రచన: సి. హెచ్. ప్రతాప్
ఒక చిత్రకారుడు మంచి మంచి చిత్రాలను గీస్తూ ప్రజలలో మంచి పేరు ప్రతిష్టలు, కీర్తిని సంపాదించుకున్నాడు. కానీ అవేమీ అతనికి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. ద్వారకలో వున్న శ్రీకృష్ణుడు నగరంలోని కవులను, కళాకారులను పిలిచి ఘనంగా సత్కరిస్తున్నారని అతనికి తెలిసింది. ఎలాగైనా తన ప్రతిభ శ్రీ కృష్ణుని ముందు ప్రదర్శించి శ్రీకృష్ణుడి నుండి కూడా ఆమోదం పొందాలని అతను ధృఢంగా నిర్ణయించుకున్నాడు. ఒక శుభముహూర్తాన ఆ చిత్రకారుడు ద్వారక వెళ్ళి శ్రీ కృష్ణుడి దర్శనం చేసుకొని ఆయన యొక్క చిత్రపటాన్ని గీయాలన్న తన కోరికను వ్యక్తం చేసి, ఆయన చిత్రాన్ని చిత్రించగలిగేలా నిశ్చలంగా ఉండ మని అభ్యర్థించాడు. రూపురేఖలు సిద్ధం చేసి, వారం రోజుల్లో చిత్రపటాన్ని తీసుకువస్తానని శ్రీ కృష్ణ భగవానుడు చెప్పాడు. తాను గీయబోయే ఈ అద్భుత చిత్రపటాన్ని శ్రీకృష్ణుడు తన శయన మందిరంలో వుంచుకోవాలని కూడా కళాకారుడు కోరాడు. ఈ మాటలలో వున్న అహం శ్రీకృష్ణుని దృష్టిని దాటిపోలేదు.
చెప్పినట్లుగానే ఒక వారం తరువాత, చిత్రకారుడు తెల్లటి గుడ్డతో కప్పబడిన పూర్తి చిత్తరువును తీసుకువచ్చాడు. శ్రీ కృష్ణుడి సమక్షంలో అతను చిత్తరువును బయటకు తీసినప్పుడు , శ్రీ కృష్ణుడికి మరియు తను వేసిన చిత్రానికి మధ్య సారూప్యత లేకపోవడంతో చిత్రకారుడు స్వయంగా ఆశ్చర్యపోయాడు. తాను రాత్రింబవళ్ళు శ్రమించి గీసిన ఈ చిత్రం శ్రీ కృష్ణుడికి తప్పక నచ్చుతుందని, తద్వారా స్వయంగా భగవంతుని నోటి నుండి తన పట్ల ప్రశంసలు వినాలని ఎంతగానో అభిలాషించిన ఆ చిత్రకారుడు ఈ చిత్రపటంలో శ్రీ కృష్ణుడి పోలికలు లేకపోవడంతో ఖినుడయ్యాడు. ఈసారి శ్రీ కృష్ణుడి రూపురేఖలు జాగ్రత్తగా తన మనస్సులో జ్ఞాపకం పెట్టుకొని, తదనుగుణంగా చిత్రం తిరిగి గీసి ఒక వారం రోజులలో తీసుకువస్తామని చెప్పాడు. ఆ వారం రోజులు తిరిగి శ్రమించి ఆ చిత్రకారుడు చిత్రపటాన్ని గీసి శ్రీ కృష్ణుడికి చూపించాడు. అయితే చిత్రంగా ఈసారి కూడా శ్రీ కృష్ణుడి అసలు రూపు రేఖలు చిత్రపటంతో సరిపోలేదు. ఇదివరకటిలాగా తిరిగి వారం తర్వాత కొత్త చిత్రపటంతో వస్తానని ఆ చిత్రకారుడు వెళ్ళిపోయాడు. ఈ సంఘటన ఇలా పలుమార్లు పునరావృతమయ్యింది. శ్రీ కృష్ణుడి చిత్రపటం గీయడంలో ఆ చిత్రకారుడు పూర్తిగా విఫలమయాడు.
ఇలా చాలాసార్లు ప్రయత్నించాడు కానీ ప్రతిసారీ ఫలితం సమానంగా నిరాశపరిచింది. పూర్తి నిరాశ మరియు నిస్పృహతో, అతను నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నాడు. అతను ఇంకొక నగరానికి ప్రయాణం చేస్తుండగా మధ్యమార్గంలో వెళ్ళే టప్పుడు నారద మహర్షి అతనిని కలిశాడు. నారదుడు శ్రీకృష్ణుని బొమ్మను చిత్రించటానికి ప్రయత్నించడం అసంభవం అని చెప్పాడు. భగవంతుడికి స్థిరమైన రూపం లేదు మరియు అతను ప్రతి క్షణంలో తన లీలా విలాసాలతో ప్రతీ క్షణం తన రూపు రేఖలను మార్చుకోగలరు. నారదుడు “నువ్వు ఆయనను చిత్రించాలనుకుంటే, అలా చేయడానికి మీకు వీలు కల్పించే ఒక పద్ధతి చెబుతాను” అని సలహా ఇచ్చాడు. నారదుడు కళాకారుడి చెవిలో ఏదో గుసగుసలాడాడు.
నారదుడు ఇచ్చిన సలహాను అనుసరించి, చిత్రకారుడు తిరిగి వచ్చి, తెల్లటి గుడ్డతో ఏదో కప్పి, మళ్ళీ కృష్ణుడి వద్దకు వచ్చి, ఈసారి చిత్తరువు భగవంతుడిని ప్రతిఫలించేలా వుంటుందని చెప్పాడు. గుడ్డ తీసివేసినప్పుడు, కృష్ణుడికి అద్దం మాత్రమే కనిపించింది మరియు ఈ అద్దం కృష్ణుడి యొక్క ఖచ్చితమైన ప్రతిరూపాన్ని పునరుత్పత్తి చేసింది. కాబట్టి, దేవుడు ఇలా ఉన్నాడా లేదా అలా అని మీరు చిత్రించినట్లయితే, అది సరైనది కాదు. మీరు దేవుడిని వర్ణించలేరు మరియు మీ ప్రయత్నాలు విఫల మవుతాయి. మీ మనస్సును స్పష్టంగా మరియు శుభ్రంగా చేసుకోండి. ప్రేమ మరియు భక్తితో నింపండి. అది మీకు భగవంతుని యొక్క నిజమైన దర్శనాన్ని కలిగిస్తుంది అన్నదే ఈ భావగర్భితమైన కధ సారాంశం.