April 24, 2024

మనసు పలికిన ఆత్మీయతా తరంగం

సమీక్ష: సి.ఉమాదేవి

 

 

రచయిత్రి రజనీ సుబ్రహ్మణ్యం రచించిన అసమర్థురాలి అంతరంగం కథలు,  అనువాదాలు,  వ్యాసముల సమాహారం.  భిన్నత్వంలో ఏకత్వంవలె ప్రతి రచనలోను ప్రతిఫలించే అక్షరసుగంధం మనసంతా పరిమళభరితం కావిస్తుంది.  తాతగారు త్రిపురనేని రామస్వామిగారు, తండ్రిగారు గోపిచంద్ గారు పరచిన సాహితీబాటలో తనదైన శైలిలో రచనలు గావించినా,  వారి పెద్దలు పలికిన మాటలు అంతర్లీనంగా మనల్ని పలకరిస్తూనే ఉంటాయి.

ఓటమి కథ సాధారణంగా ఎన్నో కుటుంబాలలోని భార్యాభర్తల జీవనసరళిని పారదర్శకం చేస్తుంది.  తాను చెప్పిందే చేయాలని భావించే వేణుకు భార్య చెప్పింది వినే సహనం ఏమాత్రం లేక ప్రతి చిన్నవిషయానికి ఆవేశభరితుడవుతుంటాడు.  కడకు ఆమె ఇష్టపడి కట్టుకున్న చీరను సైతం విమర్శించి అతడి అక్క ఇచ్చిన చీర కట్టుకుని రమ్మన్నప్పుడు మారుమాటాడక చీర మార్చుకోవడానికి వెళ్తున్న వేణు భార్యను వేణు చూసినట్లే మనమూ చూస్తాం.

భారతీయతను దృఢంగా పలికించిన కథ రాజకీయం.  కలకత్తా హౌరా స్టేషన్ నుండి డార్జిలింగ్ బయలుదేరిన వారి అనుభవాలు మనల్ని వారితోపాటు నడిపిస్తాయి.  ఆ అ ఇంటి ఇల్లాలి అతిజాగ్రతలు, అనుమాన దృక్పథాలు మనకు భీతి కలిగించినా ఆమె అనుమానించిన సిక్కు యువకుడు వారికి కడవరకు అండగా ఉండటం మానవతకు పెద్దపీటే.  ఏకోదరుల్లా బ్రతుకుతున్న భారతీయులను కులం, మతం పేరిట విడదీసే స్వార్థ రాజకీయాలకు అంతమెప్పుడు అని ప్రశ్నించడం మనసుపై ఎక్కుపెట్టిన బాణమే.

ఇక తిరగని మలుపు కథలో జీవనప్రయాణంలో సమస్యలకు భయపడక అన్ని విషయాలను తేలికగా తీసుకున్నపుడే జీవితం సుఖమయమవుతుందంటారు.

మనుషులలోని విభిన్న మనస్తత్వాలను బహిర్గతపరచిన కథ ఆ వూరు.

మనిషి మనసులోని అతిశయం కాలప్రవాహంలో ఈదడానికి అడ్డుపడకూడదనే సత్యాన్ని తెలిపే కథ కుందేలు.

తండ్రి గోపిచంద్ గారు రచించిన నవలలు అసమర్థుని జీవయాత్ర, చీకటి గదులు మొదలైనవి  చదివిన అనుభవాలు తనను చెయ్యి పట్టుకుని భవిష్యత్తులోకి నడిపించాయంటారు.   పఠనీయమైన వ్యాసాలు, అనువాదాలు కలిసిన అక్షరహారాన్ని మనకందించిన రజనీ సుబ్రహ్మణ్యం అభినందనీయురాలు.

1 thought on “మనసు పలికిన ఆత్మీయతా తరంగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *