April 24, 2024

తిరుక్కడయూర్ అభిరామి కోవెల

రచన: నాగలక్ష్మి కర్రా

ఈ తిరుక్కడయూర్ అనే పట్టణంలో అమృత ఘటేస్వర్ కోవెల ఉంది .ఈ తిరుక్కడయూర్ తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నం జిల్లాలో ఉంది. ఈ తిరుక్కడయూర్ “మైలదుత్తురై “(మాయ వరమ్) నుంచి “పోరయార్ “వెళ్ళేదారిలో మైలదుత్తురై కి 22కిమి దూరం, పోరయార్ నుంచి 8కిమి దూరంలో ఉంది.
ముందు 60వ పెళ్లి రోజు ఇక్కడ చేయించుకునే వారు. తరవాత తరవాత ఈ కోవెలలో షష్టబ్దిపూర్తి (60 సం.), భీమార్థ శాంతి(70 సం ..నిండిన తరువాత చేసుకొనే పూజ ), శతాభిషేకం(80 సం.. నిండేక చేయించుకొనే పూజ ) చేయించుకుంటారు.
ప్రతి రోజు ఇక్కడ 50 నుంచి 60 ఇలాంటి పూజలు జరుగుతూ ఉంటాయి. కోవెల ముఖ్య ద్వారంలో ప్రవేశించగానే రెండు వైపులా పెద్ద పెద్ద మంటపాలు. అవి దాటిన తరవాత గర్భగుడి ద్వారం. ద్వారం దాటగానే పెద్ద ప్రాంగణం. ఆ ప్రాంగణంలో చిన్న చిన్న మంటపాలు వేసి షష్టి పూర్తి మొదలగు పూజలు జరుగుతూ ఉంటాయి.
ఈ కోవెలలో మూలవిరాట్టు ఈశ్వరుడు “అమృత ఘటేశ్వరుడు” అనే పేరుతో పూజింప బడుతున్నాడు.
పాల సముద్రాన్ని మధించేటప్పుడు దేవతలు వినాయకుడిని పూజింప లేదని అలిగిన వినాయకుడు పాల సముద్రంలోంచి అమృతం ఉద్భవించగానే అమృతాన్ని దొంగిలించి ఇప్పుడు మూలవిరాట్టు ఉన్న చోట దాచుతాడు, దేవతలు తమ తప్పు తెలుసుకొని వినాయకుడికి పూజలు చేసి కుడుములు నివేదించగా సంతుష్టుడైన వినాయకుడు అమృతాన్ని దేవతలకు తిరిగి ఇచ్చేస్తాడు. అందుకే కుడి వైపున ఉన్న చిన్న కోవెలలో ఉన్న వినాయకుడిని “కల్లవినాయకర్(దొంగ వినాయకుడు)” అని పిలుస్తారు. ఆ అమృత భాండం పెట్టిన చోట శివుడు స్వయంభు గా లింగాకారంలో ఉధ్భవించేడు. అందుకే ఇక్కడ ఈశ్వరుడిని “అమృత ఘటేస్వరుడు” అని పిలుస్తారు.

అదే ప్రాంగణంలో ఎడమ వైపున మార్ఖండేయుడు శివుని పాదాలని చుట్టుకొని ఉండగా శివుడు యముడిని సంహరిస్తున్న విగ్రహం ఉంటుంది.ఆ విగ్రహానికి ఎదురుగా బాల యముడి విగ్రహం ఉంటుంది.
ఈ విగ్రహాల వెనుకనున్న కధ ఇలా చెప్తారు.
“మృగాండు”అనే మహర్షి అతని భార్య “మరుదమతి” సంతతి కొరకై పరమ శివుని ప్రసన్నం చేసుకోడానికై కఠోర తపస్సు నాచరిస్తారు. వారి తపస్సుకి మెచ్చి శివుడు ప్రత్యక్షమై వారి కోరిక తెలుసుకొని దీర్ఘాయుస్సు గల వంద మంది కుపుత్రులు కావాలా? ఆయుష్యు లేని ఒక సుపుత్రుడు కావాలా? అని అడుగగా మృగాండు ముని ఆయుష్యు లేని ఒక సుపుత్రుడిని ఇవ్వమని కోరుతాడు.
శివుడు అలానే వరమిచ్చి అంతర్ధానమౌతాడు. కాలక్రమంలో మరుదమతి నెలతప్పి, నెలబాలుని వలె ప్రకాశిస్తున్న కుమారుడికి జన్మ నిస్తుంది. ఆ కుమారునికి “మార్ఖండేయుడు “అని నామకరణం గావించి అల్లారు ముద్దుగా పెంచు కుంటూ ఉంటారు.
ఆ బాలుడు దినదినాభివృద్ధి చెందుతూ సకల విద్యాపారంగతుడై తల్లితండ్రులకు పేరుతెస్తాడు.అందరు అంతటి సుపుత్రుడికి జన్మనిచ్చినందుకు మృగాఁడు ముని అతని భార్య మరుదమతిని కొనియాడుతారు. పదునారేళ్ల వయసు వాడవగానే మృగాండు ముని అతనికి గల మృత్యువు గురించి చెప్తాడు. అదివిని మార్ఖండేయుడు తన మిగిలిన జీవితం శివ ధ్యానంలో గడపాలని నిర్ణయించుకొని తపస్సు చేయుటకు అనువైన ప్రదేశం కొరకు వెతుకుతూ స్వయంభూ గా వెలసిన “అమృత ఘటేస్వరుని ” అనునిత్యం పూజించాలని నిర్ణయించుకొంటాడు.
నిత్యం కావేరిలో స్నానమాచరించి అమృతఘటేస్వరుని సేవించుకుంటూ ఉంటాడు.మొదటి సారి మహా మృతుంజయ మంత్రం మార్ఖండేయుని ద్వారా ఈ ప్రదేశం లో ఉఛ్ఛరించ బడిందని అంటారు. కాలాంతరాన మార్ఖండేయుని ఆయుష్యు తీరి అతనిని తీసుకోని పోవుటకు యముడు పాశాన్ని తీసుకొని మార్ఖండేయుని వద్దకు వస్తాడు. అది చూచి మార్ఖండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకొంటాడు. యముడు మార్కండేయునికై వేసిన పాశం శివలింగం పైన పడుతుంది. దానికి క్రోధించిన శివుడు తన త్రిశూలంతో యముడిని వధించుతాడు. యముని మరణం తో ముల్లోకాలు అల్లకల్లోలం అవుతాయి. దేవతలు శివుని ప్రార్ధించి యముని తిరిగి పునఃర్జీవితున్ని చేయమని ప్రార్ధిస్తారు. శివుడు దేవతల కోరికని మన్నించి యముణ్ణి పునఃర్జీవితుణ్ణి గావిస్తాడు. యముడు మార్ఖండేయుని చిరాయువుగా ఆశీర్వదిస్తాడు.
అందుకు ఈ కోవేలని యముని మరణ స్థలము మరియు యముని జన్మస్థలంగా వ్యవహరిస్తారు.


మార్ఖండేయుడు చిరంజీవిగా వరం పొందిన ప్రదేశం కాబట్టి ఇక్కడ ఆయిష్య హోమం చేయించుకుంటే అకాలమృత్యు దోషం పోతుందని భక్తుల నమ్మకం. తమిళ నాడు కోవెళ్ళలో కనిపించే మరో ప్రత్యేకత ఏమిటంటే కోవేలకి ప్రదక్షిణం చేసేటప్పుడు ముఖ్య మందిరానికి అనుకోని ఉన్న గోడలకి నాలుగు వైపులా ముందు దక్షిణామూర్తి, లింగోద్భవం, దుర్గాదేవి ఉంటాయి. దుర్గాదేవికి ఎదురుగా చిన్న మందిరంలో “నందికేస్వరుడు “ఉంటాడు. భక్తుల కోరికలు నందికేస్వరునికి విన్నవించుకుంటే ఆతను స్వామి వారికి సిఫారిస్ చేస్తాడట.
గర్భగుడిలోంచి బయటికి వచ్చేక ఎడమ వైపు అమ్మవారి కోవెల ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని “అభిరామి దేవి” అని అంటారు.
అభిరామ భట్టారకుడు అనే మహా భక్తునిచే స్తుతింపబడింది కాబట్టి ఇక్కడ పార్వతి దేవిని “అభిరామి” అని అంటారు.
ఈ కధ ఇలా చెప్తారు.
ఒకనాడు పార్వతీదేవి యొక్క పరమ భక్తుడైన అభిరామ భట్టారకుడు పార్వతీదేవి ధ్యానంలో ఉండి ఆ దేశాన్ని పాలించే మహారాజు రాకని కుడా పట్టించుకోడు. అందుకు ఆగ్రహించిన మహారాజు అభిరామ భట్టారకుని ఆ రోజు తిథి ఏమని అడుగగా అమ్మవారి ధ్యానంలో ఉన్న అభిరాముడు ఆరోజు “అమావాస్య “తిథి కాగా “పౌర్ణిమ” అని చెప్తాడు. దానికి ఆగ్రహించిన రాజు అభిరామునికి “శశరీర అగ్నిప్రవేశ “దండన విధిస్తాడు. ఆ శిక్షలో భాగంగా చెక్కలతో బల్ల పైన కట్టిన చెక్క స్తంభానికి అభిరాముని కట్టి కింద ప్రజ్వలిస్తున్న మంటలో మెల్ల మెల్లగా చెక్క బల్ల కిందకి దింపుతూ ఉంటారు.ఈ లోకంలోకి వచ్చిన అభిరామ భట్టారకుడు అమ్మవారిని ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటూ అమ్మవారి పై అష్టోత్తరం చదవడం మెదలు పెడతాడు. ఈ అష్టోత్తరంలో ప్రత్యేకత ఏమిటంటే మొదటి నామం యొక్క అంత్యఅక్షరంతో తరవాత నామం మొదలవుతుంది. అలా ఆశువుగా గానం చేస్తూ ఉంటాడు అభిరామ భట్టారకుడు 70వ నామం చదువుతూ ఉండగా అమ్మవారు తన కర్ణాభరణాన్ని ఆకాశంలోకి విసురుతుంది. ఆ కర్ణాభరణం అమావాస్య ఆకాసంలో పూర్ణచంద్రునిలా కాంతిని యిస్తుంది. అది చూసి మహారాజు అభిరామ భట్టారకుని క్షమించమని వేడుకొని అప్పటి నుండి అమ్మవారి పేరు అభిరామిగా మార్చి అమ్మవారి సేవ చేసుకొని కాలాంతరాన శివ సాన్నిధ్యం చెందుతాడు. అభిరామ భట్టారకుడు కుడా అమ్మవారి ధ్యానం చేసుకుంటూ కాలాంతరాన అమ్మవారిలో ఐఖ్యం చెందుతాడు.
ఇవి తిరుక్కడయూర్ లోని అమృతఘటేస్వర్ కోవెల విశేషాలు. ఇక్కడకి రైలు మార్గం ద్వారా చేరుకోవాలంటే ఇక్కడకి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ తిరుక్కడయూర్ కి 22కిమి. . దూరంలో ఉన్న “మైలదుత్తురై”. కుంభకోణం నుంచి , చిదంబరం నుంచి బస్సుల సౌలభ్యం ఉంది. తిరుక్కడయూర్ లో భోజన, వసతి సౌకర్యాలు ఉన్నాయి.

1 thought on “తిరుక్కడయూర్ అభిరామి కోవెల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *