April 20, 2024

మానవత్వమే మనిషితనానికి దిక్సూచి అని చెప్పిన కథలు – మాయాజలతారు

సమీక్ష: సి. ఉమాదేవి

రచయిత సలీంగారు జగమెరిగిన రచయిత. తన సాహితీ ప్రస్థానంలో ఎన్నో కథాసంపుటాలను, నవలలను, కవితాసంపుటాలను పాఠకులకందించారు. ప్రతి రచనలోను నేటి సామాజికాంశాలపై రచయిత మనసులోని అంతర్మథనం స్పష్టంగా గోచరిస్తుంది. వీరు అందుకున్న పురస్కారాలు, రచనలకు బహుమతులు వీరిలోని సాహితీ ప్రజ్ఞకు కొలమానాలని చెప్పవచ్చు. రచయితలోని అక్షర స్పందన పాఠకుడి ఆలోచనా వల్మీకాన్ని కదిలిస్తుంది. కథలు చదివాక అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. రచయితతోపాటు మనకు కూడా సమస్యలకు పరిష్కారాన్ని అందరికి తెలియచేయాలనే తపన మొదలవుతుంది. మరి అలాంటి కథలను తరచి చూడాల్సిందే.
కళ తప్పుతోంది కథ ఊహించని ముగింపుతో కలవరానికి గురిచేస్తుంది. ప్రాణస్నేహితుడైన సత్యమూర్తి స్నేహితుడైన రఫీని నాటకంలోని రాముడి పాత్రకు అంగీకరించకపోవడం రఫీనే కాదు పాఠకులను ఆశ్చర్యపరుస్తుంది. చిన్ననాడు రామలక్ష్మణులుగా ఎన్నో నాటకాలలో నటించిన ఇద్దరు రామలక్ష్మణులని అందరిచేత పిలిపించుకున్న వైనం కథ ప్రారంభాన్ని ఆహ్లాదంగా చూపినా చివరకు సత్యమూర్తిలో, బాల్యంలోని కల్మషంలేని ఆప్యాయత కనుమరుగైన తీరును తెలుసుకున్నప్పుడు కళలకు కూడా కులం, మతం, ప్రాంతీయ బేధాలు అడ్డుకట్టలవడం రఫీని కలవరపరుస్తుంది. అయితే కళలకు కాక కళాకారుల మనసులకు తుప్పుపట్టిందని మరో స్నేహితుడు సాయి కథ ముగింపులో పలకడం ఆలోచించవలసిన అంశమే. సాలభంజికలు మరో వినూత్నమైన కథ. భార్యాభర్తలిరువురి ఆలోచనాసరళి భిన్నమైనదే. పెళ్లికి బహుమతి కొనడంలో పెళ్లి జరుగుతున్న ఇంటివారి ఆర్థిక పరిస్థితికి తగినట్లు ఉండాలనేది భర్త ఆలోచన. అయితే తమ ఇంట పనిమనిషిగా తమకన్నిపనులు చక్కగా చేస్నున్న ఐలమ్మ ఇంట్లో ఆమె కూతురికి జరుగుతున్న పెళ్లికి తగిన సహాయం చేయాలనే భార్య. విభిన్న భావాల నడుమ తమని పెళ్లికి పిల్చిన బిల్డర్ ఏర్పాటు చేసిన కళ్యాణమంటపానికి ఇద్దరు చేరుకుంటారు. బహుమతిగా ఇరవై ఐదువేలు ఇవ్వాలనుకున్న భర్త ఆలోచనను మలుపుతిప్పిన ఘటన అక్కడ తటస్థపడుతుంది.
నలుగురమ్మాయిలను కదలని రాతిబొమ్మలలా నిలుచోబెట్టి వారి కష్టాన్ని గమనించని ఆర్భాటపు పెళ్లిలో తానుండలేనని భార్య వెనుతిరుగుతుంది. బహుమతి డబ్బునిచ్చి అక్షింతలు వేసి వస్తానన్న భర్తతో వారు ఖర్చు చేసిన కోట్లముందు పాతికవేలు పంటికిందకి కూడా ఆనవు అని చెప్పి డబ్బును ఐలమ్మకు ఇవ్వాలంటుంది. భార్య ఆవేదనను భర్త అర్థం చేసుకోవడం కథకు చక్కటి మలుపవుతుంది.
అలజడి కథ నేటి సమాజతీరుతెన్నులకు అద్ధంపట్టి చూపింది. అవినీతి సొమ్మును కార్యాలయంలో అందరు పంచుకున్నా ఆ సొమ్మును అతడికి వాటాగా ఇచ్చినపుడు వద్దంటాడు ఆ ఆఫీసులో పనిచేసే ప్యూను మోజెస్. జీతంతోపాటు గీతం కూడా సహజమే అని నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తాడు ఆ ఆఫీసు సూపరింటెండెంట్ చక్రపాణి. మోజెస్ స్థితిగతులను తెలుసుకోవాలంటూ మిగతావారికి చెప్తాడు. చక్రపాణి పెళ్లికి వెళ్తాడు. మోజెస్ చెప్పినట్లు తనను , తల్లిని తీసుకెళ్లడానికి బ్యాటరీ కారు వస్తుంది. ఆ కారు నడిపే వ్యక్తి సైతం చక్రపాణి దగ్గర డబ్బులు తీసుకోడు. నేను చేస్తున్నపనికి నాకు జీతం అందుతోంది. మీ దగ్గర ఏమి తీసుకున్నా యాచన క్రిందకే వస్తుందనడం చక్రపాణిలో అలజడిని రేకెత్తిస్తుంది. ఆఫీసుకు చేరాక అవినీతి డబ్బును ముట్టుకోవడం మానేస్తాడు. అతడు దర్పంగా కూర్చోవడం మోజెస్ గమనించడం కథకందిన చక్కని ముగింపు.
మాయజలతారు సమాజంలో జరుగుతున్న విపరీతధోరణిని పాఠకులు సైతం ఔరా అనుకునేలా చదివించిన అద్భుతమైన కథ. ఇక ప్రయాణం కథ ఎవరికైనా ఆచరించదగ్గ నీతిపాఠమే. సివిల్ సర్వీస్ పరీక్షలు వ్రాసి రైల్వే సర్వీస్ కు ఎన్నిక కాబడ్డ కొడుకును తనతోపాటు నాన్ ఏసీ బోగీలో ప్రయాణం చేయించిన తండ్రి పేద ప్రయాణీకులకు లేని సౌకర్యాలను, వారి అవస్థలను కొడుకు దృష్టికి తీసుకుని వస్తాడు. తండ్రి ఉదాత్తమైన కోరికను గుర్తుపెట్టుకుంటానని కొడుకు తండ్రి చేతిలో చేయి వేసి ప్రమాణం చేయడం ప్రయాణం కథకు చక్కని ముగింపు.
మరణం మనిషికి చివరి మజిలీ. అయితే మారుతున్న వ్యవస్థలో పేదవాడికి, ధనికుడికి నడుమ గీయబడ్డ గీత కడకు సమాధుల్నిసైతం ఆర్భాటంగా కొనుక్కునే వారికి ప్రత్యేకంగా కేటాయించడం వ్యాపారానికి మరణంకూడా వినియోగపడుతోందే అనే బాధ మనసును కల్లోలపరుస్తుంది.
శాశ్వతనిద్రను గురించిన భయం మనిషికి సహజ నిద్రను దూరం చేస్తుంది. అయితే అందరిలోను ఈ భయం ఉండదు. సున్నితమైన ఆలోచనలతో అడుగడునా మరణం గురించి ఉలిక్కిపడే వారికది నిత్య గరళమే. బతుకొక పండుగ కథలో మనిషి మనసును పసిపాపలా భద్రంగా కాపాడుకుంటే ఏ భయాలు దరిచేరవంటారు. జీవితంలోని ప్రతి క్షణాన్ని వసంతంతో నింపాక శిశిరానికి అవకాశమెక్కడుంటుంది అని వారు రూపొందించిన పాత్ర ద్వారా వినిపించడం పాఠకులకు అందించిన సుగంధ పరిమళమే కదా!ఇటువంటి మరెన్నో చక్కని కథలున్న మాయజలతారు కథాసంపుటం అందించిన సలీంగారికి అభినందనలు.

1 thought on “మానవత్వమే మనిషితనానికి దిక్సూచి అని చెప్పిన కథలు – మాయాజలతారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *