రచన:అంబడిపూడి శ్యామసుందరరావు
సనాతన ధర్మము ప్రకారము భగవద్గీతలోని అంశాలు విశ్వానికి , అన్ని కాలాలకు సంభందించినవి. పంచమ వేదముగా పరిగణించబడే ద్వాపరయుగము నాటి మహాభారతములో భగవత్ గీతను సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుడు కురుక్షేత్ర యుద్దములో అర్జునుడు తన” సన్నిహితులను బంధు జనాన్నిచంపాలా నేను యుద్దము చేయను”అని అన్నప్పుడు “చంపేదెవరు చచ్చేదెవరు”అని శ్రీ కృష్ణ పరమాత్ముడు అర్జునిడిని యుద్దానికి సన్నద్దము చేయటానికి గీతోపదేశము భోదిస్తాడు. పేరుకు ఈ గీతోపదేశము అర్జునిడికి చేసిన గీతా సారాంశము యావత్తు మానావాళికి చెందుతుంది. భగవత్ గీతకు ప్రాంతముతో , జాతులతో, మతాలతో సంభందము లేదు సర్వ మానావాళికి ఉపయోగపడేది అందరు నేర్చుకోవలసిన పాఠాలను గీత చెపుతుంది . గీతలోని 18 అధ్యాయాలు మానవుని జీవితములోని వివిధ రకాల అంశాలను వివరిస్తుంది ముఖ్యముగా “నేను, ఆత్మ, పరమాత్మ, భగవంతుని పట్ల భక్తీ, మోక్ష సాధన, భగవంతునిలో ఐక్యము “మొదలైన అంశాలను సాక్షాత్తు భగవంతుడే తెలియజేస్తాడు ఎందరో యోగులు, మహానుభావులు గీతా సారాంశాన్ని పలువిధాలుగా సామాన్య జనానికి అర్ధమ్యేల వివరించారు ఇంకా వివరిస్తూనే ఉన్నారు. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలియవలసినది చాలా ఉన్నది అన్న భావన గీత విన్నప్పుడల్లా కలుగుతుంది ప్రస్తుతము గీత మానవాళికి చెపిన కొన్ని పాఠాలను క్లుప్తముగా తెలుసుకుందాము.
1. మనము మన పనిని ఫలితము ఆశించకుండా నిర్వర్తించాలి అనేది గీత చెప్పే మొదటి పాఠము. ఫలితము ఆశించకుండా మనస్పూర్తిగా పనిని నిర్వర్తిస్తే ఫలితము దానంతట అదే సిద్దిస్తుంది అని గీత భోధిస్తుంది.
2. శరీరము శాశ్వతము కాదు ఆత్మ మాత్రమె శాశ్వతము మన శరీరము ఒక వస్త్రము వంటిది వస్త్రము చినిగిపోయిన తరువాత కొత్త వస్త్రము ధరించినట్లు ఆత్మ ఒక శరీరాన్ని వదలి కొత్త శరీరాన్ని ప్రవేశిస్తుందని కృష్ణ భగవానుడు చెపుతాడు.
3. ఈ ప్రపంచములోకి వచ్చినవారు ఏదో ఒక రోజు ఈ ప్రపంచాన్ని వీడి పోవలసినవారే ఎవరు శాశ్వతముకాదు కాబట్టి పుట్టక ఎంత సహజమో చావు కూడా అంత సహజమైనది సత్యమే నిజమైనది శాశ్వతమైనది.
4. కోపమే అన్ని అనర్ధాలకు మూలము నరకానికి ఉండే ప్రధాన మూడు ద్వారాలలో కోపము ఒకటి మిగిలిన రెండు మోహము, అశ కోపము లో ఉన్న వ్యక్తి అలోచనారహితుడవుతాడు అప్పుడు విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి పశువులా ప్రవరిస్తాడు.
5. కర్మను అనుసరించేదే బుద్ది. మనిషి తన జీవితకాలములో కర్మలను అనుభవించాలి.
6. ఈ జగత్తులో మార్పు అనేది సహజము కోటీశ్వరుడు యాచకుడిగాను, యాచకుడు కోటీశ్వడుగాను మారవచ్చు. ఏదీ శాశ్వతము కాదు.
7. ప్రతి మానవుడు ఖాళీ చేతులతో భూమిమీదకు వస్తాడు. ఖాళీ చేతులతోనే భూమిని వదలుతాడు.
8. నిత్య శంకితుడికి భూమి మీదగాని ఇక ఎక్కడైన గాని సుఖ శాంతులు లభించవు ముందు ఎవరైనా తన్ను తాను తెలుసుకొనే ప్రయత్నము చేయాలి. అప్పుడే సుఖ శాంతులకు దగ్గర అవుతాడు. సంతోషాన్ని పొందగలడు.
9. కోరికలను జయించాలి లేదా అదుపుచేసుకోవాలి అప్పుడే మనస్సుకు ప్రశాంతత లభ్యము అవుతుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే దొరకుతుంది.
10. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే, అని నమ్మేవారికి ఎప్పుడు మంచే జరుగుతుంది మనము నిమిత్త మాత్రులము అంతా భగవంతుని చేతుల్లో ఉన్నది మనము మన కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వహించాలి అన్న కర్మ సిద్దాంతాన్ని నమ్మే వారికి ఎప్పుడు మంచే జరుగుతుంది.
సరళమైన భాష లో ముఖ్య సారాంశం బాగా చెప్పారు శ్యామ సుందర రావు గారు
క్లుప్తంగా ,సమగ్రంగా బాగా వివరించారు,అభినందనలు!