March 29, 2024

చెద

రచన: శైలజ నానిశెట్టి

వసంత ఆ రోజు పొద్దుటే ఫోన్ చేసి చెల్లెలు వేద దగ్గరికి వచ్చింది. వేద వయస్సు యాభై పైన. ఓ అయిదేళ్ల క్రితం భర్త సంతోష్ ఆక్సిడెంట్లో పోయాడు. అప్పటికే ఇంజనీరింగ్ చదువుతున్న పెద్ద కొడుకు విక్రమ్, టీనేజ్ లో అడుగు పెడుతున్న రెండో కొడుకు విశ్వాస్ తల్లిని జాగ్రత్తగా చూసుకొన్నారు. భర్త పోయినప్పటి నుండి, వేద ఎక్కడికీ రావడం మానేసింది. భర్త అకాల మరణం ను భరించలేకపోయింది. ఎంత బతిమాలినా, బలవంత పెట్టినా వచ్చేది కాదు. అప్పుడప్పుడు తల్లి, తండ్రి, తోబుట్టువుల బాధ ని చూడలేక వచ్చినా, ఎవరితో కలిసేది కాదు. ఇంకా దుఃఖం లో నుంచి తేరుకోనట్టుగానే ఉండేది. ఆమె ఏకాంత ప్రియత్వాన్ని అందరూ ఆమోదించారు. కాలం అన్ని సమస్యలకు పరిష్కారం అనుకొని వేద మనస్సు సర్దుకుంటుంది అని అందరూ వేచి ఉన్నారు.
పిల్లలిద్దరూ హాస్టల్ లో ఉండి చదువుకోవడంతో, వేద తన సైంటిస్ట్ ఉద్యోగం చేసుకుంటూ అందులో పూర్తిగా మునిగిపోయింది. పిల్లలు కూడా వాళ్ళ పరిధిని పెద్దగా పెంచుకోలేదు. స్కూలు, కాలేజీ తప్ప మరో ప్రపంచం లేకుండా తయారు అయ్యారు. వేద చాలా సెన్సిటివ్ గా అయ్యి, ప్రతీ చిన్న విషయానికి ఇరిటేట్ అవుతుందని, అందరూ జాగ్రత్తగా ఉండడం మొదలు పెట్టారు. పిల్లలిద్దరూ కూడా ఆమెను నొప్పించే పనులేమీ చేయరు. చాలా సపోర్ట్ చేశారు. విక్రమ్ పెళ్లి కూడా క్రిందటి సంవత్సరం అయ్యింది.
విక్రమ్ ఈ మధ్యనే ఫోన్ చేసి “పెద్దమ్మా ! ఒక్కసారి అమ్మతో మాట్లాడు. తాను ఏదో వ్యధను కల్పించుకొని, తనను తానే హర్ట్ చేసుకుంటుంది, మమ్మల్ని కూడా పదే పదే హర్ట్ చేస్తుంది. మేమెంత సర్దుకున్నా, తాను విసిరే మాటలు పెద్ద గాయాలే చేస్తున్నాయి. మా అందరికీ పెద్దదానివి, కొంచెం అమ్మకి అర్ధమయ్యేటట్టు చెప్పు, ప్లీజ్ పెద్దమ్మా!” అన్నాడు. ఆ పని మీదే ఈరోజు వేద దగ్గరికి వచ్చింది. భోజనాలు అయిన తర్వాత నాలుగు మాట్లాడుకుందాం అని మంచం మీద కూర్చోపెట్టింది వసంత.
వేద కి కాస్త సినిమాలు అంటే ఇష్టం ఉండేది. అమెజాన్ ప్రైమ్ లో కొత్త సినిమాలు దగ్గర మొదలుపెట్టి, ఈ మధ్యనే రిలీజ్ అయిన రాంగోపాల్ వర్మ మర్డర్ సినిమా దగ్గర ఆగారు. “ఆనర్ కిల్లింగ్” చాలా దారుణం అన్నది వేద. “అవును, ఎవరి గౌరవార్ధం ఈ హత్యలో” అని నిట్టూర్చింది వసంత. “ఇవన్నీ చట్ట పరిధిలోకి వచ్చే నేరాలు. ధన, ప్రాణ, మాన హాని జరిగినట్లయితే ప్రభుత్వం నేరం గా గుర్తిస్తుంది. రకరకాల మానసిక హింస, అహంకారంతో, సాంప్రదాయకంగా కుటుంబంలో జరిగే మానసిక హింసని, చట్టమూ, సమాజమూ గుర్తించదు. ముఖ్యంగా మన దేశంలో. సానుభూతి చట్రం లో బిగుసుకొని, సెల్ఫ్ పిటీతో, జీవితం నాశనం చేసుకున్న వాళ్ళు ఎందరో.” అన్నది వసంత. ఏమీ మాట్లాడకుండా అలాగే కూర్చుంది వేద.
కొంచెం ముందుకు వంగి వేద చేతిమీద చేయి వేసి, “ఏమైంది వేదా?” అని అడిగింది. చాలాసేపు మాట్లాడకుండా అలాగే నిశ్చలం గా కూర్చోంది వేద. తనే మొదలు పెట్టింది మాట్లాడడం “ఈమధ్య చాలా నిస్సత్తువగా ఉంటుంది అక్కా, జీవితం అంతా ఆగిపోయినట్టుంది. నా మీదే నాకు కోపం. పిల్లల మీద కోపం. చాలా చిరాకు. ఎవరు పలకరించినా కరుగ్గా మాట్లాడాలనిపిస్తుంది. వాళ్ళని హర్ట్ చేయాలనిపిస్తుంది. నేను ఏమైనా అనేస్తానేమో అని అందరూ భయపడుతూంటే ఏదో తృప్తి. అంతలోనే, ఎవరిని ఏమనేసి, ఏ ఉపద్రవం తెచ్చుకొంటానో అని భయం. విక్రమ్, విశ్వాస్ ఇద్దరూ ఫోన్ చేస్తారు. సరదాగా మాట్లాడుదామని అనుకొంటారు. నేనేదో అనగానే, హుషారు అంతా మాయం అయిపోతుంది. అసందర్భంగా కాల్ కట్ అయిపోతుంది. నాలో నాకే అసంతృప్తి. ఈ ఒంటరి జీవితం పట్ల.” మాట్లాడుతూ, మాట్లాడుతూ.. అలాగే నిద్రపోయింది. వేద తల నిమురుతూ.. ఆలోచనలో పడింది, వసంత.
వసంతకి సమస్య కొంచెం అర్ధమయ్యింది. కొన్ని సంవత్సరాలుగా ఒంటరి జీవితం, భర్తతో వియోగం, పిల్లలు తనని అర్ధం చేసుకోవట్లేదేమో అనే అనుమానం, అయిన వాళ్లందరూ జీవితం లో బిజీ అయిపోయి, తనకు సమయం ఇవ్వలేరేమో అనే సందేహం, అందరూ తమ జీవితంలో సంతోషంగా ఉంటే, నాకే ఎందుకిలా అయ్యిందని బాధ. ఎదుటివాళ్ళ ఆనందానికి తాను ఆటంకమేమో అనే సందేహాలతో బాధపడుతూ, తనని తానే ధ్వంసం చేసుకుంటుంది. ఇలా ఆలోచిస్తూ నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంది వసంత.
అంతర్గతంగా ఉన్న వ్యధ ఏదో తినేస్తోంది వేదని. చిన్నప్పటినుండీ ఎంతో బాగా చదువుకొని, సీనియర్ అయిన సంతోష్ సంబంధం రావడం, ఇష్టపడి పెళ్లి చేసుకొన్నారు. ఉద్యోగరీత్యా కాస్త ట్రాన్స్ఫర్లతో బాధపడినా, ఇద్దరు పిల్లలతో చక్కగా కనిపించేవారు. అలాంటిది అతను అకస్మాత్ గా పోవడంతో వేద ఖేదంలో పడిపోయింది. పూర్తిగా.. తాను, తన కుటుంబం కూడా! కుటుంబం చుట్టూ ఒక మహా దుఃఖంతో కోట కట్టింది. ఈ కోట ఎలా విరగ్గొట్టడం? ఇందులో పడి తాను, పిల్లలు ఊపిరి అందకుండా అల్లాడుతున్నారని తెలియట్లేదు. కొత్తగా జీవితం మొదలుపెడుతున్న పిల్లలు ఈ దుఃఖపు ఒరవడిని ఎలా తట్టుకుంటారు? లాభం లేదు, వేదతో మాట్లాడాల్సిందే. అనుకొని పక్కకు తిరిగి పడుకొంది.
సాయంకాలం అలా టెర్రస్ మీదకి తీసుకెళ్లింది. చుట్టూ కుండీలు ఓ నూటయాభై ఉండి ఉంటాయి. ఎన్నో మొక్కలు, అన్నీ ఎండిపోయి చచ్చిపోయాయి. ఓ నాలుగు రోజులు పని చేస్తే గాని, సరి అయిన తోట తయారవ్వదు. అనుకొని నిట్టూర్చింది వసంత.
కాఫీ పట్టుకొని మేడ మీదకి వచ్చింది వేద, “అక్కా! నేను మారాలని అనుకుంటున్నాను, కాస్త సహాయం చేయి” అని అడిగింది. “ముందు నువ్వు చెప్పు, నీ మనసులో ఉన్నది.” అన్నది వసంత.
“ఏదో శూన్యం అక్కా. సంతోష్ పోయిన తర్వాత పనితో ఆ లోటుని పూరించుకోవాలని అనుకొన్నాను. ఎంతో పని, పిల్లల్ని పట్టించుకోకుండా పని చేశాను. మామూలుగా కూడా పనిలో ఎప్పుడూ ముందుండేదాన్ని. ఇంటికి వస్తే అంతా ఖాళీ, అందుకే ఇంకాస్త వుద్యోగంలో కూరుకుపోయాను. ఆ మాటకు వస్తే సంతోష్ ఉన్నప్పుడు కూడా మాకు కుటుంబ జీవనం తక్కువ. మా ఇద్దరిదీ వీకెండ్ సంసారం, ఇద్దరివీ వేరు వేరు ఊర్లు, సెలవులకి ఎక్కడికీ వెళ్ళేవాళ్ళం కాదు, డబ్బు ఖర్చు అని కొంత, ఆఫీసులో మా పని ఎవరైనా ఎత్తుకుపోతారని కొంత. హోమ్ లోన్ లు తీర్చుకోవడం, పిల్లలకు ఆస్తులు సమకూర్చుకోవడం వీటితోనే సరిపోయింది. అయినా ఒకరికి ఒకరు ఉన్నామనే ధీమా, నలుగురికన్నా, ఆ మాటకి వస్తే మీ అందరికన్నా కూడా బాగా సంపాదిస్తున్నామనే గర్వం. సిబ్లింగ్ రైవల్రీ. ఇవన్నీ ఎప్పుడూ ఇలా చెప్పాల్సి వస్తుందని గాని, అసలు ఇలాంటి స్థితి వస్తుందని అనుకోలేదు. చాలా పర్ఫెక్ట్ చిత్రం మా కుటుంబం అనే భ్రమలో ఉండేవాళ్ళం నేను, సంతోష్.”
“ఇద్దరం విడివిడిగా ఉండడం వలన పిల్లలు వాళ్ళ వాళ్ళ ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఈ ఇద్దరి వేరు వేరు ప్రపంచాలలోకి తొంగి చూడలేక నేనొక ప్రపంచం తయారు చేసుకున్నాను. మీ అందరినీ దూరం చేసుకొన్నాను. ఎంత దూరం జరిగితే అంత గొప్పదాన్ని అనుకున్నాను. నా రీసెర్చ్ అసిస్టెంట్లు, సహోద్యోగులు, వచ్చే ప్రశంసలు ఇవే జీవితం అనుకొన్నాను. విక్రమ్ పెళ్లి అయిన తరువాత రాగిణి ఎంతో ఆప్యాయంగా దగ్గరికి వచ్చింది. నన్ను తల్లిలా ప్రేమగా చూసింది. నేనే ఆ అమ్మాయిని సరిగ్గా చూడలేదు. మాట్లాడలేదు. అయినా విక్రమ్ ఏమీ కంప్లైంట్ చేయలేదు. నా బుర్రకి ఆ అమ్మాయి అణకువ, ప్రేమ అర్ధం అయ్యాక ఇప్పుడు మాట్లాడాలంటే బెదురు. కాకపోతే నా అహం అడ్డొస్తుంది. ఏం చేయమంటావక్కా? ఏ కొంచెం సరదా మనస్సుకి కలిగినా సంతోష్ కి ద్రోహం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఈ బాధ నుండి నాకు విముక్తి లేదనిపిస్తుంది. ” అని ఆగింది వేద.
“నీ బాధ అంతా అర్ధం అవుతుంది వేదా! నువ్వు గట్టిగా ఇందులో నుండి బయటపడాలని అనుకుంటే నీ వల్ల జరుగుతుంది. అయినా ఇప్పటికిప్పుడు ఇదంతా సర్దుకోవాలంటే కూడా కష్టం కదా! పద డిన్నర్ తయారు చేసుకొందాం.” అన్నది వసంత.
క్వినోవా పొంగలి చేసుకొని శనివారం ముగించారు ఇద్దరూ. మర్నాడు ఆదివారం, రిలాక్స్డ్ గా లేచి బ్రెడ్ తో అల్పాహారం ముగించి కూర్చొన్నారు అక్కా చెల్లెళ్ళు. “లంచ్ ఏం తిందాం అక్కా?” అని అడిగింది వేద. “ఈ రోజు స్విగ్గి చేసుకొందాం.” అంది వసంత. ముందురోజు సంభాషణ తో కొంచెం మనసు సర్దుకొన్నదేమో నవ్వి ఓకే! అన్నది వేద.
“పిల్లలు ఎలా ఉన్నారు?” అని అడిగింది వేద. “బాగున్నారు వేదా! నిన్ను అడిగామని చెప్పమన్నారు. ” అన్నది వసంత.
“ఈ మధ్య ఏమైనా పుస్తకాలు కొన్నావా?” అని అడిగింది వసంత. తల దించుకొని కూర్చుంది వేద ఉలుకు, పలుకు లేకుండా! ఏదో ఆలోచన, మొహం దుఃఖంతో నిండి పోయింది. “లేదక్కా! సంతోష్ పోయిన దగ్గరినుండి, పుస్తకం ముట్టుకోలేదు.” అన్నది. వసంత వేద ని దగ్గరికి తీసుకొని, “ఈ ఒత్తిడి నుండి బయటపడు వేదా! సమస్తమైన దుఃఖాలకు, మంచి పుస్తకం, సత్సాంగత్యం, డైరీ రాసుకోవడం ఉపశమనాన్నిస్తాయి. సంతోష్ ని నువ్వు మర్చిపోయావేమో అని ఎవరూ సందేహించరు. అతను లేకపోవడం నీ వ్యక్తిత్వ లోపం కాకూడదు. ప్రపంచానికి, నువ్వు అసంపూర్తిగా కనపడాల్సిన అవసరం లేదు. ఒంటరిని హింసించే గుణం మన సమాజంలో ఉంది. నిస్సహాయంగా కనిపిస్తే హింసించాలనే మానవ ప్రవృత్తి సహజం. ఆ సహజత్వాన్ని ఆమోదించనూ అక్కర్లేదు. మనల్ని మనం హింసించుకోనూ అక్కర్లేదు. తిరస్కారాన్ని భరించే శక్తి నీకు లేదని అనుకోను. నీలో నువ్వు ముడుచుకొని, నీ పిల్లలని నీ ప్రేమ నుండి వంచించకు. ఒక చిన్న పొదరిల్లులా ఉన్న నీ కుటుంబం చెదిరిపోతూ ఉంటే, విక్రమ్ బాధ పడుతున్నాడు. కుటుంబ పెద్దగా, బాధ్యత పంచుకో. విక్రమ్, రాగిణి ల ఆనందమయ సంసారం చూస్తూ నువ్వూ సంతోషంగా ఉండు. ఈ రోజుల్లో, పిల్లల సంతోషమయ జీవితాన్ని దగ్గరినుండి చూసే అదృష్టం అందరికీ దక్కటం లేదు. దానికి వివిధ కారణాలు.
ముందు నిన్ను నువ్వు నిలబెట్టుకో, ఆర్ధికంగా కాదు, హార్దికంగా. నువ్వు ఇచ్చే ఆస్తులకన్నా, నీ పలకరింపు నీ పిల్లలకి ఆత్మస్థైర్యం కలిగిస్తుంది. ఇలా చెద పట్టిన శిధిలభవనంలా కాకుండా, నిన్ను నువ్వు పునర్నిర్మించుకో. నీకింకా ముందు ఎంతో జీవితం ఉంది. కొడుకులు, కోడళ్ళు, మనవళ్లుతో కుటుంబం విస్తృతం చేసుకో. ముభావంగా ఉండడం, భర్తో, భార్యో పోతే ఏదో అనర్హత, న్యూనత అనుకోవడం మానుకో. నీ భుజాల మధ్య, నీ ఒడిలో పిల్లలకు దొరికే నిశ్చింతని వాళ్ళకి కరువు చేయకు. ఎలాంటి సందేహాలు లేకుండా నీ జీవితాన్ని ఆహ్లాదభరితంగా చేసుకో. బాధ్యతలనుండి మొహం తిప్పుకోకు. బాధ్యత ఎల్లవేళలా నీ బ్యాంకు బ్యాలెన్స్ అంతా పిల్లలకు పంచడం కాదు.” కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి ఆగింది వసంత.
మొహంలో ఎలాంటి చిరాకు లేకుండా, వింటున్నది వేద. ఆకళింపు చేసుకుంటున్నట్లుగా కనబడుతున్న వేద మొహం లో ప్రశాంతత వసంత కి రవ్వంత ఆనందాన్ని కలిగించింది. ముప్ఫై ఏళ్ల గా అనుభవం వున్న ఆ సైకాలజీ ప్రొఫెసర్ కి వేద లో కనిపిస్తున్న స్వీకృతి ఆనందాన్ని కలిగిస్తున్నా, ఇది అప్పటికప్పుడు ఏర్పడిన మార్పు అని, ఇలాంటి సమావేశాలు ఎన్నో అయితే గాని వేద ఈ ఆత్మ న్యూనతలో నుండి, ఆత్మగ్లానిలో నుండి బయట పడదనే విషయం వసంత లోని సైకాలజిస్ట్ కి తెలుస్తుంది. సాధారణంగా ఇలాంటి వారిలో వ్యక్తిత్వం చాలా బలంగా ఉంటుంది. నిరంతరం తమ వాదన నిరూపించుకోవడానికి, తమదే అత్యంత బాధాకరమైన జీవితమని బలంగా నమ్ముతారు. వేద విషయం కూడా అంతే. సంతోష్ ని ఎంతో ప్రేమించింది. అతనితోటి జీవితం తనివి తీరకుండానే ఒంటరి అయ్యింది. ఒంటరితనం వివిధ రకాల అనుభవాలను, నిరాశను కల్పించింది. వాటన్నిటికీ పరిష్కార మార్గంగా తనని తానే బాధించుకోవడం, కరుగ్గా మాట్లాడడం అలవాటు చేసుకుంది. మనస్సుతో కల్లోలాన్ని ఆహ్వానించింది. ఇప్పుడు ఆ తుఫానులో కొట్టుకుపోతుంది. దరి చేరడానికి ఎంత సమయం పడుతుందో అనుకొంది వసంత.
కొంతకాలం సెలవు పెట్టించి తనతో తీసుకువచ్చింది. వేద కొడుకు విక్రం కూడా భార్య రాగిణితో వచ్చాడు. తల్లితో కొంత సమయం ఆనందంగా గడిపాడు. వేద మనసులో ఏముందో తెలియదు గాని, తాను వాళ్ళతో సంతోషంగానే గడిపింది. కోడలితో కారమ్స్ ఆడింది. కొడుకుకు ఇష్టమని బిరియాని చేసి పెట్టింది. కొడుకు, కోడలు వెళ్లిపోతుంటే, దారిలో తినడానికి మురుకులు చేసి ఇచ్చింది.
వాళ్ళు వెళ్ళాక వేద కూడా రెండు రోజులుండి ఇంటికి చేరింది. ప్రతి రోజు వసంత తోటి మాట్లాడటం మొదలు పెట్టింది. మెల్లగా మెడిటేషన్ సెంటర్ లో చేరింది. చిన్నప్పటి హాబీ క్రోషియా మొదలుపెట్టింది. ప్రతి వారం లైబ్రరీ కి వెళ్లి పుస్తకాల మధ్య కొంచెం సేపు గడపడం అలవాటు చేసుకుంది. వారం లో డాబా మీద ఉన్న మొక్కలు మార్పించింది. ఓ నెల రోజులు గడిచాక, ఉగాది వస్తూ ఉంటే, రాగిణి ఫోన్ చేసి, వస్తాం అత్తయ్యా అని అడిగింది తప్పకుండా రమ్మని చెప్పింది వేద. ఆ ఉగాది ఎన్నో సంవత్సరాల తర్వాత వేద ఇంట్లో పండగ. కొడుకు కోడలు కి కొత్త బట్టలు కొన్నది. తాను కూడా మంచి జరీ చీర కొనుక్కుంది. విశ్వాస్ తో వీడియో కాల్, ఉగాది పచ్చడి, పులిహోర, బొబ్బట్ల తో ఆనందంగా గడిచింది. ఉగాది అయిన తరువాత, బయల్దేరుతూ నా దగ్గరికి ఎప్పుడు వస్తావు? అని అడిగాడు విక్రమ్. శ్రీరామ నవమికి లాంగ్ వీకెండ్ వస్తుంది అప్పుడు వస్తాను నాన్నా అన్నది వేద నవ్వుతూ.
ఫోన్ చేసి అక్క వసంతతో తన మార్పును ఆస్వాదిస్తూ… ఆహ్లాదంగా మాట్లాడుతుంది. చిన్న చిన్న సూచనలు సలహాలు ఇస్తూ, వసంత, వేద పోరాటాన్ని, తనని తానే గెలవటానికి చేసే పోరాటాన్ని గమనిస్తూ, మధ్య మధ్యలో సహాయం చేస్తూ వేదని కాచుకొంది. సెలవులకు భయపడే వేద ఇప్పుడు వీకెండ్ కోసం ఎదురుచూస్తూ కొడుకు దగ్గరకు వెళ్లడానికి ఉత్సాహం చూపిస్తూంది.
తరచుగా మాట్లాడుతున్నా, వేదని కలవడానికి ప్రయత్నించలేదు వసంత. తనంతట తానే ఈ మానసిక స్థితి నుండి బయటకు వచ్చి కుటుంబంతో అనుసంధానం కావాలని ఆశించింది. కొన్ని నెలల తరువాత, తన అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములకి , సంతోష్ అక్కచెల్లెళ్లు అన్నదమ్ములకి, చిన్న పార్టీ ఇచ్చింది విక్రమ్ ఇంట్లో, విశ్వాస్ ఎం.స్. పూర్తి చేసుకుని ఇండియా వచ్చిన సందర్భంగా.
వేద మొహంలో కనబడుతున్న నిశ్చింత, విక్రమ్, రాగిణి కళ్ళల్లో కనిపిస్తున్న సంతృప్తి, విశ్వాస్ నవ్వులో కనిపిస్తున్న సంతోషం లో వేద కుటుంబం సంపూర్తిగా కనిపించింది వసంతకి.
ఎంతమందికి తల్లిదండ్రుల గురించి, వారి మానసిక సమస్యలు వాటి పరిష్కార మార్గాలు, ఆరోగ్య సమస్యలు గుర్తించే ఆలోచన, పరిణితి పిల్లల్లో ఉంటుంది. సరైన సమయానికి, విక్రమ్ తెలియచేసాడు కాబట్టి, వేద కూడా సలహా వినడానికి, సమస్యని అర్థం చేసుకోవడానికి, ప్రయత్నించింది కనుక, సులువుగా తేలిపోయింది. ఇలా ఎంతమంది నిష్కారణంగా తమకు తామే హాని తల పెట్టుకుంటున్నారో అనుకొని నిట్టూర్చింది వసంత.

****

3 thoughts on “చెద

  1. బాగుంది. కథలు రాయడంలో ఆరిందతనం కనిపిస్తోంది.సైకాలజీ కి సంబంధించిన సబ్జెక్టు రాయడం మెప్పించడం కష్టం.ముగింపు లో ఏదో వెలితీ లా ఉంది.

  2. చాలా బాగుంది…అదుపు తప్పిన మనస్సుని దారిలో పెట్టటం … ఏ వయస్సులో నైనా అవసరం రావచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *