April 28, 2024

అంబ -శిఖండి వృత్తాంతము

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు.


మాహా భారతములో అనేక పాత్రలలో కారణజన్మురాలై భీష్ముడి మరణానికి కారణము అయిన అంబది చాలా ప్రత్యేకమైన పాత్ర ఈమె కాశీ రాజు ముగ్గురు కుమార్తెలలో పెద్దది ఈవిడ సాళ్వుని ప్రేమించింది ఇద్దరు వివాహము చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు ఈవిడకు భీష్ముడి మరణానికి గల సంబంధము ఏమిటో తెలుసు కుందాము.

శంతనుడు మరణించాక రాజ్యపాలన భారము సత్యవతి పుత్రుల పరము అయింది భీష్ముడు తన ప్రతిజ్ఞ వల్ల రాజ ప్రతినిధిగా ఉండి సత్యవతి పుత్రులకు రక్షగా ఉండి పాలన సాగిస్తున్నాడు ఆ సమయములో కాశీ రాజుతన ముగ్గురు కుమార్తెలకు స్వయంవరం ప్రకటించాడు విషయము తెలుసుకున్న భీష్ముడు తన తమ్ముడు సత్యవతి పుత్రుడైన విచిత్రవీర్యునికి భార్యగా చేయటానికి ముగ్గురు కాశీరాజు కుమార్తెలను తెచ్చి రాజమాత సత్యవతి ఎదుట నిలుపగా విచిత్రవీర్యునికి వాళ్ళను ఇచ్చి వివాహము చేయమని చెపుతుంది
కాశీరాజు కుమార్తెలలో పెద్దదైన అంబ తానూ సాళ్వుడిని ప్రేమిస్తున్నానని తనను అతని సమక్షానికి పంపమని భీష్ముడిని వేడుకుంటుంది ఈ విషయాన్ని భీష్ముడు సత్యవతికి తెలిపి అంబను పుట్టింటి ఆడబడుచులాగా లాంఛనాలతో సాల్వుడి దగ్గరకు పంపుతాడు కానీ సాళ్వుడు అంబను పెళ్లిచేసుకోవటానికి నిరాకరించి మళ్ళా అంబను హస్తినకు పంపిస్తాడు హస్తిన వచ్చిన అంబ తనను పెళ్లిచేసుకోమని భీష్ముడిని అడిగిపోతే తానూ వివాహమాడనని ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని భీష్మ ప్రతిజ్ఞ చేసాను కాబట్టి కుదరదు అని నిష్కర్షగా చెపుతాడు ఇటువంటి పరిస్తితులలో తన జీవితమూ భీష్ముడి వలన అన్యాయము అయింది అని భావించిన అంబ భీష్ముడిపై కక్షను పెంచుకుంటుంది కానీ ఆబల నిస్సహాయురాలు అవటం వలన భీష్ముడిని ఎదుర్కోవటానికి తపస్సే శరణ్యము అని భావించింది. ఆమె దీనగాథను విన్న మునివర్యులు “సుకుమారివి రాకుమారివి నీకు తపస్సు ఎందుకు?” అని నిరుత్సాహపరిచారు.

అంబకు తాత వరుస అయిన శాలిహోత్రుడు అనే మునివర్యుడు అంబ దీనగాథను విని దుఃఖితుడై ఆమెను తన మనమరాలిగా గుర్తించి ,”ఇప్పుడు నీవు చేయవలసినది తపస్సుకాదు ముందు పరుశ రాముడిని కలుద్దాము అయన భీష్ముని గురువు కాబట్టి వ్యవహారాన్ని చక్కదిద్దగలడు భీష్ముడు కూడా గురువు మాట కాదనడు”, అని అంబను ఒప్పించేప్రయత్నము చేస్తాడు అ సమయములోనే పరశురాముని శిష్యుడు అకృతవణుడు పరుశరాముడు శాలిహోత్రుని కలవటానికి వస్తున్నట్లుగా తెలియజేస్తాడు ఇది విన్న శాలిహోత్రుడు అంబ మిక్కిలి సంతోషిస్తారు.

వచ్చిన పరుశరామునికి సకల మునిజనులు సాదరముగా ఆహ్వానించి అర్ఘ్యపాదాలు ఇచ్చి భక్తి ప్రపత్తులతో ఆయనను సేవించారు తదుపరి శాలిహోత్రుడు అంబను తన దౌహిత్రిగా పరిచయము చేసి జరిగిన వృత్తాంతాన్ని వివరించి అంబకు న్యాయము చేయవలసినదిగా వేడుకున్నాడు అంతా విన్న పరుశరాముడు భీష్ముడిని అంబను వివాహమాడవలసినదిగా శాసిస్తాను అని అంబకు శాలిహోత్రునికి మాట ఇచ్చి భీష్ముడిని కలవటానికి కొందరు మునివర్యులతో బయలుదేరాడు సరస్వతి నది తీరానికి చేరి తన రాకను భీష్ముడికి తెలియజేయగా సకల మర్యాదలతో తన గురువును సేవించుకోవటానికి భీష్ముడి సరస్వతి నది తీరానికి తరలి వచ్చాడు. శిష్యుని రాకతో సంతసించిన గురువు పరుశరాముడు తన రాకకు గల కారణాన్ని తెలియజేశాడు.

“నా మాట మన్నించి అంబను నీ తమ్మునికి ఇచ్చి వివాహము చేయి లేదా నీవు వివాహము చేసుకొని అంబకు న్యాయము చేయి లేనిపక్షంలో నీవు నాతో యుద్ధము చేయవలసి వస్తుంది”,అని పరుశరాముడు భీష్ముని హెచ్చరిస్తాడు. “ధర్మాత్ములైన మీరు నన్ను అధర్మ మార్గములో నడవమని శాసించటం సమంజసము కాదు మీరు నన్ను కరుణించి ఈ ఉపద్రవము నుండి నన్ను రక్షించండి”అని భీష్ముడు గురువుగారిని వేడుకున్నాడు “పిరికివానిలా నిస్సహుయుడిలా ప్రవర్తించకు నా ఆజ్ఞను పాటించు లేదా నాతొ యుద్దానికి సన్నద్ధమవు” అని పరశురాముడు భీష్ముడిని తీవ్రముగా మందలిస్తాడు. అయినప్పటికీ భీష్ముడు తానూ గురుద్రోహిని కాను అని, ధర్మపక్షపాతిని అని తన ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండేవాడిని అని గురువుగారికి సవినయముగా తెలియజేస్తాడు అప్పుడు యుద్దానికి సిద్దము అవమని గురుదేవులు ఆనతి ఇస్తారు.

భీష్ముడు అవశ్యము అని తల్లియైన సత్యవతికి విషయము చెప్పి అస్త్రశస్త్రాలతో పరుశరాముని సన్నిధికి వస్తాడు. విషయము తెలిసిన గంగ వారి చెంతకు వచ్చి ఇరువురిని యుద్ధము వలదని కోరింది కానీ ఇరువురు వారి వారి పట్టుదలల కు అంకితమయినారు భీష్ముడు గురుదేవులకు ప్రదక్షిణ నమస్కారము చేసి ,”నేను రధము మీద, మీరు భూమి మీద నిలబడి యుద్ధము చేయుట యుద్ధ నీతి కాదు కాబట్టి నేను కూడా నేలపై నిలబడి యుద్ధము చేస్తాను అని గురువుగారితో అంటే గురువుగారు తన తపోబలముతోమహత్తరమైన రధాన్ని సమకూర్చుకొని యుద్దానికి సన్నద్దమయినాడు. ఇరువురి మధ్య యుద్ధము ప్రారంభమయింది.

క్రమముగా భీకర సమరముగా మారింది ఇరవై రెండు రోజులపాటు సాగిన ఈ యుద్ధము ప్రళయానికి దగ్గర అవుతున్న సమయములో ఇరువురి వంశకర్తలు వచ్చి వారిని \శాంతింపజేశారు.పరుశరాముడు తన అపజయాన్ని ఆసక్తతను అంబకు తెలిపి,”అమ్మా చూశావు కదా నా లోపము లేని యుద్దాన్ని”అని చెప్పగా అంబ ,”మీ ప్రయత్నమూ మీరు చేశారు సంతోషము కృతజ్ఞురాలిని”అని వినయముగా పరుశరామునితో చెప్పింది “తపస్సు చేసైనా ఈ జన్మకాకపోతే మరోజన్మకైనా ఈ భీష్ముని నాశనము చేస్తాను “అని అంబ ప్రతిజ్ఞ చేసి తీవ్రమైన తపస్సు ఈశ్వరుని కోసము చేసింది.గంగ వలదని వారించినా అంబ వినలేదు ఈశ్వరుడు అంబ తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై,” ఈ జన్మలో నీవు అనుకున్నది సాధించలేవు మరుజన్మలో ద్రుపదునికి కూతురుగా పుట్టి కొన్ని కారణాల వల్ల మగవానిగా మారి భీష్మునిపై గల కక్ష్యను తీర్చుకుందువు”,అని ఈశ్వరుడు సెలవిస్తాడు

ద్రుపదుని కూతురుగా పుట్టిన అంబ పురుషునివలె పెరుగుతుండి వయస్సు వచ్చిన ఆమెకు దశార్ణ దేశాధి పతి కుమార్తెతో వివాహము చేస్తారు. తీరా ఇద్దరి ఆడవారి మధ్య వివాహము అభాసు పాలవుతుంది. అవమానము భరించలేక ద్రుపదరాజు పుత్రిక అడవిలోకి వెళ్లి ప్రాణత్యాగము చేయాలనీ నిర్ణయించుకుంటుంది. అడవిలో స్థూలకర్ణుడు అనే యక్షుడు ఈమె పరిస్థితికి జాలిపడి తన పురుషత్వాన్ని ఆవిడకు ఇచ్చి తానూ స్త్రీత్వాన్ని పొందుతాడు. పదిరోజుల తరువాత ఎవరి రూపాలకు వారు వచ్చేటట్లు నిర్ణయానికి వస్తారుకానీ కుబేరుని అనుచరులు స్థూలకర్ణుని కోసము వెతుకుతూ ఉంటె స్త్రీ రూపములో ఉండి సిగ్గుపడుతూ ఉండే స్థూలకర్ణుని చూసి కుబేరునికి తెలియజేస్తారు. కుబేరుడు స్థూలకర్ణుని చూసి “నీకు ఈ రూపము బావుంది ఇలాగే ఉండిపో”అని అంటాడు. ఇది విన్న స్థూలకారణుడు బావురుమంటాడు. కుబేరుడు ‘తప్పదు పురుషునిగా మారిన అంబ(శిఖండి) జీవించి ఉన్నంతకాలము నీకు ఈ స్త్రీ రూపము తప్పదు. తదుపరి నీకు నీ పురుష రూపము వస్తుంది. శిఖండిని అడ్డుపెట్టుకొని చేసే యుద్దము ద్వారా స్వచ్చంద మరణము కలిగిన భీష్ముడు మరణిస్తాడు. ఈ రహస్యాన్ని భీష్ముడి అర్జునికి మహాభారత యుద్ధ సమయములో చెపుతాడు. ఆ విధముగా అంబ శిఖండిగా మారటం అనేది, భీష్ముని తనువూ చాలించటానికే. ఎందుకంటే భీష్ముడు లాంటి పరాక్రమవంతుడిని ధర్మ నిష్టాపరుడిని ఏ రకమైన శస్త్రాలు, ఎవరు సంహరించలేరు.
ఇది శిఖండి కధ.

మహాభారత యుద్దములో అర్జునుడు శిఖండిని అడ్డు పెట్టుకొని చేసిన యుద్ధము వలన భీష్ముడు అస్త్ర సన్యాసము చేసి అంపశయ్యపై చేరటముతో అంబ(శిఖండి) చరిత్ర ముగుస్తుంది. అంబ మొత్తానికి తన పంతము నెగ్గించుకుంటుంది.

1 thought on “అంబ -శిఖండి వృత్తాంతము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *