April 20, 2024

జీవనయానం

రచన: మణి గోవిందరాజుల

“నాన్నా! అమ్మ వున్నన్నాళ్ళూ మాకు ఓపికలున్నాయి . అక్కడికి వచ్చి వుండలేమని రాలేదు. పోనిలే ఇద్దరూ ఒకళ్ళకి ఒకళ్ళు వున్నారు కదా అని నేను మాట్లాడలేదు. . మన దురదృష్టం అమ్మ వున్నదున్నట్లుగా మాయమయింది. ”కళ్ళు తుడుచుకున్నాడు అశ్విన్.
“ఇప్పుడు అమ్మలేదు. ఒక్కడివి యెంత ఇబ్బంది పడుతున్నావో అని మాకు యెంత బెంగగా వుంటుందొ తెలుసా?” కంఠం రుద్దమయింది.
“ఇప్పుడు నాకు నేను చేసుకునే ఓపిక వుందిరా. అది కూడా తగ్గాక వస్తాను. ”
“అప్పుడొచ్చి యేమి చేస్తావు నాన్నా?పిల్లల్నాడించే వయసు నీకు దాటిపోతుంది. తాతా అని నీ చేయి పట్టుకుని నడిచే వయసు నా పిల్లలకి దాటిపోతుంది. మనవలు మనవరాళ్ళతో గడపాలని నీకు లేదా నాన్నా?”
“అసలు కన్నా వడ్డీ ముద్దు. నీకంటే వాళ్ళే యెక్కువ నాకు. కాని యేదో ఇబ్బందిరా?నన్ను బంధించినట్లుగా ఉంటున్నది అక్కడ. మీరు ఒక రకమైన జీవితానికి అలవాటు పడ్డారు. కాలానుగుణంగా మీరున్నారు. అలాగే ఉండాలి కూడా. కాని నేను అలవాటు పడలేకపోతున్నారా. మన భాష కాదు. మాట్లాడించే వాళ్ళుండరు. యేదో ఇంతకాలం గడిచింది. ఇంకొంత కాలమైతే ఈ ఆకు రాలి మీ అమ్మను చేరుకుంటుంది. ” ఆవేదనగా అన్నాడు పరంధామయ్య.
“అక్కడ మన భాష కాదనే కదా నాన్నా మేమిక్కడికొస్తామని చెప్తున్నది…. ” మాటలు పూర్తి కాక ముందే . . .
“దండాలయ్యా!” చెబుతూ లోపలికి వచ్చాడు బక్కడు “చిన్న దొరా బాగుంటిరా?” ఆప్యాయంగా అడిగాడు అశ్విన్ ని.
ఇంతలో లోపలినుండి కాఫీ తీసుకొచ్చింది రంగి. ఇద్దరూ తాగుతుండగానే పరంధామయ్య వయసు వాళ్ళు ముగ్గురొచ్చి లోకాభిరామాయణం మొదలు పెట్టారు. రంగి వాళ్ళకు కూడా కాఫీ తీసుకొస్తానని లోపలికి వళ్ళీంది.
వాళ్ళను చూడగానే తండ్రి మొహంలో కనపడిన వెలుగు తమ దగ్గరున్న మూడు నెలలలో యెప్పుడూ లేదన్న సంగతి గుర్తొచ్చింది అశ్విన్ కి.
కొద్దిసేపు కూర్చుని వాళ్ళు వెళ్ళిపోయారు. భోజనాల వేళ అయిందని రంగి వచ్చి చెప్పింది. లేవబోతుండగా బాగా దూరపు చుట్టం ఒకాయన వచ్చాడు. సరే అతన్ని కూడా భోజనానికి లేవమని ముగ్గురూ భోంచేసారు. భోజనాలయ్యాక వాళ్ళిద్దరూ కొద్దిసేపు లోకాభిరామాయణం మాట్లాడుకుని పడుకుంటామని నడుం వాల్చారు.
అలా ఊళ్ళో తిరిగొద్దామని వెళ్ళాడు అశ్విన్. దార్లో పలకరిస్తున్నవారందరికీ సమాధానం చెప్తూ కాసేపలా తిరిగి చీకటి పడుతుండగా ఇంటికి వచ్చిన అశ్విన్ భోంచేసి పడుకున్నాడే కాని నిద్ర పట్టలేదు.
పరంధామయ్య అన్నపూర్ణలకు అశ్విన్ అర్చన ఇద్దరు పిల్లలు. పరంధామయ్యది తరతరాలుగా వ్యవసాయ కుటుంబం. పరంధామయ్య ఒక్కడే సంతానం. ఆయన బాబాయిలు మేనత్తలు అందరూ ఆయన చిన్నతనంలోనే పై చదువులకు పట్నాలెళ్ళి అక్కడే ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. కాని పరంధామయ్య మటుకు ఆ నేల తల్లినే నమ్ముకుని ఉన్న రెండెకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ ఉన్నంతలో పిల్లల్ని బాగా చదివించాడు. . పిల్లలిద్దరూ కూడా మంచి చదువులు చదువుకుని విదేశాల కు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన కొత్తల్లోనే తల్లినీ తండ్రినీ తీసుకెళ్ళి అమెరికా లో ముఖ్యమైన ప్రదేశాలన్నీ చూపించారు. ఏడాది క్రితం తల్లి చనిపోయింది. తల్లి ఉండగా ఎన్నిసార్లు వచ్చి తమతో పాటు ఉండమని బలవంతం చెసినా రాలేదు. తల్లి పోయాక తండ్రిని తమతో పాటు అమెరికా రమ్మంటే రానన్నాడని తనే ఇండియా రావడానికి నిశ్చయించుకున్నాడు అశ్విన్. . అయితే మళ్ళీ అమెరికా వచ్చే అవకాశం ఉండదని అక్కడ ఉండగానే తండ్రిని పిలిపించుకున్నాడు కొడుకు మనసు నొప్పించలేక అమెరికా వెళ్ళిన పరంధామయ్య అక్కడ బలవంతాన ఉండి మూడు నెలలకే తిరిగొచ్చేసాడు. ఇప్పుడు ఇండియా వచ్చేస్తాను తమతో ఉండాలని బతిమాలుతున్న కొడుకుకు రాననే సమాధానం చెప్తున్నాడు పరంధామయ్య. ఆలోచిస్తూ పడుకున్న అశ్విన్ కి ఎప్పటికో నిద్ర పట్టింది.
మర్నాడు పొద్దున్న లేచేసరికే తండ్రి పొలానికి వెళ్ళిపోయాడు. రంగి ఇచ్చిన కాఫీ తాగి స్నానం చేసాక టిఫిన్ చేసి తను కూడా పొలం బయలు దేరాడు అశ్విన్. పొలమెళ్లేసరికి తండ్రి పాలేర్లందరికీ పనులప్ప చెప్తూ హుషారుగా కనపడ్డాడు. పాలేరు ఏదో అన్నదానికి నవ్వుతున్న తండ్రి మొహం చూసేసరికి తండ్రిని రమ్మని బలవంతం చేస్తూ తనేమన్నా తప్పు చేస్తున్నాడా అన్న ఆలోచన వచ్చింది అశ్విన్ కి. కొడుకుని చూసిన పరంధామయ్య కొబ్బరి బోండాలు తెమ్మని వాళ్ళకు చెప్పి దగ్గర్లో ఉన్న చెట్టుకింద ఉన్న మంచం మీద కూర్చుని రమ్మని అశ్విన్ కి చెయ్యూపాడు. వచ్చి పక్కన కూర్చున్న అశ్విన్ చేతిని చేతిలోకి తీసుకుని
“చూడు అశ్విన్… నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉందిరా! నా పెంపకం మీద నాకు ఆనందంగా ఉంది. తలితండ్రులను పట్టించుకోని వాళ్ళున్న ఈ రోజుల్లో నీ కెరియర్ కూడా ఆలోచించకుండా నా కోసం వచేస్తానంటున్నావు. నీకు తగ్గదే నీ భార్యా. . చాలా సంతోషం. కాని ఒక్కటాలోచించు. నాలుగు రోజులనుండి ఇక్కడ ఉండి అన్నీ చూస్తున్నావు. నేను ఎలా ఉన్నాను? భారంగా గడుపుతున్నానా? లేదే… మీ అమ్మ పోయిందన్న బాధ కూడా నాకు లేదు. ఎవరమైనా పోవలసిన వాళ్ళమే. కాని దేవుడు ఆమెని ముందు పిలిపించుకున్నాడు. నా టైం ఎప్పుడో వస్తుంది. కాని పోయే లోపల నిస్సారంగా ఎవరికీ ఉపయోగం లేకుండా పోవాలని లేదురా? నిజమే తగ్గే వయసు. ఈ రోజున్న ఓపిక రేపుండదు. ఈ సంవత్సరం బానే ఉండొచ్చు. కాని వచ్చే యేడు ఇంత ఓపిక ఉండకపోవచ్చు. కాని ఈ సంవత్సరం ఆనందంగా గడుపుతాను కదా? ఆ తర్వాత చూదాము ఏమి జరుగుతుందనేది. . . . నా దగ్గర ఆనందం ఉండదా అంటావేమో. . . ఎవరికైనా పిల్లల కంటే ఎక్కువ ఏదీ కాదు. ఆనందంగా గడపడానికి. కాని వెనకటి లాగా లేవురా రోజులు. వెనక మీ తాతయ్యా బామ్మా వాళ్ళున్నారంటే ఇంటినిండా మనుషులుండేవారు. ఒంటరితనం ఉండేది కాదు. కాని ఇప్పుడలా కాదు. మీరంతా మీ మీ పనుల మీద బయటికి వెళ్తే తిరిగి మీ దర్శన భాగ్యం కలిగేది రాత్రికే. మీ అమ్మ ఉంటే అదో తీరు. రాత్రి వరకు నేనొక్కణ్ణీ అలవాటు లేని టీవీ పెట్టుకుని కూర్చొని కాలక్షేపం చేయాలంటే ఎంత కష్టం? అరే! నాన్నా మీరు కాక నాకింకెవరున్నార్రా? ఇప్పుడు నువు అర్జెంటుగా నీ ఇల్లూ ఉద్యోగమూ అన్నీ వదులుకుని వస్తే ఇక్కడ ఏమి చేయగలవు? మనకున్న రెండెకరాల పొలంతో ఆ రోజుల్లో కాబట్టి అన్ని బాధ్యతలని తీర్చుకోగలిగాను. కాని ఇప్పుడు జీవించడమే ఖరీదయినది. అందుకని నువు తొందరపడకు. నిన్ను రావొద్దని నేను అనను. జననీ జన్మభూమి. కాని ఒకసారి వచ్చాక ఎందుకొచ్చామా అని పశ్చాత్తాప పడకూడదు. నీకు మంచి అవకాశాలు వచ్చినపుడు రా. ఇక్కడ నా కోసం ఎదురు చూసేవాళ్ళు, నా గురించి ఆలోచించేవాళ్ళు ఉన్నారు. బెంగ పడకు. ” అనునయంగా చెప్తున్న తండ్రిని ఏమీ అనలేకపోయాడు అశ్విన్.
నిజమే ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇప్పుడు ఉన్న వారున్నట్లుగా తామొస్తే అద్దె ఇల్లూ.పిల్లల చదువులూ,పై ఖర్చులూ… ఆలోచిస్తే భయమేసేంత పరిస్థితి. అలాగని తండ్రిని ఒంటరిగా వదిలి పోవడానికి మనస్కరించడం లేదు. అందరూ లక్జరీగానే బతగ్గలరా అంటే కాదు కాని ఒకసారి అక్కడికెళ్ళాక లైఫ్ స్టైల్ మారిపోతుంది. లేదా మారిన లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోతాము. అదొక సాలె గూడు. ఇక అందులో నుండి బయటకు రాలేము. లోపల ఉండడానికి కొట్టుకోవాలి. కొంతన్నా సంపాయించుకుని వస్తే కాని ఇక్కడ గడపలేము. అక్కడే ఉండి తండ్రి ఒప్పుకుంటే అక్కడికి తీసుకెళ్దామన్నా వీసా?. మధ్యతరగతి వారికి ఎంత విషాదకరమైన పరిస్థితి? తలితండ్రులను దగ్గర ఉంచుకుందామన్న కోరిక ఉన్నా ఉంచుకోలేని పరిస్థితి. కొడుకుని తన ఆలోచనకే వదిలి తన పనిలో తాను పడ్డాడు పరంధామయ్య.
“నాన్నా! నేను ఇంటికి వెళ్తున్నాను. ” తండ్రికి వినపడేట్లుగా కేకేసి ఇంటికి బయలుదేరాడు అశ్విన్. తండ్రి రాడు. తాను రాలేడు. ఏమి చేయాలి? ఆలోచిస్తూ నడుస్తున్న అశ్విన్ ఇంటికి ఎప్పుడు చేరుకున్నాడో గమనించలేదు. గేటు తీసుకుని లోపలికి వస్తూ తలెత్తి ఇంటిని చూసాడు. తల్లి గుర్తొచ్చింది. ఇంటిచుట్టూ పరుగులు పెడుతూ,రకరకాల ఆటలు ఆడిన తమ బాల్యం గుర్తొచ్చింది. నిన్న తన చుట్టూ పదిమందినేసుకుని కూర్చుని నవ్వుతూ వారితో మాట్లాడుతున్న తండ్రి కళ్ళముందు కనపడ్డాడు. ఆ మధ్య అమెరికా తన దగ్గరికి వచ్చి ఉన్న తండ్రి గదిలో బందీ లాగా కూర్చొని తామొచ్చేవరకు ఎదురు చూడడం గుర్తొచ్చింది. ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా మనసు తేలిక పడ్డది అశ్విన్ కి.
“నాన్నా! నేను వెళ్ళోస్తాను. నీ ఇష్టం. నీ మనసుకు ఎలా నచ్చితే అలా ఉండు. ఏ మాత్రం ఆరోగ్యం బాలేకపోయినా నాకు చెప్పడానికి ఆలోచించవద్దు. ఏ సమయంలో నైనా నీకు మేమున్నాము. నలుగురికీ ఉపయోగపడాలన్న నీ కోరికకి నా వంతు సాయం కూడా నేనందిస్తాను. ఇది మాత్రం కాదనడానికి వీల్లేదు. మేము చాలా తొందరలోనే నువన్నట్లుగా మంచి అవకాశాలు చూసుకుని వస్తాము. ” తండ్రి కాళ్ళకు దణ్ణం పెట్టి ప్రయాణానికి సిద్దమవుతూ చెప్పాడు అశ్విన్.

******************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *