May 3, 2024

అద్వైత – ద్వైత – తత్వములు

రచన: వారణాసి రామబ్రహ్మం

అద్వైతము అంటే రెండు కానిది. ఒక్కటే అయినది.

ఏ రెండు కానిది? ఏ ఒక్కటే అయినది?

అహమ్ – ఇదమ్ అని రెండుగా అనిపించనిది, కనిపించనిదీ అద్వైతము.

అహమ్ నే అదః అని కూడా అంటారు.

శ్లో ll
పూర్ణమ్ అదః పూర్ణమ్ ఇదమ్
పూర్ణాత్ పూర్ణమ్ ఉదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమ్ ఏవ అవశిష్యతే

తాll
అదః పూర్ణమైనది. ఇదమ్ కూడా పూర్ణమైనది.
పూర్ణము నుంచి పూర్ణము పుడుతుంది.
పూర్ణము నుంచి పూర్ణము పుట్టాక పూర్ణమే మిగిలి ఉంటుంది.

అదః (అహమ్) శబ్దం ఆత్మని సూచిస్తుంది. దానినే బ్రహ్మము అనీ అంటారు

అహమ్ లేక ఆత్మ లేక బ్రహ్మము ” గమనిక” ని తెలుపుతుంది.

ఇదమ్ అంటే మానసిక కార్యకలాపములు జరగడాన్ని లేదా విరమింపబడి ఉండడాన్ని తెలియజేస్తుంది.

ఇలా అహమ్-ఇదమ్ అని విడిగా తెలుస్తూంటే అది ద్వైత స్థితి.

ఇలా విడిగా విడిగా తెలియకుండా ఒక్కటే (ఆనందము, శాంతము,, శుద్ధ జ్ఞానము, మౌనము, భక్తి) దృష్టి లో లేక గమనికలో ఉండి అదే సదా అనుభవముగా ఉండడాన్ని అద్వైత స్థితి అంటారు. ఈ దశలో తెలుసుకునేవాడు (జ్ఞాత) తెలుసుకోబడేది (జ్ఞేయము ) అని ఉండదు. దృష్టి అంతా ప్రజ్ఞానమయంగా (నిర్మలమైన గమనికగా లేదా మనసుగా) ఉంటుంది.

మన గ్రహింపులు, ఆలోచనలు,భావనలు, అనుభవములు, అర్థ స్పృహలు, జ్ఞాపకములు, మమతలు, అహంకారములు దృష్టిలో ఉండవు. మనసు ప్రశాంతముగా ఉండి బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ నిరామయంగా, నిరంజనముగా , నిర్లిప్తముగా, తత్పరముగా, భగవత్ శబ్ద తాత్పర్యముగా ఉంటుంది.

బ్రహ్మ సత్ జగత్ మిథ్యా
జీవో బ్రహ్మ ఏవ న అపరః

ఈ శ్లోకము అద్వైత సిద్ధాంతానికి ప్రాణప్రదమైనది.

ఉన్నది బ్రహ్మము మాత్రమే. జగత్తు మిథ్య (వచ్చి పోతూంటుంది — దృష్టి లోనికి).

వ్యక్తిత్వ స్థితి (జీవ స్థితి) పరమాత్మ స్థితి (బ్రహ్మ స్థితి ) ఒకటే. వేరు కాదు.

దృష్టి లో వ్యక్తిత్వము ఉండడము జీవస్థితిని సూచిస్తుంది. దీనినే ద్వైత స్థితి అంటారు.

దృష్టిలో ఏమీ (ఇదమ్) లేకపోవడం పరమాత్మ స్థితిని సూచిస్తుంది. దీనినే అద్వైత స్థితి అంటారు.

ద్వైత, అద్వైత స్థితులు ఒకేసారి ఉన్నప్పుడు (మనసు, ఇతర అంతఃకరణములు పనిచేస్తున్నప్పుడు, మెళకువ, కల మానసిక దశలలో) మనసు ఆ రెండు స్థితులలో సంచారము చేస్తూ మన మానసిక కార్య కలాపములన్నిటిని నిర్వహిస్తుంది.

“నేను”ని శరీరము, మనస్తత్వము, సాంఘిక స్థితి గతులతో (వ్యక్తీ, తత్సంబంధ విషయాలు) అన్వయించుకున్నప్పుడు ఆ స్థితిని జీవ లేదా జీవాత్మ స్థితి అంటారు. నేనుని గమనికతో (ఆత్మ, బ్రహ్మము, శుద్ధాహమ్ తో) అన్వయించుకున్నప్పుడు ఆ స్థితిని భగవత్ లేదా పరమాత్మ స్థితి అంటారు.

మనం నేనుని శరీరముగా, మనస్తత్త్వముగా, తత్సంబంధ అనుభవములుగా, అనుబంధములు గా భావిస్తున్నప్పుడల్లా భావశరీరంని పొందుతాము. దానినే జన్మ లేక పుట్టుక అంటారు.

నేనుని ఆత్మగా అన్వయించుకున్నప్పుడు జన్మలే ఉండవు . ఎందుకంటే ఆ అన్వయము జరిగినప్పుడు “నేను” వ్యక్తిగా ఉండదు. అందువల్ల తత్సంబంధ భవములు, తలపులు, అనుభవములు, అహంకార మమకారములు దృష్టి లేదా గమనికలోనికి రావు. వ్యక్తిత్వ విస్మరణమే మరణము ఈ దశలో హాయి, ఆనందము, శాంతము, మౌనము, ప్రశాంతత, ప్రజ్ఞానము అనుభువములుగా ఉంటాయి.

అందుకే అద్వైత స్థితి శాంతానంద స్థితి. వ్యక్తి కి సంబంధించిన సుఖదు:ఖములు మరపులో ఉండి, దృష్టిలో ఉండవు. ఈ మరపే లేక వ్యక్తిత్వ విస్మరణమే సౌఖ్యాన్ని ఇస్తుంది. ఈ స్థితి స్థిరపడితే, వ్యక్తి తో ముడిపడిన సుఖ దుఃఖములు దృష్టిలోకి వచ్చినా మనసు దృఢముగా ఉండి సంయమనమును కోల్పోదు. నెమ్మదిని నేర్చి మది ఉనికిని కోల్పోతుంది. దీనినే ముక్త స్థితి, మోక్ష స్థితి, నిర్వాణ స్థితి, దివ్య స్థితి అంటారు.. ఇలా ప్రజ్ఞానం ఒక్కటే అయి,ఒక్కటే గా, ఉన్నది అద్వైత స్థితి..

ఈ అద్వైత స్థితిని, మన ఇష్ట దైవముగా, స్థితిగా అనుకుంటే అది సగుణ బ్రహ్మ ఉపాసన. సగుణ భక్తి కలిగి ఉండడము. అప్పుడు ద్వైత స్థితి మనిషి లేదా వ్యక్తి లేక జీవాత్మ స్థితిగా, అద్వైత స్థితి ని పరమాత్మ అయిన ఇష్ట దైవముగా చూడడము పరమాత్మ స్థితిలో ఉండడము.

ఈ అద్వైత స్థితినే ఆత్మ లేక బ్రహ్మ స్థితిగా చూస్తే అది నిర్గుణ బ్రహ్మ ఉపాసన.

ఎప్పటికీ ఈ జీవ స్థితి పోయి, పరమాత్మ స్థితిగా ఒకటే ఉండడము, జరగదని మధ్వాచార్యులు వారు అన్నారు. ఎప్పుడూ ఈ ద్వైత (జీవాత్మ, పరమాత్మ విడిగా తెలుస్తూండడం ) భావము పోదు అని ద్వైతుల నమ్మకము. అలా పోయీ,పోక, అద్వైత స్థితిని, మనిషి లేక జీవాత్మ లేక వ్యక్తిత్వ స్పృహ కలిగి ఉంటూ, భగవంతుని కళ్యాణ గుణములలో మన వ్యక్తితత్వము లీనమయ్యి పరమపదాన్ని, శివ పదాన్ని, లేక విష్ణు పదాన్ని లేక ఇష్ట దైవ లేక, దేవతా పదాన్ని పొందడము విశిష్టాద్వైతము అంటారు. ఇది రామానుజులు ప్రచారము చేసారు. ఇందులో కూడా వ్యక్తిత్వ స్పృహ లీలగా ఉంటుంది అని వారి నమ్మకము.

వ్యక్తిత్వ స్పృహ పోయిన తత్క్షణమే మిగిలి ఉండేది పరమాత్మ స్థితి ఒక్కటే. కనక ప్రకృతి పరంగానూ నిర్మాణములోనూ, చేయబడిన వస్తువు అధారముగానూ, వ్యక్తి లేదా జీవాత్మ, పరమాత్మ ఒకటే అని అద్వైతము చెబుతుంది. దీనిని తత్వము అంటారు. మన ప్రకృతిని బట్టి, మానసిక పరిపక్వతని బట్టి మనకి సగుణ తత్వమో, నిర్గుణ తత్వమో నచ్చుతుంది. ఆ ప్రకారముగా మనము మన ఆధ్యాత్మ పథాన్ని ఎంచుకుంటాము.

ఏదైనా తత్వము యొక్క పరమార్ధము మనకు జీవనయానములో సాయము చేయడము. జీవితములో కలిగే వడి దుడుకులకు, మనసు, మనము, లొంగి, క్రుంగ కుండా, అనవసరముగా పొంగకుండా, సంయమనము పాటిస్తూ, విధి నిర్వహణమును ప్రశాంత చిత్తంతో చేయడానికి ఈ తత్త్వ జ్ఞానము సాయపడుతుంది.

ఇదే తత్త్వము యొక్క పరమార్ధము. మరే ఇతరమూ కాదు. ఈ తత్త్వము అందరు స్త్రీ, పురుషులకి ఉపయోగిస్తుంది, వారి వారి, ఇష్ట దైవములు, నమ్మకములు, ఇష్టాయిష్టములు ఏమైనా, ఎంతో వేరైనా.

4 thoughts on “అద్వైత – ద్వైత – తత్వములు

  1. ఆర్యులు అసలు బ్రాహ్మణులే కాదు. బ్రహ్మ జ్ఞానం కలిగిన వాళ్ళనే బ్రాహ్మణులు అనాలి కానీ తమ ఆదాయం కోసం
    లేనటువంటి 33 కోట్ల దేవతలను సృష్టించారు.

  2. ఆర్యుల మన దేశానికి తీరని అన్యాయం చేశారు. దీని గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కూడా రాశారు.

    కృతయుగ కాలంలో అందరూ ఆత్మ జ్ఞానం కలిగి వుండే వాళ్ళము. అందుకే మన దేశానికి ఇందూ దేశమనే పేరు వచ్చింది. ఇందువారం అనగా సోమవారం ,
    ఇందు అంటే చంద్రుడు ,
    చంద్రుడు జ్ఞాన చిహ్నం

    జ్ఞానుల దేశం కాబట్టి ఇందూ దేశమనే పేరు వచ్చింది.

    మన దేశానికి మధ్య ఆసీయులు (ఆర్యులు) రాకతో , ఆత్మ జ్ఞానులైన ద్రావిఢ బ్రాహ్మణులు కాస్త కర్మయోగం , బ్రహ్మ యోగము లను వదిలి నాలుగు అధర్మాలైన యజ్ఞాలు, వేదాధ్యయనము, దానములు, తపస్సులను పట్టుకున్నారు. ఆ విషయం గమనించిన పరమాత్మ ద్వాపర యుగం చివర్లో భగవంతుడిగా వచ్చి, నాలుగు అధర్మాలను బయట పెట్టి , జన్మలకు కారణమైన కర్మలను కాల్చి , మోక్షాన్ని కలుగ జేసే కర్మయోగం , బ్రహ్మ యోగము లను రెండు ధర్మాలను , ధర్మాతీతమైన భక్తియోగమును తెలిపి, ఆకాలంలో అధర్మాలను రచించిన వ్యాసుని చేతనే యజ్ఞ, వేద, దాన, తపస్సులకు వ్యతిరేఖంగా భగవద్గీతను గ్రంధ రూపంగా తయారయ్యేలా చేశాడు. అది గమనించీన ఆర్యులు వ్యాసుడు చనిపోయిన తర్వాత భగవద్గీతలో భగవంతుని మాటకు వ్యతిరేఖంగా కల్పిత శ్లోకాలు అమర్చి , అధర్మాలు బయట పడకుండా జాగ్రత్త పడ్డారు.

  3. రావణ బ్రహ్మ గారే భగవంతుడు ,

    రాముడు ఏమి తెలియని అవివేకి, అజ్ఞాని.

    రాముడు దేవుడా ?భగవంతుడా ?  కాదా?

    క్రింది పద్యం ఆధారంగా చెప్పండి. ఇది బ్రహ్మంగారే కాలజ్ఙానంలో రాసారు.

    రావణునకు నెప్పుడు రాముడు సరికాడు 
    రావణునకు మిగుల రంకు వచ్చె
    సీత నరిమి పట్ట చేటు లంకకు వచ్చె 
    కాలికాంబ హంస కాలికాంబ! 

  4. భారతదేశము దైవజ్ఞానమునకు పుట్టినిల్లు, ఎందరో ఆధ్యాత్మిక పురుషులు తమ జ్ఞాన సందేశములతో ఈ దేశమును జ్ఞానవంతము చేశారు. అందువలనే భారతదేశము ఇందుదేశముగా పిలువబడినది. కాలక్రమముగా ఇందూ దేశము హిందూ దేశముగా మారిపోయినది. ముఖ్యముగా దక్షిణ భారతదేశము స్వచ్ఛమైన దైవజ్ఞానమునకు నిలయమైనందుకు ఎన్నో సాక్ష్యాధారములు కలవు. ఇక్కడి దేవాలయములు, సాంప్రదాయములు అణువణువునా ఆధ్యాత్మిక చింతనను నింపుకొని ఉన్నవి. అంతేకాకుండా ఇందూమతములో సిద్ధాంతకర్తలంతా దక్షిణ భారతదేశములోనే జన్మించుట గమనించదగిన విషయము. ఉదాహరణకు అద్వైతమును ప్రతిపాదించిన ఆదిశంకరులు కేరళ రాష్ట్రమందు, ద్వైతమును ప్రతిపాదించిన మధ్వాచార్యులు కర్ణాటకయందు, విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన రామానుజాచార్యులు తమిళనాడుయందు జన్మించారు. వారు ప్రతిపాదించిన సిద్ధాంతముల యొక్క శాస్త్రబద్ధతను ప్రశ్నించుచూ, త్రైత సిద్ధాంతమును ప్రతిపాదించిన శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమందు జన్మించుట జరిగినది.
    అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతములకు త్రైత సిద్ధాంతమునకు బేధమును తెలుసుకోవలసిన అవసరమున్నది. అందులో భాగముగా ఈ సిద్ధాంతములను గురించి వివరముగా తెలుసుకోవాలి. ఆ వివరమును ఈ విధముగా చూడవచ్చును.
    అద్వైతము:- అద్వైతమనగా రెండుకానిది, ఒక్కటిగానే ఉన్నదని అర్థము. ఈ సిద్ధాంతము ప్రకారము ఈ జగత్తంతా పరమాత్మ శక్తియే నిండియున్నది. పరమాత్మ తప్ప మారేదిలేదు. ఈ సిద్ధాంతమును ప్రతిపాదించిన ఆదిశంకరులు భగవద్గీత రచించినప్పటికీ, భగవద్గీతయందు భగవానుడు వ్యతిరేకించిన వేదములను సమర్థించుట ఆశ్చర్యకరము. ఈ సిద్ధాంతము శైవమును సాంప్రదాయమునకు తెర లేపినది.
    విశిష్టాద్వైతము:- శంకరుల అద్వైతము యొక్క శాస్త్రబద్ధతను ప్రశ్నించుచూ అందులోని లొసుగులను సరిదిద్ది ప్రతిపాదించిన సిద్ధాంతముగా విశిష్టాద్వైతమును రామానుజాచార్యులు ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతము ప్రకారము జగత్తంతయు ప్రత్యేకమైన రెండు ఆత్మలుగా, వాటికి భిన్నముగా ప్రకృతితో కూడుకొని ఉన్నది. అనగా జీవాత్మ, పరమాత్మ మరియు ప్రకృతి యొక్క కలయికయే ఈ సృష్ఠిగా మారినది. ఈ సిద్ధాంతము కూడా వేదములను సమర్థించడమేకాక, వైష్ణవమును సాంప్రదాయమునకు నాంది పలకినది.
    ద్వైతము:- అద్వైత, విశిష్టాద్వైత ప్రశ్నించుచూ ప్రతిపాదించబడిన సిద్ధాంతమే ద్వైతము. ద్వైతము అనగా రెండు అని అర్థము. లోకములో ఇద్దరు పురుషులు కలరు. నాశనము చెందేవాడు అనగా జీవాత్మ, నాశనము చెందనివాడు అనగా పరమాత్మ అని తెలియజేస్తూ భాగవద్గీతయందలి పురుషోత్తమ ప్రాప్తి యోగమును ఆధ్యాయముయందలి 16వ శ్లోకమును ఉదహరించారు.
    శ్లో❘❘
    ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచ ❘
    క్షరస్సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్చతే ❘❘
    పై మూడు సిద్ధాంతములు ఒకదానితో ఒకటి విబేధించుచున్నవి. ముఖ్యముగా అద్వైతమునకు పూర్తి వ్యతిరేఖముగా ద్వైతము ఉన్నది. అద్వైతమును అనుసరించు అద్వైతులు, ద్వైతుమును అనుసరించు ద్వైతులు ఒకరికొకరికి సరిపడక ద్వేషించుకొనుచు, కలహించుకొనుచున్నారు.
    హిందూ మతములో సిద్ధాంత కర్తలు
    త్రైత సిద్ధాంతము
    పీఠాధిపతులైన గొప్ప గురువులమని పేరుగాంచిన వారే ఒకరి సిద్ధాంతమును మరొకరు ఒప్పుకోక ద్వైతము సరియైనదికాదని అద్వైతులు, అద్వైతము సరియైనదికాదని ద్వైతుల యొక్క వాదన. ఆలోచించి చూచినట్లయితే ఒకరిది సరియైన సిద్ధాంతమైతే మరియొకరిది తప్పు సిద్ధాంతమగును కదా! అందువలన సిద్ధాంతములనే బయల్పర్చిన గురువులవద్ద కూడా మాయ పనిచేసినదనియే చెప్పవచ్చును.
    సిద్ధాంతమనునది ఎప్పటికీ మారునది కాకుండాలి మరియు అసత్యమైనది కాకుండాలి. ఇంకనూ వివరము చెప్పుకొంటే సిద్ధి అనగా ప్రాప్తించునది, సిద్ధించునది, అనుభవానికివచ్చునదని అర్థము. అనుభవానికి వచ్చు విషయము తెల్పువాడు సిద్ధాంతీయగును. శాసనములతో కూడుకొన్నది శాస్త్రము. శాసనము, సిద్ధాంతము రెండు ఒక్కటే. శాస్త్రము తెలుపువాడు శాస్త్రియని, సిద్ధాంతములను తెల్పువాడు సిద్ధాంతీయని పూర్వమనెడివారు. చిన్నచిన్న శాసనములతో కూడుకొన్నదే ఒక సిద్ధాంతమగును. దీనిప్రకారము అన్నీ విద్యలకంటే గొప్ప విద్యాయైన ఆధ్యాత్మికము శాసనపరమైన సిద్ధాంతరూపముగా ఉండాలి. అలాగే జగత్ గురువులుగ పేరుగాంచిన శంకరాచార్యులవారు అద్వైత సిద్ధాంతమును, మధ్వాచార్యులవారు ద్వైత సిద్ధాంతమును ప్రచారము చేశారు. ఇవి ఒకదానికొకటి భిన్నముగ ఉండుట వలన ఏది సత్యము, ఏది అసత్యమని పరికించి చూడవలసియున్నది. వాటి వృత్యాసములు, వాటిలోని సత్యాసత్యములు తెలుసుకొనుటకు ప్రమాణముగా పెట్టుకొని చూడవలినది భగవంతుడు చెప్పిన భగవద్గీతయే.
    బ్రహ్మవిద్యకు ప్రమాణ గ్రంథమైన భగవద్గీత నూటికి నూరుపాళ్ళు శాస్త్రబద్ధమైన సిద్ధాంతములతో కూడుకొని ఉన్నది. పరమాత్మ స్వయముగ తెల్పిన భగవద్గీత ప్రకారము చూచిన ఎడల పరమాత్మ జీవాత్మలను రెండూ లేవని పరమాత్మ ఒక్కటే గలదను అద్వైతము, జీవాత్మ పరమాత్మలు రెండూ ఉన్నాయను ద్వైతము, రెండునూ గీతకు కొద్దిగ ప్రక్క మార్గములో ఉన్నాయని తెలియుచున్నది. అనగా ఇవి పూర్తి సరియైన సిద్ధాంతములు కావని అర్థమగుచున్నది. గీతను ప్రమాణముగ పెట్టుకొని చూచినట్లయితే మానవమాత్రులైన గురువులు చెప్పిన ద్వైత, అద్వైత సిద్ధాంతములు రెండూ హేతుబద్ధముగా లేవు. ద్వైత సిద్ధాంతమును పరిశీలించి చూచినట్లయితే భూమీద వేర్లు లేకుండ చెట్టున్నదనుట ఎంత సత్యమో అంతే సత్యముగనున్నట్లు తెలియుచున్నది. అట్లే అద్వైత సిద్ధాంతమును పరిశీలించితే భూమి, వేర్లు రెండూ లేకుండానే చెట్టున్నదనుట ఎంత సత్యమో అంతే సత్యమగును. అనగ రెండు సిద్ధాంతములు అశాస్త్రీయముగనున్నవని, హేతుబద్ధముగా లేవని తెలియుచున్నది. ఈ రెండు సిద్ధాంతములు అశాస్త్రీయములు, అహేతుకమనుటకు గీతలోని పురుషోత్తమ ప్రాప్తి యోగమందు గల 16, 17వ శ్లోకములే ఆధారము. ఈ రెండు శ్లోకములు ద్వైత, అద్వైత సిద్ధాంతముల రెండింటిని ఒక్కవేటుతో కొట్టిపారేయుచున్నవి. ఈ రెండు శ్లోకములే అసలైన ఆధ్యాత్మిక సిద్ధాంతమైన త్రైత సిద్ధాంతమును బోధిస్తున్నవి. ఈ రెండు శ్లోకములేకాక గీత యొక్క సారాంశమంతయు త్రైతము మీదనే బోధింపబడియున్నవి. కలియుగములో ద్వైత, అద్వైత సిద్ధాంతములు బయటకిరాగా , ద్వాపరయుగ అంత్యములోనే త్రైత సిద్ధాంతము భగవంతుని చేత బోధింపబడి ఉన్నది. అయినప్పటికీ మాయా ప్రభావము చేత త్రైతము అర్థము కాకపోయింది. మాయా ప్రభావము చేతనే ద్వైత, అద్వైతములు బయల్పడినవి. ఇప్పటికీ ద్వైత, అద్వైత గురుపరంపరలైన మధ్వాచార్య, శంకరాచార్య పీఠములు భూమిమీద గలవు. త్రైతమను పేరుగాని, దానిని బోధించువారుగానీ లేకుండాపోయారు. ఇట్టి పరిస్థితులలో త్రైతము బయటకి రావడము మన అదృష్టమని తెలియాలి. త్రైతము ప్రకారమే భగవద్గీత, భగవద్గీత ప్రకారమే త్రైతము గలదు. మనము ఇక్కడ క్రొత్తగా చెప్పుకొనుచున్న త్రైత సిద్ధాంతమును గురించి కొద్దిగ వివరించుకొందాము.
    పరమాత్మ తప్ప రెండవది లేదనుట అద్వైతము, పరమాత్మ, జీవాత్మ రెండు కలవనుట ద్వైతము. పరమాత్మ జీవాత్మకు మధ్యలో ఆత్మగలదని మూడింటిని గూర్చి తెల్పునది త్రైతము. ఏ విధముగా భూమికి చెట్టుకు మధ్యలో కనిపించకుండ వేర్లున్నవో, అట్లే పరమాత్మకు జీవాత్మకు మధ్యలో ఆత్మగలదు. భూమికి చెట్టుకు మధ్యలో వేర్లు ఎంత ప్రాముఖ్యత వహించియున్నవో, అట్లే పరమాత్మకు జీవాత్మకు మధ్యలో ఆత్మ ప్రాముఖ్యత వహించియున్నది. పరమాత్మ సర్వవ్యాపి, అనంతముకాగ ఆత్మ శరీరమంతా వ్యాపించి శరీరములో ఒక్క స్థానములో గల జీవాత్మ యొక్క జీవనాన్ని సాగిస్తున్నది. వేర్లు లేకపోతే చెట్టు ఎలా లేదో అలాగే ఆత్మ లేకపోతే జీవాత్మయే ఉండదు. భూమిమీద చెట్టు ఎక్కడున్నా దానికి తప్పనిసరిగ వేర్లు అనుసంధానమైవుండి చెట్టు జీవనాన్ని సాగించుటకు ఆధారమై ఎట్లున్నావో, అట్లే పరమాత్మ వ్యాపించిన జగతిలో జీవాత్మ ఎక్కడున్నా ఆత్మ అనుసంధానమైవుండి జీవాత్మ జీవనాన్ని సాగించుటకు ఆధారమైవున్నది. జగతిలో పరమాత్మ, ఆత్మ, జీవాత్మలేని ఆధ్యాత్మికమే లేదు. ఈ విషయమునే వివరిస్తూ క్షరుడని జీవాత్మను, అక్షరుడని ఆత్మను, పురుషోత్తముడని పరమాత్మను గీతలో బోధించారు. జీవాత్మ ఆత్మలు రెండు కూటస్థముగ కలిసి ఉన్నాయని, వాటికతీతముగా పరమాత్మ ఉన్నదని, జీవాత్మ ఆత్మలను ఇద్దరి పురుషులకంటే అతీతముగనున్న పరమాత్మను పురుషోత్తముడని చెప్పబడియున్నది. ఈ విషయము బ్రహ్మవిద్యా శాస్త్రమైన గీతలో పరమాత్మ మాటల రూపముగ చెప్పడమేకాక ప్రతి మానవుడు ఈ విషయము తెలుసుకొనునట్లు, ప్రతి మానవుని హస్తములో జీవాత్మ, ఆత్మ, పరమాత్మల గుర్తుగా మూడు రేఖలు ముద్రించి పెట్టాడు. ప్రతి మనిషి హస్తములోను మూడు రేఖలు ముఖ్యముగ ఉండును. వాటిలో రెండు క్రింది రేఖల కొనలు ఒకదానితో ఒకటి కలిసియుండును.పై రేఖ ఒకటి మాత్రము ప్రత్యేకముగ ఉండడము గమనించవచ్చను. కలిసియున్న రెండు రేఖలు జీవాత్మ, ఆత్మలకు ప్రతీకలుకాగ, ప్రత్యేకముగ పైన ఉన్న రేఖ మాత్రము పరమాత్మకు గుర్తుగా ఉన్నది. ఇది ప్రతి హస్తములో ఉండగ గురువులుగ ఉన్నవారు కూడ దీనిని గమనించలేదంటే, మాయ యొక్క ప్రభావమెంత ఎక్కువగ ఉన్నదో అర్థము చేసుకొనవచ్చును. సృష్ఠి ఆదియందే మానవుని అరచేతిలో మూడు ఆత్మల రహస్యముంచిన పరమాత్మ ద్వాపరయుగ అంత్యములో కూడ అదే విషయమునే గీతలో చెప్పాడు. చేతిలో పెట్టినా, నోటితో చెప్పినా మానవుడు గ్రహించలేక పోతున్నాడని పూర్వము తెలిసిన పెద్దలు పురుషున్ని సూచించు లింగాకృతిని దేవాలయములయందు ప్రతిష్ఠించి గీతలో చెప్పినట్లు జీవాత్మ, ఆత్మ, పరమాత్మలుగా పురుషుడు మూడు భాగములై ఉన్నాడని తెలియునట్లు మూడు విభూతి రేఖలు లింగము మీద తీర్చిదిద్దారు. మూడు ఆత్మల విషయము ప్రతి ఈశ్వర దేవాలయములోను ఉండునట్లు చేశారు. కానీ కాలక్రమమున ధర్మమేనాడో అధర్మముగ మారిపోయి ఈశ్వర దేవాలయము కడకు మెడలో పామున్న శివుని ఆలయముగ లెక్కించబడుచున్నది. ఈశ్వరుడనగా అధిపతియను అర్థముపోయి, ఈశ్వరుడే శంకరుడను పెడార్థము మిగిలిపోయినది. ఆదియందు స్వచ్ఛముగనున్న లింగమొకటే ఉన్న ఈశ్వరాలయములో తర్వాత లింగము ప్రక్కన పార్వతి, ఎదురుగ నందిని ప్రతిష్ఠించారు. ఇలా చివరకు ఈశ్వరాలయము శంకరాలయముగ మారి శైవుల దేవాలయమైనది. ఇలా మూడు విభూతి రేఖల అర్థమైన ఆత్మల గుర్తింపు మారిపోయినప్పటికీ అసలు సత్యము స్థిరముగనుండునట్లు మన పెద్దలు ఒక నియమమును ఉంచారు. అదేమనగా ప్రతి రోజు ఉదయము నిద్రలేస్తూనే ఎవరి ముఖము కూడా చూడకుండ మొట్టమొదట తన అరచేతిని చూడాలని చెప్పారు. లేస్తూనే అరచేతిని చూచుట వలన మూడు రేఖలు కనిపిస్తాయని, ఎప్పటికైన వాటిని గురించి ఆలోచించరా! అని వారి భావమై ఉండవచ్చును. ఈ ఆచారము ఈ కాలములో ఎక్కడైనా మిగిలి ఉన్నప్పటికీ అర్థము తెలుసుకోలేక పోవుచున్నారు. అరచేతిలోనే మూడు ఆత్మలున్నాయని అరచేతిలోనే అంతా ఉన్నదని, అరచేతిలోనే వైకుంఠముందని, అరచేతిలోనే త్రైత సిద్ధాంతమున్నదను అర్థముతో, ఏ మతములోని వాడైన నా అభిమతములోనే ఉన్నాడని పరమాత్మ మానవుల చేతిలో మూడు రేఖలు అమర్చాడు.
    చేతిలోని మూడు రేఖలే శరీరములోని మూడు ఆత్మలని, శరీరములోని మూడు ఆత్మలనే త్రైతము అంటున్నామని, త్రైతమును తెల్పునదే త్రైత సిద్ధాంత భగవద్గీత అని తెల్పుచున్నాము. త్రైత సిద్ధాంతము ముఖ్యముగా మూడు ఆత్మల వివరమును గురించి చెప్పుచు పోయినది. త్రైతమనిన, మూడు ఆత్మలనిన చదువు వారికి క్రొత్తగా ఉండును. కావున మాచే రాచింపబడిన
    “గీతా పరిచయము” అను గ్రంథమును చూడవలసిన ఆవశ్యకత గలదు. ఎందుకనగా ఒక క్రొత్త వానిని మనము నేరుగ పలకరించలేము. వానితో స్నేహము చేయలేము. క్రొత్త వ్యక్తిని పరిచయము చేయడానికి మొదట ఒక మధ్యవర్తి ఉంటే వానితో సులభముగ పరిచయము ఏర్పడగలదు. మధ్యవర్తి యొక్క తెలివినిబట్టి, వాడు తెలిపే దానినిబట్టి, క్రొత్తవాని విషయమంతా మనకు ముందే అవగాహన కాగలదు. ఆ తర్వాత వానితో సులభముగా కలిసిమెలిసిపోవచ్చును. అలాగే “త్రైత సిద్ధాంత భగవద్గీత” లోని సారాంశము తెలియాలంటే, దాని అవగాహన కావాలంటే, ముందు గీతాపరిచయమను మధ్యవర్తి కావలసిందే. గీతపరిచయమును చదివిన తర్వాత “త్రైత సిద్ధాంత భగవద్గీత” అను సరికొత్త గీత అర్థము కాగలదు. ఈ గీతాపరిచయమును మిమ్ములను త్రైతముతో పరిచయము చేయించి, త్రైతమంటే ఏమిటో తెలుపగలదు. గీతాపరిచయమును చదివిన తర్వాత మాచే రచించబడిన “త్రైత సిద్ధాంత భగవద్గీత” ను చదువగలరని కోరుచున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *