రచన: సూర్యదేవర రామ్మోహనరావు
– See more at: http://magazine.maalika.org/2014/02/01/%e0%b0%b8%e0%b0%82%e0%b0%ad%e0%b0%b5%e0%b0%82-9/#sthash.NtQuInVL.dpuf
సైంటిస్టులందరూ కళ్లార్పకుండా కంప్యూటరు మానిటర్స్ వైపు చూస్తున్నారు.
విశ్వంభరరావు ప్రతి అవయవం కదలికలను నిశితంగా పరిశీలిస్తోంది విజేత.
వన్..టు…త్రీ…ఫోర్…ఫైఫ్….సిక్స్…. సెవెన్… హార్ట్ బీట్ను అబ్జర్వ్ చేస్తోందామె.
పక్కనున్న చార్ట్ను తీసుకుని, అందులో వున్న ఒక్కొక్క పాయింటు దగ్గర మార్కు చేస్తోందామె.
నర్వ్స్ సిస్టమ్ ఓ.కె…
ఆక్సిజెన్ ఫ్లో ఓ.కె….
సిస్టమ్ ఆఫ్ ది బాడీ.. ఇంటర్నల్ పార్ట్స్ ఓ.కె…
మూవ్మెంట్స్ ఆఫ్ ది బాడీ.. నాట్ నెససరీ…
బ్రీతింగ్ కెపాసిటీ.. నాట్ నార్మల్.. సమ్థింగ్ డిఫికల్ట్.. రెస్పిరేటరీ ప్రాబ్లమ్.. బ్రెయిన్ సిస్టమ్.
చార్ట్లోని ఆ పదాన్ని చూసి, కంప్యూటరు వైపు చూసింది.
బ్రేయిన్కి కనెక్ట్ చేసిన కంప్యూటరు బీప్ బీప్ అనే సౌండ్ తప్ప మరో సౌండ్ రావడం లేదు. స్క్రీన్ మీద కనిపిస్తున్న దృశ్యంలో క్లారిటీ లేదు.
ప్రస్తుతం బ్రెయిన్ వర్కింగ్ సిస్టమ్ కన్నా ముఖ్యం హార్ట్ వర్కింగ్ సిస్టమ్.
అందుకే.. హార్ట్ పార్ట్స్ని నిశితంగా, కన్నార్పకుండా అబ్జర్వ్ చేస్తోంది.
సరిగ్గా…
అదే టైమ్లో….
* * * * *
విశ్వంభరరావు కనురెప్పలు నెమ్మదిగా కదలాడడం మొదలెట్టాయి,
రెండే రెండు సెకన్లో ఆ కనురెప్పలు పైకిలేచాయి.
సంభ్రమంగా ఆ రెప్పలవైపు చూస్తోంది విజేత.
అదే సమయంలో ఒక కంప్యూటరు స్క్రీన్ మీద బ్లూ, వైట్ కలర్లోని గీతలు మాయమైపోయాయి.
సరిగ్గా అదే సమయంలో…
భారంగా వినిపిస్తున్న గాలి శబ్దం… ఆ శబ్దం.. నాసికా రంధ్రాల్లోంచి వస్తోందని ఆమె వెంటనే పసికట్టింది.
భయపడుతూనే ఆర్ట్ఫిషియల్ రెస్పిరేటరీ చానల్ని తీసి వేసింది అయినా రెస్పిరేటరీ సిస్టమ్ నిశ్శబ్దంగా పనిచేసుకుపోతోంది.
గ్లౌవ్స్ తొడుకున్న ఆమె కుడిచేతి వేళ్లని విశ్వంబరరావు హార్ట్ మీద ఆనించింది.
స్పర్శ… జీవస్పర్శ…
గాలి పూర్తిగా స్తంభించిపోయిన ప్రదేశంలో ఇసకలోంచి వస్తున్న వింత శబ్దం.
ఆ శబ్దం.. హృదయంలో చలన ప్రక్రియకు సంకేతం.
క్రయోనిక్గా మారిన విశ్వంభరరావు పేరు Vz.
Vz కళ్లిపాడు. అయోమయంగా, అర్థంకాని రీతిలో, భావరహితంగా చూస్తుండిపోయారు విశ్వంభరరావు.
* * * * *
“హల్లో.. హల్లో..” విశ్వంభరరావు చెవి దగ్గర నోటిని ఆనించి పిలుస్తోంది విజేత.
సూటిగా రూఫ్ వైపు చూస్తున్నాడు విశ్వంభరరావు.
“డూ యూ హియర్ మీ సర్. వింటున్నారా? నా మాటలు వినబడుతున్నాయా?” వాయిస్ను నెమ్మదిగా హెచ్చిస్తూ మాట్లాడుతోంది విజేత.
ఆ మాటలు ఆ క్యూబిక్లో ప్రతిధ్వనిస్తున్నాయి.
దూరం నుంచి ఆ దృశ్యాన్ని సవ్యసాచి, తదితరులు వూపిరి బిగబట్టి పరిశీలిస్తున్నారు.
“మిస్టర్ రావ్…. కళ్ళు మూసి తెరవగలరా?”
“కళ్ళు మూసి తెరవగలరా… మిస్టర్ రావి” కొన్ని సంజ్ఞలు చేస్తూ అడిగిందామె.
తన సంజ్ఞలు, తన మాటలు విశ్వంభరరావుకి అందడం లేదని రూఢి చేసుకున్న మరుక్షణం-
మోటార్ సిస్టమ్ స్పీడ్ను పెంచింది. బ్రెయిన్కి కనెక్ట్ చేసిన వైర్లలోంచి నెర్వ్ సిస్టమ్ని కుదుటపరిచే ప్రక్రియ అది.
టోటల్ బాడీని స్కాన్ చేసి,క్ టెస్ట్ చేసిందామె.
ఎక్కడా లోపం కన్పించడంలేదు.
కంప్యూటర్స్ యధాతధంగా పనిచేస్తూనే వున్నాయి.
“మిస్టర్.. రావ్… చేతుల్ని, కాళ్ళని నెమ్మదింగా కదపగలలా?”
అయినా నో రెస్పాన్స్, విశ్వంభరరావులో కదలిక లేదు.
అంతవరకూ ఉత్సాహంగా వున్న విజేత ముఖం ఒక్కసారిగా మ్లానమై పోయింది.
విశ్వంభరరావు చేతిని పట్టుకుని నాడిని చూసింది. క్వయిట్ ఓ.కె. ఓ పాజిటివ్ బ్లడ్ బాటిల్ ఒక్కొక్కటీ ఖాళీ అవుతోంది.
బాడీలోని ఫ్లాని కనుక్కోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది డా!!విజేత.
అయిదు నిమిషాలసేపు అక్కడుండి తన చాంబర్లోకి వచ్చేశాడు డా!!సవ్యసాచి.
* * * * *
సరిగ్గా అయిదు నిమిషాల క్రితమే అమెరికా నుంచి డా!!స్టీఫెన్ హారీస్ రాసిన లెటర్ వచ్చింది.
ఆ లెటర్ని ఆత్రంగా విప్పాడు సవ్యసాచి.
“మైడియర్ ఫ్రెండ్! క్రయోనిక్స్ ఉద్యమానికి సంబంధించిన మీరు మీ సభ్యులు చేస్తున్న కృషికి మా అభినందనలు. మీరు పంపిన క్యాసెట్ను డా!!మార్క్ మార్టిన్, హగ్హక్సన్ తదితర క్రయోబయాలజీ సైంటిస్టులు చూశారు. ప్రయోగాలు ఒకెత్తు – ప్రయోగాలను ప్రపంచ వ్యాప్తం చేయడము ఇంకొక ఎత్తు. ఇండియాలాంటి అధ్యాత్మిక దేశంలో సైన్సు పరిశోధనల్ని నమ్మించడం అంత తేలికయిన విషయం కాదు. మీరు నిజంగా శవాన్ని బ్రతికించి మనిషిగా చేసినా అక్కడి సొసైటీని మీరు నమ్మించలేరు.
అందువల్ల మీరు ఫోన్లో మనిద్దరి మధ్య జరిగిన చర్చల ప్రకారం విశ్వంభరరావుని క్రయోనిక్స్ నుంచి మనిషిగా చేసే పక్షంలో ఆ ప్రయత్నము సఫలీకృతం కావాలని కోరుకుంటాను. విశ్వంభరరావుని అమెరికా తీసుకురావటానికి వీలవుతుందా?
మృత్యువును సవాల్ చేసే మన ఉద్యమాన్ని, ఉద్యమ ఫలితాన్ని అమెరికా వేదికగా మనం ప్రపంచానికి తెలియజేయడం సముచితంగా వుంటుంది. అందుకు ఎలాంటి ఏర్పాట్లనయినా రహస్యంగా మీకు అందజేయడానికి సిద్ధంగా వున్నాం.
మీ పరిశోధనా ఫలితాల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న మీ-స్టీవెన్ హారిస్.”
మళ్ళీ రెండోసారి ఆ వుత్తరాన్ని చదివాడు సవ్యసాచి.
డా!!స్టీఫెన్ హారిస్ చెప్పిన విషయం గురించి సీరియస్గా ఆలోచించాడతను.
విశ్వంభరరావు బ్రతికాక ఏం చేయాలి అన్న ప్రశ్నకు జవాబు దొరికినట్టయ్యింది. ఏం విషయమై సభ్యుల్తో చర్చించాలని నిర్ణయించుకున్నాడు డా!!సవ్యసాచి.
* * * * *
న్యూఢిల్లీ.. హర్యానా రోడ్ ఫారమ్హౌస్లోని వీరేంద్ర అజనీష్ ఎదుట విచార వచనాలతో కూర్చున్నారు ప్రధాని ప్రతాప్సింగ్, పార్టీ అధ్యక్షుడు అర్జున్ చౌహన్.
వీరేంద్ర అజనీష్ పేల్చిన బాంబు వాళ్లిద్దరి మొదళ్ళను తునాతునకలు చేసేసింది. వాళ్ళ గుండెల్లో బాంబుల్ని పేల్చింది.
“ప్రధాని విశ్వంభరరావుని బ్రతికించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా?” రెండు నిమిషాల తర్వాత అయోమయంగా అన్నాడు ప్రధాని ప్రతాప్సింగ్.
“నేను నమ్మను. ఎవరో మీతో ఆట్లాడుతున్నారు” అర్జున్ చౌహాన్ షాక్ నుంచి తేరుకుంటూ అన్నాడు.
పిచ్చివాళ్ళను చూసి మెంటల్ డాక్టరు నవ్వినట్టుగా వాళ్ళిద్దర్నీ చూసి నవ్వాడు అజనీష్.
“మిస్టర్ ప్రతాప్సింగ్! ఇది మీరు ఆడుతున్న నేషనల్ పొలిటికల్ ప్లే కాదు. యూనివర్సల్ సైన్స్ ప్లే… నమ్మక తప్పదు.. అమెరికాలో నాకున్న లింక్స్ ఎపుడూ నను మిస్లీడ్ చెయ్యవు. ఒక్కసారి జరిగిందంతా గుర్తుకు తెచ్చుకోండి. జరగబోయేదేమిటో నేను చెప్తాను.”
లోతైన నిశ్శబ్దం అలుముకుందక్కడ కొద్ది క్షణాలు.
అర్జున్ చౌహాన్ వంట్లో చిన్న వణుకు పుట్టింది. శాయశక్తులా కంట్రోల్ చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాడతను.
“జరగబోయే దేమిటి?” తడబడుతూ అడిగాడు ప్రతాప్సింగ్.
“విశ్వంభరరావు బ్రతకడం – బ్రతికొచ్చిన ఆయన్ని ఏం చేయాలో తెల్సు. ఈ ఇద్దర్నీ చీమను నలిపేసినట్టు నలిపేస్తాడు. అసలే మొండివాడు, మళ్ళీ యౌవనంతో వస్తున్నవాడు ఈ రాజకీయాల్ని ప్రక్షాళన చేసే ప్రోగ్రాం మొదలెడతాడు. మహా మంత్రులుగా, ఇండస్ట్రయిలిస్టుగా, బ్రోకర్లుగా చెలామణీ అవుతున్న మీ వర్గాన్ని పూర్తిగా నాశనం చేసేవరకూ నిద్రపోడు” ఒక్కొక్క పదాన్ని ఆచి తూచి అంటున్న అతని కళ్ళల్లోకి ప్రాణభయంతో చూశారు వాళ్ళిద్దరూ.
గబుక్కున ఇద్దరూ కాళ్ళమీద పడిపోయారు.
“గురూజీ! మా వర్గం మీ వర్గం కాదా గురూజీ! మమ్మల్ని ఏం చేస్తారో మీ ఇష్టం.. ఏం చేయమంటారో మీ ఇష్టం.”
ఆ మాటలకు చిద్విలాసంగా నవ్వాడు వీరేంద్ర అజనీష్.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు! స్వామికార్యం, స్వకార్యం జరిపించడంలో ఆరితేరిన దిట్టయిన అజనీష్-
ఒక్కక్షణం కళ్ళు మూసుకున్నాడు.
ఈ దేశంలో మతం చాటున దైవభక్తి, మూఢ విశ్వాసాలు, అంధ విశ్వాసాలు, బాబాలు, స్వాముల మీద నమ్మకాలు పది కాలపాటు బ్రతకాలంటే అలాంటి ఉద్యమాల్ని సమూలంగా నాశనం చేసెయ్యాలి.
తన ఆధ్వర్యంలో ఆ సైన్సు ఉద్యమం మెద దాడి జరిగితే మతాచార్యులు, పీఠాధిపతుల మీదకు ఆ నేరం వస్తుంది. కొన్ని బలమైన వర్గాలకు తాము దూరం కావల్సి వస్తుంది. సో….
ప్రభుత్వం వేలితో ప్రయోగాల కనుగుడ్లను కూకటి వ్రేళ్ళతో తీసేయాలి.
అందుకు కృషి చేస్తున్న ఆ సైంటిస్టుల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్పించేస్తాడు. ఆ లేబరేటరీని ధ్వంసం చేయించేస్తాడు. అంతా రహస్యంగా జరిగి పోతుంది.
చిద్విలాసంగా నవ్వాడు వీరెంద్ర అజనీష్.
“ఇపుడు పవర్ మీ చేతిలో వుంది.. అవునా?”
తలెత్తి అవునన్నట్టుగా చూశారు ఆ ఇద్దరూ.
“బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ను పిలిపించండి.. స్పెషల్ కమెండోలను పిలిపించండి.. స్పెషల్ ఆర్మ్డ్ పోలీసులకు ఎ.కె.ఫార్టీ సెవెన్లను ఇవ్వండి.. ఎ.కె.ఫిఫ్టీ సిక్స్లను ఇవ్వండి.. వారికి వుల్ పవర్స్ ఇవ్వండి చాలు..” కసిగా చెప్పాడు అజనీష్.
“వాళ్ళని ఎవరి మీదకు పంపించమంటారు?”
“మృత్యువు కెదురుగా, మానవజాతి విశ్వాసాల కెదురుగా ప్రయోగాలు చేస్తున వాళ్ళ మీదకు.”
“వాళ్ళెక్కడ వున్నారో మీకు తెలుసా?” విప్పారిన కళ్లతో, తడారి పోతున్న గొంతుతో ప్రశ్నించాడు అర్జున్ చౌహాన్.
“తెలుసు.. కొన్ని క్షణాల క్రితమే తెలుసుకున్నాను.”
“ఎక్కడ?” ఇద్దరూ ఒక్కసరిగా బెంబేలు పడుతూ అడిగారు.
“త..ల..కో…న… ఫారిస్ట్” లేచి నిలబడ్డాడు వీరేంద్ర అజనీష్.
మహా విధ్వంసానికి ఇక్కడ అంకురార్పణ జరిగిన సమయంలోనే మహా జాగృతికి తలకోన అడవుల్లో అంకురార్పణ జరుగుతోంది.
* * * * *
డా!!విజేత విశ్వంభరరవు శరీరంలోకి సర్క్యూలేట్ అవుతున్న బ్లడ్ని పరిశీలిస్తోంది.
ఆయన చేతివేళ్ళను కదిలించడానికి చూసిందామె. శరీరం స్పర్శను గుర్తిస్తోందా లేదా? అది ఆయనే నోరు తెరిచి చెప్పాలి.
“మిస్టర్ రావ్! ఇప్పుడు మీ చర్మానికి స్పర్శను తెస్తున్నాను… నొప్పిగా అనిపిస్తే కళ్ళు మూసుకుని నాకు సిగ్నల్ ఇవ్వండి” పక్కనున్న సిరంజిని అందుకుని భుజానికి నీడిల్ను గుచ్చి ఆయన కళ్ళవైపు చూసింది ఆమె.
ఆయన కళ్ళలో ఏమీ రియాక్షన్ లేదు.
పూర్తిగా డీలా పడిపోయింది విజేత.
ఎక్కడో లోపం జరిగింది. ప్రయోగమంతా సక్సెస్గా జరిగినా, మనిషి బ్రతికినా మనిషికి చలనాన్ని ఎందుకు కలిగించలేకపోతోంది తను?
ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు ఆమెకు.
“వాట్ డాక్టర్… వాట్స్ రాంగ్?” అయోమయంగా పక్కనే వున్న వంశీని ప్రశ్నించిందామె.
వంశీ పరిస్థితి కూడా అలాగే వుంది.
సరిగ్గా అదే సమయంలో-
విజేత దృష్టి ఖాళీ అవుతున్న ఆఖరి బ్లడ్ బాటిల్ మీద పడింది.
అప్పటివరకూ గమనించలేదామె.. బ్లడ్ బాటిల్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి.
మరి కావాలన్నా ఇంకో బ్లడ్ బాటిల్ లేదు.
“డామిట్! మరి బ్లడ్ బాటిల్స్ లేవా?” సీరియస్గా అడిగిందామె.
“లేవు మేడమ్! ఇదే ఆఖరి బాటిల్. ఎక్కడ ప్రత్నించినా దొరకలేదట”
“ఇపుడెలా? మరి నాకెందుకీ విషయం చెప్పలేదు?” గట్టిగా అరిచిందామె.
“మిమ్మల్ని డిస్ట్రబ్ చేయడం ఇష్టంలేక.”
“వాట్ నాన్సెన్స్! కాల్ ద సవ్యసచి ఇమ్మీడియట్లీ.. క్విక్” చెప్పి స్టెత్స్కోప్ను అందుకోబోతూ ఖాళీ అవుతున్న ఆఖరి బ్లడ్ బాటిల్వైపు చూసిన విజేత ఒక్కసారిగా షాక్ తింది.
అపటికే గబగబా బయటికెళ్ళిపోయాడు వంశీ.
ఆ బ్లడ్ బాటిల్లోని ఓ పాజిటివ్ బ్లడ్ సహజమైన బ్లడ్ కాదు.. కృత్రిమమైన రక్తం.
కృత్రిమ రక్తం.. ఒరిజినల్ బాటిల్స్లోకి కృత్రిమ రక్తం బాటిల్ ఎలా వచ్చింది?
గబ్బుక్కున కనెక్టింగ్ వైరుని కట్ చేసేసింది.
ఆ ప్రయోగానికి వాడితే పూర్తిగా ఒరిజినల్ బ్లడ్నే వాడాలి, లేదా కృత్రిమ రక్తాన్నయినా వాడాలి.. రెండూ మిక్స్ చేస్తే ఫలితాలు వేరుగా వుంటాయి.
అప్పటికి..
ట్వంటీ పర్సెంట్ కృత్రిమ రక్తం బాడీలోకి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన బ్లడ్ని నరాల్లోంచి వెనక్కి తెప్పించడానికి ‘రివర్స్ పంపింగ్ సిస్టమ్’ని ఆన్ చేసింది.
పదిహేను నిమిషాలు గడిచాయి…
శరీరానికి స్పర్శ లేకపోవడానికి, కదలికలు లేకపోవడానికి కారణమేమితో ఆమెకప్పుడు పూర్తిగా అర్థమైంది.
పూర్తిగా కృత్రిమ రక్తం బాడీలోంచి వచ్చేసింది.
అప్పుడు చర్మాన్ని నీడిల్తో పొడిచింది.
విశ్వంభరరావు బాధగా కళ్ళు మూసుకున్నాడు.
ఆ దృశ్యాన్ని చూసిన విజేత అంతకుపూర్వం అనుభవించిన బాధనంతా మరిచిపోయింది.
మనిషిలో పూర్తి కదలికలకు శక్తి కావాలంటే ఇంకో బాటిల్ బ్లడ్ అవసరం.
ఆ ప్రాబ్లమ్ను ఎలా సాల్వ్ చేయాలో ఆమెకు అర్థం కావడం లేదు.
సరిగ్గా అదే సమయంలో లోనికొచ్చాడు సవ్యసాచి.
* * * * *
తిరుపతి సిటీలో ఓ పాజిటివ్ బ్లడ్ కోసం అన్వేషణ ప్రారంభమయ్యింది.
సవ్యసాచి బెంగుళూరు వెళ్ళగా డాక్టర్ వంశీ, డాక్టర్ సమీర్, దిశ చిత్తూరు జిల్లాలోని ప్రవైట్, గవర్నమెంటు హాస్పిటల్స్లో బ్లడ్ కోసం తిరుగుతున్నారు పిచ్చెత్తినట్లుగా.
అప్పటికి మధ్యాహ్నాం రెండుగంటలు దాటింది.
* * * * *
తిరుపతి రైల్వేస్టేషన్లోంచి ఆ వ్యక్తి బయటికొచ్చాడు. నేరుగా టాక్సీస్టాండ్ వైపు నడిచాడు.
“తలకోన అడవిలోకి వస్తావా”
“ఊళ్ళోకయితే వస్తాను.. ఎక్స్ట్రా వంద రూపాయలు” టాక్సి డ్రయివర్ చెప్పాడు.
“రెండు వందలు యిస్తాను.”
ఆశ్చర్యపోతూ ఆ వ్యక్తిని గౌరవంగా కారు డోర్ తెరిచి ఆహ్వానించాడు ఆ డ్రయివరు.
సరిగ్గా గంటా ఇరవై నిమిషాలు గడిచాయి. నెరబైలు బస్టాండ్లో టాక్సీ ఆగింది.
టాక్సి ఫేర్ చెల్లించి ఆ వ్యక్తి అడవుల్లోకి నడవడం మొదలు పెట్టాడు.
సరిగ్గ ముప్పై అయిదు నిమిషాలు గడిచాయి.
* * * * *
అంతవరకూ విశ్వంభరరావు రకరకాలుగా పరీక్షించిన విజేత.. పక్కనున్న దివ్యానందస్వామి శవాన్ని వుంచిన లాభ్లోకి వెళ్ళింది.
ఆ శవం ప్రోగ్రెస్ ఆమెకు చాల సంతృప్తికరంగా వుంది. ఏ క్షణం లోనయినా దివ్యానందస్వామిలో చైతన్యం రావచ్చు.
ఆ లాబ్లోంచి బయటికొచ్చి వరండా మీద నడుస్తున విజేత.. మెట్లెక్కి వస్తున్న..
ఆ అపరిచిత వ్యక్తిని చూసి మొదట భయపడి, తర్వాత ఆశ్చర్యపోయింది.
అతనిలో బ్రహ్మ తేజస్సు!
దిగంతాల్ని తన కనుచూపుల్తో శాసించడనికి సిద్ధంగా వున్న అసాధారణమైన వ్యక్తిలా వున్నాడాయన.
“ఎవరు కావాలి?” అడిగింది విజేత ఇంగ్లీషులో,
“విశ్వంభరరావు” ఆ మాటకు షాక్ తిందామె.
“విశ్వంభరరావు కావాలా” ఎవరు మీరు?” ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదా వ్యక్తి.
“ల్యాబ్ ఎక్కడ?”
అప్రయత్నంగా లాబ్ ఎటువైపుందో చేత్తో చూపించింది.
గబగబా ముందుకు అడుగులేస్తున్నారాయన. ఆ వెనక మరబొమ్మలా అడుగులు వేసింది డా!!విజేత.
* * * * *
లాబ్లోకి అడుగుపెట్తిన ఆ వ్యక్తి విశ్వంభరరావు వైపు సూటిగా చూస్సి.. :బ్లడ్ ప్లాబ్లమా?” అని అడిగాడు.
మరోసారి ఆమె షాక్ తింది. అప్పుడామె పెదవి విప్పింది.
“ఎస్.. ఎ..స్… సార్…”
“ఢిల్లిలో జరిగిన పొరపాటు యిది. ఢిల్లీలో మర్డర్ ఎటెమ్ట్ జరిగిన టైమ్లోనే విశ్వంభరరావుకి చాలా బ్లడ్ పోయింది-ఎంత బ్లడ్ శరీరంలో నుంచి పోయిందో కాలిక్యులేట్ చేయలేకపోవడం వలన జరిగిన పొరపాటు యిది. ఆపరేషన్ చేసేముందు ఎంత బ్లడ్ కావాలో మీకు తెలీదా?”
తనకు తెలుసు. తన కాలిక్యులేట్ చేసింది. కానీ బ్లడ్ బాటిల్స్ను గమనించకపోవడం వలన ఆ పరిస్థితి ఏర్పడింది.
“ఎస్… సర్…”
“ఆ బ్లడ్ నేనిస్తాను.. తీసుకోండి… కమాన్” పక్కనే వున్న టేబుల్ వైపు నడుస్తూ అన్నాడా వ్యక్తి.
ఖాళీగా వున్న బాటిల్ను హేంగర్కు తగిలించి కనెక్టింగ్ వైరుని తనకు తగిలించమన్నట్టుగా సంజ్ఞ చేసి, టేబుల్మీద కెక్కి పడుకున్నాడు ఆయన.
డా!!విజేతలో ఎన్నెన్నో వింత ప్రశ్నలు.. ఏ ప్రశ్నకూ జవాబు లేదు విస్మయం తప్ప.
అయిదు నిమిషాల తర్వాత…
ఆ వ్యక్తి శరీరంలోని ఓ పాజిటివ్ బ్లడ్ ఖాళీ బాటిల్లోకి వెళుతోంది.
బాటిల్లోని బ్లడ్ విశ్వంభరరావు నరాల్లోకి వెళుతోంది.
15 నిమిషాలు గడిచాయి.
చిరుగాలికి చిగురుటాకులు కదిలినట్టు విశ్వంభరరావు చేతివేళ్ళు… నెమ్మదిగా కదలడం చూసిన…
డా!విజేత బెడ్మీద వున్న ఆ వ్యక్తి ముఖంలోకి చూస్తూ అడిగింది.
“మీరెవరో తెల్సుకోవచ్చా?”
“నా పేరు సత్యబ్రహ్మ” నెమ్మదిగా చెప్పాడాయన.
సరిగ్గా అదే సమయంలో…
రెండో లాబ్లో వున్న దివ్యానందస్వామిలో చలనం వచ్చింది… అయన కళ్లు విప్పి చూశాడు.
తలతిప్పి చూశాడు. తన వంటి మీద వున్న వైర్లవైపు చూశాడు. కంప్యూటర్స్, మిషన్లు, మందుల వాసన ఆయనకు చికాగ్గా వుంది.. ఆయన చాలావరకు స్పృహలోకి వచ్చేశాడు.
నెమ్మదిగా తన వంటికున్న వైర్ల కనెక్షన్లన్నీ తీసేసుకున్నాడు.. ఆపరేషన్ టేబుల్ మీదనుంచి లేచి కూర్చున్నాడు.
తన నగ్న శరీరాన్ని చూసుకోగానే.. అతను ఉన్మాదిలా నవ్వుకున్నాడు.
ఆపరేషన్ టేబుల్ మీదున్న ప్లాస్టిక్ కవర్ని తీసుకుని వంటికి చుట్టుకుని లాబ్లోంచి బయటికొచ్చాడు.
ఎక్కడా ఎవరూ లేరు… ఎదురుగా అడవి… నెమ్మదిగా నడుచుకుంటూ ఆ బిల్డింగ్ మెట్లు దిగి అడవిలోకెళ్ళిపోయాడు.
* * * * *
బెంగళూరు నుంచి తిరిగొస్తున్న సవ్యసాచి చాలా హేపీగా వున్నాడు. దానిక్కారణం ఓ పాజిటివ్ బ్లడ్ బాటిల్ దొరకడం ఒక కారణము కాగా, బెంగుళూరు నుంచి అమెరికాలో డాక్టర్ స్టీఫెన్ హారిస్తో దాదాపు ఇరవై నిమిషాలకు పైగా మాట్లాడాడతను.
విశ్వంభరరావు శవానికి చలనం వచ్చిందనగానే ఫోన్లోనే ఆనందము పట్టలేక పెద్దగా కేకపెట్టాడు స్టీఫెన్ హారీస్. వెంటనే ఇండియాకు రావడానికి ఏర్పాట్లు చేసుకుంటానని చెప్పాడు. ఆ సంఘటన విశ్వవ్యాప్తముగా తెలియజేసేందుకు ఎర్పాట్లు చేయగలనని హామీ యిస్తూ, ఆ విషయాన్నీ ఇండియాలో విజువల్ మీడియా, ప్రింట్ మీడియాలకు తెలియజేయమని ప్రెస్ కాన్ఫరెన్సుల్ని కండక్ట్ చేయమని, విశ్వంభరరావుని అందరిముందూ ప్రెజెంట్ చేయాలని ఆదేశించాడు.
డాక్టర్ స్టీఫెన్ హారిస్తో పాటు అమెరికాకు చెందిన సొసైటీ ఫర్ క్రయోలయాలజీ సంస్థ సైంటిస్టులు, మైక్ డార్విన్, సాల్కెంట్, మైక్ ఫెర్రీ, డేవిడ్ పైజర్, ఆర్థర్ మెక్ కోంబ్స్, రాల్ఫ్వెలన్, ఫ్రెడ్, లిండా చాంబర్లీన్, అమెరికన్ యూనివర్శిటీకి చెందిన కొంతమంది ప్రొఫెసర్లు, వైట్ హౌస్కు చెందిన మిడియాబీఫ్ కూడా వస్తున్నట్లు తెలిపాడు హారిస్.
ఆ అపూర్వ ప్రయోగ ఫలితం ప్రపంచానికి తెల్సిన రోజున చరిత్రలో తను సైన్సు బ్రతికున్నంత కాలం వుంటాడు!
కాదు అరవై మైళ్ళ వేగంతో కర్ణాటక బోర్డరు దాటి, ఆంధ్రా బోర్డర్లోకి ప్రవేశించింది.
ఆ టెన్షన్ను, ఆ సాటిస్ఫేక్షన్లను కంట్రోల్ చేసుకోలేక పోతున్నాడు సవ్యసాచి.
* * * * *
సవ్యసాచి ఆంధ్రా బోర్డర్లోకి ప్రవేశిస్తున్న సమయంలోనే అమెరికాలోని డా!!స్టీవెన్ హారిస్, ప్రపంచ మీడియా సామ్రాట్ స్టార్ టీ.వీ. అధినేత మర్థోక్ను సంప్రదించాడు.. బి.బి.సి. చీఫ్తో మాట్లాడాడు.
అప్పటికే సొసైటీ ఫర్ క్రయో బయాలజీ పరిశోధనల గురించి చూచాయగా విన్న మర్థోక్, బి.బి.సి.చీఫ్లు ఇండియాకు ప్రత్యేకంగా తలకోన ఫారెస్ట్కు స్పెషల్ ఫ్లైట్స్లో, స్పెషల్ ‘క్రూ’లను పంపించడానికి ఏర్పాటు చేశారు.
“ఇండియాలో చనిపోయిన మనిషిని బ్రతికించిన సైంటిస్టులు” ఆ వార్తను ముందుగా కవర్ చేయాలనే ఉద్దేశంతో బిబిసి న్యూస్ హెడ్ లైన్స్లో చెప్పి, మర్నాడు సాయంత్రం స్పెషల్ కవర్ పేజ్ వుంటుందని ఎనౌన్స్ చేసింది.
అంతే…
బిబిసి న్యూస్ చానల్ను చూసిన ప్రపంచంలోని వివిధ దేశాల మీడియా చీఫ్లు, న్యూస్ బ్రాడ్కాస్టర్స్ ఎలర్టయ్యారు.
ఆ వార్తను చాలామంది నమ్మలేకపోయినప్పటికీ, ఆ సైంటిస్టుల్ని, ఆ ప్రయోగాలనైనా ప్రపంచానికి తెలపాలనే వుద్దేశ్యంతో.. ప్రపంచ దేశాల మీడియా సెంటర్స్ చీఫ్లు.. ఇండియాకు రావడానికి సన్నాహాలు చేసుకుంటూ, అలాంటి ప్రయోగం ఎక్కడ జరిగిందో తెలుసుకోవడం కోసం ఆయా దేశాల్లోని ఎంబసీలకు ఫోను చేసి, ఎంబాసిడర్స్తో మాట్లాడటము మొదలెట్టారు.
వివిధ దేశాల్లోని ఇండియన్ ఎంబాసిడర్స్ ఆ వార్తకు మొదట విస్తుపోయి, ఆ తర్వాత వాళ్ళు ఇండియాలోని ఫారెన్స్ ఎవైర్స్ మినిస్ట్రీకి హ్యూమర్ రిసోర్స్ మినిస్ట్రీకి, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీకి ఫోన్లు వింతగా చేయడం మొదలెట్టారు.
కేబినెట్ మినిస్టర్స్తోపాటు హయ్యర్ అఫీషియల్స్కు కూడా వుంది.
స్కైలాబ్ పడినప్పుడు ఏర్పడ్డ భీతావహ సంచలనమంత సంచలనం.
చనిపోయిన మనిషిని బ్రతికించారా? ఎక్కడ?!!
దాంతో ఇండియన్ దూరదర్శన్ మేల్కొంది. దేశంలో తన టీ.వీ. సెంటర్సుకు స్పెషల్ నోట్ పంపింది.
యు.ఎస్.ఐ., పి,టి.ఐ… తదితర న్యూస్ ఏజెన్సీలన్నీ రిపోర్టర్స్కు స్పెషల్ ఎస్సయిన్మెంట్సు యిచ్చాయి.
కానీ అందరికీ ఒకటే సందేహం… ఆంధ్రప్రదేశంలో, ఆ ప్రయోగాలు జరిగేది ఎక్కడ?
ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఉదయం, ఇండియన్ ఎక్స్ప్రెస్ తదితర న్యూస్పేపర్ల న్యూస్ బ్యూరో చీఫ్లు.. తమ జిల్లాల్లోని రిపోర్టర్లకు స్పెషల్ నోట్లు పంపారు.
మీ ఏరియాలో అలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయో లేదో ఎంక్వయిరీ చేయమని.
దేశమంతా ప్రశ్నార్థకంలాంటి గందరగోళం.. ఆ గందరగోళం సమయంలో…
డా!!సవ్యసాచి మదనపల్లికి రెండు కిలోమీటర్ల దూరంలో కారు ఆపాడు. దిగి, కొంచెం దూరంలో రోడ్డు పక్కనున్న పబ్లిక్ బూత్వైపు నడిచాడు.
టెలిఫోను రిసీవర్ని అందుకుని రూపాయి నాణాన్ని వేసి, తనకు జ్ఞాపకమున్న అనంతపురం ఈనాడు నెంబరుకు ఫోను చేశాడు.
“ఇన్చార్జి ఎడిటర్… ఈనాడు ప్లీజ్.. చెప్పండి.”
“మానవ చరిత్రలో ఒక మహాద్భుతం జరిగిందనే వార్త మీకు వచ్చిందా?” అడిగాడు సవ్యసాచి.
“అయ్యబాబోయ్… నువ్వెవడివయ్యా బాబూ.. గంటలో ఇది యాభయ్యో ఫోను… ఆ వార్త నిజమో, అబద్ధమో తెలీదు కానీ.. చచ్చి పోతున్నామయ్యా బాబూ… నీకా న్యూస్ వివరాలు కావాలి. అంతేగా?” అడిగాడయన.
“లేదు.. నాకా న్యూస్ వివరాలు అక్కర్లేదు” మెల్లగా చెప్పాడు సవ్యసాచి.
“మరేం కావాలి?”
“మీ ఫస్ట్ ఎడిషన్కి డెడ్లైను ఎప్పుడు?” నవ్వుతూ అడిగాడు సవ్యసాచి.
“ఇంకో గంటన్నర.”
“అయితే బేనర్ చెప్తాను… రాసుకుంటారా?”
“నువ్వెవడివయ్యా.. బేనర్లు.. డెడ్లైన్లని పత్రికల లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు? ఇంతకీ నువ్వేం చెప్తావ్?”
“చచ్చిపోయిన మనిషి ఎక్కడ బ్రతికాడో, ఎవరు బ్రతికించారో వాళ్ళ గురించి.”
“నీకు తెలుసా!” షాక్ తింటూ అడిగాడతను.
“తెలుసు… ఎక్కడో చెప్పమంటారా?”
“చెప్పయ్యా బాబూ.. చెప్పు”
“తలకోన అడవుల్లో.”
“అడవుల్లో ఎక్కడ? అక్కడ ఆ మనిషున్నాడా? ఇంతకీ ఎవరా మనిషి?” ఉద్వేగాన్ని భరించలేకపోతున్నాడు ఇన్చార్జి ఎడిటర్.
“మనిషిని చూడాలంటే ఇంకో పన్నెండు గంటలు ఆగాలి.”
“ఇంతకీ నువ్వెవరూ?”
“ఆ మనిషిని బ్రతికించిన వాళ్ళలో ఒకడ్ని.”
“ఆఁ…” అవతలి వ్యక్తి ఢామ్మని క్రిందపడిపోయాడో, లేదో తెలీదు. సవ్యసాచి రిసీవర్ని యధాస్థానంలో పెట్టేసి వెనక్కి తిరిగాడు.
కారు తిరుపతి రైల్వేస్టేషన్ ముందు ఆగింది. అపటికే అక్కడ దిశతోపాటు, డా!!వంశీ, సమీర్ సవ్యసాచి కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ కార్లో ఎక్కాక కారు తలకోన వైపు బయలుదేరింది.
* * * * *
ప్రైమ్మినిస్టర్ ప్రతాప్సింగ్ ఆధ్వర్యంలో ఉన్న హోంమినిస్ట్రీ స్పేషల్ సెక్రటరీ రాష్ట్ర చీఫ్ మినిస్టర్కి అత్యవసర మెసేజ్ పంపారు.
తలకోన ఫారెస్టులో జరుగుతున్నట్టుగా భావిస్తున్న సామాజిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారిపై దాడి చేయాలని, అక్కడి సైంటిస్టులుగా భావిస్తున్న పిచ్చివాళ్ళను, వారి లేబరేటరీలను, ప్రయోగాలను సర్వనాశనం చేయాలని అందుకు బి.ఎస్.ఎవ్.ఆర్మీ, స్పెషల్ కమెండోలను సైతం పంపించడం జరుగుతోందని, ఇదంతా మీడియాకు తెలియకుండా రాత్రికి రాత్రి జరిగిపోవాలని, ఆ ఉత్తర్వుల సారాంశం.
ప్రైమ్మినిస్టరు స్పెషల్ ఆర్డర్స్ మేరకు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ చీఫ్, ‘రా’ అధినేత, తదితరులు స్పెషల్ ఫ్లైట్లో ఆంధ్రప్రదేశ్కు బయలుదేరారు.
* * * * *
ఈ పరిణామాలేవీ తెలియని రుషికుమార్ భారతితో సహా తిరుపతి వచ్చి, ఢిల్లీకి ఫోన్ చేసి అక్కడ పరిణామాల్ని మెహతా ద్వారా తెలుసుకుని. ఒక్క క్షణం షాక్ తిన్నాడు. ఎత్తుకు పైఎత్తు వేయాలనే నిర్ణయానికి ఆ క్షణానే వచ్చాడు. ఫోన్ మాట్లాడాక టాక్సీ కోసం టాక్సీ స్టాండ్వైపు నడిచాడు భారతితోపాటు.
సరిగ్గా అదే సమయంలో…
వారిద్దరి పక్కనుంచి ఒక టాక్సీ ముందుకెళ్ళి సర్రుమని బ్రేకుతో ఆగింది.
విండోలోంచి తల పక్కకు తిప్పి ఆ టాక్సీలోని వ్యక్తి వాళ్ళిద్దర్నీ కసిగా చూశాడు.
సరిగ్గ అదే సమయంలో…
తలకోన వెళ్లేందుకు టాక్సీని కుదిర్చాడు రుషి.
బేక్ సీట్లో ఇద్దరూ కూర్చున్నారు. టాక్సీ ముందుకు పరుగెత్తింది.
టాక్సీ వెనక రెండో టాక్సీ బయలుదేరింది.
రెండో టాక్సీలో వున్న వ్యక్తి శోభరాజ్.
* * * * *
విశ్వంభరరావు ఛాతి ఉచ్చ్వాసనిశ్వాసలతో కంపిస్తుంటే ఆనందంగా చూస్తోంది డా!!విజేత.
కుర్డియోక్యులేటరీ నిమిషానికి ఫైఫ్ పాయింట్ టూ లీటర్… లెప్ట్ వెంట్రికల్ వన్… బ్రాంకో, స్పైరో మెట్రిక్ రేషియో ఫిఫ్టీ త్రీ.. రైట్, పార్టీ ఎయిట్ లెప్ట్…” తనలో తను అనుకున్నట్లుగా అంది విజేత.
ఆ టైమ్లోనే టేబుల్ మీంచి లేచి కూర్చున్నారు ప్రొఫెసర్ సత్యబ్రహ్మ.
“సర్.. మిస్టర్ రావు ఈజ్ కంప్లీట్లీ.. రివైవ్డ్…” ఆనందంగా చెప్పిందామె.
“కంగ్రాచ్యులేషన్స్… మై డియర్ యంగ్ సైంటిస్ట్.. ఎట్ లాస్ట్ యూ ఎచీవ్డ్ ది విక్టరీ…” ఆమె భుజం మీద తట్టాడు సత్యబ్రహ్మ.
“ఈ విజయం నాది కాదు సార్! నాలాంటి మెడికల్ స్టూడెంట్స్ని గేదర్ చేసి తన ఉద్యమానికి అనువుగా మమ్మల్ని మలచుకుని, మాకు శిక్షణ యిచ్చి, రేయింబవళ్ళూ ఈ ఆపరేషన్స్ ఎలా చెయ్యాలో, ఎంత ఎకాగ్రత, ఎంత విశ్వాసం కావాలో చెప్పి, మాలో తపనను లేపిన వ్యక్తి డా!! సవ్యసాచి. ఆయన లేకపోతే నాలాంటివాళ్ళు లేరు సార్.. మృత్యువు కెదురుగా సాగించిన ఈ మహా సంకల్పానికి కేంద్రం సవ్యసాచి… సాధించిన విజయానికి సారధి సవ్యసాచి…”
సవ్యసాచిపట్ల డా!!విజేతకున్న గౌరవానికి, ఆత్మీయతకు చెప్పలేని ఆరాధనకు ఆ మాటలు నిదర్శనంగా వున్నాయి.
మరో రెండు గంటలు గడిచాయి.
* * * * *
పొడవాటి మెత్తటి ఈజీ చెయిర్లో ఒక లుంగీ కట్టి కూర్చోబెట్టారు విశ్వంభరరావుని.
ఆపరేషన్ జరిగిన గంటవరకూ రోగిని మాట్లాడించటానికి వీల్లేదు.
ప్రస్తుతం బ్రెయిన్ని లాంగ్వేజ్ సెంటర్సుని పరీక్షిస్తోంది డా!!విజేత.
అప్పటికి కొన్ని ప్రశ్నలు వేసింది ఆయన్ని. ఏమాత్రం రెస్పాన్స్ లేదు ఆయన నుంచి.
“అంతా బాగానే వుంది.. కానీ మన సిగ్నల్స్ను బ్రెయిన్ నరాలు సరిగ్గా కేచ్ చెయ్యడంలేదు” నీరసంగా చెప్పింది విజేత.
సరిగ్గా అదే సమయంలో లోనికి ప్రవేశించాడు డా!!సవ్యసాచి. అతని వెనక, దిశ, సమీర్, వంశీ.
సత్యబ్రహ్మను అక్కడ చూడడంతో సంభ్రమానికి లోనయ్యాడు సవ్యసాచి.
దిశకు అంతా అయోమయంగా వుంది. సత్యబ్రహ్మ అక్కడకెలా వచ్చారు??’
విజేత, సమీర్, వంశీ మిగతా వ్యక్తులకుగానీ సవ్యసాచికి ఇన్స్పిరేషన్ సత్యబ్రహ్మ అనే విషయం తప్ప మరే విషయం తెలీదు.
“రేపు ప్రపంచ మానవాళి అందించే పొగడ్తలకు ఒక్కక్షణం ముందు నా అభినందనలు అందుకో” మనస్పూర్తిగా అభినందించాడు సత్యబ్రహ్మ.
కుర్చీలో కూర్చుని కనురెప్పలు ఆర్పుతూ, చేతులు నెమ్మదిగా కదుపుతున్న విశ్వంభరరావుని చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరయి పోయాడు సవ్యసాచి.
“విక్టరీ.. గ్రేట్ విక్టరీ…” అతనికి పెద్ద గొంతుకతో విశ్వగోళమంతా ప్రతిధ్వనించేటట్టు అరవాలని వుంది. చిన్నపిల్లాడిలా గెంతాలని వుంది. అప్రయత్నంగా అతని కళ్ళల్లో నీళ్ళు నిండిపోయాయి.
“డాక్టర్… ఒక్కటే ప్రాబ్లమ్” అలా అంటున్న విజేతవైపు సాలోచనగా చూశాడు సవ్యసాచి.
“విశ్వంభరావుకి మాట రావడం లేదు.”
గబగబా ముందుకెళ్లాడు సవ్యసాచి. కంప్యూటర్ స్క్రీన్లో కనిపిస్తున్న బ్రెయిన్ వేవ్స్ని చూశాడో క్షణం.
ఎవ్వెరిథింగ్ పర్ఫెక్ట్స్… బట్.. నిశితంగా ప్రతి నరాన్ని, కూడలినీ పరీక్షిస్తున్నాడు సవ్యసచి.
సత్యబ్రహ్మతో పాటు అందరూ ఆలోచనలో పడ్డారు.
బ్రెయిన్ వర్కుచేసే విధానం ఎప్పుడూ మిస్టరీగానే వుంటోంది. బ్రెయిన్ వర్కుకి సంబంధించి అమెరికన్ సైంటిస్టులు, మొదట చెస్ ప్లేయర్స్ బ్రెయిన్స్ మీద పాజిట్రాన్ ఎమిషవ్ టోమోగ్రఫీ(పీఇటి)లను ఉపయోగించి పరిశోధనల్ని చేశారు. ఈ పీఇటీలు మెదడులో ఏ భాగం పనిచేస్తే అక్కడ వేగం పెరిగే రక్త ప్రసరణల్ని కొలత వేస్తాయి. చదరంగం క్రీడాకారుల్లో పోస్టీరియర్ కార్టెక్స్ (మెదడులోని వెనుక భాగం) ఫ్రీ పంటల్ కార్డెక్స్ భాగాలు ప్రధాన పాత్ర వహిస్తాయని శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పారు. అలగే మన దైనందిన జ్ఞాపకాలు, మిగతా ముఖ్య చలనానికి ఆ భాగమే సెంటరై వుంటుందని సైంటిస్టులు భావిస్తున్నారు. తలకు బలమైన గాయమైనా, మేధా సంబంధమైన నష్టమేమీ జరగదని ఇటీవలి శాస్త్రపరిశోధనలు తేల్చి చెప్పాయి.
ఆ విషయం బాగా తెలిసిన సవ్యసాచికి అదంతా ఏదో మిస్టరీగా వుంది.
ఒక్క పక్క ఆనందం, ఇంకో పక్క మిస్టరీ!
సరిగ్గా అదే సమయంలో పక్క లేబ్లోకెళ్ళి అక్కడ దివ్యానంద స్వామి కనిపించకపోవడంతో బెంబేలెత్తిపోయి పరుగుపరుగున వచ్చి ఆ విషయాని సవ్యసాచికి చెప్పారు.
అందరూ అటువైపు పరుగెత్తారు.
సరిగ్గా అదే సమయంలో రుషికుమార్ భారతితో సహా మృతసంజీవని లేబరేటరీస్లోకి అడుగుపెట్టాడు.
అతనికి తెలిసిన ఏకైక విషయం..
అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో శోభరాజ్ వున్నాడని.
* * * * *
“ప్రాణం వచ్చిన దివ్యానందస్వామి లేచి వెళ్ళిపోయాడేమో?” డా!!సమీర్ అనుమానం వ్యక్తం చేశాడు.
“ఇట్స్ నాట్ పాజిబుల్ డాక్టర్… ఈ ఆపరేషన్కు గురైన వ్యక్తులు లేచి నిలబడగలరు తప్ప.. నడవలేరు. అలాగే… కొన్నాళ్ళపాటు బ్రెయిన్ మెమోరీ పవర్ అతి తక్కువగా వుంటుంది. కొన్ని గంటలసేపు మాత్రమే… ఆ మెమొరీ పవర్ ఎప్పుడుంటుందో, ఎప్పుడు పోతుందో తెలీదు.
వాళ్ళు మాట్లాడగలరు.. ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడతారు. ఇష్టమొచ్చిన భాషల్లో మాట్లాడతారు. దానిక్కారణం… పూర్వజన్మపు ఆత్మలు వారి శరీరంలోకి ప్రవేశించవచ్చని అమెరికన్ సైంటిస్టులంటున్నారు.
ఈ దశలోనే పునర్జీవితులయ్యే మనుషుల్లో ప్రేతాత్మలు కూడా ప్రవేశిస్తాయి.. చిన్నపిల్లల ఆత్మలు ప్రవేశిస్తాయి. ఆడ ఆత్మలు, మగ అత్మల్లో.. మగ ఆత్మలు, ఆడ ఆత్మలో ప్రవేశిస్తాయి… కొంతమంది వృద్ధులు ఈ ఆపరేషన్ చేశాక మృత్యుంజయులయ్యాక, వారు వృద్ధుల రూపంలో కనిపిస్తున్నప్పటికి, యోధుల్లా పోరాడతారు. మరికొంతమంది యువకులు మానసిక వృద్ధాప్యంతో కూడా బాధపడే అవకాశం వుంది.. ఇవన్నీ పరీశోధనలద్వారా నిరూపించాల్సి వుంది. ప్రస్తుతానికివి నమ్మకాలు” చెప్పాడు డాక్టర్ సవ్యసాచి.
అనేక డిష్కన్స్ జరిగాక, విశ్వంభరరావు బ్రెయిన్కి ఒక గ్లాస్ హెల్మెట్లాంటి పరికరాన్ని అమర్చారు. ఆ పరికరంలో పాదరసంలాంటి లిక్విడ్ కదులుతోంది.
ప్రతి నరం, సిస్టమేటిగ్గా పనిచేస్తోందో లేదోనని తెల్సుకోవడం కోసం ఆ పరికరాన్ని వాడతారు.
రాత్రి ఎనిమిది గంటలు దాటింది..
విశ్వంభరరావుని వుంచిన క్యూబిక్కి కొంచెం దూరంలో కుర్చీల్లో కూర్చున్నారు. సత్యబ్రహ్మ, సవ్యసాచి, రుషికుమార్.
మిగతా సైంటిస్ట్లు డిన్నర్కు వెళ్ళారు.
“డోంట్వర్రీ సవ్యా! దిసీజ్ మైనర్ ప్రోబ్లమ్… మృతసంజీవని పరిశోధనలు రేపు మీడియాకు చెప్తానంటావ్?” అడిగాడు సత్యబ్రహ్మ.
“ఎస్ సర్!”
“చెప్పి నువ్వు చనిపోయిన శవానికి ఆపరేషన్ చేసి, మనిషిగా మార్చావంటే మీడియా నమ్ముతుందా? ప్రజలు నమ్ముతారా? ప్రపంచం నమ్ముతుందా?”
“విశ్వంభరావు చనిపోయిన వ్యక్తి అని అందరకూ తెల్సు.. అన్నాడు సవ్యసాచి.
“నువ్వూ, రుషికుమార్ కలిసిపోయి బ్రతికున్న విశ్వంభరరావునే మాయం చేసేసి తీసుకోచ్చారని ఎవరైనా వాదిస్తే.. నీ దగ్గర సాక్షముందా?”
సవ్యసాచి, రుషికుమార్వపు చూశాడు. ఈ పరంగా సవ్యసాచి ఎప్పుడూ ఆలోచించలేదు.
“విశ్వంభరావును మర్డర్ చేయించడానికి ప్రతాప్సింగ్, అర్జున్ చౌహాన్ కుట్ర చేశారన్న దానికి నేను సాక్ష్యాలు సేకరిస్తాను” రుషికుమార్ మాటకు సత్యబ్రహ్మ నవ్వాడు.
“నువ్వు ప్రతాప్సింగ్ అర్జున్చౌహాన్లను నేరస్తులుగా రుజువు చెయొచ్చు కానీ, విశ్వంభరరావుని చచ్చి బ్రతికిన వ్యక్తిగా నిరూపించలేవు, ఎందుకంటే మృత్యువును జయించడం అనేది నమ్మలేని నిజం కనుక.. ఆ నిజాన్ని నిరూపించడానికి ప్రజల ముందు ఆపరేషన్ చేయాలి” చిన్నగా నవ్వాడు ఆయన.
మరణంలాంటి కీలకమైన ప్రశ్న…. జననంలాంటి కీలకమైన ప్రశ్న.
“దేశమందరికీ విశ్వంభరరావు చనిపోయిన విషయం తెల్సుకదా?”
“విశ్వంభరరావు శవానికి బదులు, ఒక స్వాతంత్ర సమరయోధుడి శవాన్ని దహనం చేసినట్టు కూడ కొంతమందికి తెలుసు” చెప్పాడు ఆయన.
ఎట్టకేలకు వారు వారు ముగ్గురూ ఒకే ఒక పాయింట్ దగ్గర ఏకాభిప్రాయానికి వచ్చారు.
“విశ్వంభరరావు దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడగలిగే పరిస్థితి ఏర్పడితే అన్నీ సర్దుకుంటాయి.”
ఆ గదిలో అగాధ నిశ్శబ్దం వుంది. వారి ముగ్గురికీ దూరంగా విశ్వంభరరావు చలనాచలన సందిగ్ధతలో వున్నారు.
అగాధానికి, ఆకాశానికి మధ్య నిండిన అనంత విశ్వంలాంటి ప్రశ్న-
చెప్పడం ప్రారంబించాడు సత్యబ్రహ్మ-
“మైడియర్ సవ్యసాచీ! సైన్స్ పరిశోధనల ద్వారా మృత్యువును జయించి, విశ్వ మానవాళికి కొత్త జన్మను సృష్టించడానికి కంకణం కట్టుకున్నవాడివి నువ్వు… స్వార్థశక్తుల్ని రూపు మాపి, ఈ దుర్మార్గ వ్యవస్థను ప్రక్షాళనం చెయ్యాలని అభిలషించే రుషికుమార్, మీ ఇద్దరిలో ప్రయోగం ఒకరి దృక్పధం. ప్రయోజనం ఒకరి మార్గం.. నేను ప్రయోగశీలిని, ప్రయోజన వాదిని… రేపు జరగనున్న సంఘటన మీ యిద్దరూ సాధించిన ఘనవిజయానికి విజయపతాక విశ్వగోళమ్మీద చరాచర సృష్టి జీవించే వరకూ అవిశ్రాంతంగా నినదించే భువన ఘోష…
ఈ విషయాన్ని లోకానికి ఎలా తేటతెల్లం చేస్తారో మీ మేధస్సు మీద ఆధారపడి వుంది.”
లేచి నిలబడ్డాడు సత్యబ్రహ్మ. ఆయన ఆశవాదానికి, కార్యాచరణకు రెండు కళ్ళలా అటూ యిటూ నిలబడ్డారు రుషికుమార్, సవ్యసాచి.
అప్పుడు తెలిసింది రుషికి… ఆ మృతసంజీవని సంస్థ జననం వెనకున్న పరమాధ్బుత వ్యక్తి ప్రొఫెసర్ సత్యబ్రహ్మ అని! అంతేకాదు ముంచుకు రానున్న ప్రమాదం నుంచి విశ్వంభరరావునే కాదు.. ఆ సంస్థలోని సభ్యులందర్ని కాపాడాలనే నిర్ణయానికొచ్చేశాడు అ క్షణానే.
కానీ సత్యబ్రహ్మ సమయంలో ఆలోచించలేకపోయిన ఏకైక విషయం దివ్యానందస్వామి.. దివ్యానందస్వామి వునికి.
సవ్యసాచి మనుషులు దివ్యానందస్వామి కోసం అప్పటికే తలకోన అడవిలో విస్తృతంగా అన్వేషణ మొదలుపెట్టారు.
* * * * *
రాత్రి పన్నెండు గంటలైంది.
సత్యబ్రహ్మ లేవనెత్తిన ప్రశ్నలకు అటు సవ్యసాచికిగానీ, ఇటు రుషి కుమార్కిగానీ నిద్ర పట్టడం లేదు.
ఈజీచైర్లో అనిమిషుడిలా కూర్చున్న విశ్వంభరరావువైపు చూస్తూ గడిపారు.
* * * * *
రెండు గంటలైంది…
న్యూఢిల్లీలోని హర్యానా రోడ్లోని భవనంలో…
రకరకాల ఆలోచన్లతో సతమతమౌతున్న వీరేంద్ర అజనీష్, ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చనిపోయి బ్రతికొస్తున్న మనిషి గురించే ఆలోచిస్తున్నాడు.
“ఆ వ్యక్తి ఎవరో కాదు .. విశ్వంభరరావే…” మరోసారి ఖచ్చితంగా అన్నాడతను.
“విశ్వంభరరావే అయితే మన రహస్యాలు బయటపెట్టేస్తాడేమో-”
“బయటపెట్టడు… బయట పెట్టలేడు… ఎందుకంటే, పునర్జీవితుడైన మనిషిలో పాత వ్యక్తి నశిస్తాడు.. అందుచేత తను కొన్నాళ్ళ క్రితం ప్రధానిననే విషయం అతనికి జ్ఞాపకం వుండదు. అది యివాల్టి సైన్స్లోనే కాదు, ప్రాచీన పురాణాల్లో వుంది…” గంభీరంగా అన్నాడు వీరేంద్ర.
“నాకేదో భయంగా వుంది గురూజీ! మిస్టర్ రావు ప్రజల ముందుకి రాకముందే మనం చంపేస్తే…” ప్రతాప్సింగ్ అన్నాడు.
“అందుకే గదా మనం బ్లాక్కేట్ కమెండోల దగ్గర్నించి కొన్నివేల మంది పోలీస్ ఫోర్స్ను పంపాం…” అర్జున్చౌహాన్ అన్నాడు.
వీరేంద్ర అజనీష్కు ఆ సమయంలో మాయమైపోయిన దివ్యానందస్వామి శవం గుర్తుకొచ్చింది.
ఆ శవం ప్రాణం పోసుకుంటే…?
“దివ్యానందస్వామి చనిపోయాడని అధ్యాత్మిక వాదులందరకూ తెలుసుకదూ?” నెమ్మదిగా, భయంగా అడిగాడు అజనీష్.
“తెలుసు…” చెప్పాడు దూరంగా కూర్చున్న వేదాచార్య.
ఆ మరుక్షణం.
భూనభోంతరాలు దద్దరలిల్లేటట్టుగా హుంకారం చేశాడు వీరేంద్ర అజనీష్…
“మిస్టర్ ప్రైంమినిస్టర్! స్పెషల్ హెలికాప్టర్స్ వాడమని చెప్పండి. బాంబులతో ఆ తలకోన అడవిలో ప్రతి అంగుళానీ సర్వనాశనం చెసెయ్యమని చెప్పండి. అప్పుడే.. అప్పుడే నా మనస్సుకు శాంతి… నాకు మీరిచ్చిన మాటను నిలబెట్టుకోండి. వెళ్ళండి… వెళ్ళండి…” పిచ్చి పట్టిన వాడిలా అరిచాడు అజనీష్.
అతనెందుకు అరుస్తున్నాడో, ఆ అరుపులకు మూలకారణం ఏమిటో-రేపటి సంఘటన మత వినాశనానికి ఏ రకంగా దారి తీస్తుందో ఒక్క వీరేంద్ర అజనీష్కు మాత్రమే తెల్సు!
* * * * *
పూర్తిగా ఇంకా తెల్లవారలేదు..
తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, పట్టణాల్లోనూ పలెల్లోనూ తండోపతండలుగా ఉరకలు, పరుగులు పెడుతున్న జనం…
తిరుపతి ఎయిర్పోర్టులో ఆగుతున్న స్పెషల్ హెలికాప్టర్లు.. ఫ్లయిట్స్…బారులు, బారులుగా తలకోనవైపు వెళుతున్న కార్లు…
దట్టమైన తలకోన ఫారెస్ట్ పైభాగంలో ఎగురుతున్న ప్రభుత్వ హెలికాప్టర్లు…
నెరబైలు దగ్గర కార్లు దిగి తలకోన అడవిలోకి నడుస్తున కేంద్ర రాష్ట్ర మంత్రులు, రా, సి.బి.ఐ చీఫ్లు.. స్పెషల్ కమెండోలు.. పోలీస్ ఫోర్స్…
వీటన్నిటికి మించి లక్షలాది జనం… అడవిలోని ఆకుల్లోంచి పుట్టినట్టుగా జనం.. ఆడ.. మగ… పిల్లా… పెద్ద… ఇక్కడ వయోభేదం లేదు.. లక్షలాదిమంది ఆ జనాన్ని నెరబైలు వద్ద వున్న కొద్దిమంది మృతసంజీవని సంస్థకి చెందిన వ్యక్తులు, దారి మళ్ళించి, ఒక రహస్య ప్రాంతానికి తరలిస్తున్నారు. ఆ విషయం పోలీసులకు గాని, హైకమాండ్లకుగాని తెలీదు. అదంతా రుషికుమార్ పథకంలోని భాగమని ఎవరికీ తెలీదు.
మానవళి చరిత్రలో మహాద్భుత సన్నివేశానికి ఆవిష్కరణ.. చనిపోయిన మనిషిని తలకోన అడవుల్లో బ్రతికించిన సైంటిస్టులు… 24 గంటలుగా రకరకాల వూహాగానాలతో దేశంలోని, విదేశాల్లోని పత్రికలు ప్రచురించిన వార్తలు.
స్పెషల్ బుల్లెటన్లు రిలీజ్ చేసిన టీవీలు, స్టార్ టీవీ, బి.బి.సీ.లు, హోరెత్తిపోతోంది ప్రపంచం.
* * * * *
ఉదయం పదిగంటలు..
తలకోనలో దట్టమైన అడవుల మధ్యనున్న ఆ పురాతన బిల్డింగ్ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చుట్టుముట్టేసింది వుప్పెనలా..
కమెండోలు లోనికి ప్రవేశించారు.. అంగుళం, అంగుళం వెతుకుతున్నారు.
ఎక్కడా మనుషుల జాడలేదు.. అదొక పాడుబడ్డ బంగళాలా ఉంది తప్ప, అదొక లేబరేటరీలా మారిన జాడలెక్కడా లేవు.
ఆ వెతుకుతున్న వాళ్ళల్లో శోభరాజ్ కూడా వున్నాడు.
ఆ బిల్డింగ్లోకే రుషికుమార్, భారతి వెళ్ళడం తను కళ్ళారా చూశాడు.
ఏమైంది? ఎటు వెళ్ళిపోయారు?
రాత్రికి రాత్రి పలాయనం చిత్తగించారా?
రాత్రికి రాత్రి అడవి దారిగుండా ఏ బెంగుళూరో, ఏ మద్రాసో వెళ్ళిపోయి వుంటారని అనుకున్నాడు శోభరాజ్.
మరి… విశ్వంభరరావు?!
విశ్వంభరరావు శవాన్ని బ్రతికించడం గాలి వార్తేనా? గాలివార్తే అయ్యుంటుంది.
ప్రపంచంలోని ప్రజలందర్నీ వూల్స్ని చేసిన అరుదైన, అద్భుతమైన రోజు…
నవ్వుకున్నాడు శోభరాజ్.
“ఈ తలకోన అడవుల్లో సైంటిస్టులు గానీ, లేబరేటరీలుగానీ… విశ్వంభరరావు బ్రతికివచ్చిన ధాఖలాలు గానీ ఏమీ లేవు సర్.”
నూతన ప్రధాని సన్నిహితులు వైర్లెస్ మెసేజ్లు యిచ్చారు న్యూఢిల్లీకి.
మరో రెండు గంటలు గడిచాయి…
ఉదయం నుంచి ఆ ప్రాంతాన్ని గాలించి. శోధించి వెనక్కి వెళ్ళి పోతున్నాయి జీపులు, హెలికాప్టర్లు.
పత్రిక సంస్థల యజమానులు, మీడియా చీఫ్లు, జనం మాత్రం వేరే ప్రాంతానికేసి వెళ్ళిపోయారు.
ఆ ఫూల్స్డ్ వార్తని మరింత ప్రముఖంగా ప్రచురించడానికి… జాతియ, అంతర్జాతీయ రిపోర్టర్లు కొందరు ఫోన్స్ మెసేజుల్ని పంపుతున్నారు.
ఆ రోజుని వూల్స్డేగా నమ్మించిన ఏకైక వ్యక్తి రుషికుమార్.
నూతన ప్రధాని ప్రతాప్సింగ్… పార్టీ అధ్యక్షుడు అర్జున్చౌహాన్- వీరేంద్ర అజనీష్ల వ్యూహాన్ని చిత్తుచేసిన రుషికుమార్. కొద్ది గంటల వ్యవధిలోనే మరోచోట బాంబు పేల్చడానికి సిద్ధమైపోతున్నాడు.
* * * * *
సరిగ్గా 3.30 నిమిషాలయ్యింది.
తలకోన ఫారెస్టులో మృతసంజీవని భవనం అండర్ గ్రౌండ్ సొరంగాల్లో దాక్కున్న సవ్యసాచి, రుషికుమార్ బయటికొచ్చారు.
ప్రస్తుతం ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేరు.. నలువైపులా చూసి లోనికెళ్ళారు.
ఆ సొరంగాల్లోంచి ఆ దారి ఎక్కడకు వెళుతుందో తెల్సిన సత్యబ్రహ్మ సారధ్యంలో అందరూ చీక్కట్లో ముందుకు నడుస్తున్నారు.
రుషికుమార్ భుజమ్మీద శవంలా పడి వున్నారు ప్రధాని విశ్వంభరావు. అతను భారంగా తీస్తున్న ఉచ్చ్వాస, నిశ్వాసాలు నెమ్మదిగా వినిపిస్తున్నాయి.
రెండు కిలోమీటర్లు నడిచారు.
రెస్టు తీసుకుంటున్న సమయంలో సత్యబ్రహ్మ అన్నాడు.
“అంతా మనమనుకున్నట్టుగా జరిగితే మన కోసం స్టీఫెన్ హారిస్ ఎదురు చూస్తుంటాడు.. ఆయనతోపాటు మనం బ్రతికించిన విశ్వంభరరావుని ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయడానికి స్టార్ టీవీ ‘క్రూ’ సిద్ధంగా వుండి వుంటారు.”
ఏదో రకంగా మృత్యువు మీద తమ విజయాన్ని ప్రపంచవ్యాప్తముగా ప్రజలకు తెలీచేయడానికి కృషి జరుగుతున్నందుకు ఆ శుభ ఘడియలు దగ్గర పడుతున్నందుకు చాలా ఆనందంగా వున్నాడు సవ్యసాచి.
కానీ…
చాలా అసంతృప్తిగా వున్న వ్యక్తి డా!!విజేత.
ఇంత చేసినా విశ్వంభరరావు మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటో తెలీకపోవడంతో ఆమె బాధపడుతోంది.
25 నిమిషాలు గడిచాయి
సొరంగ మార్గం అక్కడితో ఆగిపోయింది.
“పై భాగాన్ని చేత్తో తడిమితే మీకో.. రాగిపలక తగులుతుంది… దాన్ని తీయండి.. పైకి దారి కనిపిస్తుంది” చెప్పాడు సత్యబ్రహ్మ.
మరో అయిదు నిమిషాల్లో రాగిపలక పక్కకు తొలగిపోయింది.
పచ్చటి వెలుతురు.
పున్నమి కాంతిలాంటి వెలుతురు…
“ఒక్కొక్కరూ పైకి ఎక్కండి. విజేత, విశ్వంభరావుగారు ఇక్కడే వుంటారు… అక్కడ పరిస్ధితులన్నీ గమనించాక ఈయన్ని.. నిన్ను పైకి తీసుకెళతాం.. ఈలోపున ఏమైనా ఆవసరం వస్తే నువ్వు పైకి రావచ్చు” అందరూ పైకి వెళ్ళాక ఆ సొరంగ మార్గానికి అడ్దంగా ఆకులు,, అలములు పెట్టి ముందుకు నడిచారు.
అదొక కొండగుహ, అక్కడ నుంచి కుడిపక్క కెళితే విశాలమైన మైదానం….
ఆ మైదానం మధ్యన ఎత్తయిన వేదిక… ఆ వేదిక పక్కన అమెరికా నుంచి వచ్చిన సొసైటీ ఫర్ క్రయో బయోలజీ సంస్థ సైంటిస్టు స్టీఫెన్ హారిస్, మరికొంతమంది సభ్యులు….
ఆ వేదిక పక్కన హాంకాంగ్ నుంచి ప్రత్యకంగా స్పెషల్ ఫ్లైట్లో వచ్చిన టీవీ ‘క్రూ’
అక్కడి వేదికను, విదేశీయుల్ని చూసి రుషి పథకానికి మనసుల్లోనే జోహార్లు అర్పించాడు సత్యబ్రహ్మ.
డాక్టర్ స్టీఫెన్హారిస్ ఉద్వేగంతో ప్రొఫెసర్ సత్యబ్రహ్మను కౌగలించుకున్నాడు.
మరో అరగంట గడిచింది…
అప్పటికప్పుడు అక్కడ జరగబోయే అరుదయిన, అద్భుతమయిన దృశ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయడానికి శాటిలైట్ కనెక్షన్స్ యివ్వబడ్డాయి.
క్షణాల్లో పవర్వుల్ మైకులు ఏర్పాటు చేయబడ్డాయి.
డా!!స్టీఫెన్ హారిస్.. విశ్వంభరరావుని చూడాలని టెన్షన్గా వున్నాడు.
* * * * *
చేతి గడియారంవైపు చూసింది డా!!విజేత… 4.15 నిమిషాలు అయ్యింది.
గోడకు చేరబడి అలాగే ఆమె వైపే చూస్తున్నట్లుగా వున్న విశ్వంభరరావుని చూడగానే జాలేసింది ఆమెకు.
చివరి ప్రయత్నంగా తనేమీ చేయలేదా? ఆమె బ్రెయిన్ సీరియస్గా ఆలోచిస్తోంది.
ఆ సమయంలో పై తలుపు తెరుచుకుని సవ్యసాచి, సత్యబ్రహ్మ లోనికి దిగారు.
రెండు చేతులతో విశ్వంభరరావుని పట్టుకుని పైకి లేపి, ఆయన రెండు చేతులూ భుజాలమీద వేసుకుని నెమ్మదిగా నడిపించసాగారు.
సరిగ్గా 4.30 నిమిషాలు…
వేదిక మీద విశ్వంభరరావుని కూర్చోబెట్టారు.
విశ్వంభరరావు ప్రోబ్లమ్ గురించి స్టీఫెన్హారిస్కు చెప్పాడు సత్యబ్రహ్మ.
“డొంట్వర్రీ.. బ్రెయిన్ టీక్స్ సమ్టైమ్ కన్సీలింగ్ ద వైబ్రేషన్స్ అండ్ సజెషన్స్” చెప్పాడు స్టీఫెన్.
“నో ప్రొఫెసర్ సత్యబ్రహ్మ! ఐ విల్ మేక్ హిమ్ టాక్…” దృఢంగా, ఆత్మవిశ్వాసంతో చెప్పింది విజేత.
ఆశ్చర్యపోయాడు సత్యబ్రహ్మ.
“ఇట్స్ నేచురల్ ప్రొసెస్… బేబీ! డోంట్ గెట్ అప్సెట్” స్టీఫెన్ అనునయించబోయాడు.
వినిపించుకోలేదు విజేత.
అంతవరకూ ఆమె హేండ్బ్యాగ్లో దాచుకున్న ఒక మూలికను పైకి తీసి, నల్లరాతి మీద పొడిగా చేసింది. దానిపై నీటిని వేసి, కలిపి, ముద్దగా చేసి, పట్టుకుని విశ్వంభరరావు వైపు నడిచింది.
“ఏమిటది?” ఆశ్చర్యంగా అడిగాడు సవ్యసాచి.
“మృ…త….సం….జీ….వని… మూలిక.”
అందరూ ఒక్కక్షణం నివ్వేరపోయారు.
ఎవ్వరివైపు చూడడంలేదామె. అరచేతి నిండా ఆ మృతసంజీవని ముద్దను తీసుకుని, విశ్వంభరరావు తలకు పట్టించింది.
“సైన్స్కీ, భారతీయ మూలికల వైద్యానికి ముడిపెడుతున్న అధ్బుతమైన సైంటిస్ట్” తనలో తాను అనుకున్నట్టుగా అన్నాడు డాక్టర్ స్టీఫెన్ హారిస్.
వీడియో కెమెరాలు ఆన్ అయ్యాయి. శాటిలైట్ సిస్టమ్కి అనుసంధించబడ్డ ఆ ప్రొగ్రామ్సిగ్నల్స్ అందుకున్న ప్రపంచవ్యాప్తంగా, వివిధ దేశాల్లోని చానల్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి.
సవ్యసాచి, రుషి, దిశ, భారతి, సత్యబ్రహ్మ, డాక్టర్!! విజేత, సమీర్, వంశీ-
స్టార్ టీ.వీ.సిబ్బంది, క్రయోబయోలజీ సభ్యులు, అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న క్షణాలు సమీపిస్తున్నాయి.
డాక్టర్ విజేత మిగిలిపోయిన మృతసంజీవని ముద్దను విశ్వంభరరావు గుండెలమీద, కంఠమ్మీద రాస్తోంది.
సరిగ్గా ఆ సమయంలో రుషి చేతిలోని వైర్లెస్ సెట్ ఆన్ అయింది.
“హలో… దిసీజ్ రుషి! ఎవ్విరిథింగ్ నార్మల్. ప్రజల్ని వేదికకేసి మరలించండి. కమాన్ ఫాస్ట్… వాళ్ళు వేదికని కవచంలా చుట్టుముట్టి కాపాడాలి. వార్ని అలా గైడ్ చేయండి మీరు” అని వైర్లెస్ సెట్ని ఆఫ్ చేశాడు రుషి.
అప్పుడే ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది.
నెమ్మదిగా, నెమ్మదిగా విశ్వంభరరావులో చలనం ప్రారంభమైంది.
అదొక జీవ చలనం.
సర్వేంద్రియాలన్నీ, జీవ చైతన్యంతో కళకళలాడుతున్న మానవుని అద్భుత మేథా సృష్టికి నిదర్శనంగా-
వేదజ్ఞానం నిర్వచించిన, మృతప్రాణి ఆవిష్కరణకు ఆలంబనంగా-
సృష్టికి, ప్రత్రిసృష్టి జరుపుతున్న-
మానవుని చిరకాంక్షా తపస్సు, కాంతి బిందువై, జ్యోతి రూపమై, అనంత రోచిస్ సంయోగ, సంప్రభా విలసితమై-
రోదసి నిండా అకస్త్మాత్తుగా కమ్మిన వెలుగులాగా-
ఒక్కక్షణం-
విశ్వంభరావు లేచి నిలబడ్డాడు. సైన్స్ సంతరించిన సంభవానికి ప్రతినిధిగా.
అతనిప్పుడు సంపూర్ణ మానవుడు.
అందరి వైపూ చూశారాయన.
* * * * *
చూస్తుండగానే వేలాది, లక్షలాది జనం కారుమేఘల్లా కమ్ముకుంటూ వచ్చి వేదికకి నలువేపులా నిలిచారు. ఇసకవేస్తే రాలనంత జనం.. అంతమంది జనం ఒక్కసారిగా ఆ ప్రాంతానికెలా వచ్చారో ఎవరికీ అర్థం కాలేదు కొద్దిమందికి తప్ప.
రేడియోల్లో, షాపుల్లో, ఇళ్ళల్లో, టీ.వీ.ల్లో… విశ్వాంతరాళానికి అనుసంధించబడిన వార్తా ప్రసారానికి అనువైన ప్రతిచోటా-
శ్రీకాకుళం మారుమూల కుగ్రామం నుంచీ-
సౌత్ ఆఫ్రికా అడవుల్లోని ప్రజల ముంగిళ్ళవరకూ-
దేశ ప్రధాని రెసిడెన్స్ నుంచి, అమెరికన్ ప్రెసిడెంట్ వైట్ హౌస్లోని స్పెషల్ కమ్యూనికేషన్ సిస్టమ్వరకూ-
“మృత్యుంజయుడు విశ్వంభరరావు.’
ఇండియన్ సైంటిస్టులు సాధించిన అపురూప ప్రయోగానికి, మృత్యువు నెదిరించిన విజయానికి గుర్తు…
విశ్వగోళంలో మెట్టమొదటి పునర్జన్మించిన మానవుడు.
ఒక పక్క ఇంగ్లీషులో కామెంట్రీ…
రెండో పక్క ఆ కామెంట్రీ అన్ని భాషల్లోకి, ఆటోమాటిగా తర్జుమా అవుతోంది…
ఒకక్షణం ప్రపంచం స్తంభించిపోయింది.
హెల్లికాప్టర్లు రయ్ రయ్మని వెనక్కి తిరిగాయి.
స్పెషల్ కమెండోలు, ఆర్మీ పోలీసులు స్టెన్గన్స్తో పరుగెడుతున్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎ.కె.47లను సవరించుకుంటూ వెనుదిరిగారు.
రోడ్లనీ కిక్కిరిసి నిండిపోయిన జనం.
తలకోన అడవులకేసి దూసుకుపోతున్నారు.
* * * * *
విశ్వంభరరావు కనుల వెంబడి ధారాపాతంగా అశృవులు జలజలమని రాలుతున్నాయి. ఆయన రెండు చేతులూ ఒక్కసారి పైకి లేచాయి.
తనకు పునర్జీవితాన్నిచ్చిన భగవత్ స్వరూపులైన ఆ సైంటిస్టులకు వినయంగా నమస్కారం చేశాడాయన.
సవ్యసాచిని మనసారా కౌగలించుకుని, విజేత నుదుట మీద ముద్దు పెట్టుకున్నాడు. భారతిని, రుషిని ప్రేమగా గుండెలను హత్తుకున్నాడు.
“మిస్టర్ రావ్! మీరు చెప్పే సందేశం కోసం విశ్వగోళం ఎదురు చూస్తోంది” స్టీఫెన్ హారీస్ అన్నాడు ఆతృతని అణచుకుంటూ.
గొంతు సవరించుకున్నాడు విశ్వంభరరావు.
అదే సమయంలో అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో హెలికాప్టర్లు లాండ్ అయ్యాయి.
వందలాది సైనికులు, కమెండోలు, పోలీసులు విశ్వంభరరావుని, సైంటిస్టుల్ని హతమార్చడానికి కొండదారుల్లో దూసుకు వస్తున్నారు ముందుకు.
సరిగ్గా అదే సమయంలో…
విశ్వంభరరావు కంచుకంఠం కణకణమని మ్రోగింది.
“నాకు పునర్జన్మనిచ్చిన మహాద్రష్టలారా! స్ట్రష్టలారా! నమస్కారము. అదృశ్య వెలుగుగా తరతరాల, నిరంతర శోధనగా వుండిపోయిన మృత్యువుకు, అంతిమ సంస్కారం చేసిన భగవత్ స్వరూపులారా నమస్కారం.
నా భారతదేశపు సైంటిస్టులారా! నమస్కారం.
ఎన్నెన్నో ఆశలతో పుట్టి, పెరిగిన మనిషి ఎన్నెన్నో నిరాశలతో చనిపోవడం నాకు తెలుసు. నాకు నిరాశ లేదు… నాకు స్వార్ధం లేదు. ఏ ప్రాంతంవాడినైనా మనిషిని ప్రేమించగలిగాను కాబట్టి… నా దేశం కోసం, నా ప్రజల కోసం నిస్వార్ధంతో అనవరతం శ్రమించాను కాబట్టి… లంచగొండి తనం దేశంలో లేకుండా చేశాను కాబట్టి, కులమతాల ప్రసక్తి లేకుండా ప్రతి వ్యక్తిలో దేశభక్తిని ప్రోది చేసాను కాబట్టి… నేను మళ్ళీ పుట్టినా నా ఆత్మను నేను కోల్పోలేదు.
స్వచ్చమైన భారతీయ ఆత్మతో నేను మాట్లాడుతున్నాను.
పుణ్యనదుల సాక్షిగా మహా నాయకుల అడుగుజాడల్లో పరిఢవిల్లిన స్వాతంత్ర్య గాలుల్ని పీల్చుకుంటూ నేను మాట్లాడుతున్నాను.
ఏ దేశంలోనైనా సామాన్యుడు అసామాన్యుడిగా నిలిచేందుకు… అతని జ్ఞానం పురివిప్పేందుకు మానవజాతి దోహదపడాలని కోరుతూ మాట్లాడుతున్నాను.
ఆకలి కోసం అలమటించేవాడి కష్టంలోంచి ప్రజాస్వామ్యం పుట్టదని, రక్తశాసనాలెప్పుడూ రాజ్యాంగ సూత్రాలు కావని, మమతలోంచే మానవతా దీపం ప్రజ్వరిల్లుతుందని మనవి చేస్తున్నాను.
నా దేశ ప్రజలారా! నేను చచ్చిపోయింది నిజం.. మళ్ళీ బ్రతికిందీ నిజం.
నన్నెవరు చంపారు? కుహనా రాజకీయవేత్తలు. వ్యక్తులిక్కడ ప్రధానం కాదు, వ్యవస్థ.. కుళ్ళు కంపు కొడుతున్న మనదేశ రాజకీయ వ్యవస్థ.”
సరిగ్గా అదే సమయంలో చెట్ల చాటునుంచి ఒక కమెండో విశ్వంభరరావుకి రైఫిల్ని గురిపెట్టాడు. పక్కనున్న ఇంకో కమెండో ఆ రైఫిల్ని లాగేసుకున్నాడు. మొదటి వ్యక్తి రెండో వ్యక్తి వైపు ఆశ్చర్యంగా చూశాడు.
“స్వాతంత్ర్యం వచ్చి నలభై ఏడేళ్ళయింది… ఏ ప్రజాస్వామ్యం మనకు దక్కింది? ప్రజల కోసం భాదపడే ఏ నాయకుల్ని ఈ వ్యవస్థ బ్రతకనిచ్చింది? ఒక్కొక్కర్నీ ఒక్కొక్క విష వ్యవస్థ కూల్చేసిన ప్రజాస్వామ్యం మనది.
రాజ్యాంగంలో కుల ప్రసక్తి వుండకూడదనే నిబంధన వున్నా, కులం బలం లేని రాజ్యాధికారం లేదు… అందలం కోసం కులాల్లో చిచ్చులు.. పదవుల కోసం భార్యా భర్తలే కత్తులతో పొడుచుకునే విచిత్రమైన ప్రజాస్వామ్యంలో వున్నాం మనం.
అధికార దాహంతో, క్షుద్ర రాజకీయాల నేపధ్యంలో కుహనా నీతులు వల్లిస్తున్న ధృతరాష్ట్ర సహోదరులారా! రాజకీయవేత్తలారా!
మీరేం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించారా?
బడుగు వర్గాలు, అట్టడుగు వర్గాల ఓట్లతో అధికారంలోకొచ్చి కులాభివృద్ధి కోసం పాటుపడే కుహనా సంస్కారం సబబా? మీరు స్వార్థం కోసం కుల సంఘాల్ని ప్రేరేపిస్తున్నారు… మత సంఘాల్ని ప్రేరేపిస్తున్నారు. ఈ దేశ ప్రతిష్ట కోసం, సమైక్యత కోసం కృషి చేస్తామన్న మీ ప్రతిజ్ఞలు చట్టసభల్లోని చెత్తబుట్టల్లోనే వుండిపోతున్నాయి.
ఒక వెనుకబడిన జాతి నుంచి ఒక వ్యక్తి ఐ.ఎ.ఎస్.ఆఫీసరైతే అ ఐ.ఎ.ఎస్ ఆఫీసరు కొడుకులకు, కూతుర్లకి, మనవళ్లకు, మనుమరాళ్ళకు కూడా రిజర్వేషన్స్ అవసరమా?
ముమ్మాటికి లేదు-లేదని నిజాయితీగా చెప్పి ఆ బిల్లుని ప్రవేశ పెడతాననే నన్ను హతమార్చారు. ఆ చట్టం తెస్తే ఓట్లు పోతాయని తుచ్చ రాజకీయుల భయం.
రాయితీలెందుకు? రిజర్వేషన్లెందుకు?
రిజర్వేషన్లు ఎవరి కోసం? ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారికేగా, ఇప్పుడు రిజర్వేషన్ని అనుభవిస్తున్న వారంతా వాళ్ళేనా?
ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యే మీరు కుల ప్రతినిధులుగ ఆమరణ నిరాహారదీక్షులు చేయడం ఏ సంస్కారానికి నిదర్శనం? ఒక్కసారి ఆలోచించారా?
కుల జాడ్యాలకు తోడు అవినీతి… రాజ్యాధికారంగా చెలామణీ అయిపోతున్న రాజకీయ అవినీతి. వందకోట్ల సిమెంటు కుంభకోణంలో ఇరుక్కున్న అంతూల్ లాంటివాళ్ళు అయిదేళ్ళు గడిచేసరికి మళ్ళీ అందలంలో కొస్తున్న కాలంలో-
అధికారం కోసం యూనివర్శిటీలను, కాలేజీలను, సరస్వతీ నివాసాలుగ వుండాల్సిన విద్యాలయాలను అవినీతికి, ఆశ్రిత పక్షపాతాలకు నిలయాలుగా మార్చెస్తున్న రాజకీయ వ్యవస్థ ఇలాగే కొనసాగాల్సిందేనా?
మేధావులారా ఒక్కసారి ఆలోచించండి!
సామాన్యుడి బ్రతుకు అడుగడుక్కి అడుగంటిపోతున్న వ్యవస్థలో గూండా లేసుకునే దుస్తులు రాజకీయ వారసత్వానికి నిదర్శనాలై పోతున్న తరుణంలో-
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షక వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు ధనవంతుడు, బలవంతుడైన వ్యక్తి ఇంటిముందు మూగగా బికార్లల్లా నిలబడి పోతున్న తరుణంలో-
మీరు లక్షలాది ఇళ్ళు కట్టి పేదరికాన్ని రూపు మాపుతున్నారా? పేద వాళ్ళని రూపుమాపుతున్నారా?
ఒక్కసారి ఆలోచించండి!
ఈ దేశంలో సిన్సియర్ నాయకులకు విలువ లేదు…
ఈ దేశంలో సిన్సియర్ అధికారులకు విలువ లేదు..
చిత్తశుద్ధితో పనిచేసే ప్రతి అధికారినీ ట్రాన్సవర్ల పేరుతో, సస్పెన్షన్ల పేరుతో చిత్రహింసలు పెట్టే వ్యవస్థ మనది.
ఈ రాజకీయ వ్యవస్థను బహిష్కరించండి..
అధికారాలను నిజాయితీపరులైన ఐ.ఎ.ఎస్., ఐ.పి,ఎస్, అధికారులకు ఇవ్వండి…
వాళ్ళే రాష్ట్రాల్నీ, దేశాల్నీ పరిపాలిస్తారు.
అక్షరమ్ముక్క చదువురానివాడి దగ్గర ఒక ఐ.ఎ.ఎస్. అఫీసర్ కుక్కలా ఎందుకు తిరగాలి? ఐ.పి.ఎస్. అఫీసర్ చేతులు కట్టుకుని ఎందుకు కూర్చోవాలి?
దేశ ప్రజలారా! ఈ పొలిటీషియన్లను బహిష్కరించండి….
పంజాబ్లో టెర్రరిజాన్ని అణచివేసి, జాతీయ సమైక్యతకు వ్యక్తిగా కాకుండా, ఒక శక్తిగా పోరాడిన గిల్ను ప్రైంమినిస్టర్గా ఎన్నుకోండి. అవినీతిపై పోరాటం చేస్తున్న ఒక భైర్నార్ను హోంమినిస్టర్గా ఎన్నుకోండి. కిరణ్ బేడీ, రాచెల్ చటర్జీలను చీఫ్మినిస్టర్స్గా ఎన్నుకోండి.
ఒక సిన్సియర్ అధికారిని మీరు గుర్తించండి. వందమంది సిన్సియర్ అధికారులు మీకు కనిపిస్తారు” దేశమంతా వ్యాపించిన రకరకాల జాడ్యాల గురించి అనర్ఘళంగా, ఆవేశంగా ఉపన్యశిస్తున్నారాయన.
ఢిల్లీలోని ప్రైంమినిస్టర్ ప్రతాప్సింగ్ రాష్ట్ర డిజిపితో డైరెక్టుగా మాట్లాడాడు-
“షూట్ హిమ్ ఇమ్మీడియట్లీ.”
రాష్ట్ర డిజిపి టీవీలో విశ్వంభరరావు ప్రసంగాన్ని వింటూ ఒకే ఒక మాట చెప్పాడు.
“నో మిస్టర్ పి.ఎమ్. అయామ్ సారీ! ఇపుడు దేశంలోని అధికారులంతా శేషన్, భర్నార్, కిరణ్ బేడీ, రాచెల్ చటర్జీ, కె.పి.ఎస్ గిల్లా నిజాయితీగా ఎందుకుండలేకపోతున్నాం అని ఎవరికి వారే ప్రశ్నించు కుంటున్నారు. అలాంటి వారి పుట్టుకకు విశ్వంభరరావుగారి ప్రవచనాలు ఎంతైనా అవసరం వుంది. అందుకే దేవుడులాంటి వ్యక్తిని చంపమని నేను ఆదేశాలివ్వలేను. మీరేం చేసినా సరే.”
ఆ మాటలకు కుతకుతలాడిపోయాడు ప్రతాప్సింగ్. ప్రసార మంత్రిత్వశాఖ ద్వారా ఆ ప్రసంగం రాకుండా ప్రయత్నించాడు అర్జున్ చౌహాన్.
దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ చెప్పిన ఒకే ఒక ఆన్సర్.
“నో సర్! అయామ్ సారీ. ఆయన మంచే చెబుతున్నారు – చెడుని కాదు. ఇంతకాలం చెడులో మగ్గిన దేశ ప్రజలకు ఆయన సందేశం చాలా అవసరం.”
“గురూజీ! ఆ ముసిలాడు మనమీద ఇన్డైరెక్టుగా వార్ ప్రకటిస్తున్నాడు. మీరు తీరుబడిగా వాడి స్పీచ్ను వింటున్నారా?” వీరేంద్ర అజనీష్ మీద అంతెత్తున లేచాడు ప్రతాప్సింగ్.
చిద్విలాసంగా నవ్వాడు అజనీష్.
“మిత్రులారా కంగారెందుకు కాగల కార్యం తీర్చడానికి శోభరాజ్ వున్నాడు కదా.”
శోభరాజ్!
ఆ అరణ్యంలో జనసమూహంలో కలిసిపోయిన శొభరాజ్ నెమ్మదిగా ముందుకు చొచ్చుకుని వచ్చి ఒక కమెండో దగ్గర ఎకె 47 అందుకున్నాడు సడన్గా.
ఆ జనసమూహంలోనే ఢిల్లీలో ఒక దేవాలయంలో శోభరాజ్ను చూసిన రూపవీర్ అనే సాధువు కేకలేసుకుంటూ ముందుకురికాడు. కానీ ఆ అరుపులు ఎవరికీ వినపడలేదు.
“దేశ ప్రజలారా! నన్నే శక్తి బ్రతికించింది? సైన్సా ? దైవమా? నేనుగాని, మీరుగాని ఒక మానవాకారం దాల్చడానికి కారణం దైవం. అంటే సైన్సే. విజ్ఞానమే భగవత్ స్వరూపం. అగాధం సైన్సు అయితే, ఆకాశం భగవంతుడు. యుగయుగాల చేతనకు ప్రకృతితోపాటు మానవుడుకూడా కారకుడే.
అందుకే అంతిమ విజయం మృత్యువును జయించడం..
మానవుడు సాధించిన మాహాద్భుత సన్నివేశం ఈ క్షణం…
ఈ అరుదైన సన్నివేశానికి నన్ను ఆకృతిగా నిలిపినందుకు యీ విశ్వగోళం ముందు వినమ్రంతో నేను మోకరిల్లుతున్నాను.”
సరిగ్గా అదే సమయంలో…
చెట్ల చాటునుంచి ముందుకొచ్చాడు శోభరాజ్. శోభరాజ్ని, అతని చేతిలోని ఎకె 47 గన్ని చూడగానే ముందుకు రాబోయాడు రుషికుమార్.
అప్పుడే ట్రిగ్గర్ నొక్కాడు శోభరాజ్.
మేగజైన్లోంచి బులెట్లు వరసగా పెనువేగంతో దూసుకువస్తున్నాయి.
జనం చెల్లాచెదురుగా పరిగెడుతున్న దశలో విశ్వంభరరావుకి అడ్డంగా నిల్చుంది దిశ. వరసగా ఆమె గుండెల్లోంచి బుల్లెట్లు దూసుకుపోయాయి.
దిశ కిందకు పడిపోవడంతో విశ్వంభరరావుకి అడ్డంగా సమీర్, వంశీ నిలబడ్డారు. రెండో పక్క నుంచి బుల్లెట్ల నుంచి తప్పించుకుంటూ శోభరాజ్ వైపు దూసుకొస్తున్నారు రుషి, సవ్యసాచి.
జనం మధ్యలో నున్న గిరీష్, వసంత దిశ నేలకొరిగిన వైపు పరుగెత్తారు.
సరిగ్గా అదే సమయంలో-
ప్రతాప్సింగ్, అర్జున్చౌహాన్ వర్గాలకు చెందిన కొంతమంది గూండాలు బాంబుల్ని గాలిలోకి విసరసాగారు.
వేలాదిమంది జనం దూది పింజల్లా గాల్లోకి ఎగిరిపోతున్నారు.
హాహాకారాలతో కిందపడిపోతున్న వంశీ, సమీర్, దిశలను చూసి భారతి, విజేత అటువైపు పరుగెడుతున్నారు.
ఉన్మాదిలా కాల్పులు జరుపుతున్నాడు శోభరాజ్.
ముందుకు…. విశ్వంభరరావు వైపు దూసుకొస్తున్నాడతను నేరుగా.
విశ్వంభరరావు కెదురుగా వచ్చి వికృతంగా నవ్వుతూ నుంచున్నాడతను.
మరోక్షణంలో అతని చేతిలోంచి మెషిన్గన్ ఆయన గుండెల్ని రెండుగా చీల్చేయడానికి సిద్ధంగా వుంది.
మృత్యువు కెదురుగా, ఒక ఆశయానికి రూపకల్పన చేసి ఎన్నో ఏళ్ళ తపస్సుకు మహావిష్కరణ చేసిన మహామేధావి-
సత్యబ్రహ్మ!
పెద్దగ అరుస్తూ ముందుకెళ్ళాడు.
మరుక్షణంలో అతని శరీరం చిన్నాభిన్నమై పోయింది.
“ప్రొవెసర్!” కేక వేసుకుంటూ ముందుకు పరుగెత్తాడు సవ్యసాచి. అతని వెనుక రుషి, విజేత పరుగు పరుగున వెళ్ళి విశ్వంభరరావుకి అడ్డంగా నిలబడ్డారు.
తన ఎదురుగా వున్న రుషి, సవ్యసాచి, భారతి, విజేత, విశ్వంభరరావుల వైపు కసిగా చూశాడు శోభరాజ్.
అతని వేలు ట్రిగ్గర్ మీదకు వెళ్లడానికి ముందుకు, మున్ముందుకు జరుగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ ఘోర దృశ్యాన్ని కోట్లాది ప్రజలు కళ్లప్పగించి చూస్తున్నారు.
ఢిలీలో ఆ దృశ్యాన్ని వీరేంద్ర అజనీష్, ప్రతాప్సింగ్, అర్జున్ చౌహాన్ చిరునవ్వుతో తిలకిస్తున్నారు.
విక్టరీ ఈజ్ అవర్స్ అన్నట్టుగా ప్రతాప్సింగ్ కుడిచేయి పైకి ఎత్తబోయి ఆగిపోయాడు.
‘ప్రపంచంలో సృష్టి రహస్యాన్ని ఏ ఒక్కడో చేధించలేడు’ అన్న దానికి నిదర్శనంగా-
ఒక బలమైన చెయ్యి శోభరాజ్ భుజమ్మీద పడింది.
శోభరాజ్ తల వెనక్కి తిప్పి చూశాడు అక్కడ…
దివ్యానందస్వామి-
పిచ్చివాడిలా వున్నాడు. పెద్దగా, పిచ్చిగా కేకలు వేస్తూ శోభరాజ్ను అవలీలగా పైకెత్తి పక్కనే వున్న చెట్టుకొమ్మకేసి విసిరికొట్టాడు.
చెట్టు కొమ్మకు ఢీకొని శోభరాజ్ విహ్వాలంగా కేకవేసి కింద పడిపోయి లేవడానికి ప్రయత్నిస్తున్న దశలో-
దివ్యానందస్వామి ఎ.కె.47 రైవిల్ను అందుకున్నాడు. ట్రిగ్గర్ను నొక్కాడు.
వరసగా, వరసగా… బుల్లెట్ల్లు, శోభరాజ్ శరీరాన్ని చీల్చి చెండాడేశాయి… మరుక్షణంలో అతని ప్రాణాలు అనంతవాయివుల్లో కలిసి పోయాయి.
ఎక్కడి జనం అక్కడే ఆగిపోయారు.
ఎక్కడి ప్రకృతి అక్కడే ఆగిపోయింది.
అందరూ దివ్యానందస్వామి వైపే చూస్తున్నారు. దివ్యానందస్వామి ఠీవిగా నడుచుకుంటూ విశ్వంభరరావు దగ్గరికి వచ్చాడు.
అతను వేసిన అడుగులు మిలటరీ కల్నల్ వేసే అడుగుల్లా వున్నాయి.
కొన్ని దశబ్దాలపాటు అధ్యాత్మిక జీవితం తప్ప మరేమీ గడపని దివ్యానందస్వామి ప్రవర్తన చాలా వింతగా వుంది అక్కడున్న అందరికి.
అతను-
విశ్వంభరరావు కళ్లవైపు చూసి మిలట్రీ పద్ధతిలో సెల్యూట్ చేశాడు.
విశ్వంభరరావు అలా సెల్యూట్ చేస్తున్న దివ్యానందస్వామివైపు విస్మయంగా చూశారు.
క్రిందపడిపోయిన దిశను రెండు చేతులతో ఎత్తుకుని, సవ్యసాచి లేబరేటరీవైపు పరుగెడుతున్నాడు. అతని కళ్లల్లో కన్నీళ్ళు కారుతున్నాయి. అప్పటికే దిశ చనిపోయిందనే విషయం అతనికి తెలీదు.
సరిగ్గా అదే సమాయానికి విశ్వంభరరావు మొదలు విరిగిన మానులా కూలిపోయారు. నాలుగైదు గంటలపాటు మృత్యువు ఓడిపోయినట్లని పించినా తిరిగి మృత్యువే జయించింది. అదేనేమో… సృష్టి రహస్యం.. ఎప్పటికైనా మృత్యువును పూర్తిగా జయించటం మానవ మేధస్సుకు సంభవమేనా?!! బిలియన్ డాలర్ల ప్రశ్న అది.
దివ్యానందస్వామి నెమ్మదిగా అడవిదారంట నడుస్తూ ఒక్కసారి కుప్పకూలిపోయి తిరిగి ప్రాణాలు వదిలేశాడు.
నిజానికి అతను దివ్యానందస్వామి కాదు. ఆపరేషన్ చేశాక అతని శరీరంలోకి ప్రాణం ప్రవేశించినా, ప్రవేశించిన ఆత్మ అతనిది కాదు.
ఒక మిలటరీ కల్నల్ ది.
ఆ విషయం ఏ ఒక్కరికీ తెలీదు.
అదే సంభవం.. అదే అసంభవం…
అదే విశ్వరహస్యం..
అదే… చరాచర మానవసృష్టి…
అదే సైన్స్… అదే భగవంతుడు…
విశ్వాసమే భగవంతుడు.. నమ్మకమే సైన్స్… ఈ రెండూ కలిస్తేనే నిరంతర చైతన్య ప్రవహం.
NO ONE IS TO BE DEPAIRED OF AS LOGN AS HE BREATHES.
:- అయిపోయింది :-