March 19, 2024

నాకు నచ్చిన కధ చెన్నూరి సుదర్శన్ గారి “అడకత్తెరలో పోక చెక్క-“

అంబడిపూడి శ్యామసుందర రావు

చెన్నూరి సుదర్శన్ గారు ఉపాధ్యాయుడిగా పదవి విరమణ చేసి సెకండ్ ఇన్నింగ్ లో రచయిత అవతారమెత్తి వ్రాసిన కధల సంపుటి నుండి తీసుకున్న కధ. ఇప్పటివరకు నేను వివిధ పత్రికలలో (ఆన్ లైన్) చాసో, రావి శాస్త్రి మునిమాణిక్యం , కొడవటిగంటి వంటి పాత రచయితల కథలకే సమీక్షలు వ్రాశాను అనుకోకుండా సుదర్శన్ గారి “ఝాన్సీ హెచ్ ఎమ్ “అనే కధల సంపుటి చదవటం తటస్తించింది అందులో అడకత్తెరలో పోక చెక్క కధానిక నాకు బాగా నచ్చింది. ఆ కథను ఇతర పాఠకులతో పంచుకుందామని అనిపించి ఈ సమీక్ష వ్రాస్తున్నాను.
ముందు రచయిత సుదర్శన్ గారి గురించి తెలుసుకుందాము. నిజానికి బాల్యము నుండి రచయిత అయినప్పటికీ వృత్తిరీత్యా ఉండే ఒత్తిడుల వల్ల రచనా వ్యాసంగాన్ని పూర్తిగా సమయం కేటాయించక పోవటం వలన పూర్తి రచయితగా లోకానికి పరిచయము కాలేదు. రిటైర్ అయినాక కొద్దికాలంలోనే యాభై కధలు , అనేక చిత్రాలను చిత్రీకరించారు ఒకసారి మన మాజీ ప్రధాని పివి నరసింహారావుగారు తన 70ఏళ్ల వయస్సులో కంప్యూటర్, ఇంటర్ నెట్ కంపోజింగ్ వంటివి నేర్చుకొని తానే స్వయముగా తన స్వీయ చరిత్రను టైప్ చేసుకున్నాని చెప్పగా విని తానూ మటుకు ఆపని ఎందుకు చేయలేనని అలోచించి కంప్యూటర్ మొదలైనవి నేర్చుకొని యూనికోడ్ ద్వారా తెలుగులో టైపు చేసి పత్రికలకు ఇ మెయిల్ ద్వారా పంపుచు రచయితగా తన స్థానాన్ని సుస్థిర పరచుకున్న వ్యక్తి సుదర్శన్ గారు. యూనికోడ్ లో టైప్ చేసిన కధలను మళ్ళీ కంపోజ్ చేయకుండా నేరుగా ప్రింట్ చేయటానికి అనేక ప్రయోగాలు చేసి సాధించారు. ఈ విధముగా యువతరం రచయితలతో టెక్నాలజి విషయములో కూడా పోటీపడ్డ వ్యక్తి సుదర్శన్ గారు టెలిఫోన్ ఆపరేటర్ గా ఉద్యోగము ప్రారంభించి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా 2010 లో పదవి విరమణ చేశారు.

ప్రస్తుతము అయన వ్రాసిన “అడకత్తెరలో పోకచెక్క” అనే కథను గురించి ముచ్చటించుకుందాము. ఈ కద ఫక్తు తెలంగాణా గ్రామీణ మాండలికంలో వ్రాయబడింది/ ప్రస్తుతము జరిగే ఒకపూట హడావుడి పెళ్లిళ్లలో కనిపించని సాంప్రదాయము “అలక పాన్పు” అంటే పెళ్ళికొడుకు అప్పగింత కార్యక్రమము (ముహర్తము అయినాక పెళ్లికూతురును అత్తవారికి అప్పగించటము). ముందు వేడుకగా పాతరోజుల్లో పెళ్ళికొడుకుని మగపెళ్లివారు అలక పాన్పు ఎక్కించి మామగారిని ఏదైనా కోరిక కోరుకుంటే మామగారు అల్లుడి కోరిక తీర్చటం ఈ అలక పాన్పు ఉద్దేశ్యము. పాతరోజుల్లో అలకపాన్పు ఎక్కిన అల్లుడు మామగారిని హంబర్ సైకిలో, రిస్ట్ వాచో, రేడియోనో అడిగేవారు తరువాత కాలక్రమేణా అలవాటు తగ్గిపోయి అల్లుడికి కావలసినవి అన్నీ కట్నకానుకలలోనే వసూలు చేసుకుంటున్నారు. ఆ రోజుల్లో అది ఒక సరదాగా సాగేది.

ఈ కథలో పెళ్ళికొడుకు తల్లిదండ్రుల ఒత్తిడి, సామాజిక గౌరవానికి భయపడి అలకపాన్పు పేరిట కోర్కెలు కోరటం, వాటిని పెళ్లికూతురు తండ్రి తీర్చలేడని తెలిసి తానె రహస్యముగా బావమరిదికి డబ్బులు ఇచ్చి ఆడపెళ్లి వారె తన కోర్కెను తీర్చినట్లుగా సమాజనికి చూపే ఆదర్శ పెళ్ళికొడుకును రచయిత మన ముందు ఉంచుతాడు.
ముహూర్తము అయినాక అప్పగింతలు ముందు పెళ్లి పందిరిలో పెండ్లి పిలగాడు (పెళ్ళికొడుకు) కనబడుట లేదు అన్న వార్తా గుప్పుమంది. ఇంకేముంది పెళ్లికూతురు తండ్రి లచ్చయ్య, తల్లి లచ్చమ్మ తల్లడిల్లి పోయినారు చూచిరమ్మని పంపిన కొడుకు లసుమయ్య అదే పోతపోయినాడని విసుక్కుంటున్నాడు. లగ్గము నాగవల్లి అయిందో లేదో పారిపోయినాడు. ఏదన్న ఉంటె పెళ్ళికి ముందే పారిపోవాలి గాని పెళ్లి అయినాక పొతే పిల్ల గతి ఏమికావాలి అని పెళ్లికి వచ్చిన చుట్టాలు తలా ఒక మాట మాట్లాడుతున్నారు. పెండ్లి కొడుకు తల్లి చదివింపులుగా వచ్చినవాటిని తన కూతురుకు చూపించుకుంటూ కాళ్ళు కడిగిన ఇత్తడి చెంబు కనిపించలేదని దేవులాడుతుంది. పెళ్ళికొడుకు తండ్రి కొమరయ్య ఇంటి అరుగు మీద కూర్చుని బీడీ కాలుస్తున్నాడు తీరిగ్గా. అది అక్కడి పరిస్థితి. పిల్ల తండ్రి లచ్చయ్య కొమరయ్య దగ్గరకు “బావా నీ కొడుకును యాడికన్నా తొలిచ్చినావే “అని భయం భయముగా అడిగాడు కొమరయ్య నోట్లోనుంచి బీడీ తీసి, “నీ అల్లుడు ఆలిగాడు”అని చావు కబురు చల్లగా చెప్పాడు

“అదేంది బావా మేమెన్న తక్కువ చేశామా? అనుకున్న దానికంటే ఎక్కువే ముట్ట జెప్పాము ” అని లచ్చయ్య అన్నాడు “సూడు బావా పెట్టపీటల కింద ఎన్ని పెట్టినా అలుక పోవటం అనేది పద్దతి ఈ తతంగము పూర్తిచేస్తే పిల్లను అప్పగించవచ్చు ” అని కొమరయ్య లచ్చయ్యకు నిర్మమొహమాటంగా తెలియజేశాడు. ఈ తతంగము జరుగుతూ ఉండగా లచ్చయ్య కొడుకు లసుమయ్య పరుగెత్తుకుంటూ వచ్చి, “అయ్యా బావా అప్పయ్య యింట్లనే ఉన్నాడే “అని చెప్పాడు. లచ్చయ్య, లచ్చమ్మలు లసుమయ్యను గదిలోకి తీసుకెళ్లి అన్ని విషయాలు చెప్పారు. కొడుకు తండ్రితో , “నీవు ఏమి దిగులుపడకు, చెల్లిని తీస్కొని పోయి బావా ఏమి అడుగుతాడో చూద్దాము ఎమన్నా అంటే దీపావళి దాకా ఆగమందాము “అని చెప్పి చెల్లితో, “బావా ఎక్కడి పోలేదు మన అప్పయ్య ఇంటికి అలగటానికి పోయిండు మనమెల్లి తీసుకొద్దాము పద “అని చెపుతాడు.

ఒక పెద్ద మనిషిని వెంటబెట్టుకొని అందరు అలిగిన పెండ్లి కొడుకు దగ్గరకు వెళతారు. ఈ భాగోతము చూడటానికి పిల్ల పెద్ద అందరూ గుమిగూడారు.
తలుపేసుకొన్న పెండ్లికొడుకును పిలిస్తే యవ్వారమంతా బామ్మర్దితోనే జరగాలని పెద్ద మనిషి ద్వారా లసుమయ్యకు పెండ్లికొడుకు సమాచారం ఇచ్చాడు. సరే బావ మరిది లసుమయ్య తన బావగారిని ఏమి కావాలి అని అడిగాడు. దానికి పెండ్లి కొడుకు, “నాకు బండి కావాలా నా దోస్తులందరికి బండ్లు పెట్టిండ్రు. అల్ల ముందట నాపరువేం గావాల నాకు బండి పెడతామని ఒప్పుకోండి తలుపు తీత్త”, అని తన మనసులో మాట చెప్పాడు పెండ్లికొడుకు ” ఏందీ బండి గావాల్నా నా పెయ్య(శరీరము)నలగ్గొట్టినా పెద్ద కొత్తెల్లది . యీడ్చి తన్నిన యీసమేళ్ళది, యాడ్నించి తేను, ఎంతసేపు అలుగుతావో అల్గు”అని , లచ్చయ్య లేవబోయినాడు
లసుమయ్య వాళ్ళ నాయనను లేవనివ్వకుండా కుకో అని సైగ చేశాడు. కానీ లచ్చయ్య తానూ పెళ్ళికి పెళ్ళికొడుకుకు పెట్టిన ఖర్చుఏకరువు పెట్టాడు కానీ లసుమయ్య వాళ్ళ బావకు బండి కొంటామని వాగ్దానము చేశాడు. విన్న లచ్ఛయ కయ్యిమని లేచాడు లచ్చమ్మ ఏడుపు మొదలుపెట్టింది. ఇదంతా విన్న లసుమయ్య” జరంత సేపు మీరు నోరు మూసుకోండి ఈ యవ్వారమంతా నేను సూసుకుంటా “, అని వాళ్ళ నోరు మూయించి “బావా నేను మాటిత్తున్నా నీకిట్టమైన బండి నీవు మల్ల వచ్చేటప్పటికి నీకోసము ఎదురు చూస్తూ ఉంటుంది తలుపు తియ్యి”అని చెప్పాడు. ఇంకేముంది పెళ్ళికొడుకు మొగము ట్యూబ్ లైట్ మాదిరి వెలిగిపోయింది. ఈ భాగోతాము చూడటానికి వచ్చినవాళ్లు అంతా సంతోషించారు. కానీ లచ్చయ్య లచ్చమ్మలు కొడుకు అల్లుడికి పదహారు రోజుల పండగకు ముందు బండి కొంటానని మాట ఇచ్చాడు అని ఆందోళన పడుతున్నారు

సరే సమస్య తీరింది కాబట్టి అప్పగింతల కార్యక్రమము పూర్తి అయింది. పెళ్ళికి వచ్చినవాళ్లు ఎక్కడివాళ్ళు అక్కడి వెళ్లిపోయారు. ఇల్లంతా బోసిపోయింది లచ్చయ్య లచ్చమ్మ బువ్వ తినకుండా కొడుకు కోసము ఎదురుచూస్తూ నడుము వాల్చారు. ఇంతలో లసుమయ్య వచ్చి పడుకున్న తల్లిదండ్రులను లేపాడు. తల్లి కొడుకును కాళ్ళుకడుక్కుని భోజనానికి రమ్మంది. కానీ లసుమయ్య మంచి నీళ్లు త్రాగి, “బావా శాన మంచోడే నాయన “అన్నాడు “ఈ మాట సెప్పటానికా లేసి కూకోమన్నావు “అని విసుక్కున్నాడు లచ్చయ్య. “నాయనా నేను సెప్పేది పురంగా ఇను బావ నాతో అన్న మాటలు సెపుతా, ఇప్పుడు నేను సెప్పే మాటలు మన గడప దాటగూడదు బావ మరి మరి సెప్పిండు. ఈ రహస్యము మావాళ్లకు తెలియకూడదని. పెళ్లి అనేది అంత సంబరపడిపోయేదికాదు ఇటు నాయనా అమ్మలనూ తృప్తి పరచాలి. అటు పెండ్లాము తల్లిదండ్రులకు మాట రాకుండా చూచుకోవాలి. అట్లా చేస్తేనే పెండ్లాము మొగుడంటే ఇష్టపడుతుంది. అడకత్తెరలో పోక చెక్క మాదిరి నా పానమంతా తకుమి కైతాంది. అని చెప్పాడు. ఇది విన్న లచ్చయ్య లచ్చమ్మలకు గుండె గాబారా పెరిగింది. ఇది గమనించిన కొడుకు కంగారు పడవద్దని అసలు విషయము చల్లగా చెప్పాడు.

పెండ్లికొడుకు తన తల్లిదండ్రులు అత్తగారి దగ్గరనుండి ఎంత వీలయితే అంత గుంజాలని ఎక్కించటం మొదలు పెట్టారు. వాళ్ళ మాట వినకపొతే అప్పుడే అత్తగారి సంకల్లో సొచ్చిండు అని నిందిస్తారు. కాబట్టి వాళ్ళ వాళ్లకు తెలియకుండా రెండు చీటీలు వేసి రెండు లక్షలు సంపాదించి ఆ చీటీల వాడు అత్తగారి ఇంటి కుదువ విడిపించి బండి తీసుకు వచ్చిమీకు ఇస్తాడు అని అల్లుడు ప్లాను వేసి అత్తమామలకు ఇబ్బందిలేకుండా చేస్సాడు. పదిమందిలో తానూ అలిగి బండి సంపాదించినట్లు బిల్డప్ ఇచ్చాడు ఎవరికీ అనుమానము రాకుండా. బావమరిదితో ఈ డ్రామా నడిపించాడు. ఇది విన్న లచ్చయ్య అల్లుడు మంచితనానికి కడుపు నిండి పోయింది లచ్చమ్మ ముక్కు మీద వేలు ఏసుకొని నోరు తెరిచింది ఈ సంతోషముతో ఎవ్వరికి ఆకలి వేయలేదు పెండ్లికొడుకు మంచితనంతో అందరి కడుపు నిండింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *