April 20, 2024

నవరసాలు..నవకథలు.. భయానకం ..2

రచన: చెంగల్వల కామేశ్వరి

“హెల్ప్ మి”

భలే సంతోషంగా ఉందిరా ! ఎప్పటినుండో అనుకున్నాను. ఇప్పటికి కుదిరింది ఇలా ట్రైన్ లో అరకు వెళ్లాలని. అంటున్న వాసు మాటలకి నవ్వేసి
ఏం చేస్తాము? ఒకరికి కుదిరితే ఇంకొకరికి కుదరదు.
ఆ గోపాల్, వర్మ , రాంబాబు గొడవ ! ఎప్పుడూ మేమే రావాలా! ఎక్కడెక్కడివాళ్లో వస్తున్నారు. మీరిద్దరూ రారేంటిరా !
ఆ భాగ్యనగరంలో ఉన్నారని పెద్దబడాయి.”
అని సాధింపులు.
ఇంట్లో పెళ్లాం పిల్లలని వదిలి, బాస్ గాడికి మస్కా కొట్టి లీవు సంపాదించి బయల్దేరాలంటే మాటలా? ఇన్నాళ్ల కి కుదిరింది. ఈ నాలుగు రోజులు బ్యాచిలర్స్ లాగా హేపీగా గడపాలిరా! అన్నాడు. ఆనంద్.
పాపం మన ఫ్యామిలీలను కూడా తీసుకురావొచ్చు కాని వాళ్లందరికీ అన్నీ చూసేసరికే మనపని అయిపోతుంది. మనూళ్లోలాగా వీకెండ్స్ లో లా
వాళ్ల కబంధ హస్తాల నుండి బయటపడలేము. వాళ్ల సేఫ్టీ మనమే చూడాలికదా! అని గట్టిగా నవ్వేసాడు వాసు!
ఉండుండి వచ్చే టన్నెల్స్ రాగానే కుర్రకారు వేసే విజిల్స్ తో హోరెత్తిపోతున్నాయి కంపార్ట్ మెంట్స్. అప్రయత్నంగా వాసూ, ఆనంద్ కూడా వాళ్లలా చిన్నవాళ్లయిపోయినట్లుగా ఈలలు వేసేసారు ట్రైన్ కిటికీలోనుండి “బొమ్మాళీ! నానుండి తప్పించుకోలేవే! అని, ఓ—- అని కేకలేసి, గోల చేసారు.
పచ్చనిఅడవులు కొండలు లోతయిన లోయల గుండా వెడుతున్న కిరండోల్ ఎక్స్ ప్రెస్ ఉత్సాహాలకి కుర్రకారు అల్లర్లను మోసుకుంటూ వెడుతోంది.
ఫొటోలు వీడియోలు తీసుకుంటూ ఆ పచ్చని ప్రకృతి అందాలు చూసి మురిసి పోతున్నారు ఆ మిత్రులిద్దరూ.
ట్రైన్ లో అమ్ముతున్న జామకాయలు పల్లీలు టిఫిన్స్ ఆరగించి ఆరారా కాఫీలు తాగుతూ చాలా ఉల్లాసంగా ఉన్న వారిద్దరినీ కొందరు వింతగా చూస్తూన్నారు.
సిగరెట్ వెలిగించి హాయిగా దమ్ము పీల్చి బైట కి చూస్తూన్న వాసు ఒక్కసారిగా తృళ్లిపడి “ఆనంద్ అటు చూడు ! అనరిచాడు. వాసు చెప్పిన వైపు చూసిన ఆనంద్ కూడా విభ్రాంతికి గురయ్యాడు.
లోతుగా ఉన్న లోయలోనుండి ఇద్దరు స్త్రీలు వారి చేతుల్లో ఉన్న రుమాళ్లు వారు అరుస్తున్నట్లు కన్పించినా. ట్రైన్ స్పీడుకి ఆ రూపాలు కనుమరుగయిపోవడంతో నివ్వెరపోయాడు.
“ఎవర్రా వాళ్లు అక్కడెందుకున్నారో! అని మాత్రం అనగలిగాడు.
ఆ మాటకి అదేరా! ఇద్దరూ లేడీసే !పెద్ద ఏజ్ కూడా ఉన్నట్లు లేదు ‌. అక్కడికెలా వెళ్లారో హెల్ప్ హెల్ప్ అని అంటున్నట్లుగా ఉందిరా! అన్నాడు వాసు.
ఇద్దరికీ మూడ్ పాడయినట్లుగా అయి ఆ ఇద్దరి రూపాలే గుర్తొస్తుంటే ఒకరిద్దరిని అడిగారు ఎవరయినా చూసారా! అని కాని ఎవరూ చూడలేదన్నట్లే చెప్పారు.
ఆ సంఘటన గురించే చర్చించుకుంటూ ఉండగానే మరోగంటకి ట్రైన్ అరకులోయ చేరడం తమ కోసమే స్టేషన్ లో ఎదురు చూస్తున్న మిత్రబృందాన్ని కలవడం .
ఆ హడావిడిలో మిత్రులను కలసిన ఆనందంలో అన్నీ మరిచిపోయారు. గోపాల్ తెచ్చిన టాప్ లెస్ జీపులో కూర్చుని తమ కోసం బుక్ చేసిన యాపిల్ రిసార్ట్ కి చేరుకున్నారు. సామాన్లు అక్కడ రూమ్స్ లలో పడేసి మళ్లీ జీపు మీద అరకు విహారం మొదలుపెట్టారు.
తిన్నగా చాపరాయి జలపాతాలకి తీసుకెళ్లిపోయాడు గోపాల్ అక్కడ నీళ్లలో తడిసి ఈదులాడుతూ కేరింతలు కొడుతూ స్నానాలు చేసి జోకులు నవ్వుల లో ములిగితేలారు. తర్వాత అందరూ జీపులో కూర్చుని చిల్డ్ బీర్ కి అక్కడే ఆర్డర్ చేసుకున్న వేడి వేడి బొంగు చికెన్ ఆరగించారు,
అందరూ కలుసుకుని అయిదారు సంవత్సరాలు కావడంతో వారి ఆనందానికి పట్టపగ్గాలు లేవు. కబుర్లకు అంతేలేదు. వాసూకి, ఆనంద్ కి, వచ్చేపుడు చూసిన విషయం ఒకట్రెండుసార్లు గుర్తొచ్చినా, వేరేమాటల ప్రవాహంలో కొట్టుకుపోయింది.
అలా అలా తిరుగుతూ ట్రైబల్ మ్యూజియమ్, కాఫీ మ్యూజియమ్ చూసుకుని మధ్యలో లంచ్ లాగించి కొండల్లో పొద్దుకుంకి మంచుపొరలు అలముకుంటూ చీకటి పడుతుంటే, తమ రిస్సార్ట్ కి చేరుకున్నారు. కాస్త అలసటగా ఉన్నా వేడినీళ్ల స్నానం చేసేసి ఫ్రెష్ గా తయారయి వేడి కాఫీతో సేదదీరేసరికి.రాంబాబు వర్మ గోపాల్ కూడా ఫ్రెషప్ అయి వచ్చేసారు.
“పదండ్రా బైట మనకన్నీ రెడీ! అంటున్న గోపాల్ మాటకి ” బాబోయ్ ఈ చల్లోనా మా వల్లకాదు ఇక్కడే సెటప్ చేయొచ్చుకదా! అన్న ఆనంద్ మాటలకి
“చలీ లేదు గిలీలేదు కేంప్ ఫైర్ వేస్తారు మన కోసం థింసా డాన్సు కూడా ఉంది. మందుంది. చిందుంది. ఇంకేమింకేం కావాలే చాల్లే ఇదిచాల్లే! మనమంతా ఏకపత్నీవ్రతులం కదా! అంతే చాలు కదా! అని నవ్వాడు వర్మ.
“ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఇంకా ఎందుకురా అబద్దాలు! అని కవ్వింపుగా అంటున్న వాసూ మాటలకి
కృష్ణావతారం అయిపోయిందిరా! ఇంక నేను రామావతారంలోనే అన్న వర్మ మాటకి నవ్వుకుంటూ అందరూ బయటకి వచ్చారు.
చిక్కటి చీకటి అలముకుని జివ్వుమంటున్న చలిలో అక్కడక్కడ వెలుగుతున్న లైట్ల జిలుగులు రిసార్ట్ ముందు ఎత్తయిన కొండలు నడుమ ఉన్న రైల్వే ట్రాక్ మీద మెల్లగా పోతున్న గూడ్స్ ట్రైన్ తమ రిసార్ట్ గదులకెదురుగా ఉన్న పచ్చిక బయలు లో అక్కడక్కడ వెలిగించిన కేంప్ ఫైర్ లు వాటిముందు గుంపు గుంపులు గా జనాలు
నడుమ రంగు రంగు దుస్తులు వెండిపట్టాలు కడియాలు వేసుకుని చెట్టాపట్టాలుగా లయబద్దంగా థింసా నృత్యం ఆడుతున్న స్త్రీలు కోలాహలంగా ఉండటంలో చలి నిజంగానే పారిపోయినట్లనిపించింది.
తమకై ఏర్పర్చిన కేంప్ ఫైర్ దగ్గర కుర్చీలలో అందరూ కూర్చున్నారు. రిసార్ట్ బోయ్ తెచ్చిన వేడిపకోడీలతో హఫ్రైడ్ కాజూతో విదేశీ స్కాచ్ జతకలిసింది. ఆ చలిలో అలా వెచ్చగా చలికాగుతూ ఆ డాన్సులు కోలాహలం ఎవరికి వారు ఇలా ఎంజాయ్ గా ఉండటం అద్భుతంగా అనిపించింది.
భలే సంతోషంగా ఉందిరా !
“చెవులున్న గోడలు లేవు కుళ్లుకునే కళ్లేమి లేవు ! అన్నట్లు అంతా స్వేఛ్చ! తమ దగ్గర కూడా నృత్యం చేసిన థింసా బృందానికి అందరూ డబ్బులు ఇచ్చి వాళ్లల్లాగే వీళ్లు కూడా డాన్స్ నేర్పమని డాన్స్ కట్టేసరికి ఆ అమ్మాయిలు నవ్వుకుంటూ వెళ్లిపోయారు.
పాటలు చిందులు ఆపి కబుర్లలో పడిన తరుణంలో సడన్ గా ఆ లోయలో కనిపించిన స్త్రీలు గుర్తొచ్చి ఆనంద్ కి నిలువెల్లా గగుర్పొడిచింది. ఈ చీకటిలో, చలిలో వాళ్లేలా ఉన్నారో! అనుకోగానే ఆ విషయాన్ని గోపాల్ వర్మ రాంబాబుల కి చెప్పాలనిపించింది.
వెంటనే ఒరే గోపాల్ ఇవాళ మేము వస్తున్నప్పుడు ఏమయిందో తెలుసా! అంటూ వాసూ తాను చూసిన విషయాన్ని పూసగుచ్చినట్లుగా వివరంగా చెప్పాడు.
వాసూ కూడా అదే విషయాన్ని చెప్తుంటే వింటున్న వర్మకి రాంబాబుకు గోపాల్ ఆశ్చర్యం కల్గింది.
అదెక్కడి ప్లేసో చెప్పగలరా! ఐమీన్ ఏ స్టేషన్ తర్వాత? అనడిగాడు వర్మ.
వాసూ ఆనంద్ ఇద్దరూ ఆలోచించి కొంచెం తర్జనభర్జనల తర్వాత కొత్తవలస తర్వాత అనుకుంటామని చెప్తూ “పాపం వాళ్లని కాపాడాలిరా! అసలు ఈ సమయంలో ఆ చిట్టడవి లోయల్లో ఎలా చిక్కడ్డారో! ఏమిటో! మనమేదయినా చేయగలమా? అనడిగిన వారిద్దరి మాటలకు మొహాలు చూసుకున్నారు ఏం చేద్దామన్నట్లుగా!
చేయొచ్చు కాని, అంత ఈజీకాదు మేముగ్గురం ఇక్కడ ఇన్నేళ్లనుండి ఉద్యోగాల రీత్యా ఉంటున్నాము కాని ఇలా ఎప్పుడు వినలేదు. అన్నాడు రాంబాబు.
“అయినా మనం రైలెక్కితే ఏమి చేయగలం నడుచుకుంటూ విశాఖపట్నం రూటులో ఆ రైలు పట్టాలమ్మట వెడితే కనిపించొచ్చు ఒక పని చేద్దాము. మనకు వీలయినంత ప్రయత్నం మనం చేద్దాము కనిపించారా సాయం చేద్దాము లేదంటే వెనక్కొచ్చేద్దాము… గోపాల్ ప్రతిపాదన కి ఒకే అన్నారందరూ.
“రేపు బొర్రాకేవ్స్ చూడాలనుకున్నాము కదా అది మానేసి స్టేషన్ నుండి ఆ పట్టాలమ్మట వెడదామంటే అందరం పోదాము.వర్మ మాటకి అందరూ అంగీకరించారు.
కొండలకిందకి లోయల్లోకి దిగాలంటే త్రాళ్లు పెద్ద మేకులు వంటివి ఏవయినా స్నాక్స్ బిస్కెట్స్, వాటర్ లాంటివి తీసుకెళ్లాలి అనుకోగానే ఏదో ఎడ్వంచర్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతోంది అందరిలో ఏమేమి పట్టుకెళ్లాలో ఒక లిస్ట్ రాసుకున్నారు.ఉదయాన్నే రైల్వే స్టేషన్ కి వెళ్లాలి మనం వెళ్లేటప్పుడే మనకి కావల్సినవన్నీ తీసుకెళ్లాలి అని ఇలా రకరకాల ప్లానులేసుకుని ఆర్డర్ చేసిన ఫుడ్ లాగించి తమ రూముల్లోకి వచ్చేసారు.
నిద్రకు పక్రమించారు.=
తెల్లారి లేచి మొత్తం కొండలంతా పరచుకున్న మంచుతో ప్రక్రతి ఎంతందంగా ఉన్నా ఆ ఇద్దరు స్త్రీలే గుర్తొస్తున్నారు. అందరికీ
స్నానాలు టిఫిన్లు ముగించి అన్నీకొనుక్కుని అరకు స్టేషన్ కొచ్చేసరికి పదయ్యింది.
రైలు పట్టాలమ్మటే నడుచుకుంటూ మధ్యమధ్యలో ఆరారా స్నాక్స్ తింటూ వాటర్ త్రాగుతూ నడక మొదలుపెట్టారు. కాని టన్నెల్స్ వచ్చినదగ్గర, అగాధాల వంటి లోయల దగ్గర భయానికి కాళ్లు వొణికాయి
రాంబాబుకి వాళ్లని రక్షించడమేమో కాని తమకేమి ఆపద రాదు కదా! అన్న భయం కలిగింది.
అదే మెల్లగా గొణిగినా “ఒరేయి ఆపదలో ఉన్న ఆడాళ్లకి సహాయం చేయడానికి వెనుకాడతావేంట్రా! మగాడివికాదూ!
నీకొక్కడికే కాదు మా అందరికీ పెళ్లాలు పిల్లలున్నార్రా తండ్రీ! అని గేలి చేసి పడేసాడు ఆనంద్. మిగతావాళ్లు నవ్వులు
చేసేదిలేక వాళ్లని అనుసరించాడు రాంబాబు
అలా ఎన్నిమైళ్లు నడిచారో లెక్క తెలీలేదు చివరికి నాల్గు గంటలకి ఒక భయంకరమైన లోయ అక్కడికి రాగానే వాసూ “అదిగో చూడండర్రా మేము చెప్పామా! వాళ్లని చూడండి! ఎలా ఎలుగెత్తి పిలుస్తున్నారో! అనగానే ఉత్సుకత తో ఆ లోయలోకి చూపులుసారించిన ఆనంద్, రాంబాబు, గోపాల్ వర్మలకు ఇద్దరు స్త్రీలు నల్ల రుమాళ్లు ఊపుతూ “ప్లీజ్ కాపాడండి హెల్ప్ మి అనరుస్తున్నట్లు లోయలో ప్రతిధ్వనిస్తుంటే ఒళ్లంతా గగుర్పొడిచింది.
వెంటనే వాసు తన రుమాలును ఊపుతూ, “వస్తున్నాము మీకోసమే భయపడకండీ! అని అరిచిన అరుపు లోయలో ప్రతిధ్వనించింది. అతనిని చూసి మిగతావారు కూడా తమ రుమాళ్లు గాల్లోకి ఊపుతూ, అరుస్తుంటే ఆ స్త్రీలు నమస్కార ముద్ర తో “ధాంక్యూ! అని బదులిచ్చారు.
ఎక్కడినుండి దిగాలా! అని చుట్టుపక్కల పరికించి ఒక చెట్టుకి త్రాడుకట్టి ఆ త్రాడుకి మరిన్ని తాళ్లు జతపరిచి దాని ఆధారంతో దిగాలని నడుమ నడుమ ఆ త్రాడుని పెద్ద మేకులతో కొండభూమిలోకి దిగగొట్టాలని నిర్ణయించుకుని ఒకరొకరుగా అంచెంచెలుగా ఆ లోయలోకి దిగడానికి సాహసించారు.
చీకటి పడుతోంది ఎండ తగ్గి వాతావరణం చల్లగా మారుతోంది.
ఎప్పుడో కాలేజి రోజుల్లో ట్రెక్కింగ్ అనుభవాలని గుర్తు చేసుకుంటూ “సాహసం సేయరా డింభకా! అన్న నేపాళీ మాంత్రికుని మాటలు గుర్తు చేసుకుంటూ దిగడానికి ఉపక్రమించారు.
భయంతో ఉన్న రాంబాబుని ఉండిపొమ్మని వెనక్కి వెళ్లమన్నాడు వర్మ .కాని ఇంతవరకు వచ్చాక మీతోనే నేను అనుకుని మీ మధ్యలో ఉంటాను అని వర్మ ఆనంద్ దిగటం ప్రారంబించాక, తను దిగడం మొదలెట్టాడు.
మేమంతా మీకోసం ఎంతో శ్రమపడి ఇక్కడికి వచ్చాము. అని అతివినయంగా చెప్తున్న గోపాల్ మాటలు విని , మాకు తెలుసు మీరొస్తారని అందుకే ఇక్కడే ఎదురుచూస్తున్నాము.
మాకోసం వచ్చిన మీకు మర్యాద చేయడం మా బాద్యత రండి రండి దయ చేయండి! తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ అని పాడుతూ, గాల్లో చేయూపింది.
అక్కడ అప్పటికప్పుడు నాలుగు సోఫాలు కుర్చీలు ఏర్పడటం చూసి పైప్రాణాలు పైనే పోయాయి.భయంతో వణుకుతున్న రాంబాబుకి స్ప్రహ పోయింది..
“ఇప్పుడు నేను! నంది కొండ వాగుల్లో నల్లతుమ్మ చెట్టు నీడలో నీకై నేనుంటా అని పాడుతూ, బేబీ హుషారుగా గాల్లో రెండు చేతులు ఊపింది దడదడమంటూ పైనుండి రకరకాల పళ్లు అందరినెత్తిన పడేసరికి హడిలిపోయారు.
గుమ్మడి పండు గోపాల్ నెత్తిమీద, పుచ్చపండు వర్మ నెత్తిమీద , పడేసరికి, కళ్లు బైర్లు కమ్మి “వీళ్లు దెయ్యాలేరాబాబోయ్! అంటూ నేల మీదకు వాలిపోయారు.
వాసూ తమ మిత్రుల దుస్తితి చూసి చేతులు జోడించి “మీకు పుణ్యముంటాది ! మమ్మల్ని వదిలి పొండమ్మా! అనిభోరుమన్నాడు.
ఆనంద్ “ఎందుకమ్మా! ఇలా ! మమ్మల్ని కాల్చుకు తింటున్నారు. అనేసరికి
“ఛీ నాకు వీళ్లెవరూ నచ్చలేదు మమ్మీ! పిరికి మొహాలు! మాట్లాడితే ఏడుస్తారు. కళ్లు తేలేస్తారు. ఛీ నాకు బోర్
బోర్ ! అని ఒక్కెగురు ఎగిరింది.
“ఉండవే బేబీ నేనూ వస్తాను! పిరికి సన్నాసులు వీళ్లెందుకూ! ఇంకెవరయినా వస్తారేమో చూద్దాము . అని ఒక్కుదుటన పైకెగరగానే ఆనంద్, వాసూ , అదురుపాటుతో నేల మీదే కూలబడ్డారు.
అక్కడున్న సోఫాలు కుర్చీలు అన్నీ మాయం! ఒకనిముషం తర్వాత మెల్లగా తేరుకుని
“హమ్మయ్య! పోయాయిరా బాబూ ముదనష్టపు దయ్యాలు ఇలాఇరుక్కున్నావేమిట్రా బాబూ ! తెల్లారగానే వెళ్లిపోవాలి దేముడా ! అని అంటున్న వాసూని, ఉద్దేశ్యించి
” ముందు వాళ్లని లేపాలిరా బాబూ! ఇక్కడినుండి వెంటనే వెళ్లిపోవాలి.” అంటూ వాచ్ చూసేసరికి అయిదవుతోంది.
“ఒరేయి లేవండర్రా బాబూ ! వెళ్లిపోదాము అంటూ వాటర్ బాటిల్ లో మిగిలిన నీళ్లు చిలకరించి ఒక్కొక్కరిని కూర్చోపెట్టారు.
వాళ్లకు స్ప్రహ వచ్చినా బెదురు పోలేదు .
“ఒరేయి! మనమింకా బ్రతికున్నామా ! చచ్చిపోయామనుకున్నారా! అనవసరంగా వచ్చామురా” అని రాంబాబు ఏడుపు “ఊర్కోరా ! అని అందరూసముదాయిస్తుండగా లేలేత కిరణాలు తో ఆకాశం ఎర్రబడి తెలవారుతున్న వేళ అడవంతా దద్దరిల్లిపోయేంత నవ్వులు. వినిపించగానే అందరూ అదిరిపడ్డారు.
“మనలని కాపాడటానికి వచ్చారటే ! ఈ పిరికి సన్నాసులు “ఆడాళ్లు కదా అనుకుని ఎగిరొచ్చారు.ఇప్పుడు మనం పోనీయం కదా! “అని వినిపించి ” హమ్మో అనుకుంటూ ఎక్కడనుండా? అని హడిలిపోతో చూస్తున్న ఆ మిత్రులకి తాము అష్టకష్టాలు పడి దిగివచ్చిన కొండ అంచుమీద కూర్చుని జుట్టు విరబోసుకుని తమని చూసి వికటంగా నవ్వుతూ , కాళ్లూపుతూ ఉన్న ఆ తల్లీకూతుళ్లు కన్పించారు.అది చూస్తూనే కళ్లు తిరిగాయి.అందరికీ
కాళ్లూ చేతులు ఆడలేదు.
ఆనంద్ కి వణుకొచ్చింది. తామిక్కడే ఇలా ఉండిపోతే తమ కుటుంబాల గతి ఏమిటనే భయం నిలువెల్లా పాకింది.మొక్కవోని విశ్వాసంతో దేముని మీద భారమేసి, చిన్నప్పటినుండి అలవాటయిన శ్రీరామ రక్షా స్త్రోత్రం గడగడా గట్టిగా చదవడం ఆరంభించాడు.
అంతే! ఆ కొండ అంచునున్న తల్లీ కూతుళ్లిద్దరూ కెవ్వున కేకలేసుకుంటూ గగనాల అంచులో కలిసి పోయారు. తిమిరాన్ని జయించిన వెలుగురేఖలు ఆ పరిసరాలను వేయి కాంతులుగా ప్రసరించాయి. ఆవెలుగులో ముక్కుమొహం తెలీనివారి కోసం ఉపకారాలు చేయడానికొచ్చి అపాయంలో పడ్డ ఆ మిత్రులందరూ “బ్రతుకు జీవుడా” అనుకుని కొండ ఎక్కడం మొదలుపెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *