May 4, 2024

స్తుతమతియైన యాంధ్రకవి

 

రచన: ఏల్చూరి మురళీధరరావు elchuri

ధూర్జటి కవిత్వంలో మాధురీమహిమ: తెనాలి రామకృష్ణుని చమత్కారపూరణ

 

 

 

తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధమైన కథ ఇది: ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు నిండుసభలో మహాకవి ధూర్జటి కావ్యగానం విని అపూర్వమైన పారవశ్యాన్ని పొంది, ఆ కూర్పులోని తీయదనానికి కారణం తెలిసికొనగోరి విద్యాపరిషత్తులోని విద్వత్సభ్యులను ఉద్దేశించి ఈ పద్యపరిప్రశ్నను అడిగాడట:

“చ. స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ

యతులితమాధురీమహిమ?”

అని. రాయల వారిచ్చినది చంపకమాల పద్యంలో ఒకటిన్నర పాదాలకు వ్యాపించి, సమస్య వలె కనుపించటంతో ఆయన మనోగతానికి అనుగుణమైన సమాధానం ఏమని చెబితే ఆయనకు నచ్చుతుందో సద్యఃకృతంగా తోచక పరిషత్తులోని పండితులు మౌనంగా ఉండిపోయారట.

అప్పుడు తెనాలి రామకృష్ణుడు లేచి, “రాజా, నాకొక పక్షం రోజులు వ్యవధినిస్తే గ్రంథమంతా చదివి, విషయం పూర్వాపరాలను సేకరించి, ఈ ప్రశ్నకు తగిన సమాధానం ఊహించి, దేవర వారి చిత్తానికి విన్నవించుకొంటాను” అని, మొత్తానికి రాయలవారిని సమ్మతింపజేశాడట.

ఆ రోజునుంచి రామకృష్ణుడు కొలువుకు వెళ్ళటం మానివేశాడు. తెల్లవారుజాముననే మారువేషం వేసుకొని ధూర్జటి గారింటికి బయలుదేరటం, ఆయన దినచర్యను కనిపెట్టటం మొదలుపెట్టాడు. ధూర్జటి ప్రతినిత్యం పంచపంచ ఉషఃకాలాన లేచి, కాలకృత్యాలను ముగించుకొని, శివదీక్షకు కూర్చొని ఒకటొకటిగా స్తోత్రనివేదనం, భస్మస్నానం, భస్మధారణం, రుద్రాక్షధారణం, సంధ్యావందనం, లింగార్చనం, ఇష్టదేవతారాధనం, నైవేద్యం పూర్తికాగానే కొద్దిసేపు విశ్రమించి, ఆ తర్వాత భోజనభాజనాదులు ముగించుకొని, ఆస్థానప్రవేశానికి ఆవశ్యకమైన తీరున పండితవేషాన్ని ధరించి కొలువుకు వెళ్ళి వస్తుండటం, ఇంటికి రాగానే మరుసటినాడు సభలో వినిపించవలసిన గ్రంథభాగానికి సమాయత్తమవుతుండటం మూలాన రామకృష్ణుడికి పెద్దగా పనికివచ్చే ఆచూకీలేవీ పొడచూపలేదు.

పక్షాంతం కావచ్చే సమయానికి – అన్నాళ్ళుగా పడుతున్న శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరై, రాజుగారికిచ్చిన మాట తప్పేట్లున్నదని భయపడుతున్న తరుణంలో రామకృష్ణుడు ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ధూర్జటి కొలువు నుంచి తిరిగి రాగానే కొంతసేపు సేదతీరి, మునిమాపు వేళయేసరికి డాబు, దర్పం మీరిన భోగరాయవేషాన్ని ధరించి, ఇంటినుంచి బైటపడి, పదే పదే అటూ యిటూ చూసుకొంటూ – నాగవాసం దారి పట్టాడట. రామకృష్ణుడు ఆయనను అనుసరిస్తూ ఆయన ఇంటిలోకి వెళ్ళాక, బయట అరుగుమీద చేతిని తలక్రింద దిండుగా అమర్చుకొని రాత్రంతా అక్కడే తీరికగా విశ్రమించాడట. ధూర్జటి తెల్లవారుజామున తలుపు తెరుచుకొని బయటికి వచ్చి, అరుగుమీదున్న రామకృష్ణుణ్ణి చూసి గుట్టు రట్టయిందని గ్రహించి, ఇక చేసేదేమీ లేక, దైవంమీద భారంవేసి ఇల్లు చేరుకొన్నాడట.

ఆ మధ్యాహ్నం రామకృష్ణకవి పేరోలగంలో అడుగుపెట్టి, రాయల వారిచ్చిన సమస్యను పూర్తిచేశాడట:

 

“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ

యతులితమాధురీమహిమ?”

“… హా! తెలిసెన్; భువనైకమోహనో

ద్ధతసుకుమారవారవనితాజనతాఘనతాపహారి సం

తతమధురాధరోదితసుధారసధారలు గ్రోలుటం జుమీ.”

 

అని. ఆ పూరణలోని అంతరార్థం ఎంతో కొంత నలుగురికీ తెలిసినదే కనుక రాయలవారు, రాయలవారిని చూసి సదస్యులు నవ్వారట. చేసేదేమీ లేక ధూర్జటి కూడా నవ్వి తలవంచుకొన్నాడట.

 

సమస్యలోని పరిశీలనీయాంశాలు

స్మరణోత్సవంగా ఉన్న ఈ కథానకాన్ని ప్రఖ్యాత విమర్శకులు శ్రీ గురజాడ శ్రీరామమూర్తి గారు మొట్టమొదట 1876లో ‘ప్రబంధకల్పవల్లి’ పత్రికలోనూ, ఆ తర్వాత 1893లో వావిళ్ళ వారు అచ్చువేసిన తమ ‘కవిజీవితములు’ సంపుటంలో కొద్దిపాటి మార్పుతోనూ ప్రకటించారు. నా దగ్గరున్నది 1918 నాటి దాని పునర్ముద్రిత ప్రతి. నేను చిన్నప్పుడు విన్నప్పటి రూపాన్ని ఇక్కడ ఉదాహరించాను.

పై విధంగా పద్యంలోని ఛందోనుసారం ఒక పాదాన్నో, పాదార్థాన్నో; లేక రెండు, మూడు పాదాలను సైతమో పృచ్ఛకుడు అన్వయరహితంగానో, అర్థోక్తిగానో,  ప్రశ్నార్థకంగానో నిలిపి, పరిశిష్టభాగాన్ని అర్థవంతంగా పూరించమని ఇచ్చిన అసమాపకవాక్యాన్ని ‘సమస్య’ అంటారు. సాధారణంగా నాలుగవ పాదాన్ని సమస్యగా ఇవ్వటం ఉంటుంది కాని, నిజానికి పృచ్ఛకుడు ఏ పాదంలో ఎంత భాగాన్నైనా ఇవ్వవచ్చును.

పైని శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చినది సమస్య అనుకొంటే, దానికి లాక్షణిక పరిభాషలో ‘ప్రథమపాదాదిగత కవిజన ప్రతివచనీయము’ అని పేరు. పూరయిత ఆ పాదాన్ని కొనసాగించి దత్తార్థాన్ని యథోచితంగా పరిపూర్ణించాలన్నమాట.

స్తుతమతి యైన “ఆంధ్రకవి”

సమస్యను వినగానే మన మనస్సులను ఆకర్షించే ముమ్మొదటి విషయం ధూర్జటి గారిని ఉద్దేశించి కృష్ణరాయల నోట వెలువడిన “స్తుతమతి యైన ఆంధ్రకవి” అన్న విశేషణం.

స్తుతమతి’ అన్నాడు సరే, ‘ఆంధ్రకవి’ అనటం దేనికి? ఏమీ, ధూర్జటికి సంస్కృతభాషానిరంకుశమహాప్రభుత్వం అలవడలేదా? రాయలు ఆయన సంస్కృతభాషానిరంకుశమహాప్రౌఢిని గుర్తించనే లేదా? తెలుగు కవులకు సామాన్యమైన అష్టభాషావిశారదత్వం ఆయనకు లేదనే ప్రభువు అభిప్రాయమా? ‘శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము’లో కన్నడపదాలు సైతం చోటుచేసుకొన్నాయి కదా, బహుభాషాకోవిదుడనేందుకు ఆ నూతనసంవిధానం నచ్చకపోయిందా? ‘సకలవాగ్విశారదుడు’ అనక వట్టి ‘తెలుగు కవి’ అన్న విశేషణంతో సరిపెట్టివేశాడా? సంస్కృత తమిళ కన్నడాదిభాషాకవుల మధ్య కేవలం సంజ్ఞాపనకోసం ‘ఆంధ్రకవి’ అన్నాడా? అని సందేహించేవారు తప్పక గుర్తింపవలసిన విషయం ఇది.

“ఆంధ్రకవి” అన్నది రాయల దృష్టిలో ఒక అపురూపమైన గౌరవం. ఆబాల్యం అధిగమించిన అమరభాషను కాదని, అందులో ఎన్ని కావ్యాలనో చెప్పినప్పుడు చెందిన సంతృప్తిని కాదని, తరతరాలుగా ఇంటిలో వెలిసిన తుళువాక్తతిని కాదని, కమనీయమైన కన్నడ కస్తూరిని కాదని, విష్ణుచిత్తీయ తమిళనిదేశాన్ని కాదని, ఆభిమానికమైన ఆంధ్రభాషకు పట్టాభిషేకం చేసి, భగవదిచ్ఛానుసారం ఆ భాషలో ఆముక్తమాల్యదా  మహాప్రబంధాన్ని విరచించిన రాయల నోట వెలువడిన అనర్ఘమైన గౌరవవాచకం అది. శ్రీకాకుళంలో విడిదితీరినప్పుడు ఆయనకు కలలో సాక్షాత్కరించిన శ్రీమహావిష్ణువు సైతం ఆయన దృష్టిలో “అంధ్రజలజాక్షుఁడు” కదా. ఆ అంధ్రజలజాక్షుడు “అంధ్రభాష యసాధ్యంబె! యందు నొక్క, కృతి వినిర్మింపు మింక మాకుఁ బ్రియంబు గాఁగ” అన్నాడు కదా. అంతే కాక, “తెలుఁ గ దేల? యన్న, (1) దేశంబు తెలుఁగు; (2) ఏను తెలుఁగు వల్లభుండ; (3) తెలుఁగొ కండ; (4) ఎల్ల నృపులు గొలువ నెఱుఁగవే బాసాడి, దేశభాషలందుఁ దెలుఁగు లెస్స.” అని – తానున్నది తెలుగు దేశం, తాను తెలుగు రాయలు, తెలుగు భాష మధురాతిమధురం, దేశభాషలలో తెలుగు లెస్స అని సర్వరాజన్యులు భాషిస్తుండగా నీకు మాత్రం తెలియలేదా? అని స్వయంగా ఆ భగవంతుడే నాతో అన్నాడని చెప్పుకొన్నాడు కదా, స్వప్నగతమైన ఆ భగవద్వాక్యాన్ని అమిత ప్రీతిపాత్రంగా తన ‘ఆముక్తమాల్యద’ కృతిలో నిలుపుకొన్నాడు కదా, ఆయన దృష్టిలో “ఆంధ్రకవి” అన్నది అంతటి మహనీయమైన విశేషం అన్నమాట. ఆయనే ఒకప్పుడు అల్లసాని పెద్దన గారిని పిలిచి, పెద్దచేసి, స్వారోచిష మనుసంభవానికి కృతిపతిత్వాన్ని అర్థించినపుడు ఆ మహాకవిని గురించి ఒకదానికంటె ఒకటి ఉత్తరోత్తరబలీయంగా విశేషణాలను పేర్కొంటూ, “(1) హితుఁడవు (2) చతురవచోనిధివి, (3) అతులపురాణాగమేతిహాసకథార్థ, స్మృతియుతుఁడవు (4) ఆంధ్రకవితా, పితామహుఁడవు – ఎవ్వ రీడు? పేర్కొన నీకున్” అని, తనయెడ ఆయనకు గల ఆప్తభావానికంటె, ఆ మహామహుని చతురవచఃకౌశలికంటె, నిఖిలపురాణశాస్త్రకోవిదత్వానికంటె బలీయస్తరంగా ఆంధ్రకవితాపితామహత్వాన్ని సాహితీమేరుశిఖరాగ్రాన అధివసింపజేశాడు కదా. నంది తిమ్మన గారు తనకు ‘పారిజాతాపహరణము’ కావ్యకుసుమాన్ని “పారిజాత, హరణ మనుకావ్య మొనరించె నంధ్రభాష, నాదివాకరతారాసుధాకరముగ” అని సమర్పించినపుడు ఎంతో సంతోషంగా   అందుకొన్నాడు కదా. “స్తుతమతి యైన యాంధ్రకవి ధూర్జటి” అన్న బిరుదాంకనంలో రాయలకు తెలుగు భాష అంటే అంతటి గౌరవం ఇమిడి ఉన్నదన్నమాట.

పాఠాంతరాల చిక్కుముడి

ముద్రితప్రతులలో కృష్ణరాయలు అడిగిన ప్రశ్నకు రెండు మూడు పాఠాంతరాలు కనబడుతున్నాయి. వాటి అర్థచ్ఛాయలలో కొంత వ్యత్యాసం ఉన్నది:

 

“చ.  స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ

యతులితమాధురీమహిమ?”

అన్నది గురజాడ శ్రీరామమూర్తి గారు చూపిన పాఠం.

 

“చ.  స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గెనో

యతులితమాధురీమహిమ?”

అని దీనికే కొద్దిపాటి మార్పుతో పాఠాంతరం ఉన్నది.

 

“చ.  స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు కల్గె నీ

యతులితమాధురీమహిమ?”

అని మరొక పాఠం.

 

“చ.  స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు కల్గెనో

యతులితమాధురీమహిమ?”

అని మరొకటి. ఈ నాలుగు పాఠాలలో అర్థసన్నివేశాన్ని బట్టి మొదటిది, రెండవది ఒక తీరున; మూడవది, నాలుగవది ఒక తీరున ఉన్నాయి. రెండవ దానిలో “ఏల కల్గెనో?” అన్నప్పుడు నిజానికి ధూర్జటి రాజసభలో ప్రత్యక్షంగా ఉండవలసిన అవసరం లేదు. ఆయన పరోక్షంలో కూడా రాజు, “ధూర్జటి గారి కవిత్వానికి ఇంత తియ్యదనం ఎందుకు వచ్చిందో” అనటానికి అవకాశం ఉన్నది. “స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె – ఈ, యతులితమాధురీమహిమ?” అని ప్రశ్నించినపుడు  “ఈ” అన్న నిర్దేశార్థకం అప్పుడే చదువబడిన మధురమైన సన్నివేశానికి స్ఫోరకం. భువనవిజయ మహాసభలో  ధూర్జటి కవి కావ్యగానం జరిగినప్పుడు ధూర్జటి కవి సమక్షంలోనే ఈ సంభాషణ సాగినదనుకోవాలి. అందువల్ల “ఏల కల్గెనో, యతులితమాధురీమహిమ” కంటె “ఏల కల్గె నీ, యతులితమాధురీమహిమ” అన్న పాఠం మెరుగు.

పాఠాన్ని మరికొంత సూక్ష్మంగా విమర్శించి చూద్దాము. “ధూర్జటి గారి కవిత్వానికి ఇంతటి తియ్యదనం ఎలా వచ్చింది?” అని కృష్ణరాయలు ప్రశంసాపూర్వకంగా అడగటం విద్వజ్జనులున్న పరిషత్తులో అది సందర్భోచితమైన ప్రశ్న. “స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు కల్గెనో, యతులితమాధురీమహిమ?” లేదా, “స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు కల్గె నీ, యతులితమాధురీమహిమ?” అనటంలో రాజుకు కలిగిన గౌరవాతిశయం ధ్వనిస్తున్నది. ఆ విధంగా దానిని ప్రథమపాదాదిగతంగా ప్రశ్నించినప్పుడు ధూర్జటి గారి కవిత్వంలో అంతటి తీయదనం ఏ సంస్కారం వల్ల ఉప్పతిల్లిందో కవులు సార్థకంగా వివరింపవలసి ఉంటుంది.

కాని, అందుకు విపరీతంగా “ధూర్జటి గారి కవిత్వానికి ఇంతటి తియ్యదనం ఎందుకు వచ్చిందో?” అని కృష్ణరాయలు అడగటం విద్వజ్జనులున్న పరిషత్తులో మెచ్చుకోలుకైన ప్రశ్న అనిపించదు. “ఎలా వచ్చిందో?” అని గాక, కవులు “ఎందుకు వచ్చిందో?” చెప్పాలి. “స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ, యతులితమాధురీమహిమ?” అన్న ప్రశ్నలోనే పరిహాసానికి తగిన పునాది ఉన్నది. అటువంటి సూచన అక్కడ లేదని అనుకోవటం సాధ్యం కాదు. “ఎందుకు వచ్చింది?” అన్న ప్రశ్నలో ఉన్న ఆక్షిప్తి ధూర్జటి వ్యక్తిగతజీవితాన్ని కొంత స్పృశించేదిగానే కనబడుతుంది. అందరికీ తెలిసిన ఆ విధమైన స్వాభావికోదంతాన్ని ప్రసక్తించటం దేనికని కవులు నిరుత్తరంగా ఉండిపోవటం సహజమే. పైగా రాజు ఆ వ్యక్తిగతవిమర్శను ఎంతవరకు అనుమతించేదీ ఊహించటం కష్టం. ఆ శంకాసంకోచం లేని రామకృష్ణుడు కవి శృంగారవర్తనను వెలిపెట్టడం రాజు ప్రశ్నకు పరిణామస్వరూపమే. అనుమతి తీసికొని, పదిహేను రోజులు ఆగి చెప్పినా; అప్పటికప్పుడే సద్యఃస్ఫురితంగా ఆశుగతిని చెప్పినా – రాజు సూచ్యంగా సూచించినదే కనుక, వ్యక్తిగతజీవితాన్ని వెల్లడించే పూరణను వెలికి చెప్పటం భావ్యమే. కానప్పుడు అది నిండుసభలో మహాకవిని నిష్కారణంగా అవమానించినట్లే అవుతుంది. రాజుకు ఎంత మాత్రమూ సమ్మతిలేని కల్పనను ప్రవేశపెట్టినందుకు తదాగ్రహానికి గురికాకనూ తప్పదు.

అందువల్ల కృష్ణదేవరాయలు ధూర్జటికి అవమానాస్పదం కాగల విధంగా సమస్యను రూపొందించి, “స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గెనో, యతులితమాధురీమహిమ?” అని భువనవిజయ మహాసభలో అడిగి ఉండటం నిజమై ఉండదు. “స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు కల్గె నీ, యతులితమాధురీమహిమ?” అనే అడిగి ఉంటాడు.

రాజు “ఏల కల్గె?” అని ప్రశ్నింపక “ఎట్లు కల్గె?” అని ప్రశ్నించి ఉన్నట్లయితే, “ఎట్లు” అన్న అవ్యయానికి “ఏ ప్రకారంగా” అన్న అర్థంతోపాటు “ఏల కల్గె?” అన్న ప్రశ్నకూడా అంతర్భావిగా లేకపోలేదు. అయితే, రాయలు “ఎట్లు కల్గె?” అని ప్రశంసాపూర్వకంగా అమితాదరంతో అడిగినప్పుడు అందుకు కవి ఆ మాధురీమహిమ ఎట్లా వచ్చినదీ చెప్పాలి గాని – కేవలం వాక్యపూర్ణతాసంపాదనకు ఆ సందర్భానికి తగని పరిహాసంతో కూడిన సమాధానం చెప్పి ఉండటం భావ్యం కాదు. పరిహాసం పవిత్రతను గుర్తించదని; తెనాలి రామకృష్ణుడు అపహాస్యానికి గాక చమత్కారానికి మాత్రమే ఆ పూరణను చేశాడని – మనము వాదంకోసం అంగీకరించినా, రాజు అపూర్వమైన పారవశ్యాన్ని పొంది తెలుసుకొనగోరిన “ఎట్లు కల్గె?” అన్న ప్రశ్నకు రామకృష్ణకవి చేసిన పూరణలో ఆ మాధురీమహిమ ఏ గురూపదేశలబ్ధంగా, ఏ మహాకృషిసమాసాదితంగా, ఏ జన్మాంతరసంస్కారగతంగా, ఏ భగవద్వరప్రసాదఫలంగా ఉదయించిందో కవిత్వపరంగా వివరించే సముచితమైన సమాధానం రాలేదని కూడా మనము గుర్తుంచుకోవాలి. అది రాజు స్వస్థితికి, ధూర్జటి సుస్థితికి అనువైన పరిణామం కాదు.

కనుక పద్యపాఠాన్ని మరింత జాగరూకతతో పరిశీలించి అర్థనిర్ణయం చేయాలని వేరే చెప్పనక్కరలేదు. ఆ నేపథ్యంతో ఆలోచించి, తెనాలి రామకృష్ణకవి ప్రతిపాదించిన పద్యార్థం ఏమిటో సరిచూద్దాము.

 

రామకృష్ణకవి పూరణ

పద్యాన్ని “హా! తెలిసెన్” అన్న ఉపక్రమణికతో మొదలుపెట్టడంతోటే రాజుకు, సదస్యులకు రామకృష్ణకవి చెప్పబోతున్నదేమిటో తెలిసిపోయి ఉండాలి. ఆ పద్యార్థాన్ని కూడా ఒకసారి చెప్పుకొందాము:

హా! తెలిసెన్ = అసలు సంగతి తెలిసిందండోయి! అని భావం. ఏమి తెలిసిందో చెప్పబోయే ఆ ఉదంతానికి “హా!” అన్న ప్రతిపదోక్తం ఆశ్చర్యార్థకంగానూ, ఆక్షేపసూచకంగానూ అమరింది.

భువన+ఏక = పధ్నాలుగు భువనాలను ఒక్క తీరున, మోహన = సమ్మోహింపజేసే; ఉద్ధత = ఔద్ధత్యాన్ని వహించిన (గర్వాన్ని కలిగిన); సుకుమార = కోమలులైన, వారవనితా+జనతా = వేశ్యకాంతలయొక్క, ఘన = విరహిజనుల అధికతరమైన, తాపహారి = మన్మథతాపార్తిని హరింపజేసే, సంతత+మధుర = నిత్యమధురమైన, అధర+ఉదిత = క్రిందిపెదవినుంచి ఉట్టిపడే, సుధారసధారలు = అమృతరసప్రవాహాలను; క్రోలుటన్+చుమీ = ఆస్వాదించటం వల్లనే సుమండీ! అని రాయలవారి ప్రశ్నకు సమాధానం.

 

సాలంకృతమైన సమాధానం

రాయలు తెలుసుకొనగోరిన రహస్యానికి సమాధానంగా రామకృష్ణకవి చేసిన పూరణ మనోహరంగా ఉన్నది. రాయలు మహాపండితుడు. మాధుర్యౌజఃప్రసాదాలనే కావ్యగుణాలలో ఒకటైన మాధుర్యాన్ని ‘మహిమ’ అన్న విభూతివిస్తారకమైన ఐశ్వర్యభావనతో జోడించి ‘మాధురీమహిమ’ అన్న పదబంధాన్ని సరిక్రొత్తగా సృజించటంలోనే ఆయన పాండిత్యవైభవం

వెల్లడయింది. ధూర్జటి గారి కవిత్వాన్ని మనన చేసినకొద్దీ ఆ మాధుర్యం ఊటలువారి ఆయనపైని గౌరవం మరింత మరింతగా పెరుగుతుందని చెప్పటానికి ‘స్తుతమతి అయిన ధూర్జటి కవి’ అన్న నిర్దేశంతో వాక్యోపక్రమం చేశాడు. ‘ఆంధ్రకవి’ అన్న బిరుదాంకనంతో ఆ గౌరవాతిశయాన్ని ఉన్నతోన్నతంగా ధ్రువీకరించాడు. భక్తికవిత్వానికి మాధురీమహిమను ప్రతిపాదించటమూ ఆయనకు గల లక్షణజ్ఞానానికి నిదర్శకంగానే అమరింది.

 

“ఆహ్లాదకత్వం మాధుర్యం శృఙ్గారే ద్రుతికారణమ్

కరుణే విప్రలమ్భే తచ్ఛాన్తే చాతిశయాన్వితమ్.”

 

అని మమ్మటుడు ‘కావ్యప్రకాశం’ (8: 3–4) లో నిర్వచించిన లక్షణవిషయం ప్రస్తావనకు రాగలదని తెలిసిన రామకృష్ణకవి తదనుగుణంగానే తన పూరణను నిర్వహించాడు. శృంగార వేదాంతాలను సామ్యభావంతో పరిష్కరించాడు.

రాయలు అడిగిన ప్రశ్న పద్యపూర్వార్ధంలో ఉన్నంత మాత్రాన అది పూర్వపక్షార్థం కాదు. పూర్వపక్షాశ్రయమైన సిద్ధాంతవిరోధకోటి లోనిది కాదు. అది ప్రశంసాపూర్వకమైన వాక్యోపక్రమం. అందువల్ల రామకృష్ణకవి యోగ్యయోగసామర్థ్యంతో, సిద్ధాంతానుకూలమైన తర్కంతో వాస్తవాన్ని నిర్ధారణ చేయవలసివచ్చింది.

రాయలు మాధురీమహిమ ఎట్లు కలిగెను? అని వ్యక్తీకరించినది సందేహం. దానికి రామకృష్ణకవి ఆ మాధురికి హేతువుగా అధరసుధారసాస్వాదనను ప్రతిపాదించాడు. ఆ అధరముయొక్క ధర్మవైశిష్ట్యాన్ని అమృతరసస్యందితగా నిరూపించాడు. “క్రోలుటన్ చుమీ” అన్న నిశ్చయంతో అదే అసలు హేతువు అని ముగించాడు. దీనికి నిశ్చయాంత సందేహాలంకారమని పేరు. “ఎట్లు కల్గెను?” అన్న ప్రశ్నలో “ఏల కల్గెను?” అన్న మరొక సందేహం అంతర్భావిగా ఉన్నది కదా. దానికి కూడా సమాధానం చెప్పాలి కనుక శ్లేషానుప్రాణితంగా సాదృశ్యహేతుకమైన అన్యార్థాన్ని నిక్షేపించాడు. రెండు అర్థాలలో ఏది ప్రధానం? అంటే, ఎవరి సంస్కారాన్ని బట్టి వారు ప్రధానార్థాన్ని గ్రహిస్తారన్నమాట.

తీయదనానికి ఆశ్రయమైనది వారవనిత క్రింది పెదవి. సుధారసధారలు చిప్పిల్లటానికి విషయభూతంగా కవి స్వీకరించిన వస్తువిశేషం అది. ఆ రసాస్వాదనం ధూర్జటి కవిత్వానికి తీయదనాన్ని అలవరించినదని చెప్పటం కవితాత్మకమైన భావన.

భువనైక+మోహన

భువనైక+మోహన

“భువనైకమోహన” అన్నప్పుడు రామకృష్ణకవి పూరణలో అర్థాంతరస్ఫురణ కూడా ఉన్నది. ‘మోహనము’ అన్నది మన్మథుని శస్త్రశక్తులలో ఒకటి. ఆ ప్రకారం ‘లోకాలన్నింటిని వశపరచుకొనే మన్మథుని సమ్మోహనశక్తియొక్క ఉద్ధతిని కలిగినప్పటికీ మిక్కిలి కోమలులైన వారవనితల ఘనతాపహారిసంతతమధురాధరోదితసుధారసధారలు’ అని పద్యాన్ని అన్వయింపవచ్చును.

ఘన+తాపహారి, ఘనతా+అపహారి

ఇందాక చెప్పుకొన్న అర్థానికి మారుగా “భువనైకమోహనో, ద్ధతసుకుమారవారవనితాజనతాఘనతాపహారి” అన్న సమాసాన్ని పుంలింగంగా గ్రహించి, దానిని ధూర్జటికి అన్వయించి, భువనైకమోహన = ఈరేడు లోకాలను సమ్మోహింపజేసే, ఉద్ధత = ఔద్ధత్యాన్ని వహించిన (గర్వాన్ని కలిగిన); వారవనితాజనతా = వేశ్యాంగనల; ఘనతా+అపహారి = గర్వాతిశయాన్ని పోగొట్టేవాడైన ధూర్జటిగారిచే; సంతత మధురాధర ఉదిత సుధారసధారలు క్రోలుటన్ చుమీ – అని మరొక అన్వయం కూడా సాధ్యమే.

“వారవనితాజనతా ఘనతా+అపహారి” అన్న విరుపులో వారవనితలకు అంతకాలం ఉన్న పరువు కూడా ధూర్జటి వాళ్ళ ఇంటికి వెళుతుండటం వల్ల తొలగిపోతుందనే వెక్కిరింత లేకపోలేదు. అదీ వ్యంగ్యార్థంలో భాగమే కాని, రామకృష్ణకవికి అనభిమతార్థం కాదు.

ఉద్ధత > ఉద్యత

“భువనైకమోహనో, ద్ధతసుకుమార” అన్నప్పుడు ‘ఉద్ధత’ అన్న ఆ విశేషణానికంటె ‘ఉద్యత’ అన్న అనుసంధేయార్థం కూర్పబడి ఉంటే పద్యాన్వయం ఇంకా సులభంగా ఉండేది. ప్రతిపాద్యార్థమూ మరింత ప్రశంసనీయంగా ఉండేది.

 

“… హా, తెలిసెన్! భువనైకమోహనో,

ద్యతసుకుమారవారవనితాజనతాఘనతాపహారి సం,

తతమధురాధరోదితసుధారసధారలు గ్రోలుటం జుమీ.”

అన్నప్పుడు, భువనైకమోహన = సమస్తభువనాలను ఒక్క తీరున (సౌందర్యాదిభిః ముగ్ధతాకరణే) సమ్మోహింపజేసేందుకు, ఉద్యత = పూనుకొన్న, వారవనితాజనతా = వేశ్యాంగనలయొక్క, ఘన+తాపహారి = (విరహిజనుల) అధికతరమైన మన్మథార్తిని హరింపజేసే, సంతతమధుర = నిత్యమధురమైన, అధర = క్రిందిపెదవినుంచి, ఉదిత = ఉదయించిన, సుధారసధారలు = అమృతరసప్రవాహాలను (ప్రథమకు ద్వితీయార్థం); క్రోలుటన్+చుమీ = ఆస్వాదించటం వల్లనే సుమండీ! అని స్పష్టమైన అర్థప్రతీతి సాధ్యమయ్యేది. వ్రాతప్రతులలో అటువంటి పాఠం ఉన్నదేమో పరిశోధించాలి.

 

పద్యపూరణ: ప్రామాణ్యవివేచన

రాయల కొలువులో ధూర్జటి కవిత ప్రశంసకు పాత్రమై, రాయలు పూరణీయంగా అడిగిన ఈ పద్యపాదం కథ కేవలం జనశ్రుతులలో వినబడే కట్టుకథ కాదని, పద్దెనిమిదవ శతాబ్ది తొలిపాదం నాటికే ఇది ఈ నోట ఆ నోట నాటుకొని ఉన్నదని ధూర్జటి వంశీయుడైన కుమార ధూర్జటి క్రీస్తుశకం 1710 ప్రాంతాల తన ‘కృష్ణరాయ విజయము’ అవతారిక (1-29)లో కృతిభర్త తనతో పలికిన వాక్యంగా గ్రంథస్థం చేసిన విషయాన్ని బట్టి తెలుస్తున్నది:

 

“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు గల్గెనో

యతులితమాధురీమహిమ” నా మును మీ పెదతాత చాల స

న్నుతిఁ గనెఁ గృష్ణరాయల మనోజ్ఞసభన్; విను, మీవు నట్ల – మ

త్కృతబహుమానవైఖరులఁ గీర్తి వహింపుము ధాత్రిలోపలన్!”

 

ఇందులో కుమార ధూర్జటి కృష్ణరాయల వాక్యాన్ని యథాతథంగా పేర్కొని ఉండటం వల్ల పై కథోదంతమంతా సత్యమేనని భావించటానికి వీలవుతున్నది. కృష్ణరాయవిజయం కృతిభర్త “స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు గల్గెనో, యతులితమాధురీమహిమ” నా మును మీ పెదతాత చాల స, న్నుతిఁ గనెఁ గృష్ణరాయల మనోజ్ఞసభన్” అనటం వల్ల ఆ సమస్యకు రామకృష్ణకవి చేసిన పూరణ.

అయితే, రాజసభలో సమస్యను తెనాలి రామకృష్ణుడు ఒక్కడే పూరించాడో, పరిపరివిధాలైన ఇతరుల పూరణలు కూడా ఉండినవో తెలుసుకోవటానికి ఆధారాలు లేవు.

 

పద్యరచనాకాలం:

ధూర్జటి కృతులుగా మనకు లభిస్తున్నవి 1. శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము, 2. శ్రీకాళహస్తీశ్వర శతకము. సాహిత్యచరిత్రకారులు వీటి రచనాక్రమం ఇదేనని భావిస్తున్నా, వీటిలో ఏది మొదటిదో, ఏది తర్వాతిదో నిర్ధారించటానికి ప్రకటమైన ఆధారాలు లేవు. రెండింటి రచనాకాలాన్ని నిరూపించే ప్రామాణికమైన ఆధారమేదీ బయల్పడలేదు.

ధూర్జటి కృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవిసమాజంలో ఒకడని కథాశ్రవణమే కాని, అందుకు సమకాలిక చారిత్రికాధారాలేవీ లేవు. కుమార ధూర్జటి కొడుకు లింగరాజకవి చెప్పిన ‘శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము’లో ఈ పద్యం ఉన్నది:

 

సీ.   శ్రీకాళహస్తిగౌరీనాథపదపద్మసద్భక్తియుక్తి నిశ్చలతఁ గాంచి

సారసుధాసారసరసోక్తిగుంభనఁ గాళహస్తిమాహాత్మ్యకథ నొనర్చి

కృష్ణరాయకిరీటకీలితమణిగణార్చితపదాబ్జద్వయశ్రీ వహించి

యాసేతుకాశీతటావనీఖ్యాతసత్కీర్తివిస్ఫూర్తిఁ జాలవెలసి

 

గీ.    ధరణిఁ జెలువొందె నే కవీశ్వరవతంస

రత్న మ మ్మహనీయు ధూర్జటిసుధీంద్రుఁ

దలఁతు జలనిధివీచికా కలకలాను

కారిభూరికవిత్వవాక్పటిమ గులుక.

ఇందులో చెప్పినట్లు కృష్ణరాయలు ధూర్జటి పాదాలకు సకిరీటంగా వంగి నమస్కరించిన సందర్భం ఎప్పటిదో లింగరాజకవి వర్ణించలేదు. కృష్ణరాయల పాలనాకాలానికి సుమారు రెండు శతాబ్దాల తర్వాత ఆయన ఉన్నాడు. ఎన్ని వివరాలను ఎంతవరకు తెలుసుకొన్నాడో చెప్పలేము.

క్రీస్తుశకం 1509 – 1524 సంవత్సరాల మధ్య శ్రీకృష్ణదేవరాయల ప్రాభవం జగద్విదితంగా ఉండిన రోజులలో ధూర్జటి కృతికర్తృత్వం సాగినట్లు కనబడదు. అల్లసాని పెద్దన, నంది తిమ్మనాదులకంటె కొంత ఆలస్యంగా ఆస్థానప్రవేశం చేసి, అక్కడి విలాసాలకు అలవాటుపడి, అదే సమయంలో రాయల కొలువులోని స్థితిగతులను పరిశీలిస్తూ, కావ్యరచనకు ఆవశ్యకమైన సాధనసామగ్రిని సమకూర్చుకొనే ప్రయత్నంలో ఉన్నాడేమో అనిపిస్తుంది. శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము ఆశ్వాసాంతగద్యలో తన కవితాలక్షణాలను ప్రస్తావింపక నిర్విశేషంగా “భవపరాఙ్ముఖ ధూర్జటి ప్రణీతంబైన” అని మాత్రం చెప్పి ఊరుకొన్నాడు. రాయల ఆస్థానంలో ఉన్న తరుణం ఈ భవపరాఙ్ముఖత్వానికి అనుకూలించిన తరుణమై ఉండదు.

శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తుశకం 1509లో రాజ్యానికి వచ్చాడు. 1530 దాకా పరిపాలించాడు. రాజ్యానికి వచ్చింది మొదలు 1516లో కళింగదేశం విజయనగర మహాసామ్రాజ్యంలో విలీనమైనంత వరకు ఘోరయుద్ధాలతో తీరిక లేకుండా ఉన్నాడు. 1517లో నంది తిమ్మన ‘పారిజాతాపహరణము’ను అందుకొన్నాడు. అందులో భువనవిజయ సభాభవనం ప్రశంస ఉన్నది. ఆ తర్వాత 1519-1520 నాటి అల్లసాని పెద్దన ‘స్వారోచిష మనుసంభవము’ (మనుచరిత్ర) లోనూ, తదితరకావ్యాలలోనూ ఉన్నది. 1524 ప్రాంతాల రాయల ‘ఆముక్తమాల్యద’ రచన జరిగింది. 1518లో కొడుకు తిరుమలరాయలు జన్మించాడు. 1524లో ఆ పిల్లవాడి హత్య జరిగింది. 1524 నుంచి 1530 వరకు రాజ్యమంతా కుట్రలతో కూహకాలతో నిండి, తాడును చూసి పామనుకొనే దుఃస్థితిలో జీవచ్ఛవంగా కాలం గడిపాడు. అనుమానంతో తిమ్మరుసును చెరపట్టాడని పాశ్చాత్య చరిత్రకారులు వ్రాసినది నిజమే అయివుంటుంది. భువనవిజయంలో మళ్ళీ కొలువుతీరినట్లు కనబడదు. సంకుసాల నరసింహకవి వంటి కవులు తమ కావ్యాలను రాజుకు అంకితం చేద్దామని నెలల తరబడి వేచి ఉండి, నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోయిన కాలం అది.

1530లో కృష్ణరాయల మరణానంతరం విజయనగర సామ్రాజ్యం కుక్కలు చింపిన విస్తరి అయింది. అప్పటికే తిమ్మరుసు ప్రాభవం అంతరించి అయిదారేళ్ళు దాటింది. 1533లో పాపం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి గుడిలో అంతవరకు అనుభవిస్తుండిన  తన ప్రసాదస్వామ్యం హక్కులను సర్వభుక్తంగా తాళ్ళపాక పెద తిరుమలాచార్యులకు అమ్ముకొన్నాడు. అచ్యుతదేవరాయలు సింహాసనం ఎక్కాడన్నమాటే గాని రాచరికానికే తీరని మచ్చతెచ్చిన పరామకిరాతకుడు. అల్లసాని పెద్దన “కృష్ణరాయల తోడ దివి కేఁగలేక, బ్రదికియున్నాఁడ జీవచ్ఛవంబ నగుచు” అని పరితపించిన రోజులవి. ధూర్జటికి ఆ మాత్రపు అదృష్టమన్నా దక్కినట్లు లేదు. జీవచ్ఛవానికన్నా దయనీయంగా గడిపిన రోజులవి. రాజశబ్దమంటేనే అసహ్యం పుట్టింది. “ఛీ! జన్మాంతరమందు నొల్లను జుమీ, యీ ‘రాజ’శబ్దంబు” అని చీదరించుకొన్నాడు. తన వర్తనపై తనకే పశ్చాత్తాపం ఉదయించింది. ‘శ్రీకాళహస్తీశ్వర శతకం’లోని రాజనింద అంతా అక్షరాక్షరం ఆ అచ్యుతరాయలకు వర్తిస్తుంది. అందువల్ల 1535కు దరిదాపుల శతకరచన జరిగినదని పెక్కుమంది విమర్శకుల విశ్వాసం. ఏ సంగతీ నిర్ధారణగా చెప్పలేము. వైరాగ్యం అలవడి, మనస్సును చిక్కబట్టుకొన్నట్లు కనబడదు. శతకంలో “విరక్తు జేయగదవే” అని స్వామిని పదే పదే వేడుకొన్నాడు. కావ్యం విషయానికి వస్తే, ‘శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము’లో మనస్సు కొంత స్తిమితమైనట్లు గోచరిస్తుంది. విజయనగర సామ్రాజ్యోన్నతి నాడు పొందిన ఆనందపు ఛాయలేవీ అందులో అగుపించవు. అసలు కృష్ణరాయల రాజ్యప్రస్తావనమే లేదు. 1524 – 1528 ప్రాంతాల రచన మొదలై, ఎన్నో ఒడిదుడుకులు ఎదురైన 1528 – 1530ల నడిమి కాలంలో పూర్తయి ఉండవచ్చునని అనిపిస్తుంది. లేక, 1524కు కొంచెం మునుపే మొదలుపెట్టాడో. కృష్ణరాయలు అప్పటికింకా స్తిమితంగా ఉన్న 1524 ప్రాంతంలో ఎప్పుడో భువనవిజయంలో తన కావ్యగానం చేసే అవకాశం వచ్చి ఉంటుంది. రాయలు ముగ్ధుడై, “స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ, యతులితమాధురీమహిమ?” అని ప్రశ్నించటమూ, అప్పుడు తెనాలి రామకృష్ణుడు సమాధానం చెప్పటమూ భావ్యమే.

మరి ఆ కాలంలో తెనాలి రామకృష్ణుని స్థితేమిటి? అప్పటికింకా ‘రామకృష్ణుడు’ కాలేదని, ఇంకా ‘రామలింగడు’ గానే ఉన్నాడని మనకు తెలుసు. క్రీస్తుశకం 1530 ప్రాంతాల ‘ఉద్భటారాధ్య చరిత్రము’ రచన జరిగింది. అప్పటికి రామలింగడు గానే ఉన్నాడు. 1530 తర్వాత అచ్యుతరాయల సంస్థానంలో ఈ కథాసన్నివేశం జరిగినదని అనుకొన్నా, అప్పటికీ రామలింగడు గానే ఉన్నాడు. 1550 – 65 ప్రాంతాల ‘కందర్పకేతు విలాసము’, ‘హరిలీలా విలాసము’ కావ్యాలను చెప్పాడు. 1560 – 65 లకు నడిమికాలంలో ఎప్పుడో వైష్ణవం పట్ల మొగ్గుచూపాడు. భట్టరు చిక్కాచార్యుల సన్నిధిని సమాశ్రయణం సిద్ధించిన సమయం అది. 1575లో ‘పాండురంగ మాహాత్మ్యము’ రచన జరిగింది. 1575 – 1580 లకు మధ్య ‘ఘటికాచల మాహాత్మ్యము’ రచన. అప్పటికి డెబ్భై సంవత్సరాలనుకొంటే 1510 ప్రాంతాల జన్మించి ఉండాలి. అప్పటికి ఎనభై సంవత్సరాలనుకొంటే 1500 ప్రాంతాల జన్మించి ఉండాలి. ఎటుచూసినా 1524 ప్రాంతాల ధూర్జటి వంటి మహాకవిపై పరిహాస చంద్రహాసాన్ని ఝళిపించేందుకు 14 కంటె 24 ఏళ్ళ ప్రాయపువాడై ఉండటం సమంజసం. అందువల్ల, 1500 – 1580 అన్నది  రామకృష్ణుని జీవితకాలం అన్నమాట.

1524 నాటికి తెనాలి రామకృష్ణకవి ఇంకా తెనాలి రామలింగకవి గానే ఉన్నందువల్ల కథావిషయాన్ని ఇదమిత్థంగా నిర్ధారించేందుకు తగిన సాధనసంపత్తి లేదని కాబోలు, బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు, “కృష్ణరాయలు ధూర్జటికవి కవనశక్తినిఁగూర్చి పద్యరూపమునఁ బ్రశ్నింపఁగా నొకకవి పూరించిన పూరణము” అని ఈ చాటువును కృష్ణదేవరాయల ఆస్థానంలో “ఎవరో కవి” చేసిన పూరణగా తమ ‘చాటుపద్యమణిమంజరి’ (1988 నాటి ముద్రణలో 127-వ పద్యం శీర్షిక) లో ఉదాహరించారు.

శైవ వైష్ణవ నామాంకనాలలో విభేదం ఉన్నంత మాత్రాన ఈ పద్యపూరణను ఎవరో కవి చేసిన పూరణ అని భావింపనక్కరలేదు. రామలింగకవి శైవుడుగా ఉన్న రోజులలో చేసినప్పటికీ, ఆ తర్వాత ప్రసిద్ధిలోకి వచ్చిన రామకృష్ణ నామాన్ని బట్టి జనులు దీనిని రామకృష్ణకవి రచనగా భావించటం అసంభావ్యమేమీ కాదు.

ఈ పూరణను నిర్వహించిన తర్వాత కొద్ది కాలానికే రామకృష్ణకవి ‘ఉద్భటారాధ్య చరిత్రము’ను పూర్తిచేశాడు. అందులో తన కవిత్వాన్ని గురించి కృతిపతి ఊరదేచమంత్రి “సహజసాహితీమాధురీసంయుతాత్ముఁడవు” అని చెప్పినట్లుగా వ్రాశాడు. ధూర్జటి గారి అపూర్వమైన ‘మాధురీమహిమ’ ఇంకా ఆయన గుండెలకు హత్తుకొని ఉన్నదన్నమాట.

 

పద్యభావం: పునరవలోకనం

జాగ్రత్తగా పరిశీలిస్తే రామకృష్ణకవి కృష్ణరాయల ప్రశ్నను అమేయమైన ప్రతిభతో వక్తవ్యానికి అనుగుణంగా మలిచి చెప్పాడని అర్థమవుతుంది. ధూర్జటి కృష్ణరాయల సభలో చదివిన ‘శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము’ చతుర్థాశ్వాసంలోని మాణిక్యవల్లి కథ ప్రసక్తికి వచ్చిందని, ఆ కథాసంగతమైన ఉదంతాన్ని రామకృష్ణుడు ఉభయార్థద్యోతంగా చమత్కరించాడని తెలుస్తుంది.

మధురాపురంలో మాణిక్యవల్లి అనే వేశ్యకు ఇద్దరు కుమార్తెలు జన్మించారు. గణికాజనానికి ఉచితమైన వాతావరణంలో పెంచినా, వారు శివభక్తికి నోచుకొని చిన్ననాడే వైరాగ్యాన్ని అలవరచుకొంటారు. ఆమె వారికి వారకాంతల విధివిధానాలను నూరిపోస్తుంది. వారు –

 

“అమృతము గ్రోలు జిహ్వ చవియంచుఁ దలంచునె తేనె? నింటిలో

నమరమహీరుహం బుదయమైన నరుం డవనీశు వేఁడునే?

యమిజనభాగ్యరూప మగు నాదిమతత్త్వముఁ గాళహస్తిదై

వము భజియించు మానసము వారవధూమదసౌఖ్య మెంచునే?”

అని ఆమె పలుకులను తిరస్కరిస్తారు. కుమార్తెల విరక్తికి వేశ్యమాత ఎంతో చింతిస్తుంది. ఆమె ఒత్తిడిని భరింపలేక వారు శ్రీకాళహస్తిక్షేత్రంలో శివుని సన్నిధికి వెళ్ళిపోవాలనుకొంటారు. దారిదొంగలు వారికి అపకారం చేయవచ్చునని సందేహించి ఈశ్వరుడే వారికి మానవరూపంలో సాక్షాత్కరించి శ్రీకాళహస్తికి తీసుకొనివెళ్తాడు.  ఆ “మోహనక్షేత్రము”లో వారు నత్కీరుని శతకపద్యాలతో పరమేశ్వరుని సన్నుతిచేస్తూ, అపూర్వమైన పారవశ్యాన్ని పొందుతారు. ఈశ్వరుడు సతీసమేతుడై వారికి ప్రత్యక్షమై తన సన్నిధి రూపమైన పెన్నిధిని వారికి అనుగ్రహిస్తాడు. ఆకాశవాణి వారి భక్తిపారమ్యాన్ని పురజనులకు వినిపించి, శివుని అనుగ్రహానికి నోచుకొన్న ఉదంతాన్ని వివరించి, వారి పేరిట ఆ పుణ్యక్షేత్రంలో మహేశ్వరలింగాలను ప్రతిష్ఠించాలని ఆదేశిస్తుంది.

మహాకవి ధూర్జటి శైవభక్తిపారమ్యానికి, తమిళంలో ‘సీకాళత్తిపురాణం’లో ఉన్న స్థూలచిత్రణకు ప్రాణప్రతిష్ఠ చేసిన ఆయన భంగీభణితికి, సాటిలేని మాధురీమహిమకు ఉదాహరణీయమైన కథ ఇది.

“వారవనితా జనతా” అంటే మాణిక్యవల్లి కుమార్తెలు. వారి పలుకులు ఎన్నో జన్మల అనుభవతాపాన్ని హరింపజేసే మాధుర్యసుధారసధారలు. శివుని యందలి సర్వసమర్పణభావం, పారమార్థికత, విషయవాసనల పట్ల అనాసక్తి, తత్ఫలమైన వైరాగ్యం వారికి పుట్టుకతోనే అలవడటం వారి భాగ్యవిశేషం. శివార్చనానియమసంగతి తప్ప వారికి అన్యబంధాలు లేవు. పరమేశ్వరుడు వారికి భక్తినిష్ఠను గుర్తించి, సన్నిధిని అనుగ్రహించి, తానే వారి వెన్నంటి నడిచి, తాను స్వయంవ్యక్తుడై వెలసిన పుణ్యక్షేత్రానికి తీసికొని వెళ్ళాడన్న కథను పోలిన కథ సాహిత్యంలో వేరొకటి లేదు. తాము అనునిత్యం సేవించుకొంటున్న ఆరాధ్యదైవతం కనుల మ్రోల నిలిచి తమను ఆత్మాభిముఖంగా నడిపిస్తున్నాడన్న అభిజ్ఞానం లేని ఆ బాలికలు మధురాపురం నుంచి చిదంబర నటరాజు వెలసిన పుణ్యక్షేత్రం దారిని మూడు నాలుగు రోజుల ప్రయాణంలో ఆ “ఘనతాపహారి” యొక్క “సంతతమధురాధరోదితసుధారసధారలను” ఆస్వాదించే మహాపుణ్యానికి నోచుకొన్నారు. జన్మించినది ఆదిగా శివారాధనం తప్ప వేరొకటి యెరుగని ఆ పుణ్యవతుల “ఘనతాపహారి” = జన్మజన్మల తాపశాంతికర “సంతతమధురాధరోదితసుధారసధారలను” మనోమందిరంలో నిలుపుకొన్న ధూర్జటి పవిత్రవాక్కులకు లౌకికకవుల వాగ్విశేషాలతో ఔపమ్యానికి అందని మాధుర్యమయప్రాణశక్తి అందివచ్చింది. అమోఘమైన ఆ వాగ్ధారలో ఓలలాడిన రాయలవారికి ఆ అతులితమైన మాధురీమహిమ అచ్చెరువు గొలిపింది. తత్పూర్వం ఎన్నడూ యెరుగని పారవశ్యాన్ని పొందాడు.

“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ

యతులితమాధురీమహిమ?”

అని సదస్యులతో తన ఆనందాన్ని పంచుకొన్నాడు. ఆ మహానందాన్ని గుర్తించిన రామకృష్ణకవి భక్తి శృంగారాలను మేళవించి,

 

“… హా! తెలిసెన్; భువనైకమోహనో

ద్ధతసుకుమారవారవనితాజనతాఘనతాపహారి సం

తతమధురాధరోదితసుధారసధారలు గ్రోలుటం జుమీ.”

 

అని ఆయన మనోగతాన్ని తన మనోధర్మానుసారం మనోహరంగా పరిపూర్ణించాడు.

ఈ పూరణను విన్న రాయలు రామకృష్ణకవికి ఏ బహుమానం సమర్పించుకొన్నా అది తక్కువే అవుతుంది.

తన కావ్యోక్తిమాధురికి ప్రాణంపోశాడని నిండుమనస్సుతో ధూర్జటి గారు ఆరోజు యువకవి శిరస్సుమీద ఎన్ని దీవెనలు కురిపించాడో!

సభవారంతా ఎంత మురిసిపోయారో!

2 thoughts on “స్తుతమతియైన యాంధ్రకవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *