April 26, 2024

మాయానగరం 45

రచన: భువనచంద్ర

జీవించడం తెలీనివాడు జీవితాన్ని మధించలేడు.
అన్నీ వున్నవాడు ఎదుటివాడి ఆకల్ని ఏనాడూ గమనించలేడు.
జీవితం అంటేనే ఒక ఉగాది పచ్చడిలాంటిది. అక్కడ చేదు, పులుపు, తీపి, కారం, వగరూ, వుప్పూ లాంటి రుచులుంటే, ఇక్కడ సుఖం, కష్టం, విరహం, ప్రేమ, కన్నీరు, కపటం, మోసం, మాయలాంటి అనేక విధానాలు వుంటాయి.నిన్నటి దేవుడు ఇవ్వాళా దేవుడుగానే వుంటాడని గ్యారంటీ లేదు. అదే విధంగా నిన్నటి విలన్ ఇవ్వాళా విలన్ పాత్రనే పోషిస్తాడనే నమ్మకమూ లేదు. ఆకాశంలో మబ్బులు రూపు మార్చుకున్నట్టు, మనిషిలోని ఎమోషన్సూ మారుతూనే వుంటాయి.
“అసలు జీవితాన్ని నేను ఏం చూశానూ? ఏమి అనుభవించానూ?” అనే ప్రశ్న రానే కూడదు. ఒక్కసారి ఆ ప్రశ్న బుర్రలో పుడితే చాలు, మరుక్షణం నించీ బుర్రని పురుగు తొలిచినట్టు తొలుస్తూనే వుంటూంది.మాధవి పరిస్థితి ప్రస్త్తుతం అదే.
ప్రస్తుతం మాధవి వున్నది గోవిందరాజస్వామి ఆలయం వున్న స్ట్రీట్‌లో. ఆ యిల్లూ బోస్‌దే. కానీ వేరే పేరు మీద వున్నది. అతనికా వూళ్ళో చాలా ఇళ్ళున్నై. కానీ అలా వున్న విషయం జనాలకి తెలీదు. అద్దెలమీదే దాదాపు పాతికవేల ఇన్‌కమ్ వుందతనికి.
“మాధవిగారూ.. జరిగినదానికి చాలా బాధగా వుంది. జనాలకి మేలు చెయ్యాలనే తలంపు తప్ప వేరేమీ మీ మనసులో వుండదు. అలాంటి మీ ఇంట్లోకే వచ్చి నిప్పు పెట్టారంటే మామూలు విషయం మీకంటూ శతృవులు లేరని నాకు తెలుసు. ఇది ఖచ్చితంగా”సైలెంటయ్యాడు బోస్.
“ఎవరి పని అయ్యుండొచ్చు. అయినా నన్ను నిప్పులపాలు చేస్తే ఎవరికి లాభం?” నిస్పృహతో అంది.
“నాదీ అనుమానమే. ఖచ్చితంగా ఇది శామ్యూల్ రెడ్డి పని అని చెప్పలేనుగానీ, ఒక అవకాశం అతనికుంది. ఎన్నికల్లోనించి నన్ను తప్పిస్తే అతనికి అవకాశం వస్తుందనే కారణమూ కావొచ్చు. సిన్సియారిటీలు, నిస్వార్ధాలూ మానేసి గెలుపుకి ట్రై చెయ్యమని మా గురువుగారూ హింట్ ఇచ్చారు. ఏమైనా జరిగింది జరిగింది. ఇకనించీ మెరు జాగ్రత్తగా వుండాలి. అఫ్‌కోర్స్ మిమ్మల్ని కంటికి రెప్పలా, అనుక్షణం కాపాడమని మావాళ్లకి ఖచ్చితంగా చెప్పాను. వాళ్లని మీకు పరిచయం చేస్తా. వాళ్లు నాకొసం ప్రాణాలైనా ఇవ్వడానికి వెనుకాడరు. నా మాట అంటే వాళ్లకి సుగ్రీవాజ్ఞ లాంటిది” ధైర్యం చెప్పాడు బోసుబాబు.
“వద్దండీ, అదేమీ వొద్దు. లోకానికి భయపడే మనస్తత్వం కాదు నాది. అదీగాక, మీరు బాడీగార్ద్శ్‌ని పెడ్తే లేనిపోని రూమర్లు పుట్టుకొస్తాయి. అవి మీకూ, నాకూ కూడా మంచిది కాదు. అయినా ఈ ఇల్లు అదివరకు దానిలాగా ఒంటరిది కాదుగా. చుట్టూతా ఇళ్లూ, జనాలూ వున్నారు. ప్లీజ్. నా రక్షణ కోసం ఎవర్నీ పురమాయించకండి. నా జాగ్రత్తలో తప్పకుండా నేనుంటాను” స్పష్టంగా, ధైర్యంగానూ జవాబిచ్చింది మాధవి.
“సరే.. మీ ఇష్టం” లేచాడు బోసుబాబు.
*****
“ఇందులో ఎవరి పాత్ర వుండి వుంటుందంటావూ?” అడిగాడు అద్వితీయ ఎదురుగా వున్న ‘పరాగా’న్ని.
“ఏం చెప్పను భాయీ.. ఎవరిదైనా వుండొచ్చు. శామ్యూల్ రెడ్డి కావచ్చు. పొరపాటున ఎక్కడ్నించో ఎగిరిపడి వచ్చిన నిప్పురవ్వది కావొచ్చు. అసలు బోసుబాబుదే కావొచ్చు. ఇంకా ముందు కెడితే బోసుబాబుని ‘సరైనా దారిలో పెట్టడానికి మన మహాగురువుగారు చేయించిన ప్రయోగమైనా కావొచ్చు. ఏదీ ఇతమిద్దంగా చెప్పలేము. ఒక్కటి మాత్రం నిజం. నిజాన్ని వెలికితీసే ప్రయత్నం వల్ల లాభమూ, నష్టమూ రెండూ వున్నై. అసలైన ‘వాడ్ని’ కనుక్కుంటే కాస్త డబ్బు పిండుకోవచ్చు. రాంగ్ నంబర్ అయిందనుకో, మనం విసిరిన బూమెరాంగ్ మన తోకనే తెంపుతుంది.”సుదీర్ఘ వివరణ ఇచ్చాడు పరాగం
‘జర్నలిస్టు’ అనే పదానికి చెడ్డపేరు తెస్తున్నారు మీరు. డబ్బు పిండుకోవడం ఏమిటి అసహ్యంగా” విసుక్కుంది సంఘమిత.
“అమ్మా సంగమ్మా. నీది కడుపు నిండిన వ్యవహారం. మా సంగతంటావా.. ఏరోజు కారోజు వెతుకులాటలే కదా. అయినా నిస్వార్ధాలూ, చట్టుబండలూ పోయి చాలా కాలం అయింది. ఇప్పుడు పత్రికలకి కావల్సింది సర్క్యులేషన్. అదుండాలంటే సెన్సేషన్‌ని క్రియేట్ చెయ్యాలి. అది కూడా అలాంటిలాంటి సెన్సేషన్ కాదు. ఆంధ్రదేశం అట్టుడికిపోవాలి. ఇది నా మాట కాదు. ప్రతి పత్రిక యాజమాన్యం మన చెవుల్లో ఇల్లు కట్టుకుని మరీ నినదించే మాట” కొంచెం కచ్చిగా అన్నాడు అద్వితీయం. ఈ మధ్య సెన్సేషనల్ న్యూస్ ఇవ్వడం లేదని అతనికి ఆల్రెడీ ఎగ్జ్యూటివ్ ఎడిటర్ నించి అల్టిమేటం వచ్చింది మరి. ఏం చేస్తాడు. జర్నలిస్టు కోపం జనాలకి చేటు.
“బాబూ గోడలకి చెవులూ, నోళ్ళూ ఎక్కడెక్కడో కాదు, ఇక్కడా వుంటాయి” నిర్లిప్తంగా అన్నది సంఘమిత్ర. పైకి నిర్లిప్తంగా అన్నా లోపల మాత్రం పరాగం మాటల గురించి ఆలోచిస్తుంది.

*****

ఎవరో మాధవి గదిలో నిప్పు పెట్టారన్న విషయమూ, ఆమె ప్రస్తుతం అనఫిషియల్‌గా బోసు ఇంట్లో నివాసముంటున్న విషయమూ గుడిసెల సిటీని వూపేసింది. నిజంగా చెబితే గుడిసెల్లోని యువకులంతా భగ్గున మండి పడుతున్నారు. బోస్‌తో మాధవి కలిసి గుడిసెలవాళ్లకోసం చేస్తున్న మంచి పనులు మొదట యువతకి చికాకు కలిగించినా, మాధవి మెల్లగా, ప్రేమగా వారికి నచ్చచెప్పడం వల్ల వారూ ‘మార్పు’ని ఆమోదించగలిగే స్థితికి చేరుకున్నారు. ఆ ‘మార్పు’ శరవేగంగా జరుగుతున్న సమయంలో ఇలా తమ నాయకురాలికి జరగడం వాళ్లని కోపోద్రిక్తుల్ని చేసింది.
అసలు గుడిసెవాసుల్లో ఇంతటి రియాక్షన్ వుంటుందని బోసుబాబే వూహించలేదు. మాధవి ఇంతగా జనాల్ని ఆకట్టుకుంటుందనీ, అతనూ వూహించలేదు. రియాక్షన్ చూసిన క్షణమే అతని మనసులో సన్నగా ‘అసూయ’ పొటమరించినా, మరుక్షణమే దాన్ని తృంచేశాడు. కారణం మాధవికొచ్చే పేరు మొత్తం ఉపయోగపడేది తనకేగా. మంచివాడు చెడటానికి క్షణం పట్టదు. కానీ చెడ్డవాడు మంచివాడు కావాలంటే ఒక జీవితకాలం పడుతుంది.
ఒక్కసారి బోసుబాబు ఆలోచించాడు. మాధవి ప్రణాలికల్ని. “బోస్‌గారూ, మీరు వీరిని బాగు చేద్దామనుకుంటున్నారు. కానీ ఎలా బాగు చేస్తున్నారూ? చలికాలం దుప్పట్లు, రగ్గులు, ఎండాకాలం కుండలు, ప్లాస్టిక్ బిందెలు, వానాకాలం గొడుగులూ ఉచిత సారా పాకెట్లు ఇస్తున్నారు. బాగు చెయ్యడం అంటే ఇదేనా? ఇవ్వాళ ప్రభుత్వం చేస్తున్నదీ, మీరు చేస్తున్నదీ కూడా ఒక్కటే. జనాల్ని బిచ్చగాళ్లుగా మార్చడం. మీరు అన్నదానం అంటూ మొదలెడతారు. అందరూ క్యూలో మీరిచ్చే పులిహోర పేకెట్లు పెరుగన్నం పేకెట్లూ తీసుకుని, ‘కలకాలం*’ వర్ధిల్లు బాబూ అంటూ దీవిస్తారు. పత్రికలూ, చానల్సూ మిమ్మల్ని పొగిడి పొగిడి దానకర్ణుడంటూ ఆకాశానికి ఎత్తేస్తాయి. ఈ పుణ్యం-ఆ పాపం =సరికి సరి అనుకుంటూ గుండెలమీద చెయ్యేసుకుని హాయిగా నిద్రపోతారు. జరుగుతున్నది ఇదేగా?” సూటిగా అడిగింది.
అవునన్నట్టుగా తలూపాడు బోసుబాబు. కాదనడం ఎలా, జరుగుతున్నది అదే అయినప్పుడు.
“ఏం చెయ్యాలంటావు అక్కా?”అడిగింది శోభ. సౌందర్య, వసుమతి ఇంకొదరు టీచర్లు అక్కడే వున్నారు. గుడిసెల సిటీలోనించి ఉద్భవించిన కొందరు విద్యార్తులూ అక్కడున్నారు. మంచీ చెడూ విచక్షణా గ్నానం కలిగిన పెద్దలూ కొందరు అక్కడున్నారు.
“సేవ అనేది ఎప్పుడూ ‘దానం’ ప్రాతిపదిక మీద వుండకూడదు. అది పటిష్టమైనదిగానూ, నిర్మాణాత్మకమైనదిగానూ వుండాలి. ఓ పేద్ద వానొస్తుంది. ఇళ్ళలోకి నీళ్ళొస్తాయి. అప్పుడు వరదబాధితులకి ఆహారం అందించడమూ, వారు రాత్రి పదుకోవడానికి పొడిగా వుండే చోటు చూపడమూ మన నైతిక బాధ్యత. అది తాత్కాలికమే అయిన నీడ్ ఆఫ్ ద అవర్. వరదలు వచ్చేముందే నిర్మాణాత్మకమైన ఆలోచనలు చేసి వరదనించి రక్షింపబడటానికి (అదెప్పుడు వచ్చినా) చర్యలు తీసుకోవడం, శాశ్వత ప్రాతిపదికపై పునరావాస కేంద్రాలు ఏర్పాటు చెయ్యదం అసలు సిసలైన ప్రజాసేవ.” ఓ క్షణం ఆగింది మాధవి.
“అసలు మీరీ బడుగు ప్రజలకు ఏమి చేస్తే, ఎలా చేస్తే బాగుంటుందనుకుంటున్నారు?” అడిగాడో యువకుడు.
గుడిసెల్లో పుట్టీ, అక్కడ్నించే కష్టపడి చదివి డిగ్రీ తీసుకున్న ముగ్గురిలో అతనొకడు. పాతికేళ్ళ వయసుంటూంది. పట్టణాభివృద్ధి శాఖలో పని చేస్తున్నాడు. గుడిసెల సిటీని ఆనుకుని వున్న మిడిల్ ఇన్‌కం గ్రూప్ (M.I.G) కాలనీలో వుంటున్నాడు.
“చెప్తాను. మనం చేయదలుచుకున్నది ప్రజలకి తెలియాలన్నా, ప్రగతిఫలాలు వారికి అందాలన్నా, మనం తాత్కాలిక విషయాలకి ఇంపార్టెన్స్ ఇస్తూనే, మన పని నిరంతరం కొనసాగించవలసి వుంటుంది. అది ఏ ఏ రంగాల్లో అంటే,
మొదటిది విద్య. రెండోది పారిశుధ్యం. మూడు పొదుపు. నాలుగు పరస్పర సహకారం. అయిదు మూలనిధి. ఆరు సమాచార వ్యవస్థ. ఏడు మద్య బహిష్కరణ. ఎనిమిది అందుబాటులో వుండటం. ఒక్కోదానికి పదిమంది పర్మనెంటు సభ్యులు వుండాలి. అంటే మొత్తం ఎనభై మంది. ప్రతి గ్రూపులో పదిమంది సభ్యులున్నా వారిలో ఒకరైనా ఎల్లప్పుడూ అందుబాటులో వుండాలి. ఈ పై అంశాల మీద ప్రజలకి వివరించి ప్రజల్ని మోటివేట్ చేస్తూనే వుండాలి. ఫలితం వెంటనే కనపడకపోవచ్చు. కానీ, ఒక్కసారి ప్రజల్లో చైతన్యం మొదలైతే, అద్భుతమైన ఫలితాన్ని అదీ శాశ్వత ఫలితాల్ని సాధించగలం..” తన మనసులోని మాటని వివరించింది మాధవి.
మిగతావన్నీ అర్ధమయ్యాయి .. యీ మూలనిధి అంటే ఏమిటి? ఎందుకూ?” అడిగిందో టీచరు.
“మా కాలేజీలో “కూర్గ్” ప్రాంతానికి చెందిన అమ్మాయొకతి వుండేది. ‘తుళు’ బాష మాట్లాడేది. జనరల్ కరియప్ప, తిమ్మప్ప ఇలాంటి మహనీయులని కూడా కూర్గే. వారు మన దేశం వారే అయినా వారి సంప్రదాయాలు కొన్ని అద్భుతమైనవి.మరెక్కడా అవి కనిపించవు.ల్ అదేమిటంటే, బిడ్డ పుట్టీన మరుక్షణం నించే తలకి ‘ఇంత’ అని సంఘానికి కట్టాలి. పిల్లల చదువుల బాధ్యత సంఘానిదే. అలాగే పెళ్లి. ఎంత గొప్పవాడైనా, ధనవంతుడైనా, పేదవాడైనా, పెళ్లి సంఘ నియమాల ప్రకారమే జరగాలి. ఆ పెళ్ళి అయ్యాక రిసెప్షన్ పేరు మీద ఓపికున్నంత, నీ స్తోమతు ప్రకారం ఖర్చు చేసుకో. పెళ్ళి మాత్రం సంఘ నియమాలకి లోబడి పరిమితమైన కుటుంబ సభ్యులు, సంఘ సభ్యుల మధ్యే జరగాలి. అలాగే మరణించినపుడు “అయ్యో! డబ్బు ఎక్కడ దొరుకుతుందా?” అని వెంపర్లాడక్కర్లేదు. జీవితంలోని ముఖ్యమైనవన్నీ సక్రమంగా ఏ టెన్షనూ లేకుండా జరిగిపోతాయి” ఆగింది మాధవి.
“అద్భుతమైన సంప్రదాయం ఇది. అబ్బా. ఎవరు చనిపోయినా మనం డబ్బు దొరక్క ఎంత ఇబ్బంది పడతాం” ఆశ్చర్యంతో అన్నాడో పెద్దాయన.
“అసలు ఇదే పద్ధతి అన్ని చోట్లా అమలయితే ఎంత బాగుంటుండునూ” కళ్లు మెరుస్తుంటే అన్నది శోభారాణి.
“అమలయ్యే చాన్స్ లేదు. మాధవిగారన్నట్లు ఆ మూలనిధిని ఏర్పాటు చేసినా, మనవాళ్లయితే గుటుక్కుమని మింగి కూర్చుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు ప్రకటించి వాటికి నిధులు సమకూర్చినా ఆ డబ్బు జనానికి అందుతోందా? అందినా, ఎంత శాతం అందుతోంది?” నిర్లిప్తంగా అన్నాడింకో పెద్దమనిషి.
“అయ్యా.. ఆ మూలనిధిని ఒక్క పైసా కూడా వృధా కాకుండా, దొంగల , స్వార్ధపరుల పాలు కాకుండా పర్ఫెక్టుగా అమలు జరిపే పద్ధతి కూడా కూర్గువారే కనిపెట్టారు. కనుక ఆ సొమ్ము ఏమవుతుందనే భయం అక్కర్లేదు. మనమూ మన కోసం అటువంటి మూలనిధిని అమర్చుకుంటే, మరణం సంభవించినప్పుడు నూటికి నలభై రూపాయలకి డబ్బు వడ్డీకి తెచ్చుకోనక్కర్లేదు. జీవితాంతం ‘అసలు’ని కట్టలేక ఇల్లు బళ్ళూ గుల్ల చేసుకోనక్కర్లేదు. సరే, ఆ విషయాలనీ చక్కగా వివరించే మూలనిధిని కలెక్ట్ చేద్దాం. ముందు యీ ఎనిమిది గ్రూపులూ, వాటి పనితీరు గురించి చక్కగా చర్చించుకుందాం. ఒక్కడో, లేక కొందరో ఏమీ చెయ్యలేరు. అందరం సంఘటితమైతే మనం చెయ్యలెని పనే లోకంలో వుండదు” స్థిరంగా అనంది మాధవి.
“అందరం సమ్మతిస్తున్నాం. మీరెం చెప్పినా మాకు సమ్మతమె” అని అందరూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఆ సమావేశం జరిగింది రిక్షాలు పార్కు చేసే జండా చెట్టు కింద. అక్కడికక్కడే గా.మో.క సమిష్టి సహకార సంఘం ఏర్పాటయింది. అధ్యక్షుడిగా బోసుబాబు, కార్యదర్శిగా మాధవి, కార్యకర్తలుగా స్థానికుల్లో కొంతమంది ఎన్నుకోబడ్డారు. ఎనిమిది గ్రూపులకీ సభ్యులుగానూ, గ్రూప్ హెడ్స్ గానూ, సలహాదార్లుగానొనొ ఎవరెవర్ని నియమించాలో కూడా నిర్ణయమైంది. ఒక కొత్త వుత్సాహంతో ఆ సభలో పాల్గొన్న అందరూ సభ పూర్తయ్యాక తమ ఆనందాన్ని వ్యక్తం చేయడమే కాక రాబోయే కాలాన్ని నేడే స్వాగతించామని ఆనందించారు.
బోసుబాబు మనసునిండా కొత్త వుత్సాహం. వారానికోసారి జరిగే సమావేశాల్లో శోభ కూడా పాల్గొంటుంది. అదో మంచి అవకాశం. ఆమెతో చనువు పెంచుకోవడానికి.
మాధవి మనసులో ఆనందం. నిర్లిప్తంగా గడుపుతున్న జీవితానికి, నిర్మాణాత్మకంగా గడిపే అవకాశం వచ్చిందని.
గుడిసెవాసుల్లో ఆనందం. మాధవి చెప్పినట్టు పురిటి ఖర్చు, చదువు ఖర్చు, పెళ్ళి ఖర్చు, అంత్యక్రియల ఖర్చు సంఘమే భరిస్తే జీవితం అద్భుతంగా వుంటుందనీ, తమ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా వుంటుందనీ.
కానీ, ఇన్ని ఆనందాల మధ్య కాలిపోతున్న మనసు కూడా ఒకటి వుంది. ఆ మనసు మేరీ టీచర్‌ది. పైకి ఆనందంగా చప్పట్లు చరిచి అభినందించినా, లోపల మాత్రం శోభ గురించీ, ఆమెకి ఇతరులు ఇస్తున్న ఇంపార్టెన్స్ గురించీ అసూయతో మాడిపోతోంది. బోసుబాబు శోభ వంక చూసే చూపుల్లోనే అతని ఇష్టాన్నీ, ప్రేమనీ మేరీ టీచర్ గుర్తించగలిగింది. అందుకే అనంతమైన అసూయతో రగిలిపోతోంది.
ఎవరిమీదైనా సరే కోపగించుకోవాలంటే కారణం వుండాలి. ఎవరి మీదైనా మన మదం చూపాలన్నా, లోభాన్ని చూపాలన్నా కూడా కారణాలు వుంటాయి. అసూయపడటానికి మాత్రం కారణం ఉండక్కర్లేదు. ఎవరు ఎవరిమీదైనా అసూయతో దహించుకుపోవచ్చు. అసలు వాళ్లెవరైనా సరే మాంకి పరిచయం లేకపోయినా సరే, అసూయ మాత్రం ఏమాత్రం సందేహం లేకుండా మనసులో చొరబడుతుంది. ఒక్కసారి అసూయ అనే అగ్ని మనసు అనే కట్టెని అంటుకున్నాక, అది పూర్తిగా దహించకుండా మాత్రం వదిలిపెట్టదు.
సమావేశం అయిన అరగంటలో గుడిసెల సిటీలో జరిగిన ప్రతి మాటా, ప్రతీ నిర్ణయమూ కూడా శామ్యూల్ రెడ్డికి చేరిపోయాయి. మేరీ టీచర్ అనే ప్రత్యక్ష సాక్షి ద్వారా.
“గుడ్. మేరీ. యూ ఆర్ సో గ్రేట్ ఎండ్ లవ్లీ. ఏదో ఓ గ్రూపులో చేరి నువ్వూ సభ్యత్వం దక్కించుకో. ప్రతి సమావేశంలోనూ ఏం జరుగుతుందో ఇలాగే నాకు కబురందించు. అన్నట్లు రేపట్నించీ నిన్ను వైస్ చైర్మన్‌గా ప్రమోట్ చేస్తున్నా” అన్నాడు శామ్యూల్ రెడ్డి.
సంఘమిత్ర సుదీర్ఘంగా నిట్టూర్చింది. గుడిసెల సిటీలో జరుగుతున్న వ్యవహారాలన్నింటినీ ఆమె చాలా విపులంగా సెకరించింది. ఇప్పుడే మాధవి ఇంట్లో ఫైర్ పెట్టినవారు ఎవరో తెలిస్తే, స్పష్టంగా గుర్తించగలిగితే డబ్బుని ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు పిండుకోవచ్చు. పరాగం అన్నట్టు బూమెరాంగ్‌ని సరైన వ్యక్తి వైపు గురి చూసి విసరాలి. గాఢంగా ఆలోచనలో పడింది సంఘమిత్ర.
*****
వెంకటస్వామి అలజడిగా తిరుగుతున్నాడు. వారం నించీ పరమశివంగాడి జాడ లేదు. అంటే వాడు ఏదో అతి క్రూరమైన ఆలోచనలో వున్నట్టే లెక్క . కేరళ వెళ్ళిపోవడానికి సన్నాహాలు మొదలెట్టాడు. రాత్రికి రాత్రే హోటల్ ఓనర్ కావాలనీ, మహాదేవన్ కూతురిని నగలతో సహా లేపుకుపోతే తన కలలన్నీ ఫలిస్తాయనీ కంటున్న కలలు పగటి కలలు కాబోతున్నాయని అతనికి అనిపిస్తోంది. ఒక్క విషయం మాత్రం నిజం, ఏది జరిగినా ఏమి చేసినా పరమశివంలా కిరాతకంగా చెయ్యకూడదు అని మాత్రం నిశ్చయించుకున్నాడు. నవనీతం కనిపించి కూడా నెలన్నర దాటింది. అసలామెకి ఏమయిందో కూడా తెలీలేదు. ఒకవేళ పరమశివంగాడు ఆమెని ఏమైనా లేపేశాడా? ఒక్కసారి వెంకటస్వామి ఒళ్ళు భయంతో జలదరించింది. రాత్రి ఏడయింది. ఎనిమిదింపావుకి ఖచ్చితంగా గాడిపొయ్యి ఆర్పుతాదు వెంకటస్వామి. అది మహాదేవన్ ఆజ్ఞ. మహాదేవన్ తల్లి కూడా రాత్రి ఎనిమిదింపావుకి పొయ్యి ఆర్పేసేదిట. ఆర్పే ముందు నెయ్యి, ఫ్రెష్‌గా వండిన కొంత అన్నమూ, బెల్లమూ పాలు కలిపి పరమాన్నం కలిపి. ఆ పరమాన్నాని అగ్నిలో వేసి అది పూర్తిగా ఆహుతయ్యాక మంటలు ఆర్పేసేదట. మహదేవన్ అదే ఫాలో అవుతున్నాడు. వెంకటస్వామి వచ్చాక ఆ పనిని అతనికి అప్పజెప్పాడు. అదీ శంఖుచక్రపురం వెళ్లి వచ్చాక. ఆలోచనలతో మరో అరగంట గడిచింది. నెయ్యి, బెల్లం, అన్నం పాలూ తీసుకుని గాడిపొయ్యి దగ్గరికొచ్చాడు వెంకటస్వామి. “ఒరే వెంకటస్వామీ, ఇవ్వాళ మా అమ్మ గుర్తుకొస్తుందిరా. ఇవ్వాళ అగ్నికి నేనే నివేదన చేస్తా. నువ్వు విశ్రాంతి తీసుకో” వెంకటస్వామి చేతిలోంచి ఆ వస్తువులని తీసుకుంటూ అన్నాడు మహదేవన్.
“నందినీ ఇలా రామ్మా” పిలిచాడు మహదేవన్. వచ్చి పక్కన కూర్చుంది నందిని. “కరళే (హృదయమా) నిన్ను నా గుండెల మీద పెంచుకున్నాను. మీ అమ్మ పోయాక నా సర్వస్వం నువ్వే అయ్యావు. తల్లి లేని లోటు తప్ప నీకే లోటూ రానివ్వలేదు. తల్లీ, ఆ పరమశివంగాడు మన దూరపు చుట్టం. వాడిని నీకిచ్చి పెళ్లి చేద్దామనుకున్నా. అన్నపూర్ణ తల్లి అనుగ్రహం వల్ల వాడి అసలు రూపు బయటపడింది. పరమ కిరాతకుడు వాడు. ఎలాగో ఆ దరిద్రం వదిలింది. ఎవరికో చెడు చెయ్యబోతే భగవంతుడు వాడ్ని శిక్షించాడు. దాంతో వాడి మతి భ్రమించి మాట పోయిందిట. ఈ విషయం వెంకటస్వామి చెప్పాడు. అమ్మాయ్.. నీ తండ్రి నెమ్మదస్తుడేగానీ అమాయకుడు కాదు. యీ వెంకటస్వామి సామాన్యుడు కాదు. నిన్ను నా దగ్గర్నించి దూరం చేసి నీ నగలు కాజెయ్యాలని వీడి ఆలోచన. వాడికెలా బుద్ధి చెప్పాలో నేను ఆలోచించే వుంచాను. వీడినించి నిన్ను కాపాడాలంటే నిన్ను ఇక్కడ్నించి వేరే చోటికి తీసుకుపోవాలి. ఆ ప్రయత్నాలూ చేసి వుంచాను. అమ్మా. నిన్ను ముగ్గులోకి దింపాలని వీడు చేసిన ప్రయత్నాలన్నీ నేను గమనించినా గమనించనట్టుగా వున్నాను. తల్లీ… నేను నీ తండ్రిని. నిన్నో అయ్య చేతిలో పెట్టడం నీకు శాశ్వత రక్షణ కల్పించడం నాకు ఏకైక బాధ్యత. మరో వారంలొ మనం వేరే చోటికి వెళ్లిపోతున్నాం. జాగ్రత్తగా ఉండు. వీడు ఎన్ని మాటలు చెప్పి నిన్ను నమ్మించాలని చూసినా నమ్మకు. సరేనా” నందినిని దగ్గరగా తీసుకుని మెల్లగా తన మనసులొని మాటని చెప్పాడు మహదేవన్. “అలాగే నాన్నా!” ఓ క్షణం అవాక్కై ఆ తరవాత అన్నది నందిని. వెంకటస్వామిని తండ్రి ఇంతగా గమనిస్తాడని ఆమె వూహకి కూడా అందలేదు. వెంకటస్వామి నగలు తీసుకుని పారిపోదాం అనడమూ ఆమె మర్చిపోలేదు. “వెళ్లు .. విశ్రాంతి తీసుకో” అని నందినిని లోపలికి పంపాదు మహదేవన్.
“తల్లీ అన్నపూర్ణా నీకు వందనం. ఈ జన్మంతా నీకు సేవ చేసుకునే భాగ్యాన్నిచ్చావు. తల్లీ అన్నపూర్ణా.. యీ వాహనునితో యీ పాయసాన్ని నీకు అర్పిస్తున్నానమ్మా. మమ్ము కాపాడు.. లోకాస్సమస్తా సుఖినోభవంతు” అని ప్రార్థిస్తూ పొయ్యి ఆర్పాడు. ఆ నిశ్శబ్దంలో ఎవరో ఓ చాకుని విసిరిన శబ్దం. వెనువెంటనే ప్రాణాలు గాలిలో కలిసేట్టు రెండు ఆర్తనాదాలు..

మళ్లీ కలుద్దాం
భువనచంద్ర.

1 thought on “మాయానగరం 45

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *