, బతిమాలి బెదిరించీ, అన్నపానాలు మానేసి తనమాట వినేట్లు చేసుకున్నారనీ వారు చెబుతున్నారు.
మొదటి నుండీ తమది చెప్పులు కుట్టే వృత్తి కాబట్టి తమచేత చెప్పుల పరిశ్రమ ఓపెన్ చేయించారని, తమ ఆడవారి చేత చిన్న చిన్న వస్తువులు తయారు చేయించి వాటిని మార్కెటింగ్ చేయించే మెళకువలు నేర్పించారని అన్నిటికంటే ముఖ్యంగా వంద శాతం అక్షరాస్యత తమ సొంతమని వారు గర్వంగా చెబుతున్నారు. మమ్మల్ని ఇంత తీర్చి దిద్దిన సారు మా వాడని చెప్పుకోవడాని మేము గర్విస్తున్నామని వారు చెప్పారు. గోరంత చేసి కొండంత చెప్పుకునే ఈ కాలంలో కొండంత చేసినా కూడా గోరంత చెప్పుకోవడానికి ఇష్టపడని వారున్నారంటే నమ్మలేము. కాని నమ్మక తప్పదు. మా ఛానెల్ నుండి ప్రప్రధమంగా “వుత్తమపౌరుడు” అవార్డుకి మిష్టర్ కృష్ణమోహన్ పేరు ప్రకటించటాన్ని మేమందరమూ యెంతో హర్షిస్తున్నాము.” మాట్లాడుకుంటూ పోతున్నది ఆ అమ్మయి.
ఆ మాటలు తనకు గుచ్చుకున్నట్లుగా అయ్యాయి శాంతకుమార్ కి.”యేంటి మోహన్ ఇదంతా?” మూగవోయిన గొంతు పెకలించుకుని అడగ్గలిగాడు. మోహన్ యేదో చెప్పబోయే లోగానె
ఆ వార్త చూసినట్లున్నారు ఫ్లాట్స్ లోని వాళ్ళంతా బిల బిల మంటూ వచ్చేసారు అభినందనలు తెలుపుతూ.
అందరూ కూడా పట్టు బట్టారు ఆ వూరి విశేషాలు చెప్పాలనీ, అక్కడికి తీసుకెళ్ళాలనీ.
“సరే లంచ్ అయ్యాక బయల్దేరుదాము. ఒక్కమాట చాలా మందికి కార్లున్నాయి కాబట్టి అందరూ కార్లు తీయండి. పట్టినంతవరకు వెళ్ళిపోదాం”చెప్పాడు కృష్ణమోహన్. సంతోషంగా వొప్పుకున్నారు అందరూ.
*********************************************************************************
వాహనాలన్నీ స్పీడ్ గా ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ఆగాయి. అప్పటికే విషయం తెల్సిన కాలనీ వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ రాత్రి భొజనాల యేర్పాట్లు చేసి వుంచారు. రాత్రి యెనిమిది గంటలయింది. వెన్నెల పుచ్చపువ్వులా విరగబూస్తున్నది. అందరికీ కాలనీలో వున్న ఖాళీ స్థలంలో మంచాలు, కుర్చీలు, చాపలుయెలా వీలైతే అలా వేసి వుంచారు. అక్కడ చేస్తున్న మూన్ లయిట్ డిన్నర్ అందరికీ యెంతో నచ్చింది. ఒకళ్ళిద్దరు టీవీ ఛానెళ్ళ వాళ్ళు కూడా వచ్చారు.
“వూరు యెంతో అందంగా వుంది. ఇదంతా చేయటానికి మీరు పడ్డ శ్రమ, వేసిన పథకాలు చెప్పండి” అందరూ కృష్ణమోహన్ని డిమాండ్ చేసారు.
“చెప్పటానికి యేమీ లేదు. నాకు చిన్నతనం నుండీ కూడా ఈ ఆర్ధిక అసమానతలు అర్థమయ్యేవి కాదు. యెందుకిలా అనుకునేవాణ్ణి. అందుకే నాకు చేతనైంది చేశాను. అయితే ఒక్కటి. యెవరికైనా ఒకరోజు అన్నం పెడితే సరిపోదు. ఆ అన్నం సంపాయించుకునే మార్గం తెలియచేయాలి అనేదాన్ని నేను నమ్ముతాను. అదే వీరందరూ కూడా నేర్చుకున్నారు.” సింపుల్ గా తేల్చేసాడు.
అందరూ డిసప్పాయింట్ అయ్యారు. ఇంతలో కాలనీ వాసుల్లోని ఒక పెద్దాయన లేచి”మా శంకరయ్య సార్ ని చెప్పమనండి. మీకు అన్నీ సక్కంగ తెలుస్తాయి” అని చెప్పాడు.
అందరూ శంకరయ్యను చుట్టుముట్టారు.
“మాకు యెన్ని సార్లు చెప్పుకున్నా తనివి తీరదు. అవడానికి కృష్ణమోహన్ మా అన్నకొడుకే అయినా నాకు గురువుగారు. ఇప్పుడు మనం వున్న ఈ ప్రదేశమంతా వీరి పూర్వీకులదే. ఒట్టి బంజరు భూమి. చిన్నతనంలో వీరందరితో తిరుగుతున్నారని వీరి తల్లితండ్రులు కృష్ణమోహన్ ని చదువులకు విదేశాలకు పంపేసారు. కాని యెప్పుడు సెలవులకు ఇంటికొచ్చినా వూరంతా చుట్టొస్తుండేవారు. ఆ తర్వాత చదువు పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్న మోహన్ కి ఇక్కడి పరిస్తితులు చాలా బాధ కలిగించాయి.”
అక్కడినుండి శంకరయ్య చెబుతున్నట్లుగా కాకుండా గతంలోకి వెళ్ళి తాము చూస్తున్నట్లుగా అనుభూతి చెందసాగారు శ్రోతలు.
“వూళ్ళో వున్న పరిస్తితులు చూసి నాకెందుకు అనుకోలేకపోయాడు కృష్ణమోహన్. అదే సమయంలో వూళ్ళో స్థలాలను ఆక్రమించారని కింద తరగతి వాళ్ళని వెళ్ళగొట్టారు వూళ్ళోని పెద్దవాళ్ళు. తండ్రితో పోట్లాడి బంజరు భూమిలో వాళ్ళకు నివాసాలు యేర్పాటు చేసాడు. కాని ఒకసారి వెళ్ళి చూసేసరికి అపరిశుభ్రత ఆకలి వాళ్ళను ఆక్రమించుకుని వున్నాయి. ఇంట్లో వున్న వెండి బంగారాలు అమ్మి వాళ్ళ ఆకలి తాత్కాలికంగా తీర్చినా ఇలా యెన్నాళ్ళు అన్న ప్రశ్న అతన్ని వేధించసాగింది. ఒక రోజు అందర్నీ కూర్చో బెట్టుకుని చెప్పాడు
“మీ అందరినీ నేనొక్కడిని యెంతోకాలం పోషించలేను. కాని మీ అంతట మీరు హాయిగా బ్రతికే యేర్పాటు నేను చేస్తాను. అందుకు మీరు మీకు సహకరించుకోవాలి. ఒక ఆరునెలలు చూస్తాను. యెంతో కొంత ప్రగతి కనపడాలి. లేదంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను”బెదిరించాడు.
కాని నిరక్షరాస్యత, బద్దకం, సోమరితనం ఆక్రమించుకుని వున్న వాళ్ళు తిండికి వచ్చేవాళ్ళు కాని పనికి పారిపోయేవాళ్ళు. బెత్తం పట్టుకుని వాళ్ళ వెనకాల పడి వాళ్ళను ఒక దారిలో పెట్టడానికి చాలాకాలం పట్టింది. ఒకసారి మాటవినడం మొదలయ్యాక ఇక వెనక్కి చూసుకోలేదు. వీరందరూ కూడా తమకోసం సారు పడుతున్న శ్రమను గుర్తించారు. ఆయన వెళ్ళిపోతే ఇక తమ గురించి పట్టించుకునే వారు వుండరన్న సత్యం గ్రహించారు. ప్రతి వాళ్ళలోను యేదో ఒక ప్రతిభ దాగి వుంటుంది. తమలోని ఆ ప్రతిభను వారు గుర్తించేట్లుగా చేసాడు మోహన్. తర్వాత మోహన్ గ్రామంలోని యువకులను కూడగట్టుకుని పరిసరాల పరిశుభ్రత, చెట్లు నాటడం మీద అవగాహన కల్పించాడు. చిన్నపిల్లలకు చదువు నేర్పే బాధ్యత ఆ యువకులకు అప్పగించాడు. మొదలు గ్రామం లోని పెద్దవాళ్ళు తమ పిల్లలను పాడు చేస్తున్నాడని ఆగ్రహించినా జరుగుతున్న అభివృద్దిని చూసి తాము కూడా గ్రామాభివృద్దిలో భాగస్వాములయ్యారు.
బంజరు భూమిలో పంటలు పండవు కాబట్టి చెప్పులు కుట్టే వాళ్ళందరినీ ఒక చోట చేర్చి ముడిసరుకుని వాళ్ళకు అందచేసి కుటీర పరిశ్రమలు పెట్టించి ఆదాయం యేర్పాటు చేసాడు. ప్రభుత్వం చుట్టూ కాళ్ళరిగేలా తిరిగి మంచినీటి పథకానికి శాశ్వత రూపకల్పన చేసాడు.”
“ ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా సులభంగా వున్నాయి. కాని యెన్ని నిద్రలేని రాత్రులు గడిపారో నాకు తెలుసు. వీరి దిగులుతోనే తలిదండ్రులు దాటిపోయారు. అప్పుడే ప్రణతి వీరి భావాల పట్ల ఆకర్శితురాలై కావాలని కోరి పెళ్ళి చేసుకుంది. తమకు పిల్లలు వద్దనుకుని రకరకాల ప్రమాదాల్లో అనాధలైన ఆ పిల్లలను దత్తత చేసుకున్నారు. ఒక్కొక్కళ్ళది ఒక్కో గాధ. దారానికి కట్టిన పూవుల వలె ఒక్క చోట చేరి దేవుని మెళ్ళోని మాలలయ్యారు. ఇప్పుడు ఇక్కడ వీరంతా స్వయం సమృద్దిని సాధించారు. అందుకే వారు ధైర్యంగా పిల్లల చదువులకోసం హైద్రాబాద్ వెళ్ళిపోయారు. అయినా కూడా వారి ఆదాయం లో ఇరవై శాతం ఇక్కడి ట్రస్ట్ కి పంపుతారు . మేమందరమూ కూడా మా ఆదాయం లోఇరవై శాతం ట్రస్ట్ కి ఇస్తాము. యే బ్యాంకుల నుండి మేము లోన్ తీసుకోము. యెవరికి పెట్టుబడి కావాల్సినా అందులోనుండి తీసుకుని మళ్ళీ తీర్చేయాలి. తెలుసా ఇప్పుడు మా వుత్పత్తులు మేము వేరే దేశాలకు యెగుమతి చేస్తున్నాము కూడా. ఇక గ్రామ పరిశుభ్రత గురించి చెప్పాలంటే దాని ఆవశ్యకతను గ్రామ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆచరిస్తున్నారు. ముఖ్యంగా శ్రమించడంలోనే అందం , ఆనందం వున్నదని మేము తెలుసుకున్నాము.”
ఒక మంచి సినిమా చూస్తున్నట్లుగా నిశ్శబ్దంగా వింటూ వుండి పోయారు అందరూ. చెప్పడం ఆపగానే కరతాళ ధ్వనులు మిన్ను ముట్టాయి.
“నన్ను క్షమించు మోహన్…నేను చెప్పేవాడిని అయితే నువు చేతల వాడివి”అభినందించాడు శాంతకుమార్ మోహన్ ని.
ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు మోహన్.
మనసంతా విశాలమవుతుండగా కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలని వువ్విళ్ళూరుతూ తిరుగు ప్రయాణం అయ్యారు అందరూ. .

*****

7 thoughts on “శ్రమజీవన సౌందర్యం

  1. సూపర్ కథల ఫ్లో ఆగకుండా ఆసక్తికరంగా ఉంది నిజ జీవితానికి దగ్గరగా ఉంది కథ చదువుతుంటే మనం కూడా మన గ్రామానికి ఎమన్నా చేయాలని అనిపిస్తోంది తప్పకుండ ప్లాన్ చేస్తాను .

    శ్రవణ్ కుమార్ పి
    ఈదుల పూసపల్లి గ్రామం

  2. Alaa gramaaniki okkallu vunte anni gramaalu santhosha aarogya aanandamgaa gadapochu prajalu.manchi bhavam vundi mee storylo.okkadu kaakunda andarini aa drustiki marlchatam ane sandesham bhagundi.

  3. Superb story. Kadha lo chusina pragati prastutam mana gramallo kuda kanapadutondi….nice msg mani.hatsoff for your writing skills.keep it up.very proud of you.

Leave a Reply to Swapna madhuri Cancel reply

Your email address will not be published. Required fields are marked *