April 20, 2024

శివ ఖోడి ( గుహ )

రచన: కర్రానాగలక్ష్మి

భక్తునికి భయపడి గుహలో దాక్కున్న శివుడి గురించి విన్నారా?. ఎవరైనా శతృవుకి భయ పడతారు కాని భక్తుడికి భయపడడమా? అదీ ముల్లోకాలను కాపాడే పరమ శివుడు భక్తునికి భయపడి గుహలో దాక్కోడమా?, అదెలా జరిగింది, ఎక్కడ జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం యెందుకు పూర్తిగా యీ వ్యాసం చదవండి. మీకే తెలుస్తుంది.


ఉత్తర భారత రాష్ట్రమైన జమ్మూ కశ్మీరులో జమ్మూ నగరానికి 110 కిమీ..దూరంలో, ‘ రియాసి’ జిల్లాలలో వున్న ‘ రంసూ’ గ్రామానికి సుమారు 3 లేక 4 కిమీ కొండదారిలో నడిచి వెళ్తే యీ గుహాలయం చేరుకోవచ్చు. కశ్మీరిలో ‘ఖోడి’ అంటే గుహ అని అర్ధం. శివుడు వున్న గుహ అని అర్ధం.
జమ్మూ నుంచి యీ గుహాలయం చేరుకోడానికి రెండు దారులు వున్నాయి. మొదటిది అష్ఠాదశ పిఠాలలొ ముఖ్యమైన వైష్ణవదేవికి ట్రెక్ మొదలయ్యే కట్రా టౌన్ మీదుగా, రెండవది జమ్మూ ‘అఖ్ నూర్ ‘ మీదుగా ‘రాజోరి’ వెళ్ళే దారిలో ‘ఖండా మోర్హా ‘ జంక్షన్ నుంచి 6 కిమీ ప్రయాణం చేస్తే ‘ రంసూ ‘ గ్రామం చేరుకోవచ్చు.
వైష్ణవదేవి కోవెల ట్రష్టు వారు యీ కోవెల మేనేజ్ మెంటు కూడా తీసుకొని రోడ్డులు, భోజన సదుపాయాలు, వసతులు యాత్రీకులకు అందుబాటులోకి తెస్తున్నారు. వైష్ణవ దేవి యాత్రీకులు యీ గుహాలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. ‘ కట్ర’ బస్ స్టాండు నుంచి బస్సు, టాక్సీ సదుపాయాలు వున్నాయి.
‘ కట్ర’ నుంచి ‘రంసూ’ కి 70 కిమీ ఘాట్ రోడ్డు ప్రయాణం. నాకు ఘాట్ రోడ్డు ప్రయాణం అంటే చాలా యిష్థమ్. కొండల మీంచి దూకుతూ, దుముకుతూ ప్రవహించే సెలయేళ్లు, వో పక్క కిందుగా లోయలో ప్రవహించే నదులు, మరో పక్క యెత్తుగా గర్వంగా మేమెవ్వరికీ అందం అంటున్నట్టు వున్న పర్వతాలు చూడ్డం ఎంతో బావుంటుంది.
జమ్మూలో ఎండలు ఎక్కువగా వున్నా ‘ కట్ర’ దగ్గర నుంచి వాతావరణం చల్లగా మారిపోతుంది. ప్రకృతిని ఆస్వాదిస్తూ, విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ ప్రయాణం సాగించేము. యెందుకంటే శివ పంచాక్షరి తప్ప శివ స్తోత్రాలు రావు. శివాయ విష్ణు రూపాయ అని అనుకుంటూ చెంపలు వాయించుకొన్నాం. దారిలో చిన్న చిన్న గ్రామాలు 2, 3 దాటేక బాబా ధన్సర్ అనే చిన్న గుహాలయం చూసేం. ఆ గుహలో ధన్సర్ అనే సన్యాసి తపస్సు చేసుకొన్న ప్రదేశంగా స్తానికులు చెప్పేరు. యిక్కడ పై నించి సన్నని ధారలుగా నీరు పడుతూ రాళ్ల పైన ఏర్పడుతున్న ఆకారాలు వున్నాయి. అది చూసుకొని తిరిగి మా ప్రయాణం కొనసాగించేం.

రంసూ కూడా చిన్న గ్రామం. అక్కడ నుంచి గుహ వరకు నడక దారి. గత కొద్ది సంవత్సరాలుగా యాత్రికులు రావడంతో ఇప్పుడిప్పుడే మందిర్ ట్రస్ట్ వారు యాత్రికుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా యాత్రీకులను కోవెల వరకు తీసుకు వెళ్లేందుకు గుర్రాలు, డోలీలు దొరుకుతున్నాయి. యింకా రోడ్డు వెయ్యవలసి వుంది. యాత్రికుల వసతి భోజన సదుపాయాలూ కుడా ఏమి లేవు.
సుమారు 3, 4 కిమీ.. గుర్రం మీద ప్రయాణం తరువాత మెట్ల దారి, మాలాగే వైష్ణవి దేవిని దర్శించుకున్న యాత్రీకులు శివఖోడి ని దర్శించు కోవడంతో యిక్కడ కుడా భక్తుల తాకిడి ఎక్కువగా వుంటోంది.
మెట్లు ఎక్కి గుహ లోపలకి చేరుకున్నాం, గుహ లోపల సుమారు 300 మంది పట్టేంత పెద్దదిగా వుంటుంది. అక్కడ నుంచి లోపలి ముణుకుల పైన పాక్కుంటూ వెళ్ళవలసి వుంటుంది. కొన్ని చోట్లు పాములా అంటే పొట్ట నెలకు ఆనించి పాక వలసి వుంటుంది. అలా పాక్కుంటూ వెళ్ళేక నిలబడ గలిగేంత వెడల్పు అవుతుంది గుహ. యింక అక్కడంతా అద్భుతమే, పార్వతి, వినాయకుడు, నారదుడు, శివుని ఝటాఝూటం, పద్మం యిలా దేవిదేవతా మూర్తులు ప్రాకృతికంగా యేర్పడ్డాయి. వాటిని చూస్తువుంటే మనలో భక్తి పారవశ్యం కలుగక మానదు. తలెత్తి పైన వున్న కొండని అంటే చెయ్యెత్తితే అందేంత యెత్తులో వుంటుంది, అక్కడ మరింత అద్భుతంగా యేర్పడ్డ ఆది శేషుని చూడొచ్చు. లోపల కొంతదూరం వెళ్ళేక దారి రెండుగా చీలుతుంది. అక్కడ వున్న సెక్యూరిటీవారు ఆ దారిలోకి వెళ్లనివ్వక యాత్రీకులను రెండో దారిలోంచి పంపుతున్నారు. 200 మీటర్ల పొడవు, 3 మీటర్ల యెత్తు, ఒక మీటరు వెడల్పు వున్న యీ గుహలలోకి శ్వాశ సంబంధ రుగ్మతలు వున్నవాళ్ళు ఆక్సిజెన్ సిలిండర్ తీసుకు వెళ్లాలనేది డాక్టర్ల సలహా. లోపల నాలుగు అడుగుల యెత్తున్న స్వయంభూ శివలింగం నిరంతరం శివలింగాన్ని అభిషేకిస్తున్న ప్రాకృతికమైన పాల రంగులో వుండే జల వూట మనస్సుని భక్తి పారవశ్యంలో ముంచేస్తుంది. దర్శనానతరం అక్కడ పూజాదులు నిర్వహిస్తున్న సాధువులను స్థలపురాణం అడుగగా వారు చెప్పిన కధ యిది —

భస్మాసురుడు అనే రాక్షసుడు, పరమ శివ భక్తుడు, దేవతలపై విజయం సాధించాలనే కోరికతో తనకి మరణం లేకుండా వుండేటట్లు వరం పొందాలని శివుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపశ్శక్తి కి ముల్లోకాలు అల్లకల్లోలమై కంపించసాగేయి. ఆ ప్రకంపనలు శివ నివాసమైన కైలాసాన్ని కుడా భయభ్రాంతులకు గురి చేస్తుంది. శివుడు భస్మాసురుని తపస్సుకు మెచ్చి, భస్మాసురుని వద్దకు వెళ్లి వత్సా నీ కోరిక ఏమిటని అడుగగా, తనకు మృత్యువు లేకుండునట్లు వరమిమ్మని భస్మాసురుడు కోరుతాడు, మరణం లేకుండా ఉండేటట్లు వరమివ్వుటకొరకు తాను ఆశక్తుడనని శివుడు మరేదైనా వరం కోరుకోమని అంటాడు. దానికి భస్మాసురుడు తాను యెవరి తలపై చెయ్యి పెడితే వారు భస్మం అయేటట్లు వరం అనుగ్రహించమంటాడు . శివుడు భస్మాసురుని కోరిక తీరుస్తాడు. భస్మాసురుడు శివుడు యిచ్చిన వరప్రభావాన్ని శివుని పైనే ప్రయోగించి చూడాలనే తలంపుతో శివుని తలపై చెయ్యిపెట్టడానికి శివుని వెంట పడతాడు. శివుడు భస్మాసురుని తప్పించుకొని పారిపోతూ విష్ణుమూర్తిని రక్షించమని వేడుకుంటాడు. భస్మాసురుడు శివుని తరుముతూ వుంటాడు. మూర్ఖులకు వినాశకారకమైన వరాలు అనుగ్రహించకూడదు అని తెలుసుకొన్న శివుడు యీ గుహలో దాక్కుంటాడు. శివుడిని తరుముతూ గుహ వైపు వస్తున్న భస్మాసురుని మోహినీ రూపంలో వున్న విష్ణుమూర్తి అడ్డుకుంటాడు. మెహినీ రూపానికి ఆకర్షితుడైన భస్మాసురుడు తనను పెండ్లాడమని మోహినిని కోరుతాడు. దానికి మోహిని తనతో సమానముగా నర్తించిన వారినే తాను పరిణయమాడుతానని అంటుంది. అందుకు సమ్మతించిన భస్మాసురుడు మోహిని నర్తించినట్లే నర్తించి తన వర ప్రభావమును మరచి మోహిని చూపిన భంగిమను నటిస్తూ తన తలపైన చేయ్యిపెట్టుకొని భస్మమౌతాడు.
యిలా శివుడు భక్తునికి భయపడి యీ గుహలో దాక్కున్నాడట. యిదీ యిక్కడి స్థల పురాణం.
కాలాంతరాన వో గొర్రెల కాపరి తప్పి పోయిన గొర్రెను వెదుకుతూ యీ గుహలోకి వచ్చి యిక్కడ తపస్సు చేసుకుంటున్న సాధువులను చూచి అతను కూడా శివభక్తుడిగా మారి, అతను కూడా అక్కడే వుండి తపస్సు చేసుకుంటూ ఆ గుహలోనే వుండిపోతాడు. కొన్నేళ్ళ తరువాత యింటి పైకి మనసు పోగా తపస్సు చాలించి యింటికి వెళ్లదలుచుకుంటాడు. అప్పుడు అక్కడ తపస్సు చేసుకుంటున్న సాధువులు శివుడు స్వయంభూగా వున్న యీ ప్రదేశం గురించి యెవరికి తెలియనివ్వవద్దని అతని వద్ద మాట తీసుకుంటారు, మాట మీరితే అతనికి మరణం సంభవిస్తుందని చెప్తారు.
కాపరి పుట్టుకతో ముస్లిం. అతను శివభక్తుడుగా మారడం నచ్చని అతని యింటివారు కారణం అడుగగా అతను శివదర్శనం అయినట్లు మాత్రమే చెప్తాడు. పశువులకాపరి బంధువులు కూడా శివదర్శనం చెయ్యదలచి ఆ ప్రదేశమునకు తమని కూడా తీసుకుపొమ్మని వత్తిడి తెస్తారు. వారి వత్తిడికి తలవొగ్గి కాపరి వారిని గుహవద్దకు తీసుకొని వెళ్తాడు, మాట తప్పినందుకు గుహ చేరగానే కాపరి మరణిస్తాడు. యిప్పుడు కూడా యిక్కడ తపస్సు చేసుకుంటూ సాధువులు కనిపిస్తూ వుంటారు.
ఎక్కడైతే సెక్యూరిటీ వారు వెళ్లనివ్వని దారి గురించి సాధువుగారిని అడుగగా ఆ గుహదారి అమర్ నాథ్ గుహకి కలిసి ఉంటుందని, అషాఢ పౌర్ణమి నుంచి శ్రావణ పౌర్ణిమ వరకు జరిగే అమర్ నాథ్ యాత్ర సమయంలో అమర్ నాథ్ గుహలో పుజలందుకొనే శివుడు మిగతా సమయంలో యీ గుహలో యోగ సమాధిలో వుంటాడని స్థానికుల నమ్మకం. అందుకే యీ క్షేత్రాన్ని ” బూఢా అమర్నాథ్ ” అని కూడా పిలుస్తారు. అమర్ నాధ్ లో లాగే యిక్కడ కూడా పావురాన్ని దర్శించుకుంటే పుణ్యం వస్తుంది అని భక్తుల నమ్మకం. కొన్ని సంవత్సరాల క్రిందట యీ గుహ మార్గం మధ్యలో కూలిపోయిందని యిప్పుడు అక్కడనుంచి ప్రవేశం రద్దు చేసేరు.

గుహలోంచి బయటికి వచ్చేక మా మనస్సులు భక్తి పారవశ్యంతో నిండిపోయేయి. జాగ్రత్తగా లోయలోకి దిగి అక్కడ పాల వలే తెల్లగా స్వచ్చంగా ప్రవహిస్తున్న ‘ దూధ్ గంగ ‘ నీళ్లు తలపై జల్లుకొని తిరుగు ప్రయాణం అయ్యేం.
మా గుర్రాల యజమాని బలవంతం మేరకు ప్రభుత్వం వారి డాక్ బంగ్లాకి చేరుకున్నాం. విశ్రాంతి తీసుకోడానికి కాదు. గుర్రాల వాళ్లు అద్భుతం చూపిస్తామంటే డబ్బులు ఎక్కువ వసూలు చేసేందుకు అలా మమ్మల్ని మభ్య పెడుతున్నారనే అనుమానం. వారున్న స్థితికి మరో 50/ యిచ్చినా మనకేమీ నష్ఠమ్ లేదు. యింతకీ వాళ్లు డబ్బుల గురించి మాట్లాడనేలేదు. అక్కడకి చేరుకున్న తరువాత మా అనుమానాలు పటాపంచలయేయి. మా కళ్లు మహాద్భుతాన్ని చూసేయి. అదే “దూధ్ గంగ” పుట్టిన చోటు. భూమి లోపల నుంచి వురుకుతూ తెల్లని నురుగుతో పెద్ద హోరుతో వస్తున్న ” దూధ్ గంగ”. నోట మాట లేకుండా వుండిపోయేము. ఇలాంటి అద్భుతాన్ని మరెక్కడా చూడలేదు. గుర్రాల వాళ్లకి మా సంతోషం 100/ చొప్పున యిచ్చి తెలియజేసేం.
అద్భుతాలు, ఆహ్లాదాలు, ఆనందాలు మూట కట్టుకొని తిరుగు ప్రయాణం యేం. వీలు చేసుకొని మీరూ యివన్నీ దర్శించుకొని ఆనందించం.

1 thought on “శివ ఖోడి ( గుహ )

  1. అపూర్వ విశేషాలను తెలియపర్చినందుకు ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *