April 27, 2024

అనుపమ దర్శక నిర్మాత కె. బి. తిలక్ – అనుభవాలు-జ్ఞాపకాలు-3

రచన: వనం జ్వాలా నరసింహారావు vanam

పొట్టి శ్రీరాములును బలి చేసారు

సమాజంలో గుర్తింపు వచ్చిన వ్యక్తికి, రాని వ్యక్తికి కూడ, వారివారి గత చరిత్రల్లో స్పూర్తి దాయకమైన కొన్ని సంఘటనలు వుండటం సహజం. ఆ వ్యక్తి ధనవంతుడు కావచ్చు, పేదవాడూ కావచ్చు. జీవన పోరాటంలో స్వయం కృషితో ఓ సముచిత స్థాయికి వచ్చిన వారెందరో వున్నారు. అలాంటి వారిలో తాను సహితం ఒకడిని అవునో కాదో ఇదమిద్ధంగా తేల్చి చెప్ప లేకపోయినా, తన జ్ఞాపకాలను మాత్రం ఇతరులతో పంచుకోవాలని వున్నదని,  ఇతరుల అనుభవాలను, జ్ఞాపకాలను తెలుసుకోవాలన్న అభిలాష వుందనీ చెప్తూ, ఆ సందర్భంగా “కేసరి” అనే వ్యక్తిని గుర్తు చేసుకున్నారు తిలక్. వీధి దీపాల క్రింద కూర్చొని చదువుకున్న ఆ వ్యక్తి ఎన్నో విద్యా సంస్థలను నెలకొల్పాడనీ,”కేసరి తైలంగా” ప్రఖ్యాతి పొందిన తైలం ఆయన ప్రోడక్టని వివరించారాయన.

బారసాలనాటి తిలక్ గారి పేరు “కొర్లిపర బాల గంగాధరరావు”. తాత గారి పేరు గంగాధరయ్య అయినందున ఈయన కా పేరు పెట్టారు. అభ్యుదయ భావాల వెంకటాద్రిగారు (తిలక్ గారి తండ్రి) ఆ భావాలను తన వరకే పరిమితం చేసుకున్నారు. ఎప్పుడూ ఖద్దరు దుస్తులే ధరించేవారు. సిగరెట్, బీడీ, ఇతర మత్తు పానీయాలకు ఎప్పుడూ దూరమే. వార్తా పత్రికలు క్రమం తప్పకుండా చదివేవారు. ఎందరి మధ్యనో, మధ్యవర్తిగా వుంటూ, సమస్యల పరిష్కారం చేస్తూ, తనకు తెలవకుండానే సమస్యల్లో ఇరుక్కుపోయే వారు పాపం. అది ఆయనకో హాబీ. “స్వాతంత్ర్యం నా జన్మ హక్కు” అని పిలుపునిచ్చిన బాలగంగాధర తిలక్‌పై వున్న భక్తి, గౌరవాలతో స్కూల్లో చేర్పించేటప్పటికి గంగాధర రావు కాస్తా “బాలగంగాధర తిలక్” అయిపోయి మనందరికీ తెలిసిన కె. బి తిలక్‌గా మారిపోయారు.

ఎందుకో, ఈసారి, ఈ విషయాలను చెప్పాలనిపించింది అన్నారు తిలక్,

త్యాగధనుడు కీర్తి శేషులు పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కొరకు మద్రాసులోని మైలావూర్‌లో ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు తిలక్. ప్రఖ్యాత చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ బాల సుందరరావు (గాలి) గారు అప్పట్లో మద్రాసు “టీ నగర్” లో వుండేవారు. సినీ నటుడు చంద్రమోహన్ మామగారు గాలి బాల సుందరరావు గారు. ఆయన గారింట్లో రాజకీయ సమావేశాలు జరుగుతుండేవి రెగ్యులర్‌గా. ఆ విధంగా అయనతో పరిచయం అయింది. అక్కడే పద్మభూషణ్ డాక్టర్ పి.తిరుమలరావు గారితో కూడా పరిచయమేర్పడింది. టీ నగర్‌లోనే వుంటున్న బులుసు సాంబమూర్తి గారితో కూడా సాన్నిహిత్యం ఏర్పడింది. తిలక్ తన కుర్ర కారు గ్యాంగ్‌తో కనిపించిన ప్రతినాయకుడింటికి పోయి, పొట్టి శ్రీరాములుగారి నిరాహారదీక్ష విరమింపచేసే ప్రయత్నాలు చేయమని ఒత్తిడి తెచ్చేవారట. ఆయనొక్కడినే ఎందుకు బలి కానివ్వాలని వాదించే వారట

సరిగ్గా అదే రోజుల్లో టంగుటూరి ప్రకాశం పంతులు గారి పెద్ద కుమారుడి ఇంటి ఆవరణలో వుంటుండేవారు తిలక్. అదీ టీ నగర్‌లోనే వుండేది. ఆ ఇంటికి వెనక భాగాన వున్న ఓ కారు షెడ్డు దానిపైన ఓ పాక అప్పట్లో తిలక్‌గారి బిచానా! అదే ఆయన స్వంత ఇల్లుగా చూసుకునే అద్దె ఇల్లు. పాకలో స్వయం పాకం. రాజకీయాలతో బిజీ — సినిమాల్లో అరకొర పనీ– సంపాదన సరేసరి!

ప్రకాశం గారి మనస్తత్వం ‘బోళా’ అన్నారు తిలక్. ఎవరితోనైనా మంచిగా మాట్లాడే వ్యక్తిత్వం ఆయనది. ఆయనతో తన భేటీని గుర్తు చేసుకున్నారు తిలక్. కె. సి. పి. సిమెంట్ సంస్థాపకుల్లో ఒకరైన రిటైర్డ్ ఐ. సి. యస్. అధికారి రామకృష్ణగారి భవంతి వున్న ఆవరణలోనే “ఇండియన్ రిపబ్లిక్” పత్రిక కార్యాలయం కూడ వుండేదట. ఓ రోజున –ఇంక–పొట్టి శ్రీరాములు గారి–అత్మత్యాగానికి–మరి కొన్ని గంటలు వ్యవధే వున్న సమయంలో — ప్రకాశం పంతులుగారు ఇండియన్ రిపబ్లిక్ పత్రికాఫీస్ కాంపౌండ్‌లోకి ప్రవేశించి కారు దిగుతున్న క్షణంలో —  తిలక్ గారి కుర్ర కారు బృందం ఆయన్ను చుట్టు ముట్టింది. కారు దిగుతున్న ప్రకాశం గారిని తిలక్ చేత్తో పట్టుకుని బరబరాలాగేసారట. అది ఊహించని ఆయన –“ఒరే–ఒరే–ఏం చేస్తున్నావురా?” అని మాత్రమే అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములును అందరూ కల్సి ఏకాకిని చేసి, బలి చేస్తున్నారన్న ఆవేదన, ఆవేశం, బాధ, తన్ను అలా పిచ్చివాడిగా చేసిందని అంటూ — ప్రకాశం గారిలాంటి గుండే ధైర్యం వున్న మనిషికూడా, ఆ సందర్భంలో అంతకన్న ఎక్కువ రియాక్టు కాకపోవటం విశేషమని అన్నారు తిలక్.

అప్పట్లో, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూతో సహా పలువురు నాయకులు రాష్ట్రాల విభజనకు వ్యతిరేకమనీ, ప్రజల ఒత్తిడి మేరకే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరించటం జరిగిందనీ అంటారు తిలక్. అప్పట్లో ఫజలాలీ కమిషన్ కార్యదర్శిగా పనిచేసిన శ్రీ ఎ. ఆర్. బాజీ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌గా, ప్రభుత్వ సమాచార సలహాదారునిగా వున్నారనీ ఆయనతో కూడ తనకు బాగా పరిచయమనీ చెప్పారు శ్రీ తిలక్.

పొట్టి శ్రీరాములు మరణంతో, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావటం, కర్నూలు రాజధాని కావటం సమకాలీన చరిత్ర. అందరికీ తెలిసిందే. ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా నెహ్రూ గారు కర్నూలు వచ్చినప్పుడు, అక్కడికి పలువురు సినీ కళాకారులు వెళ్లారనీ, అందులో శ్రీమతి లక్ష్మీరాజ్యం ఒకరనీ గుర్తు చేసుకున్నారు తిలక్.

ఇవన్నీ ఇలా వుండగా.. మళ్లీ.. ఇంగువ వాసనలాగా.. సినీ రంగంపై మనసు మళ్లింది. ఆ విషయాలు కాసేపు ముచ్చటించారు ఆయన.

kb tilak

ఎడిటర్స్ గా రాజన్ – తిలక్‌ల కాంబినేషన్‌లో “శ్రీ ఛత్రపతి ప్రొడక్షన్స్” బ్యానర్ క్రింద తీసిన ఓ చిత్రం “రాధిక”. అది రాధాకృష్ణుల ప్రేమగాథ ఇతివృత్తం. చిత్ర కథా రచయిత సదాశివ బ్రహ్మ కాగా, దర్శకత్వం వహించింది కాళ్లకూరి సదాశివరావుగారు. “నెప్ట్యూన్” స్టూడియోలో షూటింగ్ జరిగిన ఈ సినిమాలో రాధిక వేషం వేసిన ఆమే ప్రప్రథమ ప్లేబ్యాక్ గాయని శ్రీమతి “రావు బాల సరస్వతీ దేవి” గారు. ప్రఖ్యాత హాస్య నటుడు శ్రీ పద్మనాభం హీరోగా నటించిన మొదటి చిత్రం కూడా ఇది. ఓ ముస్లిం వ్యాపారవేత్త నిర్వహణలో వున్న నెప్ట్యూన్ స్టూడియోలో తమిళ-తెలుగు చిత్రాలతో పాటు శ్రీలంక నుండి వచ్చిన దర్శక-నిర్మాతలు సింహళ భాషలో కూడ సినిమాలు షూట్ చేస్తుండేవారు అప్పట్లో.

రాజన్-తిలక్ ఎడిటర్లుగా సువర్ణా ఫిలింస్ బ్యానర్ క్రింద తీసిన మరో చిత్రం పేరు “సువర్ణమాల”.  దానికి కాళ్లకూరి సదాశివరావు దర్శకత్వం వహించారు. అందులోనూ బాల సరస్వతి దేవే హీరోయిన్. హీరోగా నటించిన సూర్యనారాయణ గారనే అయన ఆంధ్రాబ్యాంక్‌లో అధికారిగా పనిచేసేవారు. ఓ జూనియర్ కళాకారుడు ఈర్ష్యతో సూర్య నారాయణరావును హత్య చేసారు. ఆ కేసింకా తేలలేదు అని గుర్తు చేసుకున్నారు తిలక్.

శ్రీమతి రావు బాలసరస్వతీ దేవిని, రాజన్-తిలక్‌లు సెట్లలో “పాప” అనే పేరుతో సంబోధించేవారు ఆ రోజుల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు. స్టూడియోకు వచ్చి పోతుండేవారిలో డ్యాన్సర్లు లలిత, పద్మిని–వాళ్లమ్మ గారు వుండేవారనీ, వాళ్లంతా తనకు బాగా పరిచయమనీ తిలక్ గుర్తు చేసుకున్నారు.

రాజన్-తిలక్‌ల కాంబినేషన్‌లో, ఎడిటర్లుగా తీయబడిన మరో చిత్రం పేరు “మంత్రదండం”. జ్ఞానాంబికా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ చిత్రంలో కథానాయకుడుగా శ్రీ అక్కినేని నాగేశ్వరరావు, కథానాయికగా శ్రీమతి జూనియర్ శ్రీ రంజని నటించారు. దర్శకత్వం శ్రీ కె.రామచంద్రరావు వహించారు. “రాధిక”, “మంత్రదండం” సినిమాలకు సంగీత దర్శకుడు శ్రీ ఎస్. రాజేశ్వరరావు.

ఎచ్. ఎమ్. రెడ్డిగారి కజిన్ హెచ్. వి. బాబు గారిని గుర్తు చేసుకున్నారు తిలక్. ఆయన ఎక్కువగా వివేకానంద, శ్రీ రామకృష్ణ పరమహంస సాహిత్యం చదవటం, వారికి సంబంధించిన విషయాలను పలువురితో చర్చించటం తిలక్ గారికి ఎంతగానో నచ్చేది. రాజమండ్రి నుండి మద్రాసుకు చేరుకున్న ఓ ప్రొడ్యూసర్ నిర్మించిన “ధర్మాంగద” అనే చిత్రానికి శ్రీ బాబు దర్శకత్వం చేసారు. రాజన్-తిలక్‌ల కాంబినేషన్ ఎడిటర్స్. కృష్ణవేణి హీరోయిన్. ఈ సినిమాలో నటనకు అవకాశం దొరికిన శ్రీమతి సూర్యకాంతం వాయిస్ బాగాలేదని (!) డైలాగులు చెప్పనవసరంలేని మూగ పాత్రకు ఆమెను ఎంపిక చేసారు అప్పట్లో అని చెప్పారు తిలక్. ఆ తర్వాత కాలంలో ఆమెదో ప్రత్యేక తరహా గొంతుగా, డైలాగ్ డెలివరీగా, విశిష్ఠనటనగా, అశేషాంధ్ర ప్రేక్షకులు గుర్తించటం తెలిసిన విషయమే.

రాజన్‌తో ఎడిటింగ్‌ లైన్లో పనిచేస్తున్న తిలక్‌గారు తన జీత భత్యమెంత అనే ఆలోచనను రానిచ్చినట్లు లేదు. ఆసక్తిగా “మీ జీతభత్యమెంత?” అని అడుగితే– “అంతా– ఇంతా–కాదు, ఇబ్బందిలేనంత” అని సమాధానం ఇచ్చారు. భోజనానికి ఇబ్బంది లేదు — జీవనం గడుస్తుండేది —  అదో తృప్తి అని అన్నారు. అని అంటూనే గుర్తుచేసుకున్నారు “మన దేశం” సినిమా షూటింగ్ జరుగుతున్న రోజుల్లోని ఓ సంఘటనను.

మన దేశం సినిమా షూటింగ్ చేస్తునప్పుడు ప్రొడక్షన్ ఇన్‌ చార్జ్ గా రామచంద్రన్ అనే ఆయన వుండేవారట. టెక్నిషియన్లను ప్రతిరోజూ భోజనం చేయించటం, కాఫీ – టీ, ఫలహారాలు ఇప్పించటం ఆయన డ్యూటీ. ఆ కార్యక్రమం కొరక్కు నిత్యం టెక్నీషియన్ల బృందాన్ని మౌంట్ రోడ్‌లో వున్న నేషనల్‌ కెఫే అనే ఓ ఇరానీ హోటల్‌కు తీసుకెళ్లేవారు ఆయన. ఇది, చెప్తూ — చెప్తూ – నవ్వుకున్నారు తిలక్ చాలా సేపు. ఓ రోజున టీ త్రాగిన తర్వాత, పెద్ద మొత్తంలో సమోసాలను ప్యాక్ చేయించారు తిలక్. స్టూడియో ఫ్లోర్‌కు వెళ్లగానే రుచిగా వున్నాయని తలొకటీ పంచారు. అందరూ తిన్నారు-హీరోయిన్ కృష్ణవేణి, దర్శకుడు శ్రీ ఎల్. వి. ప్రసాద్ గారితో సహా. మర్నాడు మళ్లీ అందరూ వెళ్లినప్పుడు, ఈ ఖర్చును తిలక్‌గారి పర్సనల్‌ ఖాతాలో జమకట్టే ప్రయత్నం చేసారు శ్రీ రామచంద్రన్. తిలక్, దాన్ని వ్యతిరేకించి, సమోసాలు అందరూ తిన్నందువల్ల కామన్ అక్కౌంట్ లో పడాల్సిందే అని పట్టు పట్టారు. చివరకు ఈ వ్యవహారం సినీ నిర్మాతైన మీర్జాపూర్ రాజాగారి వరకూ వెళ్లింది. సమస్యకు, ఇబ్బందికరం లేని పరిష్కారం కుదిరింది. జీత భత్యాలు ఆ రోజుల్లో అలానే వుండేవని ఈ సంఘటనను ఉదహరించారు.

తిలక్‌గారి సినీ జీవితంలో మరో మైలురాయి నవయుగ ప్రొడక్షన్స్ బ్యానర్ క్రింద నిర్మించిన “జ్యోతి” చిత్రం. తిలక్-రాజన్‌లు ఈ చిత్రానికి కూడ సమ్యుక్తంగా ఎడిటర్స్. గోగినేని చిన వెంకట సుబ్బయ్య గారి (కృష్ణాజిల్లా) అల్లుళ్లు, సూరెడ్డి వీర రాఘవయ్య, కడియాల వెంకటేశ్వరరావులు పెట్టుబడి పెట్టి సినిమా తీశారు.

జ్యోతి సినిమాను ఒకేసారి రెండు భాషల్లో-తెలుగు, తమిళం-చిత్రీకరించారు. సావిత్రి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో రామచంద్ర కాశ్యప్ హీరో. ప్రజా నాట్య మండలికి చెందిన పలువురు కళాకారులతో సహా ఈ చిత్రంలో నటించిన ఇతరులలో శ్రీమతి జి. వరలక్ష్మి, శ్రీ ఎమ్. శ్రీ రామమూర్తి గార్లున్నారు. సుంకర – వాసిరెడ్డి రచయితలుగా మంచి పేరు తెచ్చుకున్న సినిమా జ్యోతి. అభ్యుదయ రచయిత శ్రీ కొడవటిగంటి కుటుంబరావు కథా రచనలో తన సహకారం అందచేశారు.

సుంకర-వాసిరెడ్డిలు మంచి సాహితీవేత్తలనీ, ఇతి హాసాలు, పురాణాలు, ఆధునిక సాహిత్యం క్షుణ్ణంగా చదువుకున్న వారిద్దరిలో, డెప్త్ వుండేదనీ, వారు పాటలు కూడా వ్రాసేవారనీ అన్నారు తిలక్.

జ్యోతి సినిమా దర్శకుడు శ్రీధర్‌కు, నిర్మాతలకు మధ్యన చెలరేగిన గొడవల మూలాన్న, శ్రీధర్ దర్శకత్వం కొనసాగించకుండా మధ్యనే విరమించుకున్నారు. నిర్మాతలు కూడ ఆయన్ను వదిలించుకోదల్చారు. దర్శకత్వ బాధ్యత శ్రీ కె. బి. తిలక్ గారిపైన పడింది. చాలెంజ్‌గా స్వీకరించిన శ్రీ తిలక్, తాను దర్శకుడుగా షూట్ చేసిన రెండు సంఘటనలను గుర్తు చేసుకున్నారు. సుంకర-వాసిరెడ్డి వ్రాసిన — “పదువురు కలిసి పని చేయరే” — అనే పాటను సావిత్రి నటనలో చిత్రీకరించిన సన్నివేశం ఒకటి. అందులో ఓ పాఠశాలకు పాకను వేయాలి. తనకు ఎడిటర్‌గా పని చేసిన అనుభవాన్ని దృష్టిలో వుంచుకుని, ఆ సన్నివేశాన్ని రివర్స్ లో — అంటే — పాకను వేయటానికి బదులుగా, వేసిన పాకను పీకటంతో — చిత్రీకరణను ప్రారంభించానని అన్నారు. అది చూసిన సావిత్రి తండ్రి “చిలక కొట్టుడు”  కొట్టావయ్యా అని తిలక్ గారితో అన్నారట.

మరో సన్నివేశం, తిలక్ తన దర్శకత్వం చేపట్టిన తర్వాత, కొండేపూడి గారితో వ్రాయించిన పాట చిత్రీకరణ. అక్షరాస్యత ప్రాముఖ్యాన్ని చాటుతూ, నిరక్షరాస్యతను ఓ సామాజిక సమస్యగా వర్ణిస్తూ రాసిన ఆ పాట చిత్రీకరణ సన్నివేశంలో పాల్గొన్నవారు నాటి ‘బాలానంద సంఘ’ సభ్యుడు. బాలానంద సంఘానికి అధ్యక్షుడు రేడియో అన్నయ్యగా సుపరిచితులైన వ్యాపతి రాఘవరావుగారు. ఈ పాటలో అభినయించిన నటీమణి (బాల నటి) నిడదవోలు వెంకటరావుగారి అమ్మాయి, నేటి మేటి నటి జయసుధ తల్లి శ్రీమతి జోగమాంబగారు. ఆ పాటలో ఆమెతో పాడించిన చరణాలను పల్లెవేసారు తిలక్, ఈ సందర్భంగా…! “బలే బలే విన్నావా —  పిల్లగాడి ఎద్దేవా — కూలి పనికి పొడంట — కావాలీ సధువంట — ” అని పాడారు తిలక్. “కలక టేర్ కొడుకు కలక టేరే కావాలా?– కూలోడి కొడుకు కూలోడే అవ్వాలా? కరణం తప్పుడు లెక్కలు పట్టుకునేదెవురు–” అనే ప్రశ్నలు వేయించారు రచయిత ఆపాట ద్వారా. పెండ్యాల ఆ సినిమాకు సంగీత దర్శకుడు.

జ్యోతి సినిమా ఫినిషింగ్ స్టేజ్‌లో వహీదా రహ్మాన్ మద్రాసుకు వచ్చారు. నాటక కళా పరిషత్ సభ్యులు శ్రీ కనకారావు ఆమెను తిలక్ గారికి, అందరితో పాటు పరిచయం చేసారు స్టూడియోలో. తిలక్‌గారి సలహా మేరకు ఆమెను సారథీ యూనిట్‌కు పంపటం — ఆ తర్వాత “రోజులు మారాయి” సినిమాలో నటించటం తెలిసిందే.

జ్యోతి సినిమా టైటిల్స్ లో దర్శకుడి పేర్లుగా శ్రీధర్-తిలక్ అనీ, ఎడిటర్‌గా రాజన్-తిలక్ అని వేశారు. అలా, ఆ సినిమాతో తిలక్ గారు దర్శకుడిగా స్థిరపడిపోయారు. అనుపమ చలనచిత్ర దర్శక, నిర్మాతగా అందరి మన్ననలను పొందారు.

సందేశం నుంచి విశాలాంధ్ర వరకు

            సినిమాల్లోకి వచ్చాం గదా! ఆ రంగంలోని వ్యక్తుల గురించి, వారితో పరిచయాలను గురించి సందర్భానుసారంగా వివరిస్తానని, అదే విధంగా కమ్యూనిస్టు పార్టీవైపు ఆదిలో ఆకర్షితులై, ఆ తర్వాత, కారణాలు ఏమైనా ఆ పంథాను వీడిన వారి ఆత్మ విమర్శకు చెందిన సంఘటనలను గురించి కూడా చెప్పాల్సి వుందనీ తిలక్ అంటారు. తాను కూడా ఆత్మ విమర్శ చేసుకున్నవారిలో, ఇంకా చేసుకుంటున్న వారిలో ఒకడిని అన్నారు. తనకు ఇప్పటికీ అర్థంకాని ఓ విషయం ఉందంటారు ఆయన. సమాజంలోని ఉన్నత వ్యక్తులు, ఉన్నవారు.. దాదాపు అందరూ… వీధుల్లో అడుక్కుని జీవించేవారికి పైసలు దానం చేస్తారు కాని… స్వచ్చంద సామాజిక సేవకులమని చెప్పుకునే వారెవరూ అలా ఎందుకు చేయరని ఆయన ప్రశ్నించారు. ఆ మాటకొస్తే… అడుక్కునేవాడి ఆశయం.. “కోటి విద్యలు కూటికొరకే” కదా! డబ్బులు ఇస్తే, ఈ బీద వారిని… బీదరికాన్నీ.. ప్రోత్సహించినట్లు అవుతుందని కొందరు వాదిస్తారు. అదో నెపం మాత్రమే అంటారు తిలక్. “అందరూ సమానం” అని చెప్తుండే వీరు “ఈ బీద వారి గతి ఏం కావాలి” అనే విషయం ఎందుకు మాట్లాడరు? అని వాపోయారు తిలక్.

సోషల్ యాక్టివిస్టులకు ఫైటర్ గుణాలున్నా, ఈ విషయాలను గురించి పట్టించుకోరు, అని అంటూ, ఇది ధార్మికమేనా? అన్న మీమాంస తన అంతర్‌ మథనంలో ఎప్పుడూ రగులుతూనే వుంటుందని చెప్పారు తిలక్. తన ఈ ప్రశ్నలకు, జీవితానుభవం రంగరించుకున్న సోషల్ యాక్టివిస్టులు సమాధానం చెప్పాలనీ, బీద వారికి షెల్టర్ కలిగించే, మరో సోషల్ యాక్టివిస్ట్ లేదా వ్యవస్థ ఎప్పుడు ఆవిర్భవిస్తొందో చూడాలని కూడా వుందనీ ఆయన ఆవేదనతో అన్నారు. క్లింటన్ పర్యటన సందర్భంగా అరెస్ట్ చేసి దాచిపెట్టిన బీద బిచ్చగాళ్లు మళ్లీ అవతరించారని, వీరికి శాశ్వతంగా ఉపాధి ఎందుకు కలిగించరని తిలక్ ప్రశ్నించారు.

ప్రఖ్యాత దర్శకులు శ్రీ ఆదుర్తి సుబ్బారావుగారితో పరిచయం కలిగిన తర్వాత, ఆయనతో తానీ విషయాలు కొన్ని ప్రస్తావించానని, అదే కథా వస్తువుగా సినిమా తీస్తానని ఆయన చెప్పేవారనీ, పర్యవసానంగా “కోటి విద్యలు కూటికొరకే” అనే సినిమా తీయటం జరిగిందనీ తిలక్ చెప్పారు.

హైదరాబాద్‌లో విశాలాంధ్ర ఎడిటర్‌గా పదవీ విరమణ చేసిన శ్రీ సి. రాఘవా చారి గారి సత్కార కార్యక్రమానికి తానూ వెళ్లాననీ, ఆ సందర్భంగా, తన పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నానని చెప్పారు తిలక్. మొదలు కమ్యూనిస్టు పార్టీకి “ప్రజాశక్తి” అనే ఓ పత్రిక వుండేది. కాలం-మార్పులు, వాటి ప్రభావం, దానిపై పడి, “ప్రజలు”-“శక్తి” విడిపోయారు.. పోనీ విడదీశారు.. అని భావగర్భితంగా అన్నారు తిలక్. ఎస్. వి. నర్సయ్య కమ్యూనిస్టు పార్టీ కోఆర్డినేటర్‌గా చెన్నపట్నంలో అజ్ఞాత కార్యకలాపాలు సాగిస్తున్న రోజుల అనంతరం, కృష్ణా జిల్లాకు  చెందిన కోటేశ్వరరావు అనే వ్యక్తి పేరు పైన, డిక్లరేషన్ వేయించి, “సందేశం” అనే ఓ వార్తాపత్రికను ప్రారంభించారట. తెలంగాణ ఉద్యమం నిలుపుదల, పోనీ, అణచివేత తర్వాత జరిగిన సంఘటన ఇది.

ప్రఖ్యాత జర్నలిస్ట్ శ్రీ రాంభట్ల కృష్ణ మూర్తి సహా, సందేశం సంపాదకవర్గంలో అభ్యుదయ భావాల వారు మరి కొందరున్నారు. వాళ్ళ ఆర్టికల్స్ అందులో ప్రచురించటం జరిగేది. రాంభట్ల గారు అందులో బొమ్మలు కూడా వేసినట్లు తనకు గుర్తని అంటారు తిలక్. అదే రోజుల్లో శెట్టి ఈశ్వరరావు గారి చొరవతో ఎ-4 పేపరు సైజులో ఓ పత్రిక ప్రారంభమయింది. దాని పేరే “విశాలాంధ్ర”. కమ్యూనిస్టు పార్టీ అండ దండలతో భవిష్యత్‌లో ఆ పత్రిక నేటి “విశాలాంధ్ర” దినపత్రికగా మారిందని చెప్పరు తిలక్. “విశాలాంధ్రలో ప్రజారాజ్యం” అనే నినాదం స్పూర్తితో, పత్రికకు ఆపేరు పెట్టివుండవచ్చునని కూడా అన్నారు తిలక్. ఆనాటి సంగతులు, పత్రికలో ప్రచురితమయిన విషయాలను గుర్తు చేసుకుంటూ, మధ్య-మధ్యన, అందులో (విశాలాంధ్రలో) తాను కూడా “తాతారావు” అనే కలం పేరుతో వియత్నాం యుద్ధ విషయాలపై వ్యాసాలను వ్రాసానని చెప్పారు తిలక్.

ఎమ్. ఎన్. వాఘ్‌లే అనే ముంబాయి నగరానికి చెందిన ఓ విలేఖరి, అజ్ఞాతంగా, వియత్నాంలోని యుద్ధ భూమిలోకి చేరి పోరాటాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. తిరుగు ప్రయాణంలో బాంబేకు వెళ్తూ, మధ్యే మార్గంలో మద్రాసులో ఆగారు. ఆయనకు అప్పట్లో ఆతిథ్యమిచ్చారు తిలక్, మద్రాసులో. వాఘ్‌లే చెప్పిన విషయాలను, తిలక్ తాతారావు పేరుతో పత్రికకు పంపగా వారు ప్రచురించారు వాటిని. వాటికి సంబంధించిన రెండు-మూడు, విషయాలను చెప్పారు. ఫ్రెంచ్ వారిని మభ్యపెట్టటానికి, వియత్నమీయులు, పైకి మాత్రం వారి కరెన్సీ నోటునుంచి, క్రింద తమ కరెన్సీ నోట్లను పెట్టుకుని, మార్కెట్‌లో సరకులను కొనుక్కునేవారు. ఆ విధంగా ఫ్రెంచ్ కరెన్సీ చలామణిని అడ్డుకునేవారట. అది వారి దేశభక్తికి ఉదాహరణ అంటారు తిలక్. అదే విధంగా, యుద్దమారణ హోమంలో కూడా, తమ పిల్లలు, అక్షరాస్యులు కావాలన్న కోరికతో, వుట్‌పాత్‌లపైన వుండే చెట్లను చెక్కి, వియత్నాం, లిపిలో, ఇతరులు నేర్చుకునే రీతిలో అక్షరాలు వ్రాసేవారట. అరకలకు కట్టిన ఎద్దులపైన అక్షరాలు దిద్దేవారట. స్వాతంత్ర్యోద్యమంలో అక్షరాస్యతా వ్యాప్తి అలా చేసారు వారు అంటారు తిలక్. వియత్నాంపై వేసిన బాంబుల షెల్స్ ను పాత్రలుగా మలిచేవారు. చంటి పిల్లలను వీపుకు కట్టుకుని, ఓ చేత్తో తుపాకితో ఉద్యమంలో పాల్గొనే వారు వియత్నమీయులు-అక్కడ మహిళలు.

తను వ్రాసిన, ఈ సంఘటనలు, తనకు “జ్యోతి” సినిమా తీస్తునప్పుడు స్పూర్తి నిచ్చాయనీ, పర్యవసానమే “బలే–బలే—” పాటనీ చెప్పారు తిలక్.

ఈ విషయాలను చెప్తున్న తిలక్ గారి ఆలోచనలు ఒక్కసారిగా గూడవల్లి రాంబ్రహ్మంగారి దర్శకత్వంలో నిర్మించిన సారథి ఫిల్మ్స్ వారి “రైతుబిడ్డ” సినిమా వ్యవహారం వైపు మళ్లాయి. దానిలోని కథా వస్తువు జమీందారి వ్యవస్థకు-ఆ వ్యవస్థకు బ్రిటిషు వారిచ్చిన మద్దతుకు – వ్యతిరేకంగా ఉన్నందున నాటి ప్రభుత్వం ఆ సినిమా ప్రదర్శనను నిషేధించింది. అయితే చల్లపల్లి రాజాగారు, తన అవసరాలకు, ఆయనకున్న పలుకుబడి వుపయోగించి, కొన్ని జిల్లాల్లో, ఆ జిల్లా కలెక్టర్ల కున్న విశేషాధికారాల సాకుతో, రైతుబిడ్డను దొంగచాటుగానో – దొరచాటుగానో ప్రదర్శించే ఏర్పాటు చేస్తుండేవారు. ఆ పద్ధతిని, తిలక్‌గారు బాహాటంగా విమర్శించారు. నిషేధం ఎత్తివేతకు ఆందోళన చేయాలి కాని, ఎందుకీ అడ్డదారులు తొక్కాలని ఆయన వాదన. ఇలా తన అవసరాలకు రిలీజ్ చేయించటం తప్పంటారు.

ఆ రోజుల్లో, సామాజిక స్పృహ అంతగాలేని (తిలక్ గారి మాటల్లో) ఎల్. వి. ప్రసాద్‌ గారు ప్రభుత్వం వారు తీసుకున్న నిర్ణయాన్ని-నిషేధాన్ని సమర్థించారు. ప్రభుత్వం ఇది మంచిది — అని అనుకుని చేస్తే ఎందుకు వ్యతిరేకించాలని పత్రికా ప్రకటన ఇచ్చారట కూడా. తన మేనమామ అని కూడా ఆలోచించకుండా, ఆయన ఇంట్లో వుంటున్నప్పటికీ, తిలక్ ఆ ప్రకటనను ఖండిస్తూ మరో స్టేట్‌మెంట్ పత్రికలకు రిలీజ్‌ చేసారు. అది ఎల్. వి. గారికి ఎంతో మనస్థాపం కలిగించింది పాపం. కాని తిలక్ దారే వేరు.

జమీందారీ వ్యతిరేక పోరాటం ఇతివృత్తంగా నిర్మించిన “రైతుబిడ్డ” చిత్రంలో బళ్లారి రాఘవ, టంగుటూరి సూర్యకుమారి, కొసరాజు రాఘవయ్య చౌదరి–తదితరులు నటించారు. గూడవల్లి రామబ్రహ్మంగారు జర్నలిస్టుగా వచ్చి, తీసిన సినిమా అది. ఆయనే కె. ఎస్. ప్రకాశరావు గారిని సినీరంగానికి తీసుకొచ్చారు. రైతుబిడ్డపై నిషేధాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా ఎత్తివేయాలని చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. ఆ తర్వాత కాలంలో చల్లపల్లి రాజాగారు కాంగ్రెస్‌లో చేరి అందులో ఓ ప్రముఖ నాయకు డయ్యారు. అది వేరే సంగతి. ఆ విషయాలు మరోసారి చెప్తానన్నారు తిలక్.

తిలక్, తన ఎమ్. ఎల్. ఎ. సినిమా ప్రివ్యూ సందర్భంగా ఎన్నో ఏళ్ల తర్వాత సికింద్రాబాద్ క్వాలిటీ బార్‌లో చల్లపల్లి రాజాగారిని కలిసినప్పుడు, ఈ విషయాలు మళ్లీ ప్రస్తావనకు వచ్చాయట. అప్పుడు కూడా తిలక్‌ గారు మరోసారి ప్రశ్నించారు చల్లపల్లి రాజాగారిని.. ఎందుకు మీరు రైతుబిడ్డ సినిమాను అడ్డదారిలో ప్రదర్శించే ప్రయత్నాలు చేశారని? ఈ విషయాలు కూడ మరోసారి వివరంగా చెప్తానన్నారు.

సమాజంలోని అభ్యుదయ భావాల వ్యక్తులు ఎలా కాల ప్రభావం వల్ల మారిపోతుంటారో మరో మారు గుర్తుచేసుకున్నారు తిలక్. తానూ ఆ కోవలోని వాడిననీ అంటారాయన. ఒకప్పుడు అభ్యుదయ భావాల ఆరుద్ర, శ్రీశ్రీ, కొడవటిగంటి, తాపీ ధర్మారావు గార్లు కలిసి చర్చించి, ఆ సినిమా ఎవరు తీసినదైనా, అభ్యుదయ ఇతివృత్తమైతే, కథల-పాటల రచనలో సహకరించేవారు. కె. ఎస్. ప్రకాశ రావు గారు వీరిని ప్రోత్సహించేవారు. సుంకర-వాసిరెడ్డిల స్క్రిప్ట్ నయితే వారు తప్పక పరిశీలించి, సహకరించేవారు. అప్పటి అభ్యుదయ రచయితలు, ఆత్రేయలాంటి వారు పోరాటాల్లోంచి వచ్చిన వ్యక్తులు. వారు రచించిన ప్రతి పాటను, వ్రాసిన ప్రతి మాటను ఏదో విధంగా, అభ్యుదయ భావాల బాటలో ఇరికించే ప్రయత్నమే చేసేవారు.

తిలక్ ప్రత్యేకంగా ఎవర్నీ ఉద్దేశించి చెప్పక పోయినా, ఆయన మాటల్లో సమాజ ప్రభావం వల్ల అభ్యుదయ భావాలు, వ్యక్తులు— వేరవుతున్నారనే అర్థం వ్యక్తమయింది. సమాజంలోని వ్యక్తులందరి లాగానే, తిలక్‌ను కూడా అంతస్తు పెరగకపోయినా.. కొద్దిగా మారుతున్నందున– కొన్ని వ్యసనాలకులోనుచేసాయి. అడపాదడపా… మద్యం సేవించటం, అలవాటున్న సిగరెట్‌ను అధిగమించి చుట్ట, పైపుల వైపు దృష్టి మళ్లించటం దాంతో పాటే తానూ ఓ స్టూడియో ఎందుకు నిర్మించరాదు–అని ఆలోచించటం జరిగాయి. వాటి తప్పొప్పుల వివరాలలోకి ఆయన వెళ్లలేదు.

అదే అంటారు తిలక్. అందరి లాగానే, తనపై కూడా తానూ– ఆ కోవలోని వాడినే అయి నందువల్ల, సామాజిక ప్రభావం అప్పుడప్పుడూ పడ్తుండేదనీ–అది, అధిగమించే ప్రయత్నంచేసాననీ చెప్పారు తిలక్. సఫలుడు అయిందీ లేనిదీ చెప్పలేనన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *