March 28, 2024

విదేశవిహారం చేద్దాం నాతోరండి – ( మలేషియా )

రచన: కర్రా నాగలక్ష్మి

మలేషియ, ఈ మధ్య కాలంలో బలమైన ఆర్ధిక దేశంగా రూపుదిద్దుకుంటున్న దేశం, మంచి పర్యాటక దేశంగా కూడా రూపు దిద్దు కుంటోంది. మలేషియ ముస్లిం దేశంగా ప్రకటించుకుంది. అయినా ఇక్కడ హిందూ బౌద్ద మతాలకు కూడా అంతే ప్రాముఖ్యతను ఇచ్చేరు. పదమూడు రాష్టాలు, దక్షిణ చైనా సముద్రం వల్ల రెండు ద్వీపాలుగా విభజింపబడ్డ ఈ దేశంలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు వున్నాయి.
ఈ సంచిక నుంచి మీకు మలేషియా లోని ప్రదేశాలను, ఒకటొకటిగా పరిచయం చేస్తాను.
మా వారి ఉద్యోగ రీత్యా రెండు సంవత్సరాలు మలేషియలో వుండవలసి వచ్చింది. అక్కడ శని ఆదివారాలు శలవు రోజులు. క్రొత్త ప్రదేశాలు చూడడం మా హాబీ అవడం వల్ల ప్రతీ వారాంతపు శలవులకి ఏదోక ప్రదేశానికి బయలుదేరేవాళ్లం. అక్కడి మా అనుభవాలను మీతో పంచుకుంటాను.
కొత్త దేశం, కొత్త భాష. నాకు కొత్త భాషలు నేర్చుకోడం, వారి ఆచార వ్యవహారాలను పరిశీలించడం హాబీ.
ఇక్కడి ప్రజలను గమనిస్తే హిందూ, చైనీస్, మలయా మూడు దేశాల ఆచార వ్యవహారాలు నరనరాన జీర్ణించు కున్నట్లు కనిపిస్తారు. మలేషియన్ వాసులు అధిక శాతం ముస్లింలు . ముస్లిం ఆచారవ్యవహారాలను తుచ తప్పకుండా పాఠించడం కనిపిస్తుంది, అలా పాఠించక పోతే కఠిన శిక్షలు ఉంటాయి. అయితే ఇక్కడ మతాంతర వివాహాలు చాలా యెక్కువగా జరుగుతూ వుండడం చూసేం. ఇలాంటి వివాహాలకు మతపెద్దలు కాని గవర్నమెంటు వారు గాని యెటువంటి ఆంక్షలు పెట్టకపోవడం, పరువు హత్యలు లాంటివి కనబడక పోవడం ఆశ్చర్యాన్ని కలుగ జేసింది. మగపిల్లవాడి మతాన్ని బట్టి ఆడపిల్ల మతం నిర్ణయించబడుతుంది, లేదా యెవరి మతాన్ని వారు ఆరాధించుకోవచ్చు.ఇక్కడి స్థానికుల ఆచారావ్యవహారాలు చాలా మటికి మన వాటినే పోలి వుండడం ఆశ్చర్యానికి గురిచేసింది.అంటే అన్నప్రాశన, పుట్టుజుత్తులు తియ్యడం లాంటివి, ఇంకా కొందరు ఒడుగు చేసి జంద్యం వెయ్యడం కూడా చూసేం. మాకు తెలిసిన ముస్లింని ఈ విషయమై ప్రశ్నించగా అతను మా పూర్వీకులు హిందువులు కదా, మేం మా పూర్వీకులు ఆచరించినవే ఆచస్తున్నాం, మంచి అన్నది అన్ని మతాలలోనూ మంచే కదా? అని సమాధానమిచ్చేడు. మన దేశం లో ఇలాంటి అవగాహన లోపించింది ఎందువల్లనో?.

ప్రజలలోనూ పాలకులలోనూ పరమతసహనం చాలా ఉఛ్చ స్థాయిలో కనిపించింది.
చెప్పకపోవడమేమిగాని ముందు ముస్లిం దేశం వెడుతున్నాం, అక్కడ ఎన్ని యిబ్బందులు ఎదుర్కోవాలో అనుకున్నాం కాని తిరిగి వచ్చేటప్పుడు దేశం విడిచి రావాలంటే గుండెలు బరువెక్కేయి.
అక్కడ మేం మూడు బెడ్రూముల సర్వీస్ అపార్ట్మెంటు తీసుకున్నాం, వంటగదిలో గ్యాసు, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ లతో పాటు వంట పాత్రలు కొన్ని ఉంటాయి. రోజు విడచి రోజు ఇల్లు శుభ్రం చెయ్యడానికి మనిషిని పంపుతారు. పదిహేను రోజులకు ఓ సారి దుప్పట్లు, టవల్స్ మార్చుతారు.
కనీసం రోజూ యెదురు పడే వారితో మాట్లాడదామన్నా భాష రాదు. పనులకు వచ్చేవారు యెక్కువ సంఖ్యలో ఇండోనీషియా వారు అధిక శాతం లో వుండేవారు. పనికి వచ్చేవారికి ఇంగ్లీషు వస్తుందని అనపకోవడం నా తెలివి తక్కువ అని మొదటి రోజే తెలుసుకున్నాను. మరునాడే ఇంగ్లీషు మలయ నిఘంటువు కొని మెల్లగా రెండేసి పదాలు జోడించి మాట్లాడ్డం నేర్చుకున్నాను.
నా ముచ్చట్లు తరువాత ముందు మలేషియ దేశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

చరిత్రకారుల ప్రకారం మలేషియ దేశంలో సుమారు 40 వేల సంవత్సరాలకు పూర్వం నుంచి జీవరాశులు వుండేవి. ఒకటవ శతాబ్దం లో భారతదేశం నుంచి చైనా దేశం నుంచి వర్తకానికి వ్యాపారులు రాకపోకలు సాగించసాగేరు. రెండవ శతాబ్దంలో వ్యాపారులు తీరప్రాంతాలలో తాత్కాలిక నివాసాలు యేర్పరచుకోసాగేరు.
15 వ శతాబ్దం లో భారత దేశాన్ని పరిపాలించిన చక్రవర్తి శ్రీ విజయాదిత్య ఆధీనంలో వుండేది, సింగపూరు, మలేషియా దేశాలకు “పరమేశ్వర” అనే రాజుని అధిపతిగా నియమించేడు చక్రవర్తి శ్రీ విజయాదిత్య. తరువాత ‘ మలక్క ‘ సుల్తానుల ఆధీనం లోకి వచ్చింది. 1511 లో పోర్చుగల్ ఆధీనం లో, 1641 నుంచి డచ్ వారి ఆధీనంలో వుంది. 1786 లో మలక్క సుల్తానులదగ్గర “పినాంగ్” ద్వీపాన్ని ఆంగ్లేయులు తమ ఈస్ట్ ఇండియ కంపెనీ స్థాపనకై లీజుకి తీసుకున్నారు. రెండవ ప్రపంచయుద్దం వరకు ఈ దీవి ఆంగ్లేయుల ఆధీనం లోనే వుంది. రెండవ ప్రపంచయుధ్దంలో ఈ భూభాగం జపాన్ గెలుచుకుని మూడు సంత్సరాలు ఆర్మీని ఉంచేరు. 1948 ఫిబ్రవరి 1 న సింగపూరు, మలక్క , దీవులతో పాటు తొమ్మిది రాష్ట్రాలు గల మలేషియాని మలేషియా సమాఖ్య దేశాలు గా యేర్పరచేరు. 1957 ఆగస్ట్ 31 న మలేషియా స్వాతంత్రం పొందింది. 1963 లో మలేషియా, సింగపూర్ లు సమైఖ్య రాజ్యాలనుంచి విడిపోయేయి. ఆంగ్లేయుల పాలన లో వున్నప్పుడు పొరుగు దేశాలైన భారత, చైనా దేశాలనుంచి కార్మిక వలసలను ప్రోత్సహించేరు. అంటే సుమారు 1800 సంత్సరం నుంచి మలేషియ నేలమీద భారత, చైనా పౌరులు నివసించేవారు.
ప్రస్తుతం పదమూడు రాష్ట్రాల తో కూడిన దక్షిణ చైనా సముద్రం తో రెండుద్వీపాలు విభజింపబడ్డ మలేషియ దేశం వంశపారంపర్యంగా రాచరికానికి వచ్చే తొమ్మిది రాష్ట్రాల రాజులూ ఒకొక్కరూ 5 సంవత్సరాలకి రాష్ట్రపతిగా , ప్రజలచే యెన్నుకోబడిన పార్టీ నాయకుడు ప్రదానమంత్రిగా విధులు నిర్వర్తిస్తూవుంటారు.
దేశరాజధాని కౌలాలంపూరు, పరిపాలనా భవనాలు ఉన్న ప్రదేశాన్ని “పుత్రజయ” అని అంటారు.
రాజ భాష “మలయ” లేక “భహష మలయ “, రెండవ భాష గా ఆంగ్లం. మలయ భాషని లిపి లేని భాష అనొచ్చు. ఆంగ్ల లిపి నే మలయ భాషకు వాడతారు. కొన్నాళ్లు పోతే మన దేశంలోని భాషలకు కూడా లిపి లేకుండా పోతుందేమో?, ఇప్పటికే మన దేశంలో చాలా మంది మాతృభాషలో చదవడం వ్రాయడమేకాదు మాట్లాడ్డం కూడా మరచిపోయేరు, స్మార్ట్ ఫోనులు వచ్చేక తెంగ్లీషు వాడకం ఎక్కువైంది . ఇలా కొన్నాళ్లు గడిస్తే హిందూ భాషలకి ఆంగ్ల లిపి నే వాడవలసి వస్తుందేమో?.
మలేషియ దేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత చాలా త్వరగా అభివృధ్దిని సాధించింది. దాంతో ప్రపంచ సంపన్నదేశాల దృష్టిలో పడింది.

మలేషియా దేశాభివృధ్ది లో రబ్బరు, పామాయిలు, చమురు ముఖ్య పాత్ర వహించేయి. ఈ దేశ మట్టి, వాతావరణ పరిస్థితులు ఆహారధాన్యాలు పండించేందుకు సహకరించవు. ఆహారధాన్యాలు, కాయగూరలు పొరుగు దేశాలనుంచి దిగుమతి చేసుకుంటారు.
ఇక్కడి ప్రజలు శాంతికాముకులు, అమాయకులు, కష్టజీవులు. సాంప్రదాయాలను ఖచ్చితంగా పాఠిస్తారు. ప్రభుత్వం విధించే నియమనిబంధనలను తుచ తప్పకుండా పాఠిస్తారు. ఆడమగ సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు. మిగతా ముస్లిం దేశాలలో వున్నట్లు స్త్రీవిద్య మీద ఆంక్షలు లేవు.
మిగతా దేశాలలో మాదిరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చెయ్యడం, ర్యాలీలు నిర్వహించడం కనబడదు.
ఇవి మలేషియన్ల గురించిన కొన్ని వివరాలు, ఇక మనం మన యాత్రా వివరాలలోకి వెళదాం.
ముందుగా మీకు మలేషియాలోని నాలుగవ పెద్ద ద్వీపమైన “పినాంగ్” ని పరిచయం చేస్తాను.
1786 లో ప్రాన్సిస్ లైట్ అనే ఈస్ట్ యఇండియా కంపేనీ అధికారి నేతృత్వం లో ఈ ధ్వీపం కనుగొనబడింది. ఈ ద్వీపం వైశాల్యం సుమారు 293 చదరపు కిలోమీటర్లు. మలేషియ దేశంలో “ పినాంగ్ “ వాణిజ్యపరంగా పేరుపొందిన జిల్లా. దీని ముఖ్యపట్టణం “బటర్ వర్త్”, జిల్లా ముఖ్యపట్టణం ముఖ్య భూభాగం లో ఉంది, బటర్ వర్త్ ని పినాంగు ద్వీపంతో కలుపుతూ ఎనిమిది లైన్ల బ్రిడ్జ్ సముద్రం మీద నిర్మింపబడింది .
బటర్ వర్త్ లో చాలా కంపెనీలు ఉన్నాయి. మా వారి వుద్యోగ రీత్యా వెళ్లిన మేం మలేషియ దేశానికి చెందిన “పినాంగ్“ ద్వీపంలో 32 అంతస్థుల సర్వీస్డ్ అపార్ట్ మెంట్ లో 14 అంతస్థులో వుండేవాళ్లం, అదీ సముద్రానికి దగ్గరగా. బల్కనీ లోంచి అనంతమయిన సముద్రాన్ని చూస్తూ కూర్చోడం అలవాటయింది. దూరంగా కదులుతున్న ఓడలను చూడడం , మద్యాహ్నం యెండలో తళతళ మెరుపులు విరజిమ్మే సముద్రాన్ని చూడడం ఓ వ్యసనంగా మారింది.
ముఖ్యభూభాగం నుంచి “పినాంగ్ “ లోకి ప్రవేశించడానికి రెండు మార్గాలున్నాయి ఒకటి రోడ్డు బ్రిడ్జ్ మీదుగా మరొకటి నీటిమార్గం ద్వారా. నీటిమార్గం ద్వారా వెళ్లడానికి పెద్ద ఓడలో సుమారు 15 నిముషాలు ప్రయాణించాలి. ఈ ఓడ మూడంతస్థులలో వుంటుంది. రెండంతస్థులలో కార్లు బారులు తీరివుంటాయి, ఒకంతస్థులో మనషులు ప్రయాణించడానికి వీలుగా వుంటుంది. ప్రతీ పదినిముషాలకు ఓ ఓడ బయలుదేరుతుంది. కారు రోడ్డుమీంచి తిన్నగా ఓడలోకి చేరుతుంది వరుసలో కార్లని నిలుపుకొని కారులోని వారు ఓడలోని రైలింగు దగ్గర నిలబడి సముద్రాన్ని చూసే వీలుంది. సముద్రపునీరు ఎంత స్వచ్చంగా ఉంటుందంటే లోతుగా నీళ్లల్లో ఉన్న సముద్ర జీవులు కనిపిస్తూ ఉంటాయి. అలా మన కార్లను ఓడలో పెట్టుకొని అవతలి ఒడ్డుకి చేరేక తిరిగి కార్లో ప్రయాణించడం మొదటి మారు కావడం తో ఎంతో థ్రిల్ల్ గా అనిపించింది. అయితే ప్రతీమారూ ఆ ప్రయాణం నాకు చాలా నచ్ముచేది. సముద్రంలో “జెల్లీ “ చేపలు నీటిలో ఈదుతూ ఉంటే ఓడలో ప్రయాణం చేస్తూ వాటిని చూడడం కూడా చాలా బాగుండేది. అసలు అలాంటి చేపలు కూడా వుంటాయని మలేషియ లోనే తెలిసింది.
“పినాంగ్” లో అధిక సంఖ్యలో చైనీయులు, హిందువులు ఉండటం తో ఇక్కడ “ కెపితాన్ కెలింగ్ “ మసీదే కాకుండా అనేక చైనా మందిరాలు, మారియమ్మ ( పార్వతీ దేవి ) మందిరం, రాధా కృష్ణమందిరం, గురుద్వారాలే కాక చాలా పర్యాటక ప్రదేశాలున్నాయు.
“ పినాంగ్” అంటే అర్దం చెప్పలేదు కదా?, పినాంగ్ అంటే మలయ భాషలో “ పోకచెక్క” అని అర్దం, ఈ దీవి మొత్తం పోకచెక్క చెట్లతో నిండివుండేదని ఈ దీవికి ఈ పేరొచ్చిందని కొందరి అభిప్రాయంకాగా కొందరు ఈ దీవి ఆకారం పోకచెక్క వృక్షాన్ని పోలివుంటుంది కాబట్టి అలా పిలుస్తున్నారని అంటారు.

పై సంచికలో ఇక్కడి పర్యాటక ప్రదేశాలను గురించి మీకు తెలియ జేస్తాను, అంతవరకు శలవు.

1 thought on “విదేశవిహారం చేద్దాం నాతోరండి – ( మలేషియా )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *