April 25, 2024

శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించిన “కపిల మహర్షి”

రచన: అంబడిపూడి శ్యామసుందరం రావు

 

కపిల మహర్షి వేదకాలపు మహాముని మహాభారతములో పేర్కొన్నట్లుగా ఈయన ఏడుగురు బ్రహ్మ మానస పుత్రులలో ఒకడు. ఈయన శ్రీ మహావిష్ణువు అవతారంగా విష్ణు పురాణములో పేర్కొనబడినది. కృత యుగములో కర్దమ ప్రజాపతి అనే మహర్షి సరస్వతి నదీతీరంలో శ్రీ మహావిష్ణువు కోసము పదివేల సంవత్సరాలు తపస్సు చేస్తే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై “నీకు దేవహూతి అనే భార్య వలన తొమ్మిది మంది కుమార్తెలు పుడతారు ఆ తరువాత నా అంశతో ఒక కుమారుడు జన్మిస్తాడని వరము ఇస్తాడు ఆ వరప్రభావము వలన దేవహూతి తొమ్మిది మంది కుమార్తెలను కంటుంది కర్దమ ప్రజాపతి తాను అరణ్యాలకు పోయి తపస్సు చేసుకుంటానని భార్యతో అంటాడు అప్పుడు ఆవిడ వంశము ఉద్దరించటానికి ఒక కుమారుడిని ప్రసాదించమని భర్తను అడుగుతుంది అప్పుడు కర్దమ ప్రజాపతి నీకు విష్ణుమూర్తి కొడుకుగా పుడతాడు కాబట్టి విషుమూర్తిని ప్రార్ధించమని చెపుతాడు విష్ణుమూర్తి వరము ఇచ్చిన ప్రకారముగా కొడుకు జన్మిస్తాడు అతనే విష్ణు మూర్తి అంశతో జన్మించిన కపిల మహర్షి. దేవతలు పూలవాన కురిపిస్తారు అప్సరసలు నాట్యము చేస్తారు ఆ విధముగా దేవలోకం అంతా  వారి ఆనందాన్ని తెలియజేస్తారు.దేవతలు ఈ బాలుడు విష్ణు మూర్తి అవతారమని కపిల మహర్షిగా ప్రసిద్ధి కెక్కుతాడని చెప్పి వెళ్ళిపోతారు

కర్దమ ప్రజాపతి తన కుమార్తెలకు వివాహలు జరిపించి భార్యతో నీకు పుత్రసంతానం కలిగింది కాబట్టి నేను తపస్సు చేసుకోవటానికి వెళతాను అని చెపుతాడు.కపిల మహర్షి తండ్రితో నేను ముని రూపములో జన్మించింది మునులకు భగవంతుని గురించి తెలియజేయటానికి నీవు తపస్సు చేసుకోవటాని వెళ్ళుఅని చెపుతాడు  తండ్రి ఇల్లు వదలి వెళ్ళిన తరువాత కపిల ముని తన తల్లి అయిన దేవ హూతికి యోగ శాస్త్రాన్ని అభ్యసించమని విష్ణువుని ప్రార్ధించమని , వాటి వలన దేవుని యెడల నిజమైన భక్తి మోక్షము కలుగుతాయని ఉపదేశిస్తాడు.శ్రీ మద్భాగవతములోని 3 వ స్కందము, 33 వ అధ్యాయములో ఈయన గురించిన చాలా వివరాలు ఉంటాయి.సాంఖ్య శాస్త్రములోని  ప్రాధమిక సూత్రాల రచయితగా చెపుతారు.అంతే  కాకుండా భక్తి యోగములో ముక్తిని సాధించే ప్రక్రియను బోధించే గురువుగా కపిల మహర్షి ప్రసిద్ధులు.

ఒకసారి సూర్యరశ్మి అనే ముని వేదాలపట్ల కపిలూనీ అభిప్రాయము తెలుసుకోవటానికి గోవు లో ప్రవేశించి కపిలుని ముందుకు వచ్చి అయన అభిప్రాయము వేదాల పట్ల అడుగుతాడు కపిలుడు ఆ ప్రశ్నకు భగవంతుని మనస్సులో ప్రతిష్ఠించుకొని బ్రాహ్మణులు వేదోక్తముగావారి కర్మలను ఆచరించాలి ఊరికే వేదాలు చదివితే సరిపోదు ఆచరించాలి అని చెపితే సూర్యరశ్మి ముని ఆ వివరణకు తృప్తి చెంది కపిలునికి నమస్కరించి వెళ్ళిపోతాడు. పుండరీకుడు అనే మహారాజు వేటాడుతూ కపిల మహర్షి ఆశ్రమములో దాహము తీర్చుకొని అక్కడే ఆడుకుంటున్న లేడిని చంపుతాడు అది చూసిన కపిలమహర్షి పుండరీకుడిని మందలించగా ఆవేదన చెందిన పుండరీకుడు ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు ఆత్మహత్య పహా పాతకమని జీవులను హింసించరాదని జ్ఞానబోధ చేస్తారు పుండరీకుడు తన రాజ్యాన్ని భోగభాగ్యాలను వదలివేసి తనను శిష్యునిగా స్వీకరించమని కపిల మహర్షిని ప్రార్థిస్తాడు కానీ కపిల మహర్షి పట్టించుకోకపోతే నీటిలో కూర్చుని పదమూడు రోజులు తపస్సు చేస్తాడు. పద్నాల్గవ రోజు కపిల మహర్షి పుండరీకునికి కర్మ, భక్తి, వైరాగ్యము,జ్ఞానము అనే నాలుగు యోగాలను బోధిస్తాడు వీటిని ఆచరించి పుండరీకుడు మోక్షాన్ని పొందుతాడు.

సూర్యవంశపు రాజైన సగరుని(గంగను భూమికి తెచ్చిన భగీరథుని పూర్వీకుడు) మొదటి భార్యకు మహాతేజోవంతుడైన అసమంజసుడు, రెండవ భార్యకు చిన్న చిన్న తిత్తులతో కూడిన పిండం ప్ర్రసవింపబడింది, ఆ పిండానికి వున్న తిత్తులను దాదులు 60 వేల నేతికుండలలో భద్రపరచగా( పొదగడం) 60 వేల మంది కుమారులు కలిగిరి వీరు ప్రత్యేక నామాలతో కాక సగరులుగా ప్రసిద్ధి చెందారు.కానీ పెద్ద భార్య కుమారుడు ఇతర కుమారులను ప్రజలను హింసిస్తూ ఉంటె రాజు అతనిని రాజ్య బహిష్కరణ చేసి ,తన రాజ్య విస్తరణకు మహర్షుల అనుమతితో అశ్వమేధయాగము చేయ సంకల్పించి యాగాశ్వానికి రక్షణగా తన 60 వేల మంది కుమారులను పంపుతాడు. ఈ అశ్వమేధయాగం ఫలము వల్ల ఆ రాజు తన ఇంద్రపదవికి పోటీ వస్తాడని భావించిన ఇంద్రుడు యాగాశ్వాన్ని కపిల మహర్షి ఆశ్రమములోమహర్షికి తెలియకుండా దాస్తాడు. యాగాశ్వము  కనిపించక పోవడంతో ఆ అశ్వానికి రక్షణగా వెళ్ళిన సగరుని 60 వేల మంది పుత్రులు భూ మండలమంతా గాలించి, పాతాళములో వెతకటానికి భూమిపై గుంతలు త్రవ్వి భూదేవికి ఖేదము కలిగిస్తారు తరువాతికాలములో ఆ గుంతలలో  నీరుచేరి సాగరుల పేరన సాగరము అయింది. పాతాళములో కపిల మహర్షి ఆశ్రమములో యాగాశ్వమును చూచి కోపముతో ఆయన పైకి దాడిచేశారు. తపోభంగము అయినా కపిలమహర్షి ఆగ్రహానికి గురైన సగరులు భస్మయి అయి  60 వేల బూడిద కుప్పలు అయినారు.

యాగాశ్వము కొరకు వెళ్ళిన తన పితామహులు ఎంతకీ తిరిగి రాకపోవడంతో యాగ పరిసమాప్తి కాక మధనపడుతున్న సగరునితో అసమంజసుని మనవడు ఆంశుమంతుని కొడుకు సగర కుల్భవుడు అయిన భగీరధుడు యాగాశ్వమును వెతుకుతూ పాతాళం చేరి వారికి ఉత్తమగతులు లభించాలంటే దివిజ గంగను పాతాళానికి తేవలసి ఉంది అని తెలుసుకుంటాడు. భగీరథుడు తన తాతలకు ఉత్తమ గతులు కలగాలని  గంగ కోసము తపస్సు చేస్తాడు. భగీరధుడు శివుని కోసం తపసు చేశాడు. అనుగ్రహించిన శివుడు  గంగను భువికి రాగానే తన తలపై మోపి, జటా జూటంలో బంధించాడు. భగీరధుని ప్రార్ధనతో ఒక పాయను నేలపైకి వదలాడు. భగీరధుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగింది. ఆపై సాగరంలో ప్రవేశించి, పాతాళానికి చేరి, సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలుగజేసింది.ఆవిధముగా కపిలమహర్షి వలన గంగ దివి నుండి భూమికి చేరింది.పూర్వము అశ్వశిరుడు అనే విష్ణు భక్తుడైన రాజు కపిల మహర్షిని కలిసి విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందాలంటే ఏమి చేయాలి అని అడుగుతాడు కపిలమహర్షి నేను విష్ణుమూర్తిని అన్ని చెప్పిన ఆ రాజు నమ్మడు  అప్పుడు ఆ సభలో ఉన్నవారంతా క్రూర జంతువులుగామారుతారు అప్పుడు ఆ రాజు కపిలమహర్షిని ప్రార్ధిస్తే ,”నీవు విష్ణు భక్తుడివే అయినా విష్ణువు లోకమంతా నిండి ఉన్నాడు అన్న యదార్ధాన్ని గ్రహించలేకపోతున్నావు.యదార్ధాన్ని తెలుసుకొని ధర్మబద్ధముగా జీవిస్తూ విష్ణుమూర్తిని ధ్యానిస్తూ ఉంటె నీకు మోక్షము కలుగుతుంది” అని చెప్పి వెళ్ళిపోతాడు.

కపిలమహర్షి సాంఖ్య యోగాన్ని వివరిస్తాడు దీనినే కపిల స్మృతి అని కూడా అంటారు.ఆయుష్షు క్షణికమని,సుఖదుఃఖాలు  వస్తు పోతూ ఉంటాయి అని, ఆత్మ అంటే నారాయణుడే అని ఆత్మను తెలుసుకొని మోక్షాన్ని పొందాలని బోధిస్తాడు. వేదాల్లో ప్రయాణాల్లో ఉండే జ్ఞానమే సాంఖ్య యోగములో ఉంది. కపిల మహర్షి భక్తి యోగాన్ని కూడా వివరిస్తాడు ఎప్పుడు హింసతో కూడిన పనులు చేస్తూ ఈర్ష్య, అసూయ వంటి చెడ్డ గుణాలను కలిగి ఉన్నప్పటికీ భగవంతుడంటే భక్తి ఉన్న వాడిని తామస భక్తుడు అంటారు అన్ని రకాల సుఖాలను అనుభవిస్తూ భక్తి కలిగి ఉండేవాడిని రాజస భక్తుడు అంటారు భగవంతుని లీల గురించి విన్నప్పుడు భగవంతుని పేరు ుని పరవశించిపోయే వాడే అసలయిన భక్తుడు అటువంటి వారిని పరామభక్తులు అంటారు అని కపిల మహర్షి భక్తి యోగములో వివరిస్తాడు పురాణాలలో మనము ఇటువంటి భక్తుల గురించి వింటాము.

రావణాసురుడు శివుని వరప్రసాదంగా ఎన్నో శక్తులను సంపాదించి తనకన్నా శక్తివంతులు ఎవరు ఉండకూడదని అందరిని చంపుతూ పశ్చిమ సముద్ర తీరములో ధ్యానములో ఉన్న కపిలమహర్షిని చుస్తే ఆ మహర్షి చేతిలో ఆయుధాలతో వక్షస్థలం మీద లక్ష్మి దేవితో, కళ్ళలో సూర్య చంద్రుల తో సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారము గాకనిపిస్తాడు కానీ రావణుడు ఇదంతా ఋషుల మాయగా భావించి కపిల మహర్షిని ఒక దెబ్బ కొడతాడు ధ్యాన భంగము అయినా కపిల మహర్షి కళ్ళు తెరచి రావణుడిని ఒక దెబ్బ కొడితే రావణుడు స్పృహ తప్పుతాడు కపిల మహర్షి గుహలోకి వెళతాడు కొంచము సేపు తరువాత రావణుడు ఎవరి శక్తివంతుడు అని తెలుసుకోవటానికి గుహలోకి వెళ్లి మహానుభావా మీరు ఎవరు అని అడుగుతాడు దానికి సమాధానముగా కపిల మహర్షి నోరు తెరచి విష్ణుమూర్తి విశ్వ రూపాన్ని రావణుడికి చూపించి మాయమవుతాడు రాబోయే కాలములో శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీరాముని చేతిలో హాతుడవుతాడు అని సూచనా ప్రాయముగా తెలియజేస్తాడు. ఈ విధము గా కపిల మహర్షి అజ్ఞానులకు జ్ఞానాన్ని కలిగించటానికి మనిషిగాపుట్టి సాంఖ్య యోగాన్ని భక్తి యోగాన్ని మునులకు సామాన్య ప్రజలకు బోధించి మోక్షమార్గాన్ని తెలియజేసిన గొప్ప ఋషి సాక్షాత్తు విష్ణు మూర్తి అంశతో పుట్టి లోకాన్ని ఉద్ధరించిన గొప్ప మహర్షి కపిల మహర్షి.

 

1 thought on “శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించిన “కపిల మహర్షి”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *