March 28, 2024

జాబాలి

రచన: శారదాప్రసాద్

జాబాలి ముని దశరధ మహారాజు రాజ పురోహితులలో ఒకడు . ఆయన మంత్రి వర్గ సభ్యులలో కూడా ఒకడు. శ్రీరామచంద్రుడు అరణ్యవాసము నుండి తిరిగి ఎలాగైనా అయోధ్యకు తీసుకుని వచ్చి పట్టాభిషిక్తుని చేయాలని తలంపుతో భరతునితో కూడా వెళ్ళిన పరివారములో జాబాలి ఒకడు. జాబాలి ప్రసక్తి వాల్మీకి రామాయణం అయోధ్య కాండలో ఉంది . జాబాల అనే ఒక విప్ర స్త్రీకి కన్యత్వ దశలోనే దేవతా వరప్రసాదమున పుట్టిన వాడే ఈ జాబాలి. జాబాలికి యుక్త వయసు రాగానే అతనిని తల్లి హరిద్రుమతుడు అనే గురువు దగ్గర విద్య నేర్చుకునేందుకు అప్పగిస్తుంది. కొంతకాలానికి గురువు జాబాలికి ఉపనయనము చేసే సంకల్పముతో అతని కుల గోత్రములు అడుగగా, అవి తనకు తెలియవనుట వలన, మీ తల్లిని అడిగి తెలుసుకుని రావలసినదని పంపుతాడు. ఆ సందర్భములో ఇంటి దగ్గర తన తల్లిని అడుగగా, తనకు భర్త లేని విషయము తెలుపుతూ, మన గోత్రం ఏమిటో నాకు తెలియదు. నా యౌవనంలో దాసిగా అనేక చోట్ల తిరిగి పనిచేసాను. అనేక మందికి సేవలు చేసి, నిన్ను కన్నాను. కానీ నీ తండ్రి ఎవరో నాకు తెలియదు. ఒక్కటి మాత్రం సత్యం. నా పేరు జాబాల. ఇంక నుండి తన (నీ) పేరు సత్యకాముడు అను జాబాలి అని చెప్పమని కుమారునితో చెప్పి గురువు దగ్గరకు తిరిగి పంపుతుంది.
గురువు తన దివ్య దృష్టితో అతని జన్మకథను తెలుసుకొని గాయత్రీ మంత్ర ఉపదేశము చేస్తాడు. తదుపరి కాలములో ఆయన “సత్యకామ జాబాలి” అని కూడా ప్రసిద్ధి చెందుతాడు. బ్రహ్మ విద్యను అభ్యసించు అర్హత సంపాదించే వరకు గురువు జాబాలిని తన గోవులను మేపుతూ ఉండమని ఆదేశిస్తాడు. గురుభక్తితో సత్య సంధుడై జాబాలి గురు గోవులను తోలుకొని వనమునకు వెళ్ళేవాడు. ఇతని గురుభక్తికి, గోపూజపరతకు దేవతలు మెచ్చుకొని ఉపకారము చేయాలని సంకల్పిస్తారు. ఒకనాడు వాయుదేవుడు ఒక వృషభములోనికి ప్రవేశించి, “నీవు సత్యనిష్టతో మమ్ములందరిని కాపాడుట వలన వేల మందిమి అయితిమి. గురు గృహమునకు మమ్మల్ని తోలుకొని వెళ్ళితే, మేము నీకు చేతనయినంత సహాయము చేస్తాము” అని అనుట వలన జాబాలి గోవులతో గురు గృహమునకు బయలు దేరాడు. మార్గమధ్య దారిలో వృషభ రూపములో ఉన్న వాయుదేవుడు జాబాలికి బ్రహ్మ జ్ఞానమునకు సంబంధించిన ఒక దివ్యమైన మంత్రపాదము చెప్పగా, అదేవిధముగా ఇంకొక వృషభ రూపములో ఉన్న అగ్నిదేవుడు నేర్పించగా, మరొక వృషభములోనికి ప్రవేశించి సూర్యదేవుడు, చివరగా ” మద్గియ” అను పక్షి కూడా మంత్రపాదములు బోధించగా బ్రహ్మజ్ఞాన సంపన్నుడయ్యాడు జాబాలి.
గురువైన హరిద్రుమతుడు దివ్య తేజస్సుతో బ్రహ్మజ్ఞానము పొందిన జాబాలిని చూసి, నీవు ఇంక ఒక స్వంత ఆశ్రమము నిర్మించుకొని దివ్య జీవితము గడుపు మనగా, జాబాలి నిరాకరిస్తాడు. గురుముఖముగా బ్రహ్మజ్ఞానము పొందినదే శాశ్వతమని తలంచి, ఆ సంగతి గురువుకు తెలియజేయగా, గురుభక్తితో ఉన్న అతనికి బ్రహ్మజ్ఞానమును గురువు తన ఆశ్రమము నందే ఉపదేశించి పంపాడు. జాబాలి మహర్షి తిరుమల అనే పవిత్ర ప్రదేశంలో నివసించి, తపస్సు సాధన చేశాడు. ప్రస్తుతం తిరుపతి సమీపంలోని ప్రదేశానికి ” జాబాలి తీర్థం ” అని పిలుస్తారు. జాబాలి తీర్థము శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయమునకు, వాయవ్యభాగమున ఉన్నది. అనేక మంది ప్రజలు తమ తీవ్రమైన గ్రహా దోషాలను పరిష్కరించ బడతాయని హనుమంతుడు, వినాయకుడు విగ్రహాలను కూడా పూజించడంతో పాటుగా ఈ జాబాలి తీర్థం కూడా సందర్శించుకుంటారు.
చిత్రకూట పర్వత ప్రాంతమున జాబాలి ఒక ఆశ్రమము నిర్మించుకొని సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించి పరతత్వ రహస్యాలను ఎన్నింటినో గ్రహించాడు. పరమ పవిత్ర జ్ఞానమునకు అర్హుడు అయిన పిప్పలాద మహర్షికి, జాబాలి మహర్షి సర్వము బోధించిన బ్రహ్మజ్ఞానమే “జాబాల్యుపనిషత్తు”. “జాబాల ఉపనిషత్తు” అనేది జాబాలి మహర్షి బోధనము. జాబాలి గోత్రం క్లుప్తంగా దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణులు ఉపయోగిస్తారు. తండ్రి మాటను పక్కన పెట్టి రాజ్యాధికారాన్ని తీసుకోవచ్చని జాబాలి రామునికి చెబుతాడు. ఇక్కడ జాబాలి నోట పలికించినదంతా కూడా చార్వాకుల(వైదికాచారాలను ఖండించినవారు) ధోరణి సుస్పష్టంగా కనిపిస్తుంది. అప్పటికి వైదికాచారాలను, కర్మకాండనూ, యజ్ఙక్రతు విధానాలను నిరసించే ధోరణి బలపడుతోంది. అందుకే కర్మకాండను బలంగా ప్రచారం చేసే రామాయణం అవసరమైంది. చార్వాక మతాన్ని జాబాలి నోట చెప్పించి దాన్ని ఖండించటం రామాయణ లక్ష్యాలలో ఒకటి. “ప్రత్యక్ష్యంగా ఉన్నదే వాస్తవం. పరోక్ష ఫలాల కోసం ప్రత్యక్ష ఫలాన్ని వదలి పెట్టకు. తండ్రి బీజమూ, తల్లి శుక్లమూ, రక్తమూ జీవి పుట్టుకకు కారణాలు- అవి కేవలం నిమిత్త మాత్రాలు. ప్రత్యక్ష లోకాన్ని విడిచి పరోక్ష లోకాన్ని గురించి చింతించటం అవివేకం. క్రతు కర్మలన్నీ దానాలు చేయించటానికి కల్పించినవే. ఇవన్నీ కల్పితమైన ఆచారాలు . . . పరలోకం అనేది లేదనుకో. కనిపించని దానిని వదిలిపెట్టు, కనిపించేదే సత్యం. అందరినీ అందరూ ఈ భూమ్మీద నుంచి వదలిపోతారు. నీవు యవ్వనంలో ఉన్నావు. భోగభాగ్యాలు అనుభవించవలసిన తరుణమిది. మరణానంతరం జీవరాసులన్నీ పంచభూతాల్లో కలసిపోతాయి . మరణానంతరం ఏమీలేదు. దేహం ఉండగానే సుఖించాలి. బుద్ధిహీనులే ఈ భూమిలో ప్రత్యక్షమైనదాన్ని వదలుకొని, పరోక్షమైనదాన్ని నమ్ముకుంటారు. ఓ రామచంద్రా! ఆత్మ లేదు. మోక్షం లేదు. స్వర్గం లేదు. కర్మ లేదు. కర్మఫలం అనుభవించే వారు లేరు. పాప పుణ్యాలు లేవు . భగవంతుడు లేడు. కష్టాలను, దుఃఖాన్ని ప్రజ్ఙచేత తగ్గించుకొని, దేహాన్ని పటిష్టం చేసుకోవడమే బుద్ధిమంతుని లక్షణం. ఎందుకంటావా ఈ దేహం పతనమైపోతే మళ్ళీ తిరిగి రాదు …”ఇలా సుదీర్ఘంగా జాబాలి రాముడితో చెబుతాడు.
దానికి రాముడు ఖండన కూడా అంతకంటే సుదీర్ఘంగా ఉంటుంది. భగవంతుని సృష్టిలో ఏదీ అనవసరంగా సృజించపడి ఉండదు. ప్రతిదానికీ ఏదో ప్రయోజనం ఉండే ఉంటుంది. అది నాస్తికవాదమైనా, ఆస్తికవాదమైనా! వనవాసానికి శ్రీరాముడు వెళ్ళినతరువాత , భరతుడు రావటం. తన తల్లిచేసినదానికి బాధపడటం, తరువాత రామున్ని తిరిగి తీసుకురావటానికి అరణ్యానికి మంత్రి బంధువర్గ, ఆచార్య సమేతంగా వెళతాడు. అక్కడ రాముని మనసు మార్చటానికి అందరూ ప్రయత్నించి విఫలం చెందుతారు. ధర్మ మార్గమునుండి రామున్ని మరల్చటం ఎవ్వరి వల్లాకాదు. అప్పుడు దశరధుని మంత్రి జాబాలి రంగప్రవేశం చేసి పై విధంగా రాముడితో చెబుతాడు. జాబాలి చేసిన నాస్తికవాద ధోరణి విని , రాముడు గంభీరంగా, “స్వామీ! మీరు నా మేలుకోరి చెప్పిన మాటలన్నీ చాలా వింతగా ఉన్నాయి . మీ ఉపదేశాన్ని నేను ఆచరిస్తే నాకంటే దుశ్శీలిడు మరొకడు ఉండడు. ప్రజలందరూ నన్ను అసత్యపరాయణునిగా వేలెత్తి చూపుతారు. ” అప్పుడు వశిష్టుడు కలుగచేసుకుని, “శ్రీరామా! నిన్ను అయోధ్యాధీశునిగా పట్టాభిషిక్తుని చేయాలని తలంపుతోనే జాబాలి అలా మాట్లాడాడు గాని, నిజానికి అతను నాస్తికుడు కాడు” అంటూ శ్రీరాముని అనునయిస్తాడు.
జాబాలిని పురాణాలు ఒక ఋషిగా ఎంచి, ఆయన పేర ఒక గోత్రాన్ని నెలకొల్పాయి. మొత్తానికి తన సత్యనిష్ఠతో, జ్ఞానతృష్ణతో గోత్రమంటూ లేని జాబాలి తనే ఒక గోత్రానికి స్థాపకుడు అయ్యేంతటి ఋషిగా మారాడు. జాబాలిముని చార్వాక మతమును త్రేతాయుగములో వ్యాప్తిచేసిన బోధకుడిగా ఆయనను ముద్రవేస్తూ రచనలు వచ్చినాయి కాని అవి అన్నీ ప్రక్షిప్తములే. ‘గోత్రం’ అనే పదం మన శాస్త్రాలలో మొదటిసారిగా సత్యకామ జాబాలి కథాసందర్భంగా కనిపిస్తుంది. గోత్రం అనే పదం వేదాలలో ఎక్కడా కానరాదు. అయితే, పాళీ భాషలోని కొన్ని శాసనాలలో మనకు ‘గొట్ట’ అనే మాట కనిపిస్తోంది. బౌద్ధమతం సుస్థిరం అయిన కాలం నాటికే గోత్రం అనేది మన సమాజంలో స్థానం సంపాదించుకుంది. జైనులలోకూడా ‘గోత్రం’ గురించిన ప్రసక్తి ఉంది. ‘గోత్రం’ అంటే అనేక అర్థాలు ఉన్నాయని చెబుతారు. వాటిలో 1. వంశం, 2. గుంపు, సమూహం, 3. పేరు, 4. గొడుగు, 5. బాట అనేవి ఇక్కడ పేర్కొనవచ్చు. ‘గోత్రం’ అనే పదం ‘గౌః’ అనే సంస్కృతపదం నుంచి ఆవిర్భవించింది. ‘గౌః’ అంటే గోవులుఅని అర్థం. ‘గోత్ర’ అనే సంస్కృత పదానికి 1. భూమి, 2 గోవుల సమూహం అని రెండు అర్థాలు ఉన్నాయి. ఒకే గుంపులోని వారంతా రక్త సంబంధీకులే కాబట్టి, వారంతా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల వంటి వారే కాబట్టి, సరైన జన్యువులతో వంశం సరిగ్గా వృద్ధి చెందేందుకు ‘సగోత్రీకుల’ను వివాహం చేసుకోరాదన్న నిబంధన సమాజంలో ఏర్పడింది.

3 thoughts on “జాబాలి

  1. జాబాలి కథ అత్యద్భుతం. అందించిన మీకు ధన్యవాదాలు

  2. జా బలి కథ బాగున్నది
    తరచూ వినపడదు.
    ప్రవచన కారులు కూడా. చెప్పరు.
    ధన్యవాదములు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *