రచన: బి.రాజ్యలక్ష్మి
ప్రతి మనిషి లో మరో వ్యక్తిత్వం తప్పనిసరి !అంతర్లీన ఆలోచనలు భావాలూ మెరుగుపడిన స్మృతులు అసలుమనిషి జాడలు మనకు తెలియకుండానే తెలుపుతాం! ఒకరోజు ఆలా కళ్ళుమూసుకుని ఆలోచనలలోనికి నన్ను నేను తొంగి చూసుకున్నాను !కలం నన్ను పలుకరించింది ! గళం పలుకమన్నది !కానీ మనసుమాత్రం మరోలోకం లో
మధుర మురళిని ముద్దాడింది !నల్లనయ్య మోహన వంశి అలలతేరుపై నాముందు వాలింది ! నిజం !సాగరతీరం ,
సంధ్యాసమయం పున్నమి రేయి జాలువారే వెన్నెల జలతరింగుణుల మధుర డోలికలు !
ప్రకృతిని మించిన సౌందర్యమున్నదా ?
పట్టణజీవితాలలో మనం సున్నితత్వాన్ని పోగొట్టుకుంటున్నామేమో కదా !
వానతుంపర్లలో లేలేత గడ్డిపరకల తళతళలాడే నీటిబిందువుల మధ్యలో చిన్ని చిన్ని పక్షుల వయ్యారాలు !
విరుల వనిలో గులాబీరెక్కలపై మంచుబిందువులు మల్లెల మందస్మిత దరహాసాలు బాలభానుని బంగారు కిరణాలు!
ఇంతకన్నా జీవితానికి ఇంకేం కావాలి !తెలియని భావావేశం కనుల కొలనులో చుక్కై పెదాలను తడిమింది !
అందెల రవళుల పదమంజీరములు
సరిగమల సవ్వడి సొగసుల తెలుప
కలువ కనుల కాటుకరేకలు కరగని
కమనీయ కలలను కన్నుల తెలుప
చిలిపినవ్వుల చిన్నారిపెదవులు
సిరిమల్లెల సొగసులు విరబూయ
పయనమాయె నా మానస మయూరి
పురివిప్పిన శిఖిపింఛ మౌళికై మిత్రమా !