May 19, 2024

ముగ్గురమ్మల మూలపుటమ్మ – మాతా వైష్ణవీదేవి

రచన: నాగలక్ష్మి కర్రా

Maa-Vaishno-Devi-6293

ఈ సంచిక ద్వారా ముగ్గురమ్మల (పార్వతి, లక్ష్మి, సరస్వతి) తేజోశక్తిని యేకం చేసి యేక తేజోమూర్తిగా ఆవిర్భింపబడ్డ ఏకైక శక్తి పీఠమైన వైష్ణవీదేవిని గురించిన వివరాలు మీతో పంచుకోవడం నా సౌభాగ్యంగా భావిస్తున్నాను.
లంకాయాం శాంకరీదేవి , కామాక్షి కంచికాపురే ,
ప్రద్యుమ్నే శృంగళాదేవి , చాముండే క్రౌంచపట్టణే ,
ఆలంపురీ జోగులాంబ , శ్రీశైలే భ్రమరాంబికే ,
కొల్హాపురే మహాలక్ష్మి , పీఠికాయాం పురుహూతికా,
ఒఢ్యానాం గిరిజాదేవి , మాణిఖ్యే దక్షవాటికే ,
హరిక్షేత్రే కామరూపి , ప్రయాగే మాధవేశ్వరి ,
జ్వాలాయాం వైష్ణవీదేవి , గయా మాంగల్యగౌరికా ,
వారణాశ్యాం విశాలాక్షి , కాశ్మీరేతు సరస్వతి .
శంకరాచార్య విరచితమైన పై శ్లోకంలో చెప్పబడ్డ “జ్వాలాయం వైష్ణవిదేవి” గురించే ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం.
జమ్ము-కశ్మీరు రాష్ట్ర శీతాకాలపు ముఖ్యపట్టణమైన జమ్మూ నగరానికి సుమారు 50కిమీ. . దూరంలో వున్న “కట్ర ” అనే చిన్నపట్నం దగ్గర నుంచి కాలి నడక ప్రయాణం మొదలౌతుంది . దేవి నివాసమున్న పర్వతాన్ని త్రికూట పర్వతమని అంటారు. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాలనుంచి జమ్ము నగరానికి ట్రైన్, విమాన సౌకర్యాలు వున్నాయి . దేశ రాజధాని ఢిల్లి నుంచి కట్ర వరకు ఈ మధ్య కాలంలో రైల్ సేవ కుడా మొదలయ్యింది. జమ్మూ రైల్ స్టేషన్ నుంచి ప్రతి 10నిమి. . లకి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థవారి బస్సులు కట్ర వరకు లభ్యమౌతాయి . వైష్ణవి దేవి దర్శనానికి వెళ్ళే భక్తులు కట్ర బస్సు స్టాండుకి యెదురుగా వున్న యత్రీనివాస్ లో దర్శనానికి టోకెన్ తీసుకోవాలి , ఒకవేళ భవన్ (వైష్ణవదేవి కోవెల వున్న ప్రదేశాన్ని భవన్ అంటారు) లో రాత్రి వుండదలచుకున్నవారు కట్రాలోనే యాత్రినివాస్ లో ముందుగా రూముకి కూడా సొమ్ము చెల్లించి రసీదు తీసుకోవాలి .

కట్ర బస్సు స్టాండు నుంచి నడకదారి మొదలయ్యే చోటుకి సుమారు 2కిమి.. దూరం వుంటుంది . అక్కడకు వెళ్లేందుకు షేర్డ్ ఆటోలు , వైష్ణోదేవి బోర్డ్ వాళ్ళ వుచిత బస్సులు వుంటాయి .నడక మొదలయ్యే చోటునుంచి భవన్ కి 13.5కిమి.. , ఇంతేనా అని అనుక్కోవద్దు. త్రికూట పర్వతం నిటారుగా వుండి నడక చాలా కష్థంగా వుంటుంది . ఈ దూరాన్ని నడిచి చాలామంది భక్తులు వెళ్తారు. నడిచి వెళ్లలేనివారు గుఱ్ఱాల మీద గాని డోలిలలో గాని వెళ్ళవచ్చు. సామానులను, చిన్నపిల్లలను తీసుకొని వెళ్ళడానికి ” పిట్టులు ” దొరుకుతాయి. వీరికి ఇవ్వవలసిన ఛార్జీలు బోర్డ్ ద్వారా నిర్ణయించబడినవి కాబట్టి బేరాలు ఆడవలసిన పనిలేదు. ఆకాశ మార్గాన వెళ్ళదల్చుకున్నవారు హెలికాప్టర్ లో కూడా వెళ్ళవచ్చు . ఆకాశమార్గంలో వెళ్ళదల్చుకున్నవారు ముందుగా టికెట్స్ బుక్ చేసుకోవాలి, ఆ రోజు వాతావరణం బాగుంటేనే హెలికాఫ్టర్స్ బయలుదేరతాయి. అందుకనే హెలికాఫ్టర్ లో బుక్ చేసుకున్నవారు ఇతర సాధానాలలో కూడా ప్రయాణించడానికి తయారుగా వుంటే మంచిది.
మొత్తం దారి అంతా సిమెంట్ చెయ్యబడింది. చాలా మటుకు షెడ్స్ వెయ్యబడ్డాయి. దారంతా టీ , కాఫీ , ఫలహారాల విక్రయాలు జరుగుతూ వుంటాయి . ఇక్కడ విక్రయించే ఆహారపదార్ధాలు అన్ని బోర్డు ద్వారా నిర్ణయించబడ్డ వెలకే విక్రయించ బడుతూ అందరకి అందుబాటులో వుంటాయి.
సుమారు 2.5కిమి.. కొండ యెక్కిన తరువాత . “చరణ పాదుక ” అనే ప్రదేశం వస్తుంది , ఇది ముందుగా అమ్మవారు తపస్సు చేసుకొన్న ప్రదేశం ,అక్కడనుంచి సుమారు 4 కిమీ. .వెళితే “అధ్ కుమారి ” అనే ప్రదేశం వస్తుంది. ఇది నడక మొదలు పెట్టిన దగ్గరనుంచి భవన్ వరకు వున్న దూరంలో సరిగ్గా సగం వుంటుంది. ఇక్కడ అమ్మవారు గుహలో కూర్చొని తపస్సు చేసుకున్నారట , ముందు అధ్ కుమారిని దర్శించుకున్న తరవాతే భవన్ లో అమ్మవారిని దర్శించుకోవాలిట . ఈ గుహలోకి ఒకరి తరువాత ఒకరుగా వెళ్ళాలి యెంత సన్నగా వున్నవారైనాసరే గుహలోకి వెళ్లి బయటికి రాలేరేమో అన్నట్టుగా వుంటుంది కాని చాలా లావుగా వున్నవాళ్ళు కూడా గుహలోకి వెళ్లి సులువుగా రాగలరు. అది అమ్మవారి మహిమకి యిదొక తార్కాణం .
అధ్ కుమారి దగ్గర భవన్ కి వెళ్లేదారి రెండుగా మారుతుంది. ఒకటి గుర్రాల మీద వెళ్లేవారికి , రెండోది నడిచి వెళ్లేవారికి. ఈ దారిలో బేటరీతో నడిచే ఆటోలు నడుపుతున్నారు . ఇవి వృద్దులకు, వికలాంగులకు , చిన్న పిల్లలతో వచ్చిన తల్లులకోసం 250రూ .. తీసుకోని భవన్ కి సుమారు 1.5కిమి.. దగ్గర వరకు తీసుకు వెళ్తారు . అలాగే తిరిగి భవన్ నుంచి అధ్ కుమారి కి తీసుకు వస్తారు .
గుర్రాలమీద వెళ్లేవారికి అధ్ కుమారి నుంచి 3 కిమీ.. వెళ్తే “సాంఝి ఛత్ “, ఇక్కడ మళ్ళా రెండుదారులు కలుస్తాయి, ఒకటి భవన్ కి వెళ్ళేది రెండోది భైరో ఘాట్ కి వెళ్ళేది . రూములు బుక్ చేసుకున్నవారికి ఇక్కడే రూములు ఇస్తారు. ఇక్కడకి అర కిమీ.. దూరంలో హెలిపాడ్ వుంటుంది. హెలికాఫ్టర్ లో వచ్చిన వాళ్ళు భవన్ చేరడానికి సుమారు 2.5కిమి.. నడచి గాని గుర్రలమీద గాని వెళ్ళాలి .భవన్ చేరుకున్నాక పర్సులు, బెల్టులు, పెన్నులు ,కేమేరాలు , జోళ్ళు మొ. . నవి అన్నీ అక్కడి క్లోక్ రూంలో పెట్టుకొని దర్శనానికి వెళ్ళాలి . ఈ కోవెల హారతి సమయాలలో తప్ప 24 గంటలు తెరిచే వుంటుంది . 1980 సంవత్సరం వరకు దేవి దర్శనానికి గుహలోంచి ముణుకులమీద పాకుతూ వెళ్ళవలసి వచ్చేది . గుహలో క్రిందన వనగంగ ప్రవహిస్తూ వుండేది. 1980 లలో పెరుగుతున్న భక్తులని దృష్టిలో వుంచుకొని గుహద్వారం ప్రక్కనే వెడల్పయిన మరో ద్వారం పెట్టి భక్తులని ఆ ద్వారం ద్వారా దర్శనానికి అనుమతిస్తున్నారు. అప్పుడప్పుడు గుహ ద్వారం ద్వారా దర్శనానికి అనుమతిస్తూ వుంటారు . ప్రతి రోజు పూజారులు మాత్రం గుహాద్వారం నుండే దేవిదగ్గరకు చేరుకుంటారు.
మనం తీసుకు వెళ్ళే మొక్కుబడులు, టెంకాయలు మొ.. వాటిని అక్కడ వున్న కౌంటర్ లో వొప్పచెప్పాలి.
లోపల 5 అడుగుల ఎత్తైన కొండపైన మూడు రాళ్ళ (పిన్ది) ఆకారంలో దేవి దర్శనం ఇస్తుంది. మధ్యనున్న చిన్న పసుపువర్ణం లో వున్నది లక్ష్మి యని, కుడిచేతి వైపున వున్న నలుపు వర్ణంలో వున్నది పార్వతి యని యెడమ చేతి వైపున వున్న తెలుపు వర్ణం కలిసినది సరస్వతి యని అక్కడి పూజారులు చెప్తారు. దేవికి యెదురుగా అంటే పూజారికి వెనుక శివలింగం వుంటుంది. ఆ శివలింగం సాక్షాత్తు దేవిచే ప్రతిష్టింపబడి ఇవాల్టికీ దేవీపూజలందు కుంటోందని భక్తుల నమ్మకం. దేవి దర్శనానికి వెళ్ళే భక్తులు ముఖ్యంగా రాళ్ళ ఆకారంలో వున్న దేవిని , దేవికి యెదురుగా వున్న శివలింగాన్ని దర్శించుకోవాలి . బయటకి వచ్చేటప్పుడు వనగంగా జలాన్ని తీర్ధంగా స్వీకరించాలి.
మేము మొదటిమారు వెళ్ళినప్పుడు పూజారులు ప్రసాదంగా చిల్లర చిన్నచిన్న బంగారం, వెండి ముక్కలు యిచ్చేవారు . తరువాత కొన్నాళ్ళు లడ్లు, అమ్మవారిమీద కప్పిన చున్నీలు ప్రసాదంగా యిచ్చేవారు. యిప్పుడు పటికబెల్లం , దేవిమూర్తి గల కాయిన్ ప్రసాదంగా యిస్తున్నారు.
ప్రసాదం తీసుకొని బయటికి వచ్చేక మెట్లమీంచి కిందకి వెళ్తే అక్కడ శివలింగం వుంటుంది. దేవి యోగసమాధి లోకి వెళ్ళక పూర్వం ఈ శివుడిని ఆరాధించేదట . అక్కడకి దగ్గరగానే దుర్గాదేవి మందిరం వుంది దీనిని కూడా దర్శించుకోవాలి . ఇక్కడితో భవన్ లో దర్శనీయ స్థలాలు పూర్తవుతాయి. భవన్ నుంచి సుమారు 2.5 కిమీ.. దూరంలో వున్న భైరవఘాట్ కి నడకన గాని గుర్రాలపై గాని డోలిలలో గాని వెళ్లవచ్చు. భవన్ నుంచి భైరవ ఘాట్ వరకు వుండే కొండ చాలా నిటారుగా యెత్తుగా వుంటుంది. త్రికూట పర్వతం పైన భైరవ కొండ పైన చాలా కోతులుంటాయి. భైరవ నాధ్ దర్శనం తో వైష్ణవదేవి యాత్ర పుర్తౌతుంది .
ఇక వైష్ణవదేవి కధ —

కృతయుగంలో పార్వతి, లక్ష్మి, సరస్వతి వారిలోని తేజస్సును తీసి , ఆ మూడు తేజస్సులను కలిపి ఒక చిన్న పాపలో ప్రవేశ పెడతారు. ఆ పాప మహా తేజొవంతురాలై ప్రకాశిస్తూ “ఓ తల్లులారా నన్నెందుకు సృష్టించేరు” అని అడుగగా త్రేతాయుగంలో నువ్వు భూలోకంలో జన్మించి శ్రీరాముని విష్ణుని అవతారముగా గుర్తించిన అనంతరం భూలోకంలో నీ అవతారం పరిసమాప్తి ఔతుంది. నువ్వు విష్ణువులో ఐక్యమై వైష్ణవిగా భూలోకంలో పూజలు అందుకుంటావు అని చెప్తారు .
ఆ ప్రకారంగా త్రేతాయుగంలో దక్షిణదేశంలో రత్నాకరుని యింట పాపగా జన్మిస్తుంది. పాప జన్మ రహాస్యం తెలియని రత్నాకరుడు పాపకు వైష్ణవి అని నామకరణం చేసి ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు . వైష్ణవి జ్ఞాన సముపార్జనలో గురువులందరి దగ్గర నుంచి విద్యను పొంది, ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని పొందడానికి గురువుల దగ్గరకి వెళ్ళగా యోగాన్ని మించినది లేదని వారి నుంచి తెలుసుకొని తపస్సమాధిలొకి వెళ్తుంది.
త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాసంలో వుండగా తపస్సులో వున్న వైష్ణవి వద్దకు వెళ్ళడం జరుగుతుంది. వచ్చినది విష్ణు అవతారమని గ్రహించిన వైష్ణవి ప్రణమిల్లి తనని ఐక్యం చేసుకోమని కోరుతుంది . అందుకు శ్రీరాముడు పట్టాభిషేకానంతరం వచ్చి ఆమెను అనుగ్రహిస్తానని మాట యిస్తాడు . ఇచ్చిన మాట ప్రకారం శ్రీరాముడు పట్టాభిషేకానంతరం వైష్ణవి వద్దకు వృద్దుని రూపంలో రాగా వైష్ణవి తన వద్దకు వచ్చినది విష్ణుమూర్తి యని పోల్చుకోలేక పోతుంది . అప్పుడు శ్రీరాముడు తన నిజరూపంతో దర్శనమిచ్చి తిరిగి తాను కలి యుగంలో కల్కి అవతారంలో వచ్చి ఆమెను అనుగ్రహిస్తానని వాగ్దానం చేసి ఆమెను త్రికూట పర్వతాన తపస్సమాధిలో వేచి వుండమని చెప్తాడు . శ్రీరాముని ఆజ్ఞ మేరకు వైష్ణవి దక్షిణ భారతాన్ని విడిచి ఉత్తర భారతానికి వెళ్లి త్రికూట పర్వత ప్రాంతాన వున్న అడవులలో యోగసాధనలో వుంటుంది. ఆమె యెప్పుడూ కోతుల గుంపుతో చుట్టుముట్టబడి సింహవాహనముపై తిరుగుతూ వుండేది.
త్రేతాయుగము ముగిసి ద్వాపరంలో కృష్ణావతారంలో విష్ణుమూర్తి కంసుడు , నరకాసురుడు మొదలగు వారిని సంహరించి మహాభారత యుద్ధానంతరం కృష్ణావతారం చాలించి వైకుఠంలో వుండసాగెను.త్రికూట పర్వత ప్రాంతాన యోగసమాధిలో వున్న వైష్ణవి ముగిసిన ద్వాపరయుగము గురించి గాని కలియుగ ప్రారంభము గాని తెలియలేదు. యెప్పుడూ కోతుల సముదాయముతో చుట్టుముట్టబడి సింహమును వాహనముగా చేసుకొని తిరుగుతూ వుండే వైష్ణవి మామూలు మనవమాత్రురాలు కాదని తలచిన శ్రీధరుడు అనే పేదవాడు ఆమె భక్తుడుగా మారుతాడు . వైష్ణవి గురించి విన్న గోరక్షకనాధ్ అనే యోగసాధకుడు ఆమె యోగశక్తి ఎంతటిదో తెలుసుకొని రమ్మని తన ముఖ్య శిష్యుడైన బైరవనాధుని పంపుతాడు. భైరవనాధుడు వైష్ణవిని వెన్నాడుతూ వుంటాడు . ఆమెని చూస్తున్నప్పుడు ఆమె యొక్క యోగశాక్తిని అంచనా వెయ్యవలసిన అతని కళ్ళు ఆమెను మొహంతో చూస్తూ వుంటాయి .
శ్రీధరునికి చుట్టుపక్కల వుండే సిద్దులకు, యోగులకు తాపసులకు భోజనాలు ఏర్పాటు చెయ్యాలనే తలంపు కలుగుతుంది. శ్రీధరుడు పేదవాడగుటచే భోజనము యేర్పాటుకు కావసిన ధనము కాని సరకులు కాని లేకపోవుటచే అతను నగరములోని వారి వద్దకు పోయి సహాయము అర్ధించెను. అలా సమకూడిన ధనము భోజన ఖర్చులకు సరిపోదని తెలిసిన శ్రీధరుడు ముందురోజు రాత్రి ఆందోళనతో నిద్ర రాక గడుపుతాడు . మరునాడు గోరక్షక్ నాథ్ తన శిష్యులతో వస్తాడు . పిలిచిన వాళ్లకు రెట్టింపుమంది వస్తారు . వైష్ణవి ఎనిమిది సంవత్సరాల బాలికగా వచ్చి అందరికి విస్తరాకులు పరచి వడ్డన సాగిస్తుంది . ఎవరు కోరిన వంటకాన్ని వారికి ఆ వంటకాన్ని వారికి వడ్డించి వారిని సంతృప్తులను చేస్తుంది . శ్రీధరుడు , బైరవుడు ఆ బాలిక వైష్ణవి అని గ్రహిస్తారు. శ్రీధరునిలొ ఆమె పట్ల భక్తి పెరుగగా భైరవునిలో ఆమె పట్ల మోహం అధికమౌతుంది . భైరవుడు తనను వివాహమాడమని వైష్ణవిని వేదింపసాగెను . వైష్ణవి భైరవుని తప్పించుకొని త్రికూట పర్వతంపైకి ఎక్కి అక్కడ తపస్సు చేసుకుంటూ వుంటుంది . ఆ ప్రదేశాన్ని యిప్పుడు “చరణ్ పాదుకా ” గా వ్యవహరిస్తున్నారు . కొంతకాలానికి భైరవుడు వైష్ణవి వునికి కనిపెట్టి అక్కడకు చేరుకుంటాడు . వైష్ణవి అక్కడనుంచి యిప్పటి ” అధ్ కుమారి ” అని పిలవబడుతున్న గుహకు చేరి అక్కడ తపస్సు చేసుకుంటూ వుంటుంది , భైరవుడు అక్కడకు కుడా వచ్చి వేధించడంతో అక్కడనుంచి భవన్ కు చేరుకొని శివలింగాన్ని ప్రతిష్టించుకొని ప్రశాంతంగా యోగ సాధన చేసుకుంటూ వుంటుంది . కొంతకాలానికి భైరవుడు అక్కడకు కూడా వస్తున్న సమాచారం యోగ శక్తితో తెలుసుకున్న వైష్ణవి తన వాహనమైన సింహాన్ని అధిరోహించి భైరవునకు యెదురు వెళ్లి తన కరవాలముతో భైరవుని శిరస్సు ఖండిస్తుంది . భైరవుని శిరస్సు ఎదురుగా వున్న పర్వత శిఖరాన పడుతుంది. భైరవుని శిరస్సు నేలను తాకగానే అతని తప్పిదం అతనికి తెలుస్తుంది. భైరవుడు తన తప్పును క్షమించమని వైష్ణవిని వేడగా ఆమె అతన్ని క్షమించి అతనికి మోక్షప్రాప్తి నిస్తుంది . తన దర్శనానంతరం భైరవుని దర్శించే వారికి వైష్ణవీదేవి యాత్ర ఫలం పొందుతారు అనే వరాన్ని అనుగ్రహిస్తుంది. శ్రీధరుడు వైష్ణవిని పూజించుకుంటూ శివసాన్నిధ్యం చేరుకుంటాడు. మానవ రూపంలో విష్ణువుకై వేచి యుండడం ప్రమాద భరితమని తలచిన వైష్ణవి ఒక గుహలో ఐదు అడుగుల ఎత్తైన గుట్టపైన మూడు శిలలుగా యోగసమాధిలో కల్కి కై వేచియుంది . తనలో వున్న శివుని ఎదురుగా నిలుపుకొని యిప్పటికి యోగ సమాధిలో వుండి భక్తులకు కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీరుస్తూ త్రికూట పర్వతంపై కొలువై వుంది మాతా వైష్ణవీదేవి .
వైష్ణవదేవి కోవెలలో ప్రతి రోజు ప్రొద్దుట సాయంత్రం హారతి విశేషంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం రెండుసార్లు నవరాత్రి వుత్సవాలు జరుగుతాయి . అవి 1) చైత్ర నవరాత్రులు , 2) దుర్గా నవరాత్రులు . ఎనిమిదేళ్ళ బాలికలకు పూజ చేసి కానుకలు సమర్పించడం జరుగుతూ వుంటుంది .
ఏడాది పొడవునా సాగే ఈ యాత్రను వర్షాకాలం మరియు శీతాకాలం వెళ్ళకుండా వుంటే మంచిది. యేకాలంలో వెళ్ళినా కూడా తగిన చలిదుస్తులు తీసుకోని వెళ్ళాలి. వర్షాకాలంలో వర్షాలకి కొండచరియలు విరిగి పడతాయి. శీతాకాలంలో హిమపాతం జరగవచ్చు , లేదా ఆ చలి మనం తట్టుకోలేనంతగా వుంటుంది. మే ,జూన్ మాసాలలో కూడా కనీసం రెండు చలిదుస్తులుండాలి . కట్రా లో వుండేందుకు అన్నివసతులు వున్నాయి . ఉత్తరాది , దక్షిణాది భోజన సదుపాయాలూ కుడా వున్నాయి.
కష్టతరమైన యాత్రే కాని మనకు ఆ ప్రకృతిని , భక్తుల భక్తి పారవశ్యాన్ని చూస్తూ వుంటే యే కష్టమూ తెలియదు. రాత్రికి పగలుకి తేడా లేకుండా భక్తులు ” జై మాతా ది” నామ స్మరణతో కొండ యెక్కుతూనే వుంటారు .
మరి మనము వైష్ణవి దేవిని దర్శించుకుందామా ? రండి బయలుదేరుదాం .
ఓం ఐం హ్రీం క్లీం చాముండై విచ్
జై మాతా ది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *