April 28, 2024

సుభద్ర జోషి

రచన: అంబడిపూడి శ్యామసుందరరావు

భారతరత్న, మాజీ ప్రధాని, ఉత్తమ పార్లమెంటేరియన్ గా పేరెన్నికగన్న అటల్ బిహారీ వాజపేయి 10సార్లు లోక్ సభకు , రెండుసార్లు రాజ్యసభకు ఎన్నిక అయిన వ్యక్తి. అటువంటి రికార్డులు సృష్టించిన, ప్రజాదరణ పొందిన, అన్ని పార్టీల నుండి ప్రశంసలు పొందిన మహా రాజకీయవేత్త 1962 లోక్సభ ఎన్నికలలో అయన సుభద్ర జోషి అనే మహిళా చేతిలో ఓటమిని చవి చూడవలసి వచ్చింది రాజకీయాలలో ముఖ్యముగా ఎన్నికలలో గెలుపు ఓటములు సహజము. పెద్దపెద్ద నాయకులు అనూహ్యమైన రీతిలో ఒక్కొక్కసారి ఎన్నికలలో అంత ప్రాముఖ్యత లేని వారిచేతిలో ఓడిపోతుంటారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఒకసారి రాజనారాయణ్ అనే వ్యక్తి చేతిలో ఓడిపోయింది. ఇలాంటి సంఘటనలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి ప్రస్తుతము వాజపేయిని ఓడించిన సుభద్ర జోషి ని గురించి తెలుసుకుందాము.
సుభద్రజోషి 1951, 1957 లో పార్లమెంట్‍కు జరిగిన ఎన్నికలలో కర్నాల్, అంబాల నియోజక వర్గాల నుండి పోటీచేసి గెలిచింది. 1962లో ఈవిడను ఉత్తర్ప్రదేశ్లోని బల్రామ్ పూర్ నియాజక వర్గము నుండి వాజపేయి పై కాంగ్రస్ పార్టీ తరుఫున నిలబెట్టారు. ఆ ఎన్నికలలో ఆవిడకు మద్దతుగా ప్రముఖ సినీ నటుడు బల్రాజ్ సహానీ ప్రచారములో పాల్గొని ఆవిడ గెలవటానికి తోడ్పడ్డాడు. సుభద్ర జోషి రాజకీయ వారసత్వము మాత్రమే కాకుండా వాజపేయి ని ఓడించటానికి తోడ్పడ్డ పరిస్తుతులు రాజకీయాలలో ఆవిడ తనదైన ముద్ర మొదలైనవి తెలుసుకుందాము.
ప్రస్తుతము పాకిస్తాన్‍లో ఉన్న సియాల్ కోట్ లో మార్చ్ 23, 1919లో సుభద్ర జోషి జన్మించింది. పొలిటికల్ సైన్సెస్ లో తన మాస్టర్ డిగ్రీని లాహోర్ లోని ఫోర్మన్ క్రిస్టియన్ కాలేజీ నుండి పొందింది. ఆ కాలములోనే ఆవిడ మొదటిసారిగా స్వతంత్ర ఉద్యమములో పాల్గొంది. మహాత్మాగాంధీ ఆశయాలు ఆవిడపై మంచి ప్రభావాన్ని చూపి ఆవిడను స్వతంత్ర పోరాటం వైపు నడిపించాయి. కాలేజీ విద్యార్ధినిగా ఆవిడ వార్ధాలోని ఆశ్రమములో మొదటిసారిగా మహాత్మాగాంధీని కలిసింది. 1942 లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమములో మరొక ఫ్రీడమ్ ఫైటర్ అయినా అరుణ అసఫ్ అలీతో కలిసి పాల్గొంది. క్విట్ ఇండియా ఉద్యమము జరిగేటప్పుడు అజ్ఞాతములో ఉంది. హమారా సంగ్రామ్ అనే యాంటీ కాలోనియల్ పత్రికకు ఎడిటింగ్ భాద్యతలు నిర్వర్తించింది. అందుచేతనే బ్రిటిష్ ప్రభుత్వము ఆవిడను అరెస్ట్ చేసి లాహోర్ లోని స్త్రీల సెంట్రల్ జైలు లో నిర్బంధించారు. జైలు నుండి బయటకు వచ్చినప్పుడు పారిశ్రామిక కార్మికుల హక్కుల కోసము పోరాటం ప్రారంభించింది. దేశ విభజన టైములో ఆవిడ నిర్వర్తించిన పాత్ర ఆవిడకు జన బాహుళ్యములో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
హింస బాగా పెచ్చు పెరిగిన ఆ రోజుల్లో సుభద్రజోషి ఢిల్లీలోని బిర్లా హౌస్ లో గాంధీని కలిసినప్పుడు అయన ఢిల్లీలో జరుగుతున్న హింస పట్ల ఆందోళన తెలియజేసి కాంగ్రెస్ వాలంటీర్లు ఏమిచేస్తున్నారు అని ప్రశ్నిస్తే అయన సలహా మేరకు శాంతి దళ్ను స్థాపించి, ఇంటింటికి తిరిగి శాంతి కోసము ప్రయత్నిస్తూ ఇరువర్గాల మధ్య సఖ్యతకు కృషి చేసింది. ఈ విషయాన్ని సుభద్ర ప్రముఖ చరిత్రకారుడు సాగరి చబ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేసింది. అంతేకాకుండా పాకిస్తాన్ నుంచి వలస వచ్చే వారికి పునరావాస కేంద్రాలను ఏర్పరచి మతాలతో సంబంధము లేకుండా సేవ చేసింది. సెక్యులరిజం ఆవిడ రాజకీయలలో ముఖ్యపాత్ర వహించింది
స్వాతంత్రము వచ్చినాక కూడా జరిగిన మత ఘర్షణలలో ఆవిడ చురుకుగా పాల్గొని వాటిని అదుపు చేయగలిగింది. ఉదాహరణకు 1961లో ఆవిడ నివసించే మధ్యప్రదేశ్ లోని సాగర్ పట్టణములో జరిగిన మత కలహాలలో స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టింది. మత తత్వ శక్తులకు వ్యతిరేకముగా పని చేయటానికి ఆవిడ సాంప్రదాయకత విరోధి కమిటీని ఏర్పాటుచేసింది. తరువాత 1971లో క్వామి ఏక్తా ట్రస్ట్ ఏర్పాటు చేయటములో ప్రముఖ పాత్ర వహించింది. ఈ సంస్థ ద్వారా భారతదేశములోని ప్రజలలో సెక్యులరిజం, పర మత సహనము పెంచటం ఆవిడ ప్రధాన ఉద్దేశ్యము. పార్లమెంటేరియన్ గా ఆవిడ పాత్ర భారతదేశ రాజకీయాలలో చాలా ప్రభావాన్ని చూపింది. బైగామి చట్టము (భర్త నేరము చేసినప్పుడు స్త్రీ ఈ లిటిగేషన్ లో డబ్బు ఖర్చు పెట్టటములో ఎదుర్కొనే ఇబ్బందులుతొలగించటానికి) ప్రయివేట్ మెంబెర్ బిల్ ప్రవేశపెట్టింది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ పై చర్చ జరుగుతున్నప్పుడు తన గళాన్ని విప్పిఆమోదం పొందేటట్లు చేసింది. బ్యాంకుల జాతీయము, రాజా భరణాల రద్దు వంటి బిల్లులపై కూడా వాదించి ఆమోదం పొందేటట్లు చేసింది.
క్రిమినల్ ప్రోసిజర్ కోడ్‍కు సవరణలను ప్రతిపాదించి మతకలహాలు తీవ్ర నేరంగా పరిగణించేటట్లు బిల్ లో చేర్చింది. ఈ విధముగా ఆవిడ జీవితమూ అంతా మత తత్వానికి వ్యతిరేకముగా పోరాడింది. ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు తుర్కమెన్ గేట్ వద్ద బుల్ డోజర్లకు ఎదురు నిలిచి తన అసమ్మతిని తెలియజేసింది. ఆ సమయములో ఆవిడ ఢిల్లీలోని చాందిని చౌక్ నియోజక వర్గం ఎంపీ ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ ప్రతి చర్యను వ్యతిరేకించేది. ఆవిడ దృష్టిలో సంజయ్ గాంధీ ఒక మూర్ఖుడు. అన్నిటి కన్నా యాంటీ ముస్లిం ఇందిరాగాంధీతో సత్ సంభందాలు ఉన్నప్పటికీ అత్యవసర పరిష్టిలో జరిగిన దారుణాలపై నిర్భయముగా గళము విప్పింది.1984లో సిక్కుల ఉచకోతపై తన సొంత పార్టీ పైననే విమర్శలు చేసి పోలీసుల పాత్రను ప్రశ్నించింది. సిక్కులను పరామర్శించటానికి అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్ళింది.
ఈవిడ రష్యా ఏజెంట్ అని విమర్శ ఉండేది. ఆవిడ కుటుంబసభ్యులు, స్నేహితులు ఈ విమర్శను ఖండించేవారు. అత్యవసర పరిస్థితి, ఇందిరాగాంధీ మరణానంతరము ఆవిడ రాజకీయాలకు దూరముగా ఉండి 2003లో చనిపోయింది. ఆవిడ జయంతి సందర్భముగా ఆవిడ గౌరవార్థము పోస్టల్ స్టాంప్ను ప్రభుత్వము విడుదల చేసింది ఆ విధంగా సుభద్ర జోషి భారత రాజకీయాలలో సెక్యులర్ వాదిగా మంచి పేరు తెచ్చుకొంది .

1 thought on “సుభద్ర జోషి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *