April 25, 2024

కవితా నీరాజనమైన నివేదన

రచన: సి.ఉమాదేవి

కవయిత్రి కవితా చక్ర పలికించిన నివేదన, రాగాలు పలికిన కవితాఝరి. అక్షర ఆర్తితో లిఖించిన ప్రతి పదము రచనాపూదోటలో కవితాసుమమై మధురిమలను వ్యాపింపచేస్తుంది. కలము, గళము యుగళగీతమై అందించిన కవితార్చనలోని తాత్వికత, తాదాత్మ్యతకు గురిచేస్తుంది. పుస్తకం శీర్షిక నివేదన, కాని ప్రతి వాక్యములో ఆరాధన, ఆవేదన సమ్మిళితమైన నివేదనగా రూపుదిద్దుకున్న రచన.
‘దోసిటనిండిన ఆశల పూలరెక్కలు మాయమై హృదయభారాన్ని మిగిల్చాయనడంతో’ నివేదన అక్షరానికి ఊపిరవుతుంది.
‘నేను నడిచే దారుల్లో నీమాటల పూవులు నన్ను తాకుతున్నాయి, నీకై వెదుకుతూ నడిచాను, దారి అంతు చిక్కలేదు, నీ ఆనవాలూ కనిపించలేదు’ అని అనడంలో మాటల పువ్వులతో కవయిత్రి అక్షరమాలలే అల్లారు. ‘నీటికుండతో గుమ్మంలో ఎదురు చూస్తూనే ఉన్నా! నీటికుండలో నీరు తొణకలేదు. . తడిసిన గుండెలో కన్నీరూ ఇంకలేదు. ’చక్కటి ప్రయోగం కన్నీరూ ఇంకలేదు అనడంలో పాఠకుడికి అందులో శ్లేషార్థం కూడా కనబడుతుంది. కన్నీరు గుండెనిండుగా ఉందనడమేకాదు, ఇక ఏడవడానికి కన్నీరు ఇక లేదనిపిస్తుంది. ‘నీ రాక జాడ తెలియలేదు కానీ స్పందన మాత్రం కంటిలో చెమ్మైంది!’అని చెప్పడంలో మనసు కురిసిన కన్నీటి చినుకులే కదా కంటిని తడిపింది అనిపిస్తుంది. ‘అక్షరాలవనంలో నీకోసం పూసిన పదదళాల్ని నీ పాదాలచెంత నివేదిస్తున్నాను. ’రచనా ఒరవడిలో వికసించిన పదాలన్నీ పూలరెక్కలై పరిమళిస్తాయి. ‘ఇంద్రధనస్సులో సప్తవర్ణాలేకాని మనసున ఎన్ని రాగవర్ణాలో అనడం రాగరంజితమే. మగత నా వేలు పట్టుకుని స్వప్నసీమలో నిన్ను చూపుతూ నీ దరి చేరుస్తున్నది. మేలుకుని చూసాను నీవు లేని శూన్యత కళ్లలో మాత్రం నీ రూపం నింపిన వెలుగు. ’ కలయో వైష్ణవమాయో అనే భావన మన మనసును లీలగా స్పృశిస్తుంది. ‘కనుల కాటుక కరిగీ గాజుల సవ్వడీ సద్దుమణిగి బాహ్యాలంకరణ వసివాడింది, నీ దర్శనార్థం వేచి ఉన్న హృదయాలంకరణ మాత్రం
-2-
తేజోవంతంగా కాంతులీనుతూనే ఉంది’ అంటారు. బాహ్యప్రపంచాన్ని మరచి అంతరాత్మలో అంతర్యామితో మమేకమైన భావన పొటమరిస్తుంది. ‘బంధాలే సమస్తమైన నాకు స్వేచ్ఛైక విశ్వజనీన ప్రేమను చవి చూపావు. . . నింపారమైన నీ చూపు కవచంలో బందీనే’ అని నివేదించడం కళ్లు చూపులతో బంధిస్తాయన్న నిజానికి చక్కని దృష్టాంతం. ‘ఏ దిక్కునుండి, ఏ సమయంలో వస్తావో తెలియక ఆకసాన్ని చూస్తూ పొద్దుపొడుపేదో, పొద్దుగూకేదో మరచి నీ కోసం అల్లుతున్న మనోమాలికలో ఎన్నో చిక్కుముడులు. ’ అని చెప్పడంలో మనసున ఉద్భవించే ఆలోచనల సుడిగుండాన్ని తలపుకు తెస్తుంది. ‘వాలిన నా కళ్లలో మాత్రం నీ పాదముద్రలు నిక్షిప్తమయ్యాయి. నువ్వు లేవు అలౌకిక భావపు అంచున నేను. ఇహపరముల సమ్మోహనమిది. నీ గమనంలో వేగం పెరిగిందని వాయువేగం సందేశం చేరవేసింది, నువ్వు చేరే గమ్యం నేనే అన్న ధీమా, అనంతమైన కాంతితో ప్రజ్వలిస్తోంది. ’ నివేదన చివరి రూపు సంతరించుకునే దిశగా ఆశ మొలకెత్తుతుంది.
‘నీ పాదాలను అలంకరించాలని ఒక్కో అశ్రుబిందువును మాలగా కూర్చాను పక్షుల కువకువలు నీ రాకకు స్వాగతం పలుకుతున్నాయి. ప్రభాతస్వప్నం సంధ్యాసమయంలో కరిగిపోతున్నా అలుపులేక నా గొంతు నీ గీతాలనాలపిస్తూనే ఉంది. ’ కల కనుమరుగైనా మనసుపలికే రాగాలను అడ్డుకోలేం కదా అనే భావం చదువరిని ఆకట్టుకుంటుంది. ‘నువ్వు మౌనం వహించావు. . . ఆ మౌనంలోనే భాషను వెతుక్కుని, నీతో సంభాషిస్తున్నాను. ’ మౌనభాష్యమెపుడు మనసుభాషే. ‘కాలచక్ర ప్రవాహ గమ్యమేమిటో తెలియదు గానీ ఈ కాల గమనంలో అడుగడుగునా నీ సందేశమే. ’మన మనసులో ఉత్పన్నమయే ఆరాధనా భావాలకు జవాబెపుడు కోరుకున్న సందేశమే అవుతుంది. ప్రతిపుటలోను అనురాగమాలికలు పేని కాలచక్ర పరిభ్రమణంలో ఆర్ద్రత నిండిన నివేదనతో అక్షరపుష్పాలను వికసింపచేసిన కవితా చక్రకు అభినందనలు.

2 thoughts on “కవితా నీరాజనమైన నివేదన

Leave a Reply to కవిత చక్ర Cancel reply

Your email address will not be published. Required fields are marked *