April 23, 2024

నలుగురి కోసం

రచన:- డా.  కె.  మీరాబాయి

సాయంకాలం ఆరు గంటలు కావొస్తోంది.  శివరాత్రికి చలి శివ శివా అంటూ పరిగెత్తి పోయిందో లేదో గానీ ఎండ మాత్రం కర్నూలు ప్రజల దగ్గరికి బిర బిర పరిగెత్తుకు వచ్చింది . ఫిబ్రవరి నెలాఖరుకే ముప్పై ఏడు డిగ్రీలకు పెరిగి ఎండ తన ప్రతాపం చూపుతోంది.

మామూలుగా ఆ వేళప్పుడు వూళ్ళో ఉన్న టెక్నో స్కూళ్ళు, డిజిటల్ స్కూళ్ళు , ఎంసెట్ నే ధ్యేయంగా మూడో క్లాసు నుండి పిల్లలను రుద్ది రుద్ది చదివించే కార్పొరేట్ స్కూళ్ళ నుండి బస్సులలోనూ ఆటోలలోను బి క్యాంప్ కు వచ్చే బాల బాలికలు వీపు మీది పుస్తకాల సంచీల బరువుతో ముందుకు వంగిపోయి ఇంటి వైపు నడుస్తూ ఉంటారు.

సిల్వర్ జుబిలీ కళాశాల వెనుక వైపున కాళీ స్థలం ఉంది.  పదవీ విరమణ చేసిన నలుగురు వృద్ధులు ఆ సమయంలో అక్కడ చేరి కష్టసుఖాలు కలబోసుకుంటూ కూర్చుంటారు.

ఆ రోజు అందరికన్నా ముందుగా పద్మనాభయ్య వచ్చాడు . కాలేజి ఎదురుగా ఉన్న చిన్న పార్క్ వంటి దానిలో అటు ఇటు నాలుగు సార్లు నడిచి వచ్చి తమ మామూలు చోటులో  కూర్చున్నాడు .

అంతలోనే అరోరా నగర్ వైపు నుండి వచ్చే గంగిరెడ్డి అటువైపుగా వస్తూ కనబడ్డాడు .  ఆ రోజు గంగిరెడ్డి నడకలోనే ఏదో తేడా ఉన్నట్టు తోచింది పద్మనాభయ్యకు.  మామూలుగా అటూ ఇటూ చూస్తూ కాస్త హుషారుగా అడుగులు వేసే మనిషి కాస్తా తల దించుకుని భారంగా నడుస్తూ వచ్చాడు .

అదే సమయానికి హౌసింగ్ బోర్డ్ నుండి   వచ్చే వెంకటాచలం, సీ క్యాంప్ వైపు నుండి వచ్చే దాసు కూడా అక్కడికి చేరుకున్నారు .

” రాను రాను ఎండ ఎక్కువైపోతోంది ” అంటూ అలసటగా కూర్చున్నాడు గంగిరెడ్డి .

” ఎందుకు కాదూ? ఒక పక్కన చెట్లు కొట్టేసి రోడ్లు వేస్తున్నారు.  ఇంకో పక్కన పంట పొలాల్లో, చెరువులలో ఆకాశ హర్మ్యాలు కడుతున్నారు.  ఇగ వానలు కురిసేది ఎట్లా ? ఎండలు మండి పోతా వున్నాయంటే మండవా ? గవర్నమెంటు ఏంచేస్తోంది అంటే సారా కొట్లు పెట్టి ప్రజలకు మత్తు మప్పుతోంది .  తాగి తాగి నాశనమైన సంసారాలు చూసిన ఇల్లాళ్ల కదుపులో మంట మాదిరి ఎండలు  మండుతాయి . ” నిస్పృహగా అంటూ తాను అతని పక్కన చతికిల పడ్డాడు .         వెంకటాచలం .

,

”  ఇంకా ఇప్పుడు నీళ్ళ కొట్లాటలు మొదలాయె గదా! పంపు దగ్గర    కొట్లాడే ఆడోళ్ళ   మాదిరి రెండు రాష్ట్రాల గవర్నమెంటు ఇంజినీర్లు కాలవ గట్ల మీద ఒకరినొకరు తోసుకునే కాలమొచ్చింది.    వాళ్ళకు కాపలాగా రెండు పక్కల పోలీసులు .  ఇంకా ఇట్లాంటివి ఎన్ని చూడాల్నో?”  జేబులో నుండి రుమాలు తీసి క్రింద పరచి  దాని మీద కూర్చుంటు అన్నాడు దాసు.

దాసు జీవిత భీమా సంస్థ లో పని చేశాడు.  ఉద్యోగంలో ఉన్నప్పుడే భార్య కాలం చేసింది.  అతనికి పిల్లలు లేరు.  రామ కృష్ణ మఠం తరపున సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించడం, ఆధ్యాత్మిక విషయ చింతన ను పెంచే పుస్తకాలు చదవడం అతని మనసుకు నచ్చిన విషయాలు.  సమాజమ్లో కలుషిత మవుతున్న వ్యవస్థలు ,రాజకీయాలలో చోటు చేసుకుంటున్న వ్యక్తి పూజ, జీవితంలో భాగంగా మారిపోయిన అవినీతి గురించి మథన  పడుతుంటాడు .  పదవీ విరమణ తరువాత అతను ఒక అరక్షిత బాలుర ఆశ్రమం లో మ్యానేజర్ గా ఉచితం గా సేవలు అందిస్తున్నాడు .

ఆ పిల్లలను తీర్చి దిద్దడం లో ఆనందం పొందు తున్నాడు.

” సరే, మనకుండే వెతలు చాలక ఈ కతలు  దేనికీలే ఇడ్సండి.  ఏంది గంగిరెడ్డి మెత్టగున్నావు.  కొడుకు, బిడ్డ, పిల్లలు అంతా బాగున్నారు కదా . ” అందరికన్నా ముందు వచ్చి కూర్చున్న పద్మనాభయ్య గంగిరెడ్డి ని పలుకరించాడు.

గంగి రెడ్డి విద్యుత్ శాఖ లో ఎ ఈ గా పనిచేసి పదవీ విరమణ పొందాడు.  ఒక  కూతురు, ఒక కొడుకు .  కూతురు పెండ్లి కి అతను కష్టపడే పని లేకుండా సంబంధం వెతుక్కుంటూ వచ్చింది.  వాళ్ళకు పిల్ల డాక్టర్ చదివితే చాలు అన్నారు.  .

గంగిరెడ్డి నెత్తిన   పాలు  పోసినట్టు అయింది .  దండిగా నగా, నట్రా, పెట్టి బ్రహ్మాండముగా పెళ్లి చేశాడు.  కూతురు అల్లుడు రెండు చేతులా సంపాదించు కుంటున్నారు.  గంగిరెడ్డి కొడుకు ఏదో మంచి కంపనీ లో పనిచేస్తున్నాడు.  కోడలు డిగ్రీ దాకా చదివింది.  ఇల్లు చక్కబెట్టుకుంటుంది.  గంగిరెడ్డి ది వడ్డించిన విస్తరి లాటి జీవితం ” అని స్నేహితులు అనుకుంటారు.

ప్రస్తుతం సిల్వర్ జుబిలి కాలేజీ వెనుకనున్న స్థలం లో కలుసుకున్న ఈ నలుగురు వాకింగ్ స్నేహితులు.  అదే వూళ్ళో నే వేరు వేరు శాఖల నుండి రిటైరైన వాళ్ళు.

వెంకటాచలం నీటి  పారుదల శాఖ లో పనిచెసాదు. ఇద్దరు కూతుళ్ళు.  ఇద్దరికి మంచి సంబంధాలే చూసి చేసాడు .  రెండో పిల్ల, భర్త బాగానే ఉన్నారు.  పెద్ద కూతురు రంజని మొగుడు ఒక సాడిస్ట్.  తాగుబోతు .  ఎన్నో సార్లు మైకంలో పెళ్ళాన్ని చావ గొట్టి ఇంట్లో నుండి గెంటేసి తలుపు వేసుకుంటాడు.  ఆ పిల్ల రాత్రి అంతా బిక్కు బిక్కు మంటూ ఇంటి వరండాలో చలికి ముడుచుకు పడుకుని, పొద్దున్నే ఇంట్లోకి వెళ్ళి పనిలో పడుతుంది .  ఇటువంటి సంసారం లోనే ఆ పిల్ల గర్భవతి అయి ఆడపిల్లను కన్నది.

భర్త చేతిలో దెబ్బలే కాకుండా ఆడ పిల్లను కన్నందుకు అత్త సాధింపులు తోడు అయ్యాయి.  దేవుడు ఆ అమ్మాయికి శిక్ష చాలు అనుకున్నాడు లా ఉంది.  ఒక రోజు తాగిన మత్తులో వస్తూ లారీ కింద పది చచ్చిపోయాడు అల్లుడు.

కుల నాశనం చేసిందని తిట్టి కోడలినీ, మనవరాలిని ఇంట్లోనుంది గెంటివేసింది అత్త.  నాలుగేళ్ళ బిడ్డతో తండ్రి ఇల్లు చేరింది రంజని .

ఇక అందరికన్నా ముందు వచ్చి కూర్చున్న పద్మనాభయ్య డి మరో కథ.  అతను ప్రభుత్వ ఖజానా లో పనిచేసాడు.  ఇద్దరు కొడుకులు బాగా చదువు కున్నారు . పెద్దవాడు ఎం బి ఏ చేసి వ్యాపారం లోకి దిగాడు.  రెండో వాడు బి టెక్ చేసి ఎం ఎస్ చేస్తానని అమెరికా వెళ్లాడు.  పెద్ద కొడుకు పెళ్ళైన ఆరు నెలలకే కారు ప్రమాదం లో కళ్ళు మూసాడు .  అతనితో బాటు పక్కన ఉన్న భార్య భర్తను విడిచి ఉండలేను అన్నట్టు తాను ప్రాణం విడిచింది .

రెండో కొడుకు భాస్కర్ మీద మమకారం తో బ్రతుకుతున్న పద్మనాభయ్య ఆశల మీద నీళ్ళు చల్లుతూ అక్కడే ఒక అమెరికన్ పిల్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు భాస్కర్.  పెళ్ళయిన ఏడాది తరువాత విషయం తండ్రికి చెప్పిన భాస్కర్ ఆయనను రమ్మని పిలువలేదు.  తాను రాలేదు.  మనవడు పుట్టాడు అని తెలిసి పద్మనాభయ్య మనసు ఆగక భార్య సమేతం గా అమెరికా వెళ్లాడు.

ఆరు నెలలు కొడుకు దగ్గర హాయిగా ఉండి అమెరికా లో చూడ వలసిన ప్రదేశాలు చూసి వద్దామనుకుని వెళ్ళిన దంపతులు పదిహేను రోజుల్లో తిరిగి వచ్చారు.  ‘ అదేమిటి అప్పుడే వచ్చేశారు అంత ఖర్చు పెట్టుకుని వెళ్ళి? ‘ అని అడిగిన వాళ్ళకి ‘ ఆ చలి తమకు పడ లేదని, ఆరోగ్యం బాగా లేదని ‘ జవాబు ఇచ్చారు.  వాడి పోయిన వారి ముఖాలు చూసి అవునేమో అనుకున్నారు అయిన వాళ్ళు.  స్నేహితుల ఓదార్పు తో కోలుకున్నాడు పద్మనాభయ్య.

పద్మనాభయ్య పరామర్శ కు జవాబుగా పెద్దగా నిట్టూర్పు విడిచాడు గంగిరెడ్డి .  ” ఆ అంతా బాగానే ఉన్నారు.  ఇన్నాళ్లు పిల్లల చదువు కోసం , సీట్లు వస్తాయో రావో అని బూగులు పడి , లక్షలు పోసి చదివించామా, ఇప్పుడు వాళ్ళ బిడ్డలకు కూడా మేమే పెట్టాలని తొందర చేస్తున్నారు.  ఇండ్ల స్థలాలు ఉన్నాయి కదా అవి అమ్మేసి మనవడికి డొనేషన్ కట్టాలంట.  వాళ్ళకు వొచ్చింది వొచ్చినట్టు ఖర్చు పెట్టేస్తారు.  కారుకు పది లక్షలు, ఇంటికి యాభై లక్షలు, సినిమాకు పోతే ఐమ్యాక్స్ అంటూ మూడు వేలు, స్టార్ హోటెల్ అంటూ నాలుగు వేలు పెట్టేస్తారు.  వాళ్ళు కూడబెట్టేది లేకున్నా ఎప్పుడో నేను కొన్న స్థలాలు అమ్మేసుకుంటే రేపటికీ ఏమీ మిగులుతుంది . ” గంగిరెడ్డి కోపము, దిగులు కలసిన స్వరం తో అన్నాడు.

” నీ కథ అట్లుంటే నా గ్రహచారం ఇంకా బాగాలేదు రెడ్డీ .  తాగి తాగి అల్లుడు కూతురి కొంప ముంచి మట్టి కొట్టుకు పోయాడు.  సరే నా తల రాత అనుకుని వాళ్ళని తెచ్చి పెట్టుకుని, రంజనికి ఉద్యోగం వేయించి,దాని కూతురును సాకినామా.  ఇప్పుడు చేతికి అందిన నా మనుమరాలు ఎవరో కులం కాని వాడిని ప్రేమించినాను అని ఇంటికి తీసుకు వచ్చింది .  ముసలితనాన అదే మమ్మలిని చూసుకుంటుందని ఆశ పడినామా.  అంతా అయిపాయే.  నా కూతురు తల కొట్టుకుని ఏడుస్తోంది. ” వెంకటాచలం తన ఆవేదన, ఆక్రొశమ్ వెళ్ళబుచ్చు కున్నాడు .

” చూడు చలం ఈ కాలం లో కులం గురి చి ఆలోచన ఎందుకు.  నీ కూతురుకు కులం , జాతకం అన్ని చూసి చేసినావు .  ఏమయింది.  మన ప్రారబ్ధం అంతే .  నా కొడుకు అమెరికా లో ఉన్నాడు నాకేమి అనుకుంటారు మీరు.  వాడు అమెరికా పిల్లను చేసుకుని,వాళ్ళ తిండి వాళ్ళ మతం నాది అంటున్నాడు.  మేము అంత దూరం పోయి వెనక్కి కొట్టిన బంతి మాదిరి రెండు వారాలలో ఎందుకు తిరిగి వచ్చినామో మీకు ఎవరికి చెప్పలేదు నేను.  మా కోడలు అత్తా మామలను వారం కన్నా భరించ లేదంటా.  అట్ల అత్త మామలు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండే పద్దతి అక్కడ లేదని నా కొడుకే చెప్పినాడు.  పిలవని పేరంటానికి పోయినందుకు అవమానం దిగమింగి తిరిగి వచేసాము.  పైకి అందరికి మాకు చలి పడ లేదని, ఒళ్ళు బాగాలేక వచ్చేసినామని చెప్పుకున్నాము.

” నీ కూతురు బ్రతుకుకు దారి చూపించావు .  మనవరాలిని చదివించావు.  ఆ పిల్లకు నువ్వు సంబంధం చూసి చేస్తే మాత్రం ఇంతకన్నా సుఖం గా ఉంటుందని ఎమి నమ్మకం.  తనకు నచ్చిన వాడిని మీ అందరి సమ్మతి తో చేసుకోవాలనుకుంది .  అక్కడికిన్మెలే కదా.  ఆలోచించు.  నీ బాధ్యత తీర్చుకో.  మనసుకు నెమ్మది పొందు. ” పద్మనాభయ్య మనసు విప్పి సలహా చెప్పాడు .

దాసు రెడ్డి భుజం మీద చెయ్యి వేసాడు.  ” రెడ్డీ, నీ పిల్లల భవిష్యత్తు కోసమే నీ ఇళ్ళ స్థలాలు అట్టి పెట్టాలి అనుకున్నావు.  ఆ భవిష్యత్తు కోసమే చదువుకు డబ్బు కావాలంటున్నారు వాల్లు. దానికి నువ్వు బాధ పడడం దేనికి.  నువ్వు ఎవరి మీదా ఆధార పడకుండా ఒక ఇల్లు, కొంత పొలం నీ కోసం పెట్టుకుని వాళ్ళది వాళ్ళకు ఇచ్చేస్తే తాకరారు లేదు కదా.  దానికి ఇంత దిగులు, బుగులు ఎందుకు. .

” పిల్ల పీచు లేని వాడివి నీకేం ఎన్నయినా చెప్తావు అనుకోకు.  నిజమే తాడు బొంగరం లేని వాడిని.  దేవుడు నాకు పిల్లలను ఇవ్వలేదు.  అందుకే అనాధ పిల్లలను ప్రేమిస్తున్నానేమో ! అందుకే నాకు ఇవ్వడం లో ఉండే హాయి తెలిసింది.  మీ బాధ్యతలు తీర్చు కున్నారు.  బంధాలు వదిలించుకోవాలి.  వాన ప్రస్థం అంటే అడవికి పోనక్కర లేదు.  సంసారం అనే దానిలో కూరుకు పోకుండా మనకు ఇంత ఇచ్చిన సమాజానికి కొంత తిరిగి ఇద్దాము అనుకుందాము.

” మీ పిల్లలకు చేయ వలసినవి చేసారు.  ఇక వాళ్ళు మీకు ఏదో చేయాలని ఆశించకండి.  మీకు ఉన్నంతలో పదిమందికి సాయ పడండి.  అదెంత తృప్తిని ఇస్తుందో నాకు అనుభవమే.  నా భార్యను దేవుడు తీసుకు పోయాడు.  కానీ నాకు ఆయుషు ఇచ్చాడు.  అందుకే నలుగురికీ ఉపయోగం గా బతకాలి అనుకు న్నాను .  నాకు మంచి అనిపించిన మాట చెప్పాను.  ఆలోచించు ” అని ఉరుకున్నాడు. . .

చీకటి పడింది.  వీధి దీపాలు వెలిగాయి.  నలుగురు లేచి ఇంటి దారి పట్టారు.  ఎవరి ఆలీచనలో వాళ్ళు నాలుగు దారుల్లో తమ గమ్యం వైపు కదిలారు.  సిల్వర్ జుబిలి కాలేజీ హాస్తాలు పిల్లలుకొందరు బయటకు వచ్చి జంక్షన్ దగ్గర బండిలో ఏవో కొంటున్నారు.  దాసు షేర్ ఆటో ఆపి ఎక్కాడు.  దాసు ఉండేది ఆరక్షిత బాలుర ఆశ్రమం లోని ఒక గదిలో మ్యానేజర్ అక్కడే ఉంటే పిల్లలను ఒక కంట కనిపెట్టే వీలు ఉంటుందని ఆ ఏర్పాటు .

మరునాడు దాసు నిద్ర లేచి ఆఫీసు గది దగ్గరకు వచ్చేసరికి పిల్లలు అందరు అక్కడ మూగి ఉన్నారు.  ” ఈ రోజు ఆదివారం స్కూలుకు వెళ్లే పని లేదు.  మరి వీళ్లంతా ఎందుకు వచ్చినట్టు ? ” అనుకుంటూ లోపలికి నడిచాడు.

” దాసుగారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు ” అని బోర్డ్ మీద రాసి ఉంది.

‘ వీళ్ళకు ఎలా తెలుసు?అనుకుంటూ ఆశ్చర్యం గేయా చూస్తున్నాడు దాసు.

నమస్తే సార్ అంటూ ముందుకు వచ్చాడు ఒక పాతికేళ్ళ యువకుడు.

ఎవరా అన్నాట్టు తెరి పారా చూసాడు దాసు.

” నేను ఈ ఆశ్రమం లో పెరిగి, ఇక్కడ చదువుకున్న శంకర్ ని సార్.  నాకు ఈ వూళ్ళో నే ఉద్యోగం వచ్చింది . మమ్మల్ని స్వంత బిడ్దల్లాగా చూసుకున్న మీకు ఈ శుభ వార్త చెప్పాలని వచ్చాను.  ఈ రోజు మీ జన్మ దినం అని తెలుసు కున్నాను.  ఎవరెవరో వారి ఆత్మీయూల పుట్టిన రోజుకు.  పెళ్లి రోజుకు.  స్మరించుకోవడానికి ఆయా రోజులలో పిల్లలకు విందు భోజనానికి డబ్బు కడతారని ఆ భోజనం కోసం ఎదురు చూసే మాకు తెలుసు. వారి పుట్టిన రోజు నాడు ఆ దాతల పేర్లు మా చేతనే బోర్డ్ మీద రాయించే వారు మీరు.

కానీ ఈ తారీఖున మాకు విందు భోజనం ఉండేది గానీ ఎవరి పేరు బోర్డ్ మీద రాసేవారు కాదు.  ఆకు ఈ మధ్యనే తెలిసింది ఈ రోజు మీ పుట్టిన రోజు అని .  నా వంటి వారికి ఎందరికో పెద్ద దిక్కుగా ఉంటూ , మయ ఆలనా పాలనా చూసిన మీకు కృతజ్ఞతలు తెలుపుకోవడం కోసం ఈ ఏర్పాటు చేసాను . ” గద్గదికమ్ ఐన గొంతు తో అన్నాడు ఆ యువకుడు .

ఎన్నడు లేని విధంగా ఆశ్రమం అంత పూల తోరణాలతో రంగుల కాగితాల దండలతో కళ కళ లాడుతుంది.  పిల్లలందరి ముఖాలలో సంతోషం.

దాసు కళ్ళు చెమరించాయి.  ” ఎవరు లేని తన కోసం ఇంతమంది ఆత్మీయత చూపుతున్నారు.  అంతకన్నా కావలసింది ఏముంది ?”

అదే సమయం లో నెమ్మదిగా నడుస్తూ లోపలికి వచ్చారు గంగిరెడ్డి, వెంకటాచలం, పద్మనాభయ్య.  ఒక్కొక్కరూ వచ్చి దాసును ఆలింగనం చేసుకున్నారు.

” నిన్న మనం మాట్లాడుకున్న విషయాలే రాత్రంతా తలలో తిరుగుతూ ఉండినాయి దాసు.  నువ్వు చెప్పిన మాట నిజం.  ఈ వయసులో లంపటాలు వదుల్చుకుని, నేను ,నా వాళ్ళు అని మాత్రమే కాకుండా సమాజం లో మా సహాయం కావలసిన వాళ్ళ గురించి కూడా ఆలోచించాలని తోచింది.  నేను నా భార్య కూడా సేవ చేసే దానికి సిద్ధం.  దారి నువ్వు చూపించు. . ” అన్నాడు   పద్మనాభయ్య .

మేము కూడా అదే బాట లో నడవాలని అనుకుంటున్నాము.  ఎట్లా చేస్తే బాగుంటుందో అందరం కల్సి మాట్లాడుకుందాము.  ఎంత సేపు పిల్లలు, మనవలు అంటూ సంసారంలో భ్రమిస్తున్నాము.  నలుగురి కోసం ఆ ప్రేమలో కొంత పంచడం ఇప్పటి కైనా మొదలు పెడటము.  ” అన్నారు రెడ్డి , చలం.

దాసు చేతికి కొత్త బట్టలు అందించి దండం పెట్టాడు శంకర్.

సార్ మేము మీకు కానుక ఏమీ తేలేదు అన్నారు పిల్లలు సిగ్గు పడుతూ.

మీరంతా ఈ శంకారన్న మాదిరి చదువుకుని మంచి ఉద్యోగాలు తెచ్చుకోండి.  అదే నాకు పెద్ద కానుక . అన్నాడు దాసు నవ్వుతూ.

శంకర్ కనుల లోని వెలుగు తాము ఎన్నుకున్న మార్గం సరియైన దని ఆ నలుగురికీ చెప్పింది.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *