రచన : శ్రీపాద
శకుంతలకు అన్నం సయించటం లేదు, కంటికి కునుకూ పట్టడం లేదు. కారణం ’అబ్బే ఏమీ లేదు ’ అన్నా ఆవిడకు తెలుసు ఏ మూలో ఉన్న దాని ఉనికి. అక్కడికీ ఆవిడకు పట్టు పరిశ్రమ అనేది బాగానే తెలుసు. ఎవరు ఏ కాస్త పనికి వస్తారనిపించినా అస్సలు వదలదు గాక వదలదు చీటికీ మాటీకీ చెట్టెక్కే భేతాళుడిని భుజాన వేసుకునే విక్రమార్కుడిలా.
అ”రామ సీత గొప్ప మనిషి ఎంత చక్కని కవిత్వం రాస్తుంది. ఎవరున్నారమ్మా మన ఆడ పీనుగుల్లో అంత కవిత్వం రాసే వాళ్ళు” అన్న నోటితోనే,
“వెధవ పీనుగ ఏం రాస్తుంది? దాని బొంద ఒక్క ముక్కా అర్ధం అయి చావదు. ఆ రోజుల్లో నేను రాసిన ప్రతి కవితా ఎంత గొప్పగా ఉండేవి.
రాస్తూనే ఉంటాను మళ్ళీ మళ్ళీ
రాస్తూనే ఉంటాను మళ్ళీ మళ్ళీ – అని రాసిన మాటలు ఏళ్ళ కేళ్ళు మారుమోగి పోయేవి.” అంటూ స్వోత్కర్ష మొదలు పెడితే ఆగేది కాదు.
ఆ ప్రవాహంలో ఎంతటి వాళ్ళూ గడ్డిపోచ ఆధారం దొరక్కుండా కొట్టుకుపోయేవాళ్ళు.
అలాటి శకుంతలకు ఆకలి దప్పులు లేవు. నిన్న గాక మొన్న ఆ పేరిందేవికి పెడన వాళ్ళు పాపాయమ్మ అవార్డు ఇవ్వగానే ఎక్కడెక్కడి కూపీలూ లాగి ఎవరితో చెప్పించాలో వాళ్ళతో చెప్పించి ఏడాది తిరిగేసరికి ఆ అవార్డు కొట్టేసింది.
అల్లాగే క్రితం మాటు పక్క రాష్ట్రం వాళ్ళు ’అబ్బే నాకు ఓపిక లేదు నేను రాలేను’ అని అంటున్నా ఆవిడ పేరిటే అనౌన్స్ చేసి, సదరు మినిస్టర్ గారు మందీ మార్బలంతో ఇంటికి తెచ్చి ఇచ్చినా, ఆర్నెల్లు తిరిగేలోగా ఆయనకు యాభై ఆరేళ్ళకే షష్టి పూర్తి జరిపించి పట్టు బట్టలతో మొగుడూ పెళ్ళాలను సత్కరించి తన గుప్పిట బంధించి రాబోయే ఉగాదికి తన సత్కారం ఖరారు చేసుకుంది.
అడ్డు వస్తుందేమో అనిపించిన హంస గీతను తన సంస్థకు కార్యదర్శిని చేసి ,
” మేం యువతను ఆదరిస్తాం పైకి తెస్తాం ” అంటూ ముందరి కాళ్ళకు బంధం వేసి,
” ఈ మధ్యే రాస్తున్నది” అంటూ పదేళ్ళుగా రాసే ఆమెను పరిచయం చేస్తుంది.
అలాటిది, వినయంగా ఏం చెప్పినా తల ఊపే హంసలేఖ ఇంతపని చేస్తుందా?
అందుకే ఆవిడ ఆకలి దప్పులకు దూరం అయింది.
ఏం చెయ్యాలో తోచక కరకరా మిగిలిన గోళ్ళు అరిగి పోయిన పళ్ళతో కొరికేసి చిగుళ్ళు నొప్పుట్టాక బుర్ర వెలిగింది.
“దాన్ని మానసికంగా దెబ్బతియ్యాలి” అని ఆలోచనకు పదును పెడుతుంటే డోర్ బెల్ మోగింది.
తలుపు తీస్తే ఎదురుగా హంసగీత
పెళ్ళి బట్టల్లో ఆమెతో పాటు ఆవిడ ఒక్కగానొక్కసుపుత్రుడు.
కుప్పకూలిన ఆవిడకు ఏం అర్ధం కాలేదు , కాదు.