April 27, 2024

బంజారా తాండాలో తీజ్ సంబురాలు

రచన: రాథోడ్ శ్రావణ్


బంజారా సాంస్కృతి, సాంప్రదాయానికి చాటి చెప్పే పండుగలలో అతి ముఖ్యమైనది “తీజ్ పండుగ” తీజ్ అనగా గోధుమ మొక్కలు అని అర్థం. ఈ పండుగను మన తెలంగాణా రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల్లోనే కాక పోరుగునున్న ఆంధ్రప్రదేశ్, మహరాష్ట్ర, కర్ణాటక, గోవా మరియు ఉత్తర భారత దేశంలోని ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ ఛత్తీస్ గడ్, రాజస్తాన్, గుజరాత్ మొదలగు రాష్ట్రాల్లో బంజారాలు బాజాబజేంత్రీలతో చాలా గొప్పగా జరుపుకుంటారు. ఈ పండుగ మొదట ఎలా ప్రారంభమౌతుందంటే తాండాల్లోని లంబాడీలు అందరూ ఆ తాండాకు చెందిన ముఖ్యమైన నాయకున్ని అతన్ని”నాయక్”అంటారు. ఆయన ఆధ్వర్యంలో సమావేశమై పండుగ విశేషాలపై నిర్ణయాలు తీసుకుని, “నాయక్” అనుమతితో అంగడికి వెళ్లి వెదురుతో తయారు చేసిన చిన్న చిన్న గుల్లలని తీసుకువస్తారు. ఐతే ఒక ఇంటిలో ఎంతమంది పెళ్లికాని ఆడపిల్లలు ఉంటారో, అన్ని వెదురు గుల్లలు తీసుకువచ్చి వాటిని అందంగా రంగు, రంగుల నూలు దారాలతో, గువ్వలతో, ముత్యాలతో పూసలతో, మరియు బాసింగాలు కట్టి పెళ్ళి కూతులా అందంగా ఆ గుల్లలని ముస్తాబు చేస్తారు.
ఈ పండుగను పెళ్లికాని ఆడపిల్లలు శ్రావణ పూర్ణిమి రోజు ఉదయం లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసి అందంగా ముగ్గులు వేసి, అందంగా ముస్తాబై కొత్త బట్టలు ధరించి “నాయక్ ” ఇంటికి చేరుకోని అక్కడి నుండి గండు చీమలు గుల్లు కట్టిన నల్లని మట్టిని తీసుకురావడానికి అడవికి వెళ్తారు. ఇనుప గుల్లలో ఆ మట్టిని తీసుకువచ్చి ఆరబెట్టి శ్రావణంలో వచ్చే రాఖీపౌర్ణమి రోజు సాయంత్రం తాండా నాయకుని ఇంటి ఆవరణలో అందరూ సమావేశమై నాయక్ అనుమతితో అందంగా అలంకరించిన వెదురుగుల్లల్లో నల్లని మట్టిని నింపి అందులో నాయక్, భార్య నాయకణ నాని బెట్టిన గోధుమలను చల్లడంతో ఈ ఉత్సవం ప్రారంభమౌతుంది. అందరు పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గోంటారు. వెదురుబుట్టల్లోనే కాకుండా “మోదుగు” ఆకులతో గుల్లగా చేసి అందులో మట్టిని పోసి, గోదుమలని చల్లుతారు. పెళ్ళికాని ఆడపిల్లలు ప్రతిరోజు మూడు పూటలు అందంగా ముస్తాబై వెదురు బుట్టల్లో ఉన్న గోదుమలకు నీల్లు జల్లుతారు ఐతే ఈ కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలు “పులియా గెణో” “పూర్ణ కుంభం” లా తలపై పెట్టుకొని బావి నీళ్లు కాని బోరింగ్ నీళ్ళుకాని చెరువు నీళ్లు కాని తీసుకువచ్చి తీజ్ కి పోస్తారు. ఈ కార్యక్రమం జరిగేటప్పుడు పెళ్ళికాని మగపిల్లలు తీజ్ కి నీరు పోయకుండా ఆపి కొన్ని పోడుపు కథలు వేస్తారు. వాటికి సమాధానం చెప్పినవారికి తీజ్‌కి నీళ్ళు పోయ్యనిస్తారు. ఈ విధంగా రోజుకు మూడు పూటల పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ, నీళ్ళు జల్లూతూ, అగరుబత్తులతో ధూపం చేస్తూ, నైవేద్యం పెడుతూ ఆనందంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు.

ఈ విధంగా పాట పాడుతారు :-

రామెరి బోడళ పాణియ్యన నీకళి… ‌నికళీ జై హనుమాన్ ||2||
బుడోసో బామణ బెడో మతరో‌…
మతరో జై హనుమాన్ ||2||
అంటు పాటలు పాడుతిరు.
తోమ్మిదవ రోజు గోకుల అష్టమి నాడు “డంభోళి ” పండుగను జరుపు కుంటారు. ఆ రోజు పెళ్ళి కాని ఆడ పిల్లలు కొత్త బట్టలు ధరించుకొని నానబెట్టిన సెనగలను తీసుకోని, పొలాలకు వెళ్ళి నేరేడు చెట్టుకు సెనగలను గుచ్చుతారు. అప్పుడు ఆడపిల్లలు తమతో తెచ్చుకున్న పండ్లు, ఫలహారాలతో ఉపవాసాన్ని విరమిస్తారు.
అక్కడినుండి నల్లని బంకమట్టిని తీసుకోని నాయక్ ఇంటికి తీసుకువెళ్ళి పెళ్ళికాని ఆడ, మగవాళ్లు ఆ మట్టితో డోక్రి, డోక్రా ముసలమ్మ ముసలోడులను పీటపై తయారుచేస్తారు దానినే “గణగోర్ ” అంటారు. తయారుచేసిన మట్టి బొమ్మలపై రైక బట్ట, తువ్వాల కప్పుతారు.
“డంబోళి” రోజు రాత్రి ఎనిమిది, తోమ్మిది గంటలకు తాండా వాళ్లందరూ భోజనం చేసిన తర్వాత గోదుమపిండితో తయారుచేసిన గోదుమ రొట్టె, బెల్లం నెయ్యితో కలిపి హుండలు తయారుచేస్తారు. దానిని “చుర్మో” అంటారు. తయారు చేసిన చుర్మోను హరతిపళ్ళెంలో వేసి ఆగరుబత్తి, కొబ్బరికాయ, కుంకుమ, నీళ్ళు తీసుకొని స్త్రీ పురుషులందరు పెళ్ళి కాబోయే ఆడ‌పిల్లలతో తాండా నాయక్ ఇంట్లో డోక్రి, డోక్రా పూజలు చేసి డంబోళి పైన ఇలా పాట పాడుతారు.

డంబోళి లెలో సెజారణ బాయి యె
రిసమత కరో సెజారణ బాయె
ఛోరారి అకీఆయి అకియా మసళరో
భుకళి లేన ఖగ దోబాయిఘే
వీరారి అఖీయాయి, అకీయా మసళదో
చురమో లేని ఖసదోబాయియె..
అంటు అన్నయలని పోగుడుతూ పాట పాడుతారు.

మరుసటి రోజు ఉదయాన్నే ఆడ పిల్లలందరు డోక్రి, డోక్రాను నెత్తి మీద పెట్టుకొని ఊరి బయట ఉన్న చెరువులో నిమజ్జనం చేస్తారు అప్పుడు ఈ పాట విధంగా పాట పాడుతారు.
మారి గణగోరేర్ పోళిసోపెట్

ఎ డోకరారో డెబరాసో పెట్
మారి గణగోరేర్ సుహసి నాక్
ఎ డోకరారో ముకడిసి నాక్
మారి గణగోరేర్ ఖుబ్ అచ్చె కాన్
ఎ డోకరారో బుచ్చాసే కాన్
ఈ పాటను ముసలమ్మను పోగుడుతూ, ముసలయ్యని విమర్శిస్తూ పాట పాడుతారు.

గణగోర్ ని చెరువులో నిమజ్జనం చేసి తిరిగి ఇంటికి వచ్చి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఆడపిల్లలందరు నాయక్ ఇంటి ఆవరణలో ఉన్న తీజ్ గుల్లలను మధ్యలో పెట్టుకొని పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. ఆ తర్వాత గ్రామ ప్రజలు, పెద్దలు, నాయకులు, కార్భారి, ఢావ్, ఢవ్ గేర్యా మాన్కరి అందరూ వచ్చి సహపంక్తి భోజనం (బాలాజీ బండారో) చేస్తారు. నాయక్ అగరుబత్తీలు పెట్టి కొబ్బరి కాయ కొట్టి పూజ నిర్వహిస్తారు. పూజ అనంతరం ఆడపిల్లలు తమ తీజ్ గుల్లలను నెత్తి మీద పెట్టుకొని నృత్యాలు చేస్తారు. ఆడపిల్లల వదినలు ఆగుల్లను లాక్కొని వారి అమ్మలకు ఇస్తారు. అమ్మ వాళ్ళందరూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ తీజ్ ని తెంపుతారు. తెంపిన తీజ్ ని ఆడపిల్లలు గ్రామపెద్దలకు ఇస్తూ మొక్కుతారు. గ్రామపెద్దలు వారికి తోచిన విధంగా కానుకలు ఇస్తారు. తర్వాత ఆడపిల్లలు తీజ్ ని చేతుల్లో పట్టుకొని నృత్యం చేస్తుంటే, వారి తల్లులు ఒక్కోక్కరు గుల్లల్లో డబ్బులు వేస్తారు. ఒక్కొక్కరు తీజ్ ని ఇచ్చిపుచ్చుకుంటారు. ఆ తీజ్ ని మొక్కుతూ పెళ్ళికాని వారు హారాలకి, పెళ్ళి అయినవారు మంగళసూత్రాలకి వాటిని కట్టుకుంటారు. ఆ తర్వాత నాయక్, నాయకణ్ జొన్నలు, గోధుమలు, సెనగలతో గుడాలు వండిస్తారు. వండిన గుడాలని సాయంత్రం ఐదుగంటలకు అందరు తినటం, ఆ తర్వాత ఎడ్లకు ఝూలు వేసి అలంకరించి, బండి కట్టి అందులో తీజ్ ని ఉంచి బాజా బజంత్రీలతో తాండా అంతా ఊరేగించి పిల్లలు, పెద్దలు తాండా చెరువులో తీజ్ గుల్లలని నిమజ్జనం చేస్తారు. ఆ సమయంలో ఆడపిల్లలు బాధపడటం, ఏడ్వటం చేస్తారు. ఎందుకంటే తోమ్మిది రోజులు ఉపవాస దీక్షతో, భక్తిశ్రద్ధలతో, పాటలతో, నృత్యాలతో ఆనందంగా జరుపుకోని మరుసటి సంవత్సరం వరకు ఆగకుండా ఉండలేక అంతేకాకుండా పెళ్ళి అయినచో ఈ తీజ్ ఉత్సవం జరుపు కోలేమన్న బాదతో ఏడుస్తారు. తీజ్ నిమజ్జనం అనంతరం ఆడపిల్లలకు వారి అన్నలు లేదా తమ్ముల్లు కాళ్ళు కడుగుతారు. అనంతరం సాయంత్రం ఐదు గంటలకు నాయక్ ఆధ్వర్యంలో గుడాలను ఆరగిస్తారు. తీజ్ పండుగ అనేది పెద్దలను గౌరవించాలని, గిరిజన సాంప్రదాయాన్ని, సంస్కృతిని కొనసాగిం చాలని, పచ్చదనంతో కుటుంబాలు ఎప్పుడు పచ్చగా వెలగాలని పెళ్ళి కాని యువతులకు మంచి భర్త దొరకాలని అందరూ హరిత భరితంగా వుండాలని వీరి పూర్వీకుల విశ్వాసం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *