March 30, 2023

కథ చెప్పిన కథ

రచన: విజయలక్ష్మీ పండిట్.

ఆ రోజు రాత్రి భోజనాలయినాక భారతి వాళ్ళ అమ్మతో అంది, ” అమ్మా రేపు మా టీచర్‌ పెద్ద కథ చెపుతానన్నది. . ., కథ అంటే ఏమిటమ్మా. . ! “అని అడిగింది.
“కథ అంటే. . . మన, జంతువుల జీవితాలలో రోజు జరిగే సన్నివేశాలే కథలు నాన్నా “అని అన్నది భారతి వాళ్ళ అమ్మ.
కాని ఆ సమాధానంతో సంతృప్తి కలుగలేదు భారతికి. కథను గురించి మరలా మరలా ఆలోచిస్తూ పడుకొంది. పడుకొంటూ మనసులో గాఢంగా అనుకొంది . “కథా కథా నీ కథ చెప్పవా. . ?! “అని. ఆ మౌన, అమాయక గాఢమయిన అభ్యర్థనకు స్పందించింది అక్షరం. . భారతి కలలో కథ తన కథను ఇలా మొదలు పెట్టింది. . . !
అనగనగా ఓ భూమితల్లి. ఆమె విశ్వమాయ గర్భం నుండి పేగు తెంచుకొని విడివడింది. పుట్టినపుడు, పసిపాపగా ఉన్నప్పుడు ఒళ్ళంతా ఎర్రని దుమ్ము, ధూళి. ఎన్నో లక్షల ఏండ్లకు పెద్దదై చెట్టు చేమ, పుట్ట గిట్ట, కొండ కోనలు, నదాలు సముద్రాలతో, పచ్చని చెట్లు చేమల చీరను ధరించి, ఎన్నో లక్షల జీవరాసులను కంటూ, కాపాడుతూ చివరకు మనిషిని ప్రసవించింది.
నిటారుగా నడిచే ఆ పుడమి బిడ్డ అడవంతా కలయ తిరుగుతూ పుష్కలంగా పండే, తెనెలూరే పూలు పండ్లు కాయలను తింటు తిరుగుతూ, పెద్దవాడవుతూ ప్రకృతమ్మ దగ్గర ప్రతి దినం ఆటపాటలు నేర్చుకోసాగాడు. పక్షులూ, పిట్టలూ, కోతులూ కొండముచ్చులు, పాములు, నక్కలు, కుక్కలు, ఆవులు, బర్రెలు, పులులు, సింహాలు, ఒంటెలు, గుర్రాలు, ఏనుగులు అన్ని అతని హితులు, స్నేహితులే. వాటి ననుకరించి శబ్దాలు చేస్తూ, ప్రకృతితో మాట్లాడుతూ, ఆట్లాడుతూ, పోట్లాడుతూ, ఆడ మగా జతకట్టి మదిరను సేవిస్తూ, ఆదమరిచి ఆనందిస్తూ, పిల్లలను కంటూ మందలు మందలుగా, సంచార జీవులుగా సంచరించేవారు.
సంజ్ఞలతో మొదలయిన మనిషి పలకరింపులు కూతలతో, క్రమంగా చిన్న చిన్న మాటలతో, అల్లుకున్న భాషలెన్నో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.
నదులు, సరస్సులు పిలిచిన చోటికి పిల్లాజెల్లా, గోవులు, కుక్కలు, మేకలను తోలుకొంటూ, నడిచి వెళ్లే దారుల్లో, మంద ముందు, వెనుక కొసలను కలుపుతూ పేనిన మాటల తాడై చిన్ని చిన్ని కథనాలతో కథనై నేను పుట్టుకొచ్చాను. మనుషులు అల్లే మాటల బుట్టను మోసుకొని ఇంకో మనిషి చెవిలో కుమ్మరించడం నా పని. మనుషుల ఆనందాలు, అగసాట్లు, అరమరికలు, అబ్భురాలు అద్భుతాలు, అగాధాలు, అలోచనలు, అరమరికలు, గాధలు, భాధలు. . అన్నిటిని మోసుకొని తిరగడమే నా పని.
నలుగురు మనుషులు కలిస్తే నేను ప్రత్యక్షమౌతాను. ఒక్కో మనిషి ఓకటేమిటి మాటల దారాలాతో నన్ను పురితాడులా అల్లుతూనే ఉంటాడు. ఒక నోటినుండి పుట్టి మనుషుల చెవిలో దూరి వాళ్ళ మెదడులో దూరి దాక్కోవడమే నాపని. అయినా నన్ను తట్టి లేపి ఇంకొకరి చెవిలోకి ఎక్కేంతవరకు ఊరుకోరుకదా ఈ మనుషులు. కలిస్తే కథలు కదిలితే కథలు. !
ప్రేమికుల ప్రేమ పెనుగులాట కథలు. ప్రేమికుల తప్పించుకోనే కథలు ఒప్పించుకొనే కథలు మెప్పించుకొనే కథలు. దొంగ ప్రేమ కథలు, నిజాయితి ప్రేమ కథలు. ఆడపిల్లలను నిలువెల్లా దోచుకొనే మాటల గారడి కథలు.
ఇక. . రాత్రయితే ఆలుమగల కథలు. . . ;చిలిపి కథలు, అలకల కథలు. ఆలింగనాలలో నన్నుకిరి బిక్కిరి చేసే కథలు. ప్రేమికుల నిట్టూర్పులలో నిలువునా నన్ను దహించి నపుడు మాటలు తెగిపోయి మెదడు నాశ్రయించి తప్పించుకుంటాను.
భారత దేశంలో పుట్టిన నేనో పురాణాల పుటికను. నావెన్నో రూపాలు. నా పుటిక నిండా అధ్భుత మయిన సుధీర్ఘ కథలు -అవే పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, చ్హారిత్రక గాధలు, పెద్ద చిన్న నవలలు, కథలు. నా అన్ని రూపాలు చేప్పేవి కూర్చేవి మనుషుల గాధలే.
క్రౌంచ మిధునం విషాధ సంఘటనకు ఉద్రేకానికి లోనై వాల్మీకి తాత ఖంట మొలికించినది సీతమ్మను ఎడబాసిన శ్రీ రామ కథను ‘రామాయణాన్ని ‘. ఆ సూర్యవంశ ధశరథ రాజు కుటుంబం కథ ను వినని, కథా చిత్రాన్ని కనని వాడుండడు.
ఆ కుటుంబం కథ అప్పటి కుటుంబం, గణ, సంఘ మానవ సంబంధాల ఉదాహరణ మచ్హుతునక. గురు శిష్యుల, భార్యా భర్తల, తండ్రి తనయుల, తల్లిబిడ్డల, అన్నతమ్ముల, అక్క చెళ్ళెల్ల, స్నేహితుల, రాజు ప్రజల సంబంధాలను కండ్లకుకట్టే కథ.
ఒకరి కొకరు ఏమి కాని జంతు జీవనం నుండి తనకొక కుటుంబాన్ని ఇల్లును మలచుకున్న మానవుని జీవితంలో గొప్ప మలుపు కుటుంబం. ఆలుమగలు బిడ్డల‌ అనురాగ మందిరం. ప్రేమ మానురాగాల తో అల్లుకున్న పొదరిల్లు. మానవజీవితాన్ని ఆదిమ అశాంతిమయ అనాగరిక జీవితం నుండి మనిషి జీవితాన్ని విముక్తి కలిగించి మలిచిన అద్భుత ఆలోచన. నాగరిక జీవితానికి నాంది, పిల్లల భవిష్యత్తుకు భరోసా. పరస్పర ప్రేమానురాగాలను పెంచి పోషించి భార్య భర్త బిడ్డల చుట్టు అల్లుకున్న ప్రేమ వలయం అనురాగనిలయం. మానవ జాతి మనుగడకు దారి చూపిన మహత్తర మంత్రం వివాహం, కుటుంబం.
కుటుంబ వ్యవస్థ నుండి ఏర్పడ్డ మానవ సంబంధాలు అనేకం, మనుషుల మనుగడపై వాటి ప్రభావం అనంతం కుటుంభంలో ప్రేమానురాగాల హెచ్హుతగ్గులు, ఆస్థి పాస్తుల అసమానతలు మనుషుల సంబంధాలలో అసూయా ద్వేషాలను కూడా పెంచి పోషించాయి.
క్రమంగా స్త్రీ కి ఇంటిపనులు వంటపనులు, ప్రకృతి పరంగా ఎర్పడ్డ పిల్లలను నవమాసాలు మోసి కని పెంచే భాద్యత వారి పనులుగా, వ్యవసాయము స్వంత ఆస్తుల పరిరక్షణ మగవారి పనులుగా స్థిరపడ్డాయి. కళ్ళు చేవులు లేని కాలం మాత్రు స్వామ్య సమాజాన్ని పిత్రు స్వామ్య, పురుషాధిక్య సమాజంగా మార్చివేసింది.
అస్తులు అంతస్తులు పెంచుకొంటూ పోవాలనే స్వార్తపు ఆలోచనలు అసమానాలను పెంచాయి. దానికి తోడు పరస్పర మత కుల ద్వేషాలు మనిషిలోని మానవత్వాన్ని మరుగున పడవేసింది. రాజ్య, ధన బలము హోదా రాజ్య మేలసాగింది. రాజుల రాజ్యాల మధ్య, దాయాదుల మధ్య ఘోరమయిన భయంకరమయిన యుద్ధాలకు దారితీసింది.
కౌరవుల పాండవుల మధ్య దాయాదులమధ్య జరిగిన అలాంటి భయంకర యుద్ధమే కురుక్ష్కేత్ర యుద్ధము.
ద్వాపరయుగం లో జరిగిన, వ్యాస మహర్షి రాసిన ఆ “మహాభారత” కథ మన భారత దేశ సుదీర్ఘ కథ. ఇప్పటికి జరుగుతున్న కథ. మనిషి కథే నా కథ. . నా కథే మనిషి కథ అని ముగించింది.
భారతికి కలలో ఒక సినెమా రీలు లాగా బొమ్మలతో కథ చేప్పిన కథ మనసులో ముద్రితమయింది.

—–//——

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

September 2017
M T W T F S S
« Aug   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930