March 29, 2024

విహారయాత్రలు ( మలేషియా ) – కౌలాలంపూర్

రచన: నాగలక్ష్మి కర్రా


కౌల అంటే రెండు నదులు కలిసిన ప్రదేశం లేక నది సముద్రంలో కలిసిన ప్రదేశాన్ని స్థానిక భాషలో ‘ కౌల‘ అని అంటారు, ‘లంపోర్‘ అంటే బురద అని అర్ధం.
కౌలాలంపూర్ కి ఒక కిలోమీటరు దూరంలో ప్రవహిస్తున్న ‘లంపూర్‘, నది ‘ గోంబర్‘ నదిలో కలుస్తోంది 1857 లో ఈ ప్రాంతం సెలంగోరు సుల్తాను పరిపాలనలో ఉండగాగోంబర్ నది క్లాంగ్ నదీ సంగమ ప్రాంతంలో టిన్ను గనుల త్రవ్వకాలు అప్పటి సుల్తాను పర్యవేక్షణ లో సాగేయి గనుల త్రవ్వకాలలో నియమించబడ్డ కార్మికుల నివాసాలకు గాను అడవిలో కొంతభాగాన్ని చదును చేసి పాకల నిర్మాణం గావించేరు గనులపై ఆధిపత్యం కొరకు కార్మికులలో గొడవలు తరచూ జరుగుతూండేవి ఈ కార్మికులు తరచూ మలేరియా రోగగ్రస్తులవుతూ ఉండడం వల్ల చుట్టుపక్కల దేశాలైన చైనా, జావాల నుంచి కార్మికులను దిగుమతి చేసుకోవలసి వచ్చేది ఆ పరిస్థితులలోనే 1859 లో మొదటి టిన్నుఖనిజం నది నుంచి సముద్రానికి పడవలలో తరలించి ఓడ ద్వారా ఎగుమతి చేసేరు కార్మికులను నియంత్రించివారి పై ఆధిపత్యం వహించేందుకు వారిలో ఒకరిని ఎంచుకొని వారికి ‘కపితన్ సిని‘ అనే బిరుదు ఇవ్వసాగేరు అప్పటి సుల్తానులు.
టిన్ను ఖనిజం ఓడలలో ఎక్కించేందుకు వీలుగా నదీ తీరాన ‘పుదు‘, ‘బతు‘ లలో కార్మికుల నివాసాలు నిర్మింపబడ్డాయి మలేషియా స్వాతంత్రం పొందిన తరువాత ఈ చిన్న చిన్న జనావాసాలన్నింటిని కలిపి కౌలాలంపూర్ అని పిలువసాగేరు.
మలేషియా రాజధానిగా కౌలాలంపూర్ ను ఎంచుకొని చుట్టుపక్కల ఉన్నగ్రామాలను కలుపుకొని నగరంగా రూపుదిద్దేరు మలేషియా స్వతంత్రదేశం గా రూపుదిద్దుకున్న తరువాతగ్రామంగా వున్న కౌలాలంపూర్ 1970 లలో నగరంగాను 1980 తరువాత మహానగరంగాను రూపుదిద్దుకుంది పరిపాలనా భవనాలు, విధ్యాలయాలు, కళాశాలలు వ్యాపార సంస్థలు నిర్మింపబడ్డాయి.
విదేశీ పర్యాటకుల దృష్టిలో ప్రపంచంలో ఏడవ స్థానాన్ని సంపాదించుకుందీ నగరం అలాగే విదేశీ సీనియర్ సిటిజన్లు నివాసయోగ్యంగా ఎంచుకున్న నగరాలలో మొదటి స్థానంలో ఉంది.
కొన్ని యురోపు సంస్థలు ఇక్కడి పనివారి వేతనాలు చాలా చవుకగా ఉండడంతో వారి సంస్థలను ఈ దేశానికి తరలించటం ముఖ్యంగా ఎలక్ట్రోనిక్స్ కంపెనీలు తరలించటంతో విదేశీయుల రాకపోకలు పెరిగేయి 1980 లలో ఈ దేశంలో చమురు నిక్షేపాలు బయట పడడంతో, అప్పటికేఉన్న రబ్బరు పరిశ్రమ వల్లప్రపంచ సంపన్నదేశాల దృష్టిలో పడింది రాజకీయ, సామాజిక స్థిరత్వం వల్ల పర్యాటకులు సురక్షిత పర్యాటక కేద్రంగా గుర్తించేరు. దేశప్రజలు శాంతి కాముకులు కావడంతో దేశం అతి తక్కువ కాలంలో అభివృద్ది వైపు సాగిపోయింది.
ప్రపంచంలో గల అతి పెద్ద పది మాల్స్ లో మూడు కౌలాలంపూర్ లో ఉన్నాయంటే గొప్పేమరి.
1999 వరకు మలేషియా రాజధానిగా వున్న కౌలంపూర్ లో జననివాసాలు పెరిగి పోవడంతో పాలకులు పుత్రజయకు పరిపాలనా భవనాలను తరలించి దానిని దేశరాజధానిని చేసేరు.
కౌలాలంపూర్ మహానగరంలో పర్యాటకుల సౌకర్యార్దం MRT ( మాస్ రేపిడ్ ట్రాన్సిట్ ), లైట్ మెట్రొ, మోనొ రైలు, కంమ్యూటర్ రైల్, ఎయిర్ పోర్ట్ లింక్, యెలివేటెడ్ బస్ మొదలైనవి అందుబాటులో ఉన్నాయి.
కౌలాలంపూర్ ఎయిర్ పోర్టులో దిగితే సిటీ సెంటరు వరకు‘ఎయిర్ పోర్టు లింక్’ లో సులువుగా చేరుకోవచ్చు సిటీ లో తిరగడానికి పైన ఉదహరించిన ఏ సేవనైనా మనం ఉపయోగించుకోవచ్చు సైట్ సీయింగ్ కి చాలా సంస్థలు టూరిస్ట్ సర్వీసులను నడుపుతున్నాయి ‘బండరాయ‘ బస్టాండు నుంచి సైటుసీయింగు బస్సులు దొరుకుతాయి.
మేము మొదటిమారు 2001 లో మలేషియా వెళ్లినపుడు ఇంత చిన్న దేశం సాధించిన అభివృద్ది చూస్తే ఆశ్చర్యాన్ని కలుగజేసింది మనదేశంలో అప్పటికి మెట్రో ఒక్క కలకత్తాలోనే ఉండేది కలకత్తా తెలుసుగా మహానగరాలలో చెత్తా చెదారం, కుళ్లు కంపులలో మొదటిస్థానంలో ఉంటుంది మలేషియాలో నీటుగా ఉన్న రోడ్లు చూసి ఎంతబాగున్నాయో అనుకున్నాం, సింగపూర్ అంతకన్నా నీటుగా ఉంటుంది కౌలాలంపూర్ లో మూడు నాలుగు ప్రదేశాలలో శరవన భవన్, ఆనంద్ భవన్ వారి రెస్ట్రాంట్స్ ఉన్నాయి లిటిల్ ఇండియ లో స్థానిక తమిళ తంబిలచే నడపబడుతున్న అనేక దోశ యిడ్లీల బళ్లు దర్శనమిస్తాయి ఇక్కడ దొరికే ఐటమ్స్ చాలా చవుకగా ఉంటాయి.
మలేషియా వారు మనదేశస్థులను ‘నాసి కంధార్‘ అని అంటారు దీని వెనుక కథేంటంటే పూర్వం రాజులకాలంలో మనదేశపు వ్యాపారస్థులు బియ్యం మలేషియా తీసుకు వెళ్లి కావిళ్లు వేసుకొని అమ్మేవారుట, ‘నాసి‘ అంటె బియ్యం ‘కంధార్‘ అంటే బుజం మీద మోసేది అంటే కావడి అన్నమాట, అలా ఇప్పటికీవీరు భారతీయులను ‘నాసికంధార్‘ లు అంటూంటారు.


కౌలాలంపూర్ లో చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం డౌన్ టౌనులో అలా తిరిగి అన్ని భవంతులనూ చూడడం ఓ అధ్భుతం సిటిసెంటరు మాల్ కి MRT లో వెళ్లి విండోషాపింగ్ చేసుకొని అక్కడ ఉన్న అన్నలక్ష్మి లో లంచ్ చెయ్యడం ఓ అనుభూతి.
వీటికి తోడు ‘పుసత్ భండార్‘( సిటీ సెంటరు) లో ఉన్న కవలభవంతులు అదే ట్విన్ టవర్స్, వాటి కెదురుగా ఉన్న KL టవర్ రివాల్వింగ్ రెస్ట్రాంటు కౌలాలంపూర్ కి అదనపు ఆకర్షణలు.
ముందుగా మనం కవలభవంతుల గురించి తెలుసుకుందాం.
ప్రపంచంలో అతియెత్తైన భవనంగా ప్రశంసలందుకుంటున్న ఈ భవంతుల నిర్మాణం 1993 లో మొదలుపెట్టబడింది 88 అంతస్తుల భవన నిర్మాణానికిసుమారు 3, 95, 000 చదరపు అడుగుల భూమి కావలసిరాగా ఫార్ములా కార్ రేసింగ్ మైదానాన్ని ఈ భవన నిర్మాణానికి తీసుకున్నారు ఈ భవనాలకు పునాది సుమారు 66 మీటర్ల నుంచి 114 మీటర్ల లోతు త్రవ్వేరు ఇదికూడా ప్రపంచ రికార్డనే చెప్పాలి 1996 లో ఈ భవంతులు పూర్తి చెయ్యబడి 1997 లో ‘పెట్రొనాస్‘ సంస్థ మొదటి విడత పనివారిని తరలించింది 1999 ఆగష్టు 1 వ తేదీన అప్పటి మలేషియా ప్రధాన మంత్రి ఈ భవంతులను జాతికి అంకితం చేసేరు ఈ భవంతులలో చాలా భాగం మలేషియా దేశానికి చెందిన పెట్రొనాస్ ఆఫీసులు ఉన్నాయి దేశవిదేశీ ప్రతిష్ఠాత్మకమైన అనేక వాణిజ్య సంస్థలు ఉన్నాయి.
ఈ భవంతుల పైకి వెళ్లడానికి రోజుకి వెయ్యమందిని మాత్రమే అనుమతిస్తారు సోమవారం శలవు, మేం వెళ్లినది సోమవారం కావడంతో పైకి వెళ్లే అవకాశం లేకపోయింది, తరవాత మూడునాలుగుసార్లు వెళ్లినా మాకు ఆరోజుకి టికెట్లు అయిపోయనేవారు అప్పట్లో ఆన్ లైన్బుకింగ్ చేసుకునే అవకాశం లేదు అందుకని పైకి వెళ్లలేకపోయేం కిందనుంచి తలెత్తి చూస్తే ఆకాశాన్ని తాకుతున్నాయా? అన్నట్లుంటాయి అందులో ఓ టవరు కాస్త వంగి వుండడం చూసి ఆశ్చర్యానికి లోనయ్యేం అలా నిజంగా వంగి ఉందా లేక మనకి అలా కనిపిస్తోందో తెలీలేదు ఫొటోలలో కూడా పడమటి భవంతిగా పిలువబడే ఒకటవ భవంతి తూర్పు వైపుకి కాస్త వాలి ఉండడం చూడొచ్చు.
గూగులమ్మ సహయంతో తెలుసుకున్న విషయం ఏమిటంటే 62 వ అంతస్థు పూర్తయేసరికి అక్కడి నిర్మాణం లో పనిచేస్తున్న వారు భవంతి 25 మిల్లీమీటర్లు పక్కకి ఒరిగినట్లు గమనించేరు వేరేదారి లేక ఒరిగిన అంతస్థులపైన మిగతా 16 పదహారు అంతస్థలనిర్మాణం జరిపేరు అందుకే ఈ భవంతులలో పడమటి భవంతి కాస్త రెండవ భవంతి వైపు ఒరిగి కనిపిస్తుంది ఈ భవంతులు 88 అంతస్థలు భూమి పైన 5 అంతస్థులు భూమి లోపల ఉన్నాయి.
ఈ రెండు భవంతులను కలుపుతూ 41, 42 అంతస్థులలోరెండస్థుల స్కై బ్రిడ్జ్ నిర్మాణం చేసేరు ఈ స్కై బ్రిడ్జ్ల నిర్మాణం ఎందుకు అంటే రెండుకారణాలు ఉన్నాయి, ఆకాశంలో నడుస్తున్న అనుభూతి కలగడం ఒకకారణమైతే, భవన నిర్మాణాన్ని పటిష్టం చెయ్యడం మరోకారణం.
ఈ బ్రిడ్జ్ సుమారు 170 మీటర్ల యెత్తున సుమారు 58 4 మీటర్ల పొడవు వుండి సుమారు 750 టన్నుల బరువుండి ప్రపంచంలో అతి ఎత్తున ఉన్న రెండతస్థుల స్కై బ్రిడ్జ్ గా పేరుపొందింది కవల భవంతులను సందర్శించేవారు ఇక్కడే ఒక భవంతినుంచి మరొక భవంతికి లిఫ్ట్ కోసం మారవలసి ఉంటుంది చుట్టూరా గాజు అద్దాలు బిగించి ఉన్న దీని మీద నడిచేటప్పుడు నేల, చుట్టూ ఉన్న భవంతులు, ఆకాశం కనిపిస్తూ వింతైన అనుభూతినిస్తుంది ఈ స్కై బ్రిడ్జ్ మీద నడక.
ఈ భవంతులలో ఒక్కో భవంతికి 40 చొప్పున లిఫ్టులున్నాయి కొన్ని బేసి అంతస్లథుకు తీసుకు వెళ్లేవి మరికొన్ని సరి అంతస్థులకి తీసుకువెళ్లేవి ఉన్నాయి వీటి నిర్మాణం రెండంతస్థలలో ఉంటుంది మొత్తం కిందా పైనా కలిపి 52 మందినితీసుకెళ్లే సమర్ధతను కలిగివుంటాయి.


ఈ భవంతుల క్రింది అంతస్థులలో మలేషియా లోని అతి పెద్ద మాల్ గా చెప్పబడే ‘సురియ KLCC‘ ఉంది.
ఈ మాల్ పెద్దదే కాదు లోపల అలంకరణ, అద్దంలా మెరిసి పోయే నేల, పైన అద్దాలు కళ్లు తిప్పుకోనివ్వవు ఇందులో దేశవిదేశాల బ్రాండెడ్ షాపులు ఉన్నాయి కాళ్లు నొప్పులు పెట్టేంత వరకు తిరగడం, అలసట అనిపించగానే అక్కడ ఉండే బెంచీలమీద కూర్చోవడం, రోజంతా తిరిగినా పూర్తిగా చూడలేదేమో అని అనిపించింది ఈ మాల్ లో షాపులేకాక పెద్ద లైవ్ షో లు జరిగే ఆడిటోరియం, అక్వేరియం, ఆర్ట్ గేలర్ ఉన్నాయి మాల్ కి అనుబంధంగా ఉన్న పార్క్ కి గాను 17 ఎకరాల భూమిని వాడరు ఇందులో పిల్లలు ఆడుకోడానికి కావలసిన అన్ని సదుపాయాలు ఉన్నాయి వాకింగ్ ట్రాక్ లతో పాటు సేదతీరటానికి నీడను కల్పించి బెంచీలు వేసేరు మొక్కలు, లాన్ పెంచుతున్నతీరు ప్రతీ వారినీ ఆకట్టుకుంటుంది.
ఈ భవంతులకు 2006 లో మరమ్మత్తులు జరిపేరు ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదుల దాడులు జరిగినా ఈ భవంతులలోకి పర్యాటకులప్రవేశం నిషేధిస్తారు. మలేషియా వెళ్లదలచుకున్నవారు ముందుగా ఈ భవంతులపైకి వెళ్లగలిగే టికెట్స్ తీసుకొని వెళితే అక్కడిదాకా వెళ్లేక భవంతి పైకి వెళ్లలేకపోయామే అనే నిరాశ తప్పుతుంది


ఈ భవంతుల చుట్టూరా ఉన్నపెద్ద భవంతులు ఆకట్టుకుంటాయి వాటిలో పబ్లిక్ బ్యాంక్ భవంతి ప్రత్యేకంగా కనబడుతుంది. ఈ ప్రదేశంలో మరో భవంతి పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది అది వాటర్ టాంకు ఆకారం లో ఉంటుంది దీనిని KL Tower అని అంటారు మలేషియా టెలికమ్యూనికేషన్స కోసం నిర్మించిన టవరు, ప్రపంచం లోని టెలికమ్యూనికేషన్స్ టవర్స్ లలో యేడవస్థానంలో ఉంది22 అంతస్థులు నాలుగు లిఫ్ట్స్, 2058 మెట్లు ఉన్నాయి ఈ టవరు నిర్మాణంలో అడ్డుగా ఉన్న ‘ జెలుటోంగ్‘ వృక్షానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా నిర్మించేటప్పుడు 4, 30, 000 రింగెట్స్ (మలేషియాన్ డబ్బుని రింగెట్ అని అంటారు)నష్టాన్ని భరించి నిర్మించేరు ఇందులో టెలికమ్యూనికేషన్స్ వారి ఆఫీసులతో పాటు అబ్జర్వేటరి, రివాల్వింగ్ రెస్టొరంట్ ఉన్నాయి ట్విన్ టవర్స్ టూర్ తో పాటు కెయెల్ టవరు, రివాల్వింగ్ రెస్టొరాంట్ లో డిన్నరు కలిపి అన్ని పెద్ద చిన్న టూరు ఆపరేటర్లు ఒకరోజు ట్రిప్పుగా ఇస్తున్నారు రివాల్వింగ్ రెస్టొరెంట్ లో భోజనం తీసుకొనే వారు నాలుగు నుంచి ఆరు గంటలు అక్కడ గడపొచ్చు కాని ఇక్కడ ఆహార పదార్ధాల వెల చాలా ఎక్కువగా ఉంటుంది, మంసాహారంలో అన్ని రకాల పదార్ధాలు ఉంటాయి శాఖాహార పదార్ధాలు ఉండవు.
రాత్రి పూట ట్విన్ టవర్స్ KL టవరు చూడడం ఓ అనుభవం, చీకటి పడేవరకు అక్కడ వుండి దీపాల వెలుగులో ఆకాన్నంటే భవంతులను చూడ్డం మాటలలో వర్ణించలేని అనుభూతి.

వచ్చే సంచికలో ‘కౌలాలంపూర్’ లోని మరికొన్ని వివరాలు చదువుదాం అంతవరకు శలవు

1 thought on “విహారయాత్రలు ( మలేషియా ) – కౌలాలంపూర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *