March 28, 2024

శంకరం పెళ్లి

రచన: జీడిగుంట నరసింహ మూర్తి

శంకరానికి వారం రోజుల్లో పెళ్లవుతుందనగా గోదావరికి వరదలోచ్చాయి. గోదావరికి గండి పడి నీళ్ళు ఉదృతంగా ఇళ్ళల్లోకి వచ్చేసాయి. మళ్ళీ ఆర్నేల్లవరకు సరైన పెళ్లి ముహూర్తాలు లేవని శంకరం కాబోయే మామగారు వరద కాదు ప్రళయం వచ్చి పడినా పెళ్లి చేసెయ్యాలని నిర్ణయించేసాడు.
శంకరానిది ఒక ప్రైవేటు కంపనీలో ఉద్యోగం. “ పెళ్ళికి నాలుగు రోజులు సరిపోవా ?” అన్నాడు లీవ్ లెటర్ ను కోపంగా చూస్తూ శంకం బాస్. అతని బాసుకు ముప్పై ఐదేళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదు. అతనికో పెళ్లి కాని అక్కగారు కూడా ఉంది. ఇరవై ఎనిమిది దాటిన ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. తండ్రంత చాదస్తుడు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. మగ పెళ్లి వారితో తిక్క తిక్కగా మాట్లాడి ఎన్నో సంబంధాలు చెడగొట్టు కున్నాడు. ఆయనకు కావలసింది పెళ్లి కొడుకుకి తెలివి తేటలున్నాయా లేదా అనేది కాదు. పెళ్లి కొడుకు తండ్రి కూడా బాగా చదువుకున్న వాడై తను అడిగిన ప్రశ్నలకు తెలివిగా సమాధానం చెప్పగలిగి ఉండాలి. తన కూతుళ్ళు ఇంగ్లిష్ ఎం. ఏ చదివారని, పెళ్లి కొడుకు తెలుగు ఎం. ఏ అని “ మేము ఇంగ్లీష్ వాళ్ళం. మీరు తెలుగు వాళ్ళు . ఈ సంబంధం ఎలా చేసుకునేది?” అంటూ తను ఆడపిల్లల తండ్రనే విషయం పూర్తిగా మర్చిపోయి భాద్యతారహితంగా కూతుళ్ళ పెళ్లి వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు. ఆఖరికి ఒక కూతురు అర్థరాత్రి తండ్రిని కత్తితో బెదిరించి “ పెళ్లి చేస్తావా లేకపోతే ఎవరితోనైనా లేచి పొమ్మంటావా ?” అంటూ కోపంగా అరిచింది. వేరే ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అవుతున్నాయంటే ఆయనకు ఎంతో అసహనంగా వుండేది. కాని తన తప్పు తను తెలుసుకోవడానికి ఆయన ఎప్పుడూ ప్రయత్నించ లేదు. ఆయన కొడుకైన శంకరం బాస్ నారాయణకు అప్పటినుంచి ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నట్లుగా తన దగ్గరకు శుభలేఖ తీసుకు వస్తే చూసి చూడనట్లుగా పక్కన పడేసేవాడు. లీవ్ ఇవ్వడానికి ఒక పట్టాన ఒప్పుకునే వాడు కాదు.
బాస్ ఎక్కువ రోజులు లీవ్ ఇవ్వలేదన్న బాధ ఒక వైపు, గోదావరికి వరదలు మరోవైపు అసలు పెళ్లి చేసుకోవడానికే చిరాగ్గా ఉంది శంకరానికి. బాసును నిర్లక్ష్యం చేసి ఇంకా నాలుగైదు రోజులు సెలవు ఎక్కువ వాడుకుందామంటే అసలే ప్రైవేటు కంపనీలో ఉద్యోగం. తీసేయడానికి నిమిషం పట్టదు. అందూనా తను పెళ్లి చేసుకోబోతున్నాడు. తన తండ్రి సంపాదించి ఇచ్చిన ఆస్తులూ పాస్తులూ అంటూ ఏమీ లేవు. ఉద్యోగం పోగొట్టుకుని చెట్టుకింద కాపురం పెట్టలేడు.
వరద తగ్గు ముఖం పట్టాక హైదరాబాద్ నుండి ముప్పై మందికి పైగా బయలుదేరి రాజమండ్రి చేరారు. పెళ్ళివారు తమ రాక కోసం రెండు మూడు గుర్రబళ్ళు వేసుకుని సిద్దంగా ఉన్నారు. పెళ్లి కొడుకు ఇంకా కొంతమంది ముఖ్యమైన వాళ్లకు ఒక కారును పంపారు. మధ్యలో కారు బురదలో కూరుకు పోవడంతో శంకరం కూడా మట్టిలోకి దిగి కారు తోయాల్సి వచ్చింది. వాళ్ళందరిని చూస్తూంటే మగ పెళ్లివారిలా కనిపించడం లేదు. అప్పుడే మట్టిపని చేసోచ్చిన వాళ్ళల్లా వున్నారు. విడిది ఇల్లు కనిపించ గానే గుర్రాలు గట్టిగా సకిలించాయి. అదో పెద్ద పెంకుటిల్లు. చూర్లు ముందుకు వాలిపోయి వున్నాయి. తల జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చిన జనం అంతా లోపలి ఎగబడ్డారు.
ఒక పక్క తుఫాన్ తాలూకు చాయలు ఇంకా కనిపిస్తూనే వున్నాయి. చలి గజగజా వణికించేస్తోంది. అందులో శీతాకాలం కూడా. దానికి తోడు అప్పడే వడుగూ, స్నాతకం. శంకరానికి ఆ పెంకుటింట్లో ఒక గది కేటాయించబడింది. కాని అప్పటికే ఎవరో ఆడవాళ్ళు ఆ గదిలో పౌడర్ కోటింగులు వేసేసుకుంటున్నారు. వాళ్ళు శంకరాన్ని పెళ్లి కొడుకుగా గుర్తించ లేదనుకుంటా. అనుకోకుండా శంకరం ఒక కర్ర ముక్కలతో చేసిన కిటికీ లోంచి దొడ్డివైపు చూసాడు. అక్కడ మోపులు మోపులుగా తడిసిన కట్టేలున్నాయి. వాటిని మండించాలన్న ప్రయత్నంలో కొందరు ఆపసోపాలు పడుతున్నారు. వాళ్ళ వొళ్ళు మండి పోతోందే తప్ప కట్టెలు మాత్రం మండటం లేదు. ఈ లోపు శంకరం బంధుమిత్రులు, వదినలు, అక్కలు కొద్దిగా కాగిన నీళ్ళతోనే స్నానాలు చేసి ముస్తాబై పోతున్నారు. శంకరం స్నానం చేసాడా లేదా అన్న ఆలోచన అక్కడివారికి లేదు. అసలక్కడ పెళ్లి కొడుకు అనే ఒక జీవి ఉన్నాడని వాడికి అన్నీ చూసాకనే మిగిలిన వాళ్ళ విషయం అన్న ధ్యాస ఎవ్వరికే లేదు. ఈ లోపు ప్లాస్క్ ల్లో కాఫీలు వచ్చాయి. ఒక గుంపు వాటిపై పడి పగలగొట్టేసారు. ఒక ప్రక్క బ్రాహ్మణులు వడుగు ముహూర్తానికి టైమవుతోందని కంగారు పెట్టేస్తున్నారు. పార్వతీ పరమేశ్వరుల్లా శంకరం తల్లితండ్రులు పట్టు బట్టలు కట్టుకుని తయారై పోయారు. శంకరం మాత్రం ఎలాగో పాచి ముఖం మాత్రం కడుక్కో గలిగాడు. దొడ్లో బలవంతంగా వెలిగించిన కట్టేలేప్పుడో ఆరిపోయాయి.
శంకరం ఇంకా స్నానం చెయ్యలేదని తెలుసుకున్న ఒక పిల్ల పురోహితుడు శంకరం పెడ రెక్కలు విరిచి దొడ్లోకి లాక్కుపోయి అక్కడున్న గంగాళంలో నుండి పది చెంబుల నీళ్ళు అతని బుర్రపై గుమ్మరించాడు. శంకరానికి ఈ హటాత్ పరిణామానికి ఊపిరాడలేదు. అతనికో మంచు పర్వతాన్ని కౌగిలించుకున్నట్టుగా ఉంది. వొళ్ళంతా పొగలోచ్చేస్తున్నాయి. ముక్కులు బిగపట్టేస్తున్నాయి. అతని ప్రమేయం లేకుండానే అతనికి పంచెలు మార్చ బడ్డాయి. వేసవిలో కూడా సలసల కాగే నీళ్ళను పోసుకునే అతనికి తుఫాన్ పట్టిన ఈ శీతాకాలంలో ఐసు ముక్కలతో స్నానం చేయించినందుకు అతనికి అక్కడున్న వారందరిపై కసిగా ఉంది. పురోహితులు మంత్రాలు చదువుతూ శంకరాన్ని కూడా మధ్య మధ్యలో చదవ మంటున్నారు. అతని నోటికి గట్టిగా అటో మేకు, ఇటో మేకు, వేసి బిగించినట్టుగా ఉండటంతో కనీసం నోరు కూడా మెదపలేకపోయాడు. పులి మీద పుట్రలా “ అబ్బాయిని మళ్ళీ స్నానం చేయించుకుని రండి “ అని పురోహితులు అజ్ఞాపించడంతో మళ్ళీ పిల్ల పురోహితుడు ఈసారి మళ్ళీ ఈడ్చికెళ్ళినట్లు తీసుకువెళ్ళి మళ్ళీ పది చెంబులు భళ్ళున గుమ్మరించాడు. అతన్ని ఒక మహా సముద్రంలో మధ్యలో ;బయటకు కొట్టుకు రాకుండా విసిరేసినట్లుగా అనిపించింది. ఒక పక్క ఇదేమి పట్టనట్టుగా బంధుమిత్రులు వేడి వేడి ఉప్మా లాగించేస్తూ ఎడమచేత్తో కాఫీని నోట్లోకి వంచుకున్తున్నారు. శంకరంలో మెల్ల మెల్లగా ఒళ్ళు నొప్పులు ప్రారంభమయ్యాయి. ముక్కు పుటాల్లోంచి నీళ్ళు కారడం మొదలు పెట్టాయి. ఒక పక్క తడిసిపోయిన చితుకుల్ని మండించాలని ఒక బ్రాహ్మణుడు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పొగలతో శంకరం మొహం మీద దట్టంగా కమ్మేసింది. అతనికి ఆ పొగల మధ్య ఒక్కసారి భళ్ళున కడుపుతీరా ఏడ్చేయ్యాలని పించింది. పొగకి కళ్ళ నీళ్ళు ఎలాగూ వస్తాయి కనుక తానేడుస్తున్నాడని ఎవరికీ తెలియదు.
వరండాలో పదిహేను పదహారేళ్ళ ఆడపిల్లలు వయ్యారంగా అక్కడున్న వాళ్లకు కాఫీలు, టీలు అందిస్తున్నారు.
“మీ దుంప తెగిపోనూ. ఒక కప్పు కాఫీ నా మొహాన తగలేయ్యండ్రా “ అని అరవాలనుకున్న ప్రయత్నం ఫలించలేదు. వడుగు కార్యక్రమం పూర్తయ్యింది. ఎంత సేపటికి పైకి లేవలేక పోతున్న శంకరాన్ని ఎవరో బలవంతాన లేపి మంచంపై కూర్చోబెట్టారు. ఇప్పుడేదైనా రైలుంటే హైదరాబాద్ పారిపోతే బాగుణ్ణు అనుకున్నాడు శంకరం.
“ఇక స్నాతక కార్యక్రమం. నాయనా తయారవ్వు” అంటూ తొందర చేసారు పురోహితులు. శంకరానికి మాత్రం ఒక మూల రగ్గు కుప్పుకుని మూడంకె వేసి పడుకోవాలని ఉంది. అసలు పెళ్లి ముహూర్తానికి ఆ పెళ్లి కూతురికి తనతో కాకుండా ఇంకెవరితోనైనా పెళ్ళైతే బాగుణ్ణు అన్న వింత ఆలోచన కూడా అతనికి కలిగింది. తనింత అయోమయంగా , అధోగతిలో ఉన్నా కూడా ఎవ్వరూ పట్టించుకోరే ! అసలు తనున్నానని గ్రహించకుండా కొందరాడవాళ్ళు ఏమీ పట్టించుకోకుండా చీరలూ, జాకెట్లూ, మార్చేసు కుంటున్నారు. తన గదిలో వాళ్ళను చూడలేక తను సిగ్గుతో చచ్చిపోతున్నాడే తప్ప వాళ్ళకేం పట్టడంలేదు.
రాత్రి పదకొండు గంటలకు పెళ్లి. తెల్లవారు ఝామున మూడు గంటలకు గృహ ప్రవేశం. విడిదంతా గురకలు పెట్టే వాళ్ళతో రామడోలు వాయిన్చినట్టుగా ఉంది. తనకు కేటాయించిన గదిలో ఎవరో ఒకరి మీద ఒకరు పడుకుని నిద్ర పోతున్నారు. ఇక చేసేది లేక కండువా నెత్తి కింద పెట్టుకుని గడప మీదే నిద్రపోయాడు శంకరం.
ఉదయానికి కొంతమంది చుట్టాలు పక్క ఊళ్లకు సర్దుకున్నారు. శంకరం గది ఖాళీ అయ్యింది. “ నిన్నంతా మీరు చలితోనూ, తలనొప్పితోనూ భాధపడ్డారుటగా ఈ మాత్ర వేసుకోండి “ అంటూ వేడి వేడి కాఫీతో మాత్ర అందించిన కొత్త పెళ్లి కూతురు అదే తన భార్యను చూడగానే శంకరం మంత్రం వేసినట్టు అప్పటి వరకు జరిగిందంతా మర్చి పోయాడు.

(సమాప్తం)

1 thought on “శంకరం పెళ్లి

  1. కొన్ని పెళ్ళిళ్ళలో – నాకు కూడా తటస్థపడిన సంఘటనలు ఇవి, భలే రాసారు – మీరు 🙂 🙂
    [ కాదంబరి కుసుమాంబ – pen name ] ;

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *