కొంత కాలంగా నన్ను ఆలోచింపజేస్తున్న ప్రశ్న ఇది.
పద్యమైనా, గద్యమైనా వినీవిన్నంతనే పదమూ, అర్థమూ అభిహితాన్వయం కలిమి వల్ల గులాబీ మొగ్గ ఒక్కొక్క రేకూ విచ్చుకొని విప్పారి గుప్పుమని గుబాళించినట్లు గుండెలకు హత్తుకొనిపోవాలి. పదము యొక్క అర్థం, అర్థం వెనుక దాగివున్న భావం, భావంలోని రసస్ఫూర్తి, మనస్సులోని మాలిన్యాన్ని క్షాళించివేయగలిగినంత జీవశక్తితో వెలుగులీనాలి.
ఆ మాటనెవరూ కాదనలేరు.
కవిత్వానికి పరమార్థం అదే. అంతేకాదు. వక్తవ్యమైన ఏ విషయాన్నైనా అరటిపండును ఒలిచి చేతిలో పెట్టినట్లు సరళంగా, సుబోధంగా, అందంగా, ఆత్మహితంగా చెప్పగలగటం సులభమేమీ కాదు. అందుకు లోకానుభవం కావాలి. కావ్యానుభవం కావాలి. సరస సల్లాపనైపుణి కావాలి. అన్నింటినీ మించిన జనరంజకత్వం కావాలి. రచనాభ్యాసం కావాలి. రమ్యాలోకం కావాలి. మాధురీదర్శనం తెలియాలి.
అందుకే చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారనేవారట: అక్షరం, అక్షరం రసమొలికేదే కవిత్వమని.
శ్రీలక్ష్మి శేషశయ్యపైని పవ్వళించిన స్వామిని శృంగారిస్తున్నది. అందాలు చిందే ఆయన మోమున తీరుగా కస్తూరి తిలకం దిద్దింది. “ఎలా ఉన్నదో, చూడండీ?” అన్నది ముచ్చటగా, మురిపెంగా.
ఎలా చూడటం?
చుట్టూ పాలకడలిపై జిగితేఱిన పచ్చిమీగడ మీదికి తొంగిచూస్తే ప్రతిబింబం కనబడుతుందా?
ఆయన శృంగారశేఖరుడు.
ఆమె బుగ్గల తళుకులోకి చూశాడు.
తిలకంబు దిద్ది; “దిద్దితిఁ, జూడు!” మను రమా
సుదతి చెక్కుల నీడఁ జూచువాని
అని సంకుసాల నరసింహకవి కవికర్ణరసాయనంలో వ్రాశాడు.
వెంకటశాస్త్రిగారికి ఎంతో ప్రీతిపాత్రమైన పద్యచరణం ఇది.
కవిత్వం అంటే
“పాలసంద్రము మీఁదఁ బవ్వళించినయట్టి
నీలవర్ణుఁడు నిద్ర మేలుకొనియె”
అన్నట్లు హాయిగా సాగిపోవాలని ఆయన అనేవారు.
వస్తువు మాట అటుంచి, వ్యక్తీకరణను గుఱించిన చర్చ మాత్రమే చేస్తున్నాము. కవిత్వం సులభగ్రాహ్యంగా ఉండాలన్న నియమనాన్ని ఎవరూ కాదనరు. ఒక్కొక్కప్పుడు గంభీరమైన పదప్రయోగం కూడా అవసరమే. కొందఱికి అప్రతీత పదప్రయోగాభిమానం ఉంటుంది: వైదుష్యభరం వల్ల; సందర్భౌచితి మూలాన. దానికేమీ! విశ్వనాథ సత్యనారాయణ గారన్నారు:
“ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి వాళ్ళు నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తున్నట్లు భాషలో ఉన్న పదాలన్నింటికీ సుష్ఠుగా జీతాలిచ్చి ఉద్యోగాలిస్తున్నాను నేను.” అని!
ఉద్యోగం లేదని మనిషిని నిరాదరణకు గుఱిచేస్తే ఆత్మహత్య చేసుకొంటాడు. భాషలో పదాలకు మాత్రం ఉద్యోగం ఇస్తుంటే పదికాలాలపాటు పదిలంగా ఎందుకు బ్రతికుండవూ? అని.
సమాసమైనా అంతే. సమాసకల్పనకు భాషలో ఎంతో పాండిత్యం ఉండాలి. ఎంతో ప్రయోగానుభవం గడితేరాలి. పదాల ఉత్తరోత్తరాన్వయం తెలియాలి. బహునిఘంటు పరిజ్ఞానం కావాలి.
ఇన్నీ ఉన్నాక, అప్పుడు ఔచిత్యం ఉంటే రాణిస్తుంది. లేకుంటే, వట్టి ఆడంబరమని కొట్టిపారేస్తారు.
ఔచిత్యం ఉండకేమీ! రంగస్థలం పైని జూపూడి యజ్ఞనారాయణ గారు దుర్యోధనుడి వేషం కట్టి, తిరుపతి వెంకటకవుల పాండవోద్యోగ విజయాల్లోకి మక్కపాటి వెంకటరత్నం గారి మయసభ ఏకపాత్రాభినయం దృశ్యాన్ని జొప్పించి, నిండైన విగ్రహంతో –
ఉద్దండగదాదండాన్ని భుజాన దాల్చి,
మీసాలు మెలివేస్తూ,
మైకులు పగిలే ఉచ్చైఃస్వరంతో
“భవచ్చిత్తాటవీసంచరద్దురూహమత్తమాతంగవక్షఃకవాటవిపాట్య
పాటవోదగ్ర సింహకిశోర కరాంచలనఖాంచలము కాదా!
ఈ కురుసార్వభౌముని అద్భుతోపాయపరంపర.”
అంటున్నప్పుడు –
ఆ గాంభీర్యం, ఆ ఔదాత్యం, ఆ ఔద్ధత్యం, ఆ ధీరత్వం, ఆ ఆంగికం, ఆ వాచికం, ఆ రాజసం చూస్తుంటే మనమూ ఆ మయసభలోకి పయనమైపోయి ప్రేక్షకులం ఆనాటి ఆ సన్నివేశంలో వీక్షకులమే అయినట్లుండదూ?
శ్రీకృష్ణదేవరాయల అల్లుడు అళియ రామరాజుకు మేనల్లుడైన తొరగంటి నరసరాజుకు అంకితంగా భట్టుమూర్తి కావ్యాలంకార సంగ్రహం చెప్పాడు. ఆ నరసరాజు సుతసామంతవితానంతో కొలువుతీరి సింహాసనంపైని కూర్చున్నప్పుడు ఎలా ఉన్నాడని?
వెండియుం బ్రచండభుజాదండతాండవితమండలాగ్రఖండితారాతిమండలుండును
(25 అక్షరాలు),
అఖండనవఖండపృథ్వీమండలధురాభరణపరాభూతఖండపరశుకుండలుండును
(31 అక్షరాలు),
అజాండకరండపిచండిలయశఃపూరకర్పూరహారుండును
(21 అక్షరాలు),
సరస్వతీమనోభండారచౌర్యకారుండును
(15 అక్షరాలు),
సమరసమయసముజ్జృంభితజంభారిదోస్స్తంభసముత్తంభితదంభోళిధారావిదారిత
మహాభీలశైలాళివిశాలారవకోలాహలలీలాహళహళికాసమారంభసుభగంభావుక గంభీరవిజయభేరీభయంకరభాంకారసంకరసముట్టంకితదిగ్విటంకుండును
(93 అక్షరాలు),
అక్షుద్రతరసురక్షోభకరమదోన్మత్తదక్షోన్నతరక్షోవక్షోపక్షోదవిచక్షణాక్షీణనృహర్యక్ష
రూక్షవీక్షణోద్భవదాశుశుక్షణిక్షణసముత్క్షిప్తకీలాకరాళా
విచ్ఛిన్నచ్ఛాయాచ్ఛటాపటిమఘటనచటులప్రతాపవైభవుండును
(82 అక్షరాలు),
ఉభయరగండ గండభేరుండాది బిరుదసందీపితప్రాభవుండును
(24 అక్షరాలు),
అసాధారణమేధావధీరితవేధోమేధోపబోధనిర్నిరోధమధురమధురసావధీరణ
సంగ్రహవాగ్గ్రథనసుధీజనగృహద్వారనిర్ణిద్రభద్రవారణఘటావికటకటాహతటపతదనూనదానాంభోఝరీపరిమళపరిలబ్ధిలుబ్ధలబ్ధామోదమేదురభృంగీతరంగితభంగీ
ప్రసంగతప్రసంగాంగీకృతనిరంతరదిగంతరవిశ్రాంతవిశ్రాణనజయానకుండును
(131 అక్షరాలు).
ఇంకా ఎన్నో విధాలుగా చెప్పాడు కవి.
సమాసం అంటే ఎలా ఉండాలి?
గుండె ఝల్లుమనిపించాలి.
వినగానే మనస్సు చల్లబడాలి.
అల్లసాని పెద్దన గారు చెప్పారు:
“… సంస్కృతంబు పచరించెడు పట్టున భారతీవధూ
టీతపనీయగర్భనికటీభవదాననపర్వసాహితీ
భౌతికనాటకప్రకరభారతభారతసమ్మతప్రభా
శీతనగాత్మజాగిరిశశేఖరసీతామయూఖమాలికా
పాతసుధాప్రపూరబహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ
జాతకతాళయుగ్మలయసంగతిచుంచువిపంచికామృదం
గాతతతేహితత్తహితహాధితదంధణుధాణుదింధిమి
వ్రాతలయానుకూలపదవారకుహూద్వహహారికింకిణీ
నూతనఘల్ఘలాచరణనూపురఝాళఝళీమరందసం
ఘాతవియద్ధునీచకచకద్వికచోత్పలసారసంగ్రహా
యాతకుమారగంధవహహారిసుగంధవిలాసయుక్తమై
చేతముఁ జల్లఁజేయవలె …” అని.
“భారత వధూటీ” మొదలుకొని “యుక్తమై” వఱకు మొత్తం ఒక్క సమాసం.
మొత్తం 217 అక్షరాలు.
రాయలవారు గండపెండేరం తొడగకుండా ఉంటారా మఱి?
ఒక్క ప్రశ్న:
సమాసం సందర్భ విదర్భమా? కాదా?
ఔచిత్యవంతంగా ఉన్నదా? లేదా?
కవులు సమయోచితంగా ప్రయోగించారా? లేదా?
అర్థవంతమై సౌందర్యం నిండి ఉన్నదా? లేదా?
ఈ విషయాలన్నిటినీ ప్రక్కన పెట్టి,
పద్యమైనా, గద్యమైనా తెలుగులో ఇంతకంటె పెద్దదైన సమాసం ఉన్నదా?
మీకు తెలిసిన రచనలలో అన్నింటికంటె పెద్ద సమాసం ఏది? చెప్పండని.
ఈ క్రింద మీ సమాధానాలను వ్రాయండి.
పుస్తకం పేరు, కవి పేరు చెప్పి సమాసాన్ని ఉదాహరించండి.
అందఱం కలిసి కనుగొందాం.
తెలుగులో అత్యంత సుదీర్ఘమైన సమాసం ఏది? ఎవరు వ్రాశారు? అని.…
కూచిమంచి జగ్గకవి వ్రాసిన హాస్యవ్యంగ్య కావ్యం “చంద్రరేఖావిలాపం” లో మొదటిలో రాజుగారిని వర్ణిస్తు చెప్పిన వచనం చాలాపెద్దదని గుర్తు. నేను అక్షరాలు అన్ని లెక్కపెట్టలేదనుకొండి. కాని దాదాపూ రెండుపేజీలు ఉన్నది.
ఇప్పటికి పెద్దనగారిదే పెద్ద సమాసం అందాం .పద్యంనాలుగు పాదాలు ఒకే సమాసంతో లాగించినవారు ఉండ వచ్చునుగాని పెద్దన పద్యమాలిక ేకసమాసంగా అల్ఆడు కదా !
I read the article penned by my friend. It is simply marvelous fantastic and superb. athiniki joharlu
Thanks to Jampala Chowdhary ,I came across such a nice site . I wish I had known about it in 2011,it is never late any way