March 29, 2024

యాత్రామాలిక – శృంగేరి

రచన: నాగలక్ష్మి కర్రా

శృంగేరి అంటే తెలీని హిందువు వుండడనే నా అభిప్రాయం , వేదపాఠశాల అంటే ముందుగా శృంగేరీ వే జ్ఞాపకం వస్తుంది , మనదేశంలోనే కాదు విదేశాలలో కూడా మందిరాలలో పూజారులైనా , పౌరోహిత్యం చేసుకుంటున్నవారైనా శృంగేరీలోని వేదపాఠశాలలో చదువుకున్నవారే అయివుంటారు. ఆది శంకరాచార్యులవారు స్థాపించిన శారదాపీఠం కూడా ఇక్కడే వుందనీ మనకు తెలుసు. మిగతా వివరాలు ఇవాళ తెలుసుకుందాం.
శృంగేరీ కర్నాటకలోని ‘ చికమగళూరు ‘ జిల్లాలో పడమటి కనుమలలో ‘ తుంగ’ నదీ తీరాన వుంది. బెంళూరునుంచి 335 కిలోమీటర్ల దూరంలోనూ , ఉడిపికి సుమారు 85 కిలోమీటర్ల దూరంలోనూ వుంది. గవర్నమెంటు , ప్రైవేటు బస్సులు ప్రతీ అరగంటకీ వుంటాయి , అలాగే ధర్మస్థళ నుంచికూడా బస్సు సదుపాయం వుంది.
అయితే మనకి తెలిసి ఆదిశంకరులు శారదాపీఠం స్థాపించడం వల్ల శృంగేరీ ప్రసిధ్ది పొందిందనుకుంటే తప్పే. శృంగేరీ పట్టణం వున్న పర్వతాన్ని ఋష్యశృంగగిరి మీద నిర్మింపబడింది. ఋష్యశృంగగిరి కాలాంతరాన శృంగేరిగా మారింది. ఋష్యశృంగ మహర్షిని గురించిన వివరణ మనకి వాల్మీకిరామాయణంలో వుంది , విభకంఠన మహర్షి పుతృడు ఋష్యశృంగమహర్షి , అతను తపస్సుచేసుకున్న పర్వతమే ఋష్యశృంగగిరి గా పిలువబడసాగింది.
ఆది గురువు శంకరాచార్యులవారు పీఠాలను స్థాపించాలని సంకల్పించుకుని సరైన ప్రదేశం కొరకు దేశాటన చేసేరట , ఆసమయంలో తుంగనదీ తీరాన అతను ఓ వింతను చూసేరట , ఓ కప్ప వర్షంలో ప్రసవ వేదన పడుతూవుంటే నాగుపాము జాతివైరం మరచి కప్పకు తన పడగతో వర్షం నుంచి కాపాడుతూ వుందట , కప్పనిశ్చింతగా వుందట. అది చూసిన శంకరులు జాతివైరుల మధ్య యింత స్నేహభావం కలగడం అన్నది ఆ ప్రదేశం గొప్పతనమని గుర్తించి అక్కడ 12 సంవత్సరాలు గడిపి శారదా పీఠాన్ని స్థాపించి గురుకులం ప్రారంభించేరట. ఇక్కడే మొదటి సారి ఆదిశంకరులు తన శిష్యులకు అధ్వైతం గురించి బోధించేరట.
ఋష్యశృంగ మహర్షితపస్సువల్ల పుణ్య భూమిగా మారిన ఈ ప్రదేశంలో శారదాపీఠంస్థాపించాలని ఆదిశంకరులు గంధంతో చెక్కబడిన శారదాంబ విగ్రహాన్ని ప్రతిష్టించేరట.
శారదాపీఠం గురించిన మరో కథ కూడా చెప్తారు అదేమిటంటే శంకరులవారు దేశాటనచేస్తూ ఓ సారి తర్కశాస్త్ర చర్చలో పాల్గొన్నారట , శంకరుల ధాటికి యెవరూ ఆగలేకపోయేరట, ఆఖరుగా మండనమిశృనితో ( ముండన మిశృడు ) చర్చ సాగుతుంది, ఎవరు ఓడిపోతే వారు గెలిచినవారి కి దాసుడవాలనే షరతుకూడా వుంటుంది. మరునాడుతో చర్చముగింపుకి వస్తుందనగా శంకరులవారు ఆధిక్యంలో వుంటారు, మండనమిశృనకు ఓటమి తప్పదు అనే భావన కలుగుతుంది. కలత చెందిన మండనమిశృని పత్ని భారతి కారణం తెలుసుకొని మరునాడు రాజసభకు తానుకూడా వస్తానని చెప్తుంది. పత్నిమాట కాదనలేక మండనమిశృడు రాజసభకు తీసుకువెళతాడు. తర్కసమయంలో భారతి శంకరులను తనతో తర్కించవలసినదిగా కోరుతుంది. సరేనన్న శంకరులను అనేక రకాలైన ప్రశ్నలు వేయగా శంకరులుకూడా ధీటైన సమాధానాలు చెప్తారు. భారతివేసిన ఓ దాంపత్యపరమైన ప్రశ్నకు బ్రహ్మచారి అయిన శంకరుల వద్ద సమాధానం లేకపోవడంతో భారతివద్ద గడువు తీసుకొని పరకాయప్రవేశంచేసి ఓ రాజుగారి శరీరంలో ప్రవేశించి రాణులతోకూడి భారతి ప్రశ్నకు సమాధానం తెలుసుకొని తిరిగి వచ్చి మండనమిశృని ఓడిస్తారు. షరతుప్రకారం మండనమిశృడు శంకరులను దాసునిగా అనుసరిస్తాడు. అప్పటికే శంకరులవారికి భారతి, మండనమిశృలు సరస్వతీ బ్రహ్మ అవతారాలనే జ్ఞానం కలుగుతుంది. మండనమిశృనిని ఎంతవారించినా అతను శంకరుల దాసునిగా తననుతాను సమర్పించుకుంటాడు , మహాసాధ్వి యైన భారతి పతి అడుగుజాడలలో వారిని అనుసరిస్తుంది. శంకరులవారు మొదటి పీఠాన్ని శారదాంబపీఠంగా భారతికి అంకితమిచ్చి తన ఉత్తరాధికారిగా మండనమిశృని నియమించి హిమాలయాలకి వెళ్లి కేదార్ నాధ్ లో కేదారునిలో యైక్యం అయిపోయేరు.
సుమారు 1338లో విజయనగర రాజుల పరిపాలనలో అప్పటి పీఠాధిపతి పన్నెండవ శంకరాచార్యులైన విద్యాశంకరుల జ్ఞాపకార్ధం విద్యాశంకర శివలింగం స్థాపించి కోవెల కట్టించేరు. ఈ కోవెలలో విజయనగర, హోసల మొదలయిన శిల్పకళ కనిపిస్తుంది.
ఇక్కడ మరో చిన్నకధ చెప్పుకోవాలి విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహరరాయలు బుక్కరాయలు తురుష్క రాజులతో యుద్దాలు తరచూ చెయ్యవలసివస్తూ వుండేది, హరిహరరాయలు బుక్కరాయలు విద్యాశంకరుల ఆశీస్సులు పొంది యుధ్దానికి వెళ్లి విజయంపొంది వస్తారు. విజయమైతే వరించిందిగాని సామ్రాజ్య స్థాపనకు కావలసిన ధనం లేకపోడంతో వారు తమ నిస్సహాయతను విద్యాశంకరుల వద్ద మొరపెట్టుకుంటారు, అప్పుడు విద్యాశంకరులు ఆది శంకర విరచితమైన “కనకధారా స్తోస్త్రాన్ని” ఆలపించగా ఆదిశంకరులకు కురిసినట్లే బంగారు ఉసిరికాయలు ఆకాశం నుండి కురిసేయట, వాటిని హరిహరరాయలు, బుక్కరాయలకు ఇచ్చి సామ్రాజ్య స్థాపన చెయ్యమని గురువులు ఆదేశించేరట.
ఈ కోవెలలో శివలింగమే కాక బ్రహ్మ , విష్ణు, లక్ష్మి, సరస్వతి, పార్వతి, గణేశ, కార్తికేయ, దుర్గ, కాళి, బుద్దుడుని కలిపి దశావతారాల విగ్రహాలని చూడొచ్చు. ఇవి కాక యెన్నో పురాణ పాత్రల శిల్పాలు కూడావున్నాయి

శారదాంబ మందిరం ——

ఆదిశంకరులచే ప్రతిష్టించబడ్డ గంధం విగ్రహాన్ని తీసివేసి దాని స్థానంలో విద్యాశంకరులు బంగారు విగ్రహాన్ని ప్రతిష్టించేరు. విజయనగరరాజులు ఈ పట్టణాన్ని విద్యానగరంగా కూడా పిలిచేవారు, మందిరానికి మరమ్మత్తులు, కొత్తకట్టడాలు కూడా చేసేరు.
2014 లో ఏడంతస్థుల గోపురనిర్మాణం చేసేరు. మందిరంలోకి నాలుగు వైపులనుంచి వెళ్లొచ్చు. గర్భగుడిలో బంగారు రధంమీద సరస్వతీదేవితో శారదాంబ ఆశీనురాలై వుంటుంది. ఈ మందిరం లో శైవ ( శివుడే మహదేవుడని నమ్మేవారు ), వైష్ణవ ( విష్ణుమూర్తినే మహదేవుడని నమ్మేవారు ), బ్రాహ్మ్య ( బ్రహ్మనే మహదేవుడని నమ్మేవారు ), గణపత్య ( వినాయకుడే మహదేవుడని నమ్మేవారు ), శక్త్య ( మహాదేవినే మహదేవుడని నమ్మేవారు ), సౌర ( సూర్యుని మహదేవుడని నమ్మేవారు ) లకు సంబంధించిన విగ్రహాలు చూడొచ్చు. శివలింగానికి దక్షిణం వైపున బ్రహ్మ సరస్వతి, పడమర వైపున శివపార్వతుల విగ్రహాలను చూడొచ్చు. గర్భగుడి చుట్టూరా ప్రదక్షిణ మంటపం, మహామంటపం వుంటాయు, చిన్న మందిరాలలో సప్తమాతృకలు, వినాయకుడు, భువనేశ్వరీదేవీలు కొలువై వుంటాయి. వేదపాఠశాల, గ్రంధాలయం, ఆదిశంకరుల మందిరం వుంటాయి.
ప్రతీ రోజూ శారదాంబకి కుంకుమ పూజలు నిర్వహిస్తారు. శారద నవరాతృలు విశేష పూజలు చేస్తారు.
అమ్మవారి విగ్రహం విగ్రహంలా వుండదు, అమ్మవారు స్వయంగా మనని అనుగ్రహించడానికి వచ్చినట్లుగా వుంటుంది. మందిరం చాలా పవిత్రంగా వుంటుంది.
శృంగేరీలో వుండడానికి శారదాపీఠం వారి సత్రాలు వున్నాయి, అక్కడే భోజన సౌకర్యం కూడా వుంది. సత్రం వీధిలో వున్న ఫలహారశాలలో కాఫీ టిఫిన్ లు యెంతో బావుంటాయి.
గ్రంధాలయం గురించి చెప్పుకోవాలంటే శారదాంబ మందిరం మొదటి అతంస్థులో వుంది, ఇక్కడ సుమారు 500 తాళపత్రగ్రంథాలు వున్నాయి, యెన్నో వ్రాతప్రతులు వున్నాయి, వేదాలకు సంబంధించిన యెన్నో గ్రంథాలు యిక్కడ వున్నాయి.
ఇక్కడ శంకరాచార్య ఆశ్రమం, పార్కు , తుంగనది చూడదగ్గవి.
ఇక ప్రకృతి సంగతా చెప్పక్కరలేదు. ఓ పక్క పచ్చని కొండలు, మరో పక్క తుంగనది, ప్రతి అణువణువునా వేదఘోష భూలోకంలో వున్నామా? అనే అనుమానం వస్తుంది. ప్రతీ హింధువూ దర్శించవలసిన ప్రదేశం శృంగేరి అని మాత్రం చెప్పగలను.

వచ్చే సంచికలో మరో ప్రదేశం గురించి తెలియజేస్తానని మనవి తేసుకుంటూ శలవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *