March 28, 2024

మధ్యమహేశ్వర్

రచన: కర్రా నాగలక్ష్మి

ఓఖిమఠ్ మఠ్ నుంచి కారులో సుమారు 18 కిలో మీటర్లు ప్రయాణించిన తరువాత ‘ ఉనియాన ‘ గ్రామం చేరేం. అక్కడ రాత్రి చిన్న గదిలో బసచేసుకొని మరునాడు పొద్దున్నే మధ్యమహేశ్వర్ వెళ్లాలనేది మా సంకల్పం. ఎందుకంటే పొద్దున్నే బయలుదేరితే రాత్రికి మధ్యమహేశ్వర్ లో బసచేసుకొని, మరునాడు పొద్దుట తిరిగి బయలుదేరి ఉనియానా చేరాలనేది మా ఆలోచన. రాత్రి మా బస యజమానిని మధ్యమహేశ్వర్ దారి యెలావుంటుంది వగైరా వివరాలు అడిగేం. పొద్దున్నే మరో రెండుకిలోమీటర్ల ప్రయాణం చేస్తే కొండ మొదలవుతుందని అంతవరకు కారులో వెళ్లవచ్చని తొమ్మిది లోపున అక్కడకి వెళితే గుర్రాలు దొరకవచ్చని, తరవాత గుర్రాలను మట్టిపనికి తీసుకువెళతారని, యాత్రీకులు యెక్కువగా వుండరు కాబట్టి సౌకర్యాలు యేమీ వుండవని చెప్పేరు.
మరునాడు పొద్దున్నే మేం నడక దారి మొదలయిన ప్రాంతానికి చేరుకున్నాం. మా అదృష్టం బాగుండి గుర్రాలు దొరికేయి, మొత్తం రానుపోను 38 కిలో మీటర్లు గుర్రాలమీద ప్రయాణించాలి. సాహసమే పంచకేదారాలు చూద్దాం అనుకున్నప్పుడు తప్పదుకదా ?.
ఓ జత బట్టలు బిస్కెట్స్ పెట్టుకున్న చిన్న చేతి సంచులు గుర్రం యజమాని పట్టుకోగా మేం గుర్రాలమీద జాగ్రత్తగా కూర్చొని ప్రయాణం సాగించేం. సుమారు 11,400 అడుగుల యెత్తున వున్న మందిరం చేరాలి, సుమారు ఓ కిలోమీటరు తప్ప అంతా యెక్కడమే.
ఈదారి కూడా కేదార్ దారిలాగే అంతా కొండలే కాకపోతే కేదార్ కి యాత్రీకుల రద్దీ యెక్కువ వుండడం వల్ల ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాత్ర మొదలయే సమయానికి రోడ్డు విశాలంగా చేసి రాకపోకలు సులువుగా జరిగేటట్లు అన్ని యేర్పాట్లూ చేస్తారు. కాని తుంగనాధ్ మధ్య మహేశ్వర్ వీటికి మొత్తం యాత్ర సీజన్లతో కలిపి సుమారు యాభై మంది రావడం కూడా గొప్పే అది యీ మధ్య చాలామంది వేసవిలో ట్రెక్కింగ్ చేస్తూ వుండడం వల్ల యీ పాటిగా వస్తున్నారు, దారంతా పెద్ద పెద్ద రాళ్లు పడి వాటిని దాటేటప్పుడు గుర్రం కాలు జారితే మా గుండె జారేది. భయం పోగొట్టుకోడానికి గట్టిగా నా కొచ్చిన స్తోత్రాలు చదువుకోడం, పళ్లు కరచుకునేంత భయం కలిగితే ‘ నమశ్సివాయ ‘ అని గొణుక్కోవడం చేస్తూ మూడు కిలోమీటర్లు ప్రయాణించేం. నడ్డి విరిగినంత నొప్పి అనిపించింది, ఉనియాన పేరుకు వూరేగాని ఒక్క యిల్లు, నాలుగు గదులు వరుసగా రోడ్డు పైకి కట్టి వున్నాయి అది తప్ప మరేమీ లేదు, తినడానికి మధ్యాహ్నం రాత్రి రొట్టి తప్ప మరేమీ దొరకదు, పొద్దున టీ కూడా దొరకని ప్రదేశం కావడం వల్ల మాకు కడుపులో యెలకల గోల మొదలయింది. గుర్రాలబ్బాయితో యెక్కడైనా టీ దొరికే చోట ఆపమని చెప్పేం. ‘ రాన్సి ‘ గ్రామం లో టీ దొరుకుతుందని చెప్పేడు. ఒకే ఒక రేకు గది వున్న ప్రదేశం దగ్గర ఆపి యిదే రాన్సి గ్రామం అన్నాడు. ఆ షెడ్డులో అప్పటికే ఓ బెంగాలీ జంట మా వయసువారే బస చేసి వున్నారు. ఓ పక్కగా కర్రల పొయ్య, దానిమీద టీ పెట్టి మాకు యిచ్చేడు. ఆ బెంగాలీ దంపతులు నడిచి మధ్య మహేశ్వర్ వెళ్లి వస్తారట, ఆ రోజు అక్కడ బస చేసి మరునాడు తిరిగి బయలుదేరి యెక్కడ కష్టమనిపిస్తే అక్కడ బస చేసుకుంటూ వెళ్తారట, టీ తాగడం అవగానే అక్కడ నుంచి బయలుదేరేం.

అక్కడ నుండి మరో రెండు కిలోమీటర్ల తర్వాత నాలుగిళ్లున్న వూరు వచ్చింది అక్కడ మాకు ‘ మేగీ ‘ వేడివేడిగా చేసి పెట్టేరు. అది తిన్న తరువాత మాకు కాస్త ఉత్సాహం వచ్చింది. మరో నాలుగు కిలో మీటర్ల తరువాత ‘ గౌధర ‘చేరుకున్నాం, యిక్కడ రాత్రి బస చెయ్యడానికి మూడు నాలుగు గదులున్నాయి. ఇది దాటితే మరెక్కడా బస చేసే వీలులేదు. బసలంటే వాళ్లుంటున్న గదిలోని ఓ మూల పక్క వేసి రజ్జాయిలు యిస్తారు. ఆ రజ్జాయిలు కొన్న తరువాత ఒక్క వుతుకుకీ నోచుకోనివి, ఓ మారు యెప్పుడైనా సన్నని యెంత పొడ వస్తే మాత్రం యెండలో వేస్తారు. కాబట్టి ఉత్తరాఖండ్ యాత్రలకు వెళ్లేవారు వారి సామానులతో పాటు రెండు దుప్పట్లుకూడా సర్దుకుంటే మంచం మీద వేసుకోడానికి ఒకటి రజ్జాయికింద అంటే మన శరీరానికి ఆనేది మన దుప్పటి అయితే సగం చర్మరోగాలను అరికట్టగలం, యేమంటారు ?.
అదే సుమారు ఆప్రాంతాలకు ఆఖరు జనావాసాల గ్రామం. ఈ కొండలలో వున్న వారు వారికి కావలసిన ధాన్యం, కూరగాయలు కొండచరియలలో పండించుకుంటూ, మేకలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు, ముఖ్యాంగా వీరు శాఖాహారులు. గౌధర్కి ఓకిలోమీటరు దూరంలో ‘ బంతోలి ‘ అనే గ్రామం, జనావాసాలు లేని వాటిని గ్రామం అనొచ్చా ? యేమో, మన సౌకర్యం కోసం ప్రదేశం అందాం , యీ బంతోలీ అనే చోట మధ్యమహేశ్వర్ గంగ, మర్కన గంగ సంగమంచే ప్రదేశం. ఆ సంగమం చూసుకొని ముందుకు ప్రయాణించసాగేం. ఒకరో యిద్దరో ట్రెక్కర్లు తప్ప వేరే యెవ్వరూ లేరు. మా పుణ్యం బాగుంది వర్షం పడలేదు. పచ్చని చెట్లమధ్య నుంచి చల్లగాలి శరీరానికి తగులుతూ సేదదీరుస్తూ వుంది. అడవి లోంచి వీస్తున్నగాలి యెవేవో వాసనలను మోసుకు వస్తోంది. కలుషితం కాని గాలి పీలుస్తూ సాగింది మా ప్రయాణం సాయంత్రం అయిదింటికి మధ్యమహేశ్వర్ చేరుకున్నాం.
మందిర ట్రస్టు వారి ఆధ్వైర్యం లో నడపబడుతున్న నాలుగు గదులు మాత్రం వున్నాయి, సంతోషం యేమిటంటే ఎటాచ్డ బాత్రూము వుంది నీటి సదుపాయం వుంది కరెంటులేదు. ఒకచిన్న పాక హొటలు ట్రస్ట్ మెంబరుదే వుంది, అక్కడ దొరికిన టీ అని పిలువబడ్డ వేడినీళ్లు తాగి గది తాళం తీసుకొని దర్శనానికి వెళ్లేం, ఆరున్నరకి శయన హారతి అప్పుడు రండి అన్న పూజారిగారి మాటతో మళ్లా మా రూముకి వచ్చేం, పక్క రూములో అప్పటికే నలుగురు ట్రెక్కర్స్ వున్నారు. వారు అప్పటికే డిన్నరు ముగించేరు, ఆరున్నరకి హోటలు మూసేస్తారు అని చెప్పేరు, మేం కూడా మా డిన్నరు కానిచ్చి మందిరంలో సాయంత్రాలు పూజా విధులు చూడ్డానికి వెళ్లేం. మందిరం చాలా పాత రాతికట్టడం, కేదార్ మందిరాన్ని పోలి వుంది, యిక్కడ శివలింగం నాభిని పోలి వుంటుంది, బయట రెండు చిన్న మందిరాలలో ఒకటి పార్వతీ దేవికి, మరొకటి అర్ధనారీశ్వరులకి కట్టేరు, రాతి విగ్రహాలు వున్నాయి. ఈ మందిరం భీముడు స్వయంగా కట్టించినట్లు చెప్తారు. పక్కగా పాలరాయి సరస్వతీ దేవి విగ్రహం వుంది సరస్వతీ దేవి విగ్రహం కొత్తదనం, యీ మధ్యకాలంలో పెట్టినట్లుంది.
ఇక్కడ స్థలపురాణం చాలా మార్లు చెప్పిందే అయినా యీ సంచికను మాత్రమే చదివేవారికోసం మరోమారు చెప్తాను.
మహా భారత యుధ్దంలో పాండవులచే యెన్నోవేలమంది బ్రాహ్మణులు, గోత్రీకులు చంపబడతారు, ఆ పాప పరిహారం కొరకు కృష్ణుడి సలహా మేరకు శివుని పూజించుకోడానికి కేదార్ నాధ్ వైపుగా ప్రయాణిస్తారు. సగోత్రహత్య, బ్రహ్మహత్యలుచేసిన పాండవులపై కోపముతో వున్న శివుడు పాండవుల రాక తెలుసుకొని వారినుంచి పారిపోవాలనే తలంపుతో నంది రూపముదాల్చి పారిపోతాడు. శివుని కొరకై వెతుకుతున్న పాండవులకు శివుడు కనిపించకపోవడం తో శివుని వెతుకుతూ యీ కొండలలో సంచరిస్తూవుండగా గుప్తకాశివైపు పయనిస్తున్న నందిని భీముడు పోల్చుకొని తరుముతాడు, నంది రూపములలో వున్న శివుడు గుప్తకాశిలో పాతాళానికి పోతూవుండగా భీముడు నంది వెనుకకాళ్లను పట్టుకొని బయటకు లాగుతాడు, ఆ విసురుకు నంది అయిదు ఖండములయి అయిదు ప్రదేశాలలో పడింది ముఖం పడ్డభాగం ‘ రుద్రనాధ్ ‘, ముందుకాళ్లు పడ్డ ప్రదేశం ‘ తుంగనాధ ‘, మూపురం పడ్డప్రదేశం కేదార్ నాధ్, నాభి పొట్ట పడ్డ ప్రదేశం మధ్యమహేశ్వర్, వెనుకకాళ్లు తోక పడ్డ ప్రదేశం కల్పేశ్వర్ మహదేవ్. ఆ అయిదు ప్రదేశాలు పంచకేదారాలుగా ప్రసిధ్ది చెందేయి. పంచకేదారాలలో శివుని పూజించుకొని పాపవిముక్తులయిన పిమ్మట పాండవులు సర్గారోహణానికి వెళతారు.
ఈ ప్రాంతాలలో వున్న అన్ని శివమందిరాలలోనూ ఆది శంకరాచార్యులచే నియమించబడ్డ అతని శిష్యుల సంతతి వారు పూజారులుగా వున్నారు కాని యీ మందిరంలో కర్నాటక నుంచి వచ్చిన లింగధారులు ( జంగం ) పూజలు నిర్వహిస్తున్నారు. ఇతను బ్రహ్మచారి, అతనికి కేటాయించిన గదిలో వుంటూ, అతనే వండిన అన్నప్రసాదలు నివేదిస్తున్నారు.
సూర్యుడు పడమటలో కుంగే సరికి చలి విపరీతంగా పెరిగనారంభించింది , వున్న ఒక్క బడ్డీ హొటలు మూసేయగానే మేము మా పక్క గదిలో వున్న ట్రెక్కర్స్ తో బాతాఖానీ చెయ్యసాగేం. వారు మొత్తం యీ కొండలలో వున్న చార్ ధామ్ లే కాక మిగతా అన్ని శివకోవెలలూ చూసుకొని బదరీనాధ్ చేరుతారట, కొండలలో నడక దారి వేరుగా వుందట, అలా వారు సుమారు 20 రోజులు నడిచి బదరీనాధ్ చేరుతారట, కొండలలో మొత్తం 250 కిలోమీటర్లు నడుస్తారట. చాలా తొందరగా చీకటి పడ్డంతో చేసే పనేమీ లేక రూములోకి వెళుతూవుండగా మా కొత్త ఫ్రెండ్స నిద్రరాకపోయినా గదులోనే వుండండి గాని గదిబయటకు రావొద్దు కృూరమృగాలు తిరుగుతూ వుంటాయి అని హెచ్చరించేరు.
రూములోకి చేరగానే మంచి నిద్ర పట్టేసింది. ఆరుకు లేచి బయటకు వచ్చి చేస్తే చుట్టారా మంచు బిందువులతో మెరుస్తున్న గడ్డి, పొగమంచులో మసకమసకగా కనిపిస్తున్న కోవెల, చల్లగా వున్న వాతావరణం మరో లోకంలో వున్న అనుభూతినిచ్చింది.
మా ట్రెక్కర్లు అప్పటికే తయారయి నడక ప్రారంభించేరు. మేం వేడివేడి టీ చప్పరిస్తూ వారు యెక్కడకి వెళుతున్నారో అడిగేం, అక్కడకి మరో మూడు కిలో మీటర్లు పైకి వెళితే బూఢా మహదేవ్ కోవెల, చక్కని సరస్సు వున్నాయి వాటిని చూడ్డానికి వెళ్తున్నాం అన్నారు. అక్కడనుంచి చేస్తే చౌకంబా, నీలకంఠ్, కేదార్ శిఖరాలు అధ్బుతంగా కనిపిస్తాయని చెప్పి వాళ్లు బయలుదేరేరు.
ఆ శిఖరాలు మేమున్నచోటునుంచి కూడా బాగానే కనిపిస్తున్నాయి. చెప్పకపోడమేం గాని నాకు మనసు పీకింది, యెలాగోలా పడుతూ లేస్తూ వెళదాం అనిపించింది. గబగబా తయారయేం, యీ రెండు మందిరాలకు పూజారివొకరే, ఆయన రోజూ నడిచి వెళ్లి పూజలు నిర్వహించుకొస్తారట, మాకు రూములిచ్చిన మందిర ట్రస్టు మెంబరు మమ్మల్ని నిరుత్సాహ పరచడంతో మేము తయారయి మరో మారు మందిరం దర్శించుకొని చుట్టుపక్కల ఓ మారు నడిచి, ప్రకృతిని కళ్లలో దాచుకొని గుర్రాల కోసం యెదురు చూడసాగేం.
ఓ గంట ప్రకృతిని ఆస్వాదిస్తూ గడిపేక గుర్రాలతను వచ్చేడు. మరోమారు ఆ పరిసరాలను కళ్లనిండుగా చూసుకొని బయలుదేరేం. గుర్రాలతనితో పాటు మరోఅబ్బాయి ( స్థానికుడు ) కూడా నడుస్తూ కొండదిగసాగేడు.

ఉత్తరాంచల్ లోని మిగతా మందిరాలలాగా యీ మందిరం కూడా శీతాకాలంలో మూసెస్తారు. ఉత్సవవిగ్రహాన్ని ఓఖిమఠ్ లో వున్న ఉషామఠ్ లో నుంచి పూజలు చేస్తారు.
గుర్రాలమీద కూర్చొని కొండలు యెక్కడం యెంతకష్టమో దిగడం దానికి రెట్టింపు కష్టంగా వుంటుంది.
ముందురోజు ‘ మాగి ‘ తిన్నచోట భోజనం చేసుకున్నాం, అప్పుడు మాకు తెలిపిన విషయం మేమిటంటే ఉత్తరాఖంఢ్ లో వరన్నం మాత్రమే తింటారని, రోటీ చెయ్యడం రాదు అన్నం కావాలంటే వండుతానని అంటే మాకు ప్రాణం లేచొచ్చింది. పెరట్లో పండిన కాయగూరలుతో కూర, అన్నం, పప్పు, పెరుగు తో వడ్డించేరు. మనకి అంతకన్నా యింకేం కావాలి. తృప్తిగా భోజనం చేసి తిరిగి బయలు దేరేం.
సాయంత్రానికి కిందకి దిగిపోయేం. అయితే మాగుర్రాలబ్బాయితో పాటు వచ్చిన కుర్రాడు భుజం మీద మూట పట్టుకు మోస్తున్నాడు, రాత్రి చిరుత మేకలమందలో దూరి మేకను కొట్టిందట, యింట్లో వాళ్లు లేచి చిరుతను అదిలించడంతో చిరుతకు మేకను తీసుకుపోయే అవకాశం దొరకలేదు, యీ కొండలలో వారు శాఖాహారులవడంతో కుర్రాడు ఆ చచ్చిన మేకను మోసుకొని కిందకు వచ్చి ఉనియాన దగ్గర వున్న బజారులో యెక్కడో అమ్ముకొని మరునాడు తిరిగి యింటికి వెళతాడట.
ఈ అడవులలో చిరుతల సంచారం చాలా యెక్కువగా వుంటుందట, అది వినగానే మాకు కాస్త భయం అనిపించింది. అయితే మరో అద్భుతమైన యాత్రను చేసేమన్న తృప్తిముందు భయం పారిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *