March 28, 2024

గాంధీజీ గాయపడ్డారు

రచన: డా.లక్ష్మీ రాఘవ


అది ఒక పురాతనమైన గుడి.
ఆ రోజు గుడి తలుపులు ఇంకా తెరుచుకోలేదు.
పూజారి రావడం ఆలస్యం అయ్యింది.
అయినా గుడి వెలుపల హడావిడి రోజూ లాగే మొదలైంది.
పక్కన పేర్చి వున్న రాళ్ళు వరసగా పెట్టుకుని పళ్ళ బుట్ట దాని మీద పెట్టింది కామాక్షి.
ఎదురుగా వున్నా వరసలో మొదటిగా వచ్చే పూలమ్మి పుల్లక్క అప్పటికే వెదురు బుట్ట లో పూలు రంగులవారిగా పెట్టుకుని నీళ్ళు చల్ల్లుతూంది.
నీళ్ళు చల్లినాక పల్చటి గుడ్డ తడిపి వాటి మీద కప్పి వుంచి, భక్తులు వచ్చినప్పుడు తొలగించి “పూలమ్మా పూలు ..మీరిచ్చే పూలతో శివుడు మురిసిపోతాడు..”అంటూ అరుస్తూంది.
అప్పుడే టెంకాయల సంచి మోసుకుని వచ్చి పుల్లక్క పక్కన పెడుతూ వెంకడు
”ఒక్క నిముషం చూసుకో అక్కా…నిముషం లో వస్తా” అంటూ జవాబుకోసం ఎదురు చూడకుండా పరుగులు తీశాడు.
పూజారి రావటం చూసి “ఏందీ సామీ ఆలీశం అయ్యింది? పానం బాగానే వుండాదా?” అనడిగింది కామాక్షి.
“కొంచెం జ్వరంగా వుంది లే …”అని త్వరగా అడుగులు ముందుకు వేసినాడు పూజారి.
రోజూ గుడి ముందు బాట కు ఇరు వైపులా కూర్చుని పూజకు కావాల్సిన వస్తువులు అమ్మే వాళ్ళు ఒకరికొకరు అన్నట్టుగా బతుకుతారు అక్కడ. కామాక్షి, పుల్లక్క, వెంకడు, రాములమ్మ, బ్రామ్మడు, రాములు ఒక్కొక్కరిదీ ఒక్కో కథ! కానీ అక్కడ కూర్చున్నప్పుడు ఒకరికొకరు అన్నట్టుగా వుంటారు. ఎవరికీ వ్యాపారం జరిగినా సంతోషమే!
వె౦కడు వెనక్కి వచ్చి సంచిపట్ట పరిచి టెంకాయలు వరసగా పేర్చి పెట్టి, పక్కనే అగరొత్తుల పొట్లాలు పెట్టుకు కూర్చున్నాడు. పక్కన వున్న పుల్లక్క “తమలపాకులు తెచ్చినాలే ..తడి బట్టలో నాకాడే ఉండనీ బేరం అయినప్పుడు తీసుకో “అంటే తల వూపినాడు…
కామాక్షి పక్కన వున్న ఖాళీ లో గాజుల బుట్ట తో కూర్చుంది రాములమ్మ.
దూరంగా వస్తున్న బ్రామ్మడి ని చూసి నిట్టూర్చింది కామాక్షి.
ఏడ నుండీ వచ్చినాడో ఈ బ్రామ్మడు.ఎవ్వరూ ఒక్క రూపాయి వెయ్యరు కానీ రోజూ రావటం తప్పడు.
“అమ్మా, బ్రామ్మడికి దానం ఇస్తే పుణ్యం. ఒక్క రూపాయి ఇవ్వండి ఆశీర్వాదం చేస్తా “అంటూ గుడికి వచ్చిన ప్రతి భక్తుల గుంపుకూ చెబుతూనే ఉంటాడు. ఎవరూ పట్టించుకోరు. అసలే ఆ బక్కపక్షి కప్పుకున్న పైపంచ పలచగా చిరుగులతో వుంటుంది. లోపల జంజం కనిపిస్తూ వుంటుంది.
ఏదీ దొరకనప్పుడు. అక్కడ అమ్మే వాళ్ళే తలా రూపాయి ఇస్తారు. ఒకపూట భోజనానికి సరిపోయ్యేలా…
భక్తులు రావటం మొదలుపెట్టి క్రమంగా ఎక్కువ అవుతూంది.
కామాక్షి బుట్టలో జామకాయలు , పక్కన వున్న పచ్చి మామిడి కాయలు సన్నగా పీసులు చేసి చిన్న ముక్కలుగా చెక్కి సరాల రూపం లో అమర్చింటే యిట్టె తినేసెయ్యా లని అనిపిస్తుంది . కోనేవాల్లకి కొంచే ఉప్పు , కారం చల్లి మరీ ఇస్తుంది కామాక్షి…కామాక్షి దగ్గర సరుకు ఎప్పుడూ తాజాగానే వుంటుంది. సాయంకాలం లోపల తెచ్చినవన్నీ ఖర్చయి పోతాయి.
వెంకడికీ, పుల్లక్క కూ అస్తమానం బేరం జరుగుతుందని గ్యారెంటీ లేదు. వూరి భక్తులు చాలాసార్లు ఇంటినుండీ టెంకాయలూ, పూలూ తెచ్చుకుంటారు.
వెంకడు “ఏందీ పుల్లక్కా ,ఈ రోజు ఇంకా గాంధి తాత రాలేదు??” అన్నాడు
“అవునే కామాక్షీ గాంధీ తాత ఇంకా రాలేదు నిన్న బాగానే వున్నాడా ??” అనడగింది కామాక్షిని.
“నిన్న జ్వరంగా వుంది అన్నాడు…మధ్యాహ్నం నిలుచుకోలేక వెళ్ళిపొయినాడు. వాళ్ళ బాసుగాడు ఏమన్నాడో…అయినా వొళ్ళంతా వెండి రంగు పూయించు కోవడానికి గంటన్నర పడుతుందట. కంటి అద్దాలూ, కట్టే పట్టుకుని ఎంతసేపైనా కదలకుండా ఉండేదానికి వయసు తక్కువా ?? సన్నగా బోడి గుండు తో వుంటాడని వెదికి పట్టుకున్నాడు గానీ పని ఎంత కష్టమైనదో తెలుసునా… శిల మాదిరి నిల్చునుంటే గదా అందరూ పైసలు వేస్తారు? “అరె గాంధీ తాత విగ్రహం ఎంతబాగుంది “అనుకుంటా పోతారు…బాగుంది అని పిల్లలను పక్కన నిలబెట్టి ఫోటోలు తీసుకుంటారు కానీ పది
రూపాయల నోటు వెయ్యరు..అనీ చిల్లర పైసలే ..ప్చ్ …” భారంగా అంది కామాక్షి.
“రోజూ వచ్చే పైసల్లో నూరు రూపాయలు వాడి బాసుకు ఇవ్వాల్నంట. మిగిలిందే తాతకు… అందుకే ఎవరైనా పెద్దనోటు వేస్తే బాగుండు అనినాడు ఒకసారి…” వెంకడు తనకు తెలిసింది చెబుతూ
వచ్చే బెరాలతో బిజీ గా వున్నా గాంధీ తాత గురించి చెప్పుకుంటూనే వున్నారు అక్కడ.
అప్పుడు మెల్లిగా నడుచుకుంటూ వచ్చినాడు గాంధీ తాత లాగా వేషధారి అయిన రాములు. వరసలో చివరిగా నిలబడుతూ ముందర ఒక ప్లాస్టిక్ డబ్బా పెట్టు కున్నాడు..
ఇక కదలకుండా నిలబడాలి. బక్కగా వున్న రాములు వొళ్ళంతా సిల్వర్ కలర్ పెయింట్ తో, కంటికి అద్దాలు పెట్టుకుని చేతిలో ఏటవాలుగా పట్టుకున్న కట్టెతో అచ్చు నాలుగు రోడ్లకూడలి లో కనిపించే గాంధీ తాత బొమ్మ లాగా వున్నాడు.
“ఏమైంది తాతా ఇంత అలీశం చేసినావు అప్పుడే ఒక గుంపు భక్తులు వచ్చినారు ఒక బస్సులో, అట్లా వూర్లనుండీ వచ్చినోల్లె నీకు బాగా వేస్తారు గదా…మాకుగూడా బేరాలు బాగా జరిగినయ్యి…”అంది నొచ్చుకుంటూ కామాక్షి
ఎదురుగా మనుష్యులు లేరని గమనించి మెల్లిగా “లేదమ్మా నిన్నటి నుండీ జ్వరం వస్తూనే వుంది..’ఈరోజు హాలిడే కి దండిగా గుడికి వస్తారు …ఓపిక వున్నతసేపు నిలబడు’ అని జరం మాత్ర ఇచ్చినాడు మా బాసు… మద్యాహ్నం దాకా వుండి ఎల్లిపోతా..కాళ్ళు నొప్పులు… దుడ్లు లేకుండా కోడలు కూడు పెట్టదు. అందుకే వచ్చినా ..”అన్నాడు గాంధీ తాత. రాములు కొడుకు తాగుడుకి ఎంత డబ్బైనా చాలదు. భర్త మీద కోపం మామ మీద చూపుతుంది కోడలు. అందుకే ఇలా సంపాదన తప్పదు రాములుకు. ఈ వేషం మొదలు పెట్టినాక కొంచెం బాగున్నా, ఈ వయసులో అంతసేపు నిలుచుకోవడం కష్టం.
ఇలాగే అక్కడ ఒక్కొక్కరిది ఒక్కో కథ!
ఇంతలో మరో బస్సు, ఇంకా రెండు కార్లూ వచ్చినాయి అక్కడకు.
బస్సులో వాళ్ళు స్కూలు పిల్లలు కాబట్టి ఎక్కువ బేరం కాదు . కానీ వెనక వచ్చిన కార్లలో ఖరీదైన ఫామిలే పట్టు చీరలతో, నగలతో దిగితే అక్కడున్న వారందరికీ ఆశ కలిగింది..
ఒక కారులో నుండీ దిగిన ఎనిమిదేళ్ళ అబ్బాయి “ అరె గాంధీ తాత ….”అని పరిగెత్తుతూ ముందుకు వచ్చాడు.
వాడి వెంటే వాళ్ళమ్మ కాబోలు పరిగెత్తి వచ్చింది “ఏ రాహుల్ స్టాప్ …”అంటూ.
ఇంతలో రాహుల్ అనే ఆ కుర్రాడు గాంధీ తాతను ఆనందంగా చూస్తూ వున్నాడు…
అక్కడికి చేరుకున్న ఒకాయన “అల్లాగే నుంచో రాహుల్ గాంధీ తాత పక్కన, పిక్చర్ తీస్తా” అని చేతిలోని సెల్ ఫోను ఫోకస్ చేసాడు. రాహుల్ కు భలే ఆనందం వేసింది..
అలాగే రాహుల్ వాళ్ళ అమ్మనూ, తాత పక్కన నిలబడమని ఫోటో తీసాడు వాళ్ళ నాన్న కాబోలు. తరువాత కారు దగ్గర వున్నడ్రైవర్ ని రమ్మని చెయ్యి ఊపి మొత్తం ఫామిలీ ఫోటో తీసుకున్నారు గాంధీ తాతతో… అక్కడనుండీ వెళ్ళిపోతూ నూరు రూపాయల నోటు ప్లాస్టిక్ డబ్బాలో వేసాడు. .అదిచూసిన రాములుకు సంతోషం అయ్యింది ఇంకోక్కరు ఇలాటివారు వస్తే చాలు ఇంటికి వెళ్లిపోవచ్చుఈ రోజు అన్న అంచనాలో వున్నాడు.
స్కూలు పిల్లలు కూడా గుంపుగా నిలబడి గాంధీ తాత దగ్గర ఫోటోలు తీసుకున్నారు కానీ ఒక్క ఇరవై రూపాయల చిల్లర మాత్రమె పడింది డబ్బాలో…
బ్రామ్మడు “ఆశీర్వాదం చేస్తా” అని ఎంత అడుక్కున్నా ఒక్క ఫామిలీ కూడా నిలవకుండా వెళ్ళింది…”ఆడ కార్లలో పెద్దోళ్ళు వచ్చినారు చూడయ్యా . దగ్గరికి పోతే ఏమైనా వేస్తారు” అంది పుల్లక్క.
ఆకలికి కడుపు నకనక లాడుతూంటే దగ్గరగా పార్క్ చేసి వున్న కార్లదగ్గరకు పోయినాడు. “అమ్మా, అయ్యా బ్రామ్మడికి దానం చేస్తే బోలెడంత పుణ్యం”అని చెయ్యి చాచాడు . ఒక కారు అద్దాలు దించి ఒక ముసలామె ఇరవై రూపాయలు ఇచ్చింది..ఆమెకు ఆశీర్వాదం పలికి పక్కనే వున్న బండిలో రెండు ఇడ్లిలు తిని చాయ్ తాగినాడు.. పరవాలేదు ఇంకా క్కాస్సేపు నిల్చుకోవచ్చు అనుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చి నించున్నాడు.
గాంధీ తాత వేషధారి రాములుకు కళ్ళు తిరుగుతున్నాయి…ఇంకా ఎక్కువసేపు నిలుచు కోవడానికి కష్టమనిపిస్తా వుంది…అతని అవస్థను మొదటగా చూసింది వెంకడు.
“తాతా, చాయ్ తెచ్చిస్తా ఆ పక్కకు పోయి తాగిరా…” అంటూ టీ కొట్టు దగ్గరికి వెళ్లి చాయ్ తెచ్చినాడు. గాంధీ తాత మెల్లిగా వెనక్కి నడిచి కొంచెం మరుగున వున్న చేట్టు కింద కు పోయి రాతి మీద కూర్చుంటే వెంకడు చాయ్ తెచ్చినాడు. అది తీసుకుని “తాగేసి వస్తా లే వెంకన్నా..”అన్నాడు.
చాయ్ తాగుతూ చుట్టూ ఎవరూ గమనించడం లేదుకదా చూస్తూ వుంటే ..కడుపులో తిప్పసాగింది..చాయ్ తో బాటు కొంచెం పెయింట్ లోపలకు వెళ్ళిందేమో ..ఒక్క సారిగా వాంతి వచ్చింది . బళ్ళున వాంతి చేసుకుతూంటే కళ్ళు తిరిగి బండ మీదకు పడి కిందకు పడిపోయినాడు…బండకు తగిలి తలమీద గాయం అయి రక్తం కారసాగింది.
ఆ క్షణాన ఆ పక్కకు చూసిన వెంకడు ఒక్క వూకున లేచి “గాంధీ తాత పడిపోయినాడు రక్తం వస్తా వుంది..”అని అరుస్తూ పరిగెత్తినాడు కామాక్షి, పుల్లక్క, బ్రామ్మడు అందరూ ఒకా సారిగా పోయి గాంధీ తాతను ఎత్తి పట్టుకున్నారు… మన స్పృహలో లేడు తాత….
మనుష్యలు గుమికూడుతూ వుంటే “108 కి ఫోను చెయ్యండ్రా…”అని అరిచినాడు వెంకడు.
అయ్యో గాంధీ తాత కు గాయం అయ్యిందీ అని అందరూ అంటూంటే . కామాక్షీ, పుల్లక్కా బ్రామ్మడు గబా,గబా తమదగ్గర వున్నా పైసలు పోగు చేసి నారు..
108 రాగానే గాంధీ తాత ను లోపలకు తీసుకున్నారు. వెంకడు కూడా బండి ఎక్కినాడు.
అది కదిలే లోపల బయట ఒకడు “ గాంధీ తాతకు గాయం అయ్యింది …పైసలు వెయ్యండీ…”అని గట్ట్ట్టిగా అరుస్తూ వుంటే వచ్చేపోయ్యేవాళ్ళు వింతగా జేబులో చిల్లర వేస్తూ వున్నారు…
పరవాలేదు ఈ దేశం లో గాంధీ వేషం వేసినా డబ్బులు పడతాయి ….
జాతిపిత గాంధీని ఇలా ఉపయోగించాల్సి వస్తున్నందుకు అందరూ సిగ్గు పడాలి…
……

1 thought on “గాంధీజీ గాయపడ్డారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *