రచన: విజయలక్ష్మి పండిట్
పచ్చని చెట్లను కౌగిలించుకుని
పరవశంతో గలగల నవ్వుతూంది గాలి
ఆ పచ్చని చిక్కని గాలి నవ్వులు
అడవి గుండెలో ప్రతిధ్వనిస్తున్నాయి,
నదిలో నీరు ఏరై పారుతూ
పలవరించి పరితపిస్తూంది..,
నలుగురి దాహం తీర్చకనే
సముద్రుని పాలవుతున్నాని,
ఆకాశంలో ఆ పక్షులు
మాట్లాడుకుంటున్నాయి.,
మనిషి భాషకున్నట్టు మాటలకు
చందస్సు వ్యాకరణము లేవు,
మనసును తాకే శక్తియుక్తి వాటి సొంతం,
ఆ సెలఏటి చల్లని తటంపై
పిల్లనగ్రోవిని ఊదుతున్నాడెవడో..,
వెన్నెలను తాగితాగి పిల్లనగ్రోవి
మత్తుగా రాగాలు పాడుతుంటే..,
కునుకు తీస్తూంది ఆ వెన్నెలరాత్రి..,
చంద్రుడు మైమరచి ఆగిపోయాడు
వెన్నల వానై కురుస్తూంది ..,
మత్తెక్కిన పిల్లనగ్రోవి రాగాలు
అలలుఅలలుగా పయనిస్తున్నాయి
అలసిన మనసుల సేదతీర్చుతూ…
1 thought on “విశ్వపుత్రిక వీక్షణం – “వెన్నెలను తాగిన పిల్లనగ్రోవి””